![Vidadala Rajini about Jagananna Arogya Suraksha Scheme - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/10/26/rajni.jpg.webp?itok=sdjti5bV)
చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్షతో పేదోళ్ల ఆరోగ్యానికి అత్యంత రక్షణ కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనా విధానం నుంచి పుట్టిన అద్భుత పథకమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుగాలికాలనీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి బుధవారం పరిశీలించారు.
శిబిరానికి హాజరైన పేద రోగులను ఆత్మీయంగా పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందజేయటమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కోటి34లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,535 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. 71,173 మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్యం అందించినట్లు చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఆరోగ్యరంగం కుదేలైందని విమర్శించారు. గతంలో 1,059 ఉన్న ఆరోగ్య శ్రీ వైద్య సేవలను జగనన్న ప్రభుత్వం 3,257కు పెంచిందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎంఅండ్హెచ్వో డాక్టర్ రవి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment