ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం Jagananna Arogya Suraksha campaign from today | Sakshi
Sakshi News home page

ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

Published Fri, Sep 15 2023 4:50 AM | Last Updated on Fri, Sep 15 2023 4:58 PM

Jagananna Arogya Suraksha campaign from today - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం.

5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్‌ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు,  గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్య­క్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణా­లు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్‌ మొదలవుతుంది.

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ  పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసర­మైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియ­జే­స్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్‌ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్ప­త్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్‌ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పి­స్తారు.

ఆ తర్వాత కమ్యూ­నిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో), ఏఎన్‌­ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్య­పరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొద­టి దశ వైద్య శిబిరాలు (హెల్త్‌ క్యాంప్‌లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో ని­ర్వ­హిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సి­బ్బంది ప్రజ­లకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథ­కం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు.

ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక 
ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా ప్రభు­త్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్య­క్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరో­గ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్య­క్రమం అమ­లుకు అనుసరించాల్సిన మార్గదర్శ­కాల­పై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్ల­డించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలి­పారు.

మూడో దశలో మరో మారు హెల్త్‌ క్యాంప్‌లపై ప్రజలకు అవగాహన కల్పి­స్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబి­రా­లు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్‌ సేవ­లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ని­ర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మ­హి­ళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement