నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది | Anantkumar Hegde Replaced By Vishweshwar Hegde Kageri Lok Sabha Seat | Sakshi
Sakshi News home page

నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది

Published Mon, Mar 25 2024 2:31 PM | Last Updated on Mon, Mar 25 2024 3:11 PM

Anantkumar Hegde Replaced By Vishweshwar Hegde Kageri Lok Sabha Seat - Sakshi

బెంగళూరు, సాక్షి : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. 

బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్‌సభ సీటును హెగ్డేకి ఇ‍వ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. 

ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్‌ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. 

ఇలా అనంత్‌ కుమార్‌ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్‌సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement