తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు | Ramoji brutality on GJ Reddys family | Sakshi
Sakshi News home page

తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు

Published Fri, Apr 12 2024 5:58 AM | Last Updated on Fri, Apr 12 2024 5:58 AM

Ramoji brutality on GJ Reddys family - Sakshi

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సహ వ్యవస్థాపకుడుజీజే రెడ్డి కుటుంబంపై రామోజీ దౌర్జన్యం

మార్గదర్శి ఏర్పాటుకు ఆర్థిక తోడ్పాటునందించిన జీజే రెడ్డి

తండ్రి షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని కోరిన జీజే రెడ్డి కుమారులు

తుపాకీతో బెదిరించి ఫామ్‌ ఎస్‌హెచ్‌–4పై సంతకం చేయించుకున్న రామోజీ

జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు పేరిట అక్రమంగా బదిలీ చేసిన రామోజీ

జీజే రెడ్డి కుమారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ

తమ షేర్ల కోసం న్యాయపోరాటం చేస్తున్న జీజే రెడ్డి కుటుంబం

సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్ర­మ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చ­నీ­యాంశమయ్యాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ముసు­గులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు.

మార్గదర్శి ఫైనాన్సి­యర్స్‌ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించా­రు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మ­యపరుస్తోంది.

నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రు­డు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిద­ర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. 

సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ
కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యో­గం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామ­య్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నల­పాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే కంపెనీని ఏర్పాటు చేశారు.

కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామో­జీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదా­యాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు.

తుపాకితో బెదిరించిన రామోజీ
2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని మార్టిన్‌ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్‌ కింద రూ.39,74,400 విలువైన యూనియన్‌ బ్యాంక్‌ చెక్‌ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు.

మిగిలిన సంవత్సరాల డివిడెండ్‌ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్‌ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్‌ మీద సంతకం చేయమని మార్టిన్‌ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది.

అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్‌ ఎస్‌హెచ్‌–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కా­రు. తుపాకీ తీసి మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవ­రూ లేరు.

సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభ­యంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు.

రామోజీ, శైలజపై సీఐడీ కేసు
జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్‌ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్‌ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్‌ 34 కింద అభియోగాలు నమోదు చేసింది.

మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. 

షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు
ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్‌ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు.

చిట్‌ఫండ్స్‌ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు.

ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి.

ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ
కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు.  జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్‌ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు.

రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్‌ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకా­లు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీ­లిస్తే అసలు బాగోతం బయటపడింది.

యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్‌ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గ­దర్శకాలను పాటించకుండానే రామోజీ­రావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్ర­మంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement