Massive Protest At Belagavi For No To Maha Mela, Sec 144 Imposed - Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్‌ అమలు

Published Mon, Dec 19 2022 3:14 PM | Last Updated on Mon, Dec 19 2022 3:33 PM

Massive Protest At Belagavi For No To Maha Mela Sec 144 Imposed - Sakshi

బెళగావి: హద్దుల పంచాయితీతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తారస్థాయికి చేరుకుంది. ‘మహా’ మేళ నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవటంపై బెళగావి సమీపంలో సోమవారం వందల మంది ఆందోళన చేపట్టారు. కొగ్నోలి టోల్‌ ప్లాజా వద్దకు ‘మహారాష్ట్ర ఏకీకరణన్ సమితి’(ఎంఈఎస్‌), నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) నేతలు, కార్యకర్తలు వందల మంది చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బెళగావి ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. 

కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజున బెళగావిలో ప్రతిఏటా సమావేశం నిర్వహిస్తుంది మహారాష్ట్ర ఏకీకరణన్‌ సమితి. గత ఐదేళ్లుగా సరిహద్దు వివాదంపై ఆందోళనలు చేస్తోంది ఎంఈఏస్‌. ఈ ఏడాది కూడా శీతాకాల సమావేశల తొలిరోజున భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బెళగావి జిల్లా ప్రధాన కేంద్రంలోని తిలక్‌వాడీ ప్రాంతంలో ఉన్న వ్యాక్సిన్‌ డిపో గ్రౌండ్‌ వద్ద ఎంఈఎస్‌ ఆందోళనకు దిగింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందల మంది ఎంఈఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. తిలక్‌వాడీ రోడ్డులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించాల్సి వచ్చింది. అయినప్పటికీ మహారాష్ట్ర వికాస్‌ అకాడీ(ఎంవీఏ) కార్యకర్తలు బెళగావిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. 

5వేల మంది పోలీసులు..
బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు ఎస్పీలు, 11 మంది ఏఎస్పీలు, 43 మంది డిప్యూటీ ఎస్పీలు, 95 మంది ఇన్‌స్పెక్టర్లు, 241 మంది ఎస్సైలు ఆందోళనల ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: అసెంబ్లీలో వీర్ సావర్కర్ చిత్రపటంపై రగడ.. నిరసనకు దిగిన ప్రతిపక్షం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement