చరిత్ర సృష్టించిన భారత్‌ India Crowned Badminton Asia Team Champions For The 1st Time | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన భారత్‌

Published Sun, Feb 18 2024 1:40 PM | Last Updated on Sun, Feb 18 2024 1:45 PM

India Crowned Badminton Asia Team Champions For The 1st Time - Sakshi

భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్‌) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్‌ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో (బెస్ట్‌ ఆఫ్‌ 5) సింధు, అన్మోల్‌తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్‌) విజయాలు సాధించారు. 

గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్‌ షట్లర్‌ సుపనిందా కతేథాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్‌ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్‌, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్‌కోల్‌ఫామ్‌ కిటితారాకుల్‌, రవ్వింద ప్రజోంగ్‌జల్‌లను ఓడించడంతో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 

అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్‌ల్లో (డబుల్స్‌) ఓటమి చవిచూసిన భారత్‌.. నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలుపొంది, టైటిల్‌ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల అన్మోల్‌ (472వ ర్యాంకర్‌).. ప్రపంచ 45వ ర్యాంకర్‌ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement