శ్రేయస్‌, ఇషాన్‌ల వేటు పడటానికి కారణం అతడే: జై షా Jay Shah Names Man Behind Ishan Kishan And Shreyas Iyer BCCI Contracts Exit, More Details Inside | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌, ఇషాన్‌లపై వేటు వేయాలన్న నిర్ణయం అతడిదే: జై షా

Published Fri, May 10 2024 2:17 PM | Last Updated on Fri, May 10 2024 3:46 PM

Am Just Convener: Jay Shah Names Man Behind Ishan Shreyas BCCI Contracts Exit

టీమిండియా స్టార్లు ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్ సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.

కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్‌-2024 కోసం ముంబై ఇండియన్స్‌ క్యాంపులో చేరాడు.

మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్‌నెస్‌ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.

ఆ తర్వాత అయ్యర్‌ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్‌కప్‌-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.

అతడి నిర్ణయం ప్రకారమే
ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సెంట్రల్‌ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్‌ మీటి​ంగ్‌లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్‌ను మాత్రమే నేను.

ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్‌ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్.

అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్‌ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.

అయ్యర్‌ అదుర్స్‌... ఇషాన్‌ ఫెయిల్‌
కాగా ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్‌ తరఫున ఓపెనర్‌గా వస్తున్న ఇషాన్‌ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.

మరోవైపు కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం 11 ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్‌లో జట్టును ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు.   

చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement