Unemployment benefit
-
నయవంచనపై యువ గర్జన
విజయనగరం మున్సిపాలిటీ: విద్యలకు నిలయమైన విజయనగరం జిల్లా యువత గర్జించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా నిరుద్యోగలను నయవంచనకు గురి చేస్తోన్న చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యువగర్జన ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన హమీల అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో యువత నల్ల చొక్కలు ధరించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. స్థానిక కోట జంక్షన్ వద్ద మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిలు యువగర్జన ర్యాలీని ప్రారంభించగా.. డీసీసీబీ రోడ్, మూడులాంతర్ల జంక్షన్, మెయిన్రోడ్, గంటస్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి ఆలయం జంక్షన్, డాబాగార్డెన్స్, స్టేట్బ్యాంక్ మెయిన్ బ్రాంచ్, ఎన్సీఎస్ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీ సాగింది. చంద్రబాబు సర్కారు నయవంచన పాలనపై పెద్దపెట్టున యువత గర్జించారు. సీఎం డౌన్డౌన్.. నిరుద్యోగులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలంటూ నినదించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జిల్లా యువజన, విద్యార్థి విభాగం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన హమీలను మర్చిపోవడంతో పాటు మోసపూరిత మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు. 14న జిల్లాకు వస్తున్న చంద్రబాబుకు కనువిప్పు కలగాలని, నిరుద్యోగుల వేదనను తెలియజెప్పాలనే ఈ యువగర్జన కార్యక్రమం నిర్వహించామన్నారు. చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన హమీల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 15 నెలల కిందట జ్యూట్ మిల్లులు తెరిపిస్తానని చేసిన ప్రకటనల ఇప్పటికీ అమలుకునోచుకోలేదన్నారు. వేలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు, సీఎం తరువాత తన కొడుకు లోకేష్ను మంత్రి చేసుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత ఉండగా... వారికి ఉపాధి అవకాశాలు లేక పొట్టచేత పట్టుకుని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఇతరప్రాంతాలకు వలసలు వెళ్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఈ రోజు వరకు జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కేటాయించిన సంక్షేమ నిధులు పచ్చచొక్కా నేతల జేబుల్లోకి చేరుతున్నాయని విమర్శించారు. యువత మేల్కొనాలి... బాబు నయవంచక పాలనపై యువత మేల్కొనాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెడుతూ, వారికి అండగాఉన్న పచ్చమీడియాతో ప్రజలను మాయచేస్తూ నాలుగేళ్లు పాలన సాగించారన్నారు. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు యువత, విద్యార్థులు నడుంబిగించాలన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి ఉన్న జాబ్లను పీకేసారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వకుంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన పెద్ద మనిషి నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికల వేళ రూ.వెయ్యి చొప్పున ఇస్తామంటూ ప్రకటించి మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ద్వారా మళ్లీ రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, జిల్లా కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌషిక్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నెలపర్తి రాజ్కుమార్లు మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నగర కన్వీనర్ ఆశపు వేణు, మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్ కౌన్సిలర్లు ఎస్వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.వి.రంగారావు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డితో పాటు పార్టీ నాయకులు మారోజు శ్రీను, రెడ్డి గురుమూర్తి, కెల్ల త్రినాథ్, గాదం మురళి, తాడ్డి సురేష్, ఆవాల రోహిణీకుమార్, చిన్నిరవితేజ, బి.కిరణ్, జి.సన్యాసిరావు, బండారు ఆనంద్, కె.జగదీష్, కరకవలస అనీల్, కె.రమేష్, తరుణ్, చలుమూరి ఫణిరాజశేఖర్, బి.అప్పలరాజు, ఎం.నాగబాబు, రజినీ, టి.ప్రసాద్, గుణ, బైక్ రమేష్, రవి పట్నాయక్, ఎస్. ప్రసాద్, తాళ్లపూడి పండు, కృష్ణ, గోపి, శ్రీను, బాషా, శివ, లక్ష్మణ్, నాని, వైగేర్ ప్రసాద్, కరుణాకర్, అశోక్, వాసు, మురళి, అవినాష్, అంజిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
నారా లోకేష్ వ్యాఖ్యలపై పేలుతున్న సెటైర్లు
సాక్షి, గుంటూరు, మాచర్ల రూరల్: యువకులు రూ.1000 భృతితో సెల్ఫోన్ కొనుక్కొని ఇంట్లో పడుకొని జల్సా చేయవద్దని మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడే ఉన్న యువత రూ.1000 భృతితో సింగపూర్ పర్యటన కూడా చేస్తామంటూ హేళన చేశారు. మంగళవారం దుర్గి మండలం ముటుకూరులో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులైన సాధికార మిత్ర, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, ఉపాధి మేట్లతో మాట్లాడించారు. వారికి ముందుగానే అధికారులు తర్ఫీదు ఇచ్చారు. ఎంత కూలి వస్తుందో తెలియదు సత్యవాణి అనే ఉపాధి మేట్ను రోజుకు ఎంత వేతనం వస్తుందని అడుగగా ఆమె తెలియదని చెప్పడంతో మంత్రి లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా డ్వామా పీడీ పులి శ్రీనివాస్ను పిలిచి వివరాలు అడిగారు. మరొక మహిళ కోటేశ్వరి తాను ఇంజినీరింగ్ పూర్తి చేశానని, ఈ ప్రాంతంలో సాంకేతిక పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 720 పెద్ద పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పుకొచ్చారు. నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఆ యువతి అసహనం వ్యక్తం చేశారు. రానున్న రోజులు ఎన్నికల సమయమని, బీజేపీ వారు రాయలసీమ డిక్లరేషన్, సినీనటుడు పవన్కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ముటుకూరు గ్రామానికి 4 కిలోమీటర్ల సీసీ రోడ్డు, మించాలపాడు, ముటుకూరు, కోలగుట్ల, శివలింగాపురం, నెహ్రూనగర్, మంగాపురం తండా లింకు రోడ్లకు రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జేసీ ఇంతియాజ్ అహ్మద్, జేసీ–2 విజయచందర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులు నేలపైనే.. పాత్రికేయుల కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ గ్యాలరీ సభా వేదికకు మూలన ఉండటంతో కార్యక్రమం పర్యవేక్షించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై అడిగేందుకు వచ్చిన పత్రికా ప్రతినిధులను అక్కడే ఉన్న కార్పెట్పై కింద కూర్చోవాలని మంత్రి సైగ చేశారు. విధి లేక కిందనే కూర్చొని న్యూస్ కవరేజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హడావుడిలో జేబు దొంగలు తమ చేతికి పని చెప్పారు. ముగ్గురు రిపోర్టర్ల జేబులకు కత్తెర వేసి రూ.24 వేలు దొంగిలించారు. -
జ్ఞానభేరిలో నిరసన సెగ
తిరుపతి తుడా / యూనివర్సిటీ క్యాంపస్: జ్ఞానభేరి సభకు నిరసన సెగ తాకింది. ప్రత్యేక హోదా.. నిరుద్యోగ భృతి అంశాలపై విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఎస్వీయూ స్టేడియంలో శనివారం జ్ఞానభేరి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విద్యార్థులతో నిర్వహించిన ఈ సభలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సీఎం వేదికపైకి రాగానే ఎస్ఎఫ్ఐ నాయకులు సభలోకి ప్రవేశించారు. వేదిక ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే వీరిని నిలువరించారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సభ ముగిసే సమయంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు నాగరాజు ముందుకు చొచ్చుకొచ్చాడు. బ్యారికేడ్లను దూకేందుకు ప్రయత్నించాడు. ప్రత్యేక హోదా తీసుకురావాలంటూ డిమాండ్ చేశాడు. పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుడిని వేదికపైకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పోలీసులు పట్టించుకోలేదు. సభలో రెండు పర్యాయాలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీ సులు కలవరపడ్డారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మదన్, జయసింహ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో నిరుద్యోగ భృతిని మొక్కుబడిగా ప్రకటించారన్నారు. నిరుద్యోగులందరికీ నిబంధనలు లేకుండా చెల్లించాలన్నారు. తొలి నుంచి మాటమీద ఉండి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చుండేదన్నారు. ఆందోళనలో శ్రీధర్, నాగరాజు, ముయప్ప పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నాయకుల నిర్బంధం జ్ఞానభేరి కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే నెపంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులను శనివారం వేకువజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఎమ్మార్పల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారని సమాచారం అందుకున్నాక విడిచిపెట్టారు. ఆకట్టుకున్న ప్రాజెక్టు వర్క్లు ♦ శ్రీవెంకటేశ్వర యూనివర్సీటీ సేడియంలో శనివా రం జ్ఞానభేరి కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టు వర్క్లు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తాము చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను వివరించారు. తిరుపతి డెయిరీ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థులు వైష్ణవి, మోహన్ కృష్ణ పాల ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సాధించే విధానం వివరించారు. ఈ ప్రాజెక్టుకు మొదటి బహుమతి లభించింది. ♦ ఎస్వీ వ్యయసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు అఫీయాఫెనికా, ఖైరున్నీసా బేగం తాము చేసిన ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ♦ గుండెపోటుతో ప్రాణం పోకుండా సీపీఆర్ టెక్నిక్ ఉపయోగించి గుండెను పనిచేయించవచ్చని స్విమ్స్ విద్యార్థులు రుచిత, పూజ, లాస్య వివరించారు. ♦ రేబిస్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ప్రాజెక్టు వర్క్ చేస్తున్నట్లు వెటర్నరీ విద్యార్థులు సౌమ్య, హిమబిందు తెలిపారు. ♦ పంటలను నాశనంచేసే అడవి పందుల నుంచి రక్షణ కోసం లేజర్ సెక్యూరిటీ సిస్టమ్ను సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించారు. దామినేడు హౌసింగ్ కాలనీ ప్రారంభం తిరుచానూరు: తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న పట్టాదారు భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దామినేడు వద్ద హౌసింగ్ కాలనీని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. తిరుపతితో పాటు తనపల్లి, బాలాజీ డెయిరీ, పాడిపేట ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను 18 నెలల్లో పూర్తిచేసి సుమారు 2592 ఇళ్లను ప్రారంభించారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్టోబర్ 2న, సంక్రాంతి రోజున మరోసారి గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తోంది
-
12 లక్షల మందికే భృతి
సాక్షి, అమరావతి: ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకునే విషయంపై గురువారం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చించారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కానిస్టేబుళ్లు, ఇతర శాఖల్లోని పోస్టులన్నీ కలిపి పదివేల వరకు ఇప్పటికే భర్తీ చేసినందున మిగిలిన పదివేల పోస్టులతోపాటు కొత్తగా మరో 9వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే, ఎన్నికల మేనిఫెస్టోలోని నిరుద్యోగ భృతిని కూడా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకాన్ని అర్హులైన అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సుమారు 12.26 లక్షల మందికే ఈ భృతి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఖరారు చేశారు. ఆ వివరాలను మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర మీడియాకు వివరించారు. నిరుద్యోగ భృతికి ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’గా పేరు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. ఆగస్టు మూడు, నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించి దాని ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల (దరఖాస్తుల స్వీకరణ) ప్రక్రియను ప్రారంభిస్తారు. వెబ్సైట్ ప్రారంభమైన తర్వాత 15 రోజులపాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత పథకాన్ని అమలుచేస్తారు. ప్రజాసాధికారిక సర్వేలో సేకరించిన సమాచారం, ఆధార్ అనుసంధానం ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తారు. ఈ వెబ్సైట్లో తమ పేరును రిజిస్టర్ చేసుకున్న వారు.. వారి వివరాల ఆధారంగా వారు ఈ పథకానికి అర్హులో కాదో తేలిపోతుంది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నమోదైన రిజిస్ట్రేషన్లనే ఆన్లైన్ స్వీకరిస్తుంది. వాటికి విరుద్ధంగా ఉంటే వెంటనే ఆ రిజిస్ట్రేషన్ను కంప్యూటర్ తిరస్కరించేలా ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ పథకానికి ఎంపికైన వారికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వివిధ కంపెనీల్లో అప్రెంటీస్కు అవకాశం కల్పిస్తామన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా అమలుచేయలేదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అమలు తేదీని ప్రకటిస్తామని లోకేష్ తెలిపారు. చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు. భృతికి అర్హతలు ఇవే.. 22 నుంచి 35ఏళ్ల వయస్సు.. డిగ్రీ లేదా పాలిటెక్నిక్ చదివిన వారు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ పథకానికి అర్హులని అంచనా వేసిన ప్రభుత్వం.. ఇందుకు సుమారు రూ.600 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఏదైనా సంస్థలో పనిచేస్తూ పీఎఫ్ కట్ అవుతున్న వారు.. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అనర్హులు. ప్రతినెలా వేలిముద్రలు తీసుకుని బ్యాంకు అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేస్తారు. -
6 నెలల ముందు.. 4 నెలల కోసం..
సాక్షి, అమరావతి: ‘‘నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం వచ్చేదాకా నెలకు అక్షరాలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా’’.. 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రమంతటా తిరుగుతూ ఇచ్చిన హామీ ఇది. టీడీపీ మేనిఫెస్టోలోనూ దీన్ని ప్రముఖంగా పొందుపర్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఊరూవాడా కరపత్రాలు కూడా పంచిపెట్టారు. చంద్రబాబు గద్దెనెక్కి నాలుగున్నరేళ్లు పూర్తయ్యా యి.ఇప్పటిదాకా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి సంగతే మర్చిపోయారు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తుండడంతో నిరుద్యోగులను మచ్చిక చేసుకుని, ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగులకు నెలకు కేవలం రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని తాజాగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, ఎప్పటి నుంచి అమలు చేస్తారో మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఎదురు చూపులన్నీ వృథా? ఎన్నికల ముందు ఆరు నెలలపాటు కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.1,000 చొప్పున భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగ భృతికి నెలకు రూ.122 కోట్ల చొప్పున ఆరు నెలలకు రూ.732 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. కేవలం గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన వారికే భృతి ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రంలో 1.70 కోట్ల మంది నిరుద్యోగులు భృతి కోసం నాలుగున్నరేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, పలు ఆంక్షలను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 12 లక్షల మందికి మాత్రమే భృతికి అర్హులని, అది కూడా నెలకు వెయ్యి రూపాయలే ఇస్తామని ప్రకటించడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు కోటికి పైమాటే.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సాధికార సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం... రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న 18–35 ఏళ్ల లోపు వారు కాకుండా ఎలాంటి ఉపాధి లేని వారు 65,01,846 మంది ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం యువతీ యువకుల్లో 45 శాతం మంది ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. చదువులు పూర్తి చేసుకున్నా ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్న వారి సంఖ్య 20,19,159. వీరంతా పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినవారే. ఆర్థిక స్తోమత లేక మధ్యలోనే చదువులు ఆపేసిన యువత 9,17,653 మంది ఉన్నారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు 22,71,629 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.1.70 కోట్ల మంది నిరుద్యోగ భృతికి అర్హులే. కానీ, ప్రభుత్వం కేవలం 12 లక్షల మందికే భృతి ఇస్తామని చెప్పడం గమనార్హం. ప్రజా సాధికార సర్వేలో తేలిన 65 లక్షల మంది నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం (2017–18) వరకు నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం స్పందించలేదు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి చేయడంతో గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగులకు ఆర్థిక సాయం పేరిట కేవలం రూ.500 కోట్లు కేటాయించారు. అందులో పైసా కూడా ఖర్చు చేయలేదు. నిరుద్యోగ భృతి కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో (2018–19) ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఖాళీలు 1.80 లక్షలు.. భర్తీ చేసేది 20 వేలట! రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నరేళ్లు అవుతున్నా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య ప్రస్తుతం 1.80 లక్షలకు చేరింది. అయితే, కేవలం 20 వేల పోస్టులనే భర్తీ చేస్తామని సర్కారు ప్రకటించింది. ఎన్నికల ముందు యువతను మభ్యపెట్టడానికే తప్ప కొలువులను పూర్తిగా భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని సాక్షాత్తూ అధికార వర్గాలే చెబుతున్నాయి. ఆదర్శ రైతులు, ‘104’ ఉద్యోగులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను చంద్రబాబు సర్కారు నిర్దాక్షిణ్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. -
రుణమాఫీ, నిరుద్యోగభృతి సాధ్యం కావు: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్న రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలు ఆచరణ సాధ్యం కావని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గట్టెక్కడానికి కాంగ్రెస్ నేతలు ప్రయోగిస్తున్న ఆపదమొక్కులను ప్రజలు నమ్మరన్నారు. ఐదు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్నేతలు ఆస్తులు, ఆకారాలు, అహంకారాన్ని తప్ప బుర్రను పెంచుకోలేదని విమర్శించారు. సంక్షేమపథకాలతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరిగితే వారు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రారంభమైన కాంగ్రెస్ పతనం 2019 నాటికి పూర్తిగా కనుమరుగవుతుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ వందసీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. -
నిరుద్యోగ భృతి కాదు.. ఉద్యోగాలు కావాలి : పవన్ కల్యాణ్
విజయనగరం : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని పోలవరం, పట్టిసీమలకు డబ్బులుంటాయి కానీ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్లకు మాత్రం డబ్బులుండవా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు టీడీపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో స్థిరపడ్డ ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన 23 కులాలు బీసీ జాబితాలోకి రావడం లేదని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. తాను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. -
ఉత్తరాంధ్ర ప్రజలకు టీడీపీ పట్టించుకోవడం లేదు
-
నిరుద్యోగభృతి రూ.2వేలు ఇవ్వాలి’
సాక్షి, శ్రీకాకుళం సిటీ : ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేదా రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రదినిధి రొక్కం సూర్యప్రకాశరావు కోరారు. ఆయన సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు అందరికీ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారని, ఇది మో సం కాదా అని ప్రశ్నించారు. తప్పులు తడకలుగా ఉన్న ప్రజాసాధికార సర్వే ప్రకారం ఎలా చేస్తారని అడిగారు. నిరుద్యోగులకు బకాయి పడిన భృతి అంతా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన రూ.2 వేలు నిరుద్యోగభృతి వచ్చే కేబినేట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, బి రాజేష్, పేడాడ అశోక్, ఆర్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు టోకరా
మాచర్ల రూరల్: ఓట్లు, సీట్ల కోసం ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత రూ.వెయ్యి మాత్రమే ఇస్తానని చెప్పటం ఆయన మోసపూరిత నైజం మరోసారి బట్టబయలైందని వైఎస్సార్ సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశ చూపి ఓట్లు పొంది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఏ ఎన్నికల్లో గెలవకపోయినా తన కుమారుడు లోకేష్బాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రిగా ఉద్యోగం ఇప్పించుకున్న చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగులకు టోకరా వేశారన్నారు. ఇప్పుడు రూ.వెయ్యి ఇస్తాననటం దారుణమని, 48 నెలలకు రూ.2 వేల చొప్పున రూ 96వేలను ప్రతి ఒక్క నిరుద్యోగికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, మ్యానిఫెస్టో హామీలను అమలుపరచాలన్నారు. నిరుద్యోగులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీకి నిరుద్యోగుల తల్లిదండ్రుల ఉసురు తగులుతుందని పీఆర్కే చెప్పారు. -
యువతను మభ్యపెట్టే ప్రయత్నం..
విజయనగరం రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ. 2వేలు ఇస్తామంటూ మోసం చేసిన సీఎం చంద్రబాబు మరోమారు యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం నాయకుడు ఈశ్వర్ కౌషిక్ అన్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల నివాసంలో పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, పొట్నూరు కేశవ్లతో కలిసి మాట్లాడారు. గద్దెనెక్కి నాలుగేళ్ల నాటికి నిరుద్యోగ భృతి గుర్తొచ్చిందని, అదీ ఎన్నో షరతులతో రూ.1000 ఇస్తామనడం నిరుద్యోగులను, యువతను మోసగించడమేనన్నారు. నాలుగేళ్లుగా ఒక్కో నిరుద్యోగికి రూ.96వేల నిరుద్యోగి భృతి బకాయి ఉన్నారని, వాటితో కలిపి మొత్తం అందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జీవీ రంగారావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్ఎన్ రాజు, యువజన విభాగం నాయకులు బోడసింగి ఈశ్వరరావు, తాడి సురేష్, కారణం రమేష్, రోహిత్, అప్పలరాజు, నాగబాబు, అనీల్, రౌతు భాస్కర్ రెడ్డి, చిన్నిరవి, రజిని, గోవింద్, పవన్, కృష్ణ, గౌతం, ఎస్.ప్రసాద్, కిలారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రన్న శఠగోపం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తాము అధికారంలోకి వస్తే.. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి రూ.2 వేల చొప్పున ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారు. తనదైనశైలిలో నిరుద్యోగులకు శఠగోపం పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కనీస చర్యలు చేపట్టకుం డా ఎన్నికల ఏడాదిలో నామమాత్రపు భృతిని ప్రకటించారు. పైగా సవాలక్ష ఆంక్షలు పెట్టి.. నిరుద్యోగులను నట్టేట ముంటే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది నిరుద్యోగులకు గాను.. కేవలం 50 వేల మందికే భృతి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు.. కమలనాథన్ కమిషన్ నివేదిక ప్రకారం 217 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వడకుండా విద్యావంతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 35 నుంచి 40 లక్షల వరకు ఉంది. జిల్లావ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసిన వారు 75 వేలు, పీజీ చేసిన వారు 28 వేలు, బీటెక్ –40 వేలు, పీహెచ్డీ–9 వేలు, ఎంఈడీ, బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన వారి సంఖ్య 68,200 మంది ఉన్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ వర్గాల అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి ఏపాటిదో అర్థం అవుతోంది. ఎస్వీయూలో విద్యార్థి విభాగం నిరసన యూనివర్సిటీ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరిట నిరుద్యోగులను వంచనకు గురి చేస్తోందని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. శుక్రవారం గాంధీ విగ్రహం ఎదుట వారు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 2 వేల రూపాయల భృతి ఇస్తామని చెప్పి, నాలుగు సంవత్సరాలుగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ భృతి ఇస్తామని చెపుతున్నారన్నారు. ఈ నిరసనలో తిరుపతి పార్లమెంటరీ నియోజవవర్గ అధ్యక్షుడు సుధీర్, రాజంపేట నియోజక వర్గ అధ్యక్షుడు కిషోర్ దాస్, ఇతర నాయకులు నరేంద్ర, సుధాకర్, ప్రసాద్, రమణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కోత ఇలా.. ♦ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పదిలక్షలమంది మాత్రమే.. ♦ వయోపరిమితి 22 నుంచి 35 సంవత్సరాల వరకు కుదింపు ♦ ఇంట్లో ఒక్క నిరుద్యోగికి మాత్రమే భృతి ♦ ప్రభుత్వ పరంగా ఆ వ్యక్తి ఎటువంటి లబ్ధి పొంది ఉండకూడదు ♦ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదునిరుద్యోగ భృతి రూ.2 వేల నుంచి రూ.1000కి కుదింపు ప్రభుత్వ సాధికారత సర్వేలో నమోదై ఉండాలి ♦ రేషన్కార్డు, ఓటరు కార్డుతో పాటు వ్యక్తి స్థానికుడై ఉండాలి -
నిరుద్యోగభృతిపై చర్చించిన ఏపీ కేబినెట్
-
డిగ్రీ చదివిన వారికే నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: డిగ్రీ పూర్తి చేసిన వారినే నిరుద్యోగ భృతికి అర్హులుగా పరిగణించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సమావేశమైంది. డిగ్రీ తరువాత ఉన్నత విద్య అభ్యసించే వారిని అనర్హులుగా పరిగణించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. కుటుంబంలో కేవలం ఒక్కరికే భృతి అందించేలా విధివిధానాలు రూపొందించాలని తీర్మానించింది. అలాగే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతోపాటు ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసేవారు నిరుద్యోగ భృతికి అనర్హులు. అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు సూచించారు. జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయానికొచ్చారు. ఉపాధి దొరకగానే భృతి కట్ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి, పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. అలా ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి, కొత్తవారికి అవకాశం కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా విధివిధానాలు పక్కాగా రూపొందించాలని మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. నిరుద్యోగుల్లో అసంతృప్తి అర్హతల పేరిట నిరుద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సర్కారు తాజా నిర్ణయాలపై నిరుద్యోగులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీ తర్వాత పెద్ద చదువులు చదువుకున్న చాలామంది ఇప్పటికీ ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వీరికి భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
నిలదీతలు.. నిరసనలు
►మంత్రి లోకేష్కు చుక్కెదురు ►నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారంటూ యువకుల మండిపాటు ►కాన్వాయ్ను అడ్డుకొని ఆందోళన ►కిరోసిన్, చక్కెర ఇవ్వడం లేదన్న మహిళలు ►పర్యటన ఆలస్యం కావడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం సాక్షినెట్వర్క్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ పర్యటన ఆద్యంతం గురువారం.. నిలదీతలు..నిరసనల మధ్య కొనసాగింది. నంద్యాల మండలం కానాల గ్రామంలో జరిగిన సభలో..మీకు నెల నెలా సక్రమంగా రేషన్ అందుతుందా అని అడగ్గానే వృద్ధులు, మహిళలు చక్కెర, కిరోసిన్ రావడం లేదని చెప్పారు. ఉపాధి పనులు సక్రమంగా జరుగుతున్నాయా అని అడగగా..అరకొర అనే సమాధానం వచ్చింది. కానాల నాగమ్మ చెరువు ఆక్రమణకు గురైందని, ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయలేదని, తాగునీటి సమస్య 45గ్రామాల్లో తీవ్రంగా ఉందని..సమస్యలు ఏకరువు పెట్టారు. నిలదీత.. నంద్యాల ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద మంత్రి లోకేష్ కాన్వాయ్ని ఏపీఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ఓట్లు దండుకొని విద్యావంతులైన యువకులకుతీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. నిరాశతో వెనుదిరిగిన లంబాడీలు షెడ్యూల్ ప్రకారం ఓర్వకల్లు మండలం గుడుంబాయ్ తండాలో లోకేష్ పర్యటించాల్సి ఉంది. అయితే దానిని రద్దు చేసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు వాటర్షెడ్ మేనేజ్మెంట్పై తండా వాసులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉండేది. అయితే నంద్యాలలోనే సాయంత్రం ఏడు గంటలైనా పర్యటన ముగియకపోవడంతో గుడుంబాయి తండా పర్యటను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోసం మూడు గంటల నుంచి ఎదురు చూస్తున్న తండా వాసులకు నిరాశతో వెనుదిరిగారు. నిరుత్సాహం.. పాణ్యంలోని నూతనంగా నిర్మించిన వర్మీకంపోస్టును ప్రారంభించేందుకు మధ్యాహ్నం 2గంటలకు మంత్రి రావాల్సి ఉంది. అయితే రాత్రి 7గంటలకు చేరుకోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. పూలు చల్లవద్దని చెప్పడంతో మహిళలు వాటిని కింద పడేశారు. మంత్రి లోకేష్కు స్వాగతం పలికే తోపులాటతో ఇద్దరు మహిళలు కింద పడ్డారు. మంత్రి రాత్రి సమయంలో రావడంతో కార్యకర్తలు కొందరు బహిరంగంగానే విమర్శలకు దిగారు.