పెత్తందారీ పోకడలూ అంటరానితనమే | Worlds tallest Ambedkar bronze statue unveiled | Sakshi
Sakshi News home page

పెత్తందారీ పోకడలూ అంటరానితనమే

Published Sat, Jan 20 2024 4:35 AM | Last Updated on Sat, Jan 20 2024 3:10 PM

Worlds tallest Ambedkar bronze statue unveiled - Sakshi

ఎన్నటికీ మరణం లేని  మహనీయుడు అంబేడ్కర్‌ను  తలుచుకుంటూ తరతరాలుగా  స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి– అభ్యుదయానికి మధ్య అవినాభావ  సంబంధం అంబేడ్కర్‌ భావజాలం. మనం అదే భావజాలంతో పని చేస్తుంటే రాష్ట్రంలో పెత్తందార్ల పార్టీలకు, పెత్తందార్ల  నాయకులకు నచ్చట్లేదు.  నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ,  నా మైనార్టీ, నా అగ్రవర్ణ పేదలకు  మంచి చేయాలనే సామాజిక  న్యాయ విప్లవం తెచ్చానని  చెప్పేందుకు గర్విస్తున్నా   – ముఖ్యమంత్రి జగన్‌  

సాక్షి, అమరావతి: ‘అంటరానితనంపైతిరుగుబాటు, విప్లవం, స్వాతంత్య్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికీ ఉన్నాయని, పెత్తందారీ పోకడలతో అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు.

విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి, భారత రత్న, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 206 అడుగుల ఎత్తైన  ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణతో మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాలవాడగా కనిపిస్తోందన్నారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి అని తెలిపారు.  

చరిత్ర గతిని మార్చిన సంఘ సంస్కర్త 
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ గురించి మనం విన్నాం. ఇక మీదట స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ (సామాజిక న్యాయ మహాశిల్పం) అంటే ఇండియాలోని విజయవాడ అని మార్మోగుతుంది. మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజిక న్యాయానికి ఈ విగ్రహం నిలువెత్తు నిదర్శనం. అంబేడ్కర్‌ జన్మించిన 133 ఏళ్ల తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం.

ఇది వేల సంవత్సరాల భారత సామాజిక, ఆర్థిక, మహిళా చరిత్రలను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం. బాబా సాహెబ్‌ మన భావాల్లో జీవించే ఉంటారు. మన అడుగుల్లో, బతుకుల్లో, భావాల్లో ఎప్పటికీ కనిపిస్తుంటారు. పెత్తందారీతనం, అంటరానితనం, కుల అహంకార వ్యవస్థలు, అక్కచెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటారు ఆ మహా మనిషి.  



75వ గణతంత్ర దినోత్సవానికి ముందు.. 
విజయవాడలో.. అది కూడా స్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య మైదానంలో, 75వ రిపబ్లిక్‌ డేకి సరిగ్గా వారం ముందు మనం ఆవిష్కరిస్తున్న అంబేడ్కర్‌ మహా విగ్రహం స్ఫూర్తిదాయకం. అది చూసినప్పుడల్లా పేదలు, మహిళలు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, సమానత్వ ఉద్యమాలు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది.  

పుణె ఒప్పందం.. అండనిచ్చే మహాశక్తి 
ఆయన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అంటరానితనం, ఆధిపత్య భావజాలంపై ఓ తిరుగుబాటుగా మనకు కనిపిస్తుంటారు. సమసమాజ భావాలకు నిలువెత్తు రూపంగా మనందరికీ గుర్తుకొస్తారు. రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహా శక్తిగా మనందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారు. గొంతు విప్పలేని దళిత వర్గాలు, అల్ప సంఖ్యాకులు, వాయిస్‌ లెస్‌ పీపుల్, అట్టడుగు వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు కల్పించాలని చరిత్ర గతిని మార్చిన పుణె ఒప్పందానికి కారకులు అంబేడ్కర్‌.

ఈ రోజు దళిత జాతి నిలబడిందన్నా, అల్ప సంఖ్యాకులు నిలబడగలుగుతున్నారన్నా, రిజర్వేషన్లు కల్పించి ఒక్క తాటిపైకి తెచ్చే కార్యక్రమం జరిగిందంటే అంబేడ్కరే స్ఫూర్తి. ప్రతివాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, శక్తిని, అండను ఇస్తుంది. మహాశక్తిగా తోడుగా నిలబడుతుంది. 

ఆకాశమంతటి వ్యక్తిత్వం 
రూపం మార్చుకున్న అంటరానితనంపై 56 నెలలుగా మనం చేస్తున్న యుద్ధానికి నిదర్శనం సామా­జిక న్యాయం. మనం చేస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేడ్కర్‌ విగ్రహం ఎప్పటికీ కనిపిస్తుంది. ఇది దేశం­లోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నా.

81 అడుగుల వేదిక మీద 125 అడుగుల మహా విగ్రహం.. మొత్తం 206 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన ఆకాశమంతటి ఆ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని అంతా గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడూ,  ప్రతి పాపా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలి. అభివృద్ధి – అభ్యుదయానికి మధ్య  అవినాభావ సంబంధం అంబేడ్కర్‌ భావజాలం. ఇలాంటి భావజాలం పెత్తందార్లకు నచ్చదు. పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది. 



ఆయన చదివింది ఇంగ్లీషు మీడియంలో.. 
ఈరోజు కూడా ఈ దురహంకారులు, ఈ పెత్తందార్లు తమ పత్రికలో రాశారు. అంబేడ్కర్‌ తెలుగు మీడియం మాత్రమే ఉండాలి అని అన్నారట. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారట. వీళ్లు అబద్ధాలు ఏ స్థాయిలో చెబుతున్నారో చూస్తుంటే బాధేస్తోంది. అంబేడ్కర్‌ చదువుకున్నది ఇంగ్లీషు మీడియంలో. ఆయన 4వ తరగతి పాసైనప్పుడు బంధుమిత్రులంతా పండగ చేసుకున్నారు. ఈనాడు చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ రాతలు రాస్తోందంటే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో ఆలోచన చేయమని కోరుతున్నా.

ఈ పెత్తందార్ల పత్రిక, ఆ ఈనాడు పత్రిక ముసుగులో తాము పాటించే  అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్‌ వేస్తోంది. ఇలాంటి దుర్మార్గులు, నీచులు మన దళితులు, బహుజనులకు వ్యతిరేకులు. అంటరానితనం.. మరో రూపంలోస్వాతంత్య్రం వర్థిన 77 ఏళ్ల తర్వాత కూడా అంటరానితనం, వివక్ష సమసిపోలేదు. పెత్తందార్ల పోకడలతో రూపం మార్చుకుంది.

అంటరానితనం అంటే.. ఫలానా వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడదని దూరం పెట్టడం మాత్రమే కాదు. పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ గవర్నమెంట్‌ బడిని పాడుపెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీషు మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.  

మనుషులు చనిపోతున్నాకరుణించని పాలకులు.. 
పేద కులాల వారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగానే ఉండిపోవాలట. తమ ఇళ్లల్లో పనివారుగా, తమకు సేవకులుగా ఉండిపోవాలట. తమ అవసరా­లు తీర్చేవారిగానే మిగిలిపోవాలట. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేదలు ఏ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నా­రో, ఎక్కడ వారికి ఉచితంగా వైద్యం అందుతుందో, అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను నీరుగార్చడం కూడా అంటరానితనమే. పేదలు బస్సు ఎక్కే ఆర్టీసీ­ని కూడా ప్రైవేట్‌కు అమ్మేయాలనుకోవడం కూ­డా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఏ పౌ­ర సేవ కావాలన్నా, పేదవాడికి ఏ పథకం కావా­లన్నా లంచాలు ఇచ్చుకుంటూ, వివక్షకు లో­న­వుతూ, కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగిన దుస్థితి కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే.

అవ్వాతాతలు పెన్షన్‌ కోసం, రైతన్నలు ఎరు­వుల కోసం పొద్దున్నే లేచి పొడవాటి లైన్లలో నిలబడాల్సి రావడం, మనుషులు చ­ని­­పో­­తున్నా పాలకుల గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకు­న్న అంటరానితనమే. పేద­ల మీద పెత్తందారీ భావజాలంలో ఇవన్నీ కూడా భాగాలే. ఎస్సీల అసైన్డ్‌ భూముల్ని కాజేసి గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్న రియల్‌ ఎస్టేట్‌ రాజధానిలో పేద వర్గాలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకో­వాలని కుతంత్రాలు చేయడం కూడా రూపం మా­ర్చు­కున్న అంటరానితనమే.

పేదల ఇళ్ల నిర్మాణానికి భూములిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టులకు వెళ్లి కేసులు వేసి సిగ్గు లేకుండా వా­దించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. పేద వర్గాల పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వటానికి వీల్లేదని కుట్ర కథనాలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. 

పెత్తందార్లకు ఏనాడైనా తోచిందా? 
దళితుల ఇళ్ల నిర్మాణాలకు చంద్రబాబు సెంటు భూమి అయినా ఇచ్చింది లేదు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని నిర్మించింది అంతకంటే లేదు. చంద్రబాబు రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద ఏ కోశానా, ఏనాడూ ప్రేమే లేదు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామా­ల్లో ఆ సామాజిక వర్గాలు ఎలా బతకగలుగుతాయనే కనీస ఆలోచన చేయలేదు. బీసీలను తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్‌! అని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.

పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఆ వ్యక్తికి మన మాదిరిగా పేద అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయాలని ఎందుకు అనిపిస్తుంది? చదువుకొనే మన పేద పిల్లలకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, ట్యాబ్‌లు, ఇంగ్లీషు మీడియం చదువులు, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్, గవర్నమెంట్‌ బడుల్లో డిజిటలైజేషన్, ఐఎఫ్‌పీలు, నాడు–నేడుతో చదువులు మార్చాలని అలాంటి òపెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన అక్కచెల్లెమ్మలకు ఒక దిశా యాప్, అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చి చిరునవ్వులు చూడాలని పెత్తందారీ పార్టీలకు, నాయకులకు ఎందుకు అనిపిస్తుంది? మన రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థను తేవాలని వారికి ఎందుకు అనిపిస్తుంది?

పేదలకు ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల ఉచిత వైద్యం,  ఆరోగ్య ఆసరా, 104, 108 సేవలు, విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్ట, వైద్య ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాలని ఆ పెత్తందారు చంద్రబాబుకు ఎందుకు అనిపిస్తుంది? గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థలు తెచ్చి ప్రతి పేదవాడికీ అందుబాటులో ఉండాలని పెత్తందారు పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది? నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే దక్కేలా ఏకంగా చట్టం చేయాలని పెత్తందార్లకు ఎందుకు అనిపిస్తుంది?



విప్లవాత్మక వ్యవస్థలు 
పెత్తందారీ పార్టీలు, పెత్తందారీ నాయకులకు నా ఎస్సీ­లు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల కోసం నవరత్నాల పాలన అందించాలని ఏ రోజైనా అనిపించిందా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి అవ్వాతాత వరకు అందరి పట్ల ప్రేమ, మ­మకారం చూపాలని పెత్తందారీ పార్టీ నాయకులకు ఏరోజైనా అనిపించిందా? మీ బిడ్డ 56 నెలల పాలనలో నేరుగా బటన్‌ నొక్కి రూ.2.47 లక్షల కోట్లు పారదర్శకంగా అందించాడు.

లంచాలు, వివక్ష లే­కుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరు­గా డబ్బులు జమ అవుతున్నాయి.  ఇవాళ గ్రామ స్థాయిలో చిక్కటి చిరునవ్వుతో మన పిల్లలు కనిపిస్తున్నారు. 2 వేల జనాభాకు సచివాలయం. 50 ఇళ్ల­కు వలంటీర్‌ ఉన్నారు. ప్రతి పేదవాడు, రైతన్న, అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఇదీ అంబేడ్కర్‌ కలలుగన్న రాజ్యం అని ఆ చెల్లెమ్మలు, తమ్ముళ్లు దేశానికే చూపిస్తున్నారు. 

ఈ స్థాయిలో మరెక్కడైనా ఉందా? 
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు మేలు చేయడంలో దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 56 నెలల పాలనలో అడుగులు పడ్డాయి. మంత్రి మండలిలో ఏకంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మంత్రి మండలిలో 68 శాతం పదవులూ వారికే ఇచ్చాం. ఇది సామాజికపరంగా దేశ చరిత్రలో రికార్డు. శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ, మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా మైనార్టీ అక్కకు పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డదే. రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల వారే. మన పార్టీకి మండలిలో 43 మంది సభ్యులుంటే వారిలో 29 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలే ఉన్నారు.

13 జెడ్పీ చైర్మన్లలో 9 పదవులు, 17 మున్సిపల్‌ కార్పొరేషన్లలో 12 మేయర్లు, 87 మున్సిపాలిటీలుంటే 84 మీ బిడ్డ గెలుచుకోగా వాటిలో ఏకంగా 58 మున్సిపాలిటీల్లో, 196 మార్కెట్‌ కమిటీల్లో 117 చైర్మన్లు, 137 కార్పొరేషన్‌లలో 79 చైర్మన్లు ఇలా అన్నింటా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే అవకాశం కల్పించాం. మన ప్రభుత్వం అధికారంలోకి వర్థిన తర్వాత 56 నెలల కాలంలో 2.10 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇస్తే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మనందరి ప్రభుత్వంలో కాకుండా మరెక్కడైనా చూశారా?  

ప్యూన్‌ రాకపోతే మంచినీళ్లూ పుట్టవు! 
చదువుకునేందుకు వీల్లేదని తరతరాలుగా అణచివేతకు గురైన వర్గంలో జన్మించినా,  చదువుకొనేందుకు తమకు మాత్రమే హక్కుందని భావించిన వారికంటే గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేడ్కర్‌. ఆయన చదువుకుంటున్న రోజుల్లో దళితుడు కాబట్టి స్కూల్‌లో కుండలో నుంచి గ్లాసు ముంచుకొని నీళ్లు తాగేందుకు కూడా అనుమతించలేదు. ఆయన తెచ్చుకున్న గ్లాసులో ప్యూన్‌ పైనుంచి నీళ్లు పోసేవాడట. ఏ రోజైనా బడికి ప్యూన్‌ రాకపోతే ఆ రోజు తాగడానికి మంచినీళ్లు లేనట్లే అన్న మాటలు ఎంతో బాధ కలిగిస్తాయి. 

ప్రతి గ్రామంలో మార్పు 
మీ కష్టం తెలిసిన మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలోనూ మార్పు  తీసుకొచ్చింది. రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ప్రతి గ్రామంలోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలన సంస్కరణలు కనిపిస్తాయి. వ్యవసాయ విప్లవం కనిపిస్తుంది. డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తాయి. పారిశ్రామిక మౌలిక సదుపాయాలతో ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుంది. వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్నడూ ఊహించని రీతిలో గ్రామ స్థాయిలో సాకారమైన మరో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement