-
గండికోట పిలుస్తోంది..
సాక్షి ప్రతినిధి, కడప: గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది. భారీగా నిధులు వెచ్చించి సొబగులు అద్దనుంది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తర్వాత సుందరమైన ప్రాంతంగా దీనికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వైఎస్సార్ పర్యాటక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్లోని వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ తరహాలో గండికోటలో కూడా రూపుదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు వ్యయమవుందని అంచనా. దీంతోపాటు రూ.7.50 కోట్లతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న రోప్వే నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనుంది. అత్యాధునిక వసతులతో రిసార్ట్ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలతో హోటల్ నిర్మాణంతోపాటు ప్రకృతి వైద్యశాల, స్విమ్మింగ్ఫూల్ తదితర అన్ని వసతులతో ఈ రిసార్ట్స్ ఏర్పాటు కానుంది. సాహసం శ్వాసగా.. ఇప్పటికే సాహసకృత్యాల అకాడమీ (అడ్వంచర్స్)కి రూ.3 కోట్లతో అన్ని వసతులు సమకూర్చుతున్నారు. ఐదెకరాలలో తరగతులతోపాటు హాస్టల్ వసతి కల్పించనున్నారు. హిమాలయ పర్వతాలలో మాత్రమే ఇలాంటి అకాడమీ ఉంది. అది కూడా అక్కడ పర్వతారోహణపై శిక్షణ మాత్రమే ఇస్తారు. గండికోటలో వాయు, జల, పర్వతారోహణలపై శిక్షణ ఇవ్వనున్నారు. కోటలో ఆర్కియాలజీ విభాగం అనుమతులతో దాల్మియా కంపెనీ దెబ్బతిన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించే పనులను చేపట్టింది. టాయిలెట్ల నిర్మాణంతోపాటు కోట పరిసరాల శుభ్రత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 2 కోట్లతో హరిత హోటల్ నిర్మాణం చేట్టారు. మరో 15 వసతి గృహాలు (టెంట్లు) నిర్మించి ఫ్రీకౌట్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. రూ.50 లక్షల ఖర్చుతో బోటింగ్ సౌకర్యం కలి్పంచారు. పచ్చదనం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కోట ముందు నుంచి టెంట్ల వరకు సిమెంటు రోడ్డు నిర్మించారు. రూ.30 లక్షలతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పడిపోకుండా రూ.5 లక్షలతో కోట వారగా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో జమ్మలమడుగు క్రాస్ నుంచి గండికోట వరకు డబుల్రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పెట్టుబడికి అనుకూలం.. ప్రభుత్వ ప్రోత్సాహం గండికోట పరిధిలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. తగినంతగా నీరుంది. రోడ్డు వసతి ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్పోర్టు ఉంది. సమీపంలోని జమ్మలమడుగులో రైల్వేస్టేషన్ ఉంది. 35 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు పట్టణముంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతం. గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందితే చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుకున్న యువత సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే గండికోటలో వివిధ రకాల అభివృద్ధి పనులలో అవకాశం కల్పించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గండికోటలో పర్యాటకాభివృద్ధి గండికోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అమెరికాలోని గ్రాండ్ కేనియన్ తర్వాత గండికోట పర్యాటక కేంద్రంగా ఉంటోంది. అత్యాధునిక వసతులు కల్పించి జాతీయ స్థాయిలో మరింత పేరు వచ్చేలా తీర్చిదిద్దుతాం. ఆ దిశగా పనులు వేగవంతం చేశాం. ఇప్పటికే గండికోట ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం. –సి.హరి కిరణ్, జిల్లా కలెక్టర్ -
అందాలలో ఆహో మహోదయం..
ప్రకృతి వనరుల సిరిసంపదలు ఓ వైపు.. విశ్వఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరోవైపు.. అంతర్జాతీయ యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక సోయగాలు ఇంకోవైపు... ఇలా.. లెక్కకు మించి ప్రకృతి సంపద సొంతం చేసుకున్న విశాఖ జిల్లా.. పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. గత ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్త టూరిజం పాలసీతో విసిగిపోయిన పెట్టుబడిదారులు.. ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టబోయే కొత్త పాలసీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రోత్సాహకాలు.. రాయితీలతో పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో కొత్త ప్రాజెక్టులు తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం.. ఆర్థిక, పర్యాటక రాజధానిగా భాసిల్లేందుకు అవసరమైన కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న టూరిజం పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. గత ప్రభుత్వం ప్రకటించిన లొసుగుల పాలసీతో పెట్టుబడులు రాక.. పర్యాటకం చతికిలపడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టూరిజంలో పెట్టుబడులు పెరిగేలా పాలసీని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కొత్త విధానానికి సంబంధించి టూరిజం అధికారులు సమావేశమై.. నూతన పాలసీ గురించి వివరించారు. అయితే ఫ్రెండ్లీ పాలసీగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించడంతో పర్యాటక విధానం ప్రకటించేందుకు మరో వారం రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. వికర్ష నుంచి.. ఆకర్షణ వైపు... టీడీపీ సర్కారు ప్రకటించిన టూరిజం పాలసీ.. పారిశ్రామిక వర్గాలను అంతగా ఆకర్షించలేకపోయింది. 9 మేజర్, 42 సబ్మేజర్ థీమ్స్గా మొత్తం 680 ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు రాయితీలతో కూడిన విధానాన్ని ప్రకటించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి 5 నుంచి 15 శాతం రాయితీతో పాటు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీపై వందశాతం పన్ను రాయితీ కల్పిస్తామని పేర్కొంది. ఇవేమీ అమల్లోకి తీసుకురాలేదు. పర్యాటక ప్రాజెక్టుకు 21 రోజుల్లో అనుమతి ఇచ్చేలా సింగిల్ డెస్క్ విధానాన్ని అమల్లో తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనికి మూడు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తీసుకొచ్చి కేవలం రెండు వారాల్లో అనుమతులిస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యలేదు. అదే విధంగా ఏదైనా సంస్థకు అందించే స్థలం విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె చెల్లించాలనీ, ఆ తర్వాత ఏటా 5 శాతం చొప్పున చెల్లించాలంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధన విధించింది. లీజు ముగిసే సరికి ఈ అద్దె భారీ స్థాయికి చేరుకుంటుందని పారిశ్రామికవేత్తలు పెదవి విరిచారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ..ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. మరో వారం రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన టూరిజం పాలసీ పర్యాటకులతో పాటు పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండబోతోందని అధికారులు చెబుతున్నారు. హోటల్స్.. రిసార్టులతో... జిల్లా చుట్టూ పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పాలసీ.. టూరిజం పాలసీ దాదాపు సిద్ధమయ్యింది. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు కొత్త పర్యాటక విధానంలో మార్పులు చేస్తున్నాం. విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పర్యాటక శాఖ మంత్రి -
సాక్షి ఎఫెక్ట్: డొంక కదులుతుంది!
నెల్లూరు (టౌన్): ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నెల్లూరు డివిజన్లో అవినీతి, అక్రమాల డొంక కదులుతోంది. నెల్లూరు డివిజన్ కార్యాలయంలో దివ్యాంగురాలైన సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటన తర్వాత ఇక్కడి కార్యకాలపాలపై సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన ఆ శాఖ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. టూరిజం శాఖ నెల్లూరు డివిజన్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై విచారించి వెంటనే నివేదిక సమరి్పంచాలని ఆ శాఖ ఎండీ ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. రెండు రోజుల్లో విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ►ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ ఉషారాణిపై జరిగిన దాడి ఘటనపై ఏపీ టూరిజం శాఖ జీఎం సుదర్శన్ను విచారణాధికారిగా నియమించారు. ఆయన మూడు రోజులుగా నెల్లూరులో ఉండి దాడి ఘటనకు సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. ►దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు జిల్లా దివ్యాంగుల శాఖ ఏడీ నాగరాజకుమారిని నియమించారు. ఈ ఇద్దరి విచారణలతో పాటు అవినీతి అక్రమాలపై మరో కమిటీ ఏర్పాటు కానుండటంతో ఆ శాఖ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమాలెన్నో.. ఏపీ టూరిజం నెల్లూరు డివిజన్ పరిధిలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ►ప్రధానంగా ఆ శాఖకు సంబంధించి హోటళ్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు తదితర వస్తువులు కొనుగోళ్లు, గదుల బుకింగ్లో జరిగిన లొసుగులు, తడ హరిత హోటల్లో జరిగిన విందు తదితర అంశాలపై విచారణ జరగనుంది. ►ఆ శాఖ పరిధిలో జరిగిన కాంట్రాక్ట్ పనులు, వాటిల్లో నాణ్యత తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు. ►ఈ నేపథ్యంలో కొనుగోళ్లన్నీ అకౌంట్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగాయా లేక సొంతంగా జరిగాయా అనే విషయాన్ని నిగ్గు తేల్చనున్నారు. ►బోటింగ్ యూనిట్లు నిర్వహణపైన విచారణ కమిటీ ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ►హోటల్ గదుల బుకింగ్కు సంబంధించి గతంలో పలు అక్రమాలు చోటు చేసుకున్న సందర్భంలో బాధ్యులను బదిలీలతో సరిపెట్టారు. ►ఇప్పుడు వాటి గుట్టును కూడా విచారణ కమిటీ వెలికి తీయనుంది. ►మరొక వైపు నెల్లూరు హరితా హోటల్ ఆవరణలోని డివిజన్ కార్యాలయంలో నెలకొన్న విభేదాలు, వర్గపోరుపైన విచారణ కమిటీ దృష్టి పెట్టనుంది. ►గతంలో ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేయడం, మరో ఉద్యోగి సహచర ఉద్యోగినిపై కుర్చీ విసరడానికి దారి తీసిన పరిస్థితి, కార్యాలయంలో క్రమశిక్షణ పరిస్థితులపై విచారణ కమిటీ ఆరా తీయనుంది. ►విజిలెన్స్, డివిజనల్ మేనేజర్ తదితర ఉన్నతాధికారుల కదలికలను యూనిట్ల మేనేజర్లు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విచారిస్తే గుట్టు మొత్తం బయట పడుతుందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ►ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గతంలో తిరుపతికి బదిలీ చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తన పలుకుబడిని ఉపయోగించుకుని తిరిగి నెల్లూరుకు వచ్చి నెల్లూరు డివిజన్ మొత్తాన్ని శాసిస్తున్నాడు. సాక్షి కథనాలతో కలకలం ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలను సాక్షి వెలుగులోకి తేవడంతో ఆ శాఖలో కలకలం రేగుతోంది. విచారణ జరిగితే ఎవరెవరికి ముప్పు ఉందో అనే అంశంపై ఆ శాఖ ఉద్యోగులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. తడలో హరిత హోటల్లో జరిగిన విందుపై డివిజనల్ మేనేజర్ తూతూ మంత్రంగా విచారణ చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ►అప్పట్లో బాధ్యుడైన అధికారిని సస్పెండ్తో సరిపెట్టగా కేవలం రెండు నెలల్లోనే తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని చిత్తూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంబంధిత తడ హోటల్ మేనేజర్ను సస్పెండ్ చేశారు. ►గతంలో నెల్లూరు డివిజన్ కలిసి ఉన్న తిరుపతి డివిజన్లోని హార్స్లీ హిల్స్లోని హరితా హోటల్లో గదుల బుకింగ్లో జరిగిన మాయాజాలం, కడప, తిరుపతిల్లో ప్రొవిజన్స్ కొనుగోళ్లు జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారించి నివేదిక సమరి్పచినా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ►అయితే ఈ నివేదికలపై కూడా ప్రస్తుత ఎండీ ప్రవీణకుమార్ విచారణకు ఆదేశించనున్నట్లు తెలిసింది. ►విచారణ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఏపీ టూరిజంలో జరుగుతున్న అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
పర్యాటకానికి రాష్ట్రం పర్యాయ పదం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం కావాలని, ఇందుకు అనుగుణంగా వెంటనే కొత్త పర్యాటక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ దిశలో టూరిజమ్ ట్రేడ్ రెగ్యులేషన్ ప్రక్రియ కొనసాగాలని, పర్యాటకానికి సంబంధించిన అన్నింటి రిజిస్ట్రేషన్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన స్థలాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్దేశించారు. విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే సదుపాయాలు కూడా అదే స్థాయిలో ఉండాలన్నారు. మన పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారి ప్రతిపాదనలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శిల్పారామాలను పునఃసమీక్షించాలని, వాటిని అందంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. కొత్త టూరిజమ్ పాలసీ ► ఈ ఏడాది మార్చి 31తో రాష్ట్రంలో పర్యాటక విధానం ముగిసినందున వెంటనే కొత్త విధానాన్ని రూపొందించాలి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ పర్యాయ పదం అనే దిశలో కొత్త విధానం ఉండాలి. రెగ్యులేషన్ ఆఫ్ టూరిజమ్ ట్రేడ్ ► పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నియంత్రణ లేదు. అందువల్ల వెంటనే అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► పర్యాటక రంగంలో ఉన్న టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, వాటిలో అందుబాటులో ఉన్న గదులు, టూరిజమ్ అడ్వెంచర్కు సంబంధించిన ప్రదేశాలు, ఆయా చోట్ల ఉన్న సదుపాయాలు వంటి అన్నింటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలి. శిల్పారామాల అభివృద్ధి ► రాష్ట్రంలో పలు చోట్ల ఉన్న శిల్పారామాలను పునఃసమీక్షించాలి. వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలి. వాటిలో పదే పదే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు. ఆ దిశగా వాటి అభివృద్ధితో పాటు అవసరమైన మార్పులు చేయాలి. ► సమీక్షలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. 7 స్టార్ సదుపాయాలు ఉండాలి ► విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున రావాలంటే అన్ని చోట్ల 7 స్టార్ సదుపాయాలతో కూడిన రిసార్టులు, హోటళ్లు అభివృద్ధి చేయాలి. ► రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను పెద్ద పెద్ద ఆతిథ్య కంపెనీలకు ఇచ్చి, వారి ప్రతిపాదనలను కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే దేన్నైనా ఖరారు చేయాలి. ► పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు వచ్చేలా విధి విధానాలు ఉండాలి. కనీసం 10–12 ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల పూర్తి సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలి. ► రాజస్థాన్కు ఎక్కువ మంది టూరిస్టులు ఎందుకు వెళుతున్నారని పరిశీలిస్తే అక్కడ పెద్ద పెద్ద హోటళ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయి. అందువల్ల అదే స్థాయిలో రాష్ట్రంలో కూడా పర్యాటక ప్రాంతాల్లో మంచి వసతులతో హోటళ్లు ఏర్పాటు కావాలి. ► ప్రస్తుతం ఏయే జిల్లాలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి..5 స్టార్ ఎన్ని? 4 స్టార్.. 3 స్టార్.. 2 స్టార్.. సింగిల్ స్టార్ హోటళ్లు ఎన్నున్నాయో గుర్తించి వాటిని మ్యాపింగ్ చేయాలి. వాటి వివరాలు టూరిస్టులకు అందుబాటులో ఉంచాలి. -
ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్కు 600 మంది..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా వైరస్ కారణంగా మసాజ్లకు పేరొందిన తైపీస్ మసాజ్ పార్లర్ కస్టమర్లు లేక వెలవెలబోతుంది. ఈ పార్లర్ను తైవాన్ సరిహద్దులో నెలకొల్పారు. ఈ పార్లర్కు రోజు 600 మంది కస్టమర్లు వచ్చే వారని.. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు వస్తున్నారని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కస్టమర్లతో ఎంతో సందడిగా తమ పార్లర్ ఉండేదని.. ప్రస్తుతం పార్లర్ లాబీలో ఎవరు లేకపోవడంతో కాలక్షేపం చేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం పర్యాటక రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని.. తమకు కస్టమర్లు లేక తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మసాజ్ పార్లర్ డిప్యూటి జనరల్ మేనేజర్ వాంగ్ జీ క్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధి లభించే రంగానికి తమ ఉద్యోగులు ఎంచుకోవాలని జీ క్వాన్ సూచించారు. ఇటీవల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా తైవాన్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పర్యాటక రంగ నిపుణులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ద్వీపం, వైవిధ్యమైన ఆహార అలవాట్లు, ఆసియాలో ఉదారవాద ప్రజాస్వామ్యం తదితర అంశాలు తైవాన్ పర్యాటక రంగ అభివృద్ధికి కీలక అంశాలని తైవాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తైపీస్ మసాజ్ పార్లర్ 24 గంటల పాటు సేవలందించడం విశేషం. జపాన్, దక్షిణ కొరియా పర్యాటకులు ఎక్కువగా పార్లరును సందర్శిస్తుంటారు. అయితే గత 20ఏళ్లుగా తమకు ఈ రంగంలో అనుభవం ఉందని.. ఇప్పుడు వేరే రంగాన్ని ఎంపిక చేసుకొని ఉపాధి పొందడం అంత సులువు కాదని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రజనీకాంత్పై ట్వీట్, ఫ్యాన్స్ ఆగ్రహం -
టూరిస్ట్ హబ్ కానున్న ప్రకాశం
సాక్షి, ఒంగోలు మెట్రో: ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలున్న జిల్లా పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం అసలు పట్టించుకోని పర్యాటక విభాగాన్ని తొలి ఏడాదిలోనే పట్టించుకుని తొలి విడత మూడు ప్రాంతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. విడతల వారీగా జిల్లాలోని అన్ని చారిత్రక, సాంస్కృతిక విశిష్టతలను గుర్తించి అభివృద్ధి చేసి జిల్లాను టూరిస్ట్ హబ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. మూడు ప్రాంతాల ఎంపిక.. జిల్లాలో తొలి విడతగా 2019–20 వార్షిక సంవత్సరానికి గాను మూడు ప్రాంతాలను పర్యాటక అభివృద్ధి కోసం ఎంపిక చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రాంతం, దాని సమీపంలోని అన్నంగి ప్రాంతంతో పాటు కొత్తపట్నం సముద్రతీరాన్ని కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సర్వే శాఖ అధికారులను సర్వే చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. అయితే, ఈ మూడు ప్రాంతాలనూ ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కన్సల్టెంట్స్తో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద బోటు షికారు ఇప్పటికే ఉన్నప్పటికీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. తద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆ ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. ఇక గుండ్లకమ్మలో బోటు షికారు కోసం బోట్ల సంఖ్య కూడా పెంచనున్నారు. అన్నంగి ప్రాంతంలో 13 ఎకరాలలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ సహకారంతో అభివృద్ధి చేసి అన్నంగి కొండ మీద ఒంగోలు గిత్త పెద్ద ప్రతిమను ఏర్పాటు చేసి ఈ ప్రాంత విశిష్టతను పర్యాటకులకు తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి సర్వే చేసి సూచనలు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపట్నం బీచ్లో వసతులు.. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో కొత్తపట్నం బీచ్ ఒకటి. సందర్శకులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించి తీర ప్రాంతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగేట్టు తీర్చిదిద్దనున్నారు.కలెక్టర్ సూచనలను అనుసరించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలా తొలి విడతగా ఈ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసి సందర్శకుల సంఖ్య పెంచటం లక్ష్యంగా తద్వారా పర్యాటక ప్రాంతంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
జిల్లాలో పర్యాటక వెలుగులు
సాక్షి, కడప : జిల్లా పర్యాటకానికి కొత్త ఊపు రానుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఖ్యాతి గల గండికోటలో రెండు కొండల మధ్య అద్దాల వంతెన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో జిల్లా పర్యాటకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఊహించని రీతిగా సోమశిల ప్రాజెక్టును జల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా జిల్లా పర్యాటక అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇంతకుముందే ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఉండడంతో జిల్లా నలుమూలల ఇక పర్యాటక వెలుగులు కనిపించనున్నాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాష్ట్ర పర్యాటకాభివృద్దిపై తీసుకున్న నిర్ణయాలలో మన జిల్లాకు సంబంధించి పర్యాటకం అభివృద్ది పథంలో పరుగులు తీయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే జిల్లా పర్యాటకాభిమానులు, సంస్థల్లో కొత్త సంతోషం కనిపిస్తోంది. నలు వైపులా.. ఇంతకుముందే ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలు దక్కడంతో తూర్పు పర్యాటక ప్రాంతం ఇప్పుడు ఇడుపులపాయ అభివృద్ధితో దక్షిణ‡ప్రాంత పర్యాటకం, సోమశిలతో ఉత్తర పర్యాటకం, గండికోటతో పడమర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. తిరుపతి నుంచి రైల్వేకోడూరు ఉద్యాన పరిశోధన కేంద్రం, రాజంపేటలో కన్నప్ప ఆలయం, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథ ఆలయం, బౌద్దారామాలు, ఒంటిమిట్ట వరకు తూర్పు పర్యాటక సర్క్యూట్గా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్నాయి. గండికోటలో అద్దాల వంతెన పథకం విజయవంతమైతే పడమర పర్యాటక ప్రాంతాలు కూడా సహజంగా అభివృద్ది చెందగలవు. ఇడుపులపాయతో దక్షిణ పర్యాటక ప్రాంతా లు రాయచోటి, రాక్ గార్డెన్స్, వెలిగల్లు ప్రాజెక్టు, వేంపల్లె గండిక్షేత్రంలకు పర్యాటక కళ రానుంది. సోమశిల అభివృద్ధితో గోపవరం, మొల్లమాంబ జన్మస్థలి, బ్రహ్మంగారిమఠం, బద్వేలు లక్ష్మిపాలెం ఆలయం, వనిపెంట ప్రాంతాలు ఉత్తర విభాగంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న పర్యాటకాభివృద్ది నిర్ణయాలతో జిల్లా నాలుగు వైపుల నాలుగు ప్రత్యేకమైన పర్యాటక సర్క్యూట్లు ఏర్పడినట్లయింది. ఇవి అభివృద్ది చెందడం ప్రారంభమైతే జిల్లా అంతటా పర్యాటకుల సందడి నెలకొంటుంది. దీని ద్వారా జిల్లాకు ఆర్థిక ఆదాయం కూడా లభించనుంది. పెరగనున్న ప్రతిష్ఠ గండికోటకు అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా ఇండియన్ గ్రాండ్ క్యానియన్గా పేరుంది. ఇప్పటికే నాలుగుమార్లు వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో ఈ ప్రదేశానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లుగా వారాంతాలలో హరిత పర్యాటక హోటల్లో గదులు లభించని పరిస్థితి ఉంది. ఇప్పుడు గండికోట పెన్నా ప్రవాహంపై అద్దాల వంతెన ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించగానే జిల్లా పర్యాటక అభిమానులు, అభివృద్ధి సంఘాలు, పర్యాటక అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు జిల్లా పర్యాటకానికి పట్టాభిషేకం చేయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి నిధుల కొరత ఉన్న విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చినా ఈ విషయంగా ముందడుగు వేయాలని ఆయన సూచించడం పర్యాటక రంగ అభివృద్దికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టమవుతోంది. -
‘టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్ని నియమిస్తాం’
సాక్షి, అమరావతి : రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధిచేసి యువతకు ఉపాధి కల్పిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశాడని, బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ.220 కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అతిథిని దేవుడిలా భావించే పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి ఆదాయాన్ని పెంచుతాం. టూరిస్టులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం. టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్, మంచి భాష ఉన్న గైడులను నియమించే యోచనలో ఉన్నాం. ఈ శాఖలో జరిగిన అవినీతిని వెలికితీస్తాం. భూములు తీసుకుని పెట్టుబడులు పెట్టని వాళ్ళ ఒప్పందాలు రద్దు చేస్తాం. నూతన ప్రభుత్వం వచ్చి పది రోజులైనా కాకముందే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి తావులేకుండా పాలన సాగించి చంద్రబాబు అవినీతిని ప్రజల ముందుంచుతాం’ అన్నారు. -
ఉత్తుత్తి వాగ్దానాల బాబు !
సాక్షి,అవనిగడ్డ : సాగర సంగమ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. ‘ఏటిమొగ – ఎదురుమొండి మధ్య కృష్ణా నదిలో రూ.74 కోట్లుతో వారధి నిర్మిస్తాం.. చుక్కల భూములు, కండిషన్ పట్టాల భూముల సమస్య పరిష్కరిస్తాం.. ఇలా దివిసీమ వాసులకు ఇచ్చిన మరెన్నో హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపై రాతలుగా మార్చేశారు. ప్రతి సారీ మాట తప్పి నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎదురుమొండి వారధి ఏమైంది? గత ఏడాది నవంబర్ 21వ తేదీ ఉల్లిపాలెం, చల్ల పల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటిమొగ – ఎదురుమొండి వారధి నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించామని, టెండర్లు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల సమయం ఉన్నా ఈ విషయంలో.. ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం పట్ల దీవుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2008లో రూ.45 కోట్లతో వారధి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నిధుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. ఆయన మరణం అనంతరం వీటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 19వ తేదీ అవనిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వారధి నిర్మిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధి శూన్యం పవిత్ర కృష్ణా నది సముద్రంలో కలిసే సాగర సంగమం ప్రాంతం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందింది. 2017లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా సాగర సంగమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి సాగర సంగమాన్ని ప్రత్యేక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, కూచిపూడి, శ్రీకాకుళం, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, హంసలదీవిలను కలుపుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు. చుక్కలు చూపిస్తున్నారు దివిసీమలోని పలు మండలాల్లో కండిషన్ పట్టా భూములు రైతులకు చుక్కలు చూపిస్తున్నా పాలకులు స్పందించకపోవడంపై దివి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో కండిషన్ పట్టా (సీపీ పట్టా), చుక్కల భూములు 34 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఐదారు తరాల నుంచి రిజిస్ట్రేషన్ అవుతున్న భూములే అయినప్పటికీ కండిషన్ పట్టా లిస్టులో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితిలో పొలాలను అమ్ముకునేందుకు వీలు పడక, అప్పుల పాలవుతున్నారు. రక్షణ కేంద్రం ఏర్పాటయ్యేనా? దివిసీమలోని గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 381.61 ఎకరాలు అటవీ భూములను కేటాయించారు. అప్పటి నుంచి పలు అవరోధాలు వల్ల ప్రాజెక్టు జాప్యం అవుతూ వస్తోంది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ అంటకాగిన నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోగా, టీడీపీ కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాక పలు అనుమతులు రావడం కొసమెరుపు సీఎం దివిసీమకు ఇచ్చిన హామీలు కోడూరు పీహెచ్సీని 24 గంటల వైద్యశాలగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరచిపోయారు. కోడూరు, నాగాయలంక మండలాల్లో లింగన్నకోడు, ఇరాలి, రత్నకోడుపై చెక్డ్యాంలు (రబ్బర్ డ్యాంలు) నిర్మిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీ చేశారు. విజయవాడ – మచిలీపట్నం నాలుగులైన్లకు ఉల్లిపాలెం వారధిని అనుసంధానం చేస్తామన్నారు. ఆ ఊసే మరిచారు. కేరళను తలదన్నే ప్రకృతి సుందర ప్రదేశమున్న దివిసీమను రాజధానిలో గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత పట్టించుకున్న పాపానపోలేదు. రూపాయి బోనస్ ఇవ్వలేదు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఆరు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట నీట మునిగి దెబ్బతింది. మొక్కజొన్న తడిసిందని క్వింటాల్కు రూ.150 తగ్గించి కొన్నారు. దీనివల్ల ఎకరాకు రూ.6 వేలు నష్టపోయాం. క్వింటాల్కు రూ.200 బోనస్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఏడాది అయినా ఇంతవరకూ ఒక్క రైతుకు రూపాయి బోనస్ ఇవ్వలేదు. – గాజుల రాంబాబు, రైతు, బందలాయిచెరువు -
తీరానికి కొత్త హారం
విశాఖ సుందరి మెడలో పచ్చల హారంలా భాసిల్లుతున్న సాగర తీరం కొత్త నగిషీలు అద్దుకోనుంది. ఇప్పటికే దేశ, విదేశాల టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తున్న తీరంలో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు 30 కిలోమీటర్ల తీరం వెంబడి సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందుకు రూ.150 కోట్లు వెచ్చిస్తున్నారు. జీవ వైవిధ్యంతోపాటు పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా పలు ప్రాజెక్టులకు అధికారులు రూపకల్పన చేశారు. 15 రోజుల్లో తుది మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తారు. అనంతరం దానిపై నెల రోజుల పాటు ప్రజాభిప్రాయానికి అవకాశం కల్పిస్తారు. ప్రజల నుంచి అందే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్యాచరణ ప్రారంభిస్తారు. విశాఖ సిటీ : విశాఖ నగరానికి మణిహారమైన సువిశాల సాగర తీరం సరికొత్తగా కనువిందు చేయనుంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకూ బీచ్లో విభిన్నతలు సంతరించుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. జీవీఎంసీ, వుడా సహా పలువురు స్టేక్ హోల్డర్ల నేతృత్వంలో ఏపీడీఆర్పీలో భాగంగా రూ.150 కోట్లతో విశాఖ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. నాలుగు జోన్లుగా జరగనున్న అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై ప్రజల అభిప్రాయాలు సైతం సేకరించిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ విశాఖ నగరికి పర్యాటక మణిహారం సుందర సాగర తీరం. ఇప్పటికే అనేక సందర్శన స్థలాలు, అంతర్జాతీయ స్థాయి సబ్మెరైన్, యుద్ధ విమాన మ్యూజియాలతో భాసిల్లుతున్న బీచ్కు సరికొత్త అందాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు(ఏపీడీపీఆర్)లో భాగంగా బీచ్ను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ, వుడా సిద్ధమయ్యాయి. హుద్హుద్ సమయంలో విశాఖ సముద్ర తీరం అతలాకుతలమైంది. అప్పటి వరకూ చేసిన అభివృద్ధి పనులు చిన్నాభిన్నమైపోయాయి. ఈ నేపథ్యంలో బీచ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీడీఆర్పీ ఈ ప్రాజెక్టు అమలుకు సిద్ధమైంది. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ మొత్తం 30 చదరపు కిలోమీటర్ల వరకూ రూ.150 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం డీపీఆర్లు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా రెండు సంస్థలు ముందుకొచ్చాయి. గతంలో తీర ప్రాంత అభివృద్ధిలో అనుభవం ఉన్న ఐఎన్ఐ డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్కు పూర్తిస్థాయి సమగ్ర నివేదిక తయారు చేసే బాధ్యతని అక్టోబర్ 25న అప్పగించారు. 11.72 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నివేదికను ఐఎన్ఐ ప్రతినిధులు పూర్తి చేశారు. మరో 15 రోజుల్లో దీన్ని ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్ల నాలుగో సమావేశం ఇటీవలే జీవీఎంసీలో జరిగింది. 10 రోజుల్లో చివరి సమావేశం నిర్వహించి బృహత్ ప్రణాళికకు ఓకే చెప్పనున్నారు. అన్ని వర్గాలనూ అలరించేలా.. ఈ ప్రాజెక్టులో భాగంగా సువిశాల తీర ప్రాంతాన్ని విభిన్న రకాలుగా అభివృద్ధి చేయనున్నారు. సహజసిద్ధంగానూ అదే సమయంలో నగర జీవనానికి దగ్గరగానూ ఉండేలా రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా జీవవైవిధ్యాన్ని పరిరక్షించేలా, అన్ని వర్గాల ప్రజలనూ అలరించేలా బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలని ఏపీడీఆర్పీ నిర్ణయించింది. సహజ పర్యావరణానికి, సముద్ర జీవావరణానికి హాని జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో సంప్రదాయ మత్స్యకారుల జీవనానికి వి«ఘాతం కలగకుండా చూడాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టుని 2 విభాగాలుగా విభజించారు. మాస్టర్ ప్లాన్ సిద్ధమయ్యాక ప్రజలకు అందుబాటులో ఉంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. అనంతరం 104 వారాల్లో కనస్ట్రక్షన్ మేనేజ్మెంట్ బాధ్యతలను పూర్తి చేయాలని జీవీఎంసీ, వుడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించాయి. మాస్టర్ ప్లాన్ వివరాలివీ.. ఆర్కే బీచ్లో సౌకర్యాలు మరింత మెరుగు పడనున్నాయి. ప్రత్యేక వాకింగ్ ట్రాక్లతో పాటు మరిన్ని విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. వుడా పార్క్కు బీచ్ను అనుసంధానం చేసేలా ఏర్పాట్లు. బీచ్కు వచ్చే పర్యాటకులతో జాలరిపేట స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ సుమారు 10 కి.మీ మేర ప్రత్యేక వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటు. లాసన్స్ బే పార్క్, లుంబినీ పార్క్, తెన్నేటి పార్కులతో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ల అనుసంధానం. జోడుగుళ్లపాలెం బీచ్కు, కైలాసగిరి మార్గానికి అనుసంధానం చేస్తూ తెన్నేటిపార్కుని అభివృద్ధి చేయనున్నారు. సాగర్నగర్ బీచ్ను అభివృద్ధి చేసి మెరైన్ లైఫ్ పార్క్, ఎండాడ బీచ్తో అనుసంధానించనున్నారు. సమగ్ర సౌకర్యాలతో రుషికొండ, మంగమూరిపేట బీచ్లను అభివృద్ధి చేయనున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు పర్యాటక తాకిడి పెరిగేలా వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి. భీమిలి బీచ్ పునరుద్ధరించి మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. నాలుగు జోన్లుగా అభివృద్ధి బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ దాదాపు 30 చదరపు కిలోమీటర్ల వరకూ జరగనుంది. ఈ ప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నాలుగు జోన్లలో ప్రస్తుతం ఏ విధమైన అభివృద్ధి జరుగుతోంది... ఆ ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపడితే బాగుంటుందనే అంశంపై సర్వే నిర్వహించి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు. ముఖ్యంగా స్థానికతకు ప్రాధాన్యమిస్తూ వృక్ష సంపద, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్కుల్లో కొత్తదనం నింపాలని భావిస్తున్నారు. స్థానిక అంశాలను క్రోడీకరించుకొని చేయబోయే అభివృద్ధి కోసం తీరప్రాంతాన్ని నాలుగు జోన్లుగా విభజించారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి కురుపాం సర్కిల్ వరకూ, కురుపాం సర్కిల్ నుంచి రుషికొండ వరకూ, రుషికొండ నుంచి భీమునిపట్నం మీదుగా కాపులుప్పాడ– రుషికొండ జంక్షన్ వరకూ, భీమునిపట్నం నుంచి కాపులుప్పాడ–రుషికొండ జంక్షన్–భీమిలి బీచ్ వరకూ జోన్ల వారీగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
సరిహద్దుల్లో స్నేహగీతం..
వుహాన్: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసేందుకు ఇరు దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు నిర్ణయించారు. భవిష్యత్తులో డోక్లాం తరహా సంఘటనలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోదీ, జిన్పింగ్ల మధ్య వుహాన్లో జరుగుతున్న అనధికారిక సదస్సు చివరిరోజైన శనివారం సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్–చైనా సరిహద్దులకు సంబంధించిన అన్ని అంశాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. జిన్పింగ్తో చర్చల సందర్భంగా విభిన్న రంగాల్లో భారత్–చైనా సహకారంపై దృష్టిసారించామని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చే మార్గాలు, ప్రజల మధ్య సంబంధాల్ని పెంపొందించే అంశాలపై మేం చర్చించాం. వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాలపైనా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. భారత్, చైనాల మధ్య దృఢమైన స్నేహం రెండు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే లాభదాయకం’ అని ట్వీట్ చేశారు. మోదీ, జిన్పింగ్లు చర్చలు, ఇతర కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 గంటల పాటు కలిసి గడిపారని చైనా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. కాగా రెండ్రోజుల చైనా పర్యటన ముగించుకున్న మోదీ భారత్కు చేరుకున్నారు. గతేడాది 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం వివాదంతో దెబ్బతిన్న సంబంధాల్ని పునఃనిర్మించే దిశగా శనివారం మోదీ, జిన్పింగ్ చర్చలు కొనసాగాయి. ఇరువురి మధ్య అనధికారిక సమావేశం వివరాల్ని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడిస్తూ..‘సరిహద్దు అంశాల పరిష్కారంలో నమ్మకం, పరస్పర అవగాహన నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు సమాచార మార్పిడిని బలోపేతం చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే ఇరు వైపులా ఆమోదించిన నిర్ణయాల్ని నిజాయతీతో అమలు చేయాలని వారి సైన్యాలను రెండు దేశాల అధినేతలు నిర్దేశించారు’ అని చెప్పారు. సరిహద్దు అంశంలో సముచితం, అంగీకారయోగ్యం, పరస్పర ఆమోదనీయమైన ఒప్పందం కోసం పత్యేక ప్రతినిధుల ప్రయత్నాల్ని మోదీ, జిన్పింగ్లు ఆమోదించారని గోఖలే తెలిపారు. ఉగ్రవాద నిరోధంలో సహకరించుకుందాం.. ‘శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలకు తగిన పరిణతి, అవగాహన ఉందనే అభిప్రాయంతో ఇరువురు నేతలు ఏకీభవించారు. ఆందోళనలు, ఆకాంక్షలు, సున్నితమైన అంశాల్లో ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విషయాన్ని మోదీ, జిన్పింగ్లు గుర్తు చేసుకున్నారు. భారత్, చైనాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తులు ఇమిడి ఉన్నాయని, ఆ అంశాలపై విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మక చర్యల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని వారిద్దరు అంగీకరించారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే క్రమంలో ఆ సంప్రదింపులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ, జిన్పింగ్లు విశ్వసించారు’ అని గోఖలే తెలిపారు. ఉగ్రవాదంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ఇద్దరు నేతలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిష్పాక్షికంగా సాగాల్సిన అవసరంతో పాటు దానిని కొనసాగించాలని ఇరు నేతలు నొక్కిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంతో సాగాలని మోదీ అభిలషించారు. చైనాకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులకున్న అవకాశాల్ని ప్రధాని ప్రస్తావించారు’ అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చగల శక్తులుగా.. భారత్, చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగాల్సిన అవసరముందని, పరస్పర విశ్వాసం ఆధారంగా అభివృద్ధి కొనసాగాలని జిన్పింగ్ ఆకాక్షించారు. భేటీ వివరాల్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థజిన్హుహ వెల్లడిస్తూ ‘చైనా భారత్లు మంచి పొరుగు దేశాలే కాకుండా మిత్ర దేశాలు కూడా.. ప్రపంచాన్ని మార్చగల కీలక శక్తులుగా ఒకరినొకరు పరిగణించుకోవాలి. సానుకూల, న్యాయబద్ధమైన, కలుపుగోలు ప్రవర్తనను తప్పకుండా అలవరచుకోవాలి.అదే సమయంలో పరస్పర ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. భారత్, చైనాలు సన్నిహిత వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరముంది’ అని మోదీతో చైనా అధ్యక్షుడు తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరుదేశాలు మరింత పరిణతితో విభేదాల్ని పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సమన్వయం, సహకారం బలోపేతం చేసుకోవాలని.. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ కోసం కృషిచేయాలని జిన్పింగ్ సూచించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఇద్దరు నేతలు వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి, ఆహార భద్రత అంశాలపై కూడా చర్చించారు. చైనాలోని అతిపెద్ద నది యాంగ్జీ, భారత్లో అతిపెద్ద నది గంగా నదుల్ని పరిరక్షణలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య క్రీడల ప్రోత్సాహం, బౌద్ధ మతం కేంద్రంగా పర్యాటక అభివృద్ధిపై కూడా మోదీ, జిన్పింగ్లు చర్చలు జరిపారు. మోదీ, జిన్పింగ్ బోటు షికారు వుహాన్లోని సుందరమైన ఈస్ట్ లేక్ తీరం వెంట మోదీ, జిన్పింగ్లు శనివారం విహరించారు. తర్వాత బోటు షికారు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ‘ఈస్ట్ లేక్లో బోటు షికారు గుర్తుండిపోయేలా సాగింది’ అని మోదీ ట్వీట్ చేశారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, జిన్పింగ్లు ఒకే బోటులో షికారు చేశారు అని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. దంగల్ బాగా నచ్చింది: జిన్పింగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా బాగా నచ్చిందట.. గతేడాది చైనాలో దాదాపు 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమాను చూసినట్లు మోదీతో జిన్పింగ్ చెప్పారు. గతంలో ఎన్నో భారతీయ సినిమాలు చూశానని, వాటిలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు ఉన్నాయని చైనా అధ్యక్షుడు చెప్పడం విశేషం. ‘మరిన్ని భారతీయ సినిమాలు చైనాలో, చైనా సినిమాలు భారత్లో ప్రదర్శిస్తే బాగుంటుందని జిన్పింగ్ ఆకాంక్షించారు’ అని విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. శుక్రవారం తొలిరోజు భేటీ అనంతరం 1982ల నాటి బాలీవుడ్ సినిమా ‘యే వదా రహా’లోని ‘తు హై వహీ దిల్ నే జిసే అప్నా కహా..’ పాటను చైనా వాద్యకారులు వినిపించారు. వుహాన్లోని ఈస్ట్లేక్ వద్ద సంభాషించుకుంటున్న మోదీ, జిన్పింగ్ ఈస్ట్లేక్లోని బోటులో మోదీ, జిన్పింగ్ -
ఇక ఫెస్టివల్స్ నిర్వహణ పర్యాటకశాఖకే
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ ఫెస్టివల్స్ను వచ్చే ఏడాది నుంచి పర్యాటకశాఖే నిర్వహిస్తుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదాయం వచ్చే ఈవెంట్లు, పండగలను నిర్వహించడం ఎలా? అన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న యాటింగ్ ఫెస్టివల్ వివరాలను తెలిపేందుకు సోమవారం రాత్రి ఫిషింగ్ హార్బర్ జెట్టీ వద్ద ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 ఈవెంట్లకు గాను 18 మాత్రమే నిర్వహించామన్నారు. వచ్చే సంవత్సరం ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కేలండర్ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందన్నారు. విశాఖలో ఉన్న అందమైన పర్యాటక వనరులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేందుకు యాటింగ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్కు వచ్చే ఆదరణను బట్టి భవిష్యత్లో ఇలాంటివి నిర్వహించాలా? వద్దా? అన్నది అధ్యయనానికి వీలుంటుందన్నారు. గోవాలో యాటింగ్ ద్వారా గంటకు రూ.90 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని, విశాఖలోనూ అలాంటి ఆదరణ ఉంటుందో, లేదో చూస్తామన్నారు. ఫెస్టివల్లో పాల్గొనున్న 9 బోట్లు యాటింగ్ ఫెస్టివల్లో 9 బోట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఫెస్టివల్ పూర్తయ్యాక వీటిలో రెండు బోట్లను కొన్నాళ్లపాటు ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ ఉంచుతామని తెలిపారు. అనుమతి కోసం విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో చర్చిస్తామన్నారు. యాటింగ్లో పాల్గొనే బోట్లకు రక్షణగా గజ ఈతగాళ్లున్న స్థానిక మత్స్యకారుల బోట్లు ఉంటాయని, అత్యవసర సాయం అందించడానికి నేవీ అంగీకరించిందని చెప్పారు. ఇప్పటివరకు 14 మంది రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు 14 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. యాటింగ్ క్రీడ ఖరీదు కూడుకున్నది కావడంతో ఉన్నత వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే టిక్కెట్టు ఖరీదు రూ.14,500గా నిర్ణయించామన్నారు. అన్ని పర్యాటక ఈవెంట్లను ఈ–ఫ్యాక్టర్ సంస్థకే ఎందుకు కట్టబెడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ టూరిజం ఎంప్యానల్ అయినందును ఈ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. ఈ యాటింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన సొమ్మును మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఈ–ఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి సుమీత్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సృజన మాట్లాడుతూ యాచింగ్ ఫెస్టివల్లో వివిధ అడ్వెంచర్ ఈవెంట్లతో పాటు ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా తీస్తామన్నారు. విజేతలకు ఒకరోజు యాచ్ల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ ఈడీ డి.శ్రీనివాసన్, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, ఈఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధి ముఖర్జీ పాల్గొన్నారు. -
పర్యటకశాఖాధికారులపై కలెక్టర్ ఫైర్
కాకినాడ రూరల్: కాకినాడ వాకలపూడి బీచ్లో స్వదేశ్దర్శన్ పథకం కింద రూ. 45 కోట్లతో చేపడుతున్న పనుల్లో నాణ్యతాలోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తోందని, పనులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవంటూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, పర్యాటకశాఖాధికారులతో కలసి శనివారం ఆయన బీచ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫౌంటెన్, ల్యాండ్ స్కేపింగ్, షాపింగ్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాలు, లేజర్షో, ఏసీ థియేటర్ పనులను ఆయన పరిశీలించారు. ల్యాండ్ స్కేపింగ్ పనులు మందకొడిగా జరుగుతుండడం, ఆ పనులు కూడా సక్రమంగా లేకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 10 నాటికి అన్ని పనులు పూర్తికావాలన్నారు. బీచ్లో షాపింగ్ కాంప్లెక్స్లో ఏఏ షాపులు ఏర్పాటు చేస్తున్నారని పర్యాటకశాఖ ఆర్డీ జి. భీమశంకరాన్ని ప్రశ్నించగా ఆయన సరిగా బదులివ్వలేదు. అక్వేరియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడంతో అతనిని పిలిపించండని ఆదేశించారు. దాంతో వచ్చిన వ్యక్తిని అక్వేరియం ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడగగా తనకు ఏమీ తెలియదని, భీమశంకరం రమ్మంటే వచ్చానని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భీమశంకరాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ లైటింగ్కు ఏర్పాటు చేసిన స్తంభాలు తుప్పపట్టి ఉండడంతో విద్యుత్శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్లో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 19, 20, 21 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ప్రారంభం రోజునముఖ్య మంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. సామర్లకోట, కాకినాడ నగరం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేయాలన్నారు. ప్రముఖులు నేరుగా సభాస్థలికి రావడానికి వీలుగా ప్రత్యేక మార్గం కేటాయించాలన్నారు. బీచ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున నోడల్ అధికారిగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 21న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరవుతారని ఆయన సమక్షంలో జరిగే రాక్ డ్రమ్స్ ప్రదర్శన ఎంపిక జాతీయ స్థాయిలో జరుగుతుందన్నారు. అనంతరం వాకలపూడి బీచ్ మార్గాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. జేసీ మల్లికార్జున, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, సమాచారశాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, పర్యాటకశాఖ ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం - ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు - పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం సాక్షి, హైదరాబాద్: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్ అండ్ లైట్ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల పేరుతో కాలయాపన పర్యాటకుల టూర్ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్ అండ్ లైట్ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్ విభాగం.. కార్పొరేషన్ వివరణ కోరింది. ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్లోని ప్లాజా హోటల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్సాగర్ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్కు చెందిన ఓ రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు. -
నాలుగు సర్క్యూట్లుగా పర్యాటక అభివృద్ధి
కాకినాడ సిటీ : జిల్లాలో పర్యాటక ప్రాంతాలను నాలుగు సర్కూ్యట్స్గా విభజించి వివిధ పనులు చేపట్టనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పర్యాటక, అటవీశాఖ అధికారులతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్కూ్యట్స్లో భాగంగా కోనసీమ బ్రాకిష్ సర్కూ్యట్లో దిండి, బోడసకుర్రు, ఇతర లంకలను కలుపుతూ పర్యాటక ప్యాకేజీని అమలు చేస్తారని, దీనికోసం అనువైన ప్రాంతాలను గుర్తించాలని తహసీల్దారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రెండవదిగా అఖండ గోదావరి సర్కూ్యట్ను కూడా అభివృద్ధి చేస్తామని, దీనికోసం ముఖ్యమంత్రి రూ.50 కోట్లు మంజూరు చేశారన్నారు. దీనిలో భాగంగా కోటిలింగాల నుంచి పుష్కరఘాట్ వరకు విస్తరణ పనులు చేపడతారని, పిచ్చుకలంక అభివృద్ధితో పాటు, హేవ్లాక్ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారన్నారు. ధవళేశ్వరం నుంచి కడియం వరకూ ప్రత్యేక బోటు ప్రయాణం వంటి ప్రతిపాదనలు ఈ సర్కూ్యట్లో ఉన్నాయన్నారు. మూడో సర్కూ్యట్లో కాకినాడ బీచ్– కోరంగి అభయారణ్యం, వాటర్ సోర్సు వంటి పర్యాటక అభివృద్ధి పనులు ఉన్నాయని, నాలుగవ సర్కూ్యట్లో ఎకో ఎడ్వంచర్ టూరిజంలో భాగంగా మారేడుమిల్లి అటవీ ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించే ప్రాంతాలను రూపొందిస్తున్నారన్నారు. ఏజెన్సీలోని భూపతిపాలెం రిజర్వాయర్లో ఉన్న ద్వీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, పాములేరు వద్ద జలక్రీడలు ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మోతుగూడెం జలపాతాలకు రహదారి నిర్మాణం చేపట్టాలని సూచించారు. మారేడుమిల్లిలోని బేంబో చికెన్ వంటి ఆహార పదార్థాలు విక్రయించేవారికి ఒకేచోట కామన్గా షాపులు ఉండేలా స్థలం కేటాయించాలని, దీని ద్వారా వారికి మార్కెటింగ్ పెరగడంతో పాటు రోడ్లపై రద్దీ తగ్గుతుందన్నారు. రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధిపై రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖల అధికారులతో ఈనెల 21న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రంపచోడవరం సబ్కలెక్టర్కు సూచించారు. కోరంగి అభయారణ్యంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో మెకనైజ్డ్ బోట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యాటక శాఖ ఆర్డీ భీమశంకర్, వైల్డ్లైఫ్ డీఎఫ్వో ప్రభాకరరావు, పర్యాటకశాఖ ఈఈ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక అభివృద్ధి గాలికి!
సాక్షి, హైదరాబాద్: ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి పైసా ఖర్చు చేయని ప్రభుత్వం ఇతర దేశాల్లో రోడ్షోల పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. బుద్ధుడి పేరిట టూరిజం ప్రాముఖ్యతను విదేశాలకు విస్తరించి వారిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ కొత్త విధానాన్ని రూపొందించింది. నెలకు ఒక దేశాన్ని ఎంచుకొని ఆయా దేశాల్లో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి రోడ్షోలు నిర్వహించేలా ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా చైనా, జపాన్ దేశాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలతో కూడిన ఒక ప్రతినిధి బృందం వెళ్తోంది. విదేశీ పర్యాటకులు రాష్ట్రంలో ప్రత్యేకించి చూడదగ్గ ప్రాంతాలు లేకపోయినా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇతర దేశాల్లో రోడ్షోలు నిర్వహిస్తుండాన్ని కొందరు అధికారులే తప్పు పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు ఒక శాతం కూడా వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి నిధుల లేమి.. రాష్ట్రంలో ప్రధానమైన 54 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించి ఇందుకోసం అనేక ప్రోత్సాహకాలతో ప్రణాళికలను రూపొందించిన విషయం తెలిసిందే. వీటిలో తొమ్మిది పర్యాటక ప్రాంతాలను తక్షణం అభివృద్ధి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సాగర తీరాలు, జలాధార, ఎకో, బౌద్ధ, మత, వారసత్వ, వినోదం, సాహస, ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా వాటి కోసం ప్రత్యేకించి నిధులు విడుదల చేయలేదు. పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నా నిధులు లేని కారణంగా అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు టూరిజంపై నిర్వహించిన ప్రతి సమీక్ష సమావేశంలోనూ చెబుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ముఖ్యంగా సాగరతీరంలో ఆహ్లాద థీమ్ పార్క్, వాటర్ వరల్డ్, నౌకాయానం, వినోద పార్కులు, మెరైన్ టూరిజం లాంటి పార్కులు ఎక్కడా లేవు. ఇలాంటి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రచారం కోసం విదేశాల్లో రోడ్షోల నిర్వహణకు, ప్రచారం కోసం హోర్డింగ్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తోంది. మొక్కుబడి కార్యక్రమాలు మినహా పర్యాటక అభివృద్ధి సుస్థిరం కావడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. తీర ప్రాంత పర్యాటకాన్ని వివిధ ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తే లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా పట్టించుకోవడం లేదు. -
చందంపేటలో... రమణీయ సోయగాలు
పచ్చని చీరను పరుచుకున్నట్టున్న కొండలు.. కొండల నడుమ జాలువారే జలపాతాలు.. పురాతన ఆలయాలు.. శివలింగాలను నిత్యం అభిషేకించే జలధారలు.. వేల ఏళ్ల క్రితం నాటి సమాధులు.. నల్లమల అటవీ ప్రాంతంలోని నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో దేవరచర్ల, వైజాగ్ కాలనీ ప్రాంతాల్లోని అందాలివి. ఇంతేకాదు ‘అరకు లోయ’ను తలపించే సోయగాలు.. బొర్రా గుహలను తలపించే గాజుబిడం గుహలు.. వేల ఏళ్లనాటి ఆలయ అద్భుతాలను ఇక్కడ పర్యాటక, పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. చుట్టూ కొండలు.. పచ్చని అందాలు.. జలపాతాలు * బొర్రా గుహలను తలపిస్తున్న గాజుబిడం గుహలు * పురాతన ఆలయాలు.. నల్లమల అడవి సొబగులు * పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు పంపిన అధికారులు దేవరకొండ/చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. వైశాల్యంలో చాలా పెద్దదైన ఈ మండలం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏరాటైన తర్వాత పర్యాటక ప్రదేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కూడా. ఈ నేపథ్యంలో దేవరచర్లలోని ప్రకృతి అద్భుతాలను, అక్కడి రమణీయ దృశ్యాలను, జలపాతాల గురించి ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు దేవరచర్లను సందర్శించారు. అక్కడి అద్భుతాలను తెలంగాణ ‘అరకు’గా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలన్న స్థానికుల డిమాండ్లతో అధికారులు... ఇటీవల ఇక్కడి మరిన్ని ప్రాంతాలను సందర్శించి, ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లుగా వెలుగులోకి రాని ఎన్నో రమణీయ ప్రదేశాలు అక్కడ ఉన్నాయని.. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతం అనువుగా ఉందని వారు పేర్కొన్నారు. కాచరాజుపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మధ్యలోని గుట్టల్లో ఉన్న గాజు బిడం గుహలను పరిశీలించారు. బొర్రా గుహలకు ఇవి ఏమాత్రం తీసిపోవని గుర్తించారు. అంతేకాదు బొర్రా గుహల్లో మామూలుగా రాతి కట్టడం మాదిరిగా ఉండగా గాజుబిడం గుహల్లో మాత్రం ఎరుపు, ఆకుపచ్చ మిళితమైన రంగుల్లో ఉండడాన్ని గుర్తించారు. ఆ గుహలకు ఎంతో విశిష్టత ఉందని, పురావస్తుశాఖ అధికారులతో చర్చించాల్సి ఉందని చెప్పారు. దేవరచర్లలో ఉన్న శివలింగంతో పాటు చందంపేట పరిసర ప్రాంతాల్లో 9 గుట్టల పరిధిలో పురాతనమైన ఆలయాలున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు. అక్కడి నుంచి కృష్ణానదిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమయంలో ముంపునకు గురైన ఏలేశ్వరం గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణా నదిలోని ఓ దీవిలో ఉన్న మల్లన్న, మల్లప్ప దేవాలయం గురించి తెలుసుకున్నారు. అభివృద్ధి చేయాల్సి ఉంది.. దేవరచర్ల, వైజాగ్ కాలనీలో గుర్తించిన అంశాలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు పురావస్తుశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు, టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్ శివాజీ చెప్పారు. కృష్ణానదిలో ఉన్న పలు దీవులను పరిశీలించిన వారు.. అవి పాపికొండలను తలపించే మాదిరిగా ఉన్నాయని అభివర్ణించారు. అరకును మించిన సోయగాలు చందంపేట ప్రాంతంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశక్యత ఉందని పేర్కొన్నారు. కాగా.. దేవరచర్లలో ఉన్న పురాతన ఆలయాలు, ప్రకృతి అందాల విషయమై తన దృష్టికి వచ్చిందని.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు నివేదిక తయారు చేశారని హోంమంత్రి నాయిని ఇటీవల దేవరకొండలో పేర్కొన్నారు. దీనిపై సీఎం కేసీఆర్తో మాట్లాడతానన్నారు. -
పర్యాటక శోభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు.. చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న మహబూబ్నగర్ జిల్లాకు ఇక పర్యాటకశోభ సంతరిం చుకోనుంది. జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం రూ.99.86కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజం సర్క్క్యూట్గా స్వదేశ్ దర్శన్ మిషన్ పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి పర్యాటక రంగానికి వన్నె తెచ్చేందుకు సంకల్పించింది. జిల్లాలోని ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్వదేశ్ దర్శన్ మిషన్ డెరైక్టరేట్ కమిటీ ఈ నెల 19న ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. తెలంగాణ పర్యాట క సంస్థ ప్రతిపాదనల మేరకు పర్యాటకులను అన్నిరకాలుగా ఆకర్షించేందుకు అ నువైన ప్రదేశాలు ఎంపిక చేసి వాటిలో ప ర్యాటకులకు కావాల్సిన సకల సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. కొ ల్లాపూర్ సమీపంలోని సోమశిల నదికి స మీపంలో ప్రకృతి అందాలను పర్యాటకులను అక్కడ సకల సదుపాయాలు కల్పిం చాలని అలాగే బోటింగ్ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 12.72కోట్లు కేటాయించింది. అలాగే కొ ల్లాపూర్ సమీపంలోని సింగోటం రిజర్వాయర్గా ఉన్న శ్రీవారి సముద్రం చెరువు ను పర్యాటకుల కంటికింపు కలిగే విధం గా తీర్చిదిద్దడానికి రూ.10.12 కోట్లు కేటాయించింది. శ్రీశైలంకు సమీపంలో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న అక్క మహాదేవి ప్రాంతాన్ని రూ.6.27 కోట్లతో పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉమామహేశ్వరం ప్రాంతా న్ని బేస్ క్యాంప్ సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు రూ.18.12కోట్లు కేటాయిం చింది. వీటితో అక్కడ ట్రెక్కింగ్ పర్యాటకుల కోసం నడకదారులు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అలాగే అచ్చంపేట నియోజకవర్గంలోని ఫరహాబాద్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అక్కడ సైక్లింగ్, ట్రెక్కింగ్, పర్యాటకులు నివాసముండేందుకు వసతులను ఏర్పాటుచేసేందుకు రూ.12.47 కోట్లను మంజూరు చేసింది. అలాగే మల్లెలతీర్థానికి రూ.14.89 కోట్లను మంజూరు చేసింది. ఈగల పెంటలో ఓపెన్ఎయిర్ థియేటర్ నిర్మాణానికి సుమారు రూ.15.94 కోట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో పర్యాటకరంగం దశ తిరిగే అవకాశం ఉంది. -
పర్యాటకానికి కేటాయింపులేవీ?
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గారి మాటలకీ, చేతలకీ హస్తిమశకాంతరమంత తేడా ఉంటుందని అందరికీ తెలుసు. రాజ ధాని విషయంలో ఆయనగారు చేస్తున్న ప్రగల్భాలు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాయి. పర్యాటక రంగానికి ఆయన కేటా యింపులు చూస్తే ఎవరికైనా మతిపోక తప్పదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు మిగిలిన 13 జిల్లాల్లో చారిత్రక ప్రాధాన్యం కలి గిన ప్రదేశాలు 277 ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించినది కేవలం 30 లక్షలు. ఆ సొమ్ము ను 277 చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు సమానంగా విభ జిస్తే ఒక్కొక్కదానికి కేవలం రూ.10,830లు మాత్రమే వస్తాయి. ఇంత తక్కువ సొమ్ముతో పర్యాటక అభివృద్ధి ఏ స్థాయిలో చేయా లని కలలు కంటున్నారో మరి. హైదరాబాద్ సెక్రటేరియట్లోని లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు మార్పులు, చేర్పులు, హంగుల కోసం సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టబోతున్నారని ప్రచార సాధనాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్రంలోని వందలాది చారిత్రక వారసత్వ ప్రదేశాల రక్షణకు కేవలం 30 లక్షల రూపాయలు సరి పోతాయి కానీ, నారా చంద్రబాబు నాయుడి గారి ఆఫీసును తీర్చి దిద్దడానికి 50 కోట్లు కావాలట. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి ఇంతకంటే సరైన నిదర్శనం ఏం కావాలి? - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు -
టూరిజం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయండి
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాను టూరిజం హబ్గా తయారు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అన్నారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చారిత్రాత్మక సంపద ఉందని, దానిని పరిరక్షించాలన్నారు. ఈ జిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లన్నారు. నేడు ఎన్నో దేశాలు టూరిజం ద్వారా అభివృద్ధి జరిగాయన్నారు. అదే తరహాలో రాష్ట్రంలో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమలను ప్రోత్సహించేం దుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. టూ రిజం హబ్ కోసం పూర్తిస్థాయి ప్రణాళికలుంటేనే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర టూరిజం మంత్రిగా వ్యవహరించిన చిరంజీవి నిధులు తేలేదని అన్నారు. ఎంపీ కింజరాపు రామమ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న టూరిజం ప్రాంతాలకు విద్యార్థులకు తీసుకెళ్లి చూపించాలని కోరారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. డచ్ బంగ్లాను మ్యూజియం తయారు చేస్తున్నట్లు చెప్పారు. విజేతలు వీరే... ఈ సందర్భంగా నిర్వహించిన వక్త్వత్వ పొటీలలో సీనియర్స్ విభాగంలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, సీహెచ్ సుకన్య, జూనియర్స్లో జి.అలేఖ్య, టి.స్వాతి వరుసగా మొదటి మూడు బహుమతులను సాధించారు. వ్యాసరచన పోటీలో ఎం.కుసుమ కుమారి, ఎస్.సాయిమాధురి, ఎం.శ్రీదేవి, జూనియర్స్లో జేవీ శ్రీవిద్య, ఆర్.ఉషా సాయికిరణ్, ఎల్.భార్గవనాయుడు వరుసగా మొదటి మూడు బహుమతులు పొందారు. చిత్రలేఖనం జూనియర్స్లో డి.దీపిక, ఎం.అపురూప్ సిద్దార్థ, సీనియర్స్లో పొందూరు శ్రీను, కె.పవన్కుమార్ మొదటి రెండు బహుమతులను సాధించారు. వీరికి అతిథులు బహుమతులు అందించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాం స్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. రఘుపాత్రుని శ్రీకాంత్ నృత్య దర్శకత్వంలో విశ్వ వినాయక నృత్య గీతం, ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరించే థీమ్ సాంగ్ నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించారు. జాతీ యస్థాయి గుర్తింపు పొందిన విశాఖకు చెందిన బొట్టా నాగేశ్వరరావు మాట్లాడేబొమ్మ ప్రదర్శన, ఎస్ఎంపురానికి చెందిన గొంటి జ మ్మయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణ తప్పెటగుళ్ల ప్రదర్శనలు నిర్వహించారు. విజయనగరం శ్యాం కుమార్ ఇంద్రజాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా పర్యాటక కేంద్రాల ఫొటో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్, ఇంటాక్ కన్వీనర్ దూసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకం పదునెక్కాలి
సాక్షి, ఏలూరు : జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కలెక్టర్ కాటమనేని భాస్కర్కు ఆదేశాలిచ్చారు. విజయవాడలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల ప్రథమ సమావేశంలో ముఖ్యమంత్రితో కలెక్టర్ భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయూలని, అనుబంధ రంగాలైన మత్స్య, పాడి, కోళ్ల పెంపకాన్ని విస్తరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం అమలుచేసే అన్ని పథకాలకు, కార్యక్రమాలకు ఆధార్ నంబర్లను అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. పతి ఇంటినుంచి ఒక మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జీపీఎస్ మ్యాపింగ్ను ఉపయోగించుకుని సర్కార్ భూములను కాపాడటంతోపాటు, కొత్త సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన భూములను సిద్ధం చేయూలన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని తీసుకుని నిరుపయోగంగా ఉంచిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఆ భూములు ప్రభుత్వానికి చెందినవిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా అక్షరాస్యతను మెరుగుపరచాలని, గర్భిణి, శిశు మరణాలను నివారించడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచనలు ఇచ్చారు. యువతలో వృత్తి నైపుణ్యత మెరుగుపరచడానికి పథకాలను రూపొందించాలని, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ముఖ్యంగా సేవల రంగాన్ని విస్తరించడానికి చర్యలు చేపట్టాలనిఆదేశించారు. అభివృద్ధిలో సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని (ఐటీ) పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు పాల్గొన్నారు. సమష్టిగా అభివృద్ధి సాధిస్తాం: కలెక్టర్ సమష్టి కృషితో జిల్లాలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పినట్టు కలెక్టర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఆవశ్యకత, కేంద్ర సంస్థల ఏర్పాటుకు గల అనుకూల పరిస్థితులు, ప్రభుత్వ భూముల లభ్యత, వ్యవసాయ, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు కలెక్టర్ వివరించారు. -
పర్యాటక అభివృద్ధికి రూ.10 కోట్లు
ఏలూరు రూరల్ :జిల్లాలో రూ.10 కోట్లతో చేపట్టే పర్యాటక అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలవాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోదావరి పర్యాటక సర్య్కూట్, కొల్లేరు పర్యాటక సర్య్కూట్, దేవాలయాల పర్యాటక సర్య్కూట్లుగా వేర్వేరు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొల్లేరు అందాలను పర్యాటకులు తిలకించేందుకు వీలుగా ఏలూరు నుంచి కృష్ణా జిల్లాలోని ఆటపాక వరకూ టూరిస్ట్ బస్సు నడపాలన్నారు. కొల్లేరులో బోట్లు, కొత్తదనంతో కూడిన రిసార్ట్లు నిర్మించాలన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, రిసార్టులు, బోటు షికారు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలను భక్తులే కాకుండా పర్యాటకులు కూడా దర్శించేలా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. వీటితోపాటు ప్రసిద్ధి చెందిన ఆలయాలు, ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రవిసుభాష్, డీఆర్వో కె.ప్రభాకర్రావు, సెట్వెల్ సీఈవో సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ మల్లికార్జునరావు పాల్గొన్నారు.