ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం  | A historic moment in the house pattas | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం 

Published Fri, Feb 23 2024 5:54 AM | Last Updated on Fri, Feb 23 2024 9:31 AM

A historic moment in the house pattas - Sakshi

సాక్షి, అమరావతి:  పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది.  దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది.

రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్‌ అగ్రహారంలో కన్వేయన్స్‌ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన కన్వేయన్స్‌ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్‌ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు.   

సచివాలయాల్లో సర్టిఫైడ్‌ కాపీ 
ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టాన్ని సవరించింది.

ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్‌ డీడ్‌లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేస్తోంది. ఈ డీడ్‌లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్‌ డీడ్‌లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇచ్చిన ‘డి’ పట్టాలను క్రమబద్దికరించుకోవడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ శాఖ దాన్ని మార్చడం ఓ ప్రహసనమే.

అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్‌ చేసి కన్వేయన్స్‌ డీడ్‌లు ఇస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్‌లో పదిలంగా ఉంది. లబ్దిదారులు ఎప్పుడైనా అక్కడి నుంచి తమ ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్జరీ గానీ, ట్యాంపర్‌ చేయడానికిగానీ ఆస్కారం ఉండదు.
  
విలువైన స్థిరాస్తి.. 
ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్‌ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది.

మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. ఇలా సీఎం జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపదను  పెడుతున్నారు.
 
కుటుంబ సమేతంగా లబ్దిదారులు.
ఒంగోలులోని ఎన్‌ అగ్రహారం వద్ద నేడు సీఎం జగన్‌ పాల్గొంటున్న బహిరంగ సభకు ఇళ్ల లబ్ది దారులు కుటుంబ సమేతంగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎన్‌.అగ్రహారంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఒంగోలు వాసుల మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.339 కోట్లు మంజూరు కాగా రోజూ తాగునీరు అందించేలా నగరంలోని పైపులైన్‌ వ్యవస్థను సమూలంగా మార్పు చేయనున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ఈ పథకానికి సంబంధించి కార్పొరేషన్‌పై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.  

17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్‌ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్‌గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు.

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్‌ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతోంది. కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లకుపైనే ఉంటుంది. అలాగే సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement