బంగారం బంగారమే Types of Gold Investment Plans in India and Their Benefits 2024 | Sakshi
Sakshi News home page

బంగారం బంగారమే

Published Mon, Jun 10 2024 4:14 AM | Last Updated on Mon, Jun 10 2024 8:14 AM

Types of Gold Investment Plans in India and Their Benefits 2024

బంగారంపై పెట్టుబడికి మెరుగైన ఆప్షన్‌ 

సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ 

ఎనిమిదేళ్లు కొనసాగితే లాభంపై సున్నా పన్ను 

పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ రాబడి 

అందుబాటులో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్స్‌ 

పతి ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో పసిడి ఉండాల్సిందే

కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్‌) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. 

కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)లో ఇన్వెస్ట్‌ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. 

సంప్రదాయ డెట్‌ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.

వివిధ సాధనాలు 
బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్‌ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ ఫండ్స్, సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీలు), డిజిటల్‌ గోల్డ్‌ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం.  

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు 
స్టాక్స్‌ మాదిరే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్‌ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్‌ ఈటీఎఫ్‌ ధర ఏరోజుకారోజు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్‌పెన్స్‌ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్‌ఐసీ గోల్డ్‌ ఈటీఎఫ్‌లో ఎక్స్‌పెన్స్‌ రేషియో 0.41 శాతంగా ఉంది. 

ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్‌పెన్స్‌ రేషియో కింద ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్‌ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి.  

గోల్డ్‌ ఫండ్స్‌ 
ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడమే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక యూనిట్‌ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్‌ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 

సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్‌ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల అక్కడ ఎక్స్‌పెన్స్‌ రేషియో.. తిరిగి గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. 

డిజిటల్‌ గోల్డ్‌ 
ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్‌ సంస్థలు డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్‌ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్‌ ఒక ప్లాట్‌ఫామ్‌లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్‌బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది.   

ఎస్‌జీబీల్లో రాబడి 
ఇండియా బులియన్‌అండ్‌ జ్యుయలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్‌ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్‌జీబీ 2016– సిరీస్‌1 బాండ్‌ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్‌ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్‌బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. 

ఇతర వివరాలు 
ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్‌ బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్‌ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్‌జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.

కేటాయింపులు ఎంత మేర? 
ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్‌ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్‌ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్‌ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్‌టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్‌ కూడా ఉండదు.     

బంగారం బాండ్లు  
భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్‌ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్‌జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్‌ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్‌బీఐ ప్రకటిస్తుంటుంది.

 బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్‌ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్‌బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్‌ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్‌బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది.

 రిటర్నుల్లో ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్‌ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్‌ఎస్‌ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్‌ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది.  

రాబడులు 
బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్‌ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్‌ రాబడిని బంగారం ఇచి్చంది.  

ముందస్తు ఉపసంహరణ ఎలా? 
ఎస్‌జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్‌బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్‌బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్‌ తన వద్దనున్న బాండ్‌ను ఆర్‌బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. 

ఇక ఇన్వెస్ట్‌ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ లేదా బీఎస్‌ఈ). కాకపోతే స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్‌ తక్కువ కనుక మార్కెట్‌ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్‌ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్‌ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement