![Baba Ramdev advice on population control - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/05/26/Yoga--guru--Baba--Ramdev.jpg.webp?itok=sBT3RDmO)
దేశంలో జనాభా నియంత్రణపై యోగా గురువు బాబా రామ్దేవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రస్తుతం దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నదన్నారు. అందుకే దేశ జనాభా నియంత్రణకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. దేశంలో జనాభా 140 కోట్లకు చేరుకున్నదని, ఇంతకుమించి అధికంగా జనాభా పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పుడున్న జనాభాకు దేశంలో రైల్వే, ఎయిర్ పోర్టు, కాలేజీ, యూనివర్శిటీ, ఉపాధి కల్పన సేవలు అందించడమే చాలా ఎక్కువన్నారు. అందుకే పార్లమెంట్లో జనాభా నియంత్రణకు చట్టం చేయాలని, అప్పుడే దేశంపై అధికభారం పడదన్నారు. ఉత్తరాఖండ్కు తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ అందించినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వని వైష్ణవ్కు యోగా గురువు బాబా రామ్దేవ్ కృతజ్ఞతలు తెలిపారు.
హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్లో గర్వించదగిన ప్రాంతమని అన్నారు. ఢిల్లీ- డెహ్రాడూన్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపడం ఆనందదాయకమన్నారు.ఇది దేవభూమికి దక్కిన గౌరవమని అన్నారు. గతంలోనూ బాబా రామ్ దేవ్ జనాభా నియంత్రణ గురించి మాట్లాడారు. ఏ కుటుంబంలోనైనా ఇద్దరికిమించి అధికంగా పిల్లలు ఉంటే వారికి కొన్ని హక్కులను వర్తింపజేయకూడదన్నారు. దేశంలో జనాభా పెరిగితే, ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందకు భారత్ సిద్ధంగా లేదన్నారు.దేశ జనాభా 150 కోట్లు దాటకుండా చూడాలని బాబా రామ్దేవ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment