-
టీబీ పరీక్షలకు జంకుతున్న హెచ్ఐవీ రోగులు
న్యూఢిల్లీ: టీబీగా పిలిచే ట్యూబర్క్యులోసిస్ (క్షయ) నివారణకు దేశవ్యాప్తంగా ఉచితంగానే చికిత్స పొందే పరిస్థితి ఉన్నప్పటికీ కొందరు ఈ కేంద్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ సోకిన రోగులకు టీబీ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నా టీబీ పరీక్షలు చేసుకునేందుకు టీబీ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటున్నారు. వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీ విభాగం డెరైక్టర్ జనరల్ ఆర్ఎస్ గుప్తా మాట్లాడుతూ... ‘హెచ్ఐవీ సోకినవారికి టీబీ సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. అయితే హెచ్ఐవీ సోకినవారు, టీబీ సోకినవారు వైద్య కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడ తమ వ్యాధి గురించి ఇతరులకు తెలిసిపోతుందోనన్న భయంతో నివారణ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. హెచ్ఐవీ సోకినవారికి సరైన చికిత్స అందకపోతే మరణించే అవకాశం కాస్త ఆలస్యంగా ఉన్నా అదే వ్యక్తికి టీబీ ఉంటే చాలా త్వరగా మృత్యువు ఒడిలోకి చేరుతారు. టీబీ వ్యాధి ఉండి, హెచ్ఐవీ సోకినవారికి సరైన మందులు అందకపోతే 50-60 శాతం మరణించే అవకాశం ఉంద’న్నారు. హెచ్ఐవీ సోకినవారికి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉన్నందున టీబీ పరీక్షను కూడా జరిపించుకోవాలని, సోకినట్లు తేలితే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు. మృత్యువాత పడుతున్న హెచ్ఐవీ రోగుల్లో 25 శాతం మంది టీబీ కారణంగానే మరణిస్తున్నట్లు చెప్పారు. దేశంలో దాదాపు 21 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉన్నారని చెప్పారు. బరువు తగ్గినట్లు అనిపించినా, రాత్రి సమయంలో చెమటలు పడుతున్నా, మూడు వారాలకు మించి దగ్గు ఉన్నా హెచ్ఐవీ రోగులు వెంటనే టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న టీబీ కేంద్రాలు కూడా రోగుల పట్ల సమస్యగా మారాయన్నారు. ‘పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా హెచ్ఐవీ/ఎయిడ్స్ అలయెన్స్’ డెరైక్టర్ సోనాల్ మెహతా మాట్లాడుతూ... ప్రజలకు హెచ్ఐవీతోపాటు టీబీపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ రోగులకు టీబీపై సరైన అవగాహన కల్పించి, చికిత్సా కేంద్రాలకు వెళ్లేలా చే యాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హెచ్ఐవీ రోగులు నెలలో కనీసం ఒక్కసారైనా టీబీ పరీక్ష చేయించుకుంటే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎయిమ్స్ వద్ద విద్యార్థుల మానవహారం క్షయ(టీబీ)పై అవగాహన కల్పించేందుకు వందలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన మానవహారంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిమ్స్ డెరైక్టర్ మిశ్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నల్లమలలో మరణమృదంగం
అచ్చంపేట,న్యూస్లైన్: నల్లమల అడవుల్లో మరణమృదంగం మోగుతోంది. ఇక్కడి చెంచులను ‘క్షయ’ హరిస్తోంది. సరైన పర్యవేక్షణలో వారికి ఈ మందులు ఇవ్వక పోవడంతో రోగాలు ము దిరి ఈ గిరిజనులు తవతమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఈ ప్రభావం వీరి జనాభాపై కూడా పడి ఆందోళన కలిగిస్తోంది. వీరి సంక్షేమాన్ని చూడాల్సిన సమీకృత గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ) పనితీరు ఆశాజనకం గా లేకపోవడంతో వారికి సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న చెంచులు క్షయ, రక్తహీనత, తదితర దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్య సేవలు ఏవీ... ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా చెంచులకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారే తప్ప, దీర్ఘకాలిక రోగాల గురించి వైద్య ఆరోగ్య శాఖ, ఐటీడీఏ పట్టించుకోకపోవడంతో వ్యా ధులు ముదురుతున్నాయి. ఈ ప్రాంతంలో మలేరియా, క్షయ తదితర శ్వాసకోశ వ్యాధులతో రెండేళ్ల కాలంలో 30 మంది చెంచులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవి చాలా వరకు వెలుగులోకి రావడం లేదు. జిల్లాలో మూడువేల మందికి గాను 84 మంది టీబీ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. నల్లమల ప్రాంతంలోని చెంచుపెంటల్లో 200ల మందికి పైగా టీబీ బాధితులు ఉంటారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండల పరిధిలో 21 మంది, అచ్చంపేట మండలంలో ఇద్దరు, బల్మూర్ మండలంలో ఒకరు, లింగాలలో ముగ్గురు వంతున టీబీ బాధితులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. వైద్య సిబ్బంది ఏరోజు కూడా లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలను సందర్శించిన దాఖలాలు లేవు. తప్పుడు లెక్కలతో కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా వాస్తవ పరిస్థితి బాహ్య ప్రపంచానికి తెలీడం లేదు. కోర్సు తీసుకోకపోవడం వల్లే... మందులకు లొంగని టీబీ రోగులు రోజుకు 13 మాత్రలు, ఒక ఇంజెక్షన్ ఆరు నెలల పా టు కచ్చితంగా తీసుకోవాలి. ఆతర్వాత రో జూ ఆరు మందుల వంతున 14 నెలల వాడా లి. సాధారణ టీబీకి ప్రతీ రోజు ఏడు మాత్ర ల చొప్పున ఆరునెలలు వాడాలి. వ్యాధి పీడితులు ప్రతి రోజు వినియోగించాల్సిన మందులు అధిక పరిమాణంలో ఉండటంతో చాలా మంది చెంచులు వీటిని సక్రమంగా వాడటం లేదు. మధ్యలోనే మానివేయడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాలు హరించి వేస్తోంది. క్షయ నియంత్రణకు వైద్య సిబ్బంది ప్రతి నెల మందులు సరఫరా చేస్తున్నారే తప్ప వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షించలేక పోతున్నారు. గిరిజనుల అవగాహనా లేమి కూడా రోగ తీవ్రతకు కారణమవుతోంది. నిండు నిర్లక్ష్యం..! అచ్చంపేట సివిల్ అస్పత్రి పాటు సిద్దాపూర్, అమ్రాబాద్, పదర,మన్ననూర్, వట్టువర్లపల్లి, బల్మూర్, లింగాల, అంబడిపల్లిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ఆయా పీహెచ్సీల పరిధిలో పలు చెంచు పెంటలు ఉన్నప్పటికీ వైద్యసేవలు అంతంతమాత్రమే. చెంచులు విషజ్వరాలకు గురైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే పెంటలకు వైద్యులు తరలివచ్చి శిబిరాలను నిర్వహిస్తారు. కానీ నిరంతరంగా వైద్యసేవలను కల్పించి స్థానికుల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు. -
అక్రమాల పుట్ట!
సాక్షి ఏలూరు : జిల్లా క్షయ నివారణ కేంద్రం లో అక్రమార్కులు తిష్టవేశారు. తోటి సిబ్బంది నుంచే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెట్రోల్ అలవెన్స్ నుంచి వ్యక్తిగత రుణాల మంజూరు వరకూ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇటీవల ఈ విభాగపు జిల్లా అధికారి ఆర్.సుధీర్బాబు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ శాఖలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లక్షలాది రూపాయలు అటు ప్రభుత్వం నుంచి ఇటు సిబ్బంది నుంచి దోచుకుంటున్న వైనం బయటపడుతోంది. పెట్రోల్ అలవెన్సులో రూ. 200 సమర్పణ క్షయ నివారణ విభాగంలో 22 మంది శాశ్వత , 46 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి జీతం నుంచి ప్రతి నెలా రూ.200 ఉన్నతాధికారికి కమిషన్ రూపంలో ముట్టేది. ఈ విషయాన్ని ఏడాది క్రితం ‘సాక్షి’ బయటపెట్టింది. దీంతో అప్పటి నుంచి ఈ తతంగం ఆగింది. అయితే ఆ సొమ్ముంతా ఇటీవల ఒకేసారి వసూలు చేశారు. అంతర్గత ఆడిట్ అధికారులను సంతృప్తి పరచాలంటూ శాశ్వత ఉద్యోగుల నుంచి రూ.4 వేలు, తాత్కాలిక ఉద్యోగుల నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేశారని ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇది కాకుండా పెట్రోల్ అలవెన్సు నుంచి రూ. 200 ప్రతినెలా అయ్యవారికి ఇచ్చేయాలి. నెలలో 20 రోజులకు ట్రావెల్ అలవెన్స్ తీసుకునే వెసులుబాటు ఎనిమిది మంది ఫీల్డు సిబ్బందికి ఉంది, వీరు ఆ అలవెన్స్ నుంచి రూ.650 పై అధికారికి ముట్టజెప్పాల్సిందేనని సమాచారం. అంతేకాకుండా ఆరు నెలల క్రితం రూ. 2.40 లక్షలతో ల్యాబ్ పరికరాలను కొనుగోలు చేశారు. దీనిలో సగం సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత రుణానికీ కమీషన్ తొమ్మిది మంది ఉద్యోగులు ఈనెల 9న ఏలూరు ఆర్ఆర్ పేటలోని డీసీసీబీ బ్యాంకు నుంచి ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. రుణం మంజూరు కోసం ఒక్కొక్కరు రూ. 3 వేల చొప్పున తమ శాఖాధిపతికి సమర్పించుకున్నారంటే వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.కోటి బడ్జెట్ ఉండే ఈ విభాగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఓ తాత్కాలిక ఉద్యోగి చేతుల్లో ఉన్నాయి. శాశ్వత ఉద్యోగి అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నా ఆయన్ను ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. దీనిపై ప్రశ్నించినా ప్రయోజనం లేదు. తాత్కాలిక ఉద్యోగి చెప్పుచేతల్లోనే సిబ్బంది అంతా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖపై పూర్తి విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.