-
51 మంది అభ్యర్థులకు బీఫారం అందజేసిన సీఎం కేసీఆర్
-
తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్
-
బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన కేసీఆర్
Updates.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల ► తెల్లరేషన్కార్డుదార్లుకు త్వరలో కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా ► రైతు బీమా తరహాలోనే కేసీఆర్ బీమా ► కేసీఆర్ బీమాతో 93 లక్షల కుటుంబాలకు లబ్ధి ►జూన్ నుంచి కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తాం ►తెలంగాణ అన్నపూర్ణ పథకం పేరుతో ప్రతి రేషన్కార్డుదారుడికి సన్న బియ్యం అందజేస్తాం ►ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లోనే ఇచ్చే హామీలన్నింటిని అమలు పరుస్తాం ►తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ ►సామాజిక పెన్షన్లు రూ.5వేల వరుకూ పెంచుతాం ►దశవారిగా పెన్షన్లు పెంచుతాం ►పెన్షన్లు ఏడాదికి రూ.500 పెంచుతూ వెళతాం ►ఏపీ సీఎం జగన్ పాలనపై సీఎం కేసీఆర్ ప్రశంసలు ►ఏపీలో పెన్షన్ స్కీం చాలా విజయవంతంగా జరుగుతోంది ►వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంచుతాం ►వికలాంగుల పెన్షన్ మార్చి తర్వాత రూ.5 వేలు ►రైతు బంధు రూ.16 వేల వరుకూ పెంచుతాం ►అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ►సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి ►అర్హులైన లబ్ధిదారులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►అక్రిడేటెడ్ జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్ ►ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షలకు పెంచుతాం ►జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి రూ.15 లక్షల వరుకూ పెంచుతాం ►కేసీఆర్ ఆరోగ్యరక్ష పేరుతో హెల్త్ స్కీమ్ ►జర్నలిస్టులకు ఉద్యోగుల తరహాలో హెల్త్ స్కీమ్ ►హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు ►అగ్రవర్ణ పేదలకు నియోజకవర్గానికి ఒక గురుకులం ►మహిళా స్వశక్తి గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు ►అనాథ పిల్లల కోసం పటిష్టమైన పాలసీ ►ఓపీఎస్ డిమాండ్పై కమిటీ నియామకం.. కమిటీ సిఫార్సుల మేరకు తుది నిర్ణయం ► మేనిఫెస్టోలో లేని 90 శాతం పథకాలను అమలు చేశాం ► మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మిని ప్రకటించపోయినా అమలు చేశాం ► రైతు బంధు మేనిఫెస్టోలో చేర్చలేదు.. అయినా అమలు చేశాం ► సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ కరువుతో అల్లాడింది ► తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రణాళిక ప్రకారం ప్రయాణం సాగింది ► గత రెండు ఎన్నికల్లో మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను అమలు చేశాం: కేసీఆర్ ► అభ్యర్థులకు బీఫామ్ అందించిన సీఎం కేసీఆర్. మంత్రి ప్రశాంత్ రెడ్డి తరఫున బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత. ప్రశాంత్ రెడ్డి మాతృ వియోగం కారణంగా కార్యక్రమానికి గైహర్హారు. ► సీఎం కేసీఆర్ తరఫున బీఫామ్ అందుకున్న గంప గోవర్ధన్. కామారెడ్డి నుంచి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్. ►నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత. మిగిలిన వారికి రేపు బీఫామ్స్ అందించనున్నారు. ►తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడవద్దు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాటు జరిగింది. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడలో అభ్యర్థి మార్పు జరిగింది. ప్రతీ కార్యకర్తలో నేతలు మాట్లాడాలి. ►మనల్ని గెలవలేక కుయుక్తులు పన్నుతున్నారు. సాంకేతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనబెట్టాలి. ప్రతీది తెలుసుకునే పయత్నం చేయాలి తప్ప.. మాకు తెలుసు అనుకోవద్దు. అంతా మాకే తెలుసు అనుకోవద్దు. ఎన్నికల ఘట్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ►అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్. భరత్ కుమార్కు అన్ని విషయాలు చెప్పాలి. ఎలాంటి సమస్యలున్నా ఆయనను సంప్రదించాలి. భరత్ కుమార్ ఎన్నికల కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. బీఫామ్ నింపేటప్పుడు అభ్యర్థులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కో అభ్యర్థికి రెండు బీఫామ్స్ ఇస్తాం. ఈరోజు, రేపు అభ్యర్థులకు బీఫామ్ అందజేస్తాం. పొరపాట్లు జరగకుండా అభ్యర్థులు చూసుకోవాలి. నేడు 51 మందికి బీఫామ్ అందిస్తాం. అన్ని బీ ఫామ్స్ ఇంకా రెడీ కాలేదు. మిగతా వారికి బీఫామ్స్ రెడీ అవుతున్నాయి. అసంతృప్తులు, అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థులదే. ►కొంతమంది చిలిపి పనులు, చిల్లర పనుల వల్లే చాలా దెబ్బతిన్నారు. అలాంటి వ్యక్తులను చాలా మందిని చూశాను. ఎన్నికల సందర్బంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. వారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. ముందుకు సాగాలి. జూపల్లి కృష్ణారావుకు కేసీఆర్ కౌంటర్. ►శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు. అందుకే జాగ్రత్తలు పాటించండి. చివరి రోజు వరకు సమయం ఉందని లైట్ తీసుకోవద్దు. చివరిరోజే అందరూ నామినేషన్ వేయాలని ఇబ్బంది పడకండి. ►ఎన్నికల ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ ►తెలంగాణ భవన్లో 277 మంది కూర్చనే విధంగా ఏర్పాట్లు. ►పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ నేతలతో ఉమ్మడిగా సమావేశం కానున్న కేసీఆర్ ►పార్టీ మేనిఫెస్టోను సవవిరంగా వివరించనున్న కేసీఆర్ ►లంచ్ తర్వాత కూడా కొనసాగనున్న భేటీ. ►సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో సభకు కేసీఆర్ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి. ►తెలంగాణ భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్ ►తెలంగాణ తల్లికి నివాళులర్పించిన కేసీఆర్ ►అభ్యర్థులకు బీఫామ్స్ అందించునున్న కేసీఆర్ ►తెలంగాణ భవన్కు బయలుదేరిన సీఎం కేసీఆర్ ►కేసీఆర్ వెంట మంత్రులు హరీష్రావు, మహమూద్ అలీ. ►కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం. ►తెలంగాణ భవన్ చేరుకున్న మంత్రి కేటీఆర్. ►అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. తాజాగా నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ►నేడు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో బీఆర్ఎస్ తొలి ఎన్నికల సభ. ►హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. ►సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభ. ►గతంలో హుస్నాబాద్ నుంచే బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం. ►రాజధానికి ఈశాన్యంగా ఉండటంతో సెంటిమెంట్ కలిసొచ్చిందని భావన. -
నేడు తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం. అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాల అందజేత. తర్వాత హుస్నాబాద్ సభలో కేసీఆర్ ప్రసంగం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘బీ’.. రె‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో పరుగులు పెడుతున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం మరో కీలక ముందడుగు వేస్తోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్రావు నామినేషన్ల ప్రక్రియకు 18 రోజుల ముందే బీ ఫారాలు అందజేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ఇంతవరకు తమ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే బీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. పార్టీ అభ్యర్థులుగా ఇప్పటికే ఖరారైన వారితో పాటు రాష్ట్ర కార్యవర్గం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలకు సంబంధించిన దిశా నిర్దేశంతో భేటీ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం హుస్నాబాద్లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను సుమారు రెండు నెలల క్రితమే ఆగస్టు 21న కేసీఆర్ ప్రకటించారు. 119 స్థానాలకు గాను 115 మందితో జాబితాను విడుదల చేశారు. వీరిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడారు. దీంతో పెండింగులో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్తో పాటు మల్కాజిగిరికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే భేటీలో 114 మందితో పాటు పెండింగ్లో ఉన్న మిగతా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని సమాచారం. పెండింగ్ స్థానాల్లోనూ అభ్యర్థులు ఖరారు? పెండింగ్లో ఉన్న మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్కు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిల పేర్లు ఖరారయ్యాయి. నాంపల్లి నుంచి ఆనంద్గౌడ్, గోషామహల్ అభ్యర్థులుగా నందకిషోర్ వ్యాస్ పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా వారికి పార్టీ నుంచి ఇంకా సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో ప్రకటించిన 114 మందిలో ఆలంపూర్ అభ్యర్థితో సహా ఒకరిద్దరి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతోంది. అసంతృప్తి సద్దుమణగక పోవడం, గెలుపు అవకాశాలు, బీసీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు ఉంటుందని భావిస్తున్నారు. మేనిఫెస్టో సిద్ధం ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, విపక్షాల ఎన్నికల హామీలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రైతులు, మహిళలు, యువత, దళిత, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోకు రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనాకర్షక హామీలతో కూడిన మేనిఫెస్టోను ఆదివారం కేసీఆర్ విడుదల చేయనున్నారు. రైతుబంధు, ఆసరా పింఛను మొత్తం పెంపు, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం/ భారీ సబ్సిడీతో ఇవ్వడం, జర్నలిస్టులకు పింఛను వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. ప్రచార సభలు, సమన్వయంపై దిశా నిర్దేశం కేసీఆర్ ఆదివారం నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేశారు. పోలింగ్ తేదీ నాటికి ఆయన సుమారు వంద సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు 54 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలో బహిరంగ సభల నిర్వహణ, జన సమీకరణ, సమన్వయం, ప్రచార అంశాలు తదితరాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని తెలిసింది. విపక్ష పార్టీల ఎన్నికల వ్యూహాలు, ప్రచారం తదితరాలపై కూడా పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం. కాగా ఆదివారం సాయంత్రం హుస్నాబాద్లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో మేనిఫెస్టోలోని అంశాలను తొలిసారిగా ప్రజల ముందు పెట్టనున్నారు. లక్ష మందితో సభ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 20 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను కొనసాగిస్తూ తొలి సభను హుస్నాబాద్లో నిర్వహించనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్లు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్కు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. -
స్పీడ్ పెంచిన కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో రేపు(ఆదివారం) బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ రేపు మధ్యాహ్నం 12:15 గంటలకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇక, అంతకుముందు బీఆర్ఎస్ మేనిఫెస్టోపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ఉంటుందన్నారు. ►కాగా.. రైతుబంధు, ఆసరా పింఛన్ల పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని పెంచడంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ల మొత్తాన్ని పెంచడంతో పాటు రైతులందరికీ పింఛన్ ఇవ్వాలనే ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తయినట్లు తెలిసింది. రైతుబంధు, సామాజిక పింఛన్లు ఎంత మేర పెంచాలనే అంశంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణ యం తీసుకోవాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ►ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీకి ఐదు రోజుల ముందు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. అయితే, చాలా తక్కువ వ్యవధి కారణంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయినట్లు ఆ తర్వాత పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి వీలైనంత త్వరగా మేనిఫెస్టో విడుదల చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. విపక్షాల మేనిఫెస్టోలపై నజర్.. గతంలో యువత, రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారంటీల పేరిట ఎన్నికల హామీలను ప్రకటించింది. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారెంటీలు ఫలితాన్ని ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారంలో పెడుతోంది. ఎన్నికల మేని ఫెస్టోలో మరిన్ని జనాకర్షక పథకాలను కూడా చేర్చే అవకాశముంది. అన్ని పథకాల మొత్తాలు పెంపు? బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1,000కి పెంచింది. వితంతువులు, వృద్ధులు తదితరులకు ఇచ్చే ఈ పింఛన్ను తర్వాత రూ.2,016కు పెంచింది. కాగా ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచే అవకాశముందని, ఈ మేరకు మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు తెలుస్తోంది. వికలాంగుల పింఛన్ రూ.1,500తో ప్రారంభమై ప్రస్తుతం రూ.4,016కు చేరింది. ►ఈ మొత్తాన్ని కూడా మరో రూ.1,000 మేర పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రైతుబంధు పథకం కింద ఏటా రెండు విడతల్లో కలుపుకొని ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తుండగా, దీనిని రూ.12 వేలకు పెంచేలా ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే కేసీఆర్ కిట్ పథకం కింద ఇస్తున్న రూ.12 వేలను రూ.15 వేలకు పెంచాలనే ప్రతిపాదనపై సీఎం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మేనిఫెస్టో రూపకల్పన కసరత్తులో పాల్గొంటున్న నేతలు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న మొత్తాన్ని కూడా పెంచడం ద్వారా విపక్షాల దూకుడుకు అడ్డకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. -
ఎన్నికల కదన రంగంలోకి గులాబీబాస్
-
మోదీ ఏజెంట్లుగా.. గవర్నర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంటే.. గవర్నర్లు ఆయన ఏజెంట్లుగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్రంగా విమర్శించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న దాసోజు శ్రవణ్, జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిన కుర్ర సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే, వారు రాజకీయ పార్టీలో ఉన్నారంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు అన్ ఫిట్ అనేది ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం.. ‘రాజకీయాల్లో ఉన్న వారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అనర్హులన్న తమిళిసై.. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో సర్కారియా కమిషన్ సూచనలు తుంగలో తొక్కి తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసిన అభ్యర్థులు అన్ ఫిట్ అని ఆమె అంటున్నారు. ప్రధాని మోదీ లేదా గవర్నర్ తమిళిసై.. ఎవరు అన్ ఫిట్ అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. దేశంలో అందరికంటే అన్ ఫిట్ మంత్రి కిషన్రెడ్డి. గవర్నర్ పదవికి తమిళిసై అన్ ఫిట్. ఇద్దరు బలహీనవర్గాల వారిని మండలిలోకి తెస్తే మీకేం బాధ? వారికి రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే తప్పేంటి? మీకు రాజకీయ పార్టీతో సంబంధం లేదా? గవర్నర్గా ఉంటూ బీజేపీ నాయకురాలిగా పని చేయడం లేదా? మీకు వర్తించనిది ఇతరులకు ఎలా వర్తిస్తుంది?..’ అంటూ కేటీఆర్ నిలదీశారు. పైనుంచి అందిన ఆదేశాల మేరకే.. ‘బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య, రంజన్ గగోయ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు పలువురు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను పైనుంచి అందిన ఆదేశాల మేరకు గవర్నర్ తిరస్కరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు బదులు మోదీ ఏజెంట్లదే పెత్తనమైతే పరిస్థితి ఏంటి? గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను పని చేయనీయడం లేదు. వలస పాలనకు చిహ్నమైన గవర్నర్ పదవి ఇంకా అవసరమా? నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తాం. గవర్నర్ కోరిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో మళ్లీ పంపుతాం..’ అని చెప్పారు. తెలంగాణపై ప్రధాని మోదీ విషం ‘ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ తన డీఎన్ఏతో పాటు నరనరాన విషం నింపుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారు. పార్లమెంటుతో పాటు బహిరంగ సభ వేదికలపై తెలంగాణ పుట్టుక, అస్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో అమృత్కాల్ సమావేశాల్లో ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అంటూ మోదీ అజ్ఞానంతో చేసిన విషపూరిత వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల త్యాగాన్ని, ఉద్యమాన్ని కించపరిచేలా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి పుట్టగతులు ఉండవు. తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానించిన ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి..’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాలమూరులో పాప పరిహారం చేసుకోవాలి ‘దేశంలో అత్యంత అవినితి ప్రధాని మోదీ. అక్టోబర్ 1న పాలమూరుకు వస్తున్నారు. మోదీకి అక్కడ కాలు పెట్టే నైతిక హక్కు లేదు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా తేల్చాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరినా ప్రధాని స్పందించలేదు. ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 575 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ను ఆమోదిస్తున్నారో లేదో మహబూబ్నగర్ గడ్డపై మోదీ స్పష్టం చేయాలి. బీజేపీ జాతీయ పార్టీ కాదు, తెలంగాణ జాతిని మోసం చేసిన పార్టీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదించకుండా కొర్రీలతో ఇబ్బందులు పెట్టారు. ఓట్ల వేట కోసం రాష్ట్రానికి వస్తున్న మోదీ పాప పరిహారం చేసుకుని పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి. లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవు..’ అని మంత్రి అన్నారు. ‘జమిలి ఎన్నికలు మోదీ డైవర్షన్ రాజకీయాలకు నిదర్శనం. ఆయన జిమ్మిక్కుల్లో భాగం. నియోజవకర్గాల పునర్విభజనలో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగితే భావసారూప్య పార్టీలతో చర్చించి గళమెత్తుతాం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల్లోకి రావడం, పోవడం అత్యంత సహజం. రేపు కాంగ్రెస్ నుంచి కూడా మా పార్టీలోకి నేతలు రావొచ్చు. ఇతర పార్టీల్లోకి మా పార్టీ నేతలు వెళ్లడానికి అంతగా ప్రాధాన్యత లేదు..’ అని కేటీఆర్ అన్నారు. -
115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితా.. సిట్టింగులకే సై!
టికెట్ దక్కని సిట్టింగ్లు.. ఆత్రం సక్కు (ఆసిఫాబాద్–ఎస్టీ),రాథోడ్ బాపూరావు (బోథ్–ఎస్టీ), రేఖానాయక్ (ఖానాపూర్–ఎస్టీ), బేతి సుభాష్రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ఘన్పూర్–ఎస్సీ), రాములు నాయక్ (వైరా–ఎస్టీ), చెన్నమనేని రమేశ్బాబు (వేములవాడ–జనరల్) వీరి స్థానంలో టికెట్లు పొందినవారు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), బానోత్ మదన్లాల్ (వైరా), చల్మెడ లక్ష్మీకాంతరావు (వేములవాడ). ఏడుగురు మహిళలకు టికెట్లు ఎమ్మెల్యేలు సబితా (మహేశ్వరం), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), గొంగిడి సునీత (ఆలేరు), బానోత్ హరిప్రియనాయక్ (ఇల్లందు)తోపాటు కోవ లక్ష్మి (ఆసిఫాబాద్), బడే నాగజ్యోతి (ములుగు),లాస్య నందిత (కంటోన్మెంట్)కు టికెట్ ఇచ్చారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. సిట్టింగ్లకే ప్రాధాన్యమిస్తూ, పెద్దగా మార్పు చేర్పులేవీ లేకుండానే.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను.. నాలుగు సీట్లు మినహా మిగతా 115 నియోజకవర్గాల టికెట్లను ప్రకటించారు. మిగతా నాలుగు చోట్ల స్థానిక పరిస్థితులను మరోసారి మదింపు చేశాక అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తోపాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు తెలిపారు. సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితుల మేరకు ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా.. 4 చోట్ల కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మూడు చోట్ల వారసులకు అవకాశమిచ్చారు. అభ్యర్థుల విశేషాలు ఇవీ.. ► తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో నలుగురు.. అనిల్ జాదవ్ (బోథ్), భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ (ఖానాపూర్), లాస్య నందిత (కంటోన్మెంట్), కల్వకుంట్ల సంజయ్ (కోరుట్ల) తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ► చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వారసులకు టికెట్ ఇవ్వాలని కోరినా.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్కు మాత్రమే అవకాశమిచ్చారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మృతి చెందడంతో.. ఆయన కుమార్తె లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. ► దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పోటీ చేయనున్నారు. ► గత ఎన్నికల్లో ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో.. ఆమె గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ నిరాకరించారు. ► పౌరసత్వ వివాదం నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబును తప్పించి.. చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు అవకాశం ఇచ్చారు. ► మెదక్ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్రెడ్డిని తప్పించి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం ఇస్తారని భావించారు. అయితే ఇద్దరూ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టడంతో పెండింగ్లో పెట్టారు. ఏకాభిప్రాయం సాధించాకే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించనున్నారు. ► నాలుగైదు రోజులుగా చర్చనీయాంశంగా మారిన జనగామ స్థానం కూడా పెండింగ్లో పడింది. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరును ఖరారు చేశారని.. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఒత్తిడి నేపథ్యంలో పెండింగ్లో పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ముత్తిరెడ్డి సోమవారం ఉదయం టికెట్ల ప్రకటనకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలసి.. తనకే టికెట్ వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ► ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో ఎలాంటి పొత్తు లేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం పార్టీతో మాత్రం స్నేహపూర్వక పోటీ కొనసాగుతుందని ప్రకటించారు. ఎంఐఎం ప్రాబల్యం కలిగిన నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను పెండింగ్లో పెట్టారు. ముందుగా నిర్ణయించిన సమయానికే ► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఇతర పార్టీల కంటే ముందే ప్రకటిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించుకున్న సమయానికే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. సోమవారం మధ్యా హ్నం 2.30 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి తదితరులు వచ్చారు. తాండూరు టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక మంత్రి హరీశ్పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. మైనంపల్లికి ఇష్టముంటే పోటీ చేస్తారని, లేదంటే వారేవాళ్లు పోటీ చేస్తా రని పేర్కొన్నారు. ఇక మైనంపల్లి వ్యాఖ్యలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. మంత్రి హరీశ్రావుకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. కాగా తాను ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పట్నం మహేందర్రెడ్డి మీడియాకు చెప్పారు. -
KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్.. హ్యాట్రిక్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న గులాబీ బాస్.. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల జాబితా.. అదీ వందకు పైనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్లే 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించారాయన. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఏడు సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు(నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థలను ప్రకటించలేదు). ‘‘2023 ఎన్నికలకు పెద్దగా మార్పుల్లేవ్. మంచి ముహూర్తం ఉండడంతోనే అభ్యర్థుల్ని ప్రకటించాం’’ అని ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాకు తెలియజేశారు. పంచమి తిథి కావడంతో.. ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
వెంకటేశ్కు పెద్ద పదవి గ్యారెంటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 18 ఏళ్లకే గ్రామ సర్పంచ్ అయ్యి.. మరోవైపు పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ను తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పొగడ్తలతో ముంచెత్తారు. కండువా కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా స్వాగతించడమే కాకుండా.. పెద్ద పదవి గ్యారెంటీగా ఇస్తామని తెలంగాణ భవన్ నుంచి హామీ ఇచ్చారాయన. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఇతర పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్లో ఇవాళ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వెంకటేశ్ను గత వారమే కలిశాను. తన రాజకీయ జీవితం ఏంటి అని అడిగాం. 18 ఏళ్లకే సర్పంచ్ అయ్యాను అని చెప్పాడు. పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నడు. కచ్చితంగా బీ ఆర్ ఎస్ అండ మీ అండ మీకు ఉంటుంది. వుప్పల వెంకటేష్ గ్యారెంటీగా పెద్ద పదవి ఇస్తామని హామీ ఇచ్చారాయన. తలకొండపల్లి కి వస్తాను., మీ సత్తా చూస్తాను అంటూ ఉప్పల వెంకటేశ్ను ఉద్దేశించి కేటీఆర్ చమత్కరించారు. కేటీఆర్ హాట్ కామెంట్లు బీఆర్ఎస్లో టికెట్ కేటాయింపులపైనా కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘ఒక నియోజకవర్గంలో ఎందరో టికెట్లు ఆశిస్తారు. కానీ, అందరికీ ఇవ్వలేం. ఎవరో ఒక్కరికే టికెట్ ఇస్తారు. ఒకటే నియోజకవర్గం, ఒకటే సీటు, ఒకటే బీఫామ్. ఆశలు, విబేధాల్ని పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయండి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని అందరూ సమిష్టిగా గెలిపించుకోవాలి. కేసీఆర్ను హ్యాట్రిక్సీఎంను చేయాలి అని బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది సంక్షేమ ప్రభుత్వం ‘‘రాష్ట్రంలో 9ఏళ్లుగా ఇంటింటికి సంక్షేమ పథకం ఇస్తున్నాం. పుట్టిన బిడ్డ నుంచి,వృద్ధుల వరకు అందరికీ సంక్షేమం అందుతోంది. కేసీఆర్ కిట్, చదువులకు ఆర్ధిక సాయం, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సొంత భూమి కలిగిన వారికి గృహలక్ష్మి, ఉద్యోగాలు,రైతు బంధు, చేనేత మిత్ర, గొర్రెల పంపిణీ ఇలా అనేక పథకాలు అందిస్తున్నాం. 76 యేళ్లు అయ్యింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇన్నేళ్లలో ఎందుకు గత ప్రభుత్వాలు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు’’ అని కేటీఆర్ మాట్లాడారు. రేవంత్పై సెటైర్లు ‘‘ప్రతిపక్ష పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు. 4వేల పెన్షన్లు, 25 గంటల కరెంట్ ఇస్తాం అంటున్నారు. ఇన్నేళ్లు ఎందుకు ఇవ్వలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఒకాయన అడుక్కుంటున్నడు. బీజేపీ అధికారం లోకి వస్తె కేసిఆర్ పథకాలు కొనసాగిస్తాం అని బీజేపీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ పథకాలు కొనసాగించాకా మీరెందుకు. సంపద పెంచాలి,పేదలకు పంచాలి మా నినాదం. కానీ సంపద పెంచుకొని, వెనక వేసుకోవాలి అనేది ప్రతిపక్షాల తీరు. సంచులు మోసినా వాడు కూడా నీతులు పలుకుతున్నాడు. సంచులు మోసి, జైల్లో చిప్ప కూడు తిన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. పీసీసీ పదవి అదొక పదవా? ప్రైమ్ మినిస్టర్ పదవి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. వీళ్లకు అభ్యర్థులే లేరు, వీళ్లకు ఓటు ఎలా వేస్తారు?. కేసీఆర్నే జైలుకు పంపుతరా? మహబూబ్ నగర్ ను సస్యశ్యామలం చేస్తాం. కల్వకుర్తి ప్రజలు చాలా తెలివి గల వారు. మీతో పెట్టుకున్నోడు ఎవడు బాగు పడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బాగా చెప్తున్నారు. కాంగ్రెస్ హయం లో కరెంట్ కోసం కష్టపడే వాళ్ళం. వీళ్ళను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే. వీళ్ళను నమ్మకండి. బీజేపీ అధికారం లోకి వస్తే అందరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తాం అన్నాడు మోదీ. పడ్డయా?. కానీ కేసిఆర్ రైతు బంధు, పెన్షన్లు, ఇలా అనేక పథకాలు అమలు చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణ కు ఉండాలి, ఢిల్లీ నేతల మాటలు పట్టుకుంటే మాటిమాటికీ ఢిల్లీ వెళ్ళాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి, ఢిల్లీ గులాంగురికి మధ్య జరుగుతున్న పోటీ. బీజేపీ ది హిందు ముస్లిం మధ్య చిచ్చు పెట్టడమే పని. కేసీఆర్ ను జైలుకు పంపుతాం అన్నవాడే షెడ్డుకు పోయాడు. కేసీఆర్ ఎందుకు జైలుకు పంపుతావు?. కళ్యాణ లక్ష్మీ, రైతు వందుజ్ ఆడబిడ్డ పుడితే నగదు ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా?. మీ నియోజకవర్గ అభివృద్ది కి మాది బాధ్యత అని ప్రజలకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన వారికి మద్దతుగా నిలవాలి గెలిపించుకోవాలి. మహబూబ్ నగర్ లో 14 స్థానాలు బీ ఆర్ ఎస్ గెలవాలి అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి కేటీఆర్ చెప్పారు. -
‘దశాబ్ది’ స్కాన్!
మూడో వంతు నియోజకవర్గాలపై నిశిత పరిశీలన.. ఓ వైపు మారుతున్న రాజకీయ పరిణామాలు.. మరోవైపు దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇలాంటి కీలకమైన సమయంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇటీవలి వరకు జరిగిన ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించిన తీరు ఆధారంగా ఎమ్మెల్యేలపై ఓ అంచనాకు వచ్చిన ఆయన.. కొందరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహిస్తారన్నది పరిశీలించి.. పనితీరు మార్చుకోనివారిపై వేటు వేయాలని, తీవ్ర అవినీతి ఆరోపణలున్న వారిని పక్కనపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడో వంతు నియోజకవర్గాల్లో నిశిత పరిశీలన జరుపుతున్నారని అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. ఈ కార్యక్రమాన్ని ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. 21రోజుల పాటు సాగే దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు మమేకమయ్యే తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కేటాయించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్, మేలో రెండు నెలల పాటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరిగిన విధానం, ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ ఇన్చార్జులు కేసీఆర్కు నివేదికలు అందజేశారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ యంత్రాంగాన్ని కలుపుకొనిపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై ఓ అంచనాకు వచ్చారని సమాచారం. ఈ క్రమంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణలోనూ ఎమ్మెల్యేల తీరును మదింపు చేసి.. టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అనుభవంతో.. 2020లో గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలికి జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ కార్పోరేటర్లపై వ్యతిరేకత ఉందని సర్వేలో వెల్లడైనా.. సిట్టింగులకే టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత మొగ్గు చూపారు. కానీ ఆ వ్యతిరేకతకు తోడు మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు కూడా.. పలువురు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేల ఫలితాలు తేల్చాయని, అదే తరహాలో నిఘా సంస్థల నుంచి కేసీఆర్కు నివేదికలు అందాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆత్మీయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేయాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. ఇక పార్టీలోనే ఉంటూ తలనొప్పులు సృష్టిస్తున్నవారు, అవకాశాలు దక్కినా అసంతృప్త స్వరం వినిపిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నవారిపై కేసీఆర్ దృష్టి సారించారని.. అవసరమైతే వారిని బయటికి పంపాలని భావిస్తున్నారని సమాచారం. 40 పర్సెంట్ కమిషన్ వివాదంతో కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. సుమారు 40 నియోజకవర్గాలపై ఫోకస్! నకిరేకల్, ఇల్లెందు, తాండూరు, పాలేరు, బెల్లంపల్లి, తుంగతుర్తి, జనగామ, స్టేషన్ ఘన్పూర్, జహీరాబాద్, నాగార్జునసాగర్, ఎల్లారెడ్డి, ఉప్పల్, కొత్తగూడెం, ఖానాపూర్, జగిత్యాల, హుస్నాబాద్, షాద్నగర్, మహబూబాబాద్, కోదాడ, వరంగల్ తూర్పు, మెదక్, అలంపూర్ సహా సుమారు 40 నియోజకవర్గాల్లో పార్టీ, ఎమ్మెల్యేల పనితీరును కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్ట బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పలుచోట్ల టికెట్ కోసం తీవ్ర పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల స్థానిక నేతల అసంతృప్తి, ఇంకొన్ని చోట్ల అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయని అంటున్నాయి. మొత్తం నియోజకవర్గాల్లో మూడో వంతు చోట్ల టికెట్ల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. 119 సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీఆర్ఎస్కు 103 మంది సభ్యులు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశమిస్తామని పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ 103 మందిలో 46 మంది వరుసగా రెండుసార్లు, మరో 18 మంది మూడు కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఈ క్రమంలో సహజంగానే వారిపై నెలకొనే ప్రతికూలత.. పార్టీ విజయావకాశాలను దెబ్బతీయకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస్తం..
-
నేను ప్రతీది లోతుగా గమనిస్తున్నా..
-
105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస్తం.. లేదంటే మునుగుతం
పదేళ్లలోనే.. వందేళ్ల అభివృద్ధి జూన్ 2 నుంచి 21 వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలి. ఈ దశాబ్ది కాలంలో శతాబ్ది కాలంలో చేయాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేశాం. బతుకమ్మ పండుగను తలపించే రీతిలో ఈ ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించడంతోపాటు అన్ని అంశాలను ప్రజలకు వివరించాలి. మిషన్ కాకతీయ విజయాన్ని చాటేలా కట్ట మైసమ్మ పండుగలు చేయాలి. రైతు వేదికలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ఆసరా పింఛన్ల లబ్ధిదారులతో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. సంప్రదాయ కళాకారులతో ఊరేగింపులు, కవి సమ్మేళనాలు నిర్వహించాలి. వీటికి ఎమ్మెల్యేలు నాయకత్వం వహించాలి. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నను ఆహ్వానించాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తున్నామనడంలో ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. కచ్చితంగా 95 నుంచి 105 స్థానాలు గెలవబోతున్నాం. నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు అందరూ పనిచేస్తే.. కచ్చితంగా ప్రతీ ఒక్కరికి 50 వేల కన్నా అధిక మెజారిటీ వస్తుంది..’’ అని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు చెప్పుకోలేక పోవడం మైనస్గా మారిందన్నారు. వందకు వంద శాతం సిట్టింగ్లకు మళ్లీ టికెట్లు ఇవ్వాలన్నదే తన అభిమతమని.. జాగ్రత్తలు చెప్పినా సర్దుకుపోకుండా నష్టం చేసుకుంటే తాను మాత్రం ఏం చేయగలనని వ్యాఖ్యానించారు. ఏమరుపాటుగా ఉంటే అందరమూ మునుగుతామని, పార్టీ మునిగితే అందరూ నష్టపోతారని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్న ఈ భేటీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఎమ్మెల్యేల పనితీరును చాలా నిశితంగా గమనిస్తున్నా. వారు ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేక విఫలమవుతున్నారు. ఎమ్మెల్యేలు పిల్లల కోడిలా ఉంటూ అందరినీ కాపాడుకోవాలి. అంశాల వారీగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో మన శక్తిని ఏకీకృతం చేసుకునేలా ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కీలక నేతలందరినీ కలుపుకొని ఐక్యతను చాటాలని పదే పదే చెప్తున్నాం. చిల్లర మల్లర విషయాల మీద రాజకీయాలు చేయకూడదు. కుత్సిత మనసుతో రాజకీయాలు ఫలితాన్ని ఇవ్వవు. కేవలం పార్టీ ఇచ్చే కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఎమ్మెల్యేలు సొంత కార్యక్రమాలకు కూడా ప్రణాళికలు వేసుకోవాలి. కులం, మతం ఎజెండాగా ఏ పార్టీ కూడా విజయం సాధించదు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నాం. అదే మన విజయ రహస్యం. బుధవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సబిత, పువ్వాడ అజయ్, నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ, నామా, శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, కేకే, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావు, తలసాని చేసింది చెప్పుకుందాం.. బోగస్ గుజరాత్ మోడల్తో నరేంద్ర మోదీ భారతదేశాన్ని మోసం చేశారు. కానీ మనం పదేళ్లలో అద్భుత ప్రగతిని సాధించాం. అందువల్లే దేశం తెలంగాణ మోడల్ను కోరుకుంటోంది. మనం ఆచరించిన మోడల్ వల్లే మహారాష్ట్రలోనూ ప్రజలు మనకు బ్రహ్మరథం పడుతున్నారు. దేశంలో ఎవరూ చేయని రీతిలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మనం ఆదుకునేందుకు ముందుకు వచ్చాం. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామంటూ దేశంలో ఏ ప్రభుత్వం చేయనిది ఆచరణలో చూపిస్తున్నాం. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలి. వడగళ్లు, అకాల వర్షాలతో జరిగే నష్టాన్ని తగ్గించేందుకు మార్చి 31లోగా వరికోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యపరచాలి. వజ్రపు తునకలా తెలంగాణ.. ఊరూరా ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని వజ్రపు తునకలా మార్చుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో.. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవాల షెడ్యూల్ను గురువారం జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రకటిస్తాం. షెడ్యూల్ను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో ప్రభుత్వ విభాగంలో.. మన ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు వివరించేలా బ్యానర్లు, పోస్టర్లు కట్టి కార్యక్రమాలు నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలను భాగస్వాములను చేయాలి. విజయగాథలకు సంబంధించిన డాక్యుమెంటరీలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. మన ప్రాంత వైతాళికులను గుర్తించి గౌరవించాలి. భాగ్యరెడ్డివర్మ, బద్దం ఎల్లారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, సురవరం ప్రతాపరెడ్డి ఇలా ఎక్కడికక్కడ వైతాళికులను గుర్తించి వారిని కీర్తించాలి..’’ అని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవరావు స్వాగతోపన్యాసం చేయగా.. మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరించారు. తెలంగాణ వైభవాన్ని చాటేందుకు దశాబ్ది ఉత్సవాలను సువర్ణావకాశంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు. నియోజకవర్గంపై అవగాహన లేకుంటే ఎట్లా? తెలంగాణ భవన్లో సమావేశం సందర్భంగా.. జనగాం నియోజకవర్గంలో రైతు వేదికల సంఖ్య గురించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, తుంగతుర్తిలో గురుకుల కాలేజీల సంఖ్య గురించి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ను కేసీఆర్ ప్రశ్నించారు. వారు సమాధానం చెప్పడానికి తడబడగా.. ‘‘ఎమ్మెల్యేలకు నియోజకవర్గంపై సమగ్ర అవగాహన ఉండాలి. లేకుంటా ఎట్లా? మనం ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి. లేదంటే బయటి వారు చెప్పే అబద్ధాలను ప్రజలు నిజాలుగా నమ్మే అవకాశం ఉంది..’’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
ఎల్లుండి బీఆర్ఎస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక సమావేశం ఎల్లుండి(బుధవారం) జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఈ కీలక భేటీకి హాజరు కానున్నారని తెలిపింది. -
Operation Kaveri: సూడాన్ నుంచి మరో 754 మంది రాక
న్యూఢిల్లీ/కైరో: సూడాన్లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు. వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలిపింది. మరోవైపు సూడాన్లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది. -
ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి: సీఎం కేసీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్లు సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలో వందకుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తందని ధీమా వ్యక్తం చేశారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జెడ్పీచైర్మన్లు, ఎంపీలు ఇంచార్జీలుగా నియమించాలని తెలిపారు. మూడు, నాలుగు నెలల్లో ఇంచార్జీల నియామక ప్రక్రియ పూర్తికావాలని చెప్పారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. క్యాడర్లో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని తెలిపారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ను కూడా నడపవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పలు తీర్మానాలను చర్చించి, ఆమోదించింది. ►‘ప్రతి రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం. ►దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా ►విదేశాలకు దేశీయ ఆహారోత్పత్తుల ఎగుమతి. ►దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు. ►దేశంలో బీసీ జనగణన జరపాలి. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రణాళికలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్ -
భారత్ పరివర్తన్ మిషన్గా బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం భారత్ రాష్ట్ర సమితి ‘భారత్ పరివర్తన్ మిషన్’గా పని చేస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మే 7 నుంచి జూన్ 7 వరకు నెల రోజుల్లో మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు వేస్తామని, జూన్లో 10 లక్షల నుంచి 12 లక్షల మంది రైతులతో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. నాగపూర్, ఔరంగాబాద్లో బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మహారాష్ట్రను తీర్చిదిద్దుతామని, ఓట్లు వేస్తేనే ఎవరైనా సహాయం చేయగలరు అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశ సంస్కరణ లక్ష్యంతో ముందుకు.. ‘దేశంలో ఎన్నో పార్టీలు, ఎందరో రాజకీయ నాయకులు, ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలున్నా.. దేశ పరిస్థితులపై అవగాహన ఉన్నా సరైన రీతిలో స్పందించడం లేదు. మనది వింత దేశం, ప్రజలు కూడా వింతైన వారు. మనం కుట్రలో ఇరుక్కుపోవడానికి గల కారణాలను చర్చించాలి. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించలేదు. భారతదేశాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో అపూర్వ సంపద ఉన్నా నీరు, విద్యుత్తు వంటి సమస్యలను తెలంగాణ మినహా మహారాష్ట్ర సహా యావత్ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆనకట్టల ద్వారా నీటిని బంధించి, తాగునీరు, సాగు నీరు ఇవ్వడం ద్వారా రైతులు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది..’అని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎందుకు? ‘మహారాష్ట్ర పుణ్యభూమిలో గోదావరి, కృష్ణా, వెన్గంగ, పెన్గంగ, వార్ధా, మూల, ప్రవర,పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు పుడుతున్నాయి. అయినా ఔరంగాబాద్లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. అకోలాలోనూ ఇలాంటి పరిస్థితే ఉండాల్సిన ఆగత్యం ఎందుకు? మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నాం. అవినీతి నేతలే దివాళా తీస్తారు.. తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ ఆర్థికంగా బాగానే ఉంది. మహారాష్ట్ర కంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది? అవినీతికి పాల్పడే నాయకులే దివాళా తీస్తారు.ౖమహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం..’అని తెలిపారు. ఫడ్నవీస్ నుంచి జవాబు లేదు ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఏం పని అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్కు వెళ్లిపోతామని చెబితే ఇప్పటివరకు ఫడ్నవీస్ నుంచి సమాధానం లేదు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు? అని ప్రజలు ప్రశ్నించుకోవాలి..’అని కేసీఆర్ అన్నారు. పెద్ద సంఖ్యలో చేరికలు బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర నేతల్లో ఆల్ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఒబీసీ వెల్ఫేర్ సంఘ్ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్ రావ్ అంగళ్వార్, వంచిత్ ఆఘాడీ ఉమెన్, చంద్రాపూర్ బంజారా ఉమెన్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మ హాన్ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ.బల్బీర్ సింగ్ గురు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సింగ్ సలూజా, గడ్చిరోలి మాజీ జెడ్పీ చైర్మన్ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యులు సంజయ్ చర్దుకె, యువ స్వాభిమాన్ పార్టీ రజురా జిల్లా అధ్యక్షుడు సూరజ్ థాకరే, చంద్రాపూర్ డీసీసీ అధ్యక్షుడు దిలీప్ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్ అధ్యక్షుడు సంతోష్ కులమతే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్ బల్లార్పూర్ విభాగ్ అధ్యక్షుడు ప్రశాంత్ గడ్డల, భారత్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు శంకర్, యువ స్వాభిమాన్ పార్టీ కార్యదర్శి ఆదిత్య భాకె, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్ భాసర్ బీఆర్ఎస్లో చేరారు. చంద్రాపూర్ డీసీసీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్ ఐటీటీయూసీ అధ్యక్షుడు నర్సింగ్ రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్ ప్రధాన కార్యదర్శి రాజేషం పుల్లూరి, తేలి సమాజ్ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరమల్ ముంజమ్, శివసేన పార్టీ రాజుర పట్టణ అధ్యక్షుడు రాకేష్ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెరెన అజ్మీరా, యువ స్వాభిమాన్ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్ చన్నే, చంద్రాపూర్ డ్రైవర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వ్యవస్థాపకుడు అభిలాష్ సింగ్తో పాటు మరో నలభై మందికి పైగా నేతలు కూడా బీఆర్ఎస్లో చేరారు. -
నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: ఏడాది చివరలో జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఈ ఏడాది మాత్రం కేవలం సర్వసభ్య సమావేశానికే పరిమితం కావాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, వరికోతలు, అకాల వర్షాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో ప్రతినిధులతో తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సుమారు 6వేల మంది ప్రతినిధులతో టీఆర్ఎస్... బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించినా సర్వసభ్య సమావేశానికే పరిమితం చేశారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు జిల్లా పరిషత్, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్రకార్యవర్గంతోపాటు జిల్లా శాఖ అధ్యక్షులు కలుపుకొని మొత్తంగా 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ జాతీయ పారీ్టగా మారినా సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. గురువారం ఉదయం 10 గంటలకల్లా తెలంగాణ భవన్కు చేరుకోవాలని వారం క్రితమే ఆహ్వానాలు వెళ్లాయి. ఉదయం 11 గంటలకు కేసీఆర్ పార్టీ పతాకాన్ని ఎగురవేసి సమావేశాన్ని ప్రారంభిస్తారు. తీర్మానాలపై కసరత్తు కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండా రూపొందించారు. ప్రవేశపెట్టే తీర్మానాలపై ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి నేతృత్వంలోని బృందం కసరత్తు చేస్తోంది. అయితే ఈ తీర్మానాలపై గురువారం ఉదయానికి స్పష్టత వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభల్లో ఆరు ప్రధాన అంశాలపై తీర్మానాలు జరిగాయి. వ్యవసాయం, సంక్షేమం, పల్లె ప్రగతి–పట్టణ ప్రగతి, విద్య–ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక అంశాలపై తీర్మానాలు చేయగా.. సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశాలకు పెద్దపీట వేసే అవకాశముంది. ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ఇప్పటికే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించిన బీఆర్ఎస్ వచ్చే నెల నుంచి విద్యార్థి, యువజన సమ్మేళనాలు కూడా నిర్వహించేదుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్ 10న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో నిర్వహించే సభలు, సమావేశాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు లక్ష్యంగా పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపే రీతిలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. -
సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్ కావేరి' పేరుతో సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. (చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు) -
ఆవిర్భావ దినోత్సవానికి బీఆర్ఎస్ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ భవన్లో ఈ నెల 27న నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యలోనే పార్టీ ప్రతినిధులను ఈ వేడుకకు ఆహ్వానించనుంది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే పార్టీ జనరల్ బాడీ సమావేశంలో 300 మంది (మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు) నేతలు పాల్గననున్నారు. గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశానికి పార్టీ ప్రతినిధులను మౌఖికంగా ఆహ్వానించగా ఆవిర్భావ దినోత్సవానికి మాత్రం వ్యక్తిగతంగా అటు పార్టీ, ఇటు శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నుంచి ఆహ్వానపత్రాలు పంపుతున్నారు. ఎల్బీ స్టేడియంలో సుమారు 6 వేల మంది ప్రతినిధులతో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని తొలుత భావించినా వరికోతలు ముమ్మరంగా సాగుతుండటం, వేసవి తీవ్రత పెరగడంతో పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత పరిణామాలపై ఐదు తీర్మానాలు... బీఆర్ఎస్గా మారాక జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఏప్రిల్ 27న తెలంగాణ భవన్లో జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఐదు రాజకీయ తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వైఖరిని వెల్లడించేందుకు వీలుగా ఐదు రాజకీయ తీర్మానాలు రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర, భావసారూప్య పార్టీలతో కలసి పనిచేయడం, కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను ఎండగట్టడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయా ల్లో బీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలు ఈ రాజకీయ తీర్మానాల్లో ఉండనున్నాయి. పార్టీ ఆత్మీయ సమ్మేళనాల తీరుతెన్నులపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకు నివేదికలు అందిస్తోంది. ఆవిర్భావ దినోత్సవంలో ఆతీ్మయ సమ్మేళనాల తీరుతెన్నులను విశ్లేషిం చడంతోపాటు యువజన, విద్యార్థి సమ్మేళనాల నిర్వహణపై దిశానిర్దేశం చేసే అవకాశముంది. అక్టోబర్ 10న వరంగల్లో పార్టీ మహాసభ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేడర్తోపాటు యువజన, విద్యారి్థ, వివిధ సామాజిక వర్గాలతో భేటీకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 10న వరంగల్లో పార్టీ మహాసభను నిర్వహించడంతోపాటు ఆ తర్వాత వరుసగా బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాబోయే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి 27న జరిగే ఆవిర్భావ సభలో దిశానిర్దేశం చేసే అవకాశముంది. -
యువజన, విద్యార్థి సమ్మేళనాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ కేడర్తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. వాటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న యువజన, విద్యార్థి వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తోంది. విద్యార్థి, యువజన, ఉద్యోగ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ సమ్మేళనాల ద్వారా ఆయా వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు ప్రణాళిక రూపొందించింది. యువజన, విద్యార్థి సమ్మేళనాలతోపాటు వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక భేటీలు, సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న తెలంగాణ భవన్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ సమ్మేళనాలు, భేటీలకు సంబంధించిన షెడ్యూల్, విధి విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కమిటీలను పటిష్టం చేయడంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘హైదరాబాద్ స్టేట్’ ప్రాంతాలపై నజర్ మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలతో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2024 లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై నెలకొన్న ఆసక్తిని అనువుగా మలుచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణతోపాటు పూర్వపు హైదరాబాద్ స్టేట్లో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లో బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. కనీసం 40 నుంచి 60 లోక్సభ నియోజకవర్గాల్లో అన్నిస్థాయిల్లో పార్టీ నిర్మాణం ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 25న రాష్ట్రంలోని 19వేల జనావాసాల్లో పార్టీ జెండా పండుగతోపాటు అదే రోజున అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 3వేల మందితో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. -
CM KCR: టార్గెట్ మహారాష్ట్ర!
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇలా అన్ని రకాలుగా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ తరహాలో మహారాష్ట్ర, కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు? దేశ రైతాంగానికి సాగునీరు, కరెంటు, పెట్టుబడి సాయం లేవు. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం.. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తదుపరి టార్గెట్ మహారాష్ట్రేనని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి, బీఆర్ఎస్ విజయానికి తోడ్పడేలా కమిటీలు వేస్తామని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రైతుల్లో ఐక్యత రావాలని, వారి చేతిలో ఉన్న ఓటును అస్త్రంగా ఉపయోగించుకుని రైతురాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ (రైతు సంఘం) నేత శరద్ జోషి ప్రణీత్తోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో షెట్కారీ కామ్గార్ పార్టీ మహారాష్ట్రలో 76 సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు 200 సీట్లు గెలుస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలు, సమస్యలు, ఆటుపోట్లను చూశా.. దేశంలోని రైతుల కష్టం చూసి రైతుల పోరాటం న్యాయమైనదనే భావనతో జాతీయ రైతుల సమస్యలను తలకెత్తుకున్నా. చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే అసంభవమనేది ఉండదు. ప్రతి తాళానికీ తాళం చెవి ఉన్నట్టుగానే ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. రోడ్ల మీద ఆందోళనలు, పోరాటాలు చేసి లాఠీలు, తూటాలు తినాల్సిన పనిలేదు. గట్టి సంకల్పంతో, చిత్తశుద్ధితో ముందుకువెళితే చాలు. మనం కచ్చితంగా గెలిచి తీరుతాం. ప్రధాని దిగి వచ్చారు.. రైతు సమస్యల పరిష్కారానికి 1935 నుంచి నేటి దాకా రైతు పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. 13 నెలల పాటు ఢిల్లీ రోడ్లమీద రైతులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు, తీవ్రవాదులు అని ముద్రవేíసినా రైతులు చెక్కుచెదరలేదు. పోరాటంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పంజాబ్, యూపీ ఎన్నికల కోసం ప్రధాని దిగివచ్చి రైతులకు క్షమాపణలు చెప్పారు. వ్యవసాయ సుస్థిరతతో తగ్గిన ఆత్మహత్యలు తెలంగాణ ఏర్పాటుకు ముందుకు ఇక్కడ మహారాష్ట్ర కన్నా పరిస్థితులు ఘోరంగా ఉండేవి. ఇక్కడ వ్యవసాయ సుస్థిరత సాధించడంతో ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణవ్యాప్తంగా రిజర్వాయర్లతోపాటు ఇక్కడి అభివృద్ధిని ఒకటి రెండు రోజులు ఉండి పరిశీలించండి. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు నడి వేసవిలోనూ తెలంగాణ చెరువులు, కాలువల్లో నిండుగా నీరుంది. హిమాలయాల కంటే ఎత్తైన సంకల్పం వల్లే ఇక్కడ నీళ్లు పారుతున్నాయి. 14 మంది ప్రధానులు మారినా.. దేశంలో సహజ సంపదలకు కొదవలేకున్నా భారత్ వెనుకబడింది. 14 మంది ప్రధానులు మారినా మన దేశ తలరాత మారలేదు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారం అవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? తెలంగాణ బడ్జెట్ కన్నా మహారాష్ట్ర బడ్జెట్ పెద్దది. మరి ఆ రాష్ట్ర సర్కార్ ఎందుకు రైతు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం లేదు. అంటే దీని వెనుక ఏదో ఉంది (దాల్ మే కుచ్ కాలా హై) అని అర్థమవుతోంది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇలా అన్ని రకాలుగా రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ తరహాలో మహారాష్ట్ర, కేంద్రం ఎందుకు పనిచేయడం లేదు? దేశ రైతాంగానికి సాగునీరు, కరెంటు, పెట్టుబడి సాయం లేవు. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.. అనే నినాదాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ బీబీ పాటిల్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్రెడ్డి, బీఆర్ఎస్ కిసాన్ విభాగం అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడోని తదితరులు పాల్గొన్నారు. భారీ ర్యాలీగా వచ్చిన నేతలు శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ నేత శరద్ జోషి ప్రణీత్తో పాటు పలువురు నేతలు భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వీరికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ యువజన అధ్యక్షుడు సుధీర్ బిందు, కైలాష్ తవార్, శరద్ మర్కాడ్, సువర్ణ కాఠే, రాంజీవన్ బోండార్, నారాయణ్ విభూదే, బిజి కాకా, అనిల్ రజంకార్, పవన్ కర్వార్, భగవత్ పాటిల్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు చంద్రపూర్ జిల్లాకు చెందిన యువజన నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీని బలోపేతం చేసుకుందాం భారత్ రాష్ట్ర సమితిలో చేరడానికి తెలంగాణ భవన్కు వచ్చిన మహారాష్ట్ర నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీఆర్ఎస్ తదుపరి టార్గెట్ మహారాష్ట్రేనని.. అక్కడ జరిగే అన్ని ఎన్నికల్లో గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే విదర్భలో భారీ బహిరంగసభ నిర్వహిద్దామన్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రయత్నాలు చేయాలని నేతలకు సూచించారు. మహారాష్ట్రలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతోపాటు బీఆర్ఎస్ గెలుపునకు బాటలు వేసేలా కమిటీలు వేస్తామని చెప్పారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు చాలా మంది నాయకులు వస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతుల నాయకత్వంతోనే ముందుకెళ్లనున్నామని.. రైతుల పోరాటంలో మహారాష్ట్రలో ముఖ్య భూమిక పోషించాలని నేతలకు సూచించారు. -
కడుపు తరుక్కుపోయింది.. కన్నీళ్లు ఆగలేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల పోరాటం న్యాయబద్దమైనదని అన్నారు. గెలవాలంటే చిత్తశుద్ది ఉండాలని, తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. పరిష్కారం లేని సమస్యలు ఉండని చెప్పారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్తో సహా పలువురు రాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ది ఉండాలన్నారు. ‘తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని మిమ్మల్ని కోరుతున్నా. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వాళ్లు కాదు. రైతుల పోరాటంపై మోదీ సానుభూతి చూపలేదు. 750 రైతులు చనిపోతే కనీసం మోదీ స్పందించలేదు. రైతులను ఖలీస్థానీలన్నారు, ఉగ్రవాదులని అన్నారు. రైతుల గోస చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించుకున్నాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. చదవండి: Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్..