● వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో స్పష్టంగా గెలుపు ధీమా
● పాలకొండ, కురుపాంలో
సమరోత్సాహంతో నామినేషన్ల దాఖలు
● సాలూరులో నిరాడంబరంగా రాజన్నదొర.. ●
●వెల్లువలా తరలివచ్చిన అభిమానులు,
కార్యకర్తలు, నాయకులు
ఎర్రటి ఎండను లెక్కచేయని అభిమానం..తమ ప్రతినిధిపై ఉన్న అంతులేని ప్రేమ..విజయంపై సడలని ఆత్మవిశ్వాసం..ఎవరు పోటీలో ఉన్నా గెలుపు ఫిక్స్ అన్న నమ్మకం..పోలింగ్ లాంఛనమే
అన్న ధీమా..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే,
ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ
అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సమరోత్సాహంతో తమ అభ్యర్థుల వెంట అడుగేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ..విజయం పట్ల వారికి నమ్మకం కలిగిస్తూ కదిలాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు..నాయకులు ఎన్నికల కదనరంగంలోకి కాలుపెట్టిన
సందర్భంగా ఎన్నికల ఫలితాలు
వెలువడ్డాయా? అన్న రీతిలో నామినేషన్ల
ఘట్టం కోలాహలంగా సాగింది.
–సాక్షి, పార్వతీపురం మన్యం
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఒక నామినేషన్ పడగా.. రెండో రోజు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి శుభతిథి కావడంతో నామినేషన్ వేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఆలయాల్లో పూజలు నిర్వహించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయల్దేరారు. ఉపముఖ్యమంత్రి, సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర నిరాడంబరంగా వెళ్లి రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 24న మరోసారి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున గుమ్మడి సంధ్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి కురుపాం తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి వీవీ రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె భర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని డాక్టర్ గుమ్మ తనూజరాణి ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉన్నారు. పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం సీతంపేట సంత నుంచి ఐటీడీఏ వరకు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆమె వెంట నడిచారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ ప త్రాలు అందజేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బోనెల విజయచంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు ఉదయభాను నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment