-
వెలుగులు నింపిన నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం
-
ఇదీ మార్పు అంటే.. వెల్లటూరులో మారిన బతుకు చిత్రం
ఈ ఫొటోలో సొంతింటి ముందు సంతోషంగా సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతిస్వామి, వేళంగిణి కుటుంబం ఏడాది క్రితం వరకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కృష్ణా కెనాల్ పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ దశాబ్దాల పాటు దుర్భర జీవితాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో ఈ కుటుంబం గృహ ప్రవేశం చేసింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికా. దీపం వెలుతురు మినహా కరెంటు కనెక్షన్ లేదు. వర్షాలు పడితే గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురికి నీటి కారణంగా దోమలు బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెలోకి వచ్చేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. మాకంటూ ఓ సొంతిల్లు ఉంది. ఇప్పుడు కంటి నిండా నిద్ర పోతున్నాం’ అని వేళంగిణి కృతజ్ఞతలు తెలిపింది. పాకల్లోకి పందులు.. ఇదే కాలనీలో కంతేటి పైడమ్మకు కూడా ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబం కూడా కొన్ని దశాబ్దాలు కాలువ గట్లపైనే మగ్గింది. ఆ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంత ఇంటిని సమకూర్చింది. ప్రతి నెలా ఒకటో తేదీనే పైడమ్మ ఇంటి వద్దే పెన్షన్ అందుకుంటోంది. మీ బతుకు చిత్రంలో ఎలాంటి మార్పు వచ్చిందని పైడమ్మను ప్రశ్నిస్తే ఆమె కళ్లు చెమర్చాయి. ‘ఒకప్పుడు కాలువ పక్కన జంతువులతో కలిసి జీవించాం. పని కోసం బయటికి వెళితే పందులు మా పాకల్లోకి దూరి వండుకున్న అన్నం తినేసి కకావికలం చేసిన ఘటనలు కోకొల్లలు. ఆ జీవితం పగోడికి కూడా రాకూడదని దేవుడిని కోరుకుంటా. ఎంత కష్టం చేసినా మేం గజం స్థలం కూడా కొనలేం. అలాంటిది ఈ రోజు మాకంటూ సొంతిల్లు ఉందంటే సీఎం జగన్ చలువే’ అని పైడమ్మ చెప్పింది. (వడ్డే బాలశేఖర్ – వెల్లటూరు వైఎస్సార్, జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి): రూ.లక్ష కోట్లు.. 30 లక్షల మందికిపైగా సొంతింటి యోగం! ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాల కోసం దేశంలోనే తొలిసారిగా భారీ మొత్తంలో వ్యయం చేస్తూ లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆకాంక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోంది. వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊర్లను, లక్షల్లో గృహాలను నిర్మిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి (టిడ్కో ఇళ్లతో కలిపి) అనుమతులిచ్చింది. ఇందులో 3.40 లక్షల గృహాల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 4.67 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్ పై దశలో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా నీటి సదుపాయం, కరెంట్ కనెక్షన్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా.. అద్దెలు కట్టలేక దశాబ్దాల పాటు కాలువ గట్లపై పాకల్లో మగ్గిపోయిన నిరుపేద కుటుంబాలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సంతోషంగా జీవిస్తున్నాయి. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బాపట్ల జిల్లా వెల్లటూరులో రూ.96 లక్షలతో 3.18 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 115 ప్లాట్లు లబ్ధిదారులకు అందించింది. 28 మంది ఎస్సీలు, 85 మంది ఎస్టీలు, ఒక బీసీ కుటుంబానికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున నగదు అందచేసింది. అయితే ప్రభుత్వం స్థలంతోపాటు నిర్మాణానికి బిల్లులు ఇచ్చినప్పటికీ సొంతంగా ఇంటిని నిర్మించుకోలేని దీనస్థితిలో ఈ కుటుంబాలు ఉండటంతో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ముందుకొచ్చి చేయూత అందించింది. దీంతో నిరుపేదలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇళ్లు సిద్ధమయ్యాయి. స్థలాల మంజూరు, నిర్మాణ బిల్లులు, లేఅవుట్లలో రోడ్లు, మంచినీరు, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కల్పన కోసం ఈ ఒక్క లేఅవుట్కు రూ.7.46 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిరుపేదలకు పక్కా ఇంటిని సమకూర్చడం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.6.73 లక్షల మేర లబ్ధి చేకూర్చింది. పేదల ఇళ్ల కోసం వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో ప్రయోజనం రూ.13,758 కోట్లు అటు ఇల్లు.. ఇటు చదువులు నా భర్త కూలి పనులకు వెళ్తే రోజుకు రూ.500 వరకూ వస్తుంది. పిల్లలతో ఇబ్బంది పడుతూ పూరి గుడిసెల్లోనే జీవించాం. ఇప్పుడు ప్రభుత్వం మాకు పక్కా ఇంటిని సమకూర్చడంతోపాటు నా బిడ్డ చదువుకు కూడా సాయం చేస్తోంది. – జ్యోతి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు నేను, చెల్లి ఆడుకుంటున్నాం మేం గుడిసెలో ఉన్నప్పుడు చుట్టూ ఎప్పుడు బురదే. దోమలు విపరీతంగా కుట్టేవి. వర్షం పడితే గుడిసెలోకి నీళ్లు వచ్చేవి. పైనుంచి వర్షం కారేది. అమ్మనాన్న నన్ను, చెల్లిని ఒళ్లో పడుకోబెట్టుకునే వాళ్లు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాం. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా బాగుంది. నేను చెల్లి బాగా ఆడుకోగలుగుతున్నాం. – వెంకట్నాథ్ (జ్యోతి కుమారుడు) తరతరాల దుస్థితికి తెర మా పూర్వీకులు, మేం పూరి గుడిసెల్లోనే పుట్టాం. అక్కడే పెరిగాం. తరతరాలుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాం. మా పిల్లల సగం జీవితం కూడా వాటిల్లోనే గడిచింది. సీఎం జగన్ మా కోసమే ఇళ్ల పథకం తెచ్చినట్లున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. మాతో పాటు మా ఇద్దరు బిడ్డలకు వేర్వేరుగా మూడు ఇళ్లు వచ్చాయి. – తుమ్మ రాముడు, లక్ష్మి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు పక్కా ఇల్లు.. పెన్షన్ నా వయసు 60 పైనే ఉంటుంది. ఇన్నేళ్లలో నాకు, నా పిల్లలకు ఓ చిరునామా అంటూ లేదు. సీఎం జగన్ మాలాంటి వాళ్ల గోడును ఆలకించి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఇవాళ మాకు పక్కా ఇల్లు, శాశ్వత చిరునామా ఉంది. – ఇళ్ల సాంమ్రాజ్యం, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు భావి తరానికి విలువైన స్థిరాస్తి పూరిపాకల్లో బతికిన మాకు ఇది కొత్త జీవితమే. మురికి కుంటల్లో మగ్గిపోతున్న మా తలరాతలను సీఎం జగన్ మార్చారు. పెద్దల నుంచి మాకు ఎటువంటి ఆస్తులు రాలేదు. మా పిల్లలకు విలువైన ఈ ఇంటిని ఆస్తిగా అందిస్తాం. – కలగంటు జ్యోతి, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు -
జగనన్న కాలనీల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు
-
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్సేల్ మెడికల్ షాపులో సేల్స్మెన్గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
మిలమిల.. జగనన్న కాలనీ ఇలా..
పేదలందరికీ పక్కా ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు వద్ద 88 ఎకరాల విస్తీర్ణంలోని జగనన్న కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 3 వేల గృహాల నిర్మాణాలు వివిధ దశలలో ఉండగా.. ప్రభుత్వం రూ.3 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ట్రాన్స్ఫార్మర్లు పెట్టి.. వీధి లైట్లు ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతమంతా జిగేల్మంటూ మెరిసిపోతోంది. – మార్కాపురం (ప్రకాశం జిల్లా) -
చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8,485 లేఅవుట్లలో విద్యుత్ సర్వే పూర్తి ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. 1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వసతులపై ప్రత్యేక దృష్టి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ మురారి గ్రామంలోని వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది -
విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రత్యామ్నాయ స్థలాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి. గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు కొత్తడ్రామా’
తాడేపల్లి: ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు కొత్తడ్రామాకు తెరలేపారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చచ్చిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దానిలో భాగమే ముందస్తు ఎన్నికల డ్రామా అని మంత్రి విమర్శించారు. చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనించాలని, రాష్ట్రంలో టైమ్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు మంత్రి. ‘31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ఇళ్లు నిర్మించారు. రామోజీ దిగజారి తప్పుడు రాతలు రాస్తున్నారు. 24 మార్చిలోపు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు. -
వైయస్సార్ జగనన్న కాలనీ గృహ లబ్ధిదారులతో కొడాలి నాని ,జోగి రమేష్
-
స్వగృహప్రాప్తిరస్తు.. నిర్మాణం శరవేగం
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో.. జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్సీసీ ప్లి్లంత్ బీమ్తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్మెంట్, బేస్మెంట్ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు. యంత్రాల వినియోగం కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్కు డిగ్గర్ను అమర్చి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్కు లిఫ్ట్ మెషీన్ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులతో ఒప్పందం ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం. –ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం భీమవరంలో 3 వేల ఇళ్లు భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం. – పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం ఇళ్ల నిర్మాణం ఇలా.. జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు. నిర్మాణానికి రూ.3.30 లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే కేవలం వారు తలదాచుకోవడానికి గూడు కల్పించడమే కాదు... సమాజంలో సగౌరవంగా తలెత్తుకు బతికే ఆత్మవిశ్వాసాన్ని కూడా కల్పించడమే. అందుకే సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బల హీన వర్గాలకు ఇంటిస్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. ఫలితంగా 31 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా... ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. పట్టణాలుగా రూపు దిద్దుకోనున్న 17 వేల ‘జగనన్న కాలనీ’లలో ఇళ్ల ఖరీదు మనం చూస్తుండగానే రెట్టింపు కావడం తథ్యం. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగే సరికి... సమాజంలో గణనీయమైన మార్పును మనం చూస్తాం. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న’ కాలనీలు సగర్వంగా తలెత్తుకుని నిలబడతాయి. పేదల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవ సూచీలుగా నిలిచే జగనన్న కాలనీలు... మహిళా సాధికారతకు శాశ్వత చిరునామా కానున్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ప్రభుత్వం ఇవ్వడం ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనం. స్త్రీ ఆలోచనకు అనుగుణంగా నడిస్తే ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడతాయి. బాగుపడ్డ కుటుంబాల సమాహా రంగా జగనన్న కాలనీలు రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు వైఎస్సార్ జగనన్న కాలనీవాసి కానున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటారనుకున్నా.. కోటీ పాతిక లక్షల మంది ఈ కాలనీల్లో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు మందికి ఆవాసం కల్పించే కాలనీలకు సకల సౌకర్యాల కల్పన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లలో కూడా కల్పించలేనన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞం ఇది. పేదలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేయడానికి రంగం సిద్ధమవు తున్న తరుణంలో... వాస్తవాలు గ్రహించకుండా, రాజకీయాల కోసం పేదల ఇళ్ల నిర్మాణాన్ని వాడుకోవడం సమంజసం కాదని పవన్ కల్యాణ్ గ్రహించాలి. ఆత్మ గౌరవంతో జీవించడానికి తొలి అడుగు పడుతున్న సమయంలో పేదల ఆత్మవిశ్వాసాన్ని రాజకీయాల కోసం దెబ్బతీస్తే భవిష్యత్ తరం ఆయన్ని క్షమించదు. ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంట్తో నిర్మితమైన ఓ కట్టడంగా మాత్రమే కాకుండా... పేదల జీవితంగా పవన్ గుర్తించాలి. నిరుపేదల జీవితాలను రాజకీయం చేయడం వల్ల నష్టపోయేది పేదలే కాదు... పవన్ కూడా. నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఆలోచన ఆయ నకు ఉంటే... బడుగుల జీవితాలు బాగుపడుతున్న తీరును అభినందించాలి. పేదల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని వినయంగా మనవి చేస్తున్నా. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణ శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే; పామర్రు, కృష్ణా జిల్లా -
Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా?
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని తేలింది. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వగా అందుకోసం 71,811 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూమి పోగా 25,374 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. అందుకోసం సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. అలాంటప్పుడు ఖర్చు చేసిందే రూ.11 వేల కోట్లయితే ఇక రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడటం ఎలా సాధ్యం? రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షలు, రూ.4 లక్షలకు కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నేతలు రూ.20 లక్షలు, రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలోనూ నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే జగనన్న కాలనీల కోసం భూ సేకరణ జరిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బేసిక్ వాల్యూ రిజిస్టర్లో నిర్దేశించిన విలువ ప్రకారమే విక్రయాలు, కొనుగోళ్లు జరిగాయి. దీనికంటే బహిరంగ మార్కెట్లో రేటు ఎక్కువగా ఉంటే కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్తారు. రిజిస్ట్రేషన్ విలువ కన్నా రూరల్లో రెండున్నర రెట్లు, అర్బన్లో రెట్టింపు విలువను అధికంగా చెల్లిస్తారు. అప్పటికీ రైతులు సంతృప్తి చెందకుంటే కలెక్టర్లు జిల్లా కమిటీలకు ఆ కేసులను అప్పగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో బేసిక్ వాల్యూ రిజిస్ట్రేషన్ కన్నా అధిక ధరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ధరను, డాక్యుమెంట్లలో పేర్కొన్న విలువను పరిగణలోకి తీసుకుంటారు. ఇదంతా కేంద్రం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే అనుసరిస్తారు. ఆ డాక్యుమెంట్లో పేర్కొన్న సేల్ వాల్యూను పరిగణలోకి తీసుకుని హైవేలు, ఇతర కమర్షియల్ స్థలాలు, మేజర్ ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న స్థలాల రైతులతో సంప్రదింపులు జరిపి మరో 10 నుంచి 20 శాతం ధర పెంచుతారు. అప్పటికీ రైతులు సంతృప్తి చెందకపోతే ఇలాంటి కేసులు రాష్ట్ర కమిటీలకు వెళతాయి. ధర ఖరారైన తర్వాత నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి సీఎంఎఫ్ఎస్ నుంచి డబ్బులు జమ అవుతాయి. ఇందులో ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. భూ సేకరణ కోసం కలెక్టర్లు రెండు ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రైతులతో మాట్లాడిన తర్వాతే డిక్లరేషన్ చేసి అవార్డును ఎంక్వైరీ చేస్తారు. అనంతరం ఫైనల్ అవార్డును డిక్లేర్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఇంత పారదర్శకంగా భూసేకరణ జరిపి కాలనీలను నిర్మిస్తుంటే అందులో అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంది? -
ఈ ఆనందం వెలకట్టలేనిది!
(నానాజీ అంకంరెడ్డి), సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ జగనన్న నగర్ (టిడ్కో)లో వందల కుటుంబాల వారు తమ సొంతింటి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్మించిన 1,728 టిడ్కో ఇళ్లల్లో దాదాపు 400 మంది ఉంటున్నారు. డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉండడంతో మిగిలిన వాళ్లు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఇళ్లు పొందిన వారి పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా సోమవారం టిడ్కో ప్రాంగణంలోని తమ ఫ్లాట్లలో కలియదిరుగుతూ గదుల్లోని గోడలను తడిమి చూసుకుని ఆనందంగా గడిపారు. విశాలమైన 60, 40 అడుగుల రోడ్లు.. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, ప్రతిబ్లాక్కు 20 అడుల సెట్బ్యాక్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 0.8 ఎంఎల్డీ సామర్థ్యమున్న ఎస్టీపీతో చక్కటి ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. సిరామిక్ టైల్స్తో ప్రతి గదినీ ముచ్చటగా తీర్చిదిద్దారు. ‘ఇలాంటి చోట ఇంతమంచి ఇల్లు మా జీవితంలో కట్టుకోలేం’ అని లబ్ధిదారులు అంటున్నారంటే వారెంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దగ్గర్లోనే పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మంచిగా వైద్యం చేస్తున్నారంటూ స్థానిక మహిళ జ్యోతి చెప్పారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం సిద్ధమవుతోంది. అందరికీ ఉపయోపడేలా పార్కును కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలో 88 స్థానిక సంస్థల్లో నిర్మిస్తున్న 163 జీ+3 టిడ్కో అపార్ట్మెంట్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పచ్చదనం కోసం త్వరలో మొక్కలు విశాలమైన ఈ ఇళ్ల ప్రాంగణంలోని ప్రతి అపార్ట్మెంట్ సెట్బ్యాక్లోను పళ్ల మొక్కలు, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. నివాసితుల అవసరాలకు అనుగుణంగా దుకాణాల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ జగనన్న నగరాల నిర్వహణకు సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లల్లో ఇన్ని వసతులు ఉంటాయని ఊహించలేదని, ఇక్కడి నిర్మాణాలు చూశాక జగనన్న ప్రభుత్వం తమకెంత మేలుచేసిందో తెలిసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. ‘జగనన్న మాకు సొంతిల్లు ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు అందులో ఆనందంగా అడుగుపెట్టాం. బయటి వారు ఎవరో వచ్చి మా ఆనందాన్ని నాశనం చేయాలని చూస్తే ఎలా సహిస్తాం!’ అంటూ గుంటి రాజలక్ష్మి (బి–6 బ్లాక్) అన్నారు. చిన్న రేకుల షెడ్డులో ఉండేవాళ్లం తెనాలి రోడ్డులోని రేకుల షెడ్డులో ఉండేవాళ్లం. చిన్నపాటి వర్షానికి కారిపోయేది. మా నాన్న ఎలక్ట్రీషియన్గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. మాకు ఇక్కడ బి–21 బ్లాక్లో ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నాం. దగ్గర్లోనే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చాలా ఆనందంగా ఉంది. – ఎండీ యాకూబ్ బేగ్, 8వ తరగతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా అమ్మ షాపులోను, నాన్న టైలర్గాను పనిచేస్తారు. చిన్న గది, ఇంటికి ఎవరొచ్చినా ఉండేందుకు అవకాశం ఉండేదికాదు. నా స్నేహితుల సొంతిళ్లను చూసినప్పుడు అలాంటి ఇల్లు మేం కొనుక్కోగలమా అని అనిపించేంది. జగన్నన పుణ్యమా అని ఇప్పుడు మాకూ ఇల్లు వచ్చింది. – గుమ్మడి జ్యోతిక, ఇంటర్ సెకండియర్ మాటల్లో చెప్పలేని ఆనందం ప్రైవేటు ఆస్పత్రిలో క్లర్క్గా పనిచేసే నేను సొంతిల్లు సంపాదించడం అసాధ్యం. చిన్న గదిలో అద్దెకుండేవారం. బంధువులొస్తే ఉండే అవకాశంలేదు. ఇప్పుడు అన్ని వసతులతో ఇల్లు ఇచ్చారు. మా అబ్బాయి ఎంతో మురిసిపోతున్నాడు. జగనన్న పుణ్మమాని అద్దె ఇంటి కష్టాలు తప్పాయి. – షేక్ పర్హీన్, ప్రైవేట్ ఉద్యోగి చిత్రంలో కనిపిస్తున్నామె పేరు షేక్ షహీనా. మంగళగిరి ఇస్లాంపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఈమె తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సొంతిల్లు లేదు. ఇప్పుడు మంగళగిరిలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న నగర్లోని బి–16 బ్లాక్లో ఫ్లాట్ పొందారు. ఇద్దరు పిల్లలతో సరైన ఇల్లులేక ఏడ్చిన సందర్భాలను ఈమె గుర్తుచేసుకున్నారు. ‘నా భర్త నిస్సార్ చెప్పుల దుకాణంలో పనిచేస్తారు. అరకొర జీతం. బంధువులు రాకూడదని షరతు. దీంతో ఎన్ని ఇళ్లు మారానో అల్లాకే తెలుసు. ఇప్పుడు నా సొంతిట్లో ఉంటున్నాను. ఇదంతా జగనన్న చలవే’ అని చెమర్చిన కళ్లతో చెప్పారు. ఇక షహీనా తల్లి ఫైజాన్ మాట్లాడుతూ.. ‘అద్దె ఇంట్లో నీరు ఎక్కువ వాడుతున్నారని తిట్టేవారు. దాంతో మనవలను చూడాలన్న ఆశ ఉన్నా వెళ్లడానికి ఉండేది కాదు. ఇప్పుడు నా బిడ్డకు జగన్బాబు ఇల్లిచ్చారు. నేను ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చు. ఆయన మా పాలిట అల్లాహ్’.. అన్నప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. – ఈ తల్లీ బిడ్డల ఆనంద బాష్పాలకు ఖరీదుకట్టే షరాబు ఉన్నాడా? నేను స్వేచ్ఛగా ఆడుకోవచ్చు.. ఇక్కడ చిత్రంలోని తల్లి జె.రాజ్యలక్ష్మితో కనిపిస్తున్న పిల్లాడి పేరు మోక్షజ్ఞ. ఏడో తరగతి. వీరు గతంలో చిన్న గదిలో అద్దెకుండేవారు. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తల్లి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు వీరికి టిడ్కో ప్రాజెక్టులో ఏ–7 బ్లాక్లో ఇల్లిచ్చారు. దీనిపై మోక్షజ్ఞ స్పందిస్తూ.. ‘ఇంతకుముందు ఆడుకునేందుకు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడిక్కడ ప్లేగ్రౌండ్ ఉంది. పార్కు కూడా కడతారట’.. అన్నప్పుడు బాబు కళ్లల్లో కనిపించిన మెరుపు వెలకట్టలేం. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘జగనన్న వచ్చాక నాకుంటూ సొంతిల్లు వచ్చింది’ అని చెప్పింది. – ఈ తల్లీకొడుకుల్లో సంతోషం, ధీమా కనిపించాయి. ఇరుకు గది నుంచి విశాల ప్రపంచానికి.. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కరిష్మా. నాలుగో తరగతి చదువుతోంది. నాన్నలేని ఈ బిడ్డకు ఓ తమ్ముడు ఉన్నాడు. వంట పనిచేసి తల్లి తెచ్చే కొద్దిపాటి సంపాదనతో మంగళగిరి ఐదో వార్డులోని చిన్నరేకుల షెడ్డులో వీరుంటున్నారు. ఇక్కడ బి–37లో ఫ్లాట్ ఇచ్చారు. ఈ చిన్నారిని పలకరించినప్పుడు ‘మేం అద్దెకుండే రేకుల ఇల్లు వర్షం వస్తే కారిపోయేది. ఇక్కడ ఇల్లు వచ్చిందని తెలియగానే అమ్మ ఎంతో సంతోషపడింది. అమ్మను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’. – ఆ చిన్నారి కళ్లల్లో వెలకట్టలేని వెలుగు కనిపించింది. మా పిల్లలకు గర్వంగా చెబుతున్నా.. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షేక్ జానీది కష్టాల కథే. పదుల సంఖ్యలో ఇళ్లు కట్టిన ఈ మేస్త్రీకి నిన్నా మొన్నటిదాకా సొంత గూడులేదు. ‘మనం సొంతిల్లు కట్టుకోలేమా నాన్నా.. అని నా పిల్లలు అడిగినప్పుడు మనసు చివుక్కుమనేది. ఎన్నో ఇళ్లు కట్టిన నేను నా పిల్లలకు సమాధానం చెప్పలేకపోయేవాడిని. జగనన్న చలవవల్ల ఇప్పుడు నాకు పది లక్షల విలువైన ఇల్లు (బి–5)వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా జగన్ బాబు పుణ్యమే’ అంటున్నప్పుడు మేస్త్రీ జానీ కళ్లలో కృతజ్ఞత కనిపించింది. -
జనసేన కార్యకర్తలకు మరోసారి గట్టి షాక్..
సాక్షి, అనకాపల్లి: వరుసగా జనసేన శ్రేణులకు చుక్కెదురైంది. మొన్న ఇప్పటం, నిన్న పెడన, తాజాగా గోలుగొండలో జనసేన కార్యకర్తలకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నేతలకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. జనసేన కార్యకర్తలపై మహిళలు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తెల్లముఖం వేశారు. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గోలుగొండలో జగనన్న కాలనీల్లోకి జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో, జనసేన శ్రేణులు బిక్కమొహంతో వెనుదిరిగారు. కాగా, జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలు.. అక్కడ అవినీతి జరిగిందంటూ ఓవరాక్షన్ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు డబ్బులు సరిపోలేదని.. ప్రభుత్వాన్ని డబ్బులు అడగాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు.. మీరు(జనసేన శ్రేణులు) ఇక్కడికి వచ్చి ఎలాంటి రాజకీయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న.. ఎలాంటి అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు ఇచ్చారు. దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. మీరు వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు అడగాలని మాకు చెప్పే పనిలేదు. మాకు ఏం కావాలో జగనన్నకు తెలుసు. జగనన్న మాకు అన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము ఒక్క రూపాయి కూడా అడగము. కావాలంటే మీరే మాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో బిక్కమొహం వచ్చిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెనుదిగారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలపై ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణను ఓర్పలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు. -
శాటిలైట్ సిటీలుగా వైఎస్సార్ జగనన్న నగరాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు కొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని అనువైన ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 88 యూఎల్బీలలో పేదల కోసం 2,62,212 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 163 ప్రాంతాల్లో ఉన్న వీటికి ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేశారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్న ఈ ఇళ్లు శాటిలైట్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 40 వేలకు పైగా యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్ని వసతులతో ఆధునిక ఇళ్లు చక్కటి రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, ఎస్టీపీలు వంటి సకల వసతులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుండటం గమనార్హం. ప్రాంతాన్ని బట్టి ఈ గ్రూప్ హౌస్లు వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండటం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. త్వరలో ఈ ప్రాంతాలు శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, గత నెలలో కొందరు యజమానులు వారికి కేటాయించి ఇళ్లలో చేరగా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మిగిలినవారు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, సరఫరా వంటి పనుల కోసం మునిసిపాలిటీల్లోని ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీపీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని ఇళ్ల అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇక నగరాల పరిధి దాటి పంచాయతీల్లో మరో 38 చోట్ల టిడ్కో ఇళ్లు నిర్మించగా, వాటి అవసరాలను తీర్చేందుకు మునిసిపల్ శాఖ పంచాయతీ విభాగంతో సంప్రదింపులు చేపట్టింది. ఇవన్నీ కొద్దిరోజుల్లో కొలిక్కి రావడంతో పాటు ఆయా కొత్త టిడ్కో పట్టణాల అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
గుంకలాంలో పారని పాచిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విజయనగరంలో ఆదివారం జరిపిన పర్యటన పవన్కళ్యాణ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్వయంగా జగనన్న కాలనీని చూసి అక్కడి లబ్ధిదారులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాలని ఆయన వేసిన పాచిక పారలేదు. ‘జగనన్న ఇళ్లు–పేదలకు కన్నీళ్లు’ నినాదంతో ఆ కాలనీలపై సోషల్ ఆడిట్ చేస్తామంటూ విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న కాలనీకి మధ్యాహ్నం 1.30కు వచ్చిన పవన్కు అక్కడి లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం.. సోషల్ ఆడిట్కు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆయన కేవలం రోడ్షోకే పరిమితమయ్యారు. ఫలితంగా దాదాపు రెండు గంటలపాటు విజయనగరం ప్రధాన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. చివరకు గుంకలాంలో జగనన్న కాలనీకి చేరుకున్నా, అక్కడ లబ్ధిదారులెవరూ లేకపోవడంతో ఒకటీ రెండు ఇళ్లను మాత్రమే పవన్ మొక్కుబడిగా పరిశీలించారు. తర్వాత కొద్దిమంది పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. యువతను తప్పుదారి పట్టించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘గడపగడపకు వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను, పనిచేయని నేతలను చొక్కా పట్టుకుని నిలదీయండి. వాళ్లకూ మనకూ సెపరేటు రక్తం ఏమైనా ఉంటుందా? లక్షల మందిని అరెస్టు చేయగలరా? స్వచ్ఛందంగా జైళ్లను నింపేద్దాం. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేసి జనసేన జెండాను స్థాపిద్దాం. గుంకలాం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు స్థలాలిచ్చేందుకు రైతుల దగ్గర తక్కువ ధరకే కొనుగోలు చేసి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చూపించి రూ.పది వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకూ దోచేశారు. దీనిపై మోదీకి స్వయంగా నివేదిక అందజేస్తా. మోదీపై అపార గౌరవం ఉన్నవాడిని. నా మీద కేసులు పెట్టినా భయపడను. నేను చాలా బలంగా ఉంటాను. ఓడిపోయిన వాణ్ణి.. గాయపడ్డవాణ్ణి. దెబ్బతిన్న పులిలా నిలబడ్డాను. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తాను. ఓట్లు రాకపోయినా నామినేషన్ వేస్తాం. నామినేషన్లు వేయకుండా ఆపినా.. బెదిరించినా తాటతీస్తాం. పరిశ్రమలు ఎందుకు రావడంలేదని అడగండి. పిచ్చిపిచ్చి సమాధానాలు చెబితే తిరగబడండి. 2024కు వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన ప్రభుత్వం రావాలి. బొత్స జేబులో డబ్బులు ఏమీ ఇవ్వడంలేదు. మనం కట్టిన పన్నుల డబ్బులతో పథకాలు పెడుతున్నారు.’ అని పవన్ అన్నారు. అనంతరం 3.30 గంటలకు పవన్ విశాఖకు బయల్దేరారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో 4.20 గంటలకు హైదరాబాద్ వెళ్లారు. -
మా కాలనీల్లోకి రావొద్దు.. మా ఇళ్లు మాకు కాకుండా చెయ్యొద్దు
మంగళగిరి/కశింకోట/పెంటపాడు: వైఎస్సార్ జగనన్న కాలనీలలో పర్యటించి రాజకీయాలు చేయాలనుకున్న జనసేన నాయకులకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. తమ నివాసాలలో ఎవరు పర్యటించాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. ఇంకోసారి తమ కాలనీల్లోకి వస్తే మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతామని ముక్తకంఠంతో లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి ఇలా వ్యతిరేకత వస్తుండడంతో జనసేన నేతలు చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. రాజకీయాల కోసం రావొద్దు.. వెళ్లిపోండి గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీ (టిడ్కో) ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. వీరి పర్యటనను ముందుగానే తెలుసుకున్న లబ్ధిదారులు సమావేశమై జనసేన నాయకులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన లబ్ధిదారులు అనుకున్నట్లుగానే వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లకు అన్ని వసతులు కల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దారని.. గృహప్రవేశాలు కూడా చేసుకున్నామని చెప్పారు. అసలు జనసేన నాయకులు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజకీయాల కోసం ఎవరూ తమ దగ్గరకు రావాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు తాము సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే వచ్చామని చెప్పారు. అంతేకాక.. ప్రజాస్వామ్యంలో తమకు ఇలా వచ్చే హక్కు ఉందని కొందరు జనసేన కార్యకర్తలు లబ్ధిదారులైన మహిళలతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లబ్ధిదారులు సమస్యలుంటే తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మీరు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. అలాగే, రాజకీయం చేసి మా పొట్ట కొట్టొద్దని కోరారు. దీంతో ఏంచేయాలో పాలుపోని జనసేన నేతలు లబ్ధిదారులకు దండం పెట్టి వెనుదిరిగారు. అనంతరం.. సి–3 బ్లాక్లో ఎఫ్ఎఫ్–8 ప్లాట్లో నివాసముంటున్న జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇది గమనించిన లబ్ధిదారులు మళ్లీ అక్కడకు చేరుకుని అసలు ఏ ఇంటినీ పరిశీలించాల్సిన అవసరంలేదని వెంటనే వెళ్లిపోవాలని కోరడంతో మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో పట్టణ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకోవడంతో చేసేదిలేక జనసేన శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం ఏ పార్టీ పర్యటించినా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల కోసం జగనన్న ఇళ్ల వద్దకు వస్తే మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. సంతృప్తికరంగానే ఉంటున్నాం.. అలాగే, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట, తేగాడ గ్రామాల వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న గృహ నిర్మాణ లేఅవుట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సమస్యలు చెప్పమని అడిగారు. అయితే, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయడంతో సంతృప్తికరంగా నిర్మించుకుంటున్నామని వారు బదులిచ్చారు. తేగాడ లేఅవుట్లో కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుందని బదులివ్వడంతో తాము ఆశించిన ఫలితం రాలేదంటూ జనసేన శ్రేణులు నిరాశతో వెనుదిరిగారు. గోబ్యాక్ నినాదాలతో తోకముడిచిన జనసేన ‘జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్మల్ని సంప్రదించకుండా కాలనీలోకి రావడాన్ని సహించం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన నేతలు వచ్చి ఇక్కడ కిరికిరీలు పెట్టొద్దు.. జగనన్న ప్రభుత్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు’.. అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన శ్రేణులకు అడ్డుతగిలారు. జనసేన గోబ్యాక్ అంటూ మహిళలు నినదించారు. తమకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. దీంతో జనసేన శ్రేణులు తమ జెండాలను ముడిచి వెనుదిరిగారు. -
మా ఇళ్ల వద్ద ఫొటోలు ఎలా దిగుతారు?: జనసేన నాయకులకు షాక్
పెడన/రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదల పక్షాన నిలబడి అర్హులకు స్థలాలిచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ జనసేన నేతలను లబ్ధిదారులు నిలదీశారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని జనసేన నేతలు రామ్సుధీర్, రమాదేవి తదితరులు శనివారం ఉదయం పట్టణ శివారులోని పల్లోటి లేఅవుట్–2 వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. అదే సమయంలో అక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్న పలువురు లబ్ధిదారులు ఫొటోలు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఇక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు, కౌన్సిలర్లకు మాట్లాడే పనిలేదని, మీకు ఇక్కడ ఏం సంబంధం అంటూ నల్లా నాగలక్ష్మి, షాహినాబేగంలను ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరేం మాట్లాడుతున్నారు.. మేం ఎవరని ప్రశ్నిస్తున్నారేంటి? అసలు మీరెవరు? మా ఇళ్ల దగ్గరకు ఎందుకొచ్చారు? ఫొటోలు ఎందుకు దిగుతున్నారు? లబ్ధిదారులైన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి’ అంటూ ఎదురుతిరిగి గట్టిగా నిలదీశారు. దీంతో.. సమస్యలుంటే చెప్పాలని జనసేన నేతలు కోరారు. సమస్యలేమి లేవని లబ్ధిదారులు గట్టిగా బదులివ్వగా చేసేదిలేక వారు వెనుదిరిగారు. అనంతరం ఒకటో వార్డులోని పైడమ్మ లేఅవుట్ వద్దకు కూడా వారు వెళ్లి తాపీ పనివారితో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. రాజమహేంద్రవరంలో ఇలా.. మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు టిడ్కో గృహ సముదాయం వద్ద కూడా జనసేన నేతలు ఓవరాక్షన్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు శనివారం ఉదయం టిడ్కో గృహ సముదాయంలోని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలను ఉద్దేశించి జనసేన నేతలు ‘మిమ్మల్ని ఇప్పుడే పిలిచారా అంటే.. వెంటనే ఆ మహిళలు తమకు ఆగన్టులోనే ఇళ్లు అందజేశారని, కానీ.. తామే ఇంకా దిగలేద’న్నారు. అయినా ఇళ్లను ఎందుకు అప్పగించలేదంటూ అధికారులతో జనసేన నేతలు వాదనకు దిగారు. అక్కడ కొద్దిసేపు నినాదాలుచేసి సీ–బ్లాకు వద్దకు వచ్చారు. అక్కడ ఆ పార్టీ అభిమాని లలితను ఆమె ఫ్లాట్ కాని జీఎఫ్8 వద్ద నిలబెట్టి సమస్యలున్నాయంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు చెప్పించారు. తీరా చూస్తే ఇంటి ప్లాన్లోనే లేని బాల్కని కావాలని ఆమె సమస్యగా పేర్కొంది. ఆ తర్వాత.. ట్విట్టర్లో పెట్టేందుకు అంటూ మళ్లీ అనుశ్రీ సత్యనారాయణ అక్కడకొచ్చి లలితతో మళ్లీ అదే సమస్య చెప్పించి షూట్ చేశారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తున్నారు వారు స్థలాలివ్వరు. ఇచ్చిన వాటిని సక్రమంగా చూపడంలేదు. పక్కనే చెరువులను చూపి ఫొటోలు దిగుతూ చెరువుల్లో స్థలాలు ఇచ్చారంటూ టీవీలకు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. – నల్లా నాగలక్ష్మీ, లబ్ధిదారురాలు, పెడన వారికేంటి సంబంధం? మా స్థలాల వద్దకు వచ్చి మీకు సంబంధంలేదని ఎలా అంటారు? పార్టీలకు అతీతంగా అందరికి ఇళ్ల స్థలాలిస్తే వీరికి వచ్చిన బాధ ఏమిటో? మరీ ఇంత అన్యాయంగా ఫొటోలు దిగి టీవీలకు ఫోజులిస్తుంటే వారిని ఏమనాలి? – షాహినాబేగం, లబ్ధిదారురాలు, పెడన -
YSR Jagananna Colonies: గూడు కట్టిన అభిమానం
అద్దె కట్టే స్థోమత లేదు..సొంతిళ్లు కట్టించారు నా పేరు లక్ష్మీ దేవి, మాది కడప నగరం నానాపల్లె. నెలకు రూ. 5వేలు అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలను రెక్కల కష్టంపై పోషించుకుంటూ ఉండేవాళ్లుం. మాకు సొంతిళ్లు సమకూరుతుందా అని అనుకునే వాళ్లం. జగనన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో ఇళ్లు కట్టుకొని అనందంగా ఉన్నాం. జగనన్న మేలు మరిచిపోలేం నాపేరు రేష్మా. మాది కడపలోని బిస్మిలా నగర్. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు.. భారమైనా ఇంటికి అద్దె కట్టుకుంటూ వచ్చాం. జగనన్న పుణ్యమా అని లక్షల విలువ చేసే స్థలం ఇచ్చారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. ఎస్ఆర్జీఈఎస్ ద్వారా రూ.30 వేలు, డ్వాక్రా సంఘం నుంచి రూ. లక్ష వడ్డీ రాయితీపై రుణం ఇచ్చారు. ఈ నగదుతో ఇళ్లు కట్టుకున్నాం. దాదాపు రూ. 10 లక్షల విలువైన ఇంటికి యజమానిని చేసిన జగనన్న మేలు మరచిపోలేం. జగననన కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయి నాపేరు అయేషా. మాది కడప నగరం, బిస్మిల్లా నగర్ .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి అదుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పటికీ మరచిపోలేం. అన్ని రకాల సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అదుకున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చిరు సంపాదనతో అద్దె చెల్లిస్తూ అవస్థలు పడే పేద వాడి గుండెలో సంబరం గూడు కట్టుకుంది. వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేశారు.జిల్లాలోని 529 జగనన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం, విద్యుత్ లైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల సొంతింటి కలను సాకారంచేసేలా కృషి చేస్తోంది.దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 529 జగనన్న కాలనీల్లో 1,18,605 మందికి ఇంటి స్థలాలు జిల్లాలో ఏర్పాటైన 529 జగనన్న కాలనీల్లో దాదాపు 1,18,605 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 68,808 గృహాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా, 37,625 బేస్మెంట్ దశలో ఉన్నాయి. 25,625 గృహాలు బేస్మెంట్ పూర్తి చేసుకోగా,రూఫ్ లెవెల్లో 2789, రూఫ్ లెవెల్ పూర్తయినవి 2094 ఉన్నాయి. 595 గృహాలు పూర్తయ్యాయి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వారిలో మొత్తం లబ్ధిదారులు 30,210 మంది ఉండగా, 7586 గృహాలు బేస్మెంట్లోపు ఉన్నాయి. 4676 బేస్మెంట్ పూర్తి చేసుకున్నాయి. రూఫ్ లెవెల్లో 3010, రూఫ్ పూర్తయిన గృహాలు 5354 ఉన్నాయి. అలాగే 6129 గృహాలు పూర్తయ్యాయి. కొత్త ఊర్లను తలపిస్తున్న గృహ సముదాయాలు జగనన్నకాలనీలోని గృహసముదాయాలు కొత్త ఊర్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలాలు అందజేయడంతో వాటిని నిర్మించుకునే పనిలో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం విలువైన స్థలాలను అందజేయడంతో ప్రజలు ఆనందంగా తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. పేదల కళ్లలో కనిపిస్తున్న అనందం ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో బాడుగకు ఉంటూ కాలాన్ని వెళ్లదీస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు ఉచితంతోపాటు స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ. 30 వేలు, డ్వాక్రా రుణం కింద మరో రూ. లక్ష రుణాన్ని వడ్డీ రాయితీతో మంజూరు చేశారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన రీతిలో ఇంటి నిర్మించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
AP: గృహ యజ్ఞం.. పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్క చెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందచేస్తోంది. ఇది ఎంత పెద్ద యజ్ఞమంటే.. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతోపాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ సగటున కనీసం రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను సృష్టిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను కొనసాగించి పనులు కల్పించడం ద్వారా కోవిడ్ సమయంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. డిసెంబర్కు ఐదు లక్షల ఇళ్లు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. దశాబ్దాలుగా గూడు లేక అవస్థలు పడుతున్న లక్షల మందికి ఊరటనిస్తోంది. పథకం కింద రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 17.24 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, టిడ్కో ఇళ్లు 1.5 లక్షలు ఈ గడువులోగా పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు సమకూరుస్తోంది. మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, దుస్తులు లాంటి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు నిలువ నీడ లేదు. ఆ నిరుపేదల గోడును 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విన్నారు. నేను ఉన్నానని హామీ ఇచ్చారు. మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ద్వారా ఏకంగా 30.25 లక్షల మంది నిరుపేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తూ ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీన్ని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా పక్కా ఇళ్లను నిర్మించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ మహాయజ్ఞం పూర్తయితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా కోర్టులకెక్కి పలు అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రభుత్వ దృఢ సంకల్పం ముందు ఆ పాచికలు పారలేదు. దీంతో తాజాగా దత్తపుత్రుడిని రంగంలోకి దింపి డిజిటల్ క్యాంపెయిన్ పేరిట పేదల ఇళ్లపై బురద జల్లే మరో కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది. దర్జాగా ఉంటున్నాం నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. ఇద్దరు పిల్లలు. సొంతిల్లు లేదు. అద్దె కట్టే స్తోమత లేక బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లు పైకప్పు సరిగా లేక వర్షాలు పడినప్పుడు అవస్థలు ఎదుర్కొన్నాం. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి దరఖాస్తుకే స్థలం, ఇంటిని కూడా మంజూరు చేశారు. రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం. – షేక్ ఫాతిమాబీ, ఫణిదం, సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా సదుపాయాలన్నీ కల్పించారు.. సొంతిల్లు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద దరఖాస్తు చేసుకోవడంతో గ్రామం వెలుపల స్థలం కేటాయించారు. ఊరికి దూరంగా ఇవ్వడంతో భయపడ్డాం. ఇంటి నిర్మాణానికి చేయూత ఇవ్వడంతో పాటు కాలనీలో విద్యుత్, తాగు నీరు తదితర సదుపాయాలన్నీ సమకూర్చారు. మా జగనన్న లేఅవుట్లో 400 మందికిపైగా పేదలు ఇళ్లు కట్టుకున్నారు. – పి. దుర్గాదేవి, జేగురుపాడు, కడియం మండలం, తూర్పుగోదావరి రూ.3 లక్షల విలువైన స్థలం జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మాకు రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల యూనిట్కు గానూ ఇప్పటి వరకు రూ.48వేల బిల్లు వచ్చింది. కాలనీలో వసతులు కల్పిస్తున్నారు. – కొల్లి కనకమ్మ, కొత్తమూలకుద్దు, అనకాపల్లి జిల్లా గతంలో ఎన్నడూ చూడలేదు పేదలకు పక్కా ఇళ్ల కోసం సీఎం జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. జగనన్న కాలనీలో నాకు స్థలం కేటాయించారు. నిర్మాణ బిల్లులు కూడా సకాలంలో అందించారు. ఇప్పటికే ఇల్లు పూర్తి కావచ్చింది. జగనన్న ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా లబ్ధి చేకూరుతోంది. కాలనీలో విద్యుత్, రహదారులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా చేపడుతున్నారు. – మండల్ క్రిష్ణ, నగర పంచాయతీ పాలకొండ మూడు దశాబ్దాల కల మూడు దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. సీఎం జగన్ ప్రభుత్వం మా సొంత ఇంటి కలను నెరవేరుస్తోంది. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యింది. రూ.50 వేల వరకు బిల్లు కూడా వచ్చింది. – జంగం అన్నపూర్ణ, మంత్రాలయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మాది పశ్చిమ గోదావరి జిల్లా. 30 ఏళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చాం. మూడు దశాబ్దాలు అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ సొంతింటి కల మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే నెరవేరింది. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది. – కె. భానుమతి, పుట్టపర్తి ఇన్నాళ్లకు కల నెరవేరింది ఉప్పలూరు గ్రామానికి 13 ఏళ్ల క్రితం వచ్చాం. సొంత స్థలం లేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ స్థలం కోసం తిరిగినా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉప్పలూరు లే అవుట్లోనే స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేశాం. ఎన్నో ఏళ్లకు సొంతింటి కల తీరింది. చాలా ఆనందంగా ఉంది. కాలనీలో తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉంది. – పోసిన శివనాగమల్లేశ్వరి, ఉప్పలూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి– రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు (రూ.15 వేల విలువ చేసే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రూ.40 వేల విలువైన సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కన్నా తక్కువకు రాయితీతో సరఫరా చేస్తోంది.) జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాల కల్పన వ్యయం రూ.కోట్లలో నీటి సరఫరా– 4,128 విద్యుత్, ఇంటర్నెట్– 7,989 డ్రైనేజీ, సీవరేజ్– 7,227 రోడ్లు, ఆర్చ్లు– 10,251 పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన – 3,314 ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చు (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకూ) లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు– రూ.6149,10,54,963 నిర్మాణ సామగ్రి– రూ.1629,99,83,047 ఇతర ఖర్చు– రూ. 656,68,14,937 మొత్తం– రూ.8435,78,52,947 రూ.10 లక్షల ఇంటికి యజమాని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తాకాసి దేవీ సత్యనారాయణ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా కనికరించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి అర్జీ పెట్టుకున్నారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. కొద్ది రోజులకే స్థలం మంజూరై ఇంటి పట్టా అందింది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తైంది. రూ.10 లక్షల విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ అందించారని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది. ఫిబ్రవరిలో గృహప్రవేశం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వి.రమాదుర్గ వాలంటీర్ కాగా ఆమె భర్త కార్పెంటర్. ఇద్దరి సంపాదన నెలకు రూ.20 వేల లోపే. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల పైమాటే ఉండటంతో సొంతిల్లు కలేనని రమాదుర్గ వేదనకు గురయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ఆమెకు ఉచితంగా ఇంటి స్థలం అందింది. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందడంతో వేగంగా కొనసాగుతోంది. ఇటీవల స్లాబ్ కూడా వేశారు. ప్రస్తుతం గోడలకు ప్లాస్టింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, ఆ నెలలో మంచి రోజులు ఉన్నందున గృహ ప్రవేశం చేస్తామని రమాదుర్గ చెబుతోంది. ఆమెతో పాటు బుల్లియ్యరేవులోని వైఎస్సార్ జగనన్న లేఅవుట్లో పేదలకు ప్రభుత్వం 170 ఇళ్లను మంజూరు చేసింది. 60 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కాగా మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయి. -
కొల్లేరు గ్రామాల్లో సరికొత్త మార్పు..
కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో ఇక్కడి ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని టీడీపీ నాయకులు అభయారణ్యాన్ని అందినకాడికి దోచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలు సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుని కృతజ్ఞత తెలుపుతున్నాయి. భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంగా 5 కాంటూరు వరకు 77,138 ఎకరాలు గుర్తించారు. వీటి పరిధిలో 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరు గ్రామాలన్నీ ఏలూరు జిల్లా గూటికి చేరాయి. కొల్లేరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ పాలన చూసి తమ గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇందుకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నాంది పలికింది. కైకలూరు మండలం శృంగవరప్పాడు, చటాకాయి, పందిరిపల్లిగూడెం, మండవల్లి మండలం కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు గ్రామంలో ఘన స్వాగతం పలికి, ముకుమ్మడిగా వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి కూడా వేలాదిగా కొల్లేరు ప్రజలు హాజరవడం విశేషం. గడప గడపకు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. కొల్లేరు ప్రజలకు మేలు ఇలా.. స్వచ్ఛ కొల్లేరు సాకారంలో భాగంగా ఉప్పుటేరుపై రూ.412 కోట్లతో మూడు రెగ్యులేటర్లు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇదే జరిగితే సముద్రపు ఉప్పునీరుని అరికట్టడంతో పాటు కొల్లేరులో నిత్యం నీరు ఉంటూ చేపల వేటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్పర్సన్గా సైదు గాయత్రీ సంతోషికి అవకాశం కల్పించారు. రూ.4 కోట్లతో కొల్లేరు రీ సర్వేకు సిద్ధం చేశారు. కొల్లేరు కాంటూరు వారిగా సర్వే పూర్తయితే 70 వేల ఎకరాలు మిగులు భూమిగా వెల్లడవుతుంది. ఇక బాహ్యప్రపంచానికి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారధిని రూ.14.70 కోట్లతో చేపట్టారు. కులమతాలకు అతీతంగా పథకాల లబ్ధి పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను కొల్లేరు లంక గ్రామాల్లో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కొల్లేరుకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మోసం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా మరిన్ని మారడానికి సిద్ధంగా ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎమ్మెల్యే కొల్లేరుకు న్యాయం సీఎం జగన్తోనే సాధ్యం కొల్లేరు ప్రాంత ప్రజలకు నిజమైన న్యాయం ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక మహిళగా నాకు రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్పర్సన్గా అవకాశం కల్పించారు. గతంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే మా సామాజికవర్గం అయినా కనీసం గ్రామాలను పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో అన్ని కొల్లేరు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారతాయి. – సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకం ఉంది సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కొల్లేరు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామల్లో అందరికి పథకాలు చేరుతున్నాయి. ఇటీవల కొల్లేరులో వేటకు కొత్త లైసెన్సు ఇచ్చారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించారు. వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నాం. – జయమంగళ తిరుపతి వెంకన్న, సర్పంచ్, కొవ్వాడలంక, మండవల్లి మండలం -
టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేద ప్రజల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల మెరుగైన నిర్వహణకు ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు’ ఏర్పాటు చేయనున్నారు. సొసైటీల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మొత్తం 88 యూఎల్బీల్లో 2,62,212 ఇళ్లను జీ+3 అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 163 ప్రాంతాల్లో ఉన్న వీటిని వైఎస్సార్ జగనన్న నగరాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 11,500 ఇళ్ల వరకు నిర్మిస్తున్నారు. ఇవి అపార్టుమెంట్లే అయినప్పటికీ ఒక్కో ప్రాంగణం చిన్న తరహా పట్టణాన్ని తలపిస్తోంది. దీంతో ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెత్త సేకరణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్వహణ లాంటి పనులను స్థానిక మున్సిపాలిటీలే నిర్వర్తిస్తాయి. అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగిస్తారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మాదిరిగా టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు ఈ తరహా కమిటీల ఏర్పాటు ఇదే తొలిసారి. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లతో పాటు ఆర్జేడీలకు ఏపీ టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ లేఖ పంపారు. కమిటీల విధులపై నివాసితులతో చర్చించి ఈనెల 10లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. గృహ నిర్మాణ రంగంపై ఇటీవల గుజరాత్లో నిర్వహించిన సదస్సుకు హాజరైన టిడ్కో అధికారులు అక్కడ అపార్ట్మెంట్ల నిర్వహణను పరిశీలించి ముసాయిదా సిద్ధం చేశారు. కాగా, అక్టోబరు చివరి నాటికి 40,575 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెరుగ్గా అంతర్గత నిర్వహణ.. కమిటీలు ఉంటే అంతర్గత నిర్వహణ సులభతరమవుతుంది. కారిడార్లు, ప్రాంగణాల నిర్వహణ, మోటార్ల నిర్వహణ లాంటివి ఇళ్ల యజమానులే పర్యవేక్షించేందుకు కమిటీలు ఉంటే మంచిది. ఇవి ఏకరీతిన ఉండాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో 2.62 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున మొత్తం 262 రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటవుతాయి. తద్వారా దేశంలో ఈ తరహా కమిటీలను నియమించిన తొలి రాష్ట్రం ఏపీ అవుతుంది. – చిత్తూరి శ్రీధర్, టిడ్కో ఎండీ -
డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. -
ఇళ్ల నిర్మాణాలకు రోజుకు రూ.23 కోట్ల ఖర్చు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించేందుకు ఆయన బుధవారం కర్నూలు వచ్చారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో పురోగతి చూపితే రోజుకు రూ.50 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 18 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు.