Thermal power
-
సింగరేణి చరిత్రలోనే రికార్డు టర్నోవర్!
గోదావరిఖని/సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2018–19 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధిక టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా టర్నోవర్ (అమ్మకాల)లో 21 శాతం ,బొగ్గు రవాణాలో 5 శాతం ,బొగ్గు ఉత్పత్తిలో 4 శాతం వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో రూ.25,828 కోట్ల టర్నోవర్ సాధించింది. 2017–18లో సాధించిన రూ.21,323 కోట్ల టర్నోవర్ కన్నా ఇది 21 శాతం అధికం. బొగ్గు రవాణాలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి 101 శాతంతో 676.73 లక్షల టన్నుల బొగ్గును వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది. అంతకు ముందు ఏడాది రవాణా చేసిన 646.19 లక్షల టన్నులతో పోల్చితే 5 శాతం వృద్ధి నమోదు చేసింది. 4 శాతం వృద్ధి రేటుతో 644.05 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఏడాది 620 లక్షల టన్నుల ఉత్పత్తి చేసింది. సింగరేణిచరిత్రలో ఇంతపెద్ద మొత్తం లో టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధిం చడం ఇదే తొలిసారి అని సంస్థ సీండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సింగరేణి కార్మికులు, అధికారులు, పర్యవేక్షక సిబ్బందికి, యూనియన్ నేతలకు తన అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో కొత్త ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ పురోగమించాలని పిలుపునిచ్చారు. బొగ్గు రవాణాకు సహకరించిన రైల్వే శాఖకు ఆయన తన ధన్యవాదాలు తెలియజేశారు. బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డు గత ఆర్థ్ధిక సంవత్సరంలో మొత్తం 10,422 రైల్వేర్యాకుల ద్వారా బొగ్గురవాణా చేసిన కంపెనీ, ఈ ఏడాది 12,372 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరిపి 18.71 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది సగటున రోజుకు 28.5 ర్యాకుల ద్వారా రవాణా జరగగా ఈ ఏడాది 34 ర్యాకులకు పెరిగింది. మార్చిలో అత్యధికంగా సగటున 41 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడం విశేషం. ఈ నెలలో మొత్తం 1,270 ర్యాకుల ద్వారా రవాణా జరిపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, శ్రీరాంపూర్, మందమర్రి, అడ్రియా లాంగ్వాల్ ఏరియా ప్రాజెక్టులు గత ఏడాది కన్నా ఎక్కువ వృద్ధిని కనబరుస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందంజలో ఉన్నాయి. రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో కూడా ఏరియా లు మంచి వృద్ధిని సాధించాయి. కొత్తగూడెం 18 శాతం, ఇల్లెందు 64, మందమర్రి 31.5, శ్రీరాంపూర్ 41.3, బెల్లంపల్లి 3.26, రామగుండం–2 ఏరియా 5 శాతం వృద్ధిని సాధించాయి. రైల్వే శాఖతో సమన్వయం బొగ్గును వెంటనే రవాణా చేయకపోతే స్టాకు పెరిగి ఇబ్బంది అవుతోంది. వినియోగదారుల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు రైలు ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరపటానికి సంస్థ యాజమాన్యం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అత్యధిక ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడానికి చర్యలు తీసుకుంది. సింగరేణిలో గతంలో రోజుకు సగటున 30 ర్యాకులు దాటి బొగ్గు రవాణా జరగడంలేదు. కానీ ఈ ఏడాది ఇది 40 ర్యాకులకు చేరడం గమనార్హం. తెలంగాణ పవర్ హౌస్కు సరఫరా అనేక రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగినంత లేక ఇబ్బందులు పడగా, సింగరేణి సంస్థ నుండి బొగ్గును స్వీకరిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవీ బొగ్గు కొరతను ఎదుర్కొనలేదు. గరిష్ఠ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉన్న సమయంలో కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు లోటు రాకుండా చూడగలిగింది. టీఎస్జెన్కోతో ఉన్న ఒప్పం దం ప్రకారం 2018–19లో 106.7 లక్షల టన్ను ల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా సింగరేణి 129.6 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఇది 21 శాతం ఎక్కువ. అలాగే ఎన్టీపీసీ కేంద్రాలకు ఒప్పందం ప్రకారం 112 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా 119 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా తగినంత బొగ్గు సరఫరా చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్కు 78 లక్షల టన్నులు, తమిళనాడుకు 8.4 లక్షల టన్నులు, కర్నాటకకు 54 లక్షల టన్నులు, మçహారాష్ట్రకు 42 లక్షల టన్నులు సరఫరా చేసింది. అలాగే వివిధ పరిశ్రమల్లో కాప్టివ్ పవర్ ప్లాంటులకు 37 లక్షల టన్నులు, సిమెంటు పరిశ్రమలకు 29 లక్షల టన్నులు, చిన్నతరహా పరిశ్రమలకు 15.6 లక్షల టన్నులు , సిరమిక్స్ తదితర 2,000 పరిశ్రమలకు 47 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడం జరిగింది. -
విషవాయువుకు కొత్త ఉపయోగం
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే పొగలో బోలెడంత కార్బన్డయాక్సైడ్ ఉంటుంది. భూతాపోన్నతి నేపథ్యంలో ఈ విషవాయువులను తొలగించేందుకు టెక్నాలజీలు ఉన్నా.. వ్యయప్రయాసల దృష్ట్యా అవి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో మిషిగన్ టెక్నలాజికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గాలిలో నుంచి కార్బన్డయాక్సైడ్ తొలగింపును లాభసాటి చేయగల ఆవిష్కరణ ఒకటి చేశారు. కార్బన్డయాక్సైడ్ను ఆక్సాలిక్ యాసిడ్గా మార్చడం ఇందులో కీలకమైన విషయం. ముడి ఖనిజం నుంచి కొన్ని అరుదైన మూలకాలను వెలికి తీసేందుకు ఈ ఆక్సాలిక్ యాసిడ్ను ఉపయోగిస్తారు. సెల్ఫోన్లలో ఉపయోగించే ఈ మూలకాల ఉత్పత్తి చైనాలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిషిగన్ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ఆవిష్కరణ చేయడం విశేషం. సోడియం కార్బొనేట్ ద్వారా పంపినప్పుడు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే వాయువుల్లోని కార్బన్డయాక్సైడ్ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కవాత్ర తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, మిగిలిన అవశేషాల ద్వారా ఆక్సాలిక్ యాసిడ్ను తయారు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా మరింత ఎక్కువ విష వాయువును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ పద్ధతి ఇప్పటికే ఉపయోగిస్తున్న దానికంటే పది రెట్లు తక్కువ ఖర్చుతో పనిచేస్తుందని వివరించారు. -
‘దక్షిణ భారతంలో ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ’
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే సింగరేణి ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉందని సింగరేణి జీఎం (కో–ఆర్డినేషన్, సీపీఆర్ఓ, స్ట్రాటజిక్ ప్లానింగ్) ఆంథోనిరాజా అన్నారు. వివిధ జిల్లాల్లో గ్రూప్–1 ట్రైనీలుగా శిక్షణ పొందుతున్న వారికి శుక్రవారం సింగరేణి భవన్లో సంస్థపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి బొగ్గు ఉత్పత్తి విధానాన్ని, బొగ్గు ద్వారా వివిధ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలను తీరుస్తున్న విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సింగరేణి పరిసర ప్రాంతాల ప్రజల కోసం సంస్థ చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాలపై వారికి అవగా హన కల్పించారు. కార్యక్రమంలో డీజీఎం వెంకటేశ్వర్లు, డీజీఎం(ఎఫ్ఏ)రాజేశ్వర్రావు, డిప్యూటీ మేనేజర్ దుండే వెంకటేశం పాల్గొన్నారు. -
థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి నీరు...!
వాతావరణ మార్పులు కానివ్వండి.. ఇంకేదైనా కారణం కానివ్వండి.. భూమ్మీద నీటికి కరువు వచ్చేసింది. మేఘాలను కురిపించేందుకు, ఉన్న నీటిని మళ్లీమళ్లీ వాడుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వాడేసిన నీటిని సేకరించేందుకు సరికొత్త మార్గం ఒకదాన్ని ఆవిష్కరించారు. బొగ్గుతో విద్యుదుత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే ఆవిరి నుంచి నీటిని సేకరించేందుకు వీరు ఓ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బొగ్గును మండించి నీటిని ఆవిరిగా మార్చి.. టర్బయిన్లను తిప్పడం థర్మల్ పవర్ ప్లాంట్లలో జరిగే ప్రక్రియ అని మనకు తెలుసు. విద్యుదుత్పత్తి తరువాత కూలింగ్ టవర్స్ నుంచి బోలెడంత ఆవిరి వెలువడుతూంటుంది. ఇలాంటి ఆవిరి నుంచి నీటిని సేకరించేందుకు మధ్యలో లోహపు లేదంటే ప్లాస్టిక్ జల్లెడ ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే అనేకచోట్ల ఉపయోగిస్తున్న ఈ పద్ధతితో ప్రయోజనం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ జల్లెడపైకి విద్యుదావేశంతో కూడిన కణాలను పంపినప్పుడు అధిక మొత్తంలో నీటి బిందువులు ఏర్పడ్డాయి. దాదాపు 600 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా ఏడాదికి అరవై కోట్ల లీటర్ల నీటిని సేకరించవచ్చునని.. అవసరమైతే ఈ నీటిని అక్కడే మళ్లీ వాడుకోవచ్చు. లేదంటే చుట్టుపక్కల ఉండే జనావాసాలకు సరఫరా చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న భారతీయ సంతతి శాస్త్రవేత్త కపా వారణాసి తెలిపారు. -
ప్రైవేటు ‘పవన’ంపైనే ధ్యాస!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. వారం క్రితం వరకూ రోజుకు 187 మిలియన్ యూనిట్లున్న డిమాండ్ శుక్రవారం 157 మిలియన్ యూనిట్లకు తగ్గింది. వినియోగం పరిస్థితి ఇలా ఉంటే.. పవన విద్యుత్ ఉత్పత్తి మాత్రం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మాత్రం అత్యధిక ధర చెల్లించి ప్రైవేటు పవన విద్యుత్నే కొనేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల చౌకగా అందే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ను తగ్గించాల్సిన పరిస్థితేర్పడింది. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నందున పవన, సౌర విద్యుత్ను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగంలో కేవలం 5 శాతమే ఈ విద్యుత్ను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఇందుకోసం ఏపీజెన్కో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తికి అనివార్యంగా కోత పెడుతున్నారు. వారంక్రితం రోజుకు 15 మిలియన్ యూనిట్లున్న పవన విద్యుత్.. శుక్రవారం 50 మిలియన్ యూనిట్లకు చేరగా.. మరోవైపు సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్ల వరకు అందుతోంది. కేంద్ర విద్యుత్ వాటాలో ప్రస్తుతం 25 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తోంది. ఇంకోవైపు దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు(ఐపీపీ) 30 మిలియన్ యూనిట్ల వరకు అందిస్తున్నాయి. మొత్తం కలిపి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో డిమాండ్కు అవసరమైన మిగిలిన 42 మిలియన్ యూనిట్లను మాత్రమే థర్మల్ విద్యుత్ను ప్రోత్సహిస్తున్నారు. థర్మల్ ఉత్పత్తికి కోత.. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కోత పెట్టారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న కృష్ణపట్నంలోని ఒక యూనిట్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గించగా.. మరో యూనిట్లో అరకొర ఉత్పత్తి జరుగుతోంది. ఈ కేంద్రం నుంచి రోజుకు 45 మి. యూనిట్లు అందే వీలుంది. కానీ 20 మిలియన్ యూనిట్లు కూడా తీసుకోవట్లేదు. విజయవాడ, కడప థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తికి భారీగా కోత విధించారు. ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ 105 మిలియన్ యూనిట్లు అందే వీలున్నా.. కేవలం 42 మిలియన్ యూనిట్లే తీసుకుంటున్నారు. జెన్కో విద్యుత్ ధర యూనిట్ సగటున రూ.4 ఉంటుంది. ప్రైవేటు సోలార్ విద్యుత్ ధర యూనిట్ రూ.5.25 వరకూ ఉంది. నిబంధనల ప్రకారం ముందుగా తక్కువ ధర ఉన్న విద్యుత్ ప్లాంట్లకే ప్రాధాన్యమివ్వాలి. ప్రైవేటు విద్యుత్కోసం అడ్డగోలుగా వ్యవహరించడం వల్ల థర్మల్ ప్లాంట్లు ఆర్థిక నష్టాల్లోకి వెళ్లే వీలుందని, అంతిమంగా వినియోగదారులపైనా భారం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఒకేసారి పెరిగి..అంతలోనే పడి..
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒడిదుడుకులకు లోనవుతోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ప్రారంభించిన నాటి నుంచి పగటి వేళల్లో పెరుగుతూ రాత్రి పూట పతనమవుతోంది. రాష్ట్రంలోని 23 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లను పగటి పూటే వినియోగిస్తుండటంతో పగలు సగటున 9,300 మెగావాట్లు డిమాండ్ నమోదవుతూ రాత్రి 6 వేల మెగావాట్లకు పడిపోతోంది. ఈ హెచ్చుతగ్గుల పరిణామాల నేపథ్యంలో అసలే క్లిష్టమైన విద్యుత్ గ్రిడ్ నిర్వహణ.. మరింత కష్టతరంగా మారుతోంది. ట్రాన్స్కో అప్రమత్తం.. విద్యుత్ సరఫరా వ్యవస్థలో క్లిష్టమైన పనుల్లో విద్యుత్ గ్రిడ్ నిర్వహణ ఒకటి. క్షణక్షణం మారే డిమాండ్కు సమానంగా గ్రిడ్కు విద్యుత్ సరఫరా చేసి సరఫరా వ్యవస్థను కాపాడేందుకు ట్రాన్స్కో లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నిరంతరం పని చేస్తూ ఉంటుంది. హెచ్చుతగ్గులతో విద్యుత్ సరఫరా చేస్తే గ్రిడ్ అకస్మాత్తుగా కుప్పకూలి రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో సైతం విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గ్రిడ్ కూలితే సరఫరా పునరుద్ధరణకు 24 గంటలకు మించి పడుతుంది. అయితే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో డిమాండ్ ఒడిదుడుగులకు గురవుతూ గ్రిడ్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారింది. దీంతో గ్రిడ్ పరిరక్షణపై ట్రాన్స్కో మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. గ్రిడ్ నిర్వహణపై అధికారులలో రోజూ గంటపాటు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బ్యాకింగ్ డౌన్ తీవ్రం తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) ప్లాంట్ల నుంచి 2,882 మెగావాట్లు, సింగరేణి ప్లాంట్ల నుంచి 1,200, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2,300, ఛత్తీస్గఢ్ నుంచి 1,000, థర్మల్ పవర్టెక్ నుంచి 840, సౌర విద్యుత్ ద్వారా 3,100, పవన విద్యుత్ ద్వారా 108 మెగావాట్లు రాష్ట్రానికి సరఫరా అవుతోంది. వీటి నుంచి డిమాండ్కు తగ్గట్లు పగటి వేళల్లో గరిష్టంగా 9,300 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుండగా, రాత్రి వేళల్లో ఉత్పత్తిని 6 వేలకు తగ్గిస్తున్నారు. ప్రైవేటు, ఎన్టీపీసీ, సింగరేణి విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించేందుకు 24 గంటల ముందే యాజమాన్యాలకు సమాచారమివ్వాలి. కానీ డిమాండ్లో హెచ్చతగ్గులు ఏర్పడుతుండటంతో ఉత్పత్తి తగ్గించుకోవడం సాధ్యం కాదని ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు తెలిపారు. మెరిట్ ఆర్డర్ ప్రకారం తక్కువ ధర ఉన్న జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించుకుంటున్నామన్నారు. -
విద్యుదుత్పత్తిలో సింగరేణి రికార్డు
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ డిసెంబర్లో అత్యధికంగా 99.5 శాతం పీఎల్ఎఫ్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పిందని సింగరేణి సంస్థ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. 2017–18లో 90 శాతం పీఎల్ఎఫ్ సాధించి జాతీయ స్థాయిలో 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాలో 4వ స్థానంలో నిలిచిందని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొంది. విద్యుత్ ప్లాంట్ స్థాపిత సామర్థ్యంతో పోల్చినపుడు.. ఓ నిర్ణీత కాలంలో వాస్తవంగా జరిగిన విద్యుదుత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్ అంటారు. గత ఫిబ్రవరిలో 100 శాతం పీఎల్ఎఫ్ సాధించిన 600 మెగావాట్ల యూనిట్–2 ప్లాంటు.. మే, నవంబర్లలో కూడా 100 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. మరో 600 మెగావాట్ల యూనిట్–1 ప్లాంటు ఏప్రిల్, డిసెంబర్లలో 100 శాతం పీఎల్ఎఫ్ సాధించడం గమనార్హం. అందరికీ అందుబాటులో, అన్ని వేళలా విద్యుత్తు సరఫరా చేయాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 10,658 మిలియన్ యూనిట్లను ఇతర సంస్థల కన్నా తక్కువ ధరకే సరఫరా చేసింది. ఇలా ఇతర సంస్థల ధరలతో పోలిస్తే దాదాపు రూ.వెయ్యి కోట్లు ఆదా అయినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది. కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంటు జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలవడంపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. 2018లో మరిన్ని విజయాలు సాధించనున్నామని, కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నామని తెలిపారు. సంస్థ ప్రగతి పథంలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులకు, వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న కుటుంబీకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏటా సగటున 7 శాతం వృద్ధి రేటుతో సంస్థ పురోగమిస్తోందని పేర్కొన్నారు. కొత్తగా 12 గనులు రానున్నాయని, రానున్న 5 ఏళ్లలో సింగరేణి 850 లక్షల టన్నుల లక్ష్యాన్ని చేరుకోనుందని తెలిపారు. -
సింగరేణి విద్యుత్ కేంద్రానికి 8వ స్థానం
సాక్షి, హైదరాబాద్/మంచిర్యాల: దేశంలో ఎంపిక చేసిన 25 అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు నెలల కాలంలో దేశంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించిన 25 విద్యుత్ కేంద్రాలకు ర్యాంకులు ప్రకటించింది. అందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 86.87 శాతం పీఎల్ఎఫ్తో జాతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. అది మినహా తెలుగు రాష్ట్రాల నుంచి మరే విద్యుత్ కేంద్రం టాప్–10లో చోటు దక్కించుకోలేకపోయింది. రామగుండంలో ఎన్టీపీసీకి చెందిన సూపర్ విద్యుత్ కేంద్రం ఒక్కటే 82.04 శాతం పీఎల్ఎఫ్తో 19వ ర్యాంకు సాధించి 25 విద్యుత్ కేంద్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఒక విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే.. ఓ ఏడాది కాలంలో ఆ విద్యుత్ కేంద్రం సాధించిన ఉత్పత్తి శాతాన్ని పీఎల్ఎఫ్గా పరిగణిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన విద్యుత్ కేంద్రాలు నష్టాల బాట పట్టకుండా ఉండాలంటే ఏటా మెరుగైన పీఎల్ఎఫ్ సాధించాల్సి ఉంటుంది. 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత ఆరు నెలల్లో 4,613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిపి 4,325 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి (గ్రిడ్కు) సరఫరా చేసింది. ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ సెప్టెంబర్ వరకు 8,862 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా 8,272 మిలియన్ యూనిట్లను రాష్ట్రానికి సరఫరా చేసింది. ఇక సీఈఏ ప్రకటించిన జాబితాలో పశ్చిమ బెంగాల్కు చెందిన 750 మెగావాట్ల బుడ్గె బుడ్గె థర్మల్ విద్యుత్ కేంద్రం 99.77 శాతం పీఎల్ఎఫ్తో ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ 8వ స్థానంలో నిలవడంపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్లాంట్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. మొదటి నుంచి ఉత్తమ స్థాయిలోనే.. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి నుంచి మంచి పీఎల్ఎఫ్తో ముందుకెళ్తోంది. గత ఆగస్టులో ఈ కేంద్రం అత్యధికంగా 98.43 శాతం పీఎల్ఎఫ్తో రికార్డు సాధించింది. కేంద్రంలోని యూనిట్–1 గత ఏప్రిల్లో 100 శాతం పీఎల్ఎఫ్ సాధించగా యూనిట్–2 గత ఫిబ్రవరి, మే నెలల్లో 100 శాతం పీఎల్ఎఫ్ను నమోదు చేశాయి. -
కర్ణాటకకు సింగరేణి బొగ్గు
ఈ ఏడాది 80 లక్షల టన్నుల సరఫరా - కేపీసీఎల్తో సింగరేణి సంస్థ ఒప్పందం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 80 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్, కేపీసీఎల్ ఎండీ కుమార్ నాయక్ల సమక్షంలో రెండు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంత కాలు చేశారు. దీని ప్రకారం సింగరేణి కర్ణాటకలోని రాయచూర్లోని కేపీసీఎల్కు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయ నుంది. కేపీసీఎల్ ఇటీవల ఎర్రమారస్లో నిర్మించిన మరో థర్మల్ విద్యుత్ కేంద్రానికి 20 లక్షల టన్నులు, బళ్లారిలోని బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 31 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది. ఇదిలా ఉండగా, సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును సకాలంలో అందజేయడంతో తమకు విద్యుదుత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) మెరుగుపడిం దని కేపీసీఎల్ ఎండీ.కుమార్నాయక్ అన్నారు. 32 శాతం కన్నా తక్కువ తేమ గల బొగ్గును సింగరేణి అందించేందుకు చొరవ తీసుకుం టోందన్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పదేళ్లలో ఎన్నడూ సాధించని విధంగా గతేడాది 77 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని, ఈ ఘనత సింగరేణికే దక్కుతుందన్నారు. ఈ కారణంగానే సింగరేణిపై విశ్వాసం ఉంచుతూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. లక్ష్యానికి మించి బొగ్గు డిమాండ్.. సింగరేణి సంస్థ ఈ ఏడాది 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న ప్పటికీ డిమాండ్ 800 లక్షల టన్నుల వరకు ఉందని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. అయినా ఈ ఏడాది కర్ణాటకకు బొగ్గు సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలతో పాటు కోలిండియా పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సైతం బొగ్గును సరఫరా చేస్తున్నా మన్నారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో అందిస్తుండడంతో సింగరేణి బొగ్గుకు డిమాండ్ మరింత పెరిగిందన్నారు. -
ముగిసిన విద్యుత్ బంధం!
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాలు బంద్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్ వాటాల పంపకాల ప్రకారం తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్ను ఏపీ శనివారమే నిలిపివేయగా, ఆదివారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ సైతం ఏపీ వాటా సరఫరాను నిలుపుదల చేసింది. విద్యుత్ పంపకాలకు సంబంధించిన రూ. 3,139 కోట్ల బకాయిలు చెల్లిం చలేదని తెలంగాణకు ఏపీ విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, ఏపీ నుంచే రూ. 1,676.46 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సైతం ఏపీకి విద్యుత్ వాటాల పంపకాలను నిలిపివేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని జెన్కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. మూడేళ్ల పాటు రెండు రాష్ట్రాలు థర్మల్ విద్యుత్లో వాటాలు పంచుకోగా, తాజాగా ఈ పంపకాలకు బ్రేక్ పడినట్లు అయింది. -
ఉత్పత్తి ఊహించనంత
డిమాండ్ కన్నా లభ్యత డబుల్ - 2022 నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి.. - లభ్యత 20,359 మెగావాట్లు.. డిమాండ్ 11,967 మెగావాట్లే.. - థర్మల్ విద్యుత్ పూర్తిగా బ్యాకింగ్ డౌన్ - పునరుత్పాదక విద్యుత్ సరఫరా.. రాష్ట్ర విద్యుత్ రంగంపై నీతి ఆయోగ్ సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే డిమాండ్ చాలా తక్కువగా ఉండనుంది. 2021–22 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 11,967 మెగావాట్లకు చేరుతుంది. అయితే విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం మాత్రం దానికి రెట్టింపుగా 20,359 మెగావాట్లకు చేరుకోనుంది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తిని బ్యాకింగ్ డౌన్ చేసి పునరుత్పాదక విద్యుత్తో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాల్సిన విచిత్ర పరిస్థితి ఉత్పన్నం కానుంది’అని నీతిఆయోగ్ పేర్కొంది. 2022 నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 20,359 మెగావాట్లకు పెరగనుండగా, అందులో థర్మల్ విద్యుత్ 10,797 మెగావాట్లు, జల విద్యుత్ 2,916 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,457 మెగావాట్లు, పవన విద్యుత్ 2,000 మెగావాట్లు, ఇతర విద్యుత్ 189 మెగావాట్ల వాటాలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 9 శాతం మిగులు విద్యుత్ ఉండనుందని పేర్కొంది. రాష్ట్ర విద్యుత్ రంగంపై తాజాగా రూపొందించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక–2022లో నీతి ఆయోగ్ ఈ కీలక విషయాలను పొందుపరిచింది. 2 లక్షల మిలియన్ యూనిట్ల డిమాండ్ దిశగా.. మరో 15 ఏళ్ల తర్వాత రాష్ట్ర వార్షిక విద్యుత్ అవసరాలు 1,99,731 మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పెరగనున్నాయి. రోజువారీ విద్యుత్ డిమాండ్ కూడా సగటున 28,752 మెగావాట్లకు పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్కు భవిష్యత్తు.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ వాటా 2029–30 సంవత్సరంలో 27.32 శాతానికి పెరగనుంది. పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 14,748 మెగావాట్లకు పెరగనుండగా, సౌర విద్యుత్ ప్లాంట్లు 12,558 మెగావాట్లు, సౌరేతర విద్యుత్ ప్లాంట్లు 2,190 మెగావాట్లు ఉండనున్నాయి. మొత్తం 24,636 ఎంయూల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కానుండగా, అందులో 20,902 ఎంయూల సౌర విద్యుత్, 4,029 ఎంయూల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉండనుంది. నీతి ఆయోగ్ నివేదికలోని ఇతర ప్రధానాంశాలు.. ► మరో రెండేళ్లలో 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. అందులో అధిక భాగం సౌర విద్యుత్ ప్లాంట్లే.. ► ఈ ఏడాది 300 మెగావాట్ల పవన విద్యు త్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ► సంప్రదాయ వ్యవసాయ విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సౌర విద్యుత్ పంపు సెట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 70 వేల సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసింది. ► రానున్న సంవత్సరాల్లో ఎన్టీపీసీ దశల వారీగా రాష్ట్రంలో 1,600 మెగావాట్లు, 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించనుంది. ► 2018 ముగిసేలోగా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యం 25,000 మెగావాట్లకు పెరగనుంది. -
గణపురం గుళ్లకు పూర్వ వైభవం!
భారీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం - ఇప్పటికే తొలి ద శ పూర్తి.. రెండో దశ పనుల కోసం శాస్త్రీయ అధ్యయనం - రంగంలోకి ఢిల్లీ,వరంగల్ నిట్ నిపుణులు - ఆపై యునెస్కో గుర్తింపునకు దరఖాస్తు సాక్షి, హైదరాబాద్: ఐదెకరాల ప్రాంగణం.. చుట్టూ మహా ప్రాకారం.. ఓ పక్కన 60 స్తం భాలతో మహా మండపం.. పక్కనే ముఖ మండపం, మహామండపం, అర్ధ మండపాలతో కూడిన అద్భుత శిల్పరీతితో అలరారే గణపేశ్వర దేవాలయం.. చుట్టూ మరో 21 ఆలయాలు.. ప్రతీ గోడపై అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం.. వెరసి అదో ఆధ్యాత్మిక ప్రపంచం.. యావత్తు తెలంగాణలో ఇలాంటి ఆలయాల సమూహం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో.. ఇదీ వరంగల్ జిల్లా గణపురంలోని గణపేశ్వరాలయం (కోట గుళ్లు) ప్రాంగణ సొగసు. 13వ శతాబ్దంలో నిర్మితమై.. కులీకుతుబ్షాహీల హయాంలో ఔరంగజేబుల దాడులతో ధ్వంసమైన ఈ ఆలయం తిరిగి అప్పటి శోభను సంతరించుకోనుంది. ఇప్పటికే తొలి దశ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి మలిదశ కోసం కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం వరంగల్లోని నిట్ ఇంజనీర్లు, ఢిల్లీకి చెందిన పురావస్తు సాంకేతిక నిపుణులు అధ్యయనం ప్రారంభించారు. వారి నివేదిక ఆధారంగా త్వరలోనే జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గుళ్లను పునరుద్ధరించే భారీ ప్రాజె క్టు కార్యరూపం దాల్చనుంది. దీనికి దగ్గర్లో ఉన్న రామప్ప దేవాలయంతో కలిపి ‘యునెస్కో’ వారసత్వ హోదా కోసం దరఖాస్తు చేయాలని పురావస్తు శాఖ యోచిస్తోంది. ‘శాండ్ బాక్స్’ పరిజ్ఞానం కాకతీయ రాజైన గణపతి చక్రవర్తి హయాంలో 13 శతాబ్దంలో ఈ మహా ఆలయాల సమూహం నిర్మితమైంది. భూకంపాలను తట్టుకునేలా పునాదుల్లో ‘శాండ్ బాక్స్’ (మూడు మీటర్ల మందంతో ఇసుకను నింపటం) టెక్నాలజీని ఉపయోగించారు. అనంతర కాలంలో ఢిల్లీ నుంచి ఔరంగజేబు ఉలూఫ్ఖాన్ను పురామాయించి ఈ ఆలయాలను ధ్వంసం చేయించారు. కాలక్రమంలో దిగువన ఉన్న ఇసుక 10 శాతం మేర బయటికి వెళ్లిపోయింది. దీంతో ఖాళీ ఏర్పడి ఆలయాలు కుంగిపోయాయి. ఇలాగే కొనసాగితే కొద్ది కాలంలోనే ఉన్న సంపద కూడా పూర్తిగా నేలమట్టం కావడం ఖాయం. ఇప్పుడేం చేస్తారు? గట్టిపడ్డ పునాది ఎంత బరువును ఆపగలుగుతుంది.. పైన ఆలయ పునరుద్ధరణకు అవలంబించాల్సిన పద్ధతులు.. ఆలయ రాళ్ల పటుత్వం, అక్కడి నేల స్వభావం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నీళ్లు వచ్చి ఆలయ పునాదుల్లోకి చేరకుండా చేయాల్సిన పనులు.. అక్కడి వాతావరణం.. వంటి అంశాలపై నిపుణులు పూర్తిగా అధ్యయనం చేయనున్నారు. వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తారు. పునరుద్ధరణకు దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సింగరేణి, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం వంటి ఇతర సంస్థల సాయాన్ని కూడా కోరనున్నారు. ఈలోపు అందుబాటులో ఉన్న రూ.2 కోట్లతో పనులు మొదలుపెట్టనున్నారు. ► పునాదుల్లోకి అవసరమైన ఇసుకను నింపి, దానిపై పురాతన పద్ధతిలో రాతి కట్టడాన్ని పేరుస్తారు. రాళ్ల మధ్య బాండింగ్కు స్టీలు పట్టీలు, రాళ్ల మధ్య రంధ్రాలు చేసి స్టీలు వైరుతో కదలకుండా చేస్తారు. ►ఆలయం చుట్టూ పచ్చిక బయళ్లు, పర్యాటకుల విడిది కేంద్రాలు నిర్మించి దక్షిణ భారత్లోనే దీన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రామప్ప దేవాలయం, రామప్ప, లక్నవరం చెరువులతో దీన్ని ఒకే ప్రాంగణంగా మార్చాలని భావిస్తున్నారు. తొలి దశలో ఏం చేశారంటే.. ఈ గుళ్లను పునరుద్ధరించేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రం నుంచి వచ్చిన రూ.3 కోట్ల సీఎఫ్ఏ నిధులతో ఈ ఏడాది ప్రారంభంలో పనులు చేశారు. తొలుత ప్రధాన ఆలయం పునాదుల చుట్టూ, ప్రదక్షిణ పదం, పై భాగంలో బోరు యంత్రంతో 6 మీటర్ల మేర 340 రంధ్రాలు చేసి ఎయిర్ కంప్రెషర్ల ద్వారా సున్నం పేస్ట్ను లోపలికి పంపారు. అది పునాదుల్లోకి చేరి అక్కడ మిగిలిన ఇసుక వెలుపలికి రాకుండా గట్టిపడేలా చేసింది. దీంతో పునాదులు పటిష్టంగా మారాయి. -
వాళ్లు కూడా సౌర విద్యుత్తు వైపే వెళ్లాలి
ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా వెలుగులు వెదజల్లుతూ విద్యుచ్ఛక్తిని అందిస్తున్న సూర్యుడు. మరోపక్క భూగర్భంలో చీకట్లమాటన దాగి విద్యుచ్ఛక్తితో చీకటిని మాపుతున్న బొగ్గు గనులు. ఇందులో ఒకటి గతించిపోతున్న గతం. మరొకటి భవిష్యత్తుకు నిదర్శనం. గతించి పోతున్న బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులంతా భవిష్యత్తు బాటలో సౌరవిద్యుత్ ప్లాంట్లలోకి అడుగులు వేయాల్సిందే. అదే ప్రస్తుత కర్తవ్యమని మిషిగన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జాషువా పియర్స్, ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి ఎడ్వర్డ్ లూయీ చెబుతున్నారు. వారు సౌర విద్యుత్ ఆవశ్యకతను వివరిస్తూ 'ఎనర్జీ ఎకనామిక్స్' జర్నల్లో ఓ వ్యాసం రాశారు. అమెరికాలో గత 15 ఏళ్లుగా విస్తరిస్తున్న సౌరవిద్యుత్ వ్యవస్థ కారణంగా థర్మల్ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నవారి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, వారిని సౌరవిద్యుత్ వ్యవస్థలోకి లాక్కొని ఉద్యోగావకాశాలను కల్పించాలని వారు సూచించారు. ప్రస్తుతం అమెరికాలోని బొగ్గు ఉత్పత్తి రంగంలో ఇంజనీర్లు, అకౌంటెంట్లు, ఎలక్ట్రీషియన్లు, మైనర్లు కలిపి దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. అదే సౌరవిద్యుత్ రంగంలో 2.09 లక్షల మంది పనిచేస్తున్నారు. బొగ్గు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా సులభంగానే సౌర విద్యుత్ రంగంలోకి తీసుకోవచ్చని, నైపుణ్యం కలిగిన కార్మికులకు రెండు వారాల శిక్షణ ఇస్తే సరిపోతుందని జాషువా పియర్స్ అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లకు మాత్రం సరైన విద్యను అందజేస్తే సరిపోతుందని చెప్పారు. బొగ్గురంగంలో పనిచేస్తున్న మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ అధికారులకు వేతనాలు సౌర విద్యుత్ రంగంలో తగ్గిపోతాయి. బొగ్గురంగం నుంచి ప్రతి కార్మికుడిని సౌర విద్యుత్ రంగంలోకి తీసుకుంటే 18 కోట్ల డాలర్ల నుంచి వంద కోట్ల డాలర్ల వరకు ఆర్థిక భారం పడవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం, కార్మికులు పంచుకోవాలని ఆయన సూచించారు. బొగ్గు కంపెనీలు కూడా చమురు కంపెనీలు అనుసరించిన మార్గాన్నే అనుసరించాలని, సహజ వాయువు తదితర ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు తమ పోర్ట్ఫోలియోలను చమురు కంపెనీలు మార్చుకున్నాయని, వారి బాటలోనే ప్రత్యామ్నాయ, ఎకో ఫ్రెండ్లీ ఇంధనాల వైపు బొగ్గు కంపెనీలు తమ దృష్టిని సారించాలని జాషువా, ఎడ్వర్డ్లు తమ వ్యాసంలో సూచించారు. ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎస్ఏ, బ్యాటరీ మేకర్ సాఫ్ట్గ్రూప్ను వంద కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిందని, సన్ పవర్ కార్పొరేషన్లో మరో చమురు కంపెనీ 60 శాతం షేర్లను కొనుగోలు చేసిందని వారు ఉదహరించారు. బీపీ, ఎగ్జాన్మొబైల్, కొనొకోఫిలిప్స్ లాంటి కంపెనీల వద్ద అపార ధనరాశులు ఉన్నాయని, అలాంటి కంపెనీలు సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. -
సింగరేణి .. వెలుగుల రాణి
- నేడు జైపూర్ విద్యుత్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్ - మొదటి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం జైపూర్: సింగరేణి సంస్థ మరో అద్భుత ఘట్టా న్ని ఆవిష్కరించనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంటు ద్వారా ఇక నుంచి రాష్ట్రానికి విద్యుత్ వెలుగు అందనున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో నిర్మించిన బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాం టులోని మొదటి యూనిట్ బుధవారం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ యూనిట్ను గ్రిడ్కు అనుసంధానం చేయను న్నారు.రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమాలకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్. శ్రీధర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక్కడి థర్మల్ పవర్ప్లాంటు నిర్మాణానికి 2010లో శ్రీకారం చుట్టారు. ఆరేళ్లపాటు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిన పనులు చివరికి తుదిదశకు చేరాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తికి జైపూర్ ప్లాంటు తయారవుతోంది. యూనిట్-1 ప్లాంటులో కీలకమైన సింక్రనైజేషన్(బీటీజీ, వోవోపీ అన్ని వ్యవస్థల అనుసంధానం) ప్రక్రి య మార్చి 13న చేపట్టగా రెండో యూనిట్ ప్లాంటులో సింక్రనైజేషన్ ప్రక్రియను బుధవా రం చేపట్టనున్నారు. మొదటి యూనిట్ ప్లాం టులో ఆయిల్, బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయ గా, బుధవారం నుంచి బొగ్గుతో నిరంతరం విద్యుదుత్పత్తి చేపట్టనున్నారు. గజ్వేల్లోని విద్యుత్గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. -
జైపూర్లో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం
మొదటి ప్లాంటు ద్వారా 587 మెగావాట్లు గజ్వేల్ పవర్ గ్రిడ్కు సరఫరా మే చివరికల్లా 1,200 మెగావాట్ల ఉత్పత్తి జైపూర్: సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో చేపట్టిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోని యూనిట్-1(600 మెగావాట్లు)లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ మొదటి యూనిట్ ప్లాంటును సింక్రనైజేషన్ చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. సింగరేణి, బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో, ఎన్టీపీసీ ఉన్నతాధికారుల నేతృత్వంలో కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ కొనసాగింది. మొదటి యూనిట్ బాయిలర్లో టర్బైన్, జనరేటర్(టీజీ)వద్ద సీఎండీ శ్రీధర్ పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం సీసీఆర్ కంట్రోల్రూం వద్ద కంప్యూటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వివిధ భాగాలు, యంత్రాల సమూహాన్ని అనుసంధానం చేసి విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజు యూనిట్-1 ప్లాంట్ ఒక నుంచి ప్రారంభమై 587 మెగావాట్ల ఉత్పత్తిని సాధించారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను 400 కేవీ స్విచ్ యార్డు ద్వారా గజ్వేల్ పవర్ గ్రిడ్కు వెళ్లింది. కేసీఆర్ చేతులమీదుగా జాతికి అంకితం.. జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మేలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా జాతికి అంకితం చేస్తామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ కేంద్రంలోని రెండో యూనిట్ను వచ్చేనెలలో సింక్రనైజేషన్ చేసి.. మే వరకు సీవోడీ చేస్తామని, తద్వారా 1,200 మెగావాట్ల విద్యుత్ను తెలంగాణ ప్రజలకు అందిస్తామని ఆయన వివరించారు. యూనిట్-1 సింక్రనైజేషన్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లను ఆరేళ్లలో సింక్రనైజేషన్ చేస్తే.. సింగరేణి సంస్థ పవర్ప్లాంటులో నాలుగేళ్లలోనే విజయవంతంగా సింక్రనైజేషన్ చేశామని చెప్పారు. జైపూర్ ప్లాంటు ద్వారా వచ్చే రెండు నెలల్లో పూర్తిస్థాయిలో 1,200 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని, దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ, వాణిజ్య, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలి పారు. ప్లాంటు నిర్వహణ జర్మనీకి చెందిన స్టిగ్ కంపెనీకి అప్పగించామని తెలిపారు. భూనిర్వాసితులకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్లు రమేశ్బాబు(ఈ అండ్ ఎం), మనోహర్రావు(పీపీ), పవిత్రన్కుమార్(ఫైనాన్స్), ఈడీ సంజయ్కుమార్సూర్, జీఎంలు సుధాకర్రెడ్డి, మురళీకృష్ణ, సుభానీ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధానకార్యదర్శి రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధానకార్యదర్శి రియాజ్ అహ్మద్,వివిధ కంపెనీల అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది ఇన్ఫ్రాకి గడ్డుకాలమే
♦ రోడ్లు, థర్మల్ పవర్ని వీడని కష్టాలు ♦ ఎయిర్ పోర్టులు, రేవుల పరిస్థితి కొంత బెటర్ ♦ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ మౌలిక వసతుల రంగం వచ్చే ఏడాది కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. కీలకమైన బీవోటీ రోడ్డు ప్రాజెక్టులు, ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు గాడిలో పడటానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి మొత్తం ఇన్ఫ్రా రంగానికి నెగిటివ్ రేటింగ్ ఇచ్చినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డెరైక్టర్(ఇన్ఫ్రా, ప్రాజెక్ట్ ఫైనాన్స్) వెంకటరమణ్ రాజారామన్ తెలిపారు. హైదరాబాద్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి సంబంధించి ఇన్ఫ్రా రంగ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విండ్, సోలార్ ఎనర్జీ, ఎయిర్పోర్టు, సీపోర్టులకు మాత్రం ఈ ఏడాదిలాగే వచ్చే సారి కూడా స్టేబుల్ రేటింగ్ను ఇచ్చినట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులు చేపట్టిన చాలా కంపెనీలు సీడీఆర్, ఎస్డీఆర్ ప్యాకేజీలకు వెళ్లడటంతో వాటికి నిధుల కొరత కష్టంగా ఉందన్నారు. టోల్ ప్రాజెక్ట్ ట్రాఫిక్లో 37% అత్యధిక వాటా (ఆదాయంలో 13%) కలిగిన కార్ల సంఖ్యలో, అలాగే ఆదాయంలో 54% వాటా(ట్రాఫిక్లో 27%) కలిగిన మల్టీ యాక్సిల్ వెహికల్స్లో వృద్ధి తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో కేంద్రం వచ్చే ఏడాది 60% పైగా ఈపీసీ పద్ధతిలోనే కాంట్రాక్టులను అప్పచెప్పొచ్చని అంచనా వేసింది. ఇక విద్యుత్ రంగ విషయానికి వస్తే డిమాండ్ను మించి యూనిట్ల స్థాపన జరగడంతో టారిఫ్ రేట్లు తగ్గుతున్నాయన్నారు. తగ్గిన విమాన ఇంధన ధరలతో దూర ప్రయాణీకులు ఇప్పుడు విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతుండటంతో ఈ రంగంలో కొంత ఆశావాహక పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ-కామర్స్ పుణ్యమా అని పోర్టులు కూడా ఈ ఏడాది కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేయొచ్చని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. -
ఎన్టీపీసీ విస్తరణకు మార్గం సుగమం
♦ రామగుండం ఎన్టీపీసీకి పర్యావరణ అనుమతులు జారీ ♦ అక్కడ 30 ఏళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగినట్లు ♦ వాతావరణ శాఖ పేర్కొందని ఉత్తర్వుల్లో వెల్లడి ♦ పెరిగినది 1.6 డిగ్రీల్లోపేనని ఎన్టీపీసీ స్పష్టం చేసినట్లుగా వివరణ సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు మార్గం సుగమమైంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో 1,600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు జారీ చేసింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రామగుండంలో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ చర్యలు చేపట్టింది. దీనిపై తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రామగుండంలో వాతావరణం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులపై వాతావరణ శాఖ, ఎన్టీపీసీల వాదోపవాదాలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. రామగుండంలో ఇప్పటికే 2,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్న నేపథ్యంలో.. ఇక్కడ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయని గత 30 ఏళ్లలో రామగుండంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 4 డిగ్రీలు పెరిగాయని, రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద 1951-1980 మధ్య కాలంలో ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలతో 2014 నాటి గరిష్ట ఉష్ణోగ్రతలను పోల్చి ఈ విషయాన్ని నిర్ధారించినట్లుగా ఐఎండీ పేర్కొందని వెల్లడించింది. అయితే ఐఎండీ లెక్కల ప్రకారమే 1951-1980, 1971-2000, 2001-2015 మధ్యకాలంలో 0.3 నుంచి 1.6 డిగ్రీల వరకు మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైందని ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టం చేసినట్లు తెలిపింది. -
స్థలం కోసమే వేచి చూస్తున్నాం
భూములు ఇస్తే రాష్ట్రంలో 2,400 ఎంవీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు రామగుండం, పూడిమడక నుంచి 85% విద్యుత్ సొంత రాష్ట్రాలకే ఎన్టీపీసీ దక్షిణ ప్రాంత ఈడీ ఆర్.వెంకటేశ్వరన్ వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఎన్టీపీసీ ప్రాంతీయ కార్యనిర్వాహక సంచాలకుడు (దక్షిణ) ఆర్.వెంకటేశ్వరన్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పూడిమడకలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ ప్లాంట్ నిర్మించేందుకు పర్యావరణ అధ్యయనం ముగిసిన వెంటనే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. తెలంగాణలో సైతం 4,000 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా తొలివిడతగా రామగుండం ప్లాంట్ విస్తరణ చేపట్టామని, అక్కడ 1600(2ఁ800) మెగావాట్ల సామర్థ్యతో ప్లాంట్లను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థల కేటాయింపులు జరిపితే హామీ మేరకు మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్లను సైతం నిర్మిస్తామన్నారు. విద్యుత్ ప్లాంట్లకు విడిభాగాలు, యంత్రాలు, ఇతర సామగ్రిని సరఫరా చేసే కాంట్రాక్టర్లను గుర్తించేందుకు ఎన్టీపీసీ చేపట్టిన ‘వెండర్ ఎన్లిస్ట్మెంట్’ కార్యక్రమాన్ని వివరించేందుకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రామగుండంలో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్ల నుంచి ఉత్పత్తయ్యే బూడిదను నిక్షిప్తం చేసేందుకు స్థలాన్ని సేకరించాలన్నారు. రామగుండంలో నిర్మిస్తున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ కోసం సింగరేణి బొగ్గును వినియోగించుకుంటామని, పూడిమడకలో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల ప్లాంట్ కోసం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటామన్నారు. తీర ప్రాంతంలో పూడిమడక ప్లాంట్ వుండడంతో బొగ్గు రవాణా వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా తొలి విడతలో 250 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని టెండర్ల ప్రక్రియ ముగింపునకు వచ్చిందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని గట్టు మండలంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పూడిమడక, రామగుండంలో నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి 85 శాతం విద్యుత్ను సొంత రాష్ట్రాలకే కేటాయిస్తామన్నారు. -
మార్చి 10లోగా నిర్ణయించండి!
ముత్తుకూరు(నేలటూరు): నేలటూరు పంచాయతీని ఏ ప్రాంతానికి తరలించాలన్న అంశాన్ని మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకుని చెప్పాలని కలెక్టర్ జానకి కోరారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల మధ్య జీవనం సాగించలేమంటూ కొద్ది మాసాలుగా ఈ పంచాయతీ వాసులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ జానకి, జేపీ ఇంతియాజ్, నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డిలు నాలుగు చోట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు. నేలటూరు పట్టపుపాళెం.. పట్టపుపాళెంలో 386 కుటుంబాలున్నాయని, కొత్తగా పెళ్లైనవారితో కలిపి 460 కుటుంబాలున్నాయని జిల్లా కలెక్టర్ ఇక్కడ జరిగిన సభలో చెప్పారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు గోవిందుపట్టపుపాళెంకు ఎంతమంది తరలివె ళతారు, నెల్లూరు సమీపంలోని ధనలక్ష్మీపురానికి ఎందరు వెళతారనేది మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకొని చెప్పాలన్నారు. దీనిని బట్టి భూములు సేకరించాల్సి ఉంటుందన్నారు. నేలటూరు దళితవాడ.. నేలటూరు దళితవాడ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ 199 కుటుంబాలున్నాయన్నారు. పునరావాసానికి 17 ఎకరాలు అవసరమన్నారు. ధనలక్ష్మీపురం, వావిలేటిపాడు, మాదరాజుగూడూరు ప్రాంతాల్లో ఎక్కడకు తరలివెళతారో నిర్ణయించాలని కోరారు. నేలటూరు గ్రామం.. నేలటూరు గ్రామంలో 263 కుటుంబాలున్నాయని ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి చె ప్పారు. పునరావాసానికి 29.63 ఎకరాలు అవసరమన్నారు. మాదరాజుగూడూరుకు వెళతారా.., మరేదైనా ప్రాంతానికి వెళతారా నిర్ణయించి చెబితే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 650 ఎకరాలకు పరిహారం.. నేలటూరు గ్రామాన్ని తరలించడంతో పాటు పంచాయతీలోని రైతులకు సంబంధించి 650 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సివుందని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్ ఈపూరు శేషారెడ్డి, స్థానికులు యానాటి శ్రీనివాసులురెడ్డి, ఈపూరు గిరిధర్రెడ్డి, పెడకాల శీనయ్య ఈ సమావేశాల్లో మాట్లాడుతూ మూడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. భూములకు పరిహా రం పంపిణీ జరగాలన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై విచారణ జరిపిస్తామన్నారు. జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని, స్థానికులకు 50 శాతం ప్రాధాన్యమిస్తారని హామీ ఇచ్చా రు. పట్టపుపాళెంలో తాగునీరు, మరుగుదొడ్లు, ప్యాకేజీ సమస్యల పరిష్కరించేందకు కృషి చేస్తామన్నారు. -
కరెంటు కష్టాలు మొదలు
పెరుగుతున్న డిమాండ్.. తగ్గుతున్న ఉత్పత్తి రోజుకు 15 ఎంయూలకుపైగా పెరిగిన డిమాండ్ సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గత రెండు వారాల్లో ఏకంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల (ఎంయూల)కుపైగా వాడకం పెరిగింది. విద్యుత్ లభ్యత, వినియోగం మధ్య ప్రస్తుతం మిలియన్ యూనిట్లకు పైనే తేడా కనిపిస్తోంది. దీంతో జిల్లాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కోతలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు రబీకి ఉపక్రమిస్తుండటంతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నెల మొదటి వారంలో 125 ఎంయూలున్న డిమాండ్ ఆదివారం నాటికి 144 ఎంయూలకు చేరింది. ఈ సమయానికి విద్యుత్ లభ్యత 143 ఎంయూలే ఉంది. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తి తగ్గుతోంది. రాష్ట్రంలో 2,810 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. ఇవి సక్రమంగా పనిచేస్తే రోజుకు 70 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం 64 మిలియన్ యూనిట్లకన్నా ఎక్కువ రావడం లేదు. రోజుకు 44 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన విజయవాడ ఎన్టీటీపీఎస్లో దాదాపు పది మిలియన్ యూనిట్ల లోటు కనిపిస్తోంది. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లోనూ ఇదే పరిస్థితి. రోజుకు 26 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సిన ఆర్టీపీపీలో 22 ఎంయూలకు మించడం లేదు. జల విద్యుత్ జాడేలేదు. ఇప్పటికైతే కొనుగోలు విద్యుత్పైనే ఆశలు పెట్టుకున్నారు. వేసవిలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు విపరీతమైన బొగ్గు కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. అన్ని కేంద్రాల్లోనూ ప్రస్తుతం రెండు రోజులకు మించి స్టాక్ లేదు. మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)లోని కొన్ని యూనిట్లను వేసవిలో నిలిపేస్తారు. దీంతో మరింత బొగ్గు కొరత తప్పదు. ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్ వరకు రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గృహ, వాణిజ్య వినియోగం మార్చి ఆఖరు నుంచి రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చి ఆఖరుకు రాష్ట్రంలో విద్యుత్ వాడకం 160 నుంచి 170 ఎంయూలకు చేరే వీలుంది. ప్రభుత్వం దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. నాలుగు జిల్లాల్లో కోతలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పగలు విద్యుత్ కోత విధిస్తున్నారు. కృష్ణా జిల్లాలో గ్రామాల్లో రెండు గంటలు, మండల కేంద్రాల్లో గంట కోతలు అమలవుతున్నాయినెల్లూరు జిల్లా పొదలకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో పగలు మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు కోతలు అమలవుతున్నాయి. {పకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లోనూ కోతలు అమలవుతున్నాయి.గుంటూరు జిల్లాలో రోజూ అర్ధగంట నుంచి గంట వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు. -
సోంపేటకు.. మళ్లీ షాకు!
‘పచ్చ’ ప్రభుత్వం పవర్ దగారక్తమోడిన చోటే మళ్లీ థర్మల్ విద్యుత్ కేంద్రంరగులుతున్న శ్రీకాకుళం.. ఉద్యమ బాట పడుతున్న జనం సాక్షి, హైదరాబాద్: కలత నిద్రలో ఉన్న సోంపేటను చావు దెబ్బ తీసేందుకు సర్కారు సిద్ధమైంది. రక్తపు మరకలు మాయకముందే మరో రణాన్ని పురికొల్పే తెరచాటు వ్యూహాన్ని రచించింది. వారం పది రోజుల్లోనే గతంలో ప్రతిపాదించిన థర్మల్ ప్రాజెక్టు జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, జపాన్లో గుట్టుచప్పుడు కాకుండా అంతకంటే భారీ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో 2,500 మెగావాట్ల ప్రాజెక్టు ప్రతిపాదనకే అక్కడ రక్తపాతం చోటు చేసుకుంది. తాజాగా చంద్రబాబు సర్కారు 4 వేల మెగావాట్ల ప్రాజెక్టు స్థాపనకు రహస్యంగా ఒప్పందాలు చేసుకుంది. జపా న్ పర్యటనలో ఉన్న సీఎం సోంపేట మండలం బారువాలో అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జైకా, నెడో, జపాన్ ఆర్థిక సహకార బ్యాంకులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు అక్కడి సంస్థ ‘సుమితొమొ’తో ఒప్పందం జరిగిందన్న వార్తతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు, ఊరు మార్చి చంద్రబాబు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించారు. నమ్మక ద్రోహం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీలా గ్రామంలో 2008లో 2,500 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ముందుకు రావడంతో అప్పట్లో ప్రభుత్వం 973 ఎకరాలను సోంపేట బీలా ప్రాంతంలో కేటాయించింది. మరో 1500 ఎకరాలను రైతుల నుంచి సేకరించుకునేందుకు అనుమతిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఇదే అదనుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. 2010లో సోంపేటలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో నాగార్జున సంస్థ వెనక్కు తగ్గింది. దీన్ని టీడీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. కాల్పుల సందర్భంగా ఆ ప్రాంతానికొచ్చిన చంద్రబాబు 1107 జీవోను రద్దు చేసే వరకూ పోరాడాలని స్థానికులను పురమాయించారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సర్కారు ఇదే మాట చెప్పింది. ఇప్పుడు అదే ప్రాంతంలో అంతకన్నా మరింత ఎక్కువ సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుమితొమొకే సర్వాధికారాలు.. ప్రభుత్వం తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు ఆర్థిక పెట్టుబడి మొత్తాన్ని జపాన్ సంస్థలే భరిస్తాయి. అంటే ఆ దేశానికి చెందిన సుమితొమొ సంస్థకే ప్రాజెక్టు నిర్వహణను అప్పగిస్తారు. ఆ స్థలం కాదు: ఏపీ జెన్కో సీఎండీ సుమితొమొ ఏర్పాటు చేసే థర్మల్ కేంద్రం కోసం మందస-బారువా మధ్య జాతీయ రహదారికి సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశామని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ తెలిపారు. సోంపేటకు దీనికి సంబంధం లేదన్నారు. దారుణం: మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదననే రద్దు చేస్తామన్న ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకోవడం దారుణం. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాతాం. -
త్వరలోనే థర్మల్ అనుమతుల రద్దు జీవో
సోంపేట : మండలంలోని బీల ప్రాంతం లో నిర్మించదల పెట్టిన థర్మల్ విద్యుత్ కర్మాగారం అనుమతుల రద్దు జీవోను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, నియోజకవర్గ ఎమ్మెల్యే బి.అశోక్ తెలిపారు. ఆదివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలకే ప్రధాన సమస్యగా మారిన థర్మల్ విద్యుత్ కేంద్రం అనుమతులు రద్దు జీవోపై ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథులతో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించినట్టు చెప్పారు. త్వరలోనే జీవో విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు. అలాగే కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వలస కార్మికుల ఉపాధికి కొబ్బరి ఆధారిత తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి పథకంలో కొబ్బరి తోటల అభివృద్ధికి కొబ్బరి మొక్కలు ఇవ్వడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేయడానికి చూస్తున్నట్టు చెప్పారు. సోంపేట ప్రధాన రహదారి విస్తరణ చేపడతామన్నారు. పైలీన్ నష్ట పరిహారం వివరాలను అప్పటి ప్రభుత్వం సక్రమంగా సేకరించకపోవడంతో రైతులకు పరిహారం అందించడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయన్నారు. ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి జి.కె.నాయుడు, నాయకులు పొందల కృష్ణారావు, బి.బాబూరావు, ఆర్.వెంకటరావు, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్కు బొగ్గు దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: సకాలంలో వర్షాలు లేక ఓవైపు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంటే... బొగ్గు కొరత, నాణ్యత లేమి కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ కోతలు అమలు చేయాల్సి వస్తోంది. ఇటు తెలంగాణలో నాణ్యతలేని బొగ్గు సరఫరా అవుతుండటంతో ప్లాంట్లలో తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్ బొగ్గు లేక ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోతోంది. వీటికితోడు ఒకవేళ సాంకేతిక కారణాలతో ప్లాంట్లలో సరఫరా నిలిచిపోతే అనధికారికంగా మరింత కోత విధించాల్సి వస్తోంది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు భారీగా అమలవుతున్నాయి. ఇటు నాణ్యతలేమి.. అటు బొగ్గులేమి! నాణ్యతలేని నాసిరకం బొగ్గుతో (తక్కువ గ్రేడ్) తెలంగాణలోని విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం కంటే తక్కువగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో 65 మెగావాట్ల యూనిట్లలో 40 నుంచి 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 125 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లలో 65 నుంచి 90 మెగావాట్ల విద్యుత్ మాత్రమే వస్తోంది. ఇక 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి 440 మెగావాట్లకు మించడం లేదు. తక్కువ గ్రేడ్ బొగ్గు వస్తుండటంతో.. బాయిలర్లలో అనుకున్న మేరకు ఉష్ణోగ్రత స్థాయి రావడం లేదు. దీంతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుండటంతో కోతలను అమలు చేయాల్సి వస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లో బొగ్గు లేకపోవడంతో వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ), విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)ల్లో ఒక్కో యూనిట్లో ఉత్పత్తి నిలిపివేసి.. నిర్వహణ మరమ్మతులు చేస్తున్నారు. ఫలితంగా మొత్తం 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. -
పరిశ్రమలకు ప‘వర్రీ’
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ సంక్షోభం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు నెలలుగా విధిస్తున్న అధికారి క, అనధికారిక కోతలతో పారిశ్రామిక రంగం కుదేలవగా....గోరు చుట్టుపై రోకలి పోటులా తాజాగా పారి శ్రామిక రంగానికి మళ్లీ అధికారిక కోతలు విధిస్తున్న ట్టు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పడిపోవడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడడంతో 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కోత లు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితం పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోతలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 గం టల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆ సమయంలో పరిశ్రమల్లో కేవలం విద్యుత్ దీపాల వినియోగానికి మాత్రమే అనుమతిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పరిశ్రమల్లోని యంత్రాలను నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్ కోతల విధింపుపై యాజమాన్యాల తో పాటు అటు కార్మికులు నష్టపోయే పరిస్థితి నెల కొంది. ఇప్పటికే జిల్లాలో గల ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈనేపథ్యంలో అధికారిక కోతలు విధించటం వారిని కలవరపెడుతోంది. గృహావసరాలకు తగ్గనున్న కోతలు జిల్లాలోని గృహావసర విద్యుత్ కనెక్షన్లకు కోతలు వేళలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి నూతనంగా అమలు చేసే కోతలను ప్రకటిం చారు. షెడ్యూల్ లోడ్రిలీఫ్ పేరిట విధించే కోతల్లో భాగంగా జిల్లా కేంద్రానికి రోజులో రెండు గంటలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు కోతలు విధించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కోతలను ఉత్పత్తి కేటాయింపుల పరిస్థితులను బట్టి అమలు చేయనున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మెరుగైన సరఫరా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
అన్నీ కోతలే
ఇక రోజూ కరెంట్ కట్.. చేతులెత్తేసిన మంత్రి డీకే శివకుమార్ వారం క్రితం కోతలు ఉండబోవని స్పష్టీకరణ నేడు సాంకేతిక సమస్యల సాకుతో కోతలు సోమవారం నుంచే అమల్లోకి = రెండు నెలల పాటు ఇంతే సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కావాల్సినంత విద్యుత్ అందుబాటులో ఉన్నందున ఈ వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని వారం కిందట సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ చేసిన ప్రకటన ఉత్తుత్తిగా తేలిపోయింది. విద్యుదుత్పాదన తగ్గడంతో పాటు రెండు యూనిట్లలో ఉత్పాదన స్తంభించినందున కోతలు విధించక తప్పడం లేదని సోమవారం ఆయన ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో రెండు గంటల పాటు కోతలు ఉంటాయని తెలిపారు. సోమవారం నుంచే కోతలుంటాయన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రోజుకు 8,522 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదన్నారు. అయితే రాయచూరు, ఉడిపి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని రెండు యూనిట్లు పని చేయడంలేదన్నారు. చక్కెర తయారీ కర్మాగారాల నుంచి అందాల్సిన 650 మెగావాట్ల విద్యుత్ కొన్ని న్యాయ పరమైన సమస్యల వల్ల అందడం లేదన్నారు. దీని వల్ల రాష్ట్రంలో రోజుకు 7,572 మెగావాట్ల విద్యుత్ మాత్రమే లభిస్తోందన్నారు. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నందు వల్లే బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కోతలు అమలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రెండు నెలల పాటు కోతలు అమలవుతాయన్నారు. కోత వేళలను ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు (ఎస్కాంలు) నిర్ణయిస్తాయన్నారు. గత ప్రభుత్వం 15,944 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని, దీనికి అవసరమైన భూమి, నీటితో పాటు పలు రాయితీలు కల్పించిందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ 4,400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు. కొన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు పొంది విద్యుత్ ఉత్పత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. ఇలాంటి కంపెనీలకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందాల్లో కొన్నింటిని రద్దు చేశామని, మిగిలిన వాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ లాభాపేక్షతో విద్యుత్ను పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.