-
భారత్లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్లో విదేశీ సీఏలను ప్రాక్టీస్కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
ప్రపంచ వ్యాప్తం గా వ్యూహం శపథానికి సిద్ధం! అవ్వుతున్న అభిమానులు
-
UK : లండన్లో YSRCP సిద్ధం
లండన్లో కేక పుట్టించారు వైఎస్సార్సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్లోని వైఎస్సార్సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లండన్లోని ఈస్ట్హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్కు తీసుకెళితే డాక్టర్కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్గా ఈ క్లినిక్స్ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
ఐన్స్టీన్ను మించిన తెలివున్నా.. ఆమెకు తీరని ఆవేదన?
ఆ అమ్మాయి.. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్కు మించిన తెలివితేటలు కలిగినది. ఆమె ఐక్యూ 161 పాయింట్లు. ఇంతటి ప్రతిభావంతురాలైన ఆమెకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులే సతమతమవుతున్నారట. ఇంగ్లండ్లోని స్లోఫ్కు చెందిన మహ్నూర్ చీమా(17)తన తొమ్మిదేళ్ల వయసులో పాకిస్తాన్ నుంచి కుటుంబంతోపాటు బ్రిటన్కు వచ్చింది. ఈ సమయంలో ఆ చిన్నారి తన ప్రతిభను చూపినప్పటికీ ఉపాధ్యాయులు పైతరగతికి ప్రమోట్ చేయలేదు. బెర్క్షైర్లోని కోల్న్బ్రూక్ చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు తాను క్లాస్ వర్క్ను అందరికన్నా త్వరగా పూర్తి చేసినప్పటికీ, పై క్లాస్కు వెళ్లేందుకు అనుమతించలేదని, పైగా అదనంగా గణితాన్ని అభ్యసించాలని ఆదేశించారని చీమా తెలిపింది. ఆమె లాంగ్లీ గ్రామర్ స్కూల్కి మారినప్పుడు, జీసీఎస్ఈ పరీక్షలకు కూర్చోకుండా నిరుత్సాహపరిచారని చీమా ఆరోపించింది. అయితే చీమాపై ఒత్తిడి అధికంగా ఉందని, దానికి గుర్తుగా ఆమె కళ్లకింద నల్లని వలయాలు ఏర్పడ్డాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు తమ చిన్నారి తెలివితేటలకు తగిన విద్యను అందించేందుకే యూకే వచ్చామని తెలిపారు. మహ్నూర్ చీమా మీడియాతో మాట్లాడుతూ తన మాదిరిగా ప్రతిభ కలిగిన చాలామంది విద్యార్థులు ఉన్నారని, అయితే వారి సామర్థ్యాన్ని ఎవరూ గుర్తించడం లేదని, ఫలితంగా వారి ప్రతిభ వృథా అవుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రతిభావంతులైన పలువురు విద్యార్థులతో మాట్లాడానని, వారు కూడా తనలానే నిరాశతో ఉన్నారని అమె పేర్కొంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని, బ్రిటీష్ విద్యావ్యవస్థలో గణిత బోధన చాలా నెమ్మదిగా సాగుతున్నదని, బ్రిటన్లోని 11 ఏళ్ల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను పాకిస్తాన్లో మూడవ సంవత్సరం పిల్లలు పూర్తి చేయగలరని చీమా వ్యాఖ్యానించింది. చీమా తన జీసీఎస్ఈలో 33 నైన్లు సాధించింది. ఇది అత్యధిక స్కోర్. అలాగే తాను ఉంటున్న ప్రాంత పరిధిలోని పలు పాఠశాలల ప్రవేశ పరీక్షలకు హాజరై, మూడు కౌంటీలలో అగ్రస్థానంలో నిలిచింది. చీమా కుటుంబం పాకిస్తాన్లోని లాహోర్ నుండి 2006లో యూకేకి తరలివచ్చింది - ఆమె తండ్రి, ప్రముఖ న్యాయవాది. తల్లి ఆర్థికశాస్త్రంలో రెండు డిగ్రీలు సాధించారు. జాతీయ గణిత ఛాంపియన్గా నిలిచిన 14 ఏళ్ల సోదరి కూడా ఆమెకు ఉంది. ప్రస్తుతం చీమా..హెన్రిట్టా బార్నెట్ స్కూల్లో విద్యనభ్యసిస్తోంది. చీమాకు స్విమ్మింగ్తో పాటు గుర్రపు స్వారీ చేయడమంటే కూడా ఎంతో ఇష్టం. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
Yatra 2 @ London : లండన్లో యాత్ర 2 సక్సెస్ మీట్
యాత్ర 2 సినిమా కొత్త ఒరవడి సృష్టిస్తోంది. విదేశాల్లో ఉంటోన్న ప్రవాసాంధ్రులను, ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. యూకే & యూరప్ YSRCP వింగ్ ఆధ్వర్యంలో లండన్ మహానగరంలోని హౌన్సలో ప్రాంతంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. మనం చూసే ప్రతి సినిమా మనలో ఒకరి జీవన ప్రతిబింబం. కొందరి జీవితాలు స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని అటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా మరియు సందేశాత్మకంగా సినిమాని మలచడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు లండన్లోని YSRCP వింగ్ నాయకులు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. యాత్ర2 సినిమా చూసిన తరువాత ఇది అద్భుతం అని అనకుండా వుండలేమన్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి జీవితాన్ని హృద్యంగా చిత్రీకరించిన సన్నివేశాలతో మహీ రాఘవ ప్రేక్షకులను కట్టిపడేశాడని కొనియాడారు. అలాగే నిజజీవితంతో పెనవేసుకున్న ఎమోషనల్ డ్రామాను చాలా రియలిస్టిక్ గా చిత్రీకరించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆఖర్లో రియల్ సీన్లను కలిపి చేసిన జగన్ గారి ప్రమాణస్వీకార సన్నివేశం రోమాలు నిక్కపొడుచుకునేలా తీశారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా చరిత్రలో చెరగని పేజీగా యాత్ర 2 నిలిచిపోతుందన్నారు. భవిష్యత్తులో యాత్ర 3 సినిమా కూడా వస్తే మరింత బాగుంటుందన్నారు. నటులు మమ్ముట్టి, జీవా పాత్రలకు ప్రాణం పోశారని కొనియాడారు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్గా 'పిచాయా పామ్') -
‘అక్కడ ఫ్యాక్టరీ పెట్టనే పెట్టం.. వాళ్లు పనిచేయకుండా పబ్కు పోతారు’
యూకేలో ఫ్యాక్టరీల ఏర్పాటుపై అపోలో టైర్స్ అధిపతి నీరజ్ కన్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టనే పెట్టబోమని, అక్కడి వర్కర్లు పనిచేయకుండా పబ్లకు వెళ్తారని ఆరోపించారు. అందులోనూ అక్కడి ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించినట్లు ‘డైలీ మెయిల్’ కథనం పేర్కొంది. ఇదే సమయంలో ఇతర దేశాలు ఇచ్చిన ప్రోత్సాహకాలను హైలైట్ చేస్తూ "హంగేరీ మాకు ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఇక్కడ కార్మికుల ఖర్చు చాలా అందుబాటులోనే ఉంది. దీంతో ఉత్పత్తి ఖర్చు తక్కువే అవుతుంది. ఇక యూకేలో శ్రామిక శక్తి ఎలా ఉందో మీకు తెలుసు. వీళ్లు పెద్దగా పనిచేయకుండా పబ్లకు వెళ్తుంటారు" అని అపోలో టైర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ కన్వర్ వ్యాఖ్యానించారు. ఇది అక్కడ విధానపరమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వ విధానాల వల్ల అక్కడి ప్రజలు పనులు చేయకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకుంటున్నారని నిందించారు. లండన్లో ఇటాలియన్ రెస్టారెంట్ కూడా ఉన్న కన్వర్కు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ యూకేలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అపోలో టైర్స్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే యూకేలో కార్పొరేట్ వ్యవహారాలను నిర్వహించడానికి 30 మంది సభ్యుల టీమ్ ఉంది. ఇక్కడే ఈ కంపెనీకి ఇన్నోవేషన్ హబ్ ఉండటం గమనార్హం. కాగా మరో ఇన్నోవేషన్ హబ్ భారత్లోని హైదరాబాద్లో ఉంది. మాంచెస్టర్ యునైటెడ్కు ఈ కంపెనీ దీర్ఘకాలిక స్పాన్సర్గా కొనసాగుతోంది. -
టెక్ దిగ్గజం టీసీఎస్కు జాక్ పాట్..మరో 15ఏళ్ల వరకు ఢోకాలేదు!
భారత్ టెక్ దిగ్గజం టీసీఎస్ జాక్ పాట్ కొట్టింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ అవివా ఇప్పటికే టీసీఎస్తో కుదర్చుకున్న ఒప్పందాన్ని మరో 15ఏళ్ల పొడిగింది. 15 ఏళ్ల పాటు బీమా చట్టాల నిర్వాహణ, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి కార్యకాలాపాలు నిర్వహించేలా టీసీఎస్కు అప్పగించిన ప్రాజెక్ట్ను పొడిగిస్తున్నట్లు అవివా అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇరు కంపెనీల మధ్య ఒప్పందం అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉండగా పలు నివేదికల ప్రకారం..ఈ డీల్ విలువ 500 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. యూకేలో అవివా సంస్థ గత 20 ఏళ్లుగా టీసీఎస్తో కలిసి పనిచేస్తుంది. ఇక ఈ కొత్త ఒప్పందంలో భారత్ కంపెనీ అవివా ఎండ్ టు ఎండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్, 5.5 మిలియన్లకు పైగా పాలసీలను సేవల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అవివా సీఈఓ డౌగ్ బ్రౌన్ మాట్లాడుతూ..‘ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ద్వారా మేము మా కస్టమర్లకు అందించే సేవలతో పాటు, కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. మా ఆశయాలకు అనుగుణంగా సంస్థ సామర్థ్యాన్ని మెరుగు పరుస్తూ అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారంలో గణనీయమైన ప్రయోజనాల్ని అందిస్తుందని’ అన్నారు. -
కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..
కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది.. వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు. ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు. అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది. అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు. (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్కు.. మహ్మద్ రిజ్వాన్తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
చెట్లకే కుర్చీలను పండిస్తున్న రైతు!
చెట్లకు పండ్లను పండించడం విన్నాం. కానీ ఇలా చెట్లకే కుర్చీలను పండించడం గురించి వినలేదు కదా!ఎక్కడైనా చెట్లను పెంచి వాటిని కట్ చేసి కుర్చీల ఆకృతిలో తయారు చేస్తారు. కానీ ఏకంగా ఓ పండు మాదిరిగా కుర్చీలను చెట్లకు పెంచడం ఏమిటీ? అసలు అదెలా సాధ్యం? అనిపిస్తుంది కదా!. అయితే ఇక్కడో రైతు ఈ వినూత్న ఆలోచనతో పెద్ద వ్యాపారమే చేస్తున్నాడు. లక్షల్లో లాభలు కూడా ఆర్జిస్తున్నాడు. ఎలా చేస్తాడంటే..యూకేకి చెందిన గావిన్, ఆలిస్ మున్రో జంట ఈ వినూత్న వ్యవసాయాన్ని మొదటు పెట్టారు. ఇద్దరు ఫర్నీచర్ ఫామ్ని చేస్తారు. వారు తమ పొలంలో కుర్చీల్లా ఎదిగేలా చెట్లను పెంచుతారు. ఫర్నీచర్ కోసం పరిపక్వానికి వచ్చిన చెట్లను నరికేసి భారీగా కార్బన్ ఉద్గారాలు పెరిగే ప్రమాదానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఒక చెట్టును 50 ఏళ్లపాట్లు పెంచి ,నరికి కుర్చీగా తయారు చేసే బదులు చెట్లకే నేరుగా కావాల్సిన ఆకృతిలో కుర్చీలను పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది గావిన్ అనే రైతుకి. అనుకున్నదే తడువుగా ఆ భార్యభర్తలిద్దరూ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసేలా కుర్చీలను పండిస్తున్నారు. దీన్ని గావిన్ ఒక రకమైన జెన్ త్రీడీ ప్రింటింగ్ అంటారని చెబుతున్నారు. ఆయనకు ఈ ఆలోచన తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడూ కుర్చీలా ఉండే బోన్సాయ్ చెట్లను చూసి ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు. అదీగాక గావిన్ చిన్నతనంలో వంగిన వెన్నుపూసతో జన్మించాడు. దీంతో చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు వెన్నుని సరిచేసే నిమిత్తం మెటల్ ఫ్రేమ్ని అమర్చారు. దాంతోనే చాలా ఏళ్లు గడిపాడు. అప్పుడే గావిన్కి తెలిసింది..ఏదైన సరైన ఆకృతిలో రావాలంటే పెరుగుతున్న క్రమంలోనే ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే సెట్రైట్ అవుతుందని. ఆ తర్వాత గావిన్ తన ఆలోచనకు(చెట్లకు కుర్చీలు పెంచడ) రూపమిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు. అందుకోసం విల్లో అనే ప్రత్యేకమైన చెట్లును ఉపయోగించాడు. విల్లో చెట్టు కొమ్మలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా, ఓక్, యాష్, సైకమోర్ వంటి బలమైన తీగలు ఉన్న చెట్లను కూడా ఫర్నిచర్ పెంచడానికి ఉపయోగిస్తారు. చెట్ల తీగలను కుర్చీలుగా మార్చడానికి గావిన్ ఇనుప ఫ్రేమ్లను ఉపయోగిస్తాడు. ఈ ఫ్రేమ్ల లోపల చెక్క కుర్చీని అమర్చి పెంచుతారు. కుర్చీల ఆకారం చెడిపోకుండా ఉండటానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చెట్టు కత్తిరిస్తాడట. అయితే ఒక్కో కుర్చి ఖరీదు మాత్రం రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. ఈ క్రమంలో వారు చెట్ల పెరుగుదలను అడ్డురాకుండా మంచి ఆకృతిలో పెంచేందుకు ఒక మార్గాన్ని కూడా కనుగొనవల్సి వచ్చింది. ఈ సేంద్రీయ మొక్కలను పెంచడానికి చాలా శ్రమ, సమయంల ఖర్చు అవుతుందని చెబుతున్నాడు గావిన్. ఈ మొక్కల పెంపకంలో అతడి భార్య ఆలిస్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇలా ఈ దంపతులు 2012లో ఫుల్ గ్రోన్ అనే కంపెనీని స్థాపించారు. అంతేగాదు సగటున ఒక కుర్చీ పెరగడానికి ఆరు నుంచి 9 సంవత్సరాలు పట్టగా ఎండడానికి ఒక ఏడాది పడుతుంది. అంటే ఒక కుర్చీ తయారవ్వడానకి ఇంచుమించు ఏడు నుంచి పదేళ్లు పట్టొచ్చు. పైగా ధర కూడా లక్షల్లో ఉంటుంది. చెట్లకు కుర్చీలనే పెంచడమే ఒక వింత అనుకుంటే వాటిని ఇన్ని లక్షలు పోసి కొనడం మరింత విడ్డూరంగా ఉంది కదా!.అంతేగాదు గావిస్ ఆలిన్ ఇంత సమయం పట్టకుండా ఉండేలా ఏటా పండించేలా చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2024 కల్లా ఆ లక్ష్యం నెరవేరగా దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆ గావిన్ ఆలిస్ దంపతులు. (చదవండి: 30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..! 11 ఏళ్ల చిన్నారి..) -
30 ఏళ క్రితం పోయిన బ్యాగ్ మళ్లీ యజమాని చెంతకు..!
కొందరికి వస్తువులు పోతే మళ్లీ వాళ్లకు దొరికే సీన్ లేదు. ఇంకొందరూ ఎంద అదృష్టవంతులంటే పోయిన వస్తువు కనీసం జీవిత చరమాంకలో అయిన కంటపడి సర్ప్రైజ్ చేస్తుంది. చూసిన వాళ్లకు కూడా ఇలాంటి అదృష్టం మాకు ఉంటే బావుండనని అనిపిస్తుంది. అలాంటి ఘటనే యూకేకి చెందిన మహిల విషయంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే?..యూకేకి చెందిన మహిళ ఆడ్రీ హే 30 ఏళ్ల క్రితం హ్యాండ్ బ్యాగ్ని పోగొట్టుకుంది. అప్పుడు ఆమె బ్యాగ్ని ఓ దుండగడు ఎత్తుకుపోయాడు. బహుశా అతను పోతుపోతూ..పక్కనే ఉన్న డోన్ నదిలోకి విసిరేశాడు కాబోలు . అది అనుకోకుండా కొట్టుకుంటు ఒడ్డుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. అయితే అనుకోకుండా చాలా ఏళ్ల తర్వాత 11 ఏళ్ల మైసీ కౌట్స్ అన చిన్నారి తన తల్లిదండ్రులతో ఆ డాన్ నది వద్దకు వచ్చినప్పుడూ ఆ బ్యాగ్ కంటపడింది. ఆ చిన్నారి పొరపాటున ఆ పాత బ్యాగ్పై పొరపాటున పడుతుంది. వెంటనే అమ్మ నీకు ఈ కొత్త బ్యాగ్ కావాలా అంటూ కౌట్స్ ఆ బ్యాగ్ని అందుకుంది. అంతేగాదు అందులో ఏమున్నాయా? అని ఆసక్తిగా చూసేసింది కూడా. అందులో కొన్ని పెన్నులు, నాణేలు, లిప్స్టిక్, చెవిపోగులు, కీ, ట్యాబ్లెట్లు ఉన్నాయి. దీంతో ఆమె అమ్మ నాన్నా ఆ బ్యాగ్ ఎవరో పోగొట్టకున్నారో? అని సదరు యజమాని గురించి ఏదైనా ఆధారం దొరకుతుందని ప్రతి ఇంచు గాలించి వెతికారు. ఆ చిన్నారి తల్లి కిమ్కు అందులో కొన్ని కార్డులు కనిపించాయి. వాటిపై 1993 అని ఉంది. అంటే ఇది చాలా ఏళ్లుగా నీటిలో ఉందన్నమాట. అంటే ఆ వ్యక్తి చనిపోయారా? బతికే ఉన్నారా? అన్ని కాస్త గాభర పడింది. ఆ తర్వాత ఆ బ్యాగ్ గురించి వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వెంటనే ఆడ్రీ అనే వృద్ధ మహిళ స్పందించి అది తన బ్యాగే అని 30 ఏళ్ల క్రితం పోయిందని తెలిపింది. ఆ రోజు బ్యాగ్ని తన ఆఫీస్ డెస్క్ కింద పెట్టి బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ పోయిందని చెప్పుకొచ్చింది. తాను పోలీస్ కంప్లైయింట్ కూడా ఇచ్చానని నాటి సంఘటనను వివరించింది. అందులో 240 పౌండ్లు(రూ. 20,000) ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ దొంగ ఆ డబ్బులు తీసుకుని ఈ బ్యాగ్ని నీటిలోకి విసిరేసినట్లున్నాడు కాబోలు అని ఆండ్రి అంది. ఎట్టకేలకు ఆండ్రీకి తాli పోగొట్టుకున్న బ్యాగ్ ఆమె చెంతకే చేరింది. ఇప్పుడు ఆమె వయసు 81 ఏళ్లు. బహుశా రాసి పెట్టి ఉంటే ఎంతకాలనికైనా తిరిగి రావడం అంటే ఇదే కదా!. కానీ ఆ బ్యాగ్ని యజమానికి అందించిన కిమ్ సోషల్ మీడియా శక్తిని చూసి తెగ మెచ్చుకుంటుంది. ఇవాళ ఇదే లేకపోతే ఇలాంటి ఎన్నో అద్భుతాలు జరిగేవా? చూడగలమా? అంటోంది ఆ చిన్నారి తల్లి కిమ్. (చదవండి: మనిషి నిద్రపోతుంటే..ఆత్మ లక్ష్యం కోసం ఎంత దూరమైన వెళ్తుందా? ఇది సాధ్యమా?) -
బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతిపిన్న వయస్కురాలు!
ఏ తల్లిదండ్రులైన పిల్లకు ది బెస్ట్ గిఫ్ట్లు ఇవ్వాలనే చూస్తారు. తమ పిల్లలు వాటిని చూసి ఎంతో సంతోపడటమే గాక ఎప్పటికీ మర్చిపోకూడదని కోరుకుంటారు. ఓ తల్లిగా లేదా తండ్రిగా వారి మనుసులను గెలుచుకోవాలనే ఆరాట పడతారు. ఇక్కడ కూడా అలానే ఓ తల్లి పుట్టుకతో ఒక చేయి లేకుండా జన్మించిన తన కూతురుకి అత్యంత విలువైన కానుక ఇవ్వాలనుకుంది. ఆమె పెదాలపై ఎప్పటికీ చిరునవ్వు తొణికిసలాడే విలువనే బహుమతి ఇవ్వాలనుకుంది. అందుకోసం ఎంతలా తప్పించిందో వింటే ఆ తల్లికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. యూకేలో థాలియా కౌల్టాస్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి పుట్టుకతో ఒక చేయితో జన్మించింది. తన కూతురు అలా ఉండటం చూసి కెర్రీ కౌల్టాస్ చాలా బాధపడేది. ఆమె తన పనులు చేసుకోవడం ఎంత ఇబ్బంది పడుతుందో గమనించి తల్లడిల్లింది. ఎలా తనకు సాయం చేయాలని ఆరాటపడింది. సాంకేతికతో కూడిన చేతిని అమరిస్తే తన సమస్యలకు కాస్త ఉపశమనం దొరుకుతుందేమో అన్ని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏ ఒక్క రోబిటిక్ చేయి ఆమెకు సూటవ్వలేదు. అప్పుడే ఈ ఓపెన్ బయోనిక్స్ అవయాల గురించి తెలుసుకుని అన్వేషించింది. సాంకేతికతో కూడిన ఈ బయోనిక్ అవయవాలను ఎనిమిదేళ్ల పిల్లలకు అమర్చరు. సదరు కంపెనీలకు అందుకు అనుమతించవు. అయితే థాలియా తల్లి శతవిధాల చేసిన ప్రయత్నాల ఫలితంగా ఆ కంపెనీ దిగొచ్చి ఆ చిన్నారికి మినహాయింపు ఇచ్చి మరీ ఈ బయోనిక్ చేతిని అందించింది. దీంతో సాంకేతికతో కూడిన బయోనిక్ 'హీరో ఆర్మ్'ని పొందిన అతి పిన్నవయస్కురాలిగా థాలియా నిలిచింది. ఈ క్రిస్మస్కి తన కూతురుకి తాను ఇచ్చే అతి విలువైన కానుక అని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఆ తల్లి దాదాపు రూ. 13 లక్షలు ఖర్చుపెట్టి మరీ ఈ క్రిస్మస్కి కూతురుకి అపురూపమైన కానుకను ఇచ్చింది. ఇప్పుడూ తన కూతురు కత్తి, ఫోర్క్ పట్టుకుని కేక్ని సులభంగా కట్ చేయగలదు, తన గదిని చక్కబెట్టుగోగలదు అని సంతోషంగా చెబుతోంది. ఏ తల్లి అయినా అంతేకదా! పిల్లలకు ఎదురైన కష్టాన్ని తొలగించి వారి మోములు సంతోషంతో వెలిగిపోవాలని కోరుకుంటారు. నిజానికి అలాంటి చిన్నారులకు అన్ని విధాల వెన్నుదన్నుగా ఉండే తల్లిదండ్రులు ఉండటమే అతిపెద్ద గిఫ్ట్ కదా!. దెబ్బకి ఏ కష్టమైన పరార్ అవ్వాల్సిందే. (చదవండి: రొయ్యలకు నిలయం ఆ సరస్సు! చేపలు పీతలు అస్సలు ఉండవ్!) -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్మన్ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్తో ఆల్ట్మన్ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్విక్లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్కు ఉద్వాసన
లండన్: బ్రిటిష్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్కు ఉద్వాసన పలికింది రిషి సునాక్ ప్రభుత్వం. పాలస్తీనా అనుకూల ఆందోళనలను అణిచివేయడంలో లండన్ పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. బ్రేవర్మన్ వ్యాఖ్యలపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సిందిగా బ్రేవర్మన్ను సునాక్ అడిగినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సునాక్ ఆదేశాలకు ఆమె అంగీకరించినట్లు రాయిటర్స్లో కథనం వెలువడింది. గాజాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేపట్టాలని బ్రిటన్ వేదికగా ఆందోళనకారులు గత కొద్ది రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమైతున్నారని ప్రధాని సునాక్ అంతరంగిక మంత్రి బ్రేవర్మన్ మండిపడ్డారు. ఆందోళనల పట్ల అధికారులు కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సునాక్ అనుమతి లేకుండానే ఈ అంశంపై ఓ కథనం కూడా ప్రచురించారు. ఈ అంశం గత కొద్ది రోజులుగా బ్రిటన్లో వివాదానికి దారి తీసింది. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆమెను పదవి నుంచి తొలగించాలని నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బ్రేవర్మన్ను తొలగించాల్సిందిగా సునాక్పై ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఇలా ఉంటే.. బ్రిటన్ కేబినెట్లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. అదే సమయంలో మైగ్రేషన్ అంశంపై అధికారిక పత్రాలను వ్యక్తిగత మెయిల్ ద్వారా షేర్ చేసినందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంటీరియర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె ప్రచురించిన కథనం వివాదాస్పదం కావడంతో మరోసారి పదవి కోల్పోయారు. గతంలో ఆమె వలసదారులపై చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్కు చోటు బ్రేవర్మన్ స్థానంలో విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బ్రిటన్ కొత్త హోం మంత్రిగా సునాక్ ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ను బ్రిటన్ తదుపరి విదేశాంగ మంత్రిగా ఎంపిక చేసింది. త్వరలో వారు అధికారికంగా పదవులు చేపట్టనున్నారు. కామెరూన్ 2010 నుంచి 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇదీ చదవండి: Jaishankar Gift To Rishi Sunak: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
సంచలన నిర్ణయం.. 600 మంది ఉద్యోగుల తొలగింపులో దిగ్గజ కంపెనీ
ప్రముఖ అడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కష్టాల్లో చిక్కుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైస్వాటర్ హౌస్ కూపర్స్ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆప్షన్ ఇచ్చాం.. అందుకు అనుగుణంగా సిబ్బంది వీఆర్ఎస్ ఆప్షన్ ఎంచుకోకుంటే వారి తొలగింపు తప్పదని పీడబ్ల్యూసీ ప్రతినిధులు చెబుతున్నారు. పీడబ్ల్యూసీలో 25 వేల మంది పని చేస్తుండగా..అడ్వైజరీ బిజినెస్, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ‘బిగ్ ఫోర్’లో లేఆఫ్స్ అలజడి ప్రపంచ వ్యాప్తంగా అకౌంటింగ్, ప్రొఫెషనల్ సర్వీసులు అందించే అతిపెద్ద ‘బిగ్ ఫోర్’ సంస్థలుగా డెలాయిట్ ఎలోయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ey), ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC), క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (KPMG)లు ప్రసిద్ధి చెందాయి. ఆ నాలుగు సంస్థల్లో ఒకటైన పీడబ్ల్యూసీ 600 మంది వర్క్ ఫోర్స్ను తగ్గించే పనిలో ఉండగా.. గత నెలలో మరో సంస్థ కేపీఎంజీ యూకే విభాగంలోని డీల్ అడ్వైజరీ విభాగంలో పనిచేస్తున్న 100 మందిని ఇంటికి సాగనంపాలని భావిస్తుండగా.. యూకే 800 కంటే ఎక్కువ మందిని తగ్గించాలని డెలాయిట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
మాంద్యంలో బ్రిటన్! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ పేర్కొంటోంది. వరుసగా తిరోగమనం వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది. వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ అనలిస్ట్ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. రిషి సునక్కు తలనొప్పిగా మాంద్యం! బ్రిటన్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి. తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాత్రం మాంద్యానికి 50 శాతం అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. -
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా?
చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి యూకేలోని బార్న్స్లీలో క్లర్క్గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్ స్టేజ్ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్కి స్టెమ్ సెల్స్ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్కి స్టెమ్సెల్ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్ కణాలు ఉండాలి. ఫిర్త్ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్ మార్పిడి అనేది ఫిర్త్కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. చివరికి ఫిర్త్ జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్ఫుల్గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!)