![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/18/17viw51a-310144_mr_1.jpg.webp?itok=sV-drbcd)
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా 9వ రోజైన బధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పుష్పార్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కేఎస్ రామరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో ఎన్. రమేష్బాబు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు అమ్మవారి పుష్పార్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. రాజగోపురం వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరిన ఆలయ అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలు, చామంతి, మందార పుష్పాలు, మొరం, దవళంతో పుష్పార్చన నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు.
నేడు పూర్ణాహుతి..
వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment