-
వారి దగ్గర మీ సమగ్ర సమాచారం.. వెంటనే రంగంలోకి దిగండి..
ఏదైనా కారణం వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులను 2023 జూలై 31లోగా వేయలేకపోతే, కాస్త ఆలస్యంగానైనా దాఖలు చేసేందుకు 2023 డిసెంబర్ 31 ఆఖరు తేదీగా ఉంటుంది. ఇప్పటికే వేసి ఉంటే సరేసరి. లేకపోతే, వెంటనే రంగంలోకి దిగండి. మీ అంతట మీరే రిటర్ను వేయాలి. గడువు తేదీ లోపల వేయలేకపోతే కొంత పెనాల్టీతో గడువు ఇచ్చారు. అది కూడా ఈ నెలాఖరు లోపే వేయాలి! ఈ మధ్య కొంత మందికి మెసేజీలు పంపుతున్నారు డిపార్టుమెంటు వారు. ‘‘మా దగ్గరున్న సమాచారం ప్రకారం మీరు 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయాలి. కానీ మీరు దాఖలు చేయలేదు. దయచేసి వెంటనే దాఖలు చేయండి’’ అనేది వాటి సారాంశం (చూడండి ఎంత మర్యాదగా అడుగుతున్నారో). అలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా వెంటనే జవాబు ఇవ్వండి. కాంప్లయెన్స్ పోర్టల్లోకి లాగ్ ఇన్ అవ్వండి. ఈ–ఫైలింగ్ పోర్టల్కి వెళ్లండి. ఆ తర్వాత ‘‘పెండింగ్లో ఉన్న పనులు’’ దగ్గరికి వెళ్లండి. అలా వెడితే, రిటర్నులు వేయని వారికి సంబంధించిన ‘Non & Filers’ అని టైప్ చేయండి. ఇప్పుడు జవాబు ఇవ్వండి. అయితే, ఒకటి గుర్తు పెట్టుకోండి. డిపార్టుమెంటు వారి దగ్గర మీకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకుని ఇలా మెసేజీలు పంపుతున్నారు. సాధారణంగానైతే ఇలా పంపనవసరం లేదు. ఇది కేవలం మేల్కొనమని చెప్పడానికే. మీరు ఆదాయపు పన్ను పరిధిలో లేకపో వచ్చు. మీకు ఆదాయమే లేకపోవచ్చు. కానీ మీ పేరు మీద ఉన్న బ్యాంకు అకౌంటులో ఏవో పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగి ఉండవచ్చు. వ్యవహా రం జరిగినంత మాత్రాన ఆదాయం ఏర్పడ కపోవచ్చు. కానీ ఇలా జరిగిన పెద్ద లావా దేవీలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వివరణ అడగడానికి, మీరు ఇవ్వడానికి ఇదొక అవకాశం. ఈ మెసేజీ వచ్చిన వెంటనే మీ మీ అకౌంట్లను నిశితంగా పరిశీలించండి. ఖర్చులు (డెబిట్లు), జమలు (క్రెడిట్లు) విశ్లేషించండి. మీరే మీ ’ట్యాక్సబుల్ ఇన్కం’లో నుంచి బదిలీ చేసి ఉండొచ్చు. ఖర్చు పెట్టి ఉండొచ్చు. అటూ, ఇటూ బదిలీ చేసి ఉంటారు. ఎన్ఎస్సీలు, ఎఫ్డీలు, జీవిత బీమా, గ్రాట్యుటీ ఇలా పన్నుకి గురి అయ్యే వసూళ్లు జమ అయి ఉండొచ్చు. వివరణ సిద్ధం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పంపి ఉండవచ్చు. వారి తరఫున మీరు ఖర్చు పెట్టి ఉంటారు. రుజువులున్న వ్యవహారాలకు వివరణ ఇవ్వొచ్చు. స్నేహంలోనూ, బంధుత్వంలోనూ, మొహమాటంతో మీ అకౌంటులో వ్యవహారాలు ఎవరైనా జరిపి ఉన్నా వివరణ ఇచ్చే బాధ్యత మీ తలపైనే పడుతుంది. ఉదాహరణకు మావగారు పొలం అమ్మగా వచ్చిన నగదు; మీరే మీకు వచ్చిన బ్లాక్ అమౌంటుని జమ చేసి ఉండటం; మీ బావగారు తన కూతురి పెళ్లికని మీ అకౌంటులో వేసి ఉండొచ్చు. ఎవరికో సహాయం చేయబోయి, మీ అకౌంటులో వ్యవహారాలు జరిపి ఉండొచ్చు. ఇలా జరిగిన వాటిని అధికారుల సంతృప్తి మేరకు వివరించగలిగితే ఓకే. లేదంటే వెంటనే విశ్లేషించండి. వృత్తి నిపుణులను సంప్రదించండి. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఉత్తమ పౌరుడిగా మీ బాధ్యతలు నిర్వర్తించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదాయపన్ను రిఫండ్లు వేగవంతం
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి పన్నుకు సంబంధించిన రిఫండ్లు గడిచిన ఐదేళ్లలో వేగవంతమయ్యాయి. పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన బకాయిలను ఆదాయపన్ను శాఖ నుంచి వేగంగా పొందుతున్నారు. రిఫండ్ కోసం వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గినట్టు సీఐఐ నిర్వహించిన సర్వేలో 89 శాతం మంది వ్యక్తులు, 88 శాతం సంస్థలు చెప్పడం గమనార్హం. ఈ సర్వే వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఐఐ సమరి్పంచింది. తమ అంచనా పన్ను బాధ్యతకు మించి టీడీఎస్ చెల్లించలేదని 75.5 శాతం మంది వ్యక్తులు, 22.4 శాతం సంస్థలు ఈ సర్వేలో చెప్పాయి. రిఫండ్ ఏ దశలో ఉందన్న విషయం తెలుసుకోవడం సులభంగా మారినట్టు 84 శాతం మంది వ్యక్తులు, 77 శాతం సంస్థలు తెలిపాయి. ఆదాయపన్ను రిఫండ్ క్లెయిమ్ సౌకర్యవంతంగా ఉన్నట్టు 87 శాతం మంది వ్యక్తులు, 89 శాతం సంస్థలు చెప్పాయి. పన్ను ప్రక్రియ ఆటోమేషన్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న ఎన్నో చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తెలిపారు. ‘‘గడిచిన ఐదేళ్లలో ఆదాయపన్ను రిఫండ్లను పొందే విషయంలో వ్యక్తులు, సంస్థలు వేచి ఉండే కాలం గణనీయంగా తగ్గడం ప్రోత్సాహకరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న విరామం లేని ఎన్నో చర్యలు ఈ ప్రక్రియను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చేశాయి’’అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. -
ఆన్లైన్ గేమింగ్లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్పై మాత్రమే కాకుండా భారత్లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
భారత్కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..
న్యూఢిల్లీ: ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్ చెప్పారు. ‘భారత్ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్ వేల్యుయేషన్ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్మార్ట్, టెన్సెంట్ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్లో ఫోన్పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్కు మార్చుకుంది. -
ఐటీ సర్క్యులర్ వచ్చిందోచ్.. ఈ విషయాలపై క్లారిటీ ఉందా మీకు?
డిసెంబర్ 7వ తేదీన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇలా విడుదల చేస్తారు. ఇది కేవలం ఉద్యోగస్తులకు సంబంధించినది అని చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి చట్టంలోని అంశాలు, రూల్సు, అవసరమైన ఫారాలు, వివరణలు, వివిధ రిఫరెన్సులు, సులువుగా అర్థమయ్యే పది ఉదాహరణలతో ఈ సర్క్యులర్ వచ్చింది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇందులో అంశాలు మీకోసం క్రోడీకరించి ఒకే చోట విశదీకరించారు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమి ఉంటాయి అంటే.. ► జీతం అంటే ఏమిటి.. పెర్క్స్ అంటే ఏమిటి, జీతంలో కలిసే ఇతర అంశాల నిర్వచనాలు ► శ్లాబులు, రేట్లు, రిబేట్లు మొదలైనవి ► టీడీఎస్ ఎలా లెక్కించాలి ► ఇద్దరు యజమానులుంటే ఎలా చేయాలి ► ఎరియర్స్ జీతం, అడ్వాన్స్ జీతం లెక్కింపు ► జీతం మీద ఆదాయం కాకుండా ఇతర ఏదైనా ఆదాయం ఎలా తెలియజేయాలి ► ఇంటి లోన్ మీద వడ్డీ, షరతులు ► విదేశాల నుంచి వచ్చే జీతం ► టీడీఎస్ రేట్లు, ఎలా రికవరీ చేయాలి, ఎప్పుడు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, రిటర్నులు ఎలా దాఖలు చేయాలి, టీడీఎస్ సర్టిఫికెట్ ఫారం 16 ఎలా జారీ చేయాలి, ఎప్పుడు దాఖలు చేయాలి ► పైవన్నీ సకాలంలో చేయకపోతే, వడ్డీ, పెనాల్టీల వివరాలు ► ఏయే మినహాయింపులు ఉన్నాయి ► ఏయే కాగితాలు, రుజువులు ఇవ్వాలి. ఇలా ఎన్నో.. ► ఫారాలు 12బీఏ, 12బీబీ, 16.. ఇతర రిటర్నులు .. 10బీఏ.. ఇలా పది ఉన్నాయి ► సంబంధిత సర్క్యులర్లు, రిఫరెన్సులు, పద్ధతులు, నోటిఫికేషన్లు ► డ్రాయింగ్ ఆఫీసర్లు చేయాల్సిన విధులు ► పలు ఉదాహరణలు. ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని, ఏయే సందర్భాలుంటాయి, ఆ సందర్భాలను.. ఆ కేసులను తీసుకుని.. నిజమైన కేస్ స్టడీలాగా రూపొందించి ఉదాహరణలను తయారు చేశారు. అవి చదువుతుంటే మీ కేసునే తీసుకుని తయారు చేశారా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. ఒక సజీవ కేసు.. ఒక నిజమైన లెక్కింపు.. ఒక ప్రాక్టికల్ ప్రోబ్లెమ్కి రెడీమేడ్ సొల్యూషన్.. రెడీ రిఫరెన్స్.. రెడీ రెకనార్ . చదవండి.. చదివించండి. అర్థం చేసుకుంటే మీరే నిపుణులు. -
ఏయే ఆదాయానికి ట్యాక్స్ మినహాయింపులిస్తారో..ఇవ్వరో మీకు తెలుసా!
గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం. ♦డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి. ♦ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు. ♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్ మీద అద్దె అని ప్లానింగ్ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్నిచర్ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు. ♦ ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు. ♦ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి. ♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు. ♦నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ♦అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. వ్యక్తిగత ఖర్చులు ♦క్యాపిటల్ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి. ♦ఆస్తి పన్ను (మున్సిపల్ పన్ను కాదు) ♦విదేశంలోని ఖర్చులు ♦విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు ♦లాటరీలు, క్రాస్వర్డ్ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు. ♦చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు. -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
ఆదాయ పన్ను: ఇతర ఆదాయం ఉంటే
సాక్షి,హైదరాబాద్: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అసెస్సీకి ఐదు రకాల ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని ఈ కింద పేర్కొన్న శీర్షికల కింద విభజించారు. ⇒ జీతాలు ⇒ ఇంటిపై అద్దె ⇒ వృత్తిపై, వ్యాపారంపై లాభాలు ⇒ మూలధన ఆస్తులపై లాభాలు ⇒ ఇతర ఆదాయాలు ఏ వ్యక్తికైనా వచ్చే ఆదాయాన్ని పైవిధంగా వర్గీకరించి, పన్ను భారాన్ని లెక్కిస్తారు. పై జాబితాలో మొదటి నాలుగింటి విషయంలో నిర్దిష్టంగా, స్పష్టంగా చట్టం అన్ని అంశాలూ చెప్పింది. మనం గతంలో ఎన్నోసార్లు వాటిని ప్రస్తావిస్తూ వచ్చాం ఇక ఆఖరుదీ అయిదో అంశం ప్రత్యేకత ఏమిటంటే.. ఏదేని ఆదాయం, మొదటి నాలుగింటిలోనూ ఇమడ్చలేకపోతే/వర్గీకరించకపోతే/ విభజించలేక పోతే.. అటువంటి ఆదాయాన్ని ‘‘ఇతర ఆదాయం’’ కింద పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఆదాయం.. జీతం కాదు, ఇంటి మీద అద్దె కాదు, వృత్తి .. వ్యాపారం వల్ల వచ్చిన లాభం కాదు, మూలధన లాభాలు కాదు .. ఇక మిగిలింది .. చివరిది ఇతర ఆదాయం. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఈ శీర్షిక కింద పన్ను వేస్తారు. ఎక్కడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అన్న సామెతలాగా ఎలాంటి మొహమాటం లేకుండా పట్టుకుంటారు. మీరు దొరక్క తప్పదు. పన్ను చెల్లించక తప్పదు. ఇది కాకుండా చట్టప్రకారం ఈ కింద పేర్కొన్న వాటిని ‘‘ఇతర ఆదాయం’’గా పరిగణిస్తారు. ⇒ భూమిపై అద్దె ⇒ సబ్-లెట్టింగ్పై ఆదాయం ⇒ బ్యాంకు డిపాజిట్లు (ఫిక్సిడ్, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ) ⇒ డైరెక్టర్లకు వచ్చే సిట్టింగ్ ఫీజు ⇒ విదేశీ గడ్డ నుండి వచ్చే వ్యవసాయంపై ఆదాయం ⇒ డైరెక్టరుగా సంపాదించే గ్యారంటీ కమీషన్ ⇒ పరీక్షల నిర్వహణకు వచ్చే ఆదాయం, వేల్యుయేషన్ ఫీజు, ఇన్విజిలేషన్ ఫీజు ⇒ ఫ్యామిలీ పెన్షన్ (ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పెన్షన్ మీద .. జీతంలాగానే రూ. 50,000 మినహాయింపు ఉంటుంది. 1/3వ వంతు లేదా రూ. 15,000. ఈ రెండింటిలో తక్కువ మినహాయింపు ఇస్తారు) ⇒ పార్లమెంటు, శాసన సభ సభ్యుల జీతాలు ⇒ బుక్స్ రాసినందుకు వచ్చే రాయల్టీలు ⇒ వారసులకొచ్చే రాయల్టీలు (బుక్స్పై) ⇒ హోటల్స్లో సర్వర్స్కి వచ్చే టిప్స్, డ్రైవర్లకు వచ్చే టిప్స్ ⇒ క్యాజువల్ ఆదాయం ⇒ యాన్యుటీలు ⇒ మధ్యవర్తిత్వం చేసినందుకు వచ్చే కమీషన్ ⇒ అండర్రైటింగ్ కమీషన్ ⇒ బహిర్గతం చేయలేని సోర్స్ నుండి ఆదాయం ⇒ ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయం ⇒ కొన్ని సెక్షన్ల ప్రకారం ఇతరుల ఆదాయం, కొన్ని ఖర్చులు, లెక్క చెప్పని నగదు, లెక్క చెప్పని ఇన్వెస్ట్మెంట్ .. మొదలైన వాటి విలువ. ఈ జాబితా ఇక్కడితో పూర్తవలేదు. ఇవి అంతంకాదు ఆరంభం లాగా కేవలం మచ్చుతునకలే. -కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
ఫండ్స్ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా?
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి? – బ్రిజ్ మోహన్లాల్ గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్ ఫండ్స్ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ను 2021 డిసెంబర్లో సుందరం మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబాస్లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్ ఫండ్కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్ ఫండ్స్ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్ ఏ, ఫండ్ బీని తీసుకుందాం. ఫండ్ ఏను తీసుకెళ్లి ఫండ్ బీలో విలీనం చేశారు. ఫండ్ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్ బీ ఎన్ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్ పీరియడ్ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
భారత్లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్వర్క్ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
టాక్స్ ఆడిట్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ మెళకువలు తెలుసుకుంటే మేలు..
టాక్స్ ఆడిట్ గురించి ఇప్పటికే తెలుసుకున్నాం.. ఈ వారం ఎలా చేయించాలో తెలుసుకోండి. - ముందుగా ఆర్ధిక సంవత్సరం చివరికి టర్నోవరు లేదా అమ్మకాలు లేదా బ్యాంకులో వసూళ్లు విలువ తెలుసుకోండి. చివరి దాకా వేచి ఉండక్కర్లేదు. మీ అనుభవం .. వ్యాపార సరళి, జీఎస్టీ రికార్డులను బట్టి తెలుస్తుంది. టర్నోవరు కోటి రూపాయలు దాటింది అంటే మీ కేసు టాక్స్ ఆడిట్ పరిధిలోనిది అన్నమాట. - వెంటనే ఒక ప్రాక్టీస్ లో ఉన్న సీఏని సంప్రదించండి. - సదరు సీఏని అపాయింట్ చేసుకోండి. అలాగే ఫీజు కూడా ముందుగానే పేర్కొనండి. - సీఏని మీరే నియమించినా ఆ వ్యక్తి ఇటు మీ తరఫున అటు ఇన్కం ట్యాక్స్ విభాగం తరఫున తన విధులకు న్యాయం చేస్తారు. - ఏం చేయాలన్నది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. - ఆడిట్ పరిధిలో ఏయే రికార్డులు వెరిఫై చేయాలన్నది ప్రస్తావించారు. - ఒక అస్సెస్సీకి సంబందించిన వందలాది అంశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. వీటి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇవ్వాలి. - ఉదాహరణకు వ్యాపారంలో సొంత ఖర్చులు ఉన్నాయా? క్యాపిటల్ ఖర్చులు మామూలు ఖర్చుల్లో కలవడం జరగలేదు కదా? బిజినెస్కి సంబంధం లేని ఖర్చులు విడిగా రాయడం చేశారా? సొంత వాడకాన్ని విడిగా చూపించారా? విరాళాలు విడిగా రాశారా? ఇలాంటివన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. - పైవన్నీ తప్పు అని అనటం లేదు... కొన్ని వ్యాపారాల్లో చాలా సహజం... జరిగింది జరిగినట్లు రాయండి.. ఆడిటర్ ఆ వ్యవహారాలను జల్లెడ బట్టి తన వృత్తి నైపుణ్యంతో విడగొడతారు. - ఆదాయాన్ని, ఖర్చులను సరిగ్గా నిర్ధారించడంపైనే ఈ ఆడిట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కొన్ని విధులు సరిగ్గా నిర్వహించడం జరిగిందా లేదా అన్నది రిపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా టీడీఎస్ లాంటివాటికి సంబంధించి చట్టప్రకారమే ప్రయోజనం పొందారా లేదా అన్నది పరిశీలిస్తుంది. - ఇందుకోసం ఆదాయపు పన్ను విభాగం నిర్దేశి ంచిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. - అప్పుడు పూర్తి అవుతుంది.. ఆడిట్.. ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్పై ఇద్దరు సంతకం పెడతారు. దీన్ని గడువు తేదీ లోపల దాఖలు చెయ్యాలి. లేకపోతే పెనాల్టీ భారీగా వడ్డీస్తారు. ఈ రిపోర్ట్ మీకూ శ్రీరామ రక్ష. 31మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి ఇంకా గడువు ఉంది. ఫిబ్రవరి 15 దాకా పొడిగించారు. కాబట్టి కాస్త త్వరపడండి. ఒకవేళ ఇప్పటికే దాఖలు చేసేసి ఉంటే 31 మార్చి 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరం రిటర్నుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. - కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
నాలుగుసార్లు లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ
-
నిజాయితీగా పన్ను చెల్లించేవారికి లబ్ధి : మోదీ
సాక్షి, ఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్డీఐలు వచ్చాయి. సెప్టంబర్ 25 నుంచి ఫేస్లెస్ అప్పీల్ సేవలను ప్రారంభించనున్నట్లు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్లకు కమిటీలో చోటు కల్పించారు. -
వేతన జీవులకు షాక్: కొత్త ఐటీఆర్..ఎన్నో మార్పులు
ఐటీఆర్–1 వేతనజీవుల కోసం. దీన్లో ఇదివరకు జీతభత్యాల గురించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇవ్వాలి. ►ఉద్యోగస్తులకు యాజమాన్యం వారిచ్చే స్టాక్ ఆప్షన్ ప్లాన్ విషయంలో మార్పుల వలన, లిస్ట్ కాని కంపెనీ షేర్లుంటే వాటి ‘ప్రైమరీ మార్కెట్’ విలువను సీఏ, మర్చంట్ బ్యాంకర్తో ధ్రువీకరించాలి. ►అద్దెకిచ్చిన ఇంటి మీద అద్దె వివరాలివ్వాలి. ►మూలధన లాభాలకు సంబంధించి అదనపు వివరాలివ్వాలి. మినహాయింపులు పొందిన వారు వాటిని ఎంతో వివరంగా తెలియజేయాలి. ►కొన్ని ఫారాలలో అసెస్సీకి సంబంధించిన కాలమ్ ‘జెండర్’ తొలగించారు.ఈ సమాచారం ఇవ్వక్కర్లేదు. ►భాగస్వామ్య సంస్థలు భాగస్వాముల ఆధార్ వివరాలను తెలియజేయాలి. ►భాగస్వామి గత సంవత్సరం వరకూ ఫారం–2ను దాఖలు చేయవచ్చు. ఈ సారి ఫారం–3లో రిటర్నులు దాఖలు చేయాలి. ► అలాగే నాన్ రెసిడెంట్లు ఫారం–1కి బదులుగా ఫారం–2 దాఖలు చేయాలి. ఇందులో అదనంగా సమాచారం ఇవ్వాలి. వారు రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు విదేశీ బ్యాంక్ వివరాలిస్తే.. ఆబ్యాంక్ ఖాతాకు రిఫండ్ ఇస్తారు. ► కొంతమంది నిర్దేశించిన శాతాన్ని లాభంగా చూపించడం ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అంటారు. వారు ఈసారి అదనంగా సమాచారం ఇవ్వరు. (ఇది వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మాత్రమే). ►వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు జీఎస్టీ రిటర్నులలో పేర్కొన్న టర్నోవర్ను చూపించాలి. దీనివలన పుస్తకాల టర్నోవర్తో, జీఎస్టీ టర్నోవర్ను పోల్చి చూస్తారు. వ్యత్యాసం ఉంటే వివరణ ఇవ్వాలి. ►అలాగే కంపెనీల విషయంలో ఎన్నెన్నో వివరాలు ఇవ్వాలి. ►వేతనజీవుల విషయంలో గడువుతేది 31/07/2018. ఆన్లైన్లో దాఖలు చేయాలి. అన్ని కాగితాలు సంపాదించి, సరిచూసుకొని, ఖచ్చితంగా ఫైల్ చేయండి. 31/07/2018 దాటితే రూ.5,000, 31/12/2018 దాటితే రూ.10,000 పెనాల్టీ పడుతుంది. -
పాక్ వింత నిర్ణయం కోళ్లు, ఆవుల మీద పన్ను
-
కోళ్లు, ఆవులపై పాక్ వింత నిర్ణయం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు. ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
మధ్యతరగతికి కొంత ఊరట!
► 5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు ► రిబేట్ మాత్రం రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు ► బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులూ చేయని జైట్లీ ► పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్చార్జీ ► రూ.5 లక్షలలోపు వేతన జీవులకు సింగిల్ పేజీ ట్యాక్స్ రిటర్నులు ► తొలిసారి రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి స్క్రూటినీ ఉండదు ఎవరి ఆదాయంపై ఎంత పన్ను ఉంటుందో చూస్తే... అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రేట్లు భారీగా తగ్గుతాయని ఆశించిన వేతన జీవులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరీ ఎక్కువగా కాకున్నా కొంత ఊరటనిచ్చారు. బేసిక్ లిమిట్ జోలికి వెళ్లకపోయినా... ఏడాదికి రూ.10 లక్షల వరకూ వేతనం ఉండే మధ్య తరగతి వేతన జీవులందరికీ మరికొంత మొత్తం జేబులో మిగిలేలా చర్యలు తీసుకున్నారు. మినహా యింపులన్నీ పోను... పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.2.5 లక్షలు దాటి రూ.5 లక్షల మధ్యలో ఉంటే... దానిపై ఇప్పటిదాకా విధిస్తున్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆ రకంగా వారు చెల్లిస్తున్న పన్ను లో 50 శాతాన్ని మిగిల్చారు. అయితే ఒకచేత్తో ఇస్తూనే మరో చేత్తో తీసుకున్న మాదిరిగా సెక్ష న్ 87ఏ కింద ఇస్తున్న ట్యాక్స్ రిబేట్ను (చెల్లించాల్సిన పన్నును తగ్గించడం) సగానికి సగం తగ్గించేశారు. పైపెచ్చు దాని పరిధిని కూడా కుదించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ. 5,000 ట్యాక్స్ రిబేట్ లభించేది. అంటే చెల్లిం చాల్సిన పన్నులోంచి రూ.5,000 మినహా యించి మిగిలింది చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.2,500కు కుదించారు. పైపెచ్చు ఈ రిబేటు కేవలం రూ.3.50 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు. ఇప్పుడు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను భారం పడదు. కానీ వీరు రిటర్నులు తప్పనిసరిగా వేయాలి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.3 లక్షలు దాటి రూ.3.50 లక్షల లోపు ఉంటే వారిపై రూ.2,500 పన్ను పడుతుంది. ఇదివరకు వీరు రిబేటు పోను రూ.5,000 చెల్లించాల్సి వచ్చేది. సెక్షన్ 80సీ కింద పొదుపు, వ్యయాలపై లభించే రూ.1.50 లక్షల మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.4.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ పడే అవకాశం లేదు. రూ.5,00,000 దాటిన వారందరికీ రూ.12,500 వరకు పన్ను భారం తగ్గుతుంది. అధికాదాయం... సర్చార్జీ వడ్డింపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం కనుక రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటే 10 శాతం సర్చార్జీని కొత్తగా వడ్డించారు. గతేడాది కోటి రూపాయలు దాటిన వారిపై విధించిన 15 శాతం సర్చార్జీని కొనసాగి స్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు సులభంగా రిటర్న్స్ దాఖలు చేసేలా సింగిల్పేజీ రిట ర్న్స్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి ప్రక టించారు. అదే విధంగా తొలిసారి రిటర్నులు దాఖలు చేసిన వారిని స్క్రూటినీ చేయబోమని ఆర్థికమంత్రి హామీనిచ్చారు. బేసిక్ లిమిట్ రూ. 4 లక్షల వరకు పెరుగుతుందని, సెక్షన్ 80సీ పరిమి తితో పాటు గృహ రుణాలకు చెల్లించే వడ్డీపై లభించే రాయితీ పరిమితిని పెంచుతారని ఉద్యోగులు వేసిన అంచనాలేవీ నిజం కాలేదు. కాగా ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కేంద్రం నికరంగా రూ.15,500 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని జైట్లీ చెప్పారు. కాగా, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీ ఆర్)లు ఆలస్యమైతే పదివేల రూపాయల జరిమానా విధించాలని బడ్జెట్లో ప్రతిపాదిం చారు. అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే...! ఉద్యోగులతో పాటు వ్యాపారేతర ఆదాయం కలిగిన వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి వృత్తి నిపుణులకు కూడా ఈ పన్ను శ్లాబులు వర్తిస్తాయి. అయితే ఈ పన్ను విధించేది ట్యాక్సబుల్ ఇన్కమ్పైనే. అంటే... మీరు సంపాదించే మొత్తం ఆదాయం నుంచి తొలుత వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపుల్ని తీసేస్తారు. అంటే పీఎఫ్కు చెల్లించేది, హెచ్ఆర్ఏ/ ఇంటి అద్దెగా మినహాయించేది, ఇక సెక్షన్ 80సీ కింద వివిధ పథకాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్లు (గరిష్ఠంగా ఇది రూ.1.5 లక్షల వరకూ చేయొచ్చు), ఇతర సెక్షన్ల కింద వర్తించే వైద్యబీమా ఖర్చులు, వైద్య ఖర్చులు... ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనుక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, 5 నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
బడ్జెట్కు ముందు జైట్లీ కీలక సంకేతాలు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సర్వత్రా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తక్కువ పన్నుల గురించి సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ పోటీతత్వానికి అనుగుణంగా దేశం తక్కువపన్నుల దశలోకి అడుగుపెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. 'పోటీతత్వపు వాతావరణంలో తక్కువ పన్నులతో ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరముంది. పోటీతత్వం దేశీయంగా కాకుండా అంతర్జాతీయస్థాయిలో ఉండాలి. ఇది ఎంతో కీలకమైన మార్పు' అని ఆయన పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో కనీస ఆదాయపన్ను పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తక్కువ పన్నుల గురించి ఆయన మాట్లాడినట్టు భావిస్తున్నారు. జైట్లీ మాట్లాడుతూ 'చట్టబద్ధమైన పన్ను చెల్లించడం పౌరుడి బాధ్యత. పన్ను చెల్లించకపోవడం వల్ల ఎన్నో దుశ్ప్రరిణామాలు ఉంటాయి. పన్ను చెల్లించకపోతే నష్టమేమీ లేదు, అనైతికమేమీ కాదన్న అభిప్రాయం గత ఏడు దశాబ్దాలుగా భారత్లో నెలకొని ఉంది. అలా చేయడం వాణిజ్య తెలివితేటలుగా మారిపోయింది. ఈ ధోరణి వల్లే ఇప్పుడు కొందరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారు' అని అన్నారు. కానీ రానున్న దశాబ్దిలో స్వచ్ఛందంగా పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫరీదాబాద్లో 68వ బ్యాచ్ ఐఆర్ఎస్, సీ అండ్ ఈసీ అధికారుల శిక్షణ ప్రారంభోత్సవంలో జైట్లీ ప్రసంగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని భావిస్తున్నారు. -
ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రాల పన్నులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తమ రాష్ట్రాల్లోకి ప్రవేశించే వస్తువులపై పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా పన్ను విధించడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదని తెలిపింది. రాష్ట్రాల పన్నులకు సంబంధించి కీలకమైన ఈ అంశంపై 9 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 7-2 తేడాతో తీర్పును వెలువరించింది. -
ఈపీఎఫ్ పన్ను ఉపసంహరణ
మధ్య తరగతికి ఊరటనిచ్చే చర్య న్యూఢిల్లీ: ఈపీఎఫ్ పన్ను విధింపుపై చెలరేగిన ఆందోళనలు సమంజసమైనవని భావించడంతో పన్ను విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఉద్యోగులకు మరింతగా ప్రయోజనం కల్పించడానికే ఈ పన్ను ప్రతిపాదన తెచ్చామని, అంతేకాని పన్ను ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. పెన్షన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిక్కి ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వివాదస్పదమైన ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరైన చర్య అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనివల్ల అందరికీ అర్థమైందని కేపీఎంజీ ఇండియా హెడ్(ట్యాక్స్) గిరీష్ వన్వరి చెప్పారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం మధ్యతరగతికి ఊరటనిచ్చే చర్య అని నంగియా అండ్ కో ఈడీ నేహ మల్హోత్ర చెప్పారు. తమ రిటైర్మెంట్ పొదుపులను తమకు ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకునే స్వేచ్ఛ వారికి లభించిందని వివరించారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం పట్ల ఆన్లైన్ పిటీషన్ ప్లాట్ఫారమ్ ఛేంజ్డాట్ఓఆర్జీ హర్షం వ్యక్తం చేసింది. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటీషన్పై సంతకాలు చేసిన రెండున్నర లక్షలమందికి ఇది అతిపెద్ద విజయమని పేర్కొంది. గుర్గావ్కు చెందిన ఆర్థిక రంగ నిపుణులు, వైభవ్ అగర్వాల్ ఈ ఆన్లైన్ పిటీషన్ను ప్రారంభించారు. -
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
ఒక సంస్థలో ప్రధాన విభాగాలు అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్. వీటి గురించి వివరించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. కంపెనీలు, వ్యక్తుల పన్ను ప్రణాళికల విషయుంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అవసరం తప్పనిసరి. అంతేకాకుండా పెట్టుబడులు, వాటి ప్లానింగ్, సంస్థాగత అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణలో సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల సమీకరణ, జారుుంట్ వెంచర్స్, విదేశీ భాగస్వావ్యూలు, విస్తరణ, విలీనాల్లోనూ, ఉత్పత్తుల ధరలు మొదలైన వాటిలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. మూడు దశలు: సీఏ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. ఇందులో కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ), ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్స కోర్సు (ఐపీసీసీ), ఫైనల్ దశలుంటాయి. పదో తరగతి పూర్తిచేసిన వారు సీపీటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీపీటీ ఏటా జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఈ పరీక్ష రాయడానికి ఇంటర్ ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. సీపీటీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఐపీసీసీ: సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఐపీసీసీ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది. అభ్యర్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఏదైనా ఒక గ్రూప్ లేదా ఒకేసారి రెండు గ్రూప్లకు పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలి. దీంతోపాటు ఓరియెంటేషన్ కోర్సు, 100 గంటలపాటు సాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సును పూర్తి చేయాలి. ఏటా మే, నవంబర్లో ఐపీసీసీ పరీక్షలు జరుగుతాయి. ఆర్టికల్స్: ఐపీసీసీ కోర్సులోని గ్రూప్-1 గాని లేదా రెండు గ్రూప్స్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల ఆర్టికల్స్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఐసీఏఐ గుర్తింపు ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా సంపాదించుకోవచ్చు. ఫైనల్: ఐపీసీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫైనల్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండున్నరేళ్ల ఆర్టికల్స్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఇందులోని ప్రతి గ్రూపులో నాలుగు పేపర్లు ఉంటాయి. కెరీర్: సీఏ కోర్సు పూర్తిచేసిన వారికి సేవా రంగం, టెలికం, బ్యాంకింగ్, బీమా, సాఫ్ట్వేర్, మైనింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ హౌసెస్ వంటివి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నాయి. స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిటింగ్, అకౌంటింగ్, డెరైక్ట్-ఇన్డెరైక్ట్ ట్యాక్స్; ట్యాక్స్ ప్లానింగ్, టెక్నికల్ అనాలసిస్, రిస్క్ అసెసర్స్, సర్వేయర్స్, మర్చంట్ బ్యాంకర్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ వంటి ఆధునిక విభాగాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి. స్వయం ఉపాధి కోరుకునే వారు సొంతంగా ఆడిటర్గా కూడా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. వేతనాలు: సీఏ ఉత్తీర్ణులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఫ్రెషర్కు నెలకు కనీసం రూ.35,000 వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం ఆధారంగా దాదాపు అధిక వేతనాలు అందుకోవచ్చు. 2014 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఐసీఏఐ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లో 1019 మందికి ఉద్యోగావకాశాలు రాగా, వారిలో 201 మందికి రూ.9 లక్షలు, ఆపై వార్షిక వేతనంతో ఆఫర్లు వచ్చాయి. డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లోనే..! దేశంలో అకౌంటెన్సీ విభాగంలో మానవ వనరుల అవసరం కోణంలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం వేలల్లో ఉంది. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్ ఉన్న ఔత్సాహికులకు సరితూగే కోర్సు సీఏ. వాణిజ్య, వ్యాపార రంగాలు, అకౌంటింగ్ కార్యకలాపాలపై సహజ ఆసక్తితో ఈ సీఏ కోర్సును పూర్తి చేయడం సులభమే. ఈ కోర్సు అంటే సుదీర్ఘ కాలం సాగే ప్రక్రియ అనేది అపోహ మాత్ర మే. విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం అందించే కోర్సు ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి ఐపీసీసీ దశ దాటుకుని ఫైనల్కు చేరుకోవచ్చు. - ఆర్.చెంగలరెడ్డి, సెక్రటరీ, ఎస్ఐఆర్సీ, హైదరాబాద్ బ్రాంచ్. కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్) కంపెనీ సెక్రటరీషిప్(సీఎస్) కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) నిర్వహిస్తోంది. ఒక కంపెనీలోని బోర్డ్ మీటింగ్ల నిర్వహణ, ఎజెండా, మినిట్స్ రూపకల్పన, వాటి ఆచరణపై పర్యవేక్షణ వంటి ఎన్నో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వర్తించేది కంపెనీ సెక్రటరీలే. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ సొంతం చేసుకోవాలి. కంపెనీ సెక్రటరీషిప్ కోర్సు మొత్తం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ ప్రోగ్రాం; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం; ప్రొఫెషనల్ ప్రోగ్రాం. ఇంటర్తోనే ‘ఫౌండేషన్’: ఐసీఎస్ఐ.. సీఎస్ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్ ప్రోగ్రాం. దీనికి అర్హత ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పేరు నమోదు చేసుకోవాలి.. ఈ ప్రోగ్రాం కోసం పరీక్ష ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. ఏడాది మొత్తం పేరు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. పేరు నమోదు చేసుకున్న తేదీకి, తొలిసారి పరీక్షకు హాజరయ్యే తేదీకి మధ్య కనీసం 8 నెలల వ్యవధి తప్పనిసరి. ఈ ప్రోగ్రాంలో మొత్తం నాలుగు పేపర్లలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రెండో దశ.. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం: ఫౌండేషన్ ప్రోగ్రాంలోని అన్ని పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కంపెనీ సెక్రటరీషిప్ ప్రోగ్రాంలోని రెండో దశ ‘ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం’కు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం రెండు మాడ్యూల్స్లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్లో మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతాయి. ప్రొఫెషనల్ ప్రోగ్రాం టు సెటిల్ ఇన్ ప్రొఫెషన్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. సీఎస్ ప్రొఫెషన్లో సెటిలయ్యేందుకు చివరి దశ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకోవాలి. ప్రొఫెషనల్ ప్రోగ్రాంను మొత్తం నాలుగు మాడ్యూల్స్గా విభజించారు. ఒక్కో మాడ్యూల్లో రెండు పేపర్లు ఉంటాయి. 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్: ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో పేరు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఫ్రొఫెషనల్ ప్రోగ్రాం పరీక్ష రాసే సమయానికి తప్పనిసరిగా 15 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. అవకాశాలు: 1956 కంపెనీల చట్టం ప్రకారం రూ.5 కోట్ల అధీకృత మూలధనం ఉన్న ప్రతి సంస్థ ఒక పూర్తి స్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి. కార్పొరేట్ గవర్నెస్ అండ్ సెక్రటరీయల్ సర్వీసెస్, కార్పొరేట్ లాస్ అడ్వైజరీ అండ్ రిప్రజెంటేషన్ సర్వీసెస్, ఫైనాన్షియల్ మార్కెట్ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ సంబంధిత కంపెనీల్లో అవకాశాలు విస్తృతం. స్వయం ఉపాధి దిశగా ఆలోచించే వారు సొంతంగా ప్రాక్టీస్ కూడా చేయవచ్చు. వేతనం: ఒక ఫ్రెషర్కు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక వేతన ప్యాకేజ్ లభిస్తుంది. ఈ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉంటే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. సీఎంఏ అకౌంటింగ్ రంగాల్లో సమున్నత భవిష్యత్తును కోరుకునే విద్యార్థులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తున్న కోర్సు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఈ కోర్సును ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. సీఎంఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్ కోర్సు, ఇంటర్మీడియెట్ కోర్సు, ఫైనల్ కోర్సు. ఫౌండేషన్ కోర్సు: ఈ కోర్సులో పేరు నమోదు చేసుకోవడానికి కనీస అర్హత ఇంటర్మీడియెట్/10+2/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే వారు కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఇంటర్మీడియెట్ కోర్సు: ఇంటర్మీడియెట్ కోర్సు రెండు స్టేజ్లుగా ఉంటుంది. ప్రతి దశలో మూడు పేపర్లుంటాయి. ఏటా జూన్, డిసెంబర్లలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో నిర్ణీత తేదీల్లోపు సంబంధిత దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఫైనల్ కోర్సు: ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో కాస్ట్ అండ్ వర్క అకౌంటెన్సీ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే క్రమంలో చివరి దశ ఫైనల్ కోర్సు. ఇది రెండు దశలలో ఉంటుంది. సీఎంఏ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు తమ ఆసక్తికి అనుగుణంగా మొదట ఫైనల్ కోర్సులోని రెండు దశలలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కూడా జూన్, డిసెంబర్లలో నిర్వహిస్తారు. కెరీర్ అవకాశాలు: సీఎంఏ పూర్తిచేసిన వారు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వస్తూత్పత్తి తదితర సంస్థల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కాస్ట్ ఆడిటర్ వంటి హోదాలో ప్రవేశించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ అనే కేంద్ర సర్వీస్ను కూడా ఏర్పాటు చేసింది. క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ ఆధారంగా రూ.30 నుంచి రూ.40 లక్షల వేతనాలు కూడా అందుకోవచ్చు. లా దేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన 1991 నుంచి లా వివిధ రంగాలకు విస్తరించింది. బ్యాంకింగ్, బీమా, ట్యాక్సేషన్, టెలికం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే అనేక కొత్త కొలువులను అందుబాటులోకి తెచ్చింది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది.ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తర్వాత ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ప్రవేశానికి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్) రాయొచ్చు. ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి లా కళాశాలల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) రాయాల్సి ఉంటుంది.న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ.. ఐదేళ్ల వ్యవధిగల బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్.. ‘ఎల్శాట్’ను నిర్వహిస్తోంది. దీంట్లో స్కోర్ ఆధారంగా దేశంలోని సుమారు 40కిపైగా లా స్కూల్స్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ కోర్సులో సీటు సంపాదించొచ్చు. కెరీర్ అవకాశాలు: ప్రభుత్వ రంగంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స, మేజిస్ట్రేట్స్, సబ్ మేజిస్ట్రేట్స్, జూనియర్ జడ్జి స్థాయిల్లో ఎంట్రీ లెవల్ అవకాశాలు లభిస్తాయి. వీటికోసం ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో కార్పొరేట్, బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలకు అవసరమైన న్యాయ సేవలు పొం దేందుకు లా గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాయి. వేతనాలు: ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో అడుగుపెట్టిన వారికి హోదా, ఉద్యోగం స్వభావాన్ని బట్టి నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఆతిథ్య రంగం భారత ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం, ఆతిథ్య రంగం కీలకపాత్ర పోషిస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2014 గణాంకాల ప్రకారం దేశ ఆతిథ్య రంగం ఏటా 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో సుశిక్షితులైన హాస్పిటాలిటీ మానవ వనరులకు డిమాండ్ ఉంటోంది. అందువల్ల 10+2 తర్వాత హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. జేఈఈ: జాతీయ స్థాయిలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ). దీన్ని ఏటా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 21 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, 16 రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, 15 ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో మూడేళ్ల వ్యవధి ఉన్న బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అభ్యసించొచ్చు. దీనికి ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులు అర్హులు. అవకాశాలు: హోటల్ మేనేజ్మెంట్లో ప్రధానంగా నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ), ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. వీటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని కెరీర్లో స్థిరపడొచ్చు. ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల్లోనూ అవకాశాలుంటాయి. సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఎంటర్ప్రెన్యూర్గానూ స్థిరపడొచ్చు. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో ఐదంకెల జీతం పొందొచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీగా అరుుతే రూ. 15 నుంచి రూ. 18 వేలు, ట్రైనీ సూపర్వైజర్కైతే రూ. 10 నుంచి రూ. 14 వేలు, మిగతా విభాగాల వారికి రూ. 10 వేలు వర కూ వేతనం లభిస్తుంది. -
ఆస్తిపన్ను వసూళ్లలో అగ్రస్థానం
టవర్ సర్కిల్ : ఆస్తిపన్నుల వసూళ్లలో కరీంనగర్ నగరపాలక సంస్థ నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్లోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. పక్కా ప్రణాళికతో పన్నులు వసూలు చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్దేశిత లక్ష్యం సాధిస్తున్నారు. దీనికితోడు ఈఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలు వడ్డీమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ప్రజలు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లిస్తూ కార్పొరేషన్కు సహకరిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 94.5శాతం పన్నులు వసూలు చేశారు. ప్రభుత్వ సంస్థల బకాయిల వసూలు ఇబ్బందికరంగా తయారైనా ప్రజల సహకారంతో కార్పొరేషన్ ప్రథమస్థానంలో నిలుస్తోంది. మొదటి అర్ధ సంవత్సరం వసూళ్లు ఆశాజనకంగా లేకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలలైన ఫిబ్రవరి, మార్చిలో వసూళ్లు ఊపందుకున్నారుు. బిల్కలెక్టర్లు ఇంటింటా తిరగకున్నా ఇంటి యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తున్నారు. జోరందుకున్న నిర్మాణ రంగం.. నాలుగేళ్లుగా నగరంలో నిర్మాణ రంగం జోరందుకుంది. కార్పొరేషన్కు ఆదాయ వనరులు పెరిగాయి. అరుునా, వసూళ్లు తగ్గడంలేదు. అందుకు తగిన విధంగానే సిబ్బంది పనిచేస్తున్నారు. 2011-12లో కరీంనగర్ కార్పొరేషన్ 96శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రస్థాయి రికార్డు సొంతం చేసుకుంది. కరీంనగర్ బల్దియా పన్నుల వసూళ్లలో నాలుగేళ్లుగా వరంగల్ రీజియన్ స్థాయి మున్సిపాలిటీలు, కారొపరేషన్లలో ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.18 లక్షలు నగరపాలక సంస్థకు ఆరేళ్లుగా బకాయి పడ్డ రూ.18 లక్షల ఆస్తి పన్నును బీఎస్ఎన్ఎల్ అధికారులు మంగళవారం చెల్లించారు. అరుుతే, మిగతా ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు రూ.4కోట్ల పన్ను బకారుులు రాబట్టడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. వడ్డీమాఫీ పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి పలు కార్యాలయాలకు పన్ను డిమాండ్తో పాటు నోటీసులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ఏప్రిల్ 1 నుంచి యథావిధిగా వడ్డీతో సహా పన్ను బకారుులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పన్ను వసూళ్ల వివరాలు ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు (శాతంలో..) 2014-15 94.5 2013-14 90 2012-13 92 2011-12 96 2010-11 93 2009-10 94 -
ఆర్థిక వ్యవస్థపై ఎన్నికల అనిశ్చితి ప్రభావం
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థపై దుష్ర్పభావం పడే అవకాశాలున్నాయని పారిశ్రామిక చాంబర్ అసోచామ్ అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కష్టమేనని ఇన్వెస్టర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ కిచిడీ సంకీర్ణ ప్రభుత్వం గనుక వస్తే... ఇప్పుడున్న పాలసీలతోపాటు మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టవచ్చని వారు భయపడుతున్నట్లు అసోచామ్ అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇతర ముఖ్యాంశాలివీ... ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్ సభ ఎన్నికల విషయంలో అనిశ్చితిని మరింత పెంచాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్య శక్తిగా అవతరించడంతో కచ్చితంగా ప్రాంతీయ, చిన్న పార్టీలు తమ ప్రాభల్యాన్ని పెంచుకోవచ్చనే సంకేతాలు బలపడ్డాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న దాఖలాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. పారిశ్రామిక, సేవల రంగంలోని చాలా విభాగాల్లో సానుకూల పరిస్థితులు కానరావడం లేదు. రానున్న కొత్త ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా క్లిష్టమే. భారీ సామాజిక పథకాల కారణంగా ప్రభుత్వ వ్యయం భారీగా ఎగబాకనుంది. మరోపక్క, ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుండటంతో... ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం అనుకున్నంతగా రావడం లేదు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్రంలో అనిశ్చిత సంకీర్ణ ప్రభుత్వం ఖాయమన్న అంచనాలు తీవ్ర ప్రతికూలతలకు దారితీస్తాయి. కేంద్రంలో రానున్న కొత్త సర్కారు తక్షణం అమలు చేయాల్సిన ప్రధాన సవాళ్లను కూడా గుర్తించారు. ప్రభుత్వ సబ్సిడీల వ్యయానికి అడ్డుకట్టవేయడం ఉపాధి కల్పనకు కీలకమైన అధిక వృద్ధి బాటలోకి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణ ఇందులో ముఖ్యమైనవి. అదేవిధంగా తీవ్ర రుణ భారంతో సతమతమవుతున్న రియల్టీ, టెలికం, పవన విద్యుత్, యంత్ర పరికరాలు, ఇన్ఫ్రా తదితర రంగాల్లోని కంపెనీలు కొత్త ప్రభుత్వం నుంచి చాలా అశిస్తున్నాయి. పారిశ్రామిక రంగం పుంజుకోవాలంటే... తయారీ రంగాన్ని పునరుత్తేజపరచడం, భారీ మౌలిక రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు జోరందుకునేలా చేయ డం వంటివి కొత్త ప్రభుత్వానికితక్షణ విధులు.