-
సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు జరిమానా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు. అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది Apologies for not wearing a seatbelt, but I thought that rule only applied to other people and not to us. You know, like all the other rules.#LevellingUpFundpic.twitter.com/ZzFmiHcgFL — Parody Rishi Sunak (@Parody_PM) January 19, 2023 -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాంపు. నిజానికి దీనిని ముద్రించి, విడుదల చేసినప్పుడు దీని ఖరీదు ఒక సెంటు (నాలుగు పైసలు) మాత్రమే! ఇప్పుడు దీని ధర ఏకంగా 8.5 మిలియన్ డాలర్లు (రూ.70.33 కోట్లు). అవాక్కయ్యారా? దీని ప్రాచీనత కారణంగానే ఇప్పుడు దీనికి ఇంత రేటు పలుకుతోంది. బ్రిటిష్ గయానాకు చెందిన ఈ తపాలా స్టాంపు 1856 నాటిది. బరువు ప్రకారం చూసుకుంటే, ప్రస్తుతానికి ఇదే ప్రపంచంలోని అత్యంత విలువైన వస్తువు. ఈ స్టాంపు బరువు 40 మిల్లీగ్రాములు. ఇదే బరువు గల నాణ్యమైన వజ్రం ధర దాదాపు 700 డాలర్లు (రూ.58 వేలు). ఇదే బరువు గల ఖరీదైన మాదకద్రవ్యం ఎల్ఎస్డీ ధర దాదాపు 5000 డాలర్లు (రరూ.4.13 లక్షలు). ఈ లెక్కన బ్రిటిష్ గయానాకు చెందిన ఈ ఒక సెంటు తపాలా స్టాంపు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అత్యంత విలువైన ఈ స్టాంపు ఇప్పటి వరకు తొమ్మిదిమంది యజమానుల చేతులు మారింది. ఇటీవల జరిగిన వేలంలో స్టేన్లీ గిబ్బన్స్ అనే కంపెనీ దీనిని సొంతం చేసుకుంది. -
ఘోరమైన వేడి-చల్లదనం.. ఈ ఏడాది అట్లుంది మరి!
లండన్: మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో బ్రిటన్ గజగజ వణికిపోతోంది. ఈ సీజన్లో ఐస్ల్యాండ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాట్స్వాల్డ్, బ్రిస్టల్, సౌత్ వేల్స్, హియర్ఫోర్డ్షైర్, కాంబ్రియా, షెఫీల్డ్ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్పోర్ట్లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్ సహా సౌత్, సెంట్రల్ ఇంగ్లాండ్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కాట్లాండ్లో మైనస్ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్ బ్లాస్ట్ ప్రభావమే’’ అంటున్నారు. ఇదీ చదవండి: ఆంక్షలను ఎత్తేయడంతో.. అల్లకల్లోలంగా తయారైంది -
బ్రిటన్, చైనా మధ్య స్వర్ణయుగం ముగిసింది: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. ‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! కాగా రిషి సునాక్ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు ‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం -
Video: కూచిపూడి డ్యాన్స్తో అలరించిన రిషి సునాక్ కూతురు
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ శుక్రవారం లండన్లో సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. తొమ్మిదేళ్ల అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటోంది. ఈ క్రమంలో రేజ్- ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022లో భాగంగా పలువురు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. అనౌష్క చేసిన కూచిపూడి నృత్యం అందరిని ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా యూకేలో జరిగే డ్యాన్స్ ఈవెంట్స్లో ఇదే అతిపెద్దది. నాలుగు నుంచి 85 ఏళ్ల వయసున్న దాదాపు వందమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగీత విద్వంసులు, డ్యాన్సర్స్, వీల్చెయిర్ నృత్యకారులు, పోలాండ్లోని నటరంగ్ గ్రూప్కు చెందిన అంతర్జాతీయ బర్సరీ విద్యార్థులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ డ్యాన్స్ ఈవెంట్కు రిషి సునక్ తల్లిదండ్రులతో పాటు అనౌష్క తల్లి అక్షతా మూర్తి హాజరయ్యారు. Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/cTDhegSN9Y pic.twitter.com/IisEz55stc — NDTV (@ndtv) November 26, 2022 కాగా యూకే ప్రధాని పదవిని చేపట్టిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అవతరించారు. ప్రధాని రిషి సునాక్కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కృష్ణ, అనౌష్క. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. చదవండి: బాక్సర్తో కలిసి మీసాలు తిప్పిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్ -
భారత్తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్టీఏ: రిషి సునాక్
లండన్: భారత్తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు. -
అమర్, అక్బర్, ఆంటోనీ సినిమాను తలపిస్తున్న యూకే నేతల మత సామరస్యం
-
Rishi Sunak: రిషి సునాక్ సక్సెస్ సీక్రెట్ ఇదే..
బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యారు . దీంతో బ్రిటన్ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా ఈయన చరిత్ర సృష్టించారు. బ్రిటన్ పార్లమెంట్లో సునాక్కు 193 మంది ఎంపీల మద్దతు ఉంది. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. కుటుంబ నేపథ్యం: రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో జన్మించారు. ఆయన పూర్వీకులు పంజాబ్కు చెందిన వారు. వారు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సునాక్ తండ్రి యశ్వీర్ కెన్యాలో.. తల్లి ఉష టాంజానియాలో జన్మించారు. వీరి కుటుంబాలు బ్రిటన్కు వలసవెళ్లాక వివాహం చేసుకున్నారు. ఉద్యోగం- వివాహాం : స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.. తొలుత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ► ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. ► చదువుకునే రోజుల్లోనే కన్జర్వేటివ్ పార్టీలో కొంతకాలం ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ► 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు. ► కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. ► రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ► డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. -
మనిషినే తాడుగా తిప్పుతూ.. నిమిషంలో 57 సార్లు స్కిప్పింగ్ చేసి రికార్డ్
శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకునేందుకు చాలామంది చాలా రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్నెస్కు తోడ్పడే వ్యాయామాలలో స్కిప్పింగ్ కూడా ఒకటి. రోజువారీగా స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అంతేగాక దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తాజాగా కొందరు వ్యక్తులు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డునే సృష్టించారు . దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డ్స్ వాళ్లు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో పోటీపడే వాళ్లు రెండు గ్రూప్లుగా విడిపోయి టైటిల్ కోసం తలపడ్డారు. అయితే సాధారణ తాడుతో ఆడి కాకుండా వినూత్నంగా రికార్డ్ క్రియేట్ చేశారు. తాడుకు బదులు మనిషిని ఉపయోగిస్తూ స్కిప్పింగ్ చేశారు. మనిషిని పైకి కిందకు తిప్పుతూ కేవలం నిమిషంలో ఏ జట్టు ఎక్కవసార్లు స్కిప్లు చేస్తే వారు విజేతలుగా నిలిచినట్లు అవుతుంది. ఇందులో యూకేకు చెందిన అక్రోపోలిస్(బ్లూ డ్రెస్) అనే జట్టు, వైల్డ్ క్యాట్స్ చీర్ టీమ్తో తలపడింది. అయితే నిమిషంలో 57 సార్లు స్కిప్లు పూర్తి చేసి యూకే టీం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్లు, కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్లు ఆశ్యర్చం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘వావ్.. అద్భుతం’ అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు.. ‘ఇది పూర్తయిన తరువాత ఆ అబ్బాయి పాపం వాంతి చేసుకుని ఉంటాడు. బాలుడి తల నేలకు తాకితే ఎంత ప్రమాదం.. దయచేసి ఇలాంటివి అనుకరించవద్దు’ అని సూచిస్తున్నారు. The cheapest skipping rope is a human one... Which team can get in the most skips in one minute? pic.twitter.com/6GJWsj9nAN — Guinness World Records (@GWR) October 21, 2022 -
Liz Truss: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది. పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక లిజ్ ట్రస్ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్ ట్రస్ నెలకొల్పారు. తెరపైకి పలువురి పేర్లు లిజ్ ట్రస్ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు. అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు. జీవించి ఉన్న ఏడుగురు మాజీలు ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్ జాన్సన్, థెరెసా మే, డేవిడ్ కామెరూన్, గోర్డాన్ బ్రౌన్, సర్ టోనీ బ్లెయిర్, సర్ జాన్ మేయర్ సరసన ఇప్పుడు ట్రస్ చేరారు. 45 రోజుల ప్రధానమంత్రి యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు. బాధ్యత నెరవేర్చలేకపోయా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్లోని డౌనింగ్ స్ట్రీట్లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే? -
రిషి సునాక్ను ప్రధాని చేసేందుకు కుట్ర!
లండన్: యూకే సంక్షోభం నడుమ ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్ను దించేసి.. రిషి సునాక్తో భర్తీ చేయడానికి రెబెల్స్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెజార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెబల్స్ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. అయితే.. కన్జర్వేటివ్ పార్టీలో ఈ పరిణామాలేవీ సహించడం లేదు. ప్రత్యేకించి రెబల్స్ మాత్రం లిజ్ ట్రస్ను పార్టీ నేతగా తప్పించి.. మాజీ ప్రధాని ప్రత్యర్థి రిషి సునాక్ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని ది టైమ్స్ YouGov పోల్ వెల్లడించింది. అంతేకాదు కన్జర్వేటివ్లో సగం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలోకి చేరుకున్నట్లు ఆ పోల్ సర్వే తెలిపింది. సుమారు 62 శాతం మంది తమది రాంగ్ ఛాయిస్ అయ్యిందనే పశ్చాత్తంలో ఉండిపోయారట. ఇక.. 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందే అనే అభిప్రాయం వ్యక్తం చేశారట. అదే సమయంలో రిషి సునాక్తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలన సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని.. అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ సైతం ఉన్నారని ఆ పోల్ వెల్లడించింది. అయితే యూకే చట్టాల ప్రకారం టెక్నికల్గా లిజ్ ట్రస్కి ఏడాదిపాటు పదవి గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్కు సవాల్ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్లు ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. ఇదికాగా.. నేరుగా పెన్నీ మోర్డాంట్ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, ఇదంతా సులభమైన విషయమేమీ కాదని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారు, ఎంపీ నాడైన్ డోరీస్ చెప్తున్నారు. అదే సమయంలో అధికార మార్పు అనుకున్నంత ఈజీనే అంటూ కన్జర్వేటివ్ సీనియర్ సభ్యులు ఒకరు చేసిన వ్యాఖ్యల్ని ది టైమ్స్ కథనం ఉటంకించింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన -
శరీరాన్ని స్ప్రింగులా వంచేసి.. రికార్డులు కొట్టేసి..
పై ఫొటోలో అమ్మాయిని చూశారా? స్ప్రింగ్లు మింగినట్లుగా వెన్నును మెలి తిప్పింది కదా! అందుకే...ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గాళ్గా రికార్డు సృష్టించింది. యూకేలోని పీటర్బరోకు చెందిన 14 ఏళ్ల లిబర్టీ బారోస్.. జిమ్నాస్ట్. 30 సెకన్లలో ఛాతీని ఫ్లోర్ వరకు పదకొండుసార్లు వంచేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. తనకు మాత్రమే సొంతమైన ఈ బెండ్కు ‘ద లిబర్టీ లోడౌన్’అని పేరు కూడా పెట్టింది. 2017లో ఓసారి.. రిహన్నా అంబ్రెల్లా డ్యాన్స్ మూవ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన శరీరాన్ని ఎలాగైనా వంచగలనని తెలుసుకున్న లిబర్టీ.. అప్పటినుంచి తన శరీరాన్ని స్ప్రింగ్లా తిప్పేస్తూ బోలెడు క్రేజ్ సంపాదించుకుంది. -
అదృష్టం అంటే ఇది.. కిచెన్లో బంగారు నాణేలు.. ఊహించని ధరతో షాక్!
అదృష్టం ఆవగింజంత, దురదృష్టం దబ్బకాయంత అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, యూకేలోని ఓ కుటుంబానికి మాత్రం అది వర్తించలేదు. వారికి అదృష్టం కూడా దబ్బకాయంత పట్టుకుంది. పదేళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇంటిలో భారీ ఎత్తున బంగారు నాణేలు లభించిన వార్త సెప్టెంబరు నెలలో చదివే ఉంటారు! తాజాగా ఆ వార్త తాలూకు మరో విషయం వైరల్గా మారింది. ఇంటి వంటగదిలో మరమ్మతులు చేస్తుండగా క్రీ.శ.1700 ప్రారంభ కాలానికి చెందిన 254 గోల్డ్ కాయిన్స్ బయల్పడిన సంగతి తెలిసిందే. అయితే, వాటిని అమ్మితే సుమారు రూ.2.3 కోట్లు (2,50,000 యూకే పౌండ్లు) రావొచ్చని అంచనావేశారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రెగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు. 292 ఏళ్ల పూర్వ కాలానికి చెందిన ఈ సంపదను చేజిక్కిచ్చుకునేందుకు ప్రపంచంలోని చాలామంది ఔత్సాహికులు పోటీ పడ్డారని ఆయన వెల్లడించారు. ముందుగా అనుకున్నదానికంటే మూడు రెట్లు అధికంగా ధర రావడం ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. కాగా, పాతకాలానికి చెందిన ఆ బంగారు సంపదను చిన్న మొత్తాల్లో విక్రయించారని మెట్రో నివేదిక పేర్కొంది. (చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!) -
యూకేలో హిందూ ఆలయాలపై వరుస దాడులు
-
మందేయడంలో గిన్నిస్ రికార్డ్.. 17 గంటల్లో 56 పబ్లకు.. 30 లీటర్లు తాగడంతో
ఇంగ్లండ్లోని బ్రైటన్కు చెందిన నాదన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్కే చెందిన గ్యారెత్ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్ బద్దలుకొట్టాడు. గిన్నిస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్ మాత్రం ఒక పబ్లో మద్యం, మరో పబ్లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు. చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని.. ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్లను జీపీఎస్ పరికరం ద్వారా మార్కింగ్ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్’ షాట్స్, టకీలా, లేగర్ మొదలైనవి ఉన్నట్లు క్రింప్ తెలిపాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్ వివరించాడు. -
ప్రాణాలు కాపాడిన స్మార్ట్వాచ్
స్మార్ట్ వాచ్... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటి? అదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అదెలా జరిగిందంటే... యూకేకు చెందిన 54 ఏళ్ల డేవిడ్కు ఇటీవల పుట్టినరోజు సందర్భంగా అతని భార్య సారా, యాపిల్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే.. పల్స్రేట్ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి. కానీ డేవిడ్కు 30 మాత్రమే నమోదవుతుండటంతో వాచ్ సరిగ్గా పనిచేయట్లేదేమోనని డేవిడ్ అనుకున్నాడు. కానీ అతని భార్య పదేపదే వెంటపడటంతో హాస్పిటల్కు వెళ్లాడు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేయిస్తే... అతను కార్డియాక్ అరెస్టుతో మృతి చెందే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బ్లాక్ వల్ల గుండెలోని ‘జంక్షన్ బాక్స్’ పనిచేయడం ఆగిపోతోందన్నారు. అలా 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్లపాటు అతని గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతని గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, అతను ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు సర్జరీతో గుండెలోని బ్లాక్స్ను తొలగించారు. అలాగే భవిష్యత్తులో అతని హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా చేసేందుకు వీలుగా గుండెలో ఒక ‘పేస్మేకర్’ పరికరాన్ని సైతం అమర్చారు. దీంతో ఇప్పుడు అతని గుండె పనితీరు మెరుగుపడింది. ‘నా భార్య నాకు స్మార్ట్వాచ్ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు... నేను బతికి ఉండేవాడిని కాదు. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క చార్జింగ్ సమయంలో తప్ప వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది’ అని డేవిడ్ చెబుతున్నాడు. -
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు. -
ఎలిజబెత్-2 వివాహానికి ఖరీదైన డైమండ్ నెక్లెస్ను గిఫ్గ్గా ఇచ్చిన నిజాం నవాబు
క్వీన్ ఎలిజబెత్2.. పేరుకు తగ్గట్టే జీవితాంతం మహారాణిలా బతికారు. 75 ఏళ్లపాటు బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజబెత్.. సుదీర్ఘకాలం ఆ హోదాలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. క్వీన్ ఎలిజబెత్కు భారత్తో ఎంతో అనుబంధం ఉంది. భారత్ను 200 ఏళ్లపాటు పాలించిన బ్రిటిషర్లు.. దేశానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించిన అయిదేళ్ల తర్వాత క్వీన్ ఎలిజబెత్ మహారాణిగా ఎంపికయ్యారు. 1952లో బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించారు. రాణి అయ్యాక ఆమె మూడుసార్లు భారత్ను సందర్శించారు. 1961లో తొలిసారి భారత్ను సందర్శించగా.. 1983, 1997లోనూ క్వీన్ ఎలిజబెత్ భారత్లో పర్యటించారు. క్విన్ ఎలిజబెత్ వివాహానికి హైదరాబాద్ నిజాం నవాబు తన హోదాకు తగ్గట్టు అత్యంత విలువైన బహుమతిని ఇచ్చారు. 1947లో క్వీన్ ఎలిజబెత్ వివాహం జరగగా.. 300 వజ్రాలు పొదిగిన ఐకానిక్ ప్లాటినమ్ నెక్లెస్ సెట్ను అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యువరాణిగా గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రిన్సెస్ ఎలిజబెత్ తన వివాహ కానుకను స్వయంగా ఎంచుకోవాలని నిజాం లండన్కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ కార్టియర్ ప్రతినిధులను ఆమె వద్దకు పంపించాడు. దీంతో ఆమె తనకెంతగానో నచ్చిన ప్లాటినం నక్లెస్ను ఎంపిక చేసుకున్నారని రాయల్ ఫ్యామిలీ స్వయంగా వెల్లడించింది. చదవండి: King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) తన 70 ఏళ్ల పాలనలో ఎంతో మంది నుంచి ఎన్నో విలువైన వస్తువులను, అభరణాలను కానుకగా స్వీకరించినప్పటికీ.. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్’ తయారు చేసిన 300 వజ్రాలతో పొదిగిన ప్లాటినం నెక్లెస్ సెట్ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ దగ్గరున్న అత్యంత ప్రసిద్ధ ఆభరణాలలో ఒకటి. ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్ను క్వీన్ ఎలిజబెత్ తరచుగా ధరించేవారు. ప్రస్తుతం దీని విలువ 66 మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుందని అంచనా. రాణి నెక్లెస్ ధరించి దగిన ఫోటోలను ది రాయల్ ఫ్యామిలీ అధికారిక ఇన్స్టాగ్రామ్లో జూలై 21న పోస్ట్ చేశారు. ఇందులో క్వీన్ ఎలిజబెత్ 1952 ఫిబ్రవరిలో బ్రిటన్ రాణి హోదా స్వీకరించిన కొద్ది రోజుల తర్వాత తీసిన ఫోటో ఉంది. ఈ నెక్లెస్ను ఎలిజబెత్ తన మనవడి భార్యకు అప్పుగా కూడా ఇచ్చారు. ఆమె దానిని 2014లో నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో, 2019లో డిప్లొమాటిక్ కార్ప్స్ రిసెప్షన్లో ధరించింది. -
King Charles: బ్రిటన్ రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు ఇవే
లండన్: బ్రిటన్ను సుధీర్ఘకాలం పాలించిన మహారాణి రెండవ ఎలిజబెత్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో తుదిశ్వాస విడిచారు. 25 ఏళ్లకే బ్రిటన్ రాణి కిరీటం అందుకున్న ఎలిజబెత్ 70 ఏళ్లకు పైగా ఆ హోదాలో కొనసాగారు. ఇక ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా అవతరించనున్నారు. చార్లెస్కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం... రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. రాణి ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్ (73) బ్రిటన్కు కొత్త రాజు కానున్నారు. చార్లెస్ 1948 నవంబరు 14న బకింగ్హామ్ ప్యాలెస్లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు. 1981లో డయానాను వివాహమాడిన చార్లెస్ దంపతులకు ఇద్దరు కుమారులు.. ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీ. వ్యక్తిగత కారణాలతో చార్లెస్ డయానా దంపతులు 1992లో విడిపోయారు. అనంతరం 2005లో 56 ఏళ్ల వయసులో చార్లెస్.. కెమెల్లా పార్కర్ను రెండో వివాహం చేసుకున్నారు. మాజీ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన చార్లెస్.. కింగ్ చార్లెస్-3గా వ్యవహరించనున్నారు. అలాగే 14 కామన్వెల్త్ దేశాలకూ రాజుగా కూడా ఉంటారు. బ్రిటన్ కొత్త రాజుకు గల అసాధారణ ప్రత్యేకతలు పాస్పోర్టు లేకుండా విహారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలరు. లైసెన్స్ లేకుండా ప్రయాణించగలరు. రాజకుటుంబంలోని ఇతర సభ్యుల మాదిరి ఆయనకి పాస్పోర్టు అవసరం లేదు. బ్రిటన్ రాజు ఎక్కడా, ఎలాంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా ప్రయణించగలడు. వారికి అవసరమైన సహాయాన్ని, రక్షణ అందిస్తూ బ్రిటన్ రాజు పేరు మీద ప్రత్యేక డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ కారణంతో బ్రిటన్లో ఎక్కడైనా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయగల ఏకైక వ్యక్తి రాజు మాత్రమే. రెండు పుట్టినరోజులు చార్లెస్ తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 రెండు పుట్టినరోజులు జరుపుకుంటారు. ఆమె అసలు పుట్టిన రోజుఏప్రిల్ 21. దీనిని ప్రైవేట్గా జరుపుకుంటారు. అయితే వేసవి వాతావరణం అవుట్డోర్ పరేడ్స్(బహిరంగ కవాతులకు) అనుకూలంగా ఉంటుందని జూన్ నెలలోని రెండో మంగళవారాన్ని రాణి అధికారిక బహిరంగ వేడుకగా నిర్వహిస్తారు. ఇక చార్లెస్ పుట్టినరోజు కూడా శీతాకాలం ప్రారంభమయ్యే నవంబర్ 14న ఉండటంతో అతని బర్త్డేను కూడా వేసవి నెలలో 2అధికారిక పుట్టినరోజు’గా జరిపే అవకాశం ఉంది. ఈ బహిరంగ వేడుకల్లో 1,400 కంటే ఎక్కువ మంది సైనికులు, 200 గుర్రాలు, 400 మంది సంగీతకారులు పాల్గొంటారు. సెంట్రల్ లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి రాజ కుటుంబ సభ్యులు చూస్తుండగా రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫ్లై-పాస్ట్తో ఈ వేడుక కార్యక్రమాలను ముగిస్తుంది. నో ఓటింగ్ బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు ఓటింగ్లో పాల్గొనరు. అలాగే ఎన్నికల్లో పోటీచేయరు. దేశాధినేతగా, అతను రాజకీయ వ్యవహారాల్లో ఖచ్చితంగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీరు పార్లమెంటరీ సమావేశాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పార్లమెంటు నుంచి వచ్చే చట్టాలకు ఆమోదముద్ర వేస్తారు. అదే విధంగా ప్రధానమంత్రితో వారానికోసారి సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రజలకే కాదు బ్రిటీష్ చక్రవర్తి ప్రజలను మాత్రమే పరిపాలించరు. 12వ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్, వేల్స్ అంతటా బహిరంగ జలాల్లోని మూగ హంసలు చక్రవర్తి ఆస్తిగా పరిగణించబడుతున్నాయి. వీటితోపాటు బ్రిటీష్ జలాల్లోని స్టర్జన్(ఒక రకం చేప), డాల్ఫిన్లు, తిమింగలాలకు కూడా రాయల్ ప్రత్యేకాధికారం వర్తిస్తుంది. అధికారిక రచయిత బ్రిటన్ చక్రవర్తి కోసం పద్యాలను రచించేందుకు ప్రతి 10 సంవత్సరాలకు ఆస్థాన కవిని నియమిస్తారు. ఈ సంప్రదాయం 17వ శతాబ్దం నుంచి వస్తోంది. 2009లో కరోల్ ఆన్ డఫీ రచయితగా నామినేట్ అయిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె 2011లో ప్రిన్స్ విలియం వివాహం, 2013లో క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేక 60వ వార్షికోత్సవం, 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం కోసం పద్యాలను కంపోజ్ చేశారు. రాయల్ వారెంట్ చక్రవర్తికి వస్తువులు సరఫరా చేసే., సేవలను అందించే కంపెనీలకు రాయల్ వారెంట్ జారీ చేస్తారు. ఈ వారెంట్ వారికి గొప్ప గౌరవాన్ని అందించడమే కాకుండా అమ్మకాల ప్రోత్సాహనికి ఉపయోగపడుతుంది. వారెంట్ పొందిన కంపెనీలు తమ వస్తువులపై రాజ ఆయుధాలను ఉపయోగించేందుకు అధికారం కలిగి ఉంటాయి. బర్బెర్రీ, క్యాడ్బరీ, జాగ్వార్ కార్స్, ల్యాండ్ రోవర్, శాంసంగ్, వెయిట్రోస్ సూపర్ మార్కెట్లు రాయల్ వారెంట్ ఉన్న కంపెనీలలో ఉన్నాయి. -సాక్షి, వెబ్డెస్క్ -
క్వీన్ ఎలిజబెత్-2 ప్రస్థానంలో కీలక ఘట్టాలివే!
ఒక్కవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. తాజాగా.. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె రాణి ప్రస్థానం గమనిస్తే.. కీలక పరిణామాలకు మౌనసాక్షి 70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్–2 రాణి ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్–2 హయాంలో బ్రిటన్కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్–3గా పదవిలో కొనసాగుతారు. నిరాడంబర జీవితం క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు. ► ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్లోని 17 బ్రూటన్ స్ట్రీట్లో జన్మించారు. ► తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్ ► గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్బాటెన్ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ► 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్మిన్స్టర్ అబ్బేలో బ్రిటన్కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ► క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. ► 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్ను తప్ప ఆమె అందరినీ కలిశారు. ► యునైటెడ్ కింగ్డమ్తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ► ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్లో ఉన్న థాయ్లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. ► 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ► భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్లో కన్నుమూశారు. ► ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ► అనారోగ్యంతో ఆమె మరణించిన క్రమంలో ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ► ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
బ్రిటన్ కొత్త ప్రధాని మేరీ ఎలిజబెత్ ట్రస్
-
Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. బ్రిటన్ వెనుకబాటుకూ, భారత్ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్ 814 బిలియన్ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్ డాలర్ల లెక్కన భారత్ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్ పౌండ్ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్ను భారత్ దాటేస్తుందని ఐఎంఎఫ్ అంచనా. బ్రిటన్లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్ను వెనక్కి నెట్టి, భారత్ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్ రివెంజ్’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. కరోనా, ఉక్రెయిన్లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్’ (యూహెచ్సీ) లెక్కన చూసినా భారత్ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 2016 నాటికే బ్రిటన్ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్ను మధ్య ఆదాయ దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి. -
ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్: 5 కీలక అంశాలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ను వెనక్క నెట్టి ఇండియాఐదోస్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆరో స్థానానికి చేరింది. ఒక దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, యూకే 5వ స్థానంలో ఉంది. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి "అభివృద్ధి చెందిన" దేశంగా అవతరించాలని ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ కోరుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యూకేను, అదీ రెండు శతాబ్దాల పాటు భారత ఉపఖండాన్ని పరిపాలించిన ఒకదానిని దాటడం ఒక ప్రధాన మైలురాయిగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలతో భారత్సహా వివిధ దేశాల ఆర్థికవ్యవస్థలు అతలాకుతలమైనాయి. ఎక్కడిక్కడ వ్యాపారాలు, రవాణా వ్యవస్థలు స్థంభించి పోవడంతో వృద్ధిరేటు పతమైంది. అయితే ఈసంక్షోభంనుంచి శరవేగంగా పుంజుకున్న ఇండియనన్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తోంది. బ్లూమ్బెర్గ్ ప్రకారం, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, 2022 మార్చి చివరిలో యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఇండియా ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై చాలా నివేదికలు వచ్చాయి బ్లూమ్బెర్గ్ ఏఎంఎఫ్ డేటాబేస్ , చారిత్రాత్మక మారకపు ధరలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చింది. ఈఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లుగా భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.కానీ భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి చేరడం విశేషం. రానున్న సంవత్సరాలలో భారతదేశం, బ్రిటన్ మధ్య భారీ అంతరం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 5 కీలక అంశాలు, పోలికలు ఇరు దేశాలమధ్య జనాబా, తలసరి జీడీపీ, పేదరికం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్,యూనివర్సల్ హెల్త్కేర్ కవరేజ్ అంశాలను పోల్చింది. రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత ప్రాథమిక వ్యత్యాసాలలో జనాభా. 2022 నాటికి, భారతదేశంలో 1.41 బిలియన్ల జనాభా ఉండగా, యూకేజనాభా 68.5 మిలియన్లు. మరో మాటలో చెప్పాలంటే, భారత జనాభా 20 రెట్లు ఎక్కువ. రెండు దేశాల జనాభా వ్యత్యాసం నేపథ్యంలో తలసరి జీడీపీతో పోలిస్తే సగటు భారతీయుని ఆదాయం చాలా తక్కువ. దీన్ని దేశంలో పేదరిక స్థాయిని అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దం ప్రారంభంలో, భారత్తో పోలిస్తే అత్యంత పేదరికంలో ఉన్న బ్రిటన్ ఇపుడు మెరుగ్గానే ఉంది. అయితే పేదరికాన్ని అరికట్టడంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించినప్పటికీ బ్రిటన్ కంటే మెరుగ్గాలేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ జీడీపీ డేటా వేగవంతమైన ఆర్థిక వృధ్దిని సూచిస్తుంది. ఆరోగ్యం, విద్య , జీవన ప్రమాణాల సమ్మేళనమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం, 1980లో బ్రిటన్ ఉన్న స్థితికి భారతదేశం ఇంకా ఒక దశాబ్దం పట్టవచ్చు. యూనివర్సల్ హెల్త్కేర్ కవరేజ్ ఒక దేశంగా ధనవంతులుగా మారడానికి కీలకమైన అంశం పౌరులకు అందుబాటులో ఉండే జీవన నాణ్యత. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్ పునరుత్పత్తి, తల్లి, నవజాత, శిశు ఆరోగ్యం, అంటు వ్యాధులు, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, సర్వీసెస్ సహా అవసరమైన సేవల సగటు కవరేజ్ విషయంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించినా 2005 నుండి ఆరోగ్య సంరక్షణ పథకాలపై ప్రభుత్వ విధాన దృష్టి భారతదేశానికి ప్రత్యేకమైన మెరుగుదలను అందించినప్పటికీ, బ్రిటన్తో పోలిస్తే ఇంకా చాలా గ్యాప్ ఉంది. -
పోలీసులకు చిక్కకుండా గర్ల్ఫ్రెండ్ టెడ్డీబేర్లో దాక్కున్న దొంగ.. చివరికి
కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ అయినప్పుడు.. కార్టూన్ క్యారెక్టర్స్ వేషంలో ప్రమోషన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్ పోసుకుని బంక్లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్ను కట్చేసి, అందులో కొంత స్టఫ్ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్ గర్ల్ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. ఇంకేముంది... అందులోంచి డాబ్సన్ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వార్త వైరల్ అవుతూ నెటిజన్స్కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్’, ‘‘అన్ ‘బేర’బుల్’’, ‘టెడ్డీబేర్ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి -
Manju: 85 ఏళ్ల బామ్మ! గుజరాత్లో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి.. బ్రిటన్లో రెస్టారెంట్!
ఇండియాలో పుట్టి, ఆఫ్రికాలో పెరిగి, ఇంగ్లాండ్లో స్థిరపడింది. అయినా భారతీయ వంటకాలను అద్భుతంగా వండుతూ ఎంతోమంది కస్టమర్ల మనసులను దోచుకుంటోంది 85 ఏళ్ల బామ్మ. తొమ్మిది పదులకు చేరువలో ఉన్నప్పటికీ ఎంతో చలాకీగా దేశీయ వంటకాలను వండివార్చుతూ మంచి కుక్గా పేరు తెచ్చుకున్న ఈ పెద్దావిడే మంజు. రుచికరమైన ఈ వంటకాలను యూరోపియన్లు సైతం లొట్టలేసుకుని లాగించేస్తూ వావ్ అంటున్నారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1936లో మంజు పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా ఉగాండాలో స్థిరపడడంతో అమ్మతో కలిసి ఆ దేశం వెళ్లింది. మంజుకు పన్నెండేళ్ల వయసులో తండ్రి మరణించాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఇంట్లో తనే పెద్ద కావడంతో..∙తోబుట్టు వుల భారం కూడా తనపై పడింది. దీంతో తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ రోజూ వివిధ రకాల అల్పాహారాలు తయారు చేయడం నేర్చుకుని, పద్నాలుగేళ్ల వయసులో టిఫిన్లు తయారు చేసి విక్రయించేది. అమ్మతో కలిసి పనిచేస్తోన్న సమయంలో చనా దాల్ మంజుకు బాగా నచ్చింది. దీంతో గుజరాతీ సంప్రదాయ వంటకాలన్నింటినీ తల్లి దగ్గర నేర్చుకుని రుచికరంగా తయారు చేసేది. ఒకపక్క టిఫిన్లు విక్రయిస్తూనే, ట్యూషన్లు కూడా చెప్పేది. పెళ్లి తరువాత కూడా.. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగిన మంజుకి పెళ్లి తరువాత కూడా ఒడిదొడుకులు తప్పలేదు. 1964లో గుజరాత్ మూలాలున్న ఆఫ్రికన్ వ్యాపారవేత్తతో మంజుకు పెళ్లయ్యింది. వెంటవెంటనే ఇద్దరు కొడుకులు నైమేష్, జైమిన్లు పుట్టారు. వాళ్లకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఉగాండలో రాజకీయ పరిస్థితులు మారి అక్కడ నిబంధనలు మారడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్కు వలస వెళ్లింది. అక్కడ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారు. ఉదయం స్విచ్బోర్డుల తయారీ ఫ్యాక్టరీలో మంజు ఉద్యోగానికి వెళ్తే భర్త పిల్లల్ని చూసుకునేవాడు. రాత్రి అతను ఉద్యోగం చేస్తే మంజు పిల్లలను చూసుకునేది. అలా ఇద్దరూ ఎంతో కష్టపడి పిల్లలిద్దరినీ పెంచారు. ఏళ్లపాటు ఫ్యాక్టరీలో పనిచేసిన మంజు 65 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యింది. బాధ్యతలు తీరాయి కానీ... కుటుంబ బాధ్యతల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి నుంచి వంటలు చేసే అలవాటు ఉండడం వల్ల చిన్న రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉండేది మంజుకి. కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ తన దగ్గర రెస్టారెంట్ నడపడానికి కావలసినన్ని డబ్బులు ఉండేవి కావు. తన కల ఎప్పుడు నెరవేరుతుందా... అని ఎదురు చూస్తుండేది. అమ్మకోరికను ఎలాగైనా నెరవేర్చాలన్న సంకల్పంతో కొడుకులిద్దరూ తాము దాచుకున్న డబ్బులతో లండన్ నగరానికి దగ్గర్లో ఉన్న బ్రిటన్లో చిన్న రెస్టారెంట్ను ప్రాంభించారు. దీంతో మంజు ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న కల 80 ఏళ్ల వయసులో నిజమైనట్లనిపించింది. పూర్తిగా గుజరాతీ శాకాహార భోజనం, నాణ్యమైన నూనె, ఇతర దినుసులతోనే వండడం, నాలుగు రకాల పదార్థాలతో షేరింగ్ థాలీని అందుబాటులో ఉంచడంతో రెస్టారెంట్ కొద్దికాలంలోనే యూరోపియన్లను అమితంగా ఆకర్షించింది. దీంతో చుట్టుపక్కల అనేక ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ మంజు రెస్టారెంట్కే కస్టమర్లు ఎగబడేవారు. దీనికి తోడు ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్ర లేచి రాత్రి పన్నెండు గంటల వరకు రెస్టారెంట్లో వంటకాలను తన స్వహస్తాలతో తయారు చేయడం బాగా కలిసి వచ్చింది. కొడుకులతో పాటు కోడళ్లు దీపాలీ, కిట్టీలు కిచెన్లో మంజుకి సాయం చేస్తుండడంతో తక్కువమంది సిబ్బందితో రెస్టారెంట్ చక్కగా నడిపిస్తున్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా.. మంజు ఇండియా వచ్చింది కేవలం మూడుసార్లే అయినప్పటికీ..తన తల్లిదగ్గర నేర్చుకున్న అనుభవంతో పానీపూరి, బేల్పూరి, పనీర్ మసాలా, కనడ పాలక్, కధీ, ఆలుకీ సబ్జి, దాల్ ధోక్లి, ఉందాయు, తెప్లా, ఖందవి వంటి రుచికరమైన వంటకాలను రెస్టారెంట్లో అందిస్తోంది. దేశీయ రుచులతోపాటు... భారతీయ సంప్రదాయ పండగలను వేడుకగా నిర్వహించడం, పండుగకు తగ్గట్టుగా రెస్టారెంట్ను అలంకరించడం, ప్రత్యేకమైన మెనూ, సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి అక్కడి వాళ్లను ఎంతగానో అకట్టుకుంటున్నాయి. గుజరాత్ సంస్కృతీ సంప్రదాయం ఉట్టిపడేలా రెస్టారెంట్లో పాత్రలు, పోస్టర్లు, సిబ్బంది డ్రెíస్సింగ్ ఉంటుంది. మంజు కస్టమర్లలో ఇంగ్లిష్, ఇండియన్, విఐపీలు ఉన్నారు. ఆమె చేసిన నిమ్మకాయ పచ్చడికి గాను ‘గ్రేట్ టేస్ట్’ అవార్డును కూడా అందుకుంది. సంకల్పం గట్టిదైతే ఏళ్లుగడిచినా అనుకున్నది తప్పక నెరవేరుతుందనడానికి మంజు జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!