గుమ్మలక్ష్మీపురం:
ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆశక్తి ఉన్నా వయోభారంతో ఇల్లు కదల్లేని వారికి, దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఓట్ ఫ్రం హోం పద్ధతిలో వీరు తమ ఓటు హక్కును ఇంటి నుంచే వేసే వెసులుబాటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు గ్రామాల్లోని హోం ఓటింగ్కు అర్హులైన ఓటర్ల వద్దకు వెళ్లి హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకుంటారా.. లేదంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారా.. అన్న విషయాలను సేకరిస్తున్నారు. అలాగే హోం ఓటింగ్ ఆప్షన్ తీసుకునే వారు సమ్మతి పత్రాలు (ఫారం–12)ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. సమ్మతి తెలుపుతూ సమ్మతి పత్రాలు అందజేసిన వారు ఎన్నికల కమిషన్ సూచించే తేదీల్లో ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరి వద్దకు సెక్టోరల్ అధికారులు, బీఎల్ఓలు, పోలింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లు వెళ్తారు. శరీరం సహకరించలేని వారికి సహాయకులను నియమిస్తారు. ఈ సహాయకులకు కుడి వేలిపై సిరా గుర్తు వేస్తారు. మళ్లీ ఆ సహాయకుడు ఓటు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. శత శాతం పోలింగ్ నమోదు చేసేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న ఇంటి నుంచే ఓటు కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పి.రామారావు తెలిపారు. అర్హులైన వారు సద్వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment