వ్యక్తి మృతి, స్కూలు విద్యార్థులకు గాయాలు
చింతలపూడి: ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పాత చింతలపూడిలో శుక్రవారం ఉదయం విద్యార్థులు స్కూలుకు ఆటోలో వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కృష్ణా జిల్లా గంపల గూడెం గ్రామానికి చెందిన బైముతక శ్రీను (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ఉన్న గోపాల్రెడ్డి అనే బాలుడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికి ప్రథమ చికిత్స అందించి ఇళ్లకు పంపించివేసినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, సీఐ సుధాకర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఎస్సై కుటుంబరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు పరామర్శించారు.
భార్యపై హత్యాయత్నం.. భర్తపై కేసు నమోదు
భీమడోలు: ఇంటికి నిప్పంటించి భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వై.సుధాకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్జావారిగూడెంలో దవులూరి వెంకటలక్ష్మీ, దవులూరి నాగరాజులకు వివాహమై ఒక పాప, బాబు సంతానం. కొంతకాలంగా తాగుడుకు బానిసైన నాగరాజు భార్య వెంకటలక్ష్మిని అనుమానిస్తూ వేధిస్తున్నాడు. దీనిపై వెంకటలక్ష్మి పెద్దల్లో పంచాయితీ పెట్టగా సర్దిచెప్పి ఆమెను భర్త నాగరాజు వద్దకు పంపించారు. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నెల 15న రాత్రి మద్యం తాగి వచ్చి భార్య వెంకటలక్ష్మిని నాగరాజు తీవ్రంగా కొట్టి ఆమెను గదిలో బంధించి ఇంటికి నిప్పంటించాడు. దీనితో తలుపు పగులకొట్టి వెంకటలక్ష్మి ప్రాణాలతో బయట పడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పై కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment