మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగుబాటు | Maoist leader Jalandhar Reddy was surrendered | Sakshi
Sakshi News home page

మావోయిస్టు కీలక నేత జలంధర్‌రెడ్డి లొంగుబాటు

Published Wed, Apr 21 2021 5:13 AM | Last Updated on Wed, Apr 21 2021 5:13 AM

Maoist leader Jalandhar Reddy was surrendered - Sakshi

సాక్షి, అమరావతి: గతంలో బలిమెలలో పోలీసులపై జరిగిన దాడి, ఐఏఎస్‌ అధికారి వినీల్‌ కృష్ణ కిడ్నాప్‌ ఘటనల్లో పాత్రధారి, మావోయిస్టు కీలక నేత.. ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ, మారన్న, కరుణ, శరత్‌ (40) మంగళవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎదుట లొంగిపోయారు. తెలం గాణలోని సిద్ధిపేట జిల్లా (పూర్వపు మెదక్‌ జిల్లా) మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామానికి చెందిన జలంధర్‌రెడ్డి ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా– ఒడిశా స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏవోబీ ఎస్‌జెడ్‌సీ) సభ్యుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మంగళ వారం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టులు హింసాయుత మార్గంలో ఏదీ సాధించ లేరని, జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.

లొంగిపోయేవారికి చట్టపరంగా ఎటువం టి ఇబ్బందులు లేకుండా సహాయం అందించడంతోపాటు పునరావాసం కల్పిస్తామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాలు గిరిజనుల్లో కొత్త కాంతిని నింపుతు న్నాయని చెప్పారు. విప్లవం, నూతన ప్రజా స్వామ్యం అంటూ మావోయిస్టులు చేస్తున్న హింసా యుత కార్యకలాపాలపై గిరిజనులు, యువత తోపాటు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పటికే ఏవోబీలో మావోయిస్టులు పట్టు కోల్పో యారని, గత రెండేళ్లలో అనేక మంది లొంగి పోయారని వివరించారు. జలంధర్‌రెడ్డిపై రూ.20 లక్షలు నగదు రివార్డు ఉందని, ఆ మొత్తాన్ని ఆయన పునరావాసానికి వినియోగిస్తామన్నారు. 

గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలు..
అటవీ హక్కుల గుర్తింపు కింద 1.53 లక్షల మంది గిరిజనులకు 3.06 లక్షల ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం పంచిపెట్టిందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. పలు సంక్షేమ పథకాల కింద గిరిజనులకు రూ.2,136 కోట్లు జమ చేసిందని గుర్తు చేశారు.  రాష్ట్ర శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఎస్‌ఐబీ ఐజీ సీహెచ్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనే ఉద్యమానికి దూరం 
మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించలేకే ఉద్యమానికి దూరమైనట్టు జలంధర్‌రెడ్డి చెప్పారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకలాపాలు, నిర్ణయాల పట్ల విభేదించానని తెలిపారు. పై స్థాయిలో పార్టీ చెప్పేదానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదన్నారు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు, తన ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగిపోయానన్నారు. 

ఆర్‌ఎస్‌యూ నుంచి సెంట్రల్‌ జోన్‌ సభ్యుడి స్థాయికి..
రిటైర్డ్‌ వీఆర్వో బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్‌ చివరివాడు. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు.  1998లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరిన జలంధర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిం చారు. 2000 ఫిబ్రవరిలో  సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ పార్టీ సభ్యుడిగా గిరాయిపల్లి దళంలో చేరారు. 2000 సెప్టెంబర్‌ నుంచి 2002 ఆగçస్టు వరకు నల్లమల ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్, ఆంధ్ర ప్రాంత ప్లాటూన్‌ లలో పనిచేశారు. 2002 సెప్టెంబర్‌లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి బదిలీ అయ్యారు.

అప్పటి నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీలో ఈస్ట్‌ డివిజనల్‌ కమిటీ, మల్కన్‌గిరి– కోరాపుట్‌–విశాఖ బోర్డర్‌  కమిటీల్లో డివిజన్‌ కార్యదర్శి, కమాండర్‌గా పనిచేశారు. 2006 నవంబర్‌లో డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 నుంచి 2016 వరకు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే ప్రొటెక్షన్‌ స్క్వాడ్‌ కార్యదర్శిగా పనిచేశారు. 2019 అక్టోబర్‌ నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2008లో గ్రేహౌండ్స్‌ పోలీసులపై జరిగిన బలిమెల దాడి, 2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణ కిడ్నాప్‌ ఘటనలు జలంధర్‌రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. బలిమెల దాడిలో రెండో అస్సాల్ట్‌ టీమ్‌కు నాయకత్వం వహించారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన ఐదు ప్రధాన దాడులు, 19 ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. 2004 ఫిబ్రవరి 6న కోరాఫుట్‌ జిల్లా ఆర్మ్‌డ్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై దాడిలోనూ ఉన్నారు. 2001 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్లపై దాడి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement