సంక్షేమం వైపే కడప ఓటరు.. | Kadapa People May Have Voted For Welfare Governance | Sakshi
Sakshi News home page

సంక్షేమం వైపే కడప ఓటరు..

Published Sun, May 19 2024 8:16 PM | Last Updated on Sun, May 19 2024 9:56 PM

Kadapa People May Have Voted For Welfare Governance

అవసరానికోపార్టీ.. అధికారం కోసం మరో పార్టీ ఇలా విలువల్లేని రాజకీయనేతలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ప్రజలు కమిట్‌మెంట్‌తో పనిచేసిన నేతలకి కమిట్‌ అయ్యారా? కండువాలు మార్చిన కూటమితో కలిశారా? కడపజిల్లాలో ఎన్నికల  ఫలితం ఎలా ఉండబోతోంది ?

తొలి నుంచి వైఎస్‌ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు కూటమి భావించింది. అందుకు తగ్గట్టే కుట్రలు, ఎత్తులు వేసింది. అప్పటికప్పుడు కండువాలు మార్చిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. 

ఉమ్మడి జిల్లాలో పది స్దానాల్లో కూటమి అభ్యర్థులు బరిలో నిలవగా, అందులో ఒక స్దానంలో జనసేన, రెండు స్దానాల్లో బీజేపీ అభ్యర్దులు, మిగిలిన ఏడు చోట్ల టీడీపీ అభ్యర్దులు పోటీలో నిలిచారు. అయితే జనసేన, బీజేపీకి జిల్లాలో కనీస క్యాడర్‌ కూడా లేదు. 

టీడీపీ క్యాడర్‌ను నమ్ముకుని అభ్యర్థులకు కండువాలు మార్చి పోటీలో నిలబెట్టారు. బద్వేలులో మాజీ ఇరిగేషన్ అధికారి రోషన్న ముందుగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాటకీయ పరిణామాల వల్ల ఆయన బీజేపీ కండువా కప్పుకొని పోటీ చేశారు. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పులు ఆయనకు శాపంగా మారాయి.

ఇటు టీడీపీ అటు బీజేపీ శ్రేణులు ఎవరికి వారు రోషన్నకు సహకరించకపోవడం మైనస్‌గా మారింది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ది డాక్టర్ సుధకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు బీజేపీ అభ్యర్థి రోషన్న. దీంతో బద్వేలులో ఓటమి ఖాయమని కూటమి కూడా డిసైడైపోయింది.  

ఇక ఫ్యాక్షన్ నియోజకవర్గమైన జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి ఫ్యామిలీలోని విభేదాలు కూడా కూటమికి చేటు తెచ్చాయన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న భూపేష్‌ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించారు చంద్రబాబు. అయితే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి పట్టుబట్టడంతో  బాబు కాదనలేకపోయారు. 

దీంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అబ్బాయి భూపేష్‌కి ఎంపీ టిక్కెట్‌ ఇచ్చి బుజ్జగించారు. అయితే ఆదినారాయణ రెడ్డికి ఆశించినస్థాయిలో అబ్బాయి నుంచి కానీ టీడీపీ శ్రేణుల నుంచి సహకారం రాకపోవడంతో జమ్మలమడుగులో కూడా కూటమి ఆశలు గల్లంతేనన్న టాక్‌ వినిపిస్తోంది.

ఉమ్మడి కడపజిల్లాలో మరో కీలక నియోజకవర్గం రైల్వే కోడూరు. జనసేన తొలుత ఇక్కడ యనమల భాస్కరరావు పేరుని ప్రకటించింది. అయితే అనూహ్యంగా తెరపైకి అరవ శ్రీధర్‌ పేరు వచ్చింది. టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన అరవ శ్రీధర్‌కు మాత్రమే కాదు అసలు ఇక్కడ జనసేనకు సరైన క్యాడరే లేదు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ మరోసారి వైఎస్సార్‌సీపీ గెలుపు  ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో బీజేపీ మద్దతు, వైఎస్‌ఆర్‌సీపీకి మించిన సంక్షేమపథకాలనిస్తామని చేసిన హామీలతో ఈసారి గెలుపు ఖాయమని అటు చంద్రబాబు ఇటు పవన్‌ కల్యాణ్‌ ఎగిరెగిరి పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంతకుమించి సీఎం వైఎస్‌ జగన్‌పై తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో హంగామా  చేశారు. 

ఈ స్టంట్లు చూసి వినోదం అందుకున్న ప్రజలు మాత్రం విజ్ఞానంతో ఆలోచించి  మరోసారి సీఎం జగన్‌కే మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ ఓటింగ్‌తో సంక్షేమపాలన కొనసాగాలని ప్రజలు  కోరుకున్నారని వారు చెబుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement