సెన్సెక్స్‌.. నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ | Market again ends with record highs- IT shares jumps | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌.. నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Tue, Jan 5 2021 4:00 PM | Last Updated on Tue, Jan 5 2021 4:40 PM

Market again ends with record highs- IT shares jumps - Sakshi

ముంబై, సాక్షి: తొలుత కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ చివరికి మార్కెట్లు హుషారుగా ముగిశాయి. వెరసి వరుసగా 10వ రోజూ లాభాలతో నిలిచాయి.  సెన్సెక్స్‌ 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా.. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్‌ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో గత 9 రోజులుగా మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుండటంతో తొలుత ట్రేడర్లు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 47,903 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి జోరందుకుని చివరి సెషన్‌కల్లా 48,486ను అధిగమించింది. వెరసి కనిష్టం నుంచి 583 పాయిం‍ట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ సైతం 14,216-14,048 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. (2021లో 15 ఐపీవోలు- ఈ నెలలోనే 6)

మెటల్‌ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 2.6 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2 శాతం చొప్పున లాభపడగా..  మెటల్ 1.4 శాతం‌, రియల్టీ 0.4 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, విప్రో, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 6.3-1.3 శాతం మధ్య జంప్‌ చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్‌ ఫైనాన్స్, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఆటో 2-1 శాతం మధ్య క్షీణించాయి. 

నౌకరీ జూమ్‌
డెరివేటివ్‌ స్టాక్స్‌లో నౌకరీ 14.5 శాతం దూసుకెళ్లగా.. ఇండస్‌ టవర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అపోలో హాస్పిటల్‌, ముత్తూట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ 5.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు పిరమల్‌, సెయిల్‌, నాల్కో, ఇండిగో, చోళమండలం, డీఎల్‌ఎఫ్‌, బీహెచ్‌ఈఎల్‌ 2.5-1.5 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 1.4-0.7 శాతం మధ్య ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,780 లాభపడగా.. 1,289 నష్టపోయాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,843 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 715 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గత శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 506 కోట్లు, డీఐఐలు రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement