నూజివీడు: చంద్రబాబును నమ్మితే ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఉండదని, సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. మండలంలోని బోర్వంచ, పాతరావిచర్ల, కొత్త రావిచర్లలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు బెంజికారు కొనిపెడతా, కేజీ బంగారం ఇస్తా అంటూ మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారని, ప్రజలెవరూ ఆయన మాటలు నమ్మడం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు రెండూ సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఉంటూ నూజివీడుకు టీడీపీ అభ్యర్థిగా వచ్చిన వలసపక్షి పార్థసారథిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొలుసుకు సీఎం జగన్ను విమర్శించే అర్హత లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ఎంపీపీ ఆరేపల్లి శిరీష, సర్పంచ్లు కుంటం ఉదయరాజు, బసవరాజు అన్నపూర్ణ, ఎంపీటీసీ తాడేపల్లి సునీత నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు
Comments
Please login to add a commentAdd a comment