మిచౌంగ్‌ తుపాను: యుద్ధ ప్రాతిపదికన సాయం | CM Jagan Mandate Officials On Cyclone Michaung Relief measures | Sakshi
Sakshi News home page

మిచౌంగ్‌ తుపాను: యుద్ధ ప్రాతిపదికన సాయం

Published Tue, Dec 5 2023 5:12 AM | Last Updated on Tue, Dec 5 2023 9:49 AM

CM Jagan Mandate Officials On Cyclone Michaung Relief measures - Sakshi

సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనదని, కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలని, వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు.

అత్యవసర ఖర్చుల కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయాలన్నారు. తుపాను ప్రభావిత ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..  

అంతా అప్రమత్తంగా సీరియస్‌గా ఉండాలి.. 
తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. హుద్‌హుద్‌ లాంటి పెద్ద తుపానులను కూడా మన రాష్ట్రం చూసింది. 210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని ఎదుర్కొనే అను­భవం కూడా మన అధికారులకు ఉంది. ఇప్పు­డు అలాంటి పరిస్థితి లేకపోయినా..ఈ తుపాన్‌పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలి. బాపట్ల సమీపంలో మంగళవారం మధ్యా­హ్నం తుపాను తీరం దాటే అవకాశముందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షాలు కూడా కురుస్తాయంటున్నారు. ఇక 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి.   

కలెక్టర్లు, ఎస్పీలు సవాల్‌గా తీసుకోవాలి 
ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించాం. వీరంతా కూడా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలు తుపానును ఓ సవాలుగా తీసుకుని పనిచేయాలి. మనుషులతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఇక తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేశాం. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులివ్వాలని ఆదేశాలిచ్చాం.

తిరుపతికి రూ.2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో రూ.1 కోటి చొప్పున ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు కూడా మరో రూ.1 కోటి మంజూరు చేయాలని ఆదేశాలిచ్చాం. రూ.2 కోట్లు కంటే ఇంకా ఎక్కువ అవసరమైతే వెంటనే పంపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లుచేశాం. సీఎస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులంతా అందుబాటులో ఉన్నారు. ఒక ఫోన్‌కాల్‌ దూరంలో మేం ఉంటాం. మీకు ఏం కావాలన్నా వెంటనే అడగండి.   

పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యం 
మరోవైపు.. అధికారులు ఖరీప్‌ పంట సంరక్షణకూ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ధాన్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కోతకు వచ్చిన పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించాం. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఎక్కడైతే ఇంకా పంట కోత కోయలేదో దాన్ని వాయిదా వేసేలా రైతులకు నచ్చ­జెప్పాలి. అదే సమయంలో కోసిన పంటను కచ్చితంగా సేకరించాలి. తేమ ఉన్న ధాన్యం అయినా, రంగు మారిన ధాన్యాన్నైనా సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి. ఇది యుద్ధప్రాతిపదికన జరగాలి. తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరముంది. ఈ సమయంలో రైతు మనకు అత్యంత ప్రాధాన్యమున్న వ్యక్తి. అతనికెలాంటి నష్టం జరగకుండా ధాన్యం సేకరించాలి.    

లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించాలి 
తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇప్పటికే ఈ ఎనిమిది జిల్లాల్లో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తంగా 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని వెంటనే అక్కడికి తరలించాలి. ఇప్పటికే ఐదు ఎన్డీఆర్‌ఎఫ్, మరో ఐదు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నాయి.  

వలంటీర్ల వ్యవస్థను వినియోగించుకోండి 
ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ. అలాగే, ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినిక్స్, రైతుభరోసా కేంద్రాలూ అందుబాటులో ఉన్నాయి. ప్రతి 50–70 ఇళ్లకు ఒక వలంటీర్‌ అందుబాటులో ఉన్న గొప్ప పరిస్థితి ఇతర రాష్ట్రాలకు లేదు. దీనిని ఎంత సమర్థవంతంగా వాడుకోగలిగితే.. అంత మంచి ఫలితాలొస్తాయి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తుపానువల్ల, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి.   

శిబిరాలలో మంచి సౌకర్యాలు ఉండాలి 
ఇక సహాయక శిబిరాల్లో మనం ఎలాంటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, భోజనం, వసతి ఉండాలని కోరుకుంటామో.. అదే తరహాలో అక్కడ సౌక­ర్యాలు ఉండేలా చూడాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. కాస్త డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు సదుపాయాల విషయంలో ఎలాంటి లోటు రాకూడదు. అలాగే, బాధితులపట్ల మానవతా ధృక్పథంతో మెలగాలి. వారు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. కుటుంబానికి అయితే గతంలో మాదిరిగా కాకుండా మరో రూ.500 పెంచి రూ.2,500 ఇవ్వాలి.

బాధిత వ్యక్తికి అయితే రూ.1,000 ఇవ్వాలి. అంతేకాక.. క్యాంపులకు రాకుండా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి, క్యాంపు నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లేవారికైనా వారికి అందాల్సిన 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున అందించాలి. ఈ రేషన్‌ వారికి సకా­లంలో సక్రమంగా అందించాలి. మరోవైపు.. తుపా­ను ప్రభావంతో గాలులు, వర్షాలవల్ల దెబ్బతిన్న గుడిసెలు, ఇళ్లు ఉంటే వారికి తక్షణమే రూ.10 వేలిచ్చి ఆదుకోవాలి. తుపాను తగ్గుముఖం పట్టిన 48 గంటల్లో ఇవి చేయాలి. అప్పుడే వారికి సంతోషాన్ని ఇవ్వగలుగుతాం.     

ఎమర్జెన్సీ సర్వీసులపై దృష్టి పెట్టండి 
ఎమర్జెన్సీ సరీ్వసుల నిర్వహణపైనా అధికారులు దృష్టిపెట్టాలి. తాగునీటి సౌకర్యాలు, జనరేటర్ల ఏర్పాటు, బాలింతలు, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడం వంటి కీలక అంశాలను చూడాలి. వర్షాలు తగ్గిన వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి.  

కదిలిన యంత్రాంగం 
తొలుత.. తుపాను నేపథ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం కదిలిందని.. ఇప్పటివరకు సుమారు ఒక లక్ష టన్నుల ధాన్యం సేకరణ జరి­గిందని.. మరో 6.50 లక్షల  టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వివరించారు.

ఈ సమీక్షలో హోం, విపత్తుల నిర్వ­హణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్‌ సీఎస్‌  సాయిప్రసాద్, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌  రాజశేఖర్, ఇంధనశాఖ స్పెషల్‌ సీ­ఎస్‌ విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు, వ్యవసాయం, పశుసంవర్థక శా­ఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మా కలెక్టర్‌ బాగా చేశారనే మాట వినిపించాలి.. 
తుపాను తీరం దాటి, వర్షాలు తగ్గిన వెంటనే  పంట నష్టంపై వెంటనే ఎన్యూమరేషన్‌ పూర్తిచేయాలి. దీనికోసం మీకు తగిన టైం ఇచ్చిన తర్వాత నేను ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అని అడుగుతాను. మా కలెక్టర్‌ బాగా చేశారన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం. ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను. నాకు సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట వినిపించకూడదు. సంతృప్తకర స్థాయిలో బాధితు­లకు సాయం అందాలి. ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు కూడా జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు.    

రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement