ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు | Lovers Suicide Attempt In Warangal | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రియుడిపై కేసు

Published Sat, Jan 16 2021 9:42 AM | Last Updated on Sat, Jan 16 2021 12:00 PM

Lovers Suicide Attempt In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండల పరిధి నల్లగుంట గ్రామ శివారు దేవాదుల పైపులైను సమీపాన ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నల్లగుంటకు చెందిన ధరంసోతు రాజేష్, భూపాలపల్లి జిల్లా మంజూర్‌నగర్‌కు చెందిన ఓ యువతి(16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో తెలియడంతో తల్లితో పాటు బంధువులు యువతిని ప్రశ్నించినట్లు తెలిసింది. పెళ్లికి నిరాకరిస్తారనే భయంతో సదరు యువతి గురువారం రాత్రి 8 గంటల సమయంలో నల్లగుంటకు వచ్చి రాజేష్‌తో కలిసి గ్రామసమీపాన ఉన్న దేవాదుల పైపులైన్‌ వద్దకు చేరుకుని పురుగుల మందు తాగారు.

అపస్మారకస్థితిలో ఉన్న రాజేష్‌ తెల్లవారుజామున స్నేహితులకు ఫోన్‌ చేయగా.. వారిద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రేమికులిద్దరిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజేష్‌ను మల్లంపల్లిలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి, యువతిని వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువతి మైనర్‌గా పోలీసులు పేర్కొంటున్నారు.

రాజేష్‌పై కేసు నమోదు
తమ కూతురు గురువారం రాత్రి 7 గంటలకు కిరాణా సామగ్రి తీసుకురావడానికి వెళ్లి తిరిగిరాలేదని యువతి తల్లి శుక్రవారం ఉదయం భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దూరపు బంధువైన ధరంసోతు రాజేష్‌పై అనుమానం ఉందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement