సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లు | Survey numbers are replaced by LPM numbers | Sakshi
Sakshi News home page

సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లు

Published Wed, Oct 4 2023 4:33 AM | Last Updated on Wed, Oct 4 2023 4:33 AM

Survey numbers are replaced by LPM numbers - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు కనుమరుగై, వాటి స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎ) నంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ఎల్‌పీఎం నంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నంబర్లతోనే జరగనున్నాయి.

బ్రిటిష్‌ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారు. ఒక సర్వే నంబరులో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్‌పీఎం నంబరు, ప్రతి యజమానికి ఆధార్‌ తరహాలో ఒక ఐడీ నంబరు ఇస్తోంది. 

మారనున్న 1.96 కోట్ల సర్వే నంబర్లు
రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు,  వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఈ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్‌ సర్వే, అవి చేయలేని చోట డీజీపీఎస్‌ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు ఎల్‌పీఎం నంబరు, ఆధార్‌ మాదిరిగానే భూదార్‌ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది.

సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూ­ని­క్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, యజమాని ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతా­యి. ఈ ఎల్‌ï­³ఎం నంబర్ల ప్రకారమే క్రయ విక్ర­య రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్లు జరుగుతాయి. దీని­వల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు.

వెబ్‌ల్యాండ్‌–2లో ఎల్‌పీఎం నంబర్లు 
రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్‌ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్‌పీఎం నంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్‌పీఎం నంబర్లతో అప్‌డేట్‌ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వీటి ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌–2 ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు.

సర్వే పూర్తయ్యే గ్రామాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్‌పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతోంది. ఆ గ్రామాలను కూడా వెబ్‌ల్యాండ్‌–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్‌ల్యాండ్‌–2కి మారిపోతుంది. భవిష్యత్తులో ఎల్‌పీఎం నంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement