![Slight changes in Shrivari Arjita services and VIP darshans - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2023/05/21/ttd.jpg.webp?itok=Z9nUOD_8)
తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.
కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం లభిస్తుంది.
24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించి జూలై, ఆగస్టు నెలల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ https://tiru patibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
తిరుమలలో శ్రీవారిని శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రికి 81,833 మంది దర్శించుకున్నారు. హుండీలో కానుకల రూపంలో రూ.3.31 కోట్లు సమర్పించారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టికెట్లు లేని భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment