ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు ATM Robbery In Shamshabad | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు

Published Tue, Apr 16 2024 8:22 AM | Last Updated on Tue, Apr 16 2024 8:22 AM

ATM Robbery In Shamshabad - Sakshi

శంషాబాద్‌ రూరల్‌: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లరంగు స్ప్రే చేసి..ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు. మరోచోట ఏటీఎంలోకి చొరబడేందుకు యతి్నంచి విఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్‌ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని  సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు. 

పోలీసులకు సమాచారం.. 
ఏటీఎంలో దుండగులు గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్‌ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్‌ ఎస్‌హెచ్‌ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు షటర్‌ను మూసివేసి లోపల పని కానిచ్చారు. దీంతో అటువైపు పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు స్థానికులకు సమాచారం లేదు. ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

శంషాబాద్‌ పట్టణంలో.. 
శంషాబాద్‌ పట్టణంలో ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఏంలోనూ చోరీకి దుండగులు యతి్నంచి విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో నగదు దోచుకునేందుకు దొంగలు ప్రయతి్నంచినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి నగదు చోరీకి గురికాలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement