Advertisement
toys
-
వీధి బొమ్మలు
వీధి బొమ్మలు.. అయ్యో.. తప్పు రాశామే! విధి బొమ్మలేమో కదా!విధాత రాసిన విధి కాదు. కొందరు దురాగతుల రాత ఇది.రాలిన పూలను నులిమి ఆ రంగులు పూసిన వీధులివి. మన వీధులే. మన పిల్లలే. మన సమాజమే. కానీ.. వీధిలో వదిలేశారు.అదే వీధి బొమ్మలు ఇవాళ మన సంస్కారాన్ని వెక్కిరిస్తున్నాయి. కోల్కతా రెడ్లైట్ ఏరియాలోని చెల్లెళ్లు గీసిన ఈ బొమ్మలు అమ్మవారి మంటపాల ముందు కొలువయ్యాయి. దసరా నవరాత్రులకు పుట్టిల్లు కోల్కతా. ఈ నవరాత్రుల్లో దుర్గాపూజలో పాల్గొన్నారీ కోల్కతా మహిళలు. కోల్కతాలో వీళ్లు నివసించే ప్రదేశం ‘సోనాగచ్చి’ గురించి నూటికి తొంభై మందికి తెలిసే ఉంటుంది.. కానీ తెలియనట్లు ముఖం పెడతారంతే. ఆ ప్రదేశం పేరు పలకడానికి కూడా ఇష్టపడనంత విముఖతను కూడా వ్యక్తం చేస్తుంది సభ్యసమాజం. మరి వాళ్ల జీవితాలు అక్కడికి చేరడంలో సభ్యసమాజం పాత్ర లేదా? లేదా కాదు, పూర్తి బాధ్యత సమాజానిదే. దేహంతో వ్యామోహం తీర్చుకోవచ్చనే కుత్సిత బుద్ధికి, దేహం మీద వ్యాపారం చేయవచ్చనే కుటిలనీతికి పుట్టిన వృత్తి వారిది. ఇప్పుడీ మహిళలు దుర్గామాతకు అర్పిస్తున్న నైవేద్యం ఏమిటో తెలుసా? వారి మనోవేదన! తమ జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి మాటలు కావాలి. చెప్పడానికి మాటలు చాలని బాధను వాళ్లు కుంచెతో చెప్పారు. నోరు విప్పడానికి ధైర్యం లేని తమ దుస్థితిని బొమ్మల్లో చూపించారు. వీధే వేదిక కోల్కతా సోనాగచ్చి మహిళలు ‘అహిరోతోలా’ లో మూడు వందల అడుగుల పొడవున్న వీధిలో బొమ్మలు వేశారు. ఆ వీధి వెంట నడుస్తూ ఆ బొమ్మలను చూస్తుంటే కొద్ది నిమిషాలు మాటలు రావు. ప్రతి బొమ్మా మౌనంగా మాట్లాడుతుంటుంది. ఆ మాటలను నిశ్శబ్దంగా వింటూ ముందుకు సాగిపోవాల్సిందే. ఒక బొమ్మలో... తలుపు కొద్దిగా తెరుచుకుని ఉంటుంది, ముగ్గురమ్మాయిలు ఒకరి వెనుక ఒకరు నిలబడి బయటకు తొంగి చూస్తుంటారు. అది విటుడు వచ్చినప్పుడు వేశ్యాగృహం నిర్వహకుల పిలుపుతో బయటకు వచ్చి చూసే దృశ్యం. ఆ బొమ్మకు పైన మూడు బొమ్మలున్నాయి. మొదటి బొమ్మలో ఒక అమ్మాయి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకుంటోంది, రెండవ బొమ్మలో అదే అమ్మాయి అలంకరణ పూర్తి చేసుకుని చేతి విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. ఇక మూడవ బొమ్మలో అమ్మాయి ముఖాన్ని సగం మేర చీర కొంగు కప్పేసి ఉంది. మిగిలిన సగం ముఖంలో బొట్టు కూడా సగం మేరకే కనిపిస్తోంది. ఆ బొమ్మ చెప్తున్న విషయం ఏమిటంటే.. ఆ బొట్టు చెరిగి ఉందన్న వాస్తవాన్ని గమనించమని. కన్నీటి మడుగు ఒక బొమ్మలో ఒక టీనేజ్ దాటని అమ్మాయి.. కళ్ల నుంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. అలా కారిన నీళ్లు ఆమె ముందే మడుగు కట్టి ఉంది. తన దుర్భర జీవితాన్ని తలుచుకుని కడివెడు కన్నీళ్లు కార్చిందని చెబుతోందా బొమ్మ. మరొకమ్మాయి ఒంటి మీద ఉండాల్సిన చీర నేల మీద పరుచుకుని ఉంది. ఆమె చేతులతో దేహాన్ని కప్పుకుంటోంది. మరికొన్ని బొమ్మలు కేవలం పెదాలే.. వాటికి తాళం కప్పలు వేసి ఉన్నాయి. మరికొన్ని బొమ్మల్లో కేవలం చేతులు.. మా దేహం మీద దాష్టీకం వద్దు అడ్డు చెబుతున్నట్లున్నాయి. మరో బొమ్మలో ముగ్గురమ్మాయిలు ఒకరి కన్నీళ్లు మరొకరు తుడుచుకుంటున్నారు. ఇదీ.. సోనాగచ్చి మహిళలు చెప్పదలుచుకున్న వారి జీవితం. వంద వాక్యాల్లో కూడా చెప్పలేని దైన్యాన్ని బొమ్మల్లో చూపించిన వైనం. అమ్మవారిని శక్తిస్వరూపిణిగా పూజించే సమాజమే... అమ్మాయిని మాత్రం వ్యామోహం తీర్చుకోవడానికి, ఆమె దేహంతో వ్యాపారం చేయడానికి వాడుకుంటుంది. ఆమె పొట్ట నింపుకోవడానికి ఆమె దేçహాన్నే పెట్టుబడి వనరుగా మారుస్తుంది. ఈ ద్వంద్వ ప్రవృత్తి రూపుమాసిపోనంత కాలం ఈ వీధి బొమ్మలు కూడా చెరిగిపోవు. చెప్పడానికే ఇదంతా సెక్స్ వర్కర్ల జీవితంలో ఉన్న దౌర్బల్యాన్ని సమాజానికి తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జుబాక్బృంద దుర్గాపూజ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ సాహా. ఒక మహిళ సెక్స్ వర్కర్గా మారిందంటే... అందుకు కారణం అక్రమ రవాణా కావచ్చు లేదా తన పిల్లల కడుపు నింపడానికి మరోదారి లేక కావచ్చు... అన్నారాయన. – వాకా మంజులారెడ్డి -
అద్భుతం: వాల్మార్ట్తో ఆరేళ్ల బాలుడి డీల్!
న్యూఢిల్లీ : ముద్దులొలికే మాటలతో అలరించే ఓ ఆరేళ్ల బాలుడు అద్భుతం చేశాడు. అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్మార్ట్తో డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్లో టోయస్(బొమ్మలను) సమీక్షించే ఆరేళ్ల బాలుడు ర్యాన్, ఏకంగా తన సొంత టోయస్ బ్రాండులను మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. దీని కోసం వాల్మార్ట్కు చెందిన 2500 అమెరికా స్టోర్లతో, వెబ్సైట్తో సోమవారం డీల్ కుదుర్చుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ ర్యాన్ టోయస్రివ్యూకు ఈ అబ్బాయే స్టార్. గతేడాది 8వ బెస్ట్ పెయిడ్ యూట్యూబర్గా కూడా నిలిచాడు. యూట్యూబ్లో టోయిస్లను రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ ర్యాన్ యూట్యూబ్ టోయస్రివ్యూ ఛానల్కు 15 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. టోయస్తో ఆడుకుంటూ.. వాటికి అనుగుణంగా స్పందించే ర్యాన్ వీడియోలకు నెలకు 1 బిలియన్కు పైగా వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్లో టోయస్ రివ్యూ చేస్తూనే.. ఈ బాలుడు మిలీనియర్ అయ్యాడు. గతేడాది 11 మిలియన్ డాలర్లను ఆర్జించాడు. 2015 మార్చి నుంచి ర్యాన్ ఫ్యామిలీ ఆ బాలుడి వీడియోలను రికార్డు చేయడం, పోస్ట్ చేయడం చేస్తోంది. లిగో బ్యాక్స్ తెరవడం, దానితో ఆడటం ఈ బాలుడి తొలి వీడియో. మూడేళ్ల వయసులో దీన్ని యూట్యూబ్లో పెట్టారు. ఇలా ర్యాన్ యూట్యూబ్ స్టార్గా మారిపోయాడు. దీంతో తన సొంత బ్రాండ్ టోయస్నే ఏకంగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. అక్టోబర్లో తన టోయస్ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్టు ర్యాన్ చెబుతున్నాడు. కాగ, యూట్యూబ్ స్టార్ల రీచ్ను విస్తరించడానికి వారితో పాకెట్.వాచ్ లైసెన్స్ డీల్స్ చర్చలు కూడా జరిపింది. టోయస్, అప్పీరల్, హోమ్ ప్రొడక్ట్లకు వీరి రీచ్ను విస్తరించాలనుకుంది. ర్యాన్ వరల్డ్ వర్తకం మూడేళ్లు, ఆపై వారికి డిజైన్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది. ర్యాన్కు ఇష్టమైన వాటిలో పిజ్జాలు కూడా ఉన్నాయి. -
రాతిని శిలగా మార్చి..
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురువిశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనం కొలిచే దేవుడు ఇలాగే ఉంటాడు అని నిర్ధిష్టమైనప్రమాణాలు ఏవీ లేనప్పటికీ.. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నాడు రామ్మూర్తి. అతని ఉలి దెబ్బకు ఎలాంటి రాయి అయినా దేవతా రూపం దాల్చి తీరుతోంది. శిల్ప కళతో పాటు వడ్రంగి పనిలోనూ ప్రత్యేకతనుచాటుకుంటున్న రామ్మూర్తి గురించి తెలుసుకోవాలంటే చంద్రగిరి గ్రామానికివెళ్లి తీరాల్సిందే. బొమ్మనహాళ్ : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని చంద్రగిరి గ్రామానికి చెందిన రామ్మూర్తి ఆచారి.. రాతితో శిల్పాలు చెక్కుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాతితో దేవతా ప్రతిమలు చేయడంలోనే కాదు చెక్కతో రథాలు, బొమ్మలు చేయడంలోనూ మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ మరి కొందరికి ఉపాధిని అందిస్తున్నారు. చిన్నప్పటి సాధనే.. రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి ఎక్కువ. ఇంటర్మీడియట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమయ్యాడు. అప్పటి వరకు చిత్రకళపై ఉన్న మక్కువను చెక్కతో బొమ్మలు తయారు చేయడంపై మళ్లించాడు. అనంతరం రాతితో విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించాడు. తొలిదశలో రాతిని శిల్పంగా మార్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంటి వద్దనే ఉంటూ అదే పనిగా సాధన చేయడంతో తిరుగులేని నైపుణ్యాన్ని అతను సంపాదించుకున్నాడు. ముందుగా స్కెచ్ పెన్ను, పెన్సిల్తో దేవతామూర్తుల చిత్రాలను గీసుకుని అందుకు అనుగుణంగా విగ్రహాలను ఆయన తయారు చేస్తుంటారు. ఉభయ రాష్ట్రాల్లో పేరు శిలా విగ్రహాల తయారీకి రామ్మూర్తి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు జిల్లా కోటప్ప కొండ నుంచి ప్రత్యేకంగా రాయిని తెప్పించుకునేవాడు. వీటితో శివుడు, పార్వతి, ఆంజనేయస్వామి, మద్దానేశ్వరస్వామి, సరస్వతీ, అయ్యప్ప, వినాయకుడు, ప్రభావతి, నాగలింగేశ్వరుడు, నంది, నవగ్రహాలు, వీరభద్రస్వామి తదితర విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేస్తుంటాడు. బళ్లారిలోని బసవ భవన్లో ఏర్పాటు చేసిన అనాది లింగేశ్వర స్వామి విగ్రహం, హిందూపురంలోని ప్రత్యంగిరాదేవి ప్రతిమ ఇతను చేసినవే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొల్పిన వాల్మీకి, కనకదారు విగ్రహాలను కూడా రామ్మూర్తి చేసినవే కావడం గమనార్హం. తన వృత్తి నైపుణ్యంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పటివరకు వందకు పైగా విగ్రహాలు, రథాలను రామ్మూర్తి ఆచారి చేసి ఇచ్చారు. గ్రామీణ శిల్పులను ఆదుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లోని శిల్పులను ప్రభుత్వం ఆదుకోవాలి. వృత్తి నైపుణ్యతకు సహకరించాలి. శిల్పాలు చేసేందుకు ప్రత్యేక రాయితీలతో పాటు ప్రోత్సాహాకాలు అందించాలి. దేవతా విగ్రహాలను తయారు చేయడం ద్వారా రోజూ రూ. 400 ఆదాయం వస్తోంది. దీంతోనే జీవనం సాగించడం దుర్భరంగా ఉంటోంది.– బడిగే రామ్మూర్తి ఆచారి, శిల్పి, చంద్రగిరి -
ఈ రాముడు..ఏకలవ్యుడు
కంక బొంగులకు ప్రాణం పోస్తే.. సిమెంటు, ఇసుకకు ఓ ఆకృతినిస్తే.. బొమ్మలు మాట్లాడుతాయి.. ప్రతిమలు మనుసులను ఆకర్షిస్తాయి. ఏకలవ్యుడి చేతిలో ప్రాణం పోసుకున్న కళాకృతుల్ని చూస్తే అబ్బా ఏం కళ అనకుండా ఉండరంటే నమ్మండి. అంత కళ ఉన్నప్పటికీ కొలాం గిరిజన యువకుడికి తగిన ప్రోత్సాహం లభించట్లేదు. తగిన ప్రోత్సామందిస్తే మరింతమందికి ఉపాధి కల్పిస్తానని ఆ యువకుడు పేర్కొంటున్నాడు. నార్నూర్(ఆసిఫాబాద్): నార్నూర్ మండలం ఖైర్డట్వా గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డంగూడ గ్రామానికి చెందిన మాడవి రాము అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాము పదో తరగతి వరకు నార్నూర్ మండలంలోనే అభ్యసించాడు. అనంతరం ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యను అభ్యసించలేదు. తల్లిదండ్రులతో అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని వారు తయారు చేసే చాపలు, బుట్టలు, తడకలు తదితర రూపాలను రాము సైతం నేర్చుకున్నాడు. ప్రతిభ బయటికొచ్చిందిలా.. కొన్నేళ్ల క్రితం పొలాల అమావాస్య నాడు ఎడ్ల పూజలకు రకరకాల అలంకార వస్తువులను రాము తల్లిదండ్రులు తీసుకువచ్చారు. ఆ కాగితాలు, దేవుళ్ల చిత్రాలను రాము అందంగా తయారు చేశాడు. అదే సమయంలో కట్టెలతో తయారు చేసిన ఎడ్ల జత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని దేవాలయంలో తాను తయారు చేసిన ఎడ్ల జతను దేవాలయంలో ప్రదర్శనకు ఉంచాడు. అంతే కాకుండా దేవాలయంలోని గోడలపై వివిధ బొమ్మలు వేశాడు. అతడి ప్రతిభ గుర్తించిన ఇరుగు పొరుగు తమ ఇళ్లకు కూడా బొమ్మలు వేయాలని ఆఫర్ ఇచ్చారు. ఆ రోజు నుంచే తన జీవితం మారిపోయిందని రాము చెప్పకొస్తున్నాడు. మరుసటి రోజు నుంచే అలా ఇళ్ల గోడలపై బొమ్మలు వేయడం ప్రారంభించానని, భరతమాత, గాంధీజీ, అంబేద్కర్, బుద్ధుడు, శ్రీరాముడు, బాలాజీ, శివుడు ఇలా చిత్రాలు వేసి రోజుకు రూ. 500 చొప్పున కూలీ సంపాదించానని రాము చెబుతున్నాడు. విగ్రహాల తయారీతో ఉపాధి.. రాముకు ఒక ఆలోచన రావడంతో సుత్తితో హనుమంతుడిని చిన్న ప్రతిమ చెక్కడం మొదలు పెట్టాడు. దాన్ని చూసిన ఖండోరాంపూర్ గ్రామానికి చెందిన నాగోరావు అనే రేషన్ డీలర్ మాకు సంత్ తుక్డోజీ మహారాజ్, గాంధీజీ విగ్రహాలు కావాలని కోరడంతో సిమెంట్, కాంక్రిట్, ఇనుప చువ్వలతో రెండు విగ్రహాలను తయారు చేసి రాము రూ, 10 వేలు పారితోషికం పొందాడు. అప్పటి నుంచి రాము ప్రతిమల్ని తయారు చేయడం ప్రారంభించాడు. తాను ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండా ఏకలవ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అర్డర్లు చాలానే వస్తున్నాయని, కొన్ని విగ్రహాలకు కావాల్సిన పని ముట్లు, మిషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాము పేర్కొంటున్నాడు. వెదురుతో క్రాప్ట్:నడ్డంగూడ గ్రామానికి చెందిన వికలాంగుడు ఆత్రం జలపత్రావు సహాయంతో రాము వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంట్లో వాడే దగ్గరి నుంచి కూర్చీలు వరకు వెదురుతో తయారు చేసి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు. ఆయన దగ్గర ఎలాంటి సామగ్రి లేకున్న సొంత తెలివితేటలతో వస్తువులను తయారు చేస్తున్నాడు. వెదురుతో ఎడ్ల బండి, ఎద్దులు, తాజ్మహాల్, స్టాండ్లు, బొమ్మలు, సెల్ఫోన్ స్టాండ్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని ఆదిలాబాద్ లేదా హైదరబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారు. వసువులు తయారీకై ఎలాంటి పనిముట్లు తమ వద్ద లేవని, ఐటీడీఏ ద్వారా సామగ్రిని అందజేస్తే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన అంటున్నారు. ఐటీడీఏ అధికారులతో పాటు కలెక్టర్ స్పందించి కొలాం గిరిజనులను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. యువతకు నేర్పిస్తా నేను స్యయంగా నేర్చుకుని శిల్పా కళతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శిల్పాలను సుత్తితో చెక్కడం చాలా కష్టంగా ఉంది. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే మిషన్లు కొనుక్కుని తక్కువ సమయంలో అందమైన శిల్పాలను చెక్కుతా. నేను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తా.– మాడవి రాము, నడ్డంగూడ, నార్నూర్ -
బొమ్మ కొంటే...కారు గిఫ్ట్
సాక్షి, సిటీబ్యూరో: ‘షాపింగ్ఫ్లెవర్.కామ్’ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు ఢిల్లీవాసులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్స్ డీసీపీ జానకీ షర్మిలా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పాయ్పాల్ నుంచి యోగేశ్ అనే పేరుతో మాదాపూర్కు చెందిన బాధితురాలికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి మీ బాబుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.షాపింగ్ఫ్లెవర్.కామ్ వెబ్సైట్లో ఆన్లైన్లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా వస్తుందని నమ్మించాడు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన అనంతరం మీ కుమారుడు కారు గెలుచుకున్నాడంటూ ఫోన్ చేసిన అతను రూ1.5లక్షలు స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత మీ కారును విడుదల చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ చార్జీల కోసం మీ బ్యాంక్ ఖాతాలో రూ.5.5 లక్షలు బ్యాలెన్స్ ఉంచాలని సూచించడంతో ఆ మొత్తాన్ని జమ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్వర్డ్లు తెలుసుకున్న అతను ఆ మొత్తాన్ని ఇతర బ్యాంక్ ఖాతాలోకి మళ్లించాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితుడి బ్యాంక్ ఖాతా ఆధారంగా సోమవారం న్యూఢిల్లీలో నిందితులను పట్టుకొని ట్రాన్సింట్ వారంట్పై గురువారం నగరానికి తీసుకొచ్చారు. స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా చెప్పుకుంటున్న మృదుల్ కపూర్, సుమిత్ సింగ్ సొలంకి ఫ్లాస్వై4యూ, మైషాప్మైడీల్స్, షాపింగ్ఫ్లెవర్.కామ్లతో ఆన్లైన్ వెబ్సైట్లు ఓపెన్ చేసి అమాయకులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
బొమ్మల బడి...అంగన్వాడీ
మేడ్చల్రూరల్: చిన్నారులు మనను అనుకరిస్తూ మనలా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలు ఎదిగే దశలో మనను అనుసరిస్తూ నేర్చుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రైవేటు ప్లే స్కూల్లకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఆటపాటలను నేర్పుతున్నారు. పిల్లలకు ఆటపాటలతో మనోవికాసం కలిగిస్తూ అంగన్వాడీ కేంద్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా ఆట వస్తువులే... అంగన్వాడీ కేంద్రాలలో ఎక్కడ చూసినా పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, గోడలకు బొమ్మల చిత్రాలే దర్శనమిస్తున్నాయి. అంగవాడీ కేంద్రం భవనం గోడలపై తెలుగు వర్ణమాల, కూరగాయలు, పండ్ల బొమ్మలు, మనిషి అవయవాల పటాలను ఏర్పాటు చేశారు. పండ్లు, కూరగాయలు, గుర్రం, వంటి వాహనాల నమూనా ప్లాస్టిక్ బొమ్మలతో చిన్నారులకు బోధన చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు చిన్నారుల మధ్యలో కూర్చోని ఆటపాటలతో విద్యనందిస్తున్నారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు ఐసీడీఎస్ నినాదాలతో, తెలుగు వర్ణమాల, ఆరోగ్యలక్ష్మి పథకం ఉద్దేశం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే చార్టులతో కనిపిస్తున్నాయి. మెనూ ప్రకారం.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు మెనూ ప్రకారం పోషకాహారాలను అందిస్తున్నారు. బాలామృతం, క్రమం తప్పకుండా ప్రతి రోజు భోజనంలో ఉడకబెట్టిన గుడ్లు, పోషకాహారాలను అందిస్తున్నారు. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పుతూ వారి భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. ఆటవస్తువులు పంపిణీ చేసిన భాస్కర్యాదవ్... సీఎం కేసీఆర్, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డిలజన్మదినం పురస్కరించుకుని ఇటీవలమేడ్చల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ భాస్కర్యాదవ్ మండలంలోని 61 అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా అందజేశారు. -
భూటాన్ యువరాజుకు చెన్నపట్టణ బొమ్మలు
సాక్షి, బెంగళూరు: మొదటి సారిగా భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజ దంపతుల కుమారునికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకకు చెందిన ప్రముఖ హస్తకళాకృతుల్లో ఒకటైన చెన్నపట్టణ బొమ్మలను అందజేశారు. భూటాన్ రాజు జిగ్మే నామ్గల్ వాంగ్చుక్ తన భార్యా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడితో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాజ దంపతులతో సమావేశమైన నిర్మలా సీతారామన్ యువరాజుకు ఒక కుందేలు బొమ్మతో పాటు కొన్ని చెన్నపట్టణ బొమ్మలను బహుమతిగా అందజేశారు. యువరాజుకు అందజేసిన బొమ్మలు రాజదంపతులను ఆకట్టుకున్నాయంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. చెన్నపట్టణ బొమ్మలతో ఆడుకుంటున్న బుల్లి యువరాజు -
కొండపల్లి బొమ్మకు కొత్తందం
బొమ్మల తయారీ పరిశ్రమకు నిధుల విడుదల మూలనపడిన పరిశ్రమకు ఊతం కొండపల్లి కొయ్యబొమ్మ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ప్రోత్సాహానికి నోచుకోక నిండా మునిగిన బొమ్మల పరిశ్రమకు ఊతం లభించింది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం కలిసి కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరు చేశాయి. ఈ డబ్బును సక్రమంగా వినియోగించుకుంటే వందల ఏళ్ల కళకు పునరుజ్జీవం కలుగుతుందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి (ఇబ్రహీంపట్నం) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఢిల్లీకి చెందిన ఎంపవర్ సంస్థ నేతృత్వంలో కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమ నుంచి కొండపల్లి పరిశ్రమకు రూ.1.75 కోట్ల నిధులు మంజూరయ్యాయిఈ పరిశ్రమ ఇప్పటికే జాతీయస్థాయి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు పొందింది. సుమారు 350 కుటుంబాల జీవన మనుగడగా, సమస్యల వలయంలో నెట్టుకొస్తున్న బొమ్మల తయారీ పరిశ్రమకు ఈ పరిణామం ఊరట కలిగిస్తుందంటున్నారు. రాజస్థాన్ హస్తకళ స్ఫూర్తితో.. 400ఏళ్ల క్రితం కొండపల్లిలో రాచరిక పాలన కొనసాగేది. రాజుల కాలం నాటి భవనాలకు డిజైన్ చేసేందుకు రాజస్థాన్ నుంచి హస్తకళాకారులు వలస వచ్చారు. రాజులు అంతరించాక బొమ్మల తయారీ పరిశ్రమను జీవనోపాధిగా ఎంచుకుని వారంతా ఇక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి అడవుల్లో లభించే తెల్ల పొనుగు చెట్ల నుంచి లభించే చెక్కతో బొమ్మలు తయారుచేసి.. క్రమంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ బొమ్మలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అందని ప్రభుత్వ సాయం వందల ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అంతంతమాత్రమే. 2002లో నాబార్డు నుంచి ఒక్కొక్కరికి రూ.2,500 మాత్రమే రుణంగా ఇచ్చారు. అనంతరం లగడపాటి రాజగోపాల్ ఎంపీగా రూ.5 లక్షలు, ట్రస్ట్ ద్వారా రూ.11.5 లక్షలు మంజూరు చేశారు. పుర పథకంలో బొమ్మల పరిశ్రమ, కాలనీ అభివృద్ధికి రూ.4కోట్లు కేటాయించినా అమలుకు నోచుకోలేదు. గతంలో ఇక్కడ తయారైన బొమ్మలను లేపాక్షి సంస్థ 80 శాతం కొనుగోలు చేసింది. అప్పట్లో వ్యాపారం బాగుండేది. ప్రస్తుతం లేపాక్షి కొనుగోళ్లు నిలిపేసింది. వ్యాపారం మందగించింది. అసోసియేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. కొండపల్లి అడవిలో పొనుగు చెట్లు అంతరించాయి. ఖమ్మంజిల్లా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బొమ్మల తయారీదారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రూ.1.75 కోట్లతో చేపట్టనున్న పనులు బొమ్మల పరిశ్రమకు పూర్వవైభవం తెచ్చేందుకు లేపాక్షి సంస్థతో కలిసి పరిశ్రమ అభివృద్ధికి రూ.1.75 కోట్లు వినియోగించనున్నారు. ఇందులో రూ.1.45 కోట్లు కేంద్ర గ్రాంటు కాగా, రూ.30లక్షలు డీఆర్డీఏ ఇంప్లిమెంట్ ఏజెన్సీ గ్రాంటు. బొమ్మల తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు వినియోగిస్తారు. ఇందుకు హస్త కళాకారుల భాగస్వామ్యం 25 శాతం, ప్రభుత్వ గ్రాంటు 75 శాతం. ముందుగా బొమ్మల తయారీదారులతో అసోసియేషన్ ఏర్పాటు, శిథిలావస్థకు చేరిన సంఘ భవనాన్ని పునఃనిర్మించడం, బొమ్మల తయారీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్రాల వినియోగం, అందుకు అవసరమైనlనైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ æకేంద్రం ఏర్పాటుచేస్తారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిబిటర్ను ఏర్పాటుచేస్తారు. నేటితరానికి అనుగుణంగా బొమ్మలు మలిచేందుకు డిజైన్ సెంటర్, ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. 20ఏళ్ల పాటు పొనుగు చెట్లు పెంచేందుకు ప్లాంటేషన్ ఏర్పాటు, వనసంరక్షణ సమితి సభ్యులకు చేయూత ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ మూడేళ్ల కాలవ్యవధిలో నిర్వహించాలి. అలాగే, ఏపీహెచ్డీసీ సంస్థ కొండపల్లి బొమ్మల అభివృద్ధికి రూ.70లక్షలు అదనంగా మంజూరు చేసింది. వీటితో కార్మికులకు పవర్ టూల్స్, కమ్యూనిటీ హాల్కు కాంపౌండ్ వాల్, కాలనీకి ప్రధాన గేటు, ఈడీపీ ప్రోగ్రామ్, నైపుణ్యంతో కూడిన శిక్షణ, ఈడీపీ శిక్షణ ఇస్తారు. -
బొమ్మలతో బోధన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : తరగతి గదిలో పాఠాలు చెబితే విద్యార్థులకు అర్థం కావడం కష్టమే. అదే బొమ్మలతో బోధిస్తే. విద్యార్థుల మనస్సుకు హత్తుకుంటుంది. వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది. అందుకే ఆ బాటను అనుసరిస్తున్నారు రాజమహేంద్రవరంలోని ఉపాధ్యాయులు మంగారాణి, నరేష్. వీరు పాఠ్యాంశాలకు తగ్గట్టుగా బొమ్మలను తామే తయారు చేసుకొని బోధనలో వినియోగిస్తూ పలువురికి మార్గదర్శకులుగా ఉన్నారు. పిల్లలకు పాఠాలు చెబితే అవి వారి బుర్రలోకి మాత్రమే ఎక్కవచ్చు. ఆ విధానంలో బట్టీ తప్పదు. కానీ పాఠ్యాంశంపై వారికి అవగాహన కలిగిస్తే.. అదీ బొమ్మల ద్వారా.. అప్పుడు అది వారి హృదయాల్లో నాటుకుపోతుంది. అందుకే ఉపాధ్యాయులు బోధనోపకరణాలను తయారుచేసుకుని బోధించాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే కొందరే ఆ బాటలో నడుస్తున్నారు. వారిలో అగ్రగణ్యులు రాజమహేంద్రవరంలోని నాగరాజా ఎలిమెంటరీ పాఠశాల ఉపా«ధ్యాయిని మంగారాణి, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు ఉపాధ్యాయుడు నరేష్. వీరు పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను తయారు చేసుకొని విద్యార్థులకు విషయం గుర్తుండేలా బోధిస్తున్నారు. మంగారాణి అయితే ఒక బ్లాగునే ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు కావాల్సిన పాఠాలు, బోధనోపకరణాలు ఉన్నాయి. యూ ట్యూబ్లో మంగారాణి అనే పేరుతో ఒక పేజీని ఏర్పాటుచేసుకుని పాఠాల వీడియోలు, తరగతిలో కృత్యాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. వీటిలో జెడ గేయం, ఎగిరే చిలుక పాఠ్యాంశాలెన్నో పొందుపర్చారు. అలాగే విద్యార్థులకు పాఠాలే కాదు పలు అంశాల్లో పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు కృషిచేస్తున్నారు నరేష్. ఆయన విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనను స్వయంగా విద్యార్థులతో చేయిస్తున్నారు. వీరిని మిగిలిన ఉపాధ్యాయులందరూ ఆదర్శంగా తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. తరగతి గది ఉత్తేజపరేదిగా ఉండాలి విద్యార్థులను ఉత్తేజపరిచేది తరగతి గది. అక్కడనుంచే వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలి. అలా జరగాలంటే ముందుగా వారు నిత్యం బడికి వచ్చేలా, పాఠాలపై శ్రద్ధ చూపేలా కృషిచేయాలి. అదే జరిగితే వారిలో దాగిఉన్న ప్రతిభ దానంతటదే బయటకు వస్తుంది. అందుకే వారిని విద్యవైపు ఆకర్షితులను చేసేందుకు పలు బోధనోపకరణాలను తయారుచేస్తున్నాను. దీనిపై ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నాను. – ఎం. మంగారాణి, నాగరాజా మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం ప్రతిభను వెలికితీయాలి ప్రతీ విద్యార్థిలోను నైపుణ్యం ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. అప్పుడే వారు పురోగతి సాధిస్తారు. నూతన విధానాలతో విద్యాబోధన చేయాలనే తపనతో సొంతంగా బోధనోపకరణాలను తయారు చేసుకుంటూ వారికి విద్యాబోధన చేస్తున్నాను. ఇందులో భాగంగానే పలు ప్రాజెక్టులు, అంశాలను స్వయంగా వారితోనే చేయిస్తున్నాను. – నరేష్, వీరభద్రపురం మున్సిపల్ స్కూలు, రాజమహేంద్రవరం -
కండల వీరుడి కళాపోషణ!
కండల వీరుడు సల్మాన్ ఖాన్లో మంచి నటుడే కాదు.. మంచి చిత్రకారుడూ ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కుంచె చేతబట్టి తనకు నచ్చిన బొమ్మలు గీస్తుంటారు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది. ఇప్పుడు సల్మాన్ ఆ బొమ్మ గీయడానికి కారణం లేకపోలేదు. కరీనాకపూర్తో కలిసి ఆయన నటించిన ‘భజరంగీ భాయ్జాన్’ త్వరలో విడుదల కానుంది. ఇందులో సల్మాన్, కరీనా మధ్య అందమైన లవ్స్టోరీ ఉంది. దాన్ని ఉద్దేశించి ఈ బొమ్మకు ‘భజరంగీ భాయ్జాన్’ అని పేరు పెట్టి, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ బొమ్మను చూసినవాళ్లు ‘సల్మాన్ ఎంత మంచి చిత్రకారుడో’ అని అభినందించకుండా ఉండలేకపోయారు. -
ప్రేమికుల రోజు ఆన్లైన్ కొనుగోళ్లు రూ.22 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు కార్డులు, ఫ్లవర్స్, డైమండ్ జ్యువెలరీ, చాక్లెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తదితర వాటిని కొనుగోలు చేయటానికి ఆన్లైన్ కొనుగోలుదారులు వెచ్చించే మొత్తం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అసోచాం తెలిపింది. గతేడాది ఈ మొత్తం రూ.16 వేల కోట్లుగా ఉందని పేర్కొంది. దీనికోసం అసోచాం ఓ సర్వేను జరిపింది. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేసే వారు రిటైల్ షాపులతో పోలిస్తే ఆన్లైన్లోనే ఆఫర్లు బాగుంటాయనే అభిప్రాయపడ్డారు. అలాగే 50 శాతం మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు, 18 శాతం మంది ట్యాబ్లెట్ వినియోగదారులు గిఫ్ట్లను కొనుగోలు చేయటానికి వారి ఉపకరణాలనే వినియోగిస్తారు. -
హస్తకళాక్లేళి
బంకమన్ను (క్లే)తో పిల్లలు ఆడుకోవడం చూసే ఉంటారు. క్లేతో వారు రకరకాల బొమ్మలు చేస్తారు. తర్వాత క్లేని ముద్దలా చేసి దాచుకుంటారు. అయితే రేవతికి అలాంటి క్లే పనికిరాదు. ఒకసారి ఒక ఆకృతిలోకి మలిస్తే ఇక అదెప్పటికీ అదే ఆకృతిలో ఉండిపోవాలి. కానీ అలాంటి వండర్ క్లే మార్కెట్లో లేదే! రేవతి ఆలోచించారు. ప్రయోగాలు చేశారు. ఎంతో ముడిసరుకును వృథా చేశారు. చివరికి విజయం సాధించారు. వండర్ క్లే తయారైంది! దానికావిడ ‘ఆర్ట్ క్లే’అని పేరు పెట్టారు. అదిప్పుడు ‘రేవతి ఆర్ట్ క్లే’ గా కూడా వ్యవహారంలో ఉంది. ఇంతటి ఘనత సాధించిన రేవతి నేపథ్యం ఏమిటి? మహిళలకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది? రేవతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అమ్మాయి. తండ్రి శ్రీపాద భగవన్నారాయణ స్వాతంత్య్ర సమరయోధులు. ఇంట్లో తనే చిన్న. ఇద్దరన్నయ్యలు, ఐదుగురు అక్కలు. రేవతికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం ఇష్టం. రేగడిమట్టితో బొమ్మలు చెయ్యడం, పేపర్పై స్కెచ్లు వేయడం.. ఇదే ఆమె లోకం. దాంతో పెద్దన్నయ్య ఆమెను గుంటూరులోని మహిళా కళాశాలలో బి.ఎ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సులో చేర్పించారు. బి.ఎ మొదటి సంవత్సరం పూర్తికాగానే పెళ్లయింది. భర్త ఎయిర్ఫోర్స్ అధికారి. చండీగఢ్లో ఉద్యోగం. దాంతో రేవతి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేయలేకపోయారు. టర్నింగ్ పాయింట్ రేవతికి ఇద్దరబ్బాయిలు. వాళ్లు పెద్దయి, పెళ్లిళ్లయిన తర్వాత ఆమెకు ఖాళీ దొరికింది. పద్దెనిమిదవ యేట అర్ధంతరంగా ఆపేసిన చదువుని కొనసాగించాలని ఎం.ఎ ఇంగ్లిష్లో చేరారు. కొంతకాలం పిల్లల దగ్గర గడుపుదామని అమెరికా వెళ్లారు. ఓరోజు వాళ్లబ్బాయి మార్కెట్లో కనిపించిన పేపర్ క్లే చూపించి ‘బొమ్మలు చేసుకోవడానికి బావుంటుంది’ అని తీసిచ్చాడు. ‘‘దాంతో బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి. అలా మళ్లీ నాకిష్టమైన బొమ్మలు చేయడం మొదలుపెట్టాను. పద్దెనిమిదవ యేట మానేసిన ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సుని యాభై దాటిన తర్వాత సొంత ప్రయోగాలతో పట్టాలెక్కించాను’’ అని చెప్పారు రేవతి. ఆ ప్రయోగాలలో ఒకదాని ఫలితమే మూడేళ్ల క్రితం ఆమె కనిపెట్టిన ఎకో ఫ్రెండ్లీ ‘ఆర్ట్ క్లే’. అన్నీ ఆహారపదార్థాలే! ఆర్ట్ క్లే కోసం రేవతి వాడే ముడిసరుకు అంతా ఆహార పదార్థాల మిశ్రమం. రంగులు కూడా ఫుడ్ కలర్సే కావడంతో ఈ క్లేతో ఎంతసేపు పని చేసినా చేతులకు, చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి ఎటువంటి హాని కలగదు. పైగా ఆమె కనిపెట్టిన క్లే, పేపర్ క్లే లాగానే మృదువైనది. క్లే ఆరిన తర్వాత కనిపించే కొద్దిపాటి పెళుసుదనం కూడా అందులో ఉండదు. ఒకసారి ఒక రూపం ఇచ్చి ఇరవైనాలుగ్గంటలపాటు కదల్చకుండా ఉంచితే ఇక అది అలాగే ఆరిపోయి ఆకారం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ క్లేతో చేసిన పూలలో దుమ్ము చేరినా సబ్బు నీటిలో జాడించి శుభ్రం చేసుకోవచ్చు. కుటీర పరిశ్రమగా... హైదరాబాద్లోని బేగంపేటలో ‘రేవతి ఆర్ట్ క్లే హ్యాండీక్రాఫ్ట్స్’ ఉంది. అందులో ఎందరో మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆసక్తితో మొదలు పెట్టి, ఇలా కుటీర పరిశ్రమగా ఓ యూనిట్ను వృద్ధి చేశారు రేవతి. ఇప్పుడది వ్యాపార పరిశ్రమగా కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. అందమైన ఆకృతికి రూపం ఇవ్వడంలో నైపుణ్యం ఉంది కానీ మార్కెట్ చేసే చాకచక్యం తనలో లేదంటారామె. ప్రభుత్వం నుంచి పేటెంట్ పరీక్ష ఎదుర్కొన్న తర్వాత తనలా ఆసక్తి ఉన్నవారితో కలిసి మార్కెట్లోకి రావాలన్నది ఆమె ఆలోచన. అరవై ఆరేళ్ల వయసులో కూడా రేవతి ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం... ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించడం, ఆలోచనకు ఒక రూపం ఇచ్చి మురిసిపోవడం, పదిమందికి నేర్పించి తృప్తి పొందడమే కావచ్చు. ఫొటోలు: శివ మల్లాల క్లే తయారీ కోసమే ఓ యంత్రం! నా క్లే తో శిల్పాలు, సీనరీలు, పూలు చేయవచ్చు. ఒకసారి తయారైన క్లే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా జిగురు తగ్గుతుంది తప్ప ఫంగస్ రాదు. మార్కెట్లో దొరికే మామూలు యంత్రానికి మరికొన్ని విడిభాగాలు చేర్చి ఈ క్లే తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. రోజుకు వంద కిలోల క్లే తయారు చేయగలను. - రేవతి, ఆర్ట్ క్లే రూపకర్త -
కర్రకు జీవం..
నిర్మల్ అర్బన్ : కొయ్యబొమ్మలు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నిర్మల్. ఇక్కడి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పునికి కర్రతో తయారు చేసే బొమ్మలు, పరికరాలు, చిత్రకళలు, పెయింటింగ్స్ సహ జసిద్ధంగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. ప్రతీ ఒక్కరి మనస్సు దోచుకుంటాయి. చిత్రకళకు ప్రతీరూపాలైన నిర్మల్ బొమ్మలకు అంతటి ఘనత ఉంది మరీ. 400 ఏళ్ల చరిత్ర.. నిర్మల్ కొయ్యబొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కళాకారులు ఇక్కడి కలపను ఉపయోగించి అందమైన బొమ్మలు తయారు చేసేవారు. దీనినే వృత్తిగా మలుచుకుని పలు కుటుంబాలు ఇళ్లలోనే బొమ్మలు తయారు చేసేవని పూర్వీకులు చెబుతారు. చిన్న, చిన్న వస్తువులు, బొమ్మలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తుండేవారని ప్రతీతి. దీంతో పాటు రాజులకు అవసరమైన వస్తువులు తయారు చేసేవారు. నిజాం నవాబు కాలంలో సోన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన రాజు కూర్చునేందుకు ప్రత్యేకంగా కూర్చీని తయారు చేసి ( రాజు కూర్చోగానే బంగారు పూల వర్షం కురిసేలా) బహూకరించడంతో, దానిని చూసి మంత్రముగ్దులైన రాజు తన వంతుగా 16మంది కళాకారులకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేశాడని, ఇలా ప్రారంభమైన కొయ్యబొమ్మల తయారీ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కళాకారులు చెబుతారు. సంఘంగా ఏర్పాటు మొదట్లో కొయ్యబొమ్మలను ఎవరికి వారే తమ తమ ఇళ్లలో తయారు చేసుకునే వారు. సంతలలో అమ్ముకునేవారు. ఎవరైనా ముందుగానే ఆర్డర్ ఇస్తే వాటిని తయారు చేసి ఇచ్చేవారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ఇబ్బందులు రావడంతో తయారీదారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేవి. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ కళపై ఉన్న మక్కువతో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి కళాకారులకు సలహా ఇచ్చింది. దీంతో జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయంతో 1955లో ‘నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహాకార సంఘం’ ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం 16 మందితో ఉన్న సొసైటీలో ప్రస్తుతం దాదాపు 46 మంది సభ్యులు ఉన్నారు. ఉట్టిపడే జీవకళ కళాకారులు చేతిలో కర్రలు జీవాన్ని పొందుతున్నాయి. మెత్తగా, తేలికగా, నాణ్యతగా, పగుళ్లు లేకుండా, రంగులు అద్దేందుకు వీలుగా, చెదలు పట్టకుండా ఎక్కువ కాలం మన్నేలా, అన్నింటికి అనువైనది పునికి కర్ర ఉండటంతో దీనిని బొమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ప్రత్యేక మైన మట్టిని కూడా వీటి తయారీలో వాడుతున్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తుండటంతో బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. నిర్మల్ బొమ్మలకు వినియోగించేది కేవలం పునికి కర్ర మాత్రమే కావడంతో దీనికోసం కళాకారులే అడవులకు వెళ్లారు. పునికి చెట్లపై స్థానికులు, అటవీ శాఖాధికారులకు అవగాహన అంతంత మాత్రంగా ఉండటం, చెట్లను గుర్తించేందుకు స్వయంగా వెళ్లాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. పడిపోయిన చెట్లను మాత్రమే అటవీశాఖాధికారుల సహకారంతో టింబర్డిపోకు తరలించి, అక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తామని, దీంతో ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు. కనీసం కర్రను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అడవంతా గాలించడం ఒక ఎత్తయితే దానిని అడవి నుంచి తరలించడం మరో ఎత్తు అవుతోంది. టింబర్ డిపోనుంచి కొనుగోలు చేసిన కలపతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తయారు చేసేందుకు కార్యదర్శి సూచనలతో తయారీకి సిద్ధమవుతామని చెబుతున్నారు. కుటీర పరిశ్రమగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఇంటి వద్ద కొయ్యబొమ్మలకు రూపాలు ఇస్తున్నారు. సుమారు 30 మంది మహిళలు ఇళ్లలో బొమ్మలు తయారు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరు తయారు చేసిన బొమ్మలు సహజ రూపంతో నిలుస్తున్నాయి. సహజత్వానికి మారు పేరు కొయ్యబొమ్మలు సహజత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. అలాగే వీరు వేసే పెయింట్స్కు కూడా ప్రత్యేకత ఉంది. డెకో పేయింటింగ్తో వేయడంతో ప్రత్యేక ఆకర్షణ వస్తోంది. అలాగే పేయింటింగ్లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్గ్రౌండ్గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. డెకో పేయింటింగ్ రాకముందు సహజమైన రూపంలో కళాకారులు రంగులు తయారు చేసుకునేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదిగ పువ్వు వాడేవారు. ఇక నలుపు రంగు కోసం దీపం పెట్టి దానిపై ఓ పాత్రను ఉంచడంతో దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. అయితే ప్రస్తుతం వివిధ రంగులను ఒక్కతాటిపై తీసుకువచ్చి డెకో పేయింటింగ్తో చిత్రాలు గీస్తున్నారు. ఈ చిత్రాలు కొన్నేళ్ల పాటు శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండడమే దీని ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల్లోనూ దర్శనం నిర్మల్ కళారూపాలు దేశంలోని పలుచోట్ల దర్శనమిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాజీవ్గాంధీ మ్యూజియంలో కామధేను, కోన్గల్లి, రథం, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు సుమారు 16 లక్షల విలువైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. అలాగే 1948లో మహారాష్ట్రలోని పాలజ్కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొల్పేందు కోసం గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరడంతో అప్పట్లో.. కళాకారుడు గుండాజివర్మ పాలజ్ గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఆ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. కాలానికనుగుణంగా.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో తయారీకి, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించేలా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే సీసీహెచ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ కలర్లతో పేయింటింగ్ నేర్పించారు. దీంతో వివిధ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్యాకింగ్లోనూ ఇటీవల శిక్షణ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాచర్ల లింబయ్య వర్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన దేవతామూర్తులను తీర్చిదిద్దడంలో దిట్ట. ఈయన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2006లో అలనాటి రాజుల కాలంలో ఏ విధంగా ఉండేవో అదే రూపంలో కామధేనువు, నాగలక్ష్మీదుర్గాదేవి, కొనుగుల్ల (అవార్డుకు ఇచ్చేవారు), డాల్ల్యాంప్, డ్రెస్సింగ్ టేబుల్, చెస్బోర్డు (బరాత్), రథం, మంచం, సోఫాసెట్లు, ప్రముఖుల ఇళ్లలో ఉండే బట్టలు మార్చుకునే పరికరాలను న్యూఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శించారు. వీటిని తయారు చేయడంలో రాచర్ల లింబయ్యతో పాటు పలువురు ఆయనకు సహాయమందించి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. 2006లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షేకావత్ చేతుల మీదుగా రాష్ర్టం నుంచి ‘శిల్పగురు’ అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు భూసాని నర్సింగం వర్మ, చిన్న పోశెట్టి వర్మ, నాంపల్లి రాజశేఖర్వర్మ తదితరులు అనేక గుర్తింపులు పొందారు. -
‘ఆర్ట్’ సోప్
కళాహృదయం ఉండాలే గానీ... ఆ కళ్లకు ప్రతిదీ కళాత్మకమే. పనికొచ్చేవి... పనికిరానివి... కళాకారుల చేతిలో పడితే ఏ వస్తువైనా కళాఖండమే. అపురూపమే. బాత్రూమ్కే పరిమితమైన సబ్బు బిళ్లను బొమ్మలుగా మలిచి ప్రత్యేకతను చాటుకొంటున్నారు నగరవాసి సహానా. బాత్ సోప్లపై బుజ్జి బుజ్జి పాపాయిలు, వారి చిట్టి పాదాలు, చంద్రునిపై చిన్నారులు, ప్రేమ చిహ్నాలు, పువ్వులు.. ఇలా కళారూపాలను చెక్కుతున్నారామె. వీటిని బర్త్డే గిఫ్ట్స్గా ఇస్తే... ఓ సరికొత్త తీపి గుర్తుగా మిగిలిపోతుందంటున్నారు. ఆర్డర్ ఇస్తే... చిన్నారుల ఫొటోలను కూడా వాటిపై మౌల్డ్ చేయడం సహానా స్పెషల్. బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఆదివారం నిర్వహించిన ‘వెగాన్ ఫెస్ట్’లో తన ఆర్ట్ సోప్స్ను ఆమె ప్రదర్శించారు. చిన్నారులకు నచ్చేలా... ‘మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిపైన ఎలాంటి ఆర్ట్ ఉండదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచనే ఇప్పుడీ కళాకృతులు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకొని... వారికి రిలేటెడ్గా ఉండే వాటిని తీర్చిదిద్దుతున్నా. మార్కెట్లో రా మెటీరియల్స్ తెచ్చి, ఆర్ట్ను బట్టి కలర్స్ ఎంపిక చేసుకుంటా. ఏడాది పైబడినవారెవరైనా ఈ సోప్స్ ఉపయోగించవచ్చు. ధర రూ.250 నుంచి ఉన్నాయి’ అన్నారు సహానా. -విజయ -
అందాల ఏరువాక...ఏటికొప్పాక
ఎల్లలు దాటిన లక్కబొమ్మల ఖ్యాతి అంకుడు కర్రతో అద్భుతాలు సూదిమొన సైజు నుంచి కళాఖండాలు ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది... ఆ బొమ్మ ముచ్చట్లాడుతుంది... సహజసిద్ధమైన రంగులతో అపురూపమైన ఆకృతుల్లో ఇంటికి శోభను చేకూరుస్తుంది... కళాభిమానుల మనసు దోచుకుంటుంది. అంకుడు కర్రతో అద్భుతాలను ఆవిష్కరించే ఏటికొప్పాక లక్క బొమ్మలకు అందుకే ఖండాంతర ఖ్యాతి. కళాకారుల సృజనాత్మకత, వారి కళాతృష్ణ మన కళ్లను కట్టిపడేస్తుంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇక్కడి హస్త కళాకారులకు లక్కతో పెట్టిన విద్య. ఉపాధి కోసం కొందరు బొమ్మలు చేస్తుంటే, ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరికొందరు కళాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రతిభావంతులు ఇక్కడున్నారు. సూదిమొన సైజులో కళాఖండాలను సృష్టించడంలో ఏటికొప్పాక హస్తకళాకారుల నైపుణ్యత ఎంతటి వారినైనా సరే ఔరా అన్పిస్తుంది. -యలమంచిలి అంకుడు కర్ర కొరత... పెరిగిన ధర లక్కబొమ్మల తయారీకి కావాల్సిన అంకుడు కర్ర దొరకడం ఇప్పుడు గగనమైపోతోంది. మునుపటి మాదిరిగా అంకుడు కర్ర లభించడం లేదని కళాకారులు ఆవేదన వెలిబుచ్చున్నారు. అనధికారికంగా దీనిపై కొందరు ఆంక్షలు పెడుతుండటం వల్ల అంకుడు కర్రను సరఫరా చేసే వారు ఒక్కసారిగా దానిపై ధరను పెంచేశారు. ఇది కళాకారులకు మరింత భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాల్సివుంది. వేలాది ప్రజానీకానికి ఇలవేల్పుగా ఉన్న బండిమాంబ అమ్మవారి ఆలయాన్ని స్పృశిస్తూ... పరవళ్లు తొక్కుతూ ప్రవహించే వరహానది చెంతనున్న ఏటికొప్పాక గ్రామం... లక్కబొమ్మల తయారీలో మేటికొప్పాకగా ఎంతో ఖ్యాతి, గుర్తింపు పొందుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే బొమ్మల తయారీతో యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో బీజం పడింది. అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో నక్కపల్లిలో లక్కబొమ్మలు తయారు చేసే నాలుగు కుటుం బాలు ఏటికొప్పాకకు అప్పట్లోనే వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చా యి. నాడు నాలుగు కుటుంబాలుంటే ఇప్పుడవి 250కు చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుం బాలు ఇప్పుడు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రకృతి రంగుల పరవశం కర్రతో తయారు చేసిన బొమ్మలకు రసాయనాలు మిశ్రమం చేసిన రంగులను అద్దితే పిల్లల ఆరోగ్యానికి ఇబ్బందికరమవుతుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచీ సహజసిద్ధమైన రంగులనే ఇక్కడి కళాకారులు ఉపయోగిస్తున్నారు. ఔషధ మొక్కలు, వనమూలికల ద్వారా ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీలో పద్మావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు 1992 నుంచి శిక్షణ తీసుకున్నారు. ఈ రంగుల తయారీకి ప్రధాన ముడిసరుకైన లక్కను రాంచీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కళాకారులు వారు తయారు చేసిన కళాఖండాలను స్థానికంగా ఉన్న పద్మావతి అసోసియేట్స్కు విక్రయిస్తుంటారు. కళాకారుల శ్రమ, పెట్టుబడులను గుర్తించి పద్మావతి అసోసియేట్స్ ధర నిర్ణయిస్తుంది. అద్భుతమైన బొమ్మలను ఇండెంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. మరికొందరు కళాకారులు వారి ఉత్పత్తులను స్థానికంగా ఉండే అనేక దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో లక్కబొమ్మల విక్రయం ద్వారా అనేక మంది వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు. దేశ విదేశాలకు పాకిన ఖ్యాతి దేశంలో ఏమూలకెళ్లినా మార్కెట్లో ఏటికొప్పాక బొమ్మలు కచ్చితంగా కన్పిస్తుంటాయి. ఈ సామర్ధ్యం మరెవ్వరికీ సాధ్యం కాకపోవడంతో దేశ, విదేశాల్లో ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఢిల్లీ, మద్రాస్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూర్, భువనేశ్వర్, రాజస్థాన్, హైదరాబాద్, పాట్నా, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాలతోపాటు స్విట్జర్లాండ్, హాలెండ్, అమెరికా, నేపాల్, లండన్, బ్రిటన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడి బొమ్మలు ఎగుమతి అవుతుంటాయి. చూసిన కళ్లు ధన్యం... పిల్లల నుంచి పెద్దల వరకు, కూలివారి నుంచి కోటీశ్వరుల వరకు ఎవరైనా ఏటికొప్పాక హస్తకళాకారులు తయారు చేసిన లక్కబొమ్మలను చూసి ముగ్ధులు కావాల్సిందే. వీటిని ఎలా చేశారంటూ కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే వీరి నైపుణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది తమ ఇళ్ల షో కేసుల్లో ఏటికొప్పాక బొమ్మలను అలంకరించుకోవాలనుకుంటారు. మరికొంద రు అధికారులు, అతిథు లు, బంధువులకు, శుభకార్యాల సమయంలో ఈ బొమ్మలను కానుకగా ఇవ్వడానికి అమితాసక్తి కనబరుస్తుంటారు. అవార్డులెన్నో... గతంలో నిరక్షరాస్యులైన కార్మికులే లక్కబొమ్మలను తయారు చేసేవారు. రానురాను చదువుకున్నవారు, మంచి అభిరుచి ఉన్నవారు కళాకారులుగా ఎదిగారు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్న కవి వాక్కును నిజం చేస్తూ అక్షరాస్యులైన ఎంతో మంది లక్కబొమ్మల తయారీలో ప్రత్యేక తర్ఫీదు పొందారు. దీనికి వారి సృజనాత్మకత తోడవ్వటంతో అపురూపమైన కళాఖండాలెన్నింటినో వీరు సృజిస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచే ఇదే వృత్తిపై ఆధారపడిన శ్రీశైలపు చిన్నయాచారికి పదేళ్ల కిందట తొలిసారిగా జాతీయ అవార్డు లభించింది. హస్తకళా నైపుణ్యంలో రాటుతేలిన చిన్నయాచారి చేతిలో ఆవిస్కృతమైన ఒక బొమ్మకు అప్పటి రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది. సాధారణ కోడిగుడ్డు సైజులో, ఒక కోడిగుడ్డులో 32 గుడ్లు ఇమిడి ఉండేలా చిన్నయాచారి తయారు చేసిన బొమ్మలకు తొలిసారిగా జాతీయ గుర్తింపు లభించింది. ఆయన తరువాత పెదపాటి శరత్ కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్లలో కూడా ఏటికొప్పాక హస్తకళాకారులు చోటు సంపాదించుకున్నారు. -
బొమ్మలు మాట్లాడతాయ్...
వెంట్రిలాక్విజమ్లో దిట్ట పరమేశ్వర్ హైదరాబాద్: జీవంలేని బొమ్మలు మాట్లాడుతాయ్.. ప్రముఖులను అనుకరిస్తాయ్.. ప్రేక్షకులను మైమరపిస్తాయి..ఇదో అద్భుత కళ.. దానిని ఔపోసాన పట్టాడు.. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు.. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు పరమేశ్వర్. వెంట్రిలాక్విజమ్(బొమ్మలతో మాట్లాడించే కళ) పరమేశ్వర్గా పేరొందాడు. నగరానికి చెందిన పరమేశ్వర్ తొలుత మిమిక్రీ నేర్చుకున్నాడు. తర్వాత వెంట్రిలాక్విజమ్ను నేర్చుకున్నాడు. బొమ్మలతో మాట్లాడించడం అంత సులభమేమీ కాదు.. ప్రేక్షకులను మెప్పించడం కూడా ఎంతో కష్టం.. కళ్లకు కనిపించకుండా మాట్లాడుతూ హావ భావాలను పలికించాలి..దీనిలో ఆరితేరాడు. వృత్తిగా ఎంచుకున్నాడు. అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్నాడు. ఎంతో మంది కళాకారులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నారు. నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అంతర్జాతీయ స్థాయి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బొమ్మతో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రయివేటు కార్యక్రమమైనా పరమేశ్వర్ ప్రదర్శన ఉండాల్సిందే. పరమేశ్వర్ మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్లో ఎన్నో మైలురాళ్లు దాటాడు. ధ్వని అనుకరణ కళా ప్రపూర్ణ, మిమిక్రీ వెంట్రిలాక్విజమ్ యువ సమ్రాట్ వంటి అవార్డులు అందుకున్నాడు. 1991లో నంది అవార్డుల ప్రదానోత్స వంలో ప్రదర్శన ఇచ్చారు. అనేక సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశాడు. 1996లో తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ మహా సభలు, 2013 తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహా సభల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందాడు. జీవితంలో మిమిక్రీ కళను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పి తద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేయడమే తన ముందున్న లక్ష్యమని పరమేశ్వర్ అన్నాడు. -
ఆ ప్రయాణంలో నాతో నేను మాట్లాడుకున్నాను
లైఫ్ బుక్ మా నాన్నగారు బొమ్మలు గీస్తారు. కవితలు రాస్తారు. వంట బాగా చేస్తారు. తోటపని చేస్తారు...ఈ అన్నిట్లోకి నాకు నచ్చిన విషయం ఆయనలోని సున్నితత్వం. సున్నితంగా ఉన్న వాళ్ల దగ్గరికి బొమ్మలైనా, కవిత్వమైనా ఆప్యాయంగా వస్తాయి! వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్లు ఉండే బారీపడ(ఒడిషా) అనే ఒక మోస్తరు పట్నానికి వెళ్లేవాళ్లం. ఎన్ని నగరాలకు వెళ్లినా... బారీపడ జ్ఞాపకాలు మాత్రం ప్రత్యేకమైనవి. రైలు నుంచి బస్సు, బస్సు నుంచి రిక్షా... ఇలా దీర్ఘ ప్రయాణం చేసిన తరువాతగానీ ఆ పట్నానికి చేరడానికి వీలయ్యేది కాదు. ఇప్పుడు మాత్రం విమానం ఎక్కి ఆ తరువాత కారు ఎక్కితే చాలు అది వస్తుంది. కానీ దీర్ఘమైన ప్రయాణమే నాకు నచ్చుతుంది. ఆ ఊళ్లో ఆలయ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. అవి పేరుకు మత సంబంధమైన ఉత్సవాలుగా అనిపించినా నిజానికవి... సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు. ఆలయ ఉత్సవాల సందర్భంగా ఊరంతా కొత్త కళతో శోభించేది. నేను బాగా ఆలోచించిగానీ నిర్ణయం తీసుకోలేను. ఈ క్రమంలో నెల కావచ్చు...ఆర్నెల్లు కావచ్చు...సంవత్సరం కూడా కావచ్చు. ఉదా: భౌగోళికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత...దేనిలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ చేయాలో అర్థం కాలేదు. ‘‘ఓ ఏడాది విరామం తీసుకోవాలనుకుంటున్నాను’’ అని నాన్నతో చెప్పి చాలా ప్రాంతాలు ప్రయాణించాను. నాతో నేను మాట్లాడుకున్నాను. నా ఇష్టాన్ని వెతుకున్నాను. ప్రయాణం తరువాత ఒక పాఠశాలలో పిల్లలకు పాఠాలు బోధించాను. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు తిరిగినా పుట్టి పెరిగిన ప్రాంతం అంటేనే ఎవరికైనా ఇష్టం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే...తల్లి నుంచి దూరమైనట్లు అనిపిస్తుంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన నాకు ఆ నగరాన్ని వదలాలంటే ఇబ్బం దిగా ఉంటుంది. ఢిల్లీకీ నాకూ మధ్య బలమైన ఆకర్షణ ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. - నందితా దాస్, ప్రముఖ నటి -
బొమ్మలు తెచ్చి... బాలలకిచ్చి...
శ్వేతాచారి... ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు పిల్లలంతా బొమ్మలతో ఆడుకోవాలనే లక్ష్యంతో... తన ఇరవై రెండోఏట ‘టాయ్బ్యాంక్’ పేరిట ఓ ఎన్జివోను స్థాపించారు. ఇవ్వగలిగే స్థితిలో ఉన్నవారి దగ్గర నుంచి బొమ్మలు సేకరించి, కొనలేని స్థితిలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఆ రకంగా ధనిక పేద అనే విభజన రేఖను పిల్లల మధ్య చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ‘‘స్నేహితులమంతా కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో... మన దేశంలోని పిల్లలంతా బొమ్మలతో ఆడుకోగలుగుతున్నారా? అని చర్చించుకున్నాం. మాకు తెలిసినంత వరకు చాలామంది పిల్లలకు బొమ్మలు అందుబాటులో లేవు. వారంతా బొమ్మలతో ఆడుతుంటే, చూసి ఆనందించాలనుకున్నాం. ఈ ఆలోచనకు కార్యరూపం సరిగ్గా పదేళ్ళ క్రితం ఆగస్టు 15న ఆచరణలోకి వచ్చింది’’ అంటారు శ్వేతాచారి. అందుకోసం ‘టాయ్ బ్యాంక్’ అనే లాభాపేక్ష రహిత సంస్థను స్థాపించి, చిన్నారులకు ఆట బొమ్మలు అందచేసి, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండే ప్రపంచాన్ని తయారుచేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు శ్వేతాచారి. సంస్థను ప్రారంభించిన కొత్తలో ఇలా సేకరించిన బొమ్మలను కేవలం ముంబై చుట్టుపక్కల ప్రాంతాలలోని బాలలకు మాత్రమే అందచేశారు. ఇప్పుడు ఈ టాయ్బ్యాంక్ బెంగళూరు, పుణే, ఢిల్లీ ప్రాంతాలకు విస్తరించింది. ఇలా అందచేస్తారు... ధనికుల ఇళ్ళ నుంచి ఈ సంస్థ ద్వారా సేకరించిన బొమ్మలను ఏ వయసుకు తగ్గ పిల్లలకు ఇవ్వాలో చూసి, అలా వర్గీకరిస్తారు. ఆ పైన అందమైన గిఫ్ట్ ప్యాకింగ్ చేసి చిన్నారులకు అందచేస్తారు. ఇలా బొమ్మలు అందచేశాక, ఆ పిల్లల ప్రవర్తన, ఆలోచన ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ బొమ్మలతో ఆడుకున్న తర్వాత పిల్లల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఆ సంగతి మేము గమనించాం’’ అంటారు శ్వేతాచారి. వారి చిరునవ్వే లక్ష్యం శ్వేతాచారి చేస్తున్న మంచిపనికి చాలామంది సహకరించారు. కొందరు బొమ్మలు అందచేస్తే, కొందరు ఆ బొమ్మలతో ఆడుకోవడానికి కావలసిన స్థలం కేటాయించారు. ‘‘మేం చేస్తున్న పనికి ఊహించనంత ఆదరణ లభించింది. ఈ బొమ్మలతో ఆడుకోవడానికి ఇక్కడకు వచ్చే పిల్లలకు... ‘ఇతరులతో పంచుకోవడం’ అనే విషయాన్ని నేర్పిస్తాం. ఇక్కడకు వచ్చి ఆడుకునే పిల్లల ముఖాలలో చిరునవ్వు చూడాలన్నదే మా ఆశ’’ అంటారు శ్వేతాచారి. ప్రచారం లేని... మంచి పని ఎటువంటి ప్రచారం, ప్రకటనలు లేకుండా టాయ్బ్యాంక్ తన సేవలను అందిస్తూనే ఉంది. పిల్లలకు విజ్ఞానాన్ని కలిగించే బొమ్మలను ఎంచుకుంటారు. బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు ఎంత అవసరమో చెబుతూ, ‘‘వీధిబాలలు రాళ్లతో, విరిగిన బొమ్మలతో, సైకిల్ టైర్లతో ఆడుతూ కనపడతారు. అటువంటివారికి మా సంస్థ ఆట బొమ్మలు అందచేస్తుంది. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పేలా బొమ్మలను అందచేస్తున్నాం. పిల్లలకు బొమ్మలు ఇవ్వకపోతే, పెద్దయ్యాక వారిలో హింసా ప్రవృత్తి చోటుచేసుకుంటుంది’’ అంటారు శ్వేతాచారి. దేశవ్యాప్తంగా తొమ్మిది వేల బొమ్మలను సేకరించి, నిరుపేద చిన్నారులకు పంపిణీ చేసిన శ్వేతాచారి ఒక ఉత్పాదక కేంద్రం ప్రారంభించి, దాని మీద వచ్చే లాభాలతో బొమ్మలు కొనుగోలు చేసి టాయ్బ్యాంక్ కార్యకలాపాలు నడపాలనుకుంటున్నారు. ప్రపంచంలోని బాలలంతా ఎక్కువ తక్కువలనే తేడా లేకుండా బాగా చదువుకుని, బొమ్మలతో ఆడుకొనేలా చేస్తే మా లక్ష్యం నెరవేరినట్లే’’ అంటారు శ్వేత. ఇలాంటి బొమ్మలు తీసుకోరు! హింసను ప్రేరేపించే తుపాకులు, కత్తులు పాడైపోయి, విరిగిపోయినవి బార్బీ బొమ్మలు (ఈ సంస్థ వివక్షను ఇష్టపడదు) ఆటబొమ్మలతో ఆశయాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలలంతా బొమ్మలతో ఆడుకోవడం ఆర్థిక అసమానతలకు దూరంగా బాలలంతా సృజనాత్మకతతో ఆడుకుంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొనడం బాలల పార్లమెంట్, ప్లేగ్రూప్స్, బొమ్మల పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు విద్య, విజ్ఞానం కలిగించడం బొమ్మల గ్రంథాలయాలు ఏర్పాటుచేసి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన స్థలం ఉండేలా చేయడం -
అమ్మతోడు... నిజంగా బొమ్మలే!
‘అచ్చు బొమ్మలా ఉంది!’ ‘బొమ్మలా ఉంది కాదు బొమ్మే’ ‘నిలువెత్తు మనిషిని పట్టుకొని బొమ్మ అంటావేమిటి?’ ‘అది ఆయన మహిమ!’ ‘ఎవరాయన?’ ఆయన గురించి.... ఆయన పేరు...రాన్ మ్యూక్. లండన్లో ప్రసిద్ధ ఆర్టిస్ట్. 1996 నుంచి రకరకాల శిల్పాలను రూపొందిస్తున్నాడు. 30వ ఏట జీవిక కోసం రకరకాల బొమ్మలు తయారుచేస్తూ ఉండేవాడు. మీడియాలో పెద్దగా కనిపించని, వినిపించని రాన్ తన పనేదో తాను నిశ్శబ్దంగా చేసుకుపోతాడు. దైనందిన జీవితంలో మనకు కనిపించే దృశ్యాలను ఆయన శిల్పాలుగా రూపుదిద్దుతాడు. దీనిలో భాగంగా కొన్ని శిల్పాలైతే మామూలుకంటే ఎక్కువ సైజ్లో ఉంటాయి. చిన్న సైజులో రూపొందించినా, పెద్ద సైజులో రూపొందించినా సైజుతో సంబంధం లేకుండా ప్రతి కోణంలో వాస్తవికత దర్శనమిస్తుంది. రాన్లోని ప్రతిభపాటవాలు, సాంకేతికపరిజ్ఞానం సినిమాలలో స్పెషల్ ఎఫెక్ట్స్కు ఉపయోగపడుతున్నాయి. ‘‘మీ సబ్జెక్ట్ ఏమిటి?’’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చే సమాధానం... ‘‘సాధారణ ప్రజలు’’ సాధారణ ప్రజల జీవితంలోని అసాధారణ సౌందర్యాన్ని నిశ్శబ్దంగా రూపుదిద్దిస్తున్నాడు రాన్. శిల్పాలకు పెట్టే పేర్లు కూడా చాలా సాధారణంగా ఉంటాయి. 1997లో రాయల్ అకాడమీలో తన తండ్రి బొమ్మను ప్రదర్శనకు పెట్టి సంచలనం సృష్టించాడు రాన్. ‘అప్పుడే పుట్టిన పాప’ బొమ్మ ‘మోస్ట్ షాకింగ్ క్రియేషన్’గా పేరు తెచ్చుకుంది. ‘‘అవి ఫైబర్గ్లాస్ కళారూపాలు కావు... నిజంగా మనుషులే అని ఎవరైనా అనుకుంటే అంతకు మించిన అవార్డ్ ఏమిటి?’’ అంటున్నాడు. తన కళారూపాలను కేవలం బొమ్మలుగానే చూస్తే తాను విఫలమైనట్లేనని చెబుతున్న రాన్, అవి అనుభూతులు పంచే వేదికలు కావాలని ఆశిస్తున్నాడు. బొమ్మలు తయారుకావాలంటే బంకమన్ను, ప్లాస్టర్, మిక్స్చర్ ఆఫ్ ఫైబర్గ్లాస్, సిలికాన్, రెజిన్... మొదలైనవి ఆయన చేతిలో ఉండాల్సిందే. అయితే వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తలలో బ్రహ్మాండమైన సృజన ఉంది. అది అద్భుతాలు సృష్టిస్తూనే ఉంటుంది.