విజయనగరం అర్బన్: ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనంద్ కుమార్, ఆకాష్ దీప్ శుక్రవారం కంట్రోల్ రూమ్ను సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా వ్యయ అంచనాల కమిటీ, ఫిర్యాదులు, రిపోర్టింగ్ విభాగాలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి విధుల గురించి అడిగి, రిజిస్టర్లను పరిశీలించారు. వాహనాల జీపీఎస్ సిస్టంను, మద్యం చెక్ పోస్ట్ల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. అనంతరం మీడియా కేంద్రాన్ని సందర్శించారు.
యువకుడి ఆత్మహత్య
బాడంగి: మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆనవరం గ్రామానికి చెందిన తూముల విజయ్కుమార్(23) గురువారం పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మూడేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతూ పార్వతీపురం ఆస్పత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో నొప్పి తట్టుకోలేక విసిగిపోయి జీవితంపై విరక్తితో గ్రామానికి సమీపంలో గల అరటి తోట వద్ద పురుగు మందు సేవించాడు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు, స్నేహితుడు 108లో బొబ్బిలి ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి తూముల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఆర్.జయంతి పర్యవేక్షణలో హెచ్సీ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
బీరు బాటిళ్ల పట్టివేత
వేపాడ: మండల కేంద్రమైన వేపాడ జంక్షన్ వద్ద వల్లంపూడి పోలీసులు నిర్వహించిన దాడుల్లో 12 బీరు సీసాలు పట్టుబడినట్లు వల్లంపూడి ఎస్.ఐ రాజేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన దాడుల్లో జంక్షన్లో తనిఖీ నిర్వహిస్తుండగా 12 బీరు సీసాలు పట్టుబడటంతో సీసాలతో పాటు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సీసాలు రవాణా చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment