మహబూబ్‌నగర్‌ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత | Road Accident In Mahabubnagar National Highway | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత

Published Fri, Jan 5 2024 6:28 PM | Last Updated on Fri, Jan 5 2024 7:25 PM

Road Accident In Mahabubnagar National Highway - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ జిల్లా: వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది.

చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఉద్రిక్తత.. డీసీఎంకు నిప్పు..
బాలానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement