![- - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/16/15klp01-210052_mr_1.jpg.webp?itok=pmgHxIGi)
కొల్లాపూర్: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. సోమవారం ఆయన నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు ఉదయ్కుమార్, తేజస్ నందలాల్, అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సంచిత్ గంగ్వార్తో కలిసి ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ పంప్హౌజ్, కృష్ణానదిలో బ్యాక్ వాటర్ను పరిశీలించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే కోతిగుండు వద్దకు వెళ్లి, అక్కడి నుంచి బ్యాక్ వాటర్ లెవల్స్, నీటి ప్రవాహం చూశారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, సీఈ చెన్నారెడ్డితో వారు మాట్లాడారు. ప్రస్తుత వాటర్ లెవెల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు తాగునీటి అవసరాలకు 2.4 టీఎంసీ నీళ్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు 5 టీఎంసీల మేరకు నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. బ్యాక్ వాటర్ లెవల్స్ రెగ్యులర్గా పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. తాగునీటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షిస్తోందని, ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కారానికి అవసరమైన నివేదిక తమకు అందించాలన్నారు. వారి వెంట మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుధాకర్సింగ్, డీఈ అంజాద్పాష తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment