అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే' | Supreme Court Shock To Ramoji Rao For Margadarsi Scam | Sakshi
Sakshi News home page

అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'

Published Wed, Apr 10 2024 4:13 AM | Last Updated on Wed, Apr 10 2024 7:17 AM

Supreme Court Shock To Ramoji Rao For Margadarsi Scam - Sakshi

అధీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ.. ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్‌ రజని ఇచ్చిన తీర్పు రద్దు

విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ

హైకోర్టు తీర్పు ఏకపక్షం.. అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ 

అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం 

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్లపై నిగ్గు తేలాలి.. సమగ్ర పరిశీలన చేయండి

ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలి

తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు

తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం

కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలివ్వాలన్న సిద్ధార్థ లూథ్రా

అదెలా సాధ్యం? ఎలాంటి గ్యాగ్‌ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం స్పష్టీకరణ  

కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం..
– సుప్రీం కోర్టు

సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనా­న్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీం­కోర్టు గట్టి షాక్‌నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్‌ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.

డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షి­యర్స్‌ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపు­చ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ము­లను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపో­దని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షి­యర్స్‌ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలా­ల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది.

సీనియర్‌ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్‌ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది.

ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్‌ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ కేవీ విశ్వనాధన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు..
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు సీనియర్‌ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్‌ పిటిషన్‌కు, ఈ తాజా క్వాష్‌ పిటిషన్‌కు ఎలాంటి తేడా లేదన్నారు.

కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్‌ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్‌ స్టేట్‌ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. 

రూ.5 వేలు డిపాజిట్‌దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..?
ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్‌తో కలిపి ఇంత మొత్తం అయింది.

ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్‌ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్‌ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...!
అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్‌ స్టేట్‌ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు.

అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. 

మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు...
మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారని గుర్తు చేశారు.

హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు.

హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు...
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. 
 
చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి...
తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్‌గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్‌ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్‌బీఐ స్టేటస్‌ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే..
సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్‌ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్‌ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి
ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్‌ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్‌లో హెచ్‌యూఎఫ్‌ విషయంలో వచ్చిన తప్పును సవాల్‌ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 

తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి...
‘‘పిటిషన్‌ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్‌ పర్సన్‌గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ, ఆర్‌బీఐ, ఉండవల్లి అరుణ్‌కుమార్, రామోజీరావు, అన్‌క్లయిమ్‌ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఎలాంటి గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వలేం...
కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్‌ ఆర్డర్‌లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. 

ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. 

కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు..
ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్‌లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ  సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్‌ (స్కిల్‌ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement