-
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్ను వణికిస్తోంది.పాకిస్తాన్లోని బలూచిస్థాన్లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది. -
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. హైరిస్క్ వర్గాలకు... క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు టీకా ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
అన్ని వేరియంట్లకు ఒకే టీకా?
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. సార్స్–కోవ్–2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు. కాగా, ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్ఎస్2 అని పేరుపెట్టారు. కోవిడ్–19పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు. ఇది వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్కు చెందిన స్పైక్ ప్రొటీన్లలోని రెండు కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్ఎస్2 టీకాను అభివృద్ధి చేశారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్ఎస్ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు. -
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్లోని ఈ కొత్త సబ్-వేరియంట్కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
కొవిన్ పోర్టల్లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్తో మాత్రమే కొవిన్ పోర్టల్లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్లోని సమాచారాన్ని ఏ బాట్లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్బీబీ, ఎక్స్బీఎఫ్, ఎక్స్బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
TS: కరోనా టీకా వికటించి 37 మరణాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల ఫలితంగా తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దు్రష్పభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్లో 8,130, కర్ణాటకలో 6,628 మంది ఆసుపత్రులపాలయ్యారు. కాగా, టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో 85, కర్ణాటకలో 75, పశి్చమ బెంగాల్లో 70 మంది మరణించారు. కాగా, ఛత్తీస్గఢ్లో కేవలం ఒకరే మృతిచెందడం గమనార్హం. ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం.. దేశంలో ఇప్పటివరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు, అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా, రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది.తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. వీటిని దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగానీ కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తితీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్తే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా, అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు. ఇతర వ్యాక్సిన్లతోనూ ఇలాగే మరణాలు ఇతర వ్యాక్సిన్లతోకూడా ఇదే తీరులో మరణాలు సంభవిస్తాయి. ప్రతీ మిలియన్ వ్యాక్సిన్ డోసుల్లో ఒక మరణం సంభవిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనంతరం జరుగుతున్న మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే మరే ఇతర వ్యాక్సిన్ కూడా కరోనా టీకా అంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు వేసినట్లు లేదు. అయినా కూడా సాధారణ స్థాయిలోనే మరణాలు ఉన్నాయి. కరోనా టీకాతోనే కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు మృతిచెందితే వారిని కూడా టీకా అనంతర మరణాల జాబితాలో చేర్చే అవకాశముంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
భారీగా కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2, 151 కేసులు నమోదు కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 11,903కి చేరినట్లయ్యింది. గత ఐదు నెలల కాలంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు యూపీలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో కొత్త కేసులు 2 వేలకుపైగా వెలుగు చూశాయి. కేంద్రం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది కూడా. ఒమిక్రాన్ ఉపవేరియెంట్ ఎక్స్బీబీ 1.16 విజృంభణ వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే బయటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక మ్యూటెంట్ వేరియెంట్తో రిస్క్ రేట్ తక్కువే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్లోనూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
వ్యాక్సిన్తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్లు!
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్లో వ్యాక్సిన్ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
గమనించాల్సిన సైన్సు పరిణామాలు
కొత్త ఏడాదిలో శాస్త్ర విజ్ఞాన పరంగా చాలా అంశాలు ఆసక్తిగా నిలుస్తున్నాయి. కోవిడ్కు ముక్కు ద్వారా వేసుకునే టీకాతో పాటు, అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉండే టీకా రానున్నాయి. మొత్తంగానే కోవిడ్ పీడ విరగడైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నంలో భాగంగా ఆదిత్య–ఎల్1ను ఈ ఏడాదే ప్రయోగించనున్నారు. ‘ఇస్రో’ ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించనుంది. అణు విద్యుత్తు రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు పని చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కొత్త సంవత్సరంలో అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. కాకపోతే ఫీలింగ్ మాత్రం గత ఏడాది జనవరి మాదిరిగానే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న బెంగ గత ఏడాదిదైతే, కొత్త రూపాంతరంతో ఏం చిక్కు వస్తుందో అన్న భయం ఈసారి వెంటాడుతోంది. సమస్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సవాలు విసరగలగటం ఆందోళ నకరం. కాకపోతే దేశం ఇప్పటికే సంసిద్ధమై ఉన్న కారణంగా కొంచెం నింపాదిగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ప్రశ్న కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందా, లేదా? అన్నది కాదు. ఈ పీడ శాశ్వతంగా విరగడ అవుతుందా, కాదా? అన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియాసస్ మాత్రం కొంత ఆశావహంగానే ఉన్నారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో కోవిడ్ శని వదిలిందని ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే జరిగే డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కమిటీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగనుంది. వేడిలోనూ పనిచేసే టీకా కోవిడ్–19 ప్రపంచానికి ముప్పు అన్న హెచ్చరికను డబ్ల్యూహెచ్ఓ తొలగించినప్పటికీ వైరస్తో ప్రమాదం లేదని అర్థం కాదు. ఇప్పటికే ఉన్న అనేకానేక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల జాబితాలోకి ఇది కూడా చేరిపోయి అప్పుడప్పుడూ అక్కడక్కడా వచ్చిపోతూ ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థలు మాత్రం నిత్యం ముంగాళ్లపై ఉండా ల్సిన పరిస్థితి. అదే సమయంలో శాస్త్రవేత్తలు కొత్త టీకాలు, చికిత్స లను కనుక్కునే ప్రయత్నాల్లో ఉంటారు. భారత దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సీన్ (ముక్కు ద్వారా తీసు కునేది) అందరి దృష్టిలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, బూస్టర్ డోసుగా వాడేందుకు ఈ టీకాకు అనుమతులు లభించాయి. ఈ టీకా వేయడం మొదలుపెడితే విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా టీకా సామర్థ్యం ఏమిటన్నదీ తెలిసిపోతుంది. ఈ ఏడాది గమనించాల్సిన ఇంకో కోవిడ్ వ్యాక్సీన్ వేడిని కూడా తట్టుకునే రకానిది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లోని స్టార్టప్ కంపెనీ మైన్వాక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం... ఈ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రూపాంతరితాలను నాశనం చేయగల యాంటీబాడీలను తయారు చేయగలదని తేలింది. చండీగఢ్లోని సీఎస్ఐఆర్–ఐఎంటెక్తోపాటు, ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్నెస్లలో ఈ టీకాను పరీక్షించారు. మానవ ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు. ఇప్పటివరకూ తయారైన టీకాలను రిఫ్రిజరేటర్లలో భద్రపరచాల్సిన అవసరముండగా... కొత్త టీకా అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో ప్రయోజన ముంటుందన్నది తెలిసిన విషయమే. ఆదిత్యుడి పైకి చూపు ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందరూ ఎదురు చూస్తున్న ప్రయోగాల్లో ఆదిత్య–ఎల్1 ముఖ్యమైందని చెప్పాలి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నమిది. సుమారు 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ను ఏర్పాటు చేశారు. శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే దీని ప్రయోగం జరిగే అవ కాశం ఉంది. కరోనాగ్రాఫ్తోపాటు ఆదిత్య–ఎల్1లో ఇంకో ఆరు పేలోడ్స్ ఉంటాయి. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యంగా ఉండే లగ్రానిగన్ పాయింట్ (ఎల్1)లో ఉంటూ ఈ ఉపగ్రహం సూర్యుడిని పరిశీలిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించ నుంది. చంద్రుడి ఉపరితలం పైకి సురక్షితంగా దిగడాన్ని పరీక్షించేం దుకు చంద్రయాన్–2 ఉపయోగపడగా, తాజాగా చంద్రయాన్–3లో ఒక లాండర్, ఓ రోవర్ రెండూ ఉంటాయి. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా వీటిని జాబిల్లిపైకి చేర్చనున్నారు. మళ్లీ గగన్యాన్ మిస్? ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో గగన్యాన్ ఒకటి. అయితే అది ఈ ఏడాది కూడా డెడ్లైన్ను అందుకోకపోవచ్చు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భరత మాత ముద్దుబిడ్డ ఒకరు 2022 లేదా అంతకంటే ముందుగానే భారతీయ రాకెట్లో అంతరిక్షంలోకి ఎగురు తారు’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇటీవల లోక్సభలో ఒక ప్రకటన చేస్తూ, గగన్యాన్ను 2024 నాలుగో త్రైమాసికంలో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలపడం ప్రస్తావించాల్సిన అంశం. సిబ్బంది తప్పించు కునేందుకు అవసరమైన వ్యవస్థ, పారాషూట్ ఆధారంగా వేగాన్ని తగ్గించుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో జాప్యం జరగడం వల్ల గగన్యాన్ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయో గాలు ఈ ఏడాది చివరిలో జరగవచ్చు. 2024 రెండో త్రైమాసికంలో సిబ్బంది లేకుండా ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఆ తరువాత అసలు ప్రయోగం చేపట్టవచ్చు. గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాముల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. వీరు రష్యాలో తొలిదశ శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఇతర శిక్షణలు పొందుతున్నారు. చిన్న అణు రియాక్టర్లకు సమయం? ఈ ఏడాది దేశంలో అణు విద్యుత్తు రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లకు సంబంధించి కొంత కదలిక కనిపించవచ్చు. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడటం వల్ల, పైగా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచస్థాయిలో విద్యుత్తు రంగం తీరుతెన్నులు మారి పోయాయి. భారీస్థాయి అణు రియాక్టర్ల మాదిరిగా కాకుండా, 300 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఫ్యాక్టరీల్లో తయారు చేసే సౌలభ్యం ఉంది. పెద్ద రియాక్టర్లనైతే విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలోనే అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్మాణానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీలో ప్రైవేట్ కంపెనీలకూ అవ కాశం కల్పించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. డిజిటల్ రూపాయి కూడా.. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తేనుండటం ఈ ఏడాది ఎదురు చూడాల్సిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపరమైన అంశాల్లో ఒకటి. దీంతోపాటు జన్యుమార్పిడి ఆవాల పంట క్షేత్ర ప్రయోగాలు, జీ20 అధ్యక్ష స్థానంలో భాగంగా చేపట్టనున్న సైన్స్ డిప్లొ మసీ, కృత్రిమ మేధ రంగాల్లోని మార్పులనూ నిశితంగా చూడాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భౌతిక రూపాయి కున్నంత భద్రత, ఫీచర్లు, నమ్మకం డిజిటల్ రూపాయికీ ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. గోప్యత ఎంత వరకన్నది ఒక సందేహమే. ఈ ఏడాది జరగనున్న జీ20 సమావేశాలు భారతదేశంలో జరుగుతున్న సైన్స్, టెక్నాలజీ ఇన్నొవేషన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చక్కటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జీ20 సభ్యదేశా లన్నింటికీ మరింత దగ్గరయ్యేందుకు సైన్స్ డిప్లొమసీని ఉపయోగించు కోవాలి. ఇందులో భాగంగానే కోయంబత్తూరు, లక్ష్యద్వీప్, అగర్తలా, ఇండోర్, రాంచీ, సిమ్లా, డయూ, ఇటానగర్, దిబ్రూఘర్లలో శాటి లైట్ ఈవెంట్లు, సైన్స్ శాఖల మంత్రుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే... వీటిల్లో ఏ ఒక్కటీ సైన్సు, టెక్నాలజీలకు హబ్ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేదా అహ్మదాబాద్లలో నిర్వ హించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం! దినేశ్ సి. శర్మ. వ్యాసకర్త సైన్సు అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో). -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్లోకి ఎంట్రీ..! -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్తో చిన్నారులు మృతి
కరోనా సమయంలో వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్ వైరస్ టెన్షన్ పెడుతోంది. మీజిల్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్ 20వ తేదీన వైరస్ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక, మీజిల్స్ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. BMC prepares list of nearly 1.4 lakh Mumbai children for extra measles shot https://t.co/2KLGyJsHYT Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa — Vinod KumarTOI🇮🇳 (@vinod904) November 27, 2022 -
AP: ఆయుష్మాన్భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు
చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్సీలు, 18 యూపీహెచ్సీలు, 8 సీహెచ్సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్లో వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. టీకాలు.. పది రకాలు గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్ డోసు వేస్తారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్ఐపీవీ–1 ఇంజక్షన్ (పోలియో రాకుండా), పెంటావాలెంట్ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్తో పాటు ఎంఆర్ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్ ఇమ్యూనైజేషన్ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్వాడీల ద్వారా వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. – పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
ప్రజారోగ్య సంరక్షణలో ఏపీ ది బెస్ట్.. ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. గర్భిణులకు చెకప్లు, 9–11 నెలల పిల్లలకు టీకాలు వేయడం వంటి అంశాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెచ్ఎంఐఎస్ 2021–22 అనాలసిస్ రిపోర్ట్లో వెల్లడైంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, ఇమ్యునైజేషన్ సహా 13 అంశాలపై పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా (మూడు విభాగాలుగా) పనితీరు ఆధారంగా ర్యాంక్లు కేటాయించింది. ఈ ర్యాంకులు ఇవ్వడానికి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా తొలిసారిగా దేశంలోని 735 జిల్లాల్లోని 1,64,440 సబ్ సెంటర్లు, 32,912 పీహెచ్సీలు, 15,919 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 2,970 సబ్ జిల్లా ఆస్పత్రులు, 1,264 జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లోని 2.17 లక్షల ఆరోగ్య సేవలను మ్యాపింగ్ చేసినట్లు హెచ్ఎంఐఎస్ ఈ–బుక్ బులెటిన్లో పేర్కొంది. కొత్త పోర్టల్లో వ్యక్తి నిర్ధిష్ట వినియోగదారు ఆధారాలు, రియల్ టైమ్ డేటా ఎంట్రీ, రియల్ టైమ్ మానిటరింగ్, నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్) ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 9 నుంచి 11 నెలల పిల్లలకు టీకాలు ఇవ్వడం (ఇమ్యునైజేషన్)లో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి నంబర్–1 ర్యాంక్ రాగా.. తెలంగాణకు 5, తమిళనాడుకు 11 ర్యాంక్లు లభించాయి. ఇదే సందర్భంలో గర్భిణులకు ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్సీ చెకప్లు నిర్వహించడంలోనూ దేశంలోనే నంబర్–1 ర్యాంక్ను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉండగా.. పొరుగున ఉన్న తెలంగాణ 13వ ర్యాంక్కు పరిమితమైంది. ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని అంశాల పనితీరులోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి రెండో ర్యాంక్ దక్కింది. బెడ్ ఆక్యుపెన్సీలోనూ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంతకన్నా పెద్ద ఆస్పత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ విషయంలో ఏపీ 57.8 శాతంతో దేశంలోనే రెండోర్యాంకులో నిలిచింది. జాతీయస్థాయిలో బెడ్స్ ఆక్యుపె న్సీ 27.9 శాతమే ఉంది. ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండేందుకు గర్భిణులకు టెటానస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ 103.9 శాతంతో రెండవ ర్యాంకులో ఉంది. జాతీయ స్థాయిలో ఈ ఇంజెక్షన్లను 73.9 శాతమే వేశారు. ఇంటి దగ్గర డెలివరీల్లో 69.0 శాతం మేర స్కిల్ బర్త్ అటెండెంట్స్ హాజరవుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మూడో ర్యాంకులో నిలిచింది. జాతీయ స్థాయిలో 17.5 శాతం మాత్రమే హాజరు ఉంది. ఇనిస్టిట్యూషన్ డెలివరీల్లో ఆంధ్రప్రదేశ్ 70.7 శాతంతో 6వ ర్యాంకు పొందింది. జాతీయ స్థాయిలో 53.4 శాతమే ఇనిస్టిట్యూషన్ డెలివరీలున్నాయి. -
కోవిడ్ వ్యాక్సిన్లతో వైద్య సంక్షోభం!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లతో అంతర్జాతీయ వైద్య సంక్షోభం తలెత్తిందని ఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై పోరాడుతున్న వైద్య బృందం ఆరోపించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రభావంపై మెడికల్ క్రైసెస్ డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం జూమ్ యాప్ ద్వారా పలు దేశాలకు చెందిన వైద్యుల బృందం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ గాయత్రి పండిట్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లతో తలెత్తిన ప్రతికూల పరిస్థితులను వివరించారు. ‘‘ఆరోగ్యవంతమైన వ్యక్తులు కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నాక అనారోగ్యాల బారిపడినట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని యెల్లోకార్డ్ సిస్టం, ఆస్ట్రేలియన్ అడ్వర్స్ ఈవెంట్ మానిటరింగ్ సిస్టం, యూరప్లోని యుడ్రా విజిలెన్స్ సిస్టంలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీజీ యాక్సిస్ డేటాబేస్ ద్వారా మేం గణాంకాలను సేకరించి పరిశీలించాం. ఆ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల (కోటీ 10 లక్షల) మంది కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు లోనయ్యారు. అందులో సుమారు 70 వేల మంది వ్యాక్సినేషన్ తదనంతర కారణాలతోనే చనిపోయినట్టు పలు సంస్థల గణాంకాలు చెప్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..’’ అని వైద్యుల బృందం పేర్కొంది. తక్షణమే కోవిడ్ వ్యాక్సినేషన్లను నిలిపివేసి, వాటిద్వారా తలెత్తిన దుష్ప్రభావాలను గుర్తించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. 34 దేశాల ప్రతినిధుల మద్దతు కోవిడ్ వ్యాక్సినేషన్తో అంతర్జాతీయ వైద్య సంక్షోభం (ఇంటర్నేషనల్ మెడికల్ క్రైసెస్) తలెత్తుతోందన్న వాదనకు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల వైద్యులు మద్దతు పలుకుతున్నట్టు ఈ బృందం పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా తయారు చేసి, అతి తక్కువ కాలంలో క్లినికల్ ట్రయల్స్ జరిపి.. ప్రజలకు అందించారని.. ఈ క్రమంలో వ్యాక్సిన్ల దీర్ఘకాలిక ప్రభావాల సంగతిని తేల్చలేదని వివరించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత అనారోగ్యాల బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాలను కోరింది. అన్ని కోవిడ్ వ్యాక్సిన్లపై లోతుగా పరిశీలన జరిపి.. మాలిక్యులర్, సెల్యులార్, బయోలాజికల్ ప్రభావాలను తేల్చాలని డిమాండ్ చేసింది. -
జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది. డేంజర్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది. చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం -
కి‘లేడీ’: కరోనా టీకా వేస్తున్నట్టు నటించి.. బంగారు గొలుసుతో...
గుంటూరు రూరల్: ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించి మాయమాటలు చెప్పి వారి వద్దనుంచి బంగారు గొలుసులు మాయంచేసే మాయలేడీని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. భవనం ప్రభావతి హౌసింగ్బోర్డ్ కాలనీ ఎల్ఐజీలో తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి నివాసం ఉంటుంది. ఇద్దరే ఉంటున్నారని గమనించిన నగరంలోని గౌతమినగర్ 4వ లైనుకు చెందిన దొల చంద్రకళ ద్విచక్రవాహనంపై ప్రభావతి ఇంటికి ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం సమయంలో వచ్చింది. కరోనా టీకాలు వేస్తున్నామని మీరు టీకా వేయించుకోవాలని ప్రభావతిని నమ్మబలికింది. దీంతో ప్రభావతి సరే టీకా వేయండని చెప్పగా, టీకా వేస్తున్నట్లుగా నటిస్తూ మాయలేడీ చంద్రకళ ప్రభావతి మెడలోని రెండు బంగారు గొలుసులను కట్చేసి బయటకు పరిగెత్తింది. (చదవండి: సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..) ఒక్కసారిగా గొలుసు లాక్కుని పరారవ్వటంతో కిందపడిన ప్రభావతి తేరుకుని బయటకు వచ్చి చూడగా మాయలేడీ ద్విచక్ర వాహనంపై పరారవ్వటం గమనించింది. దీంతో చేసేదిలేక నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్హఫీజ్ ఆదేశాల మేరకు సౌత్జోన్ రూరల్ డీఎస్పీ వై.జెస్సీప్రశాంతి, సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఆరోగ్యరాజు సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీల ఆధారంగా మాయలేడీ వినియోగిస్తున్న ద్విచక్రవాహనం నంబర్లు సైతం సరైనవి కాదని నంబర్లు మార్చి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టకేలకు మాయలేడీ చంద్రకళను ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారించగా నిందితురాలు చేసిన నేరం ఒప్పుకుంది. చోరీ చేసిన రూ.4 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు రికవరీ చేశామని సీఐ తెలిపారు. దీంతోపాటుగా నిందితురాలు వినియోగిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్.ఆరోగ్యరాజును, ఎస్ఐ ఎస్.సత్యనాయక్, కానిస్టేబుళ్లు కె.సుబ్బారావు, షేక్ జాన్సైదా, షేక్ మస్తాన్వలి, ఎం.లోకేశ్వరరావులను అభినందించి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారని సీఐ తెలిపారు. (చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం) -
మంకీపాక్స్తో వణికిపోతున్న అమెరికా.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన
వాషింగ్టన్: ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్ను సీరియస్గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది. మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు. I remain committed to our monkeypox response: ramping-up vaccine distribution, expanding testing, and educating at-risk communities. That's why today's public health emergency declaration on the virus is critical to confronting this outbreak with the urgency it warrants. — President Biden (@POTUS) August 4, 2022 ప్రపంచవ్యాప్తంగా 83 దేశాలకుపైగా వ్యాపించింది మంకీపాక్స్. 23,350 మందికిపైగా సోకింది. ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కోవిడ్-19 టీకాల పంపిణీ పూర్తవగానే పౌరసత్వ చట్టం అమలు చేస్తామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారితో మంగళవారం పార్లమెంట్ హౌస్లో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి. బెంగాల్లో బీజేపీ కార్యవర్గ సమస్యలపై చర్చించేందుకు ఇరువురు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం మాట్లాడిన సువేందు అధికారి సీఏఏ అంశాన్ని తెలిపారు. ‘కోవిడ్-19 మూడో డోసు పంపిణీ పూర్తవగానే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సీఏఏ అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.’ అని పేర్కొన్నారు అధికారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో బుస్టర్ డోసుల పంపిణీని ప్రారంభించింది కేంద్రం. అది తొమ్మిది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. మే నెలలో పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయ్గురిలో నిర్వహించి సభలో సీఏఏపై మాట్లాడారు అమిత్ షా. సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన తర్వాత తొలిసారి రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా సీఏఏ ప్రస్తావన తీసుకొచ్చారు కేంద్ర మంత్రి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన అక్కడి మైనారిటీ హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే.. 2014, డిసెంబర్ 31లోపు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పించాలని నిర్ణయించారు. 2019, డిసెంబర్లో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మతం పేరుతో వివక్ష, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్లోని ముస్లింలను లక్ష్యంగా చేసుకునే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్, సీఏఏలు ఉన్నాయని పేర్కొన్నారు నిరసనకారులు. ఆ వాదనలను తోసిపుచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నిరసనలు రాజకీయంగా ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. ఏ ఒక్క భారతీయుడు తన పౌరసత్వాన్ని కోల్పోడని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: భవిష్యత్లో చరిత్రను నిర్దేశించేది డేటానే - ప్రధాని మోదీ