-
పన్నూ హత్యకు కుట్ర: వాషింగ్టన్ రిపోర్టుపై స్పందించిన యూఎస్
న్యూయార్క్: అమెరికాలో జరిగిన ఖలీస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య చేసేందుకు ఓ భారతీయ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికపై అమెరికా స్పందించింది. పన్నూ హత్య కుట్రకు సంబంధించిన ఆరోపణల దర్యాప్తులో తాము నిరంతరం భారత్తో టచ్లో ఉండి, ఈ వ్యవహారంపై పని చేస్తున్నామని అగ్రరాజ్యం అధికార ప్రతినిధి వేదాంత పటేల్ తెలిపారు.‘పన్నూ హత్య కుట్రకు సంబంధించి భారత్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విచారణపై పూర్తి జవాబుదారితనాన్ని ఆశిస్తున్నాం. అమెరికా.. భారత్తో ఈ విషయంలో నిత్యం టచ్లో ఉంటుంది. ఈ కేసులో పురోగతి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మరింత సమాచారం తెలుసుకుంటున్నాం. పలు స్థాయిల్లో అమెరికా ఆందోళనను ప్రత్యేక్షంగా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను ఈ విషయంలో మరింత జోక్యం చేసుకోలేను’ అని వేదాంత పటేల్ తెలిపారు.ఇక.. వాషింగ్టన్ పోస్ట్ వెల్లండించిన నివేదికపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్వర్క్లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ భారత్ విదేశంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ అన్నారు.ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి ప్రమేయం ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్ పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్గా గుర్తించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్ మీడియా రిపోర్డును ఖండించిన భారత్
ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్ యాదవ్ అమెరికాలో గురుపత్వంత్ సింగ్ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్ పోప్ట్ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘వాషింగ్టన్ పోస్ట్ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్, ఉగ్రవాద నెట్వర్క్లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అన్నారు. ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్కు చెందిన నిఖిల్ గుప్తాకు సీసీ-1 అనే పేరు తెలియని అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్పోస్ట్ ఆ అధికారిని విక్రమ్ యాదవ్గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్ 2023 నవంబర్లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
భారత్ టార్గెట్గా చైనా నిఘా బెలూన్లు!
వాషింగ్టన్: నిఘా బెలూన్లతో అగ్రరాజ్యాన్ని హడలెత్తించిన చైనా.. మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుందనే సమాచారం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్తో పాటు జపాన్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్.. ఇలా మరికొన్ని దేశాలపైనా సర్వేయిలెన్స్ బెలూన్లను ప్రయోగించిందని, ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని సేకరించే యత్నం చేసిందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ వార్తా ప్రచురణ సంస్థ ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ నుంచి నిఘా బెలూన్ల ప్రయత్నం కొనసాగిందని.. జపాన్, భారతదేశం, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్తో సహా పలు దేశాల సైనిక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరిగిందని ఆ కథనం పేర్కొంది. ఇందుకు సంబంధించి పలువురు నిఘా అధికారులు, భద్రతా విభాగానికి చెందిన ప్రముఖుల నుంచి అభిప్రాయాలను సేకరించి.. ప్రచురించింది ఆ కథనం. ఈ పరిణామంపై భారత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ పోస్ట్ కథనానికి కొనసాగింపుగా.. అమెరికా భద్రతా అధికారులు భారత్ సహా మిత్ర దేశాలను చైనా నిఘా బెలూన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు తాజాగా యుద్ధ విమానాల ద్వారా చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన విషయాన్ని.. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఆ బెలూన్ల శకలాలను సేకరించిన విషయాన్ని సైతం మిత్ర దేశాలకు నివేదించింది అమెరికా. గత మూడురోజులుగా 40 మిత్ర దేశాలకు చెందిన భద్రతా ప్రతినిధులు, దౌత్యవేత్తలతో పెంటగాన్ అధికారులు ‘చైనా నిఘా బెలూన్ల వ్యవహారం’పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సర్వేయలెన్స్ ఎయిర్షిప్స్గా భావిస్తున్న ఈ బెలూన్లు.. చైనా ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) ద్వారానే ప్రయోగించబడుతున్నాయని, ఐదు ఖండాల్లో వీటి ఉనికి గుర్తించినట్లు అమెరికా భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇది ఇతర దేశాల సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించడేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైనా మాత్రం అవి శాటిలైట్ సంబంధిత ఎయిర్షిప్స్ తప్ప.. నిఘాకు సంబంధించినవి కాదని వాదిస్తోంది. ఈ మేరకు బెలూన్ కూల్చివేతపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. అమెరికా మాత్రం ఈ ఘటనతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయదనే ఆశాభావం వ్యక్తం చేశారు బైడెన్. అలాగే.. పేలిన శకలాలను ఎట్టి పరిస్థితుల్లో చైనాకు అప్పగించబోమని స్పష్టం చేశారు. గత వారం రోజులుగా.. హవాయి, ఫ్లోరిడా, టెక్సాస్, గువాం ప్రాంతాల్లో చైనా బెలూన్లు దర్శనమిచ్చాయి. ఇందులో మూడు ట్రంప్ హయాంలోనే గగనతలంలో విహరించేందుకు అనుమతులు లభించాయని.. అయితే అవి చైనా నిఘా బెలూన్లు అనే విషయం తాజాగానే వెల్లడైందని భద్రతా అధికారుల నివేదిక వివరిస్తోంది. -
ఫేస్బుక్లో అన్ఫాలో కలకలం
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్బుక్ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్ జుకర్బర్గ్కు తిప్పలు తప్పలేదు. జుకర్బర్గ్కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, యూఎస్ఏ టుడే వంటి అమెరికన్ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్ చేశారు. ‘ఫేస్బుక్ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్బర్గ్ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్బుక్ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకిలా జరిగింది ? ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్లు పెట్టారు. ఫేస్బుక్లో బాట్ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్గా మెసేజ్లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్బుక్లో కొత్త ఆల్గారథిమ్ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు. -
ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్లో నిర్వహించిన ఎస్సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్లైన్లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది. మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా పుతిన్లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు. చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్ -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్షా స్పందించాలి పెగసస్తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
కిమ్ చాలా తెలివైన వాడు
వాషింగ్టన్: వాషింగ్టన్ పోస్ట్ ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు 77 ఏళ్ళ బాబ్ వుడ్వర్డ్ రాసి ‘రేజ్’ ’పేరుతో ప్రచురించిన పుస్తకంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతరంగం స్పష్టమైంది. సీనియర్ జర్నలిస్టు వుడ్వర్డ్ గత డిసెంబర్ నుంచి జూలై వరకు పలు దఫాలుగా జరిపిన 18 ఇంటర్వ్యూల వివరాలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. 2018లో సింగపూర్లో ఉత్తర కొరియా అ«ధ్యక్షుడు కిమ్ని మొదటిసారి కలిసినప్పుడే తనని ఆకట్టుకున్నాడని, కిమ్ చాలా తెలివైన వ్యక్తి అనీ, ఆయన తనకి అన్ని విషయాలు చెప్పాడనీ, చివరకు తన సొంత అంకుల్ని చంపిన వైనాన్నీ గ్రాఫిక్స్లో వివరించాడని ట్రంప్ పేర్కొన్నట్టు పుస్తక రచయిత వెల్లడించారు. కిమ్తో అణ్వాయుధాలపై జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ వీడబోదని, అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తప్పని ట్రంప్ కొట్టిపారేశారు. ఉత్తర కొరియాని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో సీఐఏకీ తెలియదని ట్రంప్ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అవసరం లేని రేటింగ్ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశంలో గతంలో ఎప్పుడూ లేని అణ్వాయుధ వ్యవస్థని ఏర్పాటు చేశానని, అమెరికాకి ఉన్న రహస్య ఆయుధాలు ప్రపంచంలో మరెవ్వరికీ లేవని, ట్రంప్ చెప్పినట్లు ఈ పుస్తక రచయిత పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కావాలనే తక్కువ చేసి మాట్లాడిన విషయాన్ని అంగీకరించిన ట్రంప్, ప్రజలను భయభ్రాంతుకు గురిచేయడం ఇష్టంలేకనే తానలా మాట్లాడానన్నారు. సెప్టెంబర్ 15న మార్కెట్లోకి విడుదల కానుంది. -
ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వ్యాసకర్త, సౌదీ అరేబియా విమర్శకుడు జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. సౌదీ రాకుమారుడు, దేశ పాలనలో ముఖ్యభూమిక పోషిస్తున్న మొహమ్మద్ బిన్ సల్మాన్పై తీవ్ర విమర్శలతో వాషింగ్టన్ పోస్ట్లో పలు వ్యాసాలు రాసిన ఖషోగి హత్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఖషోగి 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందనే ఆరోపణలు వచ్చాయి. రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటలిజెన్స్, భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణను ఎదుర్కొన్నారు. ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించడంతో నిందితుల్లో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన నిందితుల్లో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష పడింది. -
అణు పరీక్ష ప్రయత్నాల్లో అమెరికా
వాషింగ్టన్: దాదాపు 28 ఏళ్ల తర్వాత అమెరికా మరోసారి అణు పరీక్ష జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రష్యా, చైనాలకు గట్టి హెచ్చరికలు పంపడమే దీని లక్ష్యమని ‘వాషింగ్టన్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. అణు పరీక్ష నిర్వహించడంపై 15న∙ప్రభుత్వ యంత్రాంగం చర్చించింది. చర్చల్లో అంతిమ నిర్ణయం తీసుకోలేదు. ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నదీ లేనిదీ వెల్లడి కాలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి, ఇద్దరు మాజీ అధికారులు వెల్లడించారని ఆ కథనంలో పేర్కొంది. ర్యాపిడ్ టెస్ట్తో తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం ద్వారా రష్యా, చైనాలను అమెరికా తన దారికి తీసుకువచ్చి అణ్వాయుధాలకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. అయితే, ఈ చర్య ద్వారా తన రక్షణ విధానం నుంచి అమెరికా వైదొలిగినట్లే అవుతుందని, ప్రపంచ దేశాల మధ్య తీవ్ర అణ్వాయుధ పోటీకి దారి తీస్తుందని పరిశీలకులు అంటున్నారు. ‘అణ్వాయుధ పోటీని నివారించే ఉద్యమానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీకి తెరలేస్తుంది. ముఖ్యంగా ఉత్తర కొరియాతో అణు చర్చలకు ఆటంకం కలుగుతుంది. అణు పరీక్షలపై విధించిన మారటోరియంకు ఆ దేశ పాలకుడు కిమ్ కట్టుబడి ఉండకపోవచ్చు. అంతిమంగా, అమెరికా చర్య కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తుంది’అని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారిల్ కింబల్ అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా రక్షణ విధానం పెనుమార్పులకు లోనయింది. రష్యా, చైనాలు తక్కువ తీవ్రత గల అణు పాటవ పరీక్షలు జరుపుతున్నాయంటూ అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. వీటిని ఆయా దేశాలు ఖండించాయి కూడా. చివరిసారిగా అమెరికా 1992లో అణు పరీక్ష నిర్వహించింది. -
భారత్కు చైనా సరిహద్దు కాదన్న ట్రంప్
వాషింగ్టన్: పేరుకే అగ్రరాజ్యానికే అధ్యక్షుడే కానీ ఆయనకి భౌగోళిక సరిహద్దులపై కనీస అవగాహన కూడా లేదని తాజా పుస్తకం వెల్లడించింది. ఒకసారి చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకే షాక్ ఇచ్చారట. ‘భారత్, చైనా సరిహద్దుల్ని పంచుకోవు కదా’అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో మోదీ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాష్టింగ్టన్ పోస్టుకు చెందిన ఫిలిప్ రకర్, కరోల్ లియోన్నింగ్ తమ తాజా పుస్తకం ‘ఏ వెరీ స్టేబుల్ జీనియస్‘లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ఏముందంటే ‘‘ఒకసారి మోదీ, ట్రంప్ సమావేశంలో భారత్కు, చైనా సరిహద్దు కాదని ట్రంప్ అనడంతో మోదీ ఆశ్చర్యపోయారు. ట్రంప్ ఏ మాత్రం సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. అని మోదీ ట్రంప్ సహాయకుడితో వ్యాఖ్యానించారు’’అని ఆ పుస్తకం పేర్కొంది. -
ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ అరేబియా కోర్టు తీర్పుని చ్చింది. విచారణను ఎదుర్కొన్న ఇద్దరు ఉన్నతస్థాయి వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది. సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షలాన్ అల్ షలాన్ సోమ వారం ఈ విషయాలు తెలిపారు. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో 11 మంది విచారణను ఎదు ర్కోగా ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి జైలు విధించగా మిగిలిన వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ బద్ధ వ్యతిరేకి అయిన ఖషోగ్గీ గత ఏడాది అక్టోబర్ 2న ఇస్తాంబుల్ (టర్కీ)లోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యారు. దౌత్య కార్యాలయ అధికారులు ముందు హత్యను నిరాకరిం చినా.. ఘర్షణలో అతడు మరణించినట్లు తర్వాత ఒప్పుకున్నారు. -
వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్ పిచాయ్
వాషింగ్టన్: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్ను గూగుల్ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కరన్ భాటియా మాట్లాడుతూ టైలర్ను ఇమ్మిగ్రేషన్ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. అయితే ఎప్పటకప్పుడు ఉద్యోగుల ఫోరమ్లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్ల కంటే సాఫ్టవేర్ను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. -
ట్రంప్ ‘చందాలు’ బంద్
వాషింగ్టన్: అమెరికాలోని కొన్ని వార్తా పత్రికలు అసత్య కథనాలు రాస్తాయని మండిపడే అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌజ్కు వచ్చే వార్తా పత్రికల్లో కొన్నింటి చందాలను రద్దు చేశారు. ఆయన ఆగ్రహానికి గురైన దినపత్రికల్లో వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఉన్నాయి. ఈ పత్రికల చందాలను మిగతా ప్రభుత్వ సంస్థలు కూడా రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఈ మేరకు వైట్హౌజ్ ప్రతినిధులు ప్రకటించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు ఇలా చేస్తే చాలా ఆదా అవుతుందని వైట్హౌజ్ పేర్కొంది. -
ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ బిన్ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్ మహ్మద్ బిన్ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ బిన్ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు. కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది. -
ప్రపంచ మీడియాకు హెడ్లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!
జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్సీన్లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!
వాషింగ్టన్ : ఇస్తాంబుల్లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ) కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అందించడం గమనార్హం. -
హ్యాకైన అమెజాన్ సీఈఓ ఫోన్
సాక్షి, వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్కు గురైంది. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు ఈ హ్యాకింగ్కు పాల్పడినట్టు సమాచారం. జెఫ్ బెజోస్ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడానికే హ్యాకింగ్ జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్లో బెజోస్కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్ అయిన జమాల్ ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు సౌదీ ప్రభుత్వమే కారణమంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీనికి ప్రతిచర్యగా బెజోస్ ఫోన్ను సౌదీ హ్యాక్ చేసిందని, ఆయనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సౌదీ అధికారులు దొంగిలించారని బెజోస్ సెక్యూరిటీ అధికారి గవిన్ బెకర్ తెలిపారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని గెవిన్ బెకర్ అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఖషోగ్గి హత్యను ప్రిన్స్ సల్మాన్ చేయించారని అమెరికా ఇంటెలిజన్స్ సంస్థ సీఐఏ సెనేట్కు సమాచారమందించింది. -
తప్పుడు ప్రకటనల్లో ట్రంప్ రికార్డు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ 8,158 సార్లు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అధ్యక్షుడిగా ట్రంప్ ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫ్యాక్ట్ చెకర్స్ డేటాబేస్’అనే కంపెనీ ట్రంప్ చేసిన ప్రతీ అనుమానిత తప్పుడు సమాచారాన్ని విశ్లేషించింది. తొలి ఏడాదిలో రోజుకు సరాసరి 5.9 తప్పుడు ప్రకటనలు చేశారని, రెండో ఏడాదికి వచ్చే సరికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరిగి, రోజుకు 16.5 తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని పేర్కొంది. మొత్తం 8,158 తప్పుడు ప్రకటనల్లో దాదాపు 6 వేలకు పైగా ప్రకటనలు రెండో ఏడాదే చేశారని తెలిపింది. అధ్యక్షుడైన తర్వాత తొలి 100 రోజుల్లోనే 492 తప్పుడు ప్రకటనలు చేశారని తేల్చింది. ఇప్పటి వరకు చేసిన తప్పుడు ప్రకటనల్లో అధికంగా వలసల గురించే చేయడం గమనార్హం. విదేశీ విధానం గురించి 900, వాణిజ్యం గురించి 854, ఆర్థిక వ్యవస్థ గురించి 790, ఉద్యోగాల గురించి 755 తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ రెండేళ్లలో 82 రోజులు మాత్రమే ఎలాంటి ప్రకటనలు చేయలేదు. -
ట్రంప్ రాజీనామా అంటూ ఫేక్ న్యూస్
-
ట్రంప్ రాజీనామా!
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ ప్రజలు బుధవారం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారని ’వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ’అన్ప్రెసిడెంటెడ్‘ అనే శీర్షికతో రాసిన కథనంలో ట్రంప్ రాజీనామాతో ప్రపంచదేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయని వెల్లడించింది. 2019, మే 1వ తేదీతో ఉన్న ఈ పత్రికను కొందరు వాషింగ్టన్తో పాటు వైట్హౌస్ సమీపంలో ఉచితంగా పంచిపెట్టారు. ఈ తేదీని గమనించిన వ్యక్తులు ఇది నకిలీ ఎడిషన్ అని భావించారు. చివరికి ఈ విషయం వైరల్గా మారడంతో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పందిస్తూ.. అది నకిలీ ఎడిషన్ అనీ, దానితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ట్రంప్ 2019, ఏప్రిల్ 30న వైట్హౌస్ను వదిలివెళ్లిపోయినట్లు ఈ నకిలీ ఎడిషన్లో లీసా చుంగ్ పేరుతో కథనం ప్రచురితమైంది. ‘ రాజీనామా విషయంలో ట్రంప్ అధికారిక ప్రకటనను వెలువరించలేదు. 2019, ఏప్రిల్ 30న ఓవల్ కార్యాలయంలోని అధ్యక్షుడి డెస్క్ పక్కన ఓ న్యాప్కిన్ దొరికినట్లు నలుగురు వైట్హౌస్ అధికారులు తెలిపారు. అందులో ఎరుపురంగు ఇంక్తో ‘ఇందుకు(తన రాజీనామాకు) నిజాయితీ లేని హిల్లరీ క్లింటన్ను, హైఫియర్ను, నకిలీ వార్తల మీడియాను నిందించండి’ అని ట్రంప్ రాసినట్లు ఉంది. ప్రస్తుతం ఆయన శ్వేతసౌధం వదిలేసి రష్యాలోని క్రిమియాలో ఉన్న యాల్టా రిసార్ట్కు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అమెరికా అధ్యక్షుడిగా వెంటనే ప్రమాణస్వీకారం చేశారు’ అని కథనం ప్రచురితమైంది. ట్రంప్ రాజీనామాతో దేశవిదేశాల్లో సంబరాలు చేసుకున్నారని ఎడిషన్లో వార్త వచ్చింది. నకిలీ ఎడిషన్తో తమకు సంబంధంలేదని వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించింది. ‘యస్ మెన్’ అనే గ్రూపు నకిలీ పత్రిక, వెబ్సైట్ను నడుపుతోందని అమెరికా జర్నలిస్ట్ రామ్సే చెప్పారు. -
‘అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ రాజీనామా’..!!
వాషింగ్టన్: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత తల దించుకొని వైట్హౌజ్ నుంచి ఇంటిదారి పట్టాడు. ప్రపంచం మొత్తం సంబరాలు చేసకుంటోంది’ అని వాషింగ్టన్ పోస్ట్ పేరిట వెలువడిన ఓ ఫేక్ న్యూస్ సంచలనం రేకెత్తించింది. వాషింగ్టన్ డీసీలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో ముంతెత్తింది. తాటి కాయంత అక్షరాలతో.. ‘ట్రంప్ రాజీనామా’ వార్త చూసి అక్కడి జనం షాక్కు గురయ్యారు. కొందరు నిజంగానే సంబరపడ్డారు. అమెరికాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నుంచి బయటపడేందుకే ట్రంప్ రాజీనామా చేశాడంటూ ఆ ఫేక్ వార్తలో చెప్పుకొచ్చారు. లీసా చంగ్ ఈ ఫేక్ న్యూస్ను రచించగా.. క్రిస్టినైన్ ఫ్లెమింగ్ డిజైన్ చేశారు. ‘ది పబ్లిక్ సొసైటీ’ నుంచి ఈ పేపర్ పబ్లిష్ అయింది. జరిగేది అదే.. వైట్హౌజ్ నుంచి తలదించుకొని వెళ్తున్న ట్రంప్.. 4 కాలమ్స్ ఫొటో పాఠకులను ఆకట్టుకుంది. అయితే, పేపర్పై పబ్లిషింగ్ తేదీ 2019, మే 1 అని ఉండడంతో అప్పటివరకు గందరగోళంలో పడిన పాఠకులకు కొంత క్లారిటీ వచ్చింది. మొత్తం వార్త చదవగా అది ఫేక్ న్యూస్ పేపర్ అని తెలిసింది. ‘30 ఏప్రిల్, 2019 న ట్రంప్ అధికారం నుంచి దిగిపోతాడు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అధ్యక్షుడవుతాడు. జరిగేది ఇదే..! అందరిలా కాకుండా.. వినూత్నంగా.. వింతగా ఓ న్యాప్కిన్పై ఎర్ర సిరాతో తన ప్రత్యర్థులపై విమర్శలు రాసి పెట్టి పదవి నుంచి తప్పుకుంటాడు. అక్కడ నుంచి నేరుగా యాల్టా వెళ్తాడు’ అని సదరు ఫేక్ న్యూస్లో రాసుకొచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా మిత్ర దేశాల నాయకులు సమావేశమైన క్రిమియన్ హోటలే యాల్టా. కాగా, సమాచారం అందుకున్న వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా వెలువడిన ఫేక్ న్యూస్ పేపర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఈ చర్యతో వారికి ఒరిగేమీలేదని ఫేక్ న్యూస్ పబ్లిషర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తమ పత్రిక గౌరవానికి భంగం కలిగించినందుకు సదరు పబ్లిషర్ పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది. ఇలావుండగా, ‘ఇలాంటి పేపర్ మళ్లీ దొరకదు. వైట్ హౌజ్ దగ్గర ఉచితంగా ఈ పేపర్ ఇస్తున్నారు. వార్త బాగుంది’ అని ఓ నడివయసు మహిళ వ్యాఖ్యానించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఫేక్ న్యూస్ పేపర్ పంచుతున్న ఓ మహిళ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. This might be the best visual ever. It’s a satire newspaper that shows what the front page of the paper will look like the day after Trump leaves office. With the headlines: UNPRESIDENTED. And: Celebrations breakout worldwide as Trump era ends. This is beautiful. This is art.🇺🇸 https://t.co/TU6jdQmgD0 — Scott Dworkin (@funder) January 16, 2019 -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
యువరాజే చంపమన్నారు!
వాషింగ్టన్: ప్రముఖ జర్నలిస్ట్, వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ(సీఐఏ) నిర్ధారణకు వచ్చినట్టు యూఎస్ మీడియా వెల్లడించింది. ఆయన ఆదేశాల మేరకే ఖషోగ్గీని పథకం ప్రకారం అంతమొందించినట్టు తెలిపింది. సౌదీకి చెందిన 15 మంది ఏజెంట్లు ప్రభుత్వ విమానంలో ఇస్తాంబుల్ వెళ్లి, సౌదీ రాయబారా కార్యాలయంలో ఖషోగ్గీని హత్య చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీనిపై స్పందించేందుకు సీఐఏ నిరాకరించింది. యువరాజు మహ్మద్ బిన్ సోదరుడు, అమెరికాలోని సౌదీ రాయబారి ఖలీద్ బిన్ సల్మాన్ ద్వారా ఖషోగ్గీని ఇస్తాంబుల్కు రప్పించినట్టు సీఐఏ వర్గాలు గుర్తించినట్టు సమాచారం. ఇస్తాంబుల్లోని తమ కాన్సులేట్కు వెళ్లి ఖషోగ్గీకి అవసరమైన పత్రాలు తీసుకోవాలని, ఎటువంటి ముప్పు ఉండబోదని ఆయనతో ఫోన్లో ఖలీద్ బిన్ చెప్పినట్టు సమాచారం. దీన్ని సౌదీ కాన్సులేట్ తోసిపుచ్చింది. ఇదంతా అవాస్తవమని తెలిపింది. టర్కీకి వెళ్లే విషయం గురించి ఖషోగ్గీతో ఖలీద్ బిన్ మాట్లాడలేదని సౌదీ ఎంబసీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. టర్కీ మహిళను పెళ్లాడేందుకు అవసరమైన పత్రాల కోసం వెళ్లి ఆయనను సౌదీ ఏజెంట్లు హత్య చేశారు. ఖషోగ్గీ అదృశ్యం గురించి తమకేమీ తెలియదని బుకాయించిన సౌదీ తర్వాత నేరాన్ని ఒప్పుకుంది. ఖషోగ్గీ హత్య వెనుక సౌదీ యువరాజు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను సీఐఏ సంపాదించలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఖషోగ్గీ హత్య చేసిన బృందంలో సభ్యులు ఫోన్లో యువరాజు సన్నిహితులతో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన ప్రమేయం ఉందన్న అంచనాకు వచ్చిందని వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఖషోగ్గీ హంతకులకు మరణశిక్ష అమలు చేస్తామని సౌదీ అరేబియా చెబుతోంది. ఖషోగ్గీ నన్ను పెళ్లాడారు జమాల్ ఖషోగ్గీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను పెళ్లాడారంటూ ఈజిప్టు మహిళ ఒకరు తెరపైకి వచ్చారు. వాషింగ్టన్లో జూన్ నెలలో తాము పెళ్లి చేసుకున్నామని ‘వాషింగ్టన్ పోస్ట్’తో చెప్పారు. అయితే తన వివరాలు వెల్లడించేందుకు ఆమె నిరాకరించారు. ‘ముస్లిం భార్యగా గుర్తింపు కోరుకునే పూర్తి హక్కు తనకుంద’ని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఖషోగ్గీ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈజిప్టు మహిళను ఖషోగ్గీ పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలియదని ఆయనను పెళ్లాడాలనుకున్న టర్కీ మహిళ హార్టిస్ సెంగిజ్ చెప్పారు. ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
ఖషోగ్గీ హత్య.. మరో ట్విస్ట్
న్యూయార్క్: ‘మీ బాస్కు చెప్పండి’.. వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యానంతరం తన పై అధికారికి సౌదీ అరేబియా నిఘా బృందంలోని సభ్యుడొకరు ఫోన్లో చెప్పిన మాట ఇది. ‘ఆ బాస్’ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ హత్యోదంతంలో సల్మాన్ పాత్ర ఉందనడానికి ఇదే బలమైన ఆధారమని భావిస్తున్నారు. ఖషోగ్గీ హత్య జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు రికార్డు చేసిన ఆడియో టేపులను టర్కీ నిఘా విభాగం సేకరించింది. వీటిని గత నెలలో అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్ గినా హాస్పెల్కు అప్పగించింది. ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆయన మృతదేహాన్ని సౌదీ రాయబార కార్యాలయంలోనే ముక్కలుగా నరికి యాసిడ్లో కరిగించి మాయం చేశారని టర్కీ ఆరోపించింది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చే ఆధారాలు ఆడియో టేపుల్లో ఉన్నాయని అమెరికా నిఘా అధికారులు విశ్వసిస్తున్నారు. ఖషోగ్గి కోసం సౌదీ ప్రభుత్వం పంపించిన 15 మంది సభ్యులు బృందంలో ఒకరైన మహెర్ అబ్దులాజీజ్ ముత్రెబ్ ఒకరు. ఖషోగ్గీ హత్యానంతరం అతడు ఉన్నతాధికారికి ఫోన్ చేసి అరబిక్లో ‘మీ బాస్తో చెప్పండి’ అన్నాడని వెల్లడైంది. భద్రతా అధికారిగా పనిచేస్తున్న ముత్రెబ్ తరచుగా సల్మాన్తో కలిసి ప్రయాణిస్తుంటాడని అమెరికా అధికారులతో టర్కీ నిఘా అధికారులు చెప్పారు. ఖషోగ్గీని హత్య చేసిన తర్వాత సల్మాన్ సన్నిహితులకు అతడు ఫోన్ చేసివుంటాడని వెల్లడించారు. అయితే ముత్రెబ్ అరబిక్లో చెప్పిన మాటలను తర్జుమా చేస్తే మరో అర్థం వచ్చింది. ‘మాకు అప్పగించిన పని పూర్తయింద’నే అర్థం వచ్చేలా అతడు మాట్లాడినట్టు తేలింది. అమెరికా ఏం చేస్తుంది? సల్మాన్ పాత్రపై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. సల్మాన్ పేరు ప్రస్తావన రాకపోవడంతో దీన్ని గట్టి ఆధారంగా పరిగణించలేకపోతున్నారు. ఖషోగ్గీ హత్యతో తమ యువరాజుకు ఎటువంటి సంబంధం లేదని సౌదీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీ సేకరించిన ఆడియో టేపులను పరిశీలించేందుకు తమ నిఘా అధికారులను అనుమతించాలని కోరింది. ఆడియో టేపులు, టెలిఫోన్ కాల్స్ డేటాను టర్కీ తమకు నమ్మకమైన దేశాలతో మాత్రమే పంచుకుంది. సౌదీ యువరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు వెలుగులోకి రావడంతో కచ్చితంగా వైట్హౌస్పై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరబ్లో అమెరికాకు సౌదీ అరేబియా కీలక భాగస్వామి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో సౌదీ యువరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్కు వ్యతిరేకంగా చర్యలకు అమెరికా ఉపక్రమిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే ప్రమాదముంది. అయితే ఈ విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ట్రంప్ చెబుతున్నారు. సౌదీ యువరాజు సల్మాన్కు ట్రంప్ అండగా నిలబడతారనే అభిప్రాయాన్ని అమెరికా ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు వ్యక్తపరిచారు.