వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం | Bandaru Dattatreya: National Youth Day and Swami Vivekananda Jayanti on January 12th | Sakshi
Sakshi News home page

వికసిత భారత్‌ లక్ష్య సాధనకు యువతే కీలకం

Published Fri, Jan 12 2024 5:58 AM | Last Updated on Fri, Jan 12 2024 5:58 AM

Bandaru Dattatreya: National Youth Day and Swami Vivekananda Jayanti on January 12th - Sakshi

స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను చోదక శక్తిగా ఆయన భావించారు. యువ తలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన శక్తిని ఉదాత్తమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకు రావచ్చని ఆయన నమ్మారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరం అని నొక్కి వక్కాణించారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనాన్ని పెంపొందించు కోవాలని ఆయన యువతను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతోపాటూ సామాజిక బాధ్య తనూ, స్వావలంబననూ పెంపొందించాలని వాదించారు.

స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. నిర్భయులూ, నిస్వార్థపరులూ, మానవ సేవకు కట్టుబడి ఉండేవారుగా యువతరాన్ని స్వామి అభివర్ణించారు. నిర్భాగ్యులకు సేవ చేయడం అంటే దేవునికి నిజ మైన సేవ చేసినట్లని ఆయన బలంగా నమ్మారు. మాతృభూమికి, ప్రజానీకానికి సేవ చేసేందుకు దేశంలోని యువత దృఢ సంకల్ప శక్తిని కలిగి ఉండాలన్నారు. ‘మీరందరూ, ఎక్కడ ప్లేగు లేదా కరువు వ్యాప్తి చెందినా, లేదా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి, వారి బాధలను తగ్గించండి’ అని యువతకు పిలుపునిచ్చారు. 

స్వామి 1893 సెప్టెంబర్‌ 11న చికాగోలో ‘వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలిజియన్స్‌’(ప్రపంచ మతాల సమ్మేళనం)లో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోద రులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాద రమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.

ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతా లనూ నిజమైనవిగా అంగీకరిస్తాం... భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థు లకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు.

‘ఎరైజ్, ఎవేక్, అండ్‌ స్టాప్‌ నాట్‌ అంటిల్‌ ది గోల్‌ ఈజ్‌ రీచ్డ్‌’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పుకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవ సరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం... విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్‌ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుత మైన సందేశాలు యువతకు అనుసరణీయాలు.

యువత శారీరకంగానూ, మానసికంగానూ దారు ఢ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు స్వామి. వారు క్రీడా మైదానాలకు వెళ్లాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఆయన కోరుకున్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్‌ శతాబ్దం కావడానికి మోదీ కృషి చేస్తు న్నారు. ఐఎమ్‌ఎఫ్‌ అంచనా ప్రకారం భారత్‌ జీడీపీ 5 ట్రిలి యన్‌ డాలర్లు దాటినందున, మనది నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే 2027 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన అన్ని లక్షణాలతో 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడా నికి సిద్ధంగా ఉంది. ఇలా ‘వికసిత్‌ భారత్‌’ సాకారం కావా లంటే యువత కీలక పాత్ర పోషించవలసి ఉంది.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అనేక మైలు రాళ్లను చేరుకుంది. ‘చంద్రయాన్‌’ అంతరిక్ష రంగంలో సాధించిన ప్రగతికి ఒక ఉదాహరణ. డిజిటల్‌ ఆవిష్కరణ పట్ల దేశం నిబద్ధతను చాటిచెప్పే ఆధార్,  యూపీఐ, ఏఏ స్టాక్, కొవిన్‌ ప్లాట్‌ ఫారమ్‌ వంటి వాటి వల్ల భారతదేశ డిజి టల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భారత్‌ గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. మన సేవల రంగం, ముఖ్యంగా ఐటీ, ఐటీయేతర డొమైన్‌లలో ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంది. 300 బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 100 యునికార్న్‌లను భారత్‌ కలిగి ఉండి, ప్రపంచంలోని మూడవ–అతిపెద్ద స్టార్ట్‌–అప్‌ పర్యా వరణ వ్యవస్థగా నిలిచింది. ఈ ‘అమృత్‌ కాల్‌’ సందర్భంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను రూపొందించడానికి స్వామి వివేకా నంద బోధనలను ఉపయోగించుకుందాం!    - వ్యాసకర్త హరియాణా గవర్నర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement