Self Drive Startup Company In India: Minus Zero Company Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Self Driving Vehicle: కోట్లు ఖర్చయ్యే టెక్నాలజీతో పనిలేకుండానే..

Published Tue, Jul 27 2021 7:58 AM | Last Updated on Tue, Jul 27 2021 9:23 AM

Indian Startup Built Self Driving Tech Suitable To Indian Roads With Less AI - Sakshi

సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బండ్లు.. ఈ పేరు వినగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ఎలన్‌ మస్క్‌. అమెరికన్‌ కంపెనీ టెస్లా ద్వారా ఎలక్ట్రికల్‌ బండ్లను అందిస్తూ.. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ సాంకేతికతపై చర్చతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడాయన. అమెరికాలో వరకైతే ఇలా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఓకే. కానీ, ట్రాఫిక్‌ రద్దీ, ఇతరత్రా సమస్యలుండే మన దేశంలో అది కుదిరే పనేనా?. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది మైనస్‌ జీరో.

ఛండీగఢ్‌: ఒకదాని వెనుక ఒక వాహనం, గుంతలతో వికారంగా మారిన రోడ్లు, అడ్డదిడ్డంగా దూసుకొచ్చే వాహనాలు.. మన రోడ్ల స్థితికి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ కష్టతరం అనేది నిపుణుల మాట. కానీ, సాంకేతికతో పని లేకుండా.. కామన్‌సెన్స్‌ను ఉపయోగించి వెహికిల్స్‌ను రూపొందించే పనిలో పడింది మైనస్‌ జీరో స్టార్టప్‌. జలంధర్‌(పంజాబ్‌)కు చెందిన ఈ స్టార్టప్‌ గత రెండేళ్లుగా మన రోడ్లకు సరిపోయే రీతిలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వెహికిల్‌ టెక్నాలజీని రూపొందించే పనిలో మునిగింది. అంతేకాదు ప్రయోగాత్మకంగా ఓ ఆటోను డెవలప్‌ చేసి రోడ్ల మీదకు వదిలింది కూడా.

ఎలా పని చేస్తుందంటే.. 
మైనస్‌ జీరో తయారు చేసిన బండి ఏఐ టెక్నాలజీపై తక్కువ ఆధారపడుతూ పూర్తి ఆటానమస్‌ సిస్టమ్‌తో నడుస్తుంది. తద్వారా భద్రతా పరమైన సమస్యలు ఉండవని, ట్రాఫిక్‌కు తగ్గట్లు ప్రయాణం సాఫీగా సాగుతుందని, రోడ్లకు తగ్గట్లు ప్రయాణాన్ని మలుచుకోవచ్చని మైనస్‌ జీరో సీఈవో, సహ వ్యవస్థాపకుడు గగన్‌దీప్‌ రీహల్‌ వెల్లడించాడు. కంట్రోల్‌ యూనిట్స్‌తో పనిచేసే ఈ ‘ఈ-వెహికిల్‌ ఆటోరిక్షా’ను గగన్‌దీప్‌ టీం నెలలు శ్రమించి రూపొందించింది.
 

‘బిలియన్ల ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో వాళ్లు వాహనాలు రూపొందిస్తున్నారు. కానీ, ప్రాక్టీకల్‌గా మన రోడ్లకు ఆ టెక్నాలజీ సరిపోతుందా? అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే హంగుల కన్నా భద్రత, తక్కువ ఖర్చులో పని జరగడం మనకు ముఖ్యం. అందుకే లో-టెక్నాలజీతో ఇలా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వెహికిల్స్‌ను రూపొందించింది మా బృందం’ అని గగన్‌దీప్‌ వెల్లడించాడు. నిజానికి చాలా కాలం క్రితమే వీళ్ల ఆవిష్కరణ వెలుగులోకి వచ్చినప్పటికీ.. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిస్థాయి డెవలప్‌మెంట్‌ ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆటోను పవర్‌ఫుల్‌ మోటర్‌ అప్‌డేట్‌ చేసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు రెంటెడ్‌ బేస్‌ మీద కొంత మంది ఆటోవాలాలాకు అప్పగించి.. పరిశీలిస్తోంది. తన సోదరుడు గురుసిమ్రన్‌ సలహా మేరకు పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని గగన్‌దీప్‌ స్పష్టం చేశాడు కూడా.

మైనస్‌ జీరో ఫౌండర్లు గురుసిమ్రన్‌, గగన్‌దీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement