-
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
వీరికి ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు విషయంలో స్థానికంగా నివసించని వారు, విదేశీ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. భారత్లో నివసించని వారు (కార్పొరేట్స్).. నిర్దేశిత ఫండ్లో పెట్టుబడులు మినహా ఎటువంటి ఆదాయాన్ని పొందని వారు.. గిఫ్టిసిటీలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ–3 కిందకు వచ్చే వారు రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదని సీబీడీటీ తన నోటిఫికేషనలో తెలిపింది. అర్హత కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు.. జీడీఆర్, రూపీ డినామినేటెడ్ బాండ్లు, డెరివేటివ్లు లేదా ఎంపిక చేసిన సెక్యూరిటీలు, ఐఎఫ్ఎస్సీలోని గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించిన వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. -
ట్యాక్స్ రిటర్నులు రద్దు అయితే ఏం చేయాలి?
గత కొద్ది రోజులుగా మీలో కొంత మంది గమనించే ఉంటారు. 31-3-2020తో పూర్తయిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో కొంత మందికి నోటీసులు వచ్చాయి. సెక్షన్ 139(9) ప్రకారం డిపార్టుమెంటు వారు నోటీసులు ఇవ్వొచ్చు. ఈ నోటీసుకి బదులుగా రిటర్నుని సరిచేస్తూ 15 రోజుల్లో తెలియజేయాలి. ఏ సందర్భంలో తప్పులు జరిగే అవకాశం ఉందంటే.. సరైన ఫారంలో రిటర్న్ ఫైల్ చేసి ఉండకపోతే.. ఉదాహరణకు ఫారం 2కి బదులుగా ఫారం 3 ఫైల్ చేయడం వంటివి. రిటర్నుల్లో అంశాలకు సంబంధించి వివరాలు పొందుపర్చకపోవడం. నింపకపోవడం. తప్పుగా రాయడం. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. ప్రతీ కాలమ్కి బదులివ్వాలి. కొన్ని మీకు వర్తించవు. కొన్ని మీకు ఉండకపోవచ్చు. వర్తించకపోతే ‘నాట్ అప్లికేబుల్’ అని రాయాలి. ఉండకపోతే ‘నిల్’ అని రాయాలి. ఆన్లైన్ ఫైలింగ్లో చిన్న తప్పు జరిగినా, రిటర్ను డిఫెక్టివ్ అయిపోతుంది. ఆదాయం వివరాలను తప్పుగా డిక్లేర్ చేసినా, టీడీఎస్ మొత్తానికి.. ఆదాయానికి పొంతన లేకపోయినా.. అంటే ఉదాహరణకు వడ్డీకి సంబంధించిన టీడీఎస్ చూపించి ఆ ఆదాయాన్ని చూపించకపోవడం లాంటి తప్పిదాలు. అకౌంట్ బుక్స్ కంపల్సరీ అయిన చోట ‘అవసరం లేదు’ అని రాయడం. ఆడిట్ అవసరం అయిన చోట ఆ వివరాలు రాయకపోవడం, వివరాలను తప్పుగా రాయడం .. ట్యాక్స్ ఆడిట్ వివరాలు రాయకపోవడం లేదా తప్పుగా రాయడం మొదలైనవి ఊహాజనిత పన్ను చెల్లించినప్పుడు వివరాలు ఇవ్వకపోవడం, తప్పుగా రాయడం పన్నులు చెల్లించిన వివరాలు పొందుపర్చకపోవడం, పన్నుల వివరాలు సరిపోలకపోవడం సమాచారం తప్పుగా రాయడం.. వ్యత్యాసాలు కనిపించడం, షెడ్యూల్లో వివరాలు తప్పుగా రాయడం వంటి తప్పిదాలు ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడు నోటీసులు రావచ్చు. అయితే, ఆ నోటీసులు రాగానే.. భయపడనవసరం లేదు. ‘డిఫెక్ట్’ ఏమిటో తెలుసుకోండి. వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. నోటీసు కనిపిస్తుంది. డౌన్లోడ్ చేయండి ‘డిఫెక్ట్’ని అర్థం చేసుకోండి. వారు పేర్కొన్న ‘డిఫెక్ట్’ని అంగీకరించిన పక్షంలో, ఒప్పుకున్నామని తెలియజేస్తూ దాన్ని సరిచేయండి. ఒకవేళ వారితో ఏకీభవించకపోతే ‘నో’ అని జవాబు ఇవ్వండి. ఇందుకు తగిన కారణాలు చెప్పాలి. జవాబు 15 రోజుల్లోగా ఇవ్వాలి అలా ఇవ్వకపోతే రిటర్ను రద్దు అయిపోతుంది. మీరు రిటర్నులు దాఖలు చేసినట్లుగా పరిగణించరు. డిఫెక్ట్ని సరిచేసినప్పుడు సమగ్ర సమాచారం ఇవ్వాలి. రిటర్నుని మళ్లీ నింపాల్సి రావచ్చు. రిఫరెన్సులు ఇవ్వాలి. స్క్రీన్ మీద అన్ని వివరాలు వస్తాయి. ఓపిగ్గా.. జాగ్రత్తగా సరిచేయండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూరి కె.వి.ఎన్ లావణ్య -
వృద్ధులకే కాస్త ఊరట
న్యూఢిల్లీ : వ్యక్తిగత ఆదాయపన్ను (ప్రత్యక్ష పన్ను) రేట్లలో కచ్చితంగా మార్పులు ఉంటాయన్న అంచనాలకు భిన్నంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. యథాతథ స్థితికే మొగ్గు చూపించారు. ఆదాయపన్ను శ్లాబుల్లోకానీ, రేట్లలో కానీ మార్పుల జోలికి వెళ్లలేదు. ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఆదాయం పెంచుకునేందుకు ఆదాయపన్ను రేట్లను పెంచకపోవడమే. రూ.2,50,000 లక్షల వరకు ఉన్న బేసిక్ ఎగ్జెంప్షన్ అలానే కొనసాగనుంది. రూ.2,50,000కు పైన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 వరకు ఉన్నా కానీ (మినహాయింపులు పోను) పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేదు. సెక్షన్ 87ఏ కింద రూ.12,500 రాయితీని పొందొచ్చు. దీంతో పలు సెక్షన్ల కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న అనంతరం నికర ఆదాయం రూ.5లక్షల వరకు ఉంటే పన్ను బాధ్యత లేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో అమల్లో ఉన్న రేట్ల ప్రకారమే ఆదాయపన్ను చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. 2020 బడ్జెట్లో నూతన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తూ.. పాత, కొత్త విధానాల్లో తమకు నచ్చిన విధానంలో కొనసాగొచ్చంటూ మంత్రి సీతారామన్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ రెండు విధానాలు ఇక ముందూ కొనసాగనున్నాయి. కాకపోతే ఒక్కసారి నూతన విధానాన్ని ఎంచుకుంటే, మళ్లీ తిరిగి పాత విధానానికి మారేందుకు వీలుండదు. నూతన పన్ను విధానంలో చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పన్నుల రేటు తక్కువగా ఉంటుంది. భవిష్యనిధి చందాపై పన్ను అధిక ఆదాయ వర్గాల భవిష్యనిధి వాటాలపై స్వల్ప పన్నును మంత్రి ప్రతిపాదించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి తరఫున చందా రూ.2.5లక్షలు మించితే, వడ్డీ ఆదాయంపై 1 శాతం పన్ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అధిక విలువ కలిగిన డిపాజిటర్లను మంత్రి లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈపీఎఫ్ అని గుర్తు చేస్తూ.. నెలకు రూ.2లక్షల్లోపు ఆర్జించే వారిపై తాజా ప్రతిపాదన ఎటువంటి ప్రభావం చూపించదని మీడియా సమావేశంలో మంత్రి స్పష్టం చేశారు. రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ పరిమితిగా ఉందని, ఈ మొత్తంపై వడ్డీకి పన్ను మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. రూ.2.5 లక్షలకు మించి చందాదారుల సంఖ్య మొత్తం సభ్యుల్లో ఒక శాతాన్ని మించదని వ్యయాల విభాగం సెక్రటరీ టీవీ సోమనాథన్ తెలిపారు. 75 దాటితే నో ఐటీ రిటర్న్స్ పెన్షన్ ఆదాయం, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కలిగిన 75 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారు ఇక మీదట ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ అందుకుం టున్న బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం కూడా వస్తుండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 75 ఏళ్లు నిండిన వృద్ధులపై నిబంధనల అమలు భారాన్ని దించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు. రిటర్నుల దాఖలులో మినహాయింపునిచ్చినా కానీ, పన్ను బాధ్యత మాత్రం కొనసాగుతుంది. అంటే ఆదాయంపై నిబంధనల మేరకు పన్నును సంబంధిత బ్యాంకు మినహా యించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుందని ఆర్థిక శాఖా కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే మీడియాకు స్పష్టం చేశారు. పెన్షన్, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒకే బ్యాంకు నుంచి ఉంటేనే ఈ వెసులుబాటు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఆదాయం వస్తూ, మరో బ్యాంకులో ఎఫ్డీలపై వడ్డీ ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్, ఎఫ్డీలపై వడ్డీకాకుండా ఇతర రూపాల్లో ఆదాయం ఉన్నా కానీ రిటర్నుల దాఖలు తప్పనిసరి. సొంతింటి రుణ వడ్డీపై పన్ను మినహాయింపు అందుబాటు ధరల ఇళ్లను రుణంపై కొనుగోలు చేసుకునే వారికి ఈ బడ్జెట్లో ఊరట లభించింది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో అదనంగా కల్పించిన పన్ను మినహాయింపును.. మరో ఏడాది పాటు 2022 మార్చి 31 వరకు పొడిగిస్తూ బడ్జెట్లో నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఇళ్ల కొనుగోలుపైనా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. వాస్తవానికి ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపు గతంలో ఉండగా, దీనికి అదనంగా మరో రూ.1.5లక్షలపైనా పన్ను మినహాయింపును సెక్షన్ 80ఈఈఏ కింద 2019 బడ్జెట్లో ప్రకటించారు. మొదటిసారి ఇంటి కొనుగోలు చేసుకునే వారు, అది కూడా రూ.45లక్షల బడ్జెట్ మించని ఇళ్ల కొనుగోలుదారులకే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే మొత్తం మీద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.3.5 లక్షల వడ్డీ చెల్లింపులపై పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఇది కాకుండా ఇంటి రుణం అసలుకు చేసే జమలు రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద చూపించుకునే అవకాశం ఎలానూ ఉంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఇవే.. సెక్షన్ 80సీ: ఇంటి రుణంలో అసలుకు (ప్రిన్సిపల్) చేసే చెల్లింపులు రూ.1.5 లక్షల మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఇంటిని స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఐదేళ్లలోపు విక్రయించకుండా ఉంటేనే ఈ మినహాయింపులకు అర్హులు. ఒకవేళ విక్రయిస్తే తిరిగి పన్ను చెల్లించాల్సి వస్తుంది. సెక్షన్ 24బీ: ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2లక్షల మొత్తంపై ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపును కోరొచ్చు. కాకపోతే నూతన ఇల్లు కొనుగోలు/నిర్మాణం అన్నది రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈ: ఈ సెక్షన్ కింద రూ.50,000 వడ్డీ చెల్లింపులపై అదనపు పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రుణం రూ.35 లక్షలకు మించకూడదు. ప్రాపర్టీ విలువ రూ.50లక్షలు మించకూడదు. సెక్షన్ 80ఈఈఏ: రూ.45 లక్షలకు మించని, మొదటిసారి ఇల్లు కొనుగోలుపై సెక్షన్ 80ఈఈఏ కింద అదనంగా (24బీకి అదనంగా) మరో రూ.1.5 లక్షల వడ్డీ చెల్లింపులపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకునే వారు సెక్షన్80ఈఈ కింద క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. సెక్షన్80సీ: ఈ సెక్షన్ కింద స్టాంప్ డ్యూటీ చెల్లింపులు రూ.1.5లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. చెల్లింపులు చేసిన ఆర్థిక సంవత్సరానికే క్లెయిమ్ చేసుకునే అర్హత ఉంటుంది. -
ట్రంప్ ఐటీ 750 డాలర్లు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016, 2017 సంవత్సరాల్లో ఏటా కేవలం 750 డాలర్ల ఆదాయపన్ను చెల్లించారని న్యూయార్క్టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అదే 2017లో ఆయన, ఆయన కంపెనీలు భారత్లో పన్ను రూపేణా 1,45,400 డాలర్లు చెల్లించారని తెలిపింది. అదే సంవత్సరంలో పనామాలో 15,598 డాలర్లు, ఫిలిప్పీన్స్లో 1,56,824 డాలర్ల పన్నును చెల్లించినట్లు వివరించింది. కానీ స్వదేశానికి వచ్చేసరికి గత 15 సంవత్సరాల్లో పదేళ్లు ఎలాంటి పన్ను చెల్లించలేదని పేర్కొంది. ఆయా సంవత్సరాల్లో తనకు లాభాల కన్నా నష్టాలే ఎక్కువని ట్రంప్ చూపినట్లు తెలిపింది. గత ఇరవై సంవత్సరాల టాక్స్ రిటర్న్ డేటాను విశ్లేషించి ఈ విషయం రాబట్టినట్లు తెలిపింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో పన్ను ఆరోపణలు రావడం ట్రంప్నకు ఇబ్బందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అవాస్తవ కథనాలని ట్రంప్ కొట్టి పారేశారు. తాను పన్నులు చెల్లించానని, ప్రస్తుతం తన టాక్స్ రిటర్న్స్ ఆడిటింగ్లో ఉన్నాయని, పూర్తయ్యాక చెక్ చేసుకోవచ్చని తెలిపారు. న్యూయార్క్టైమ్స్ అనవసరంగా తనపై బురదజల్లుతోందన్నారు. పలు రాష్ట్రాల్లో తాను ఎంతో సొమ్మును పన్నుల రూపంలో చెల్లించానన్నారు. తనకున్న పలు కంపెనీలన్నింటి వివరాలతో కలిపి తన ట్యాక్స్ ఫైలింగ్స్ 108 పేజీలుంటుందని చెప్పారు. మంగళవారం మాటల పోరు నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం ఈ నెల 29 నుంచి మరింత ఊపందుకోనుంది. మంగళవారం రోజు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ట్రంప్, జోబైడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రధానడిబేట్లు 3 జరుగుతాయి. ‘సూపర్ బౌల్ ఆఫ్ అమెరికన్ డెమొక్రసీ’ పేరిట జరిగే ఈ కార్యక్రమంలో ఇరువురు వివిధ అంశాలపై తమపై సంధించే ప్రశ్నలకు సమాధానాలిస్తారు. అక్టోబర్ 7న ఉపాధ్యక్ష అభ్యర్ధులు మైక్ పెన్స్, కమలాహారిస్లు డిబేట్లో పాల్గొంటారు. -
కరోనా కల్లోలం.. ఆర్థిక ఉపశమనం!
న్యూఢిల్లీ : కోవిడ్–19 వైరస్ కారణంగా ప్రజలు, వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆదాయపన్ను రిటర్నులు, జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువులను పెంచింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో లావాదేవీల చార్జీలు, బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ నిర్వహణ చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ప్రకటించారు. ►2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ►అలాగే, గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలు గడువు ఈ నెలాఖరు వరకే ఉండగా, ఇది సైతం జూన్ 30 వరకు పెరిగింది. ►మార్చి, ఏప్రిల్, మే నెలల జీఎస్టీ రిటర్నులను ఎటువంటి జరిమానాలు లేకుండా జూన్ నెలాఖరు వరకు దాఖలు చేసుకోవచ్చు. దీంతో ఆలస్యపు రిటర్నులపై రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు పెనాల్టీ, ఆలస్యపు రుసుములు ఉండవు. రూ.5 కోట్ల టర్నోవర్ దాటిన వారు సైతం జూన్ నెలాఖరు వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కానీ, గడువు దాటిన తర్వాత కాలానికి 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ►ఆధార్, పాన్ అనుసంధాన గడువు జూన్ 30 వరకు పెరిగింది. ►ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో డెబిట్కార్డు లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన పని లేదు. ఇది మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది. మెట్రోల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల్లో లావాదేవీలు మూడు మించితే, నాన్ మెట్రోలో ఐదు లావాదేవీల తర్వాత ప్రస్తుతం చార్జీ విధిస్తున్నారు. ►సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహణలో విఫలమైతే వసూలు చేసే చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసింది. ►డిజిటల్ రూపంలో చేసే వాణిజ్య లావాదేవీల చార్జీలతగ్గింపు. ►ఆదాయపన్ను వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన వివాద్సే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగింపు. దీనివల్ల జూన్ నాటికి చేసే చెల్లింపులపై అదనంగా 10 శాతం చార్జీ ఉండదు. ►పొదుపు సాధనాల్లో పెట్టుబడులు లేదా మూలధన లాభాల పన్ను ఆదా కోసం చేసే పెట్టుబడుల గడువు, నోటీసుల జారీ గడువును కూడా మూడు నెలలు పొడిగించారు. ►ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ పన్ను మదింపు, రెగ్యులర్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, ఎస్టీటీ ఆలస్యపు చెల్లింపులపై వడ్డీ రేటు 12/18 శాతానికి బదులు 9 శాతం వసూలు చేస్తారు. ►కంపెనీల డైరెక్టర్ల బోర్డులు చట్ట ప్రకారం 120 రోజులకోసారి సమావేశం కావాల్సి ఉండగా, ఈ గడువును కూడా మరో 60 రోజులు పొడిగించారు. దివాలా చర్యల సడలింపు ప్రస్తుతం రూ.లక్ష మేర రుణ చెల్లింపుల్లో విఫలమైతే దివాలా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది. దీన్ని రూ.కోటికి పెంచినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) పెద్ద ఎత్తున దివాలా చర్యలు ఆగిపోతాయని మంత్రి చెప్పారు. ‘‘ప్రస్తుత పరిస్థితే ఏప్రిల్ 30 తర్వాత కూడా కొనసాగితే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) 2016 చట్టంలోని సెక్షన్ 7, 9, 10లను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని పరిశీలిస్తాము. దీనివల్ల కంపెనీలు పెద్ద సంఖ్యలో దివాలా చర్యల బారిన పడకుండా నిరోధించినట్టు అవుతుంది’’ అని మంత్రి తెలిపారు. అతి త్వరలో ప్యాకేజీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ ముగింపు దశలో ఉందని, దీన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రతీ దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. ప్రధానమంత్రి సైతం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన కోవిడ్–19 ఎకనమిక్ టాస్క్ఫోర్స్ కూడా పని ప్రారంభించింది. టాస్క్ఫోర్స్ పని ఎన్నో అంచనాలతో కూడుకుని ఉంటుంది. దాదాపుగా ఇది ముగింపు దశలో ఉంది’’ అని మంత్రి వివరించారు. స్టాక్ మార్కెట్లను గమనిస్తున్నాం ఆర్థిక శాఖ, ఆర్బీఐ, సెబీ తదితర అన్ని ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు కలసి కట్టుగా పనిచేస్తూ.. కోవిడ్–19 కారణంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రోజులో మూడు పర్యాయాలు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే సెబీ కొన్ని చర్యలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోవిడ్–19 మన దేశంలోకి ప్రవేశించిన నెల రోజుల్లోనే సెన్సెక్స్ 15 వేల పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 4 వేల పాయింట్లకు పైగా పడిపోయిన విషయం తెలిసిందే. -
పన్ను చెల్లించండి బంగారం గెలవండి
ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్ విజయ్ హన్మానే తెలిపారు. -
పన్నుభారం... తగ్గించుకుందాం!
ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరే!! కాకపోతే కొందరు పన్ను తగ్గించుకోవటానికి తాము గరిçష్టంగా ఎంత పొదుపు చేయగలమో అంతా చేస్తారు. ఆ రకంగా పొదుపును కూడా పెంచుకుంటారు. ఇవన్నీ ప్రతిబింబించేలా పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. మరికొందరు మాత్రం నామమాత్రపు కార్యక్రమంగా కానిచ్చేస్తుంటారు. తమకున్న అన్ని రకాల ఆదాయం, ఖర్చులు, వాటికి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉన్న మినహాయింపుల గురించి అవగాహన కలిగిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. దీంతో ఆ మినహాయింపులను ఉపయోగించుకోరు. ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 80సీ కింద ఉన్న పన్ను మినహాయింపుల గురించే సాధారణ అవగాహన ఉంటుంది తప్ప, ఇతర సెక్షన్ల గురించి తెలిసిన వారు కూడా తక్కువ మందే!! కొంత సమయం వెచ్చించి అవేంటన్నది తెలుసుకుంటే మినహాయింపుల ద్వారా పన్ను భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్పై వడ్డీ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్పై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమవుతుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఏటా ఈ వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో బ్యాలెన్స్పై వడ్డీకి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంతకు మించితే మాత్రం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు మినహాయింపు అంటే... మొత్తం ఆదాయంలో రూ.10,000 తగ్గించి చూపించుకోవడం అని పొరపడొద్దు. ఇతర ఆదాయం కాలమ్లో వడ్డీ ఆదాయాన్ని చూపించి అది రూ.10 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అది ఈ సెక్షన్ కిందికి రాదు. ఇంటి అద్దె చెల్లింపులు... చట్టంలోని సెక్షన్ 80జీజీ ప్రకారం, వేతన ప్యాకేజీలో భాగంగా హెచ్ఆర్ఏ లేకపోతే... వేతన ఉద్యోగి కాని వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. తన పేరు, తన జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట ఇల్లు ఉండి, ఆ ఆంట్లో నివసిస్తుంటే మాత్రం ఈ ప్రయోజనానికి అనర్హులు. మొత్తం ఆదాయంలో 10 శాతాన్ని అద్దెగా చెల్లిస్తుంటే లేదా, మొత్తం ఆదాయంలో 25% లేదా ప్రతీ నెలా రూ.5,000 మొత్తం వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఆదాయం అంటే సెక్షన్ 80సీ, 80యూ, 80జీజీ కింద మినహాయింపులు పోనూ మిగిలింది. తీవ్ర అనారోగ్యాలు, వ్యాధులు ఈ వ్యయాలను 80డీడీబీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా రూ.40,000 వరకు చేసే ఖర్చుకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్ సిటిజన్ అయితే ఈ పరిమితి రూ.60,000. సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్లకుపైన) అయితే... పరిమితి రూ.80,000. అయితే, ఈ వ్యాధులకయ్యే ఖర్చును బీమా పాలసీ ద్వారా పొందితే పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండదు. పాక్షికంగా రీయింబర్స్మెంట్ వస్తే, మిగిలిన మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు లేదా అతని జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణులకు సంబంధించి ఖర్చు చేసినా ఈ చట్టం కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు... నివసిస్తున్న భవనం కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. 2016 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణం తీసుకుని ఉండాలి. ఇంటివిలువ రూ.50 లక్షల్లోపు, రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. అలాగయితే సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పైన ఉంటే, అప్పుడు సెక్షన్ 80ఈఈ కింద మరో రూ.50వేలకు పన్ను మినహాయింపు పొందే అవకాశముంది. హోమ్ లోన్ అనుబంధ చార్జీలకూ... ఇంటి రుణం తీసుకునే సమయంలో చేసే ఇతర చెల్లింపులక్కూడా పన్ను మినçహాయింపు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజుపైనా సెక్షన్ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర చెల్లింపులను సైతం వడ్డీగానే చట్టం పరిగణిస్తోంది. డౌన్ పేమెంట్... రుణాల కోసం కొందరు స్నేహితులు లేదా తెలిసిన వారి నుంచి చేబదులు తీసుకుని డౌన్ పేమెంట్ సమకూర్చుకుంటారు. ఈ మొత్తంపై వడ్డీ చెల్లించినా సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, ఆధునికీకరణ, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులు సైతం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వైకల్యం కలిగిన వారికి... 40 శాతం వైకల్యం కలిగిన వారు వార్షికంగా రూ.75,000 వరకు సెక్షన్ 80యూ కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. తమపై వైకల్యం కలిగిన వారు ఆధారపడి ఉన్నా గానీ, వారిపై చేసే ఖర్చులకు సెక్షన్ 80డీడీ కింద 75,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ వైకల్యం తీవ్రత 80 శాతంపైన ఉంటే అప్పుడు వార్షికంగా రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే పెట్టుబడులపై వచ్చే ఆదాయం తమ ఆదాయం కిందే చూపించి పన్ను చెల్లించాలి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా వైకల్యంతో ఉంటే, వారి పేరిట చేసే పెట్టుబడులకు ఇది వర్తించదు. వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట పెట్టుబడులపై ఆదాయం తండ్రి ఆదాయంగా చట్టం చూడదు. కనుక పన్ను వర్తించే పెట్టుబడులను వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట చేసుకుంటే పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు. నష్టాలు చూపించుకోవచ్చు... గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై నష్టపోయిన వారు, అదే సంవత్సరంలో షేర్లు, ప్రాపర్టీ, బంగారం, డెట్ ఫండ్స్ విక్రయంపై వచ్చిన మూలధన లాభాల పన్ను నుంచి నష్టాలను మినహాయించుకోవచ్చు. స్వల్ప కాలిక మూలధన నష్టాలను, స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది. వివిధ సంస్థలకు విరాళాలిస్తే... విరాళాలపై సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయంలో ఇది 10 శాతాన్ని మించకూడదు. ముఖ్యంగా ఈ సెక్షన్ కింద ప్రభుత్వం నోటిఫై చేసిన ఫండ్స్కు ఇచ్చే విరాళాలకే ఈ పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే, నగదు రూపంలో విరాళం రూ.2,000 మించి ఇస్తే మినహాయింపునకు అవకాశం లేదు. నేషనల్ డిఫెన్స్ ఫండ్, జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు ఉపశమన నిధి, జాతీయ చిన్నారుల నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, క్లీన్ గంగా ఫండ్ తదితరమైనవి ప్రభుత్వం నోటిఫై చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే, ఆలయాలు, చర్చిలు, మసీదుల నవీకరణకు ఇచ్చే విరాళాలకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది. ప్రత్యేకమైన పరిశోధనలు లేదా యూనివర్సిటీ లేదా కాలేజీలను ప్రభుత్వం సెక్షన్ 35(1)(2), సెక్షన్(1)(3), 35సీసీఏ, 35సీసీబీ కింద ఆమోదించి ఉంటే, వీటికి చేసే విరాళాలకు సెక్షన్ 80జీజీఏ రూ.10,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందుకు నగదు రహితంగానే విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం రూపంలో లేదా వృత్తి రూపంలో ఆదాయం కలిగిన వారికి ఈ ప్రయోజనం లేదు. వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలపైనా సెక్షన్ 80జీజీసీ కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపునకు పరిమితి లేదు. ఎంత మొత్తాన్నయినా విరాళంగా అందించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే నగదు రహితంగానే విరాళాలు అందించి ఉండాలి. వైద్య బీమా ప్రీమియం చెల్లిస్తే.. వైద్య బీమా పాలసీకి ఏటా చెల్లించే ప్రీమియం మొత్తానికి సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, వారి జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు వీరిలో ఎవరి పేరిట తీసుకున్నా గానీ, చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వార్షికంగా తన పేరిట, జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే వైద్య బీమా ప్రీమియం రూ.25,000పై ఈ పరిమితి పొందొచ్చు. దీనికి అదనంగా తల్లిదండ్రుల వైద్య బీమా పాలసీకి చేసే చెల్లింపులు మరో రూ.25,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీరు 60 ఏళ్లు దాటిన వారు అయితే రూ.30,000 వరకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) అయితే, ఏ సభ్యులు ప్రీమియం చెల్లించినా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం చేసే చెల్లింపులు రూ.5,000 వరకు కూడా మినహాయింపు అమల్లో ఉంది. విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు ఉన్నత విద్య కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులకు సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా చట్టబద్ధంగా వేరెవరైనా విద్యార్థి తన సంరక్షణలో ఉంటే, వారి పేరిట తీసుకునే విద్యా రుణాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు. కేవలం వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు, అది కూడా రుణం తీసుకున్న తర్వాత ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్ తర్వాత చేసే ఉన్నత విద్యా కోర్సుల కోసం తీసుకునే రుణాలకే ఈ ప్రయోజనం. వడ్డీ రూపంలో చెల్లింపుల పరిమితి లేదు. ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాయల్టీ ఆదాయానికీ మినహాయింపు... రచయితలకు వారి రచనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, వార్షికంగా రూ.3 లక్షలకు సెక్షన్ 80క్యుక్యుబి ప్రకారం పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రాయల్టీ ఆదాయం ఏక మొత్తంలో వచ్చి ఉండాలి. ఏక మొత్తంలో కాకుండా వాయిదాలుగా అందుకుంటే మాత్రం రాయల్టీ ఆదాయంలో 15 శాతానికే పన్ను మినహాయింపు పరిమితం అవుతుంది. మేథో సంపత్తి హక్కులు 2003 ఏప్రిల్ 1 తర్వాత నమోదయిన ఏ పేటెంట్ ద్వారానైనా రాయల్టీ ఆదాయం అందుకుంటుంటే సెక్షన్ 80ఆర్ఆర్బి కింద ఒక ఏడాదిలో రూ.3లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. పన్ను వర్తించని ఆదాయాన్ని చూపించాలి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం కచ్చితంగా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ, 80 శాతం పన్ను చెల్లింపుదారులు వడ్డీ ఆదాయాన్ని చూపించడంలేదని ట్యాక్స్ స్పానర్ అనే పోర్టల్ పరిశీలనతో తేలింది. పన్ను చెల్లించకూడదన్న ఉద్దేశంతో, పన్ను నోటీసు అందుకోకూడదన్న అభిప్రాయంతో ఈ ఆదాయాన్ని చూపించడం లేదని ట్యాక్స్ స్పానర్ డాట్ కామ్ సీఎఫ్వో కౌశిక్ చెప్పారు. ♦ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పన్ను లేదని పైన చెప్పుకున్నాం. నిజానికి రూ.2.5 లక్షలను ఏడాది పాటు బ్యాంకులో ఉంచితే ఈ మేరకు వడ్డీ ఆదాయం వస్తుంది. రూ.10,000కు పైన వడ్డీ ఆదాయం అందుకునే వారు తక్కువ మందే ఉంటారు. కానీ, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం రూ.10,000లోపు ఉన్నా పన్ను రిటర్నుల్లో తప్పకుండా ఆ ఆదాయాన్ని చూపించాలి. ♦ ఐటీఆర్–1లో ఎగ్జెంప్ట్ ఇన్కమ్ అనే కాలమ్లో ఇలా పన్ను రహిత ఆదాయాన్ని పేర్కొనాలి. ♦ డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఉంటే సెక్షన్ 10 (34) కింద పన్ను ఉండదు. అలాగే, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ రూపంలో వచ్చే ఆదాయం లేదా పరిహారానికి సెక్షన్ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ఉంది. వీటిని సైతం రిటర్నుల్లో పేర్కొనడం ద్వారా పన్ను అధికారులకు సందేహాలు తలెత్తితే సమాధానం చెప్పడం సులభం అవుతుందని నిపుణుల సూచన. ♦ ఇక అధిక విలువతో కూడిన పెట్టుబడుల వివరాలను కూడా పన్ను రిటర్నుల్లో పేర్కొనాలని సూచిస్తున్నారు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించాలా? ♦ ఇక్కడ నివసించేవారు, ఎన్ఆర్ఐలకు వేర్వేరుగా నిబంధనలు ♦ ఎన్ని రోజులున్నారన్న అంశం ఆధారంగా వర్గీకరణ ♦ స్వదేశంలో ఉండే వారు విదేశీ ఆదాయం చూపించాల్సిందే ♦ ఎన్ఆర్ఐలు భారత్లో ఆదాయాన్ని రిటర్నుల్లో పేర్కొనాలి ♦ రిటర్నుల దాఖలు పత్రాలు కూడా వేరే పనిచేస్తున్న కంపెనీ తరఫున కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి విదేశీ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వీరు ఆర్జించే విదేశీ మారకాన్ని తమ పన్ను రిటర్నుల్లో చూపించాలా? స్వదేశానికి వెలుపల ఆర్జించిన మొత్తంపై పన్నుకు సంబంధించి నిబంధనలేంటి? విదేశీ ఆర్జనను పన్ను రిటర్నుల్లో ఎలా చూపించాలి? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానమే ఈ కథనం... విదేశీ ఆదాయం భారతీయ పన్ను చట్టాలు పన్ను చెల్లింపుదారులను ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు స్వదేశంలో ఉన్నారనే వివరాల ఆధారంగా వారిని నివాసితులు (రెసిడెంట్), నివాసేతరులు (నాన్ రెసిడెంట్)గా వర్గీకరించింది. వారి నివాస హోదాకు అనుగుణంగా భారతీయ పన్ను చట్టాల పట్ల వారికున్న బాధ్యతను విస్తృతంగా నిర్వచించాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ తమ హోదాను బట్టి వారు తమ ఆదాయాన్ని చూపించాలి. పన్ను చట్టాల ప్రకారం... దేశంలో నివసించే ప్రతి పౌరుడూ, దేశం వెలుపల తాను ఆర్జించిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అదే ఎన్ఆర్ఐ అయితే కేవలం భారత్లో ఆర్జించిన దాన్నే స్వదేశంలో దాఖలు చేసే రిటర్నుల్లో చూపిస్తే సరిపోతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో స్వదేశంలోను, విదేశంలోనూ ఒక కంపెనీ తరఫున పనిచేయడం ఇటీవల సాధారణంగా కనిపిస్తోంది. కంపెనీలు కొందరు ఉద్యోగులను విదేశాల్లోని కార్యాలయాల్లో విధుల కోసం కొంత కాలం పాటు పంపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను తరచుగా ఇలా పంపిస్తున్నాయి. ఆ పనికి చెల్లింపులను విదేశీ కార్యాలయం చేస్తుంటుంది. అప్పుడది విదేశీ ఆర్జన అవుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఇంటి నుంచి అద్దె రూపంలో కొందరికి ఆదాయం ఉండొచ్చు. ఇటువంటి ఆదాయాన్ని భారత్లో నివసించే వారు తప్పకుండా తమ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలు ఈ తరహా వ్యక్తులు అంటే విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించదలిస్తే వారికి ఐటీఆర్–1 వర్తించదు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించే వారు ఐటీఆర్–2ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్–2 లేదా ఐటీఆర్–3 ఈ రెండింటిలో ఒక దానిని వారి ఆదాయ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎఫ్ఎస్ఐ షెడ్యూల్లో చూపించాలి. రెండు పన్నులు భారత్లో నివసించే వారు తమ విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించి ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి అని చెప్పుకున్నాం. అయితే, ఒకవేళ పన్నులను విదేశాల్లోనే మినహాయిస్తే ఆ ఆదాయాన్ని ఇక్కడ చూపించి పన్ను చెల్లిస్తే అప్పుడు రెండు సార్లు పన్నులు చెల్లించినట్టు అవుతుంది. అందుకే ఒకసారి పన్ను మినహాయిస్తే దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. పలు దేశాలతో మనకు ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం ఉంది. విదేశీ ఆదాయంపై పన్నును అక్కడే మినహాయించేస్తే ఇక్కడ మరోసారి పన్ను చెల్లించే పని లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్నే విదేశీ పన్ను జమగా (ఎఫ్టీసీ) పేర్కొంటారు. -
వారికి ఐటీ శాఖ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ : శాలరీ క్లాస్ పన్నుచెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రిటర్నుల్లో ఆదాయాన్ని తక్కువ చేసి చూపించినా.. తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఎవరైనా ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలిస్తే వారిపై విచారణ చేపట్టనున్నామని, ఆ ఉద్యోగస్తులపై వారి ఎంప్లాయర్స్(సంస్థలు) కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలిపింది. ప్రముఖ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ ను క్లయిమ్ చేసుకుంటున్నారని ఇటీవల పలు రిపోర్టులు వచ్చాయి. పన్ను మధ్యవర్తుల ద్వారా తప్పుడు ఆదాయాలు చూపుతున్నట్టు తెలిపాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈ అడ్వయిజరీ జారీచేసింది. ఆదాయాన్ని తక్కువ చేసి చూపించడం, తీసివేత/మినహాయింపులను అక్రమంగా పెంచడం వంటి మోసాలకు పాల్పడితే, ఆదాయపు పన్ను చట్టంలోని పలు పీనల్, ప్రాసిక్యూషన్ నిబంధనల కింద చర్యలు తీసుకుంటామని ఈ అడ్వయిజరీలో తెలిపింది. బెంగళూరుకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలోని పలువురు ఉద్యోగులు తప్పుడు మార్గాల ద్వారా పన్ను రీఫండ్స్ను పొందారని డిపార్ట్మెంట్కు చెందిన విచారణ విభాగం తేల్చిన సంగతి తెలిసిందే. ట్యాక్స్ అడ్వయిజరీలతో ఈ మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. దీంతో శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కాగ, శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ ఫైలింగ్ సీజన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్ ప్రారంభించింది. కొత్త ఐటీఆర్ నిబంధనలను కూడా తీసుకొచ్చింది. -
కార్ల కొనుగోళ్లకూ ఆదాయాలకూ పొంతనేది?
పన్ను పరిధి నుంచి పెద్ద సంఖ్యలో తప్పించుకుంటున్నారన్న విమర్శ.. న్యూఢిల్లీ: భారీ సంఖ్యలో ప్రజలు పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్నారని ఒక ఉన్నతాధికారి విశ్లేషించారు. పన్ను రిటర్నుల ప్రకారం దేశంలో వార్షికంగా రూ.10 లక్షల పైబడిన ఆదాయం కలిగిన వారి సంఖ్య కేవలం 24 లక్షల మందేనని ఆ అధికారి పేర్కొంటూ, అయితే కొత్త కార్ల అమ్మకాల సంఖ్య మాత్రం వార్షికంగా 25 లక్షలుగా ఉంటోందన్నారు. వీటిలో లగ్జరీ కార్ల సంఖ్య దాదాపు 35,000. ‘‘ఒక కారు వినియోగ జీవిత కాలం దాదాపు ఏడేళ్లు. సామాన్యుడు ఒక కారు కొన్నాక మళ్లీ ఐదేళ్ల వరకూ కొత్త కారు కొనలేడు. అయినా వార్షికంగా పెద్ద సంఖ్య లో కార్ల కొనుగోళ్లు జరుగుతున్నాయంటే, పన్ను పరిధిలోకి రాకుండా పలువురు తప్పించుకుంటు న్నట్లు అర్థమవుతోంది’’ అని ఆయన విశ్లేషించారు. ట్యాక్స్ రిటర్న్లు... 3.65 కోట్లు దేశంలో దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఉంటే, 2014–15 అసెస్మెంట్ ఇయర్లో కేవలం 3.65 కోట్ల మంది వ్యక్తిగతంగా తమ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పన్ను పరిధికి వెలుపల ఉన్నారని అన్నారు. 3.65 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేస్తే, ఇందులో కేవలం 5.5 లక్షల మంది మాత్రమే వార్షికంగా రూ.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను చెల్లింపులు చేసినట్లు తెలిపారు. మొత్తం పన్నుల బాస్కెట్లో ఒక్క వీరి వాటానే 57 శాతంగా ఉందన్నారు. అంటే రిటర్న్స్ ఫైల్ చేసే 3.65 కోట్ల మందిలో కేవలం 1.5 శాతం మంది వాటా పన్ను బాస్కెట్లో 57 శాతంగా ఉందని వివరించారు. గత మూడేళ్లలో వార్షికంగా వరుసగా 25.03 లక్షలు, 26 లక్షలు, 27 లక్షల కార్లు అమ్ముడయ్యాయని అధికారి వివరిస్తూ, కారు కొనడానికి ఆదాయం కలిగి ఉన్న పెద్ద సంఖ్యలోని ప్రజలు పన్ను బాస్కెట్ పరిధికి వెలుపల ఉంటున్నట్లు దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఏడాదికి రూ. కోటి ఆదాయం ఉన్నట్లు చూపుతున్న వారి సంఖ్య 48,417 అయితే, ప్రతి ఏడాదీ బీఎండబ్ల్యూ, జాగ్వార్, ఆడి, మెర్సిడెస్, పోర్షే, మాసిరాటి వంటి లగ్జరీ కార్ల అమ్మకాలు దాదాపు 35,000గా నమోదవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కారు వినియోగ కనీస కాలం దాదాపు ఏడేళ్లయితే, వార్షికంగా ఇన్ని కార్లు ఎలా అమ్ముడవుతాయని ప్రశ్నించారు. ఇతర దేశాలతో పోల్చితే.. కాగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే భారత్ పన్ను ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయని వివరించారు. భారత్లో ఈ నిష్పత్తి కేవలం 16.7 శాతం అయితే, అమెరికాలో 25.4 శాతం, బ్రిటన్లో 30.3 శాతంగా ఉందన్నారు. పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని పెద్ద నోట్ల రద్దు ఇందులో ఒకటిగా పేర్కొన్నారు. దీనివల్ల అనధికార డబ్బును అధికారికంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నల్లకుబేరులకు ఏర్పడుతోందని అన్నారు. వారిపై పెద్ద ఎత్తున్న పన్ను కొరడా తప్పదని హెచ్చరించారు. -
మరిన్ని చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరింత చిక్కుల్లో పడ్డారు. 20 ఏళ్లుగా ఆయన ఆదాయపన్ను చెల్లించలేదంటూ అమెరికాకు చెందిన న్యూయార్క్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే అవకాశాలు మరింత సన్నగిల్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 1995లో ఆదాయపన్ను రిటర్న్ ఇచ్చిన సమాచారం మేరకు 916 మిలియన్ డాలర్లు (రూ.6096.57 కోట్లు) నష్టపోయినట్లు వివరించారని.. అప్పట్నుంచి ఆయన పన్ను రిటర్న్ చేయకుండా ఉండేందుకు అనుమతించారని పత్రిక తెలిపింది. -
రికార్డు స్థాయిలో టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది. -
ఆదాయపు పన్ను చెల్లింపులకు మొబైల్ యాప్!
ఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఓ మొబైల్ యాప్ను సిద్ధం చేస్తోంది. శనివారం ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో పన్ను చెల్లింపుదారుల సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సీబీడీటీ) చైర్ పర్సన్ అనితా కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ పన్నుల చెల్లింపు విధానం ఎక్కువగా వాడుకలో ఉంటున్నది. ఈ సరళికి అనుకూలంగా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆమె తెలిపారు. అయితే యాప్ ద్వారా చెల్లింపులు చేపట్టడంలో ఎదురయ్యే భద్రతా పరమైన అంశాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కృషి జరుగుతున్నట్లు తెలిపిన ఆమె త్వరలోనే యాప్ను పన్నుచెల్లింపుదారులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
ఐటీ రిటర్న్స్ ఈ-ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ ఈ-ఫైలింగ్ (2015-16 అసెస్మెంట్ ఇయర్) గడువును ప్రభుత్వం వారం రోజులు పొడిగించింది. దీని ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకూ ఈ-ఫైలింగ్ చేసుకునే వీలు కలుగుతోంది. నిజానికి ఈ గడువు ఆగస్టు 31తో ముగిసింది. అయితే చివరి రోజున ఎక్కువ మంది ఫైల్ చేయడానికి ప్రయత్నించటంతో కొన్ని ఈ-సేవలు ఆలస్యమయ్యాయి. దీంతో గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల నుంచి దేశ వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 4 కోట్లు. కాగా ఓటీపీ ఆధారిత ఐటీఆర్ ఫైలింగ్ సిస్టమ్ ద్వారా ఆగస్టు 31వ తేదీ నాటికి దాదాపు 29 లక్షల పన్ను రిటర్న్స్ను పరిశీలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పన్ను రాబడి పెంచుకుంటేనే ప్రయోజనం!
రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయానికి సంబంధించింది రెవెన్యూ బడ్జెట్. కేంద్ర ప్రభుత్వానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా రెవెన్యూ రాబడి లభిస్తుంది. పన్ను రాబడి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఉంటుంది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను, మూలధన రాబడి పన్ను, బహుమతి సుంకం, ఎస్టేట్ సుంకాలు మొదలైనవి ప్రత్యక్ష పన్నులు. కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, సేవా పన్నుల లాంటివి పరోక్ష పన్నులు. లాభాలు, డివిడెండ్లు, వడ్డీ, పరిపాలనా, వాణిజ్య సంబంధ రూపంలోకేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా వర్గీకరించవచ్చు. రెవెన్యూ వ్యయాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంగా విభజించవచ్చు. రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రణాళికా వ్యయం.. కేంద్ర ప్రణాళికా వ్యయం; రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రణాళిక సాయంగా ఉంటుంది. రెవెన్యూ వ్యయంలో భాగంగా ప్రణాళికేతర వ్యయంలో వడ్డీ చెల్లింపులు, రక్షణ వ్యయం, సబ్సిడీలు, పింఛన్లు, రాష్ట్రాలకిచ్చే గ్రాంట్లు, రైతులకు రుణాలు తదితరాలు ఉంటాయి. పన్ను రాబడి: పన్ను రాబడి మూడు విధాలుగా ఉంటుంది. అవి: ఎ) ఆదాయంపై పన్ను బి) సంపద, మూలధన లావాదేవీలపై విధించే పన్ను సి) వస్తువులు, సేవలపై పన్ను స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ రాబడిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. అధిక పన్నుల విధింపు, పన్ను రేట్లు ఎక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా పన్ను రాబడి పెరిగి, రెవెన్యూ రాబడి అధికమవ్వడానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ రాబడి 1950-51లో రూ.406 కోట్లు కాగా, 2013-14లో సవరించిన అంచనాల ప్రకారం రూ.10,29,252 (రాష్ట్రాల వాటా మినహాయించి) కోట్లకు చేరుకుంది. 2014-15 బడ్జెట్లో ఈ రాబడిని రూ. 11,89,763 కోట్లుగా ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఎక్కువ. 1950-51లో నికర పన్ను రాబడి రూ. 357 కోట్లు ఉండగా 2013-14లో సవరించిన అంచనాల ప్రకారం రూ. 8,36,026 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్లో ఈ రాబడిని రూ. 9,77,258 కోట్లుగా ప్రతిపాదించారు. మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 1970-71లో 21 శాతంగా ఉంది. ఇది 1990 -91 నాటికి 14 శాతానికి తగ్గింది. 1992లో పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత పన్ను నిర్మాణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పన్ను రాబడిలో వ్యక్తులు, కంపెనీలు చెల్లించిన ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇతర పన్నుల రాబడి కంటే ప్రత్యక్ష పన్నుల రాబడి అధికంగా ఉంది. పన్నుల యంత్రాంగాన్ని పటిష్టపరచడం వల్ల 2008-09లో మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 56 శాతానికి చేరుకుంది. 2013-14లో మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 55.9 శాతం కాగా, పరోక్ష పన్నుల వాటా 44 శాతంగా నమోదైంది. పన్ను - జీడీపీ నిష్పత్తి పన్ను భారాన్ని అంచనా వేయడానికి పన్ను - జీడీపీ నిష్పత్తి కొలమానంగా ఉపకరిస్తుంది. ఆర్థిక ప్రణాళిక ప్రక్రియ ప్రారంభమైన 1950-51లో పన్ను - జీడీపీ నిష్పత్తి 6.3 శాతంగా నమోదైంది. ఈ నిష్పత్తి 1990-91 వరకు పెరిగి ఆ తర్వాత కాలంలో తగ్గింది. పన్ను రేట్లలో తగ్గుదల కారణంగా 1990వ దశకంలో పన్ను - జీడీపీ నిష్పత్తిలో తగ్గుదల 1 శాతంగా ఉంది. 2009-10లో ఈ నిష్పత్తి 9.6 శాతం నుంచి 2012-13లో 10.2 శాతానికి పెరిగింది. 2013-14లో ఈ నిష్పత్తి 10 శాతంగా ఉంటుందని అంచనా. మొత్తం పన్ను - జీడీపీ నిష్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.6 శాతం, పరోక్ష పన్నుల వాటా 4.4 శాతం ఉండవచ్చని భావిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు భారత్లో పన్ను - జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉంది. ఈ నిష్పత్తి యూకేలో 34.3 శాతం కాగా, జర్మనీలో 37 శాతం, అమెరికాలో 24 శాతంగా ఉంది. ఈ నిష్పత్తి పెంచుకోవడానికి భారత్ ఎక్కువగా ప్రత్యక్ష పన్నులపై ఆధారపడాలి. సంపద, Inheritance taxes ను పెంచడం, కార్పొరేట్ సంస్థలకిచ్చే మినహాయింపులను తొలగించడం ద్వారా ప్రత్యక్ష పన్ను రాబడి పెంచుకోవాలి. 2014-15 బడ్జెట్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ప్రతిపాదనలు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్సకు సంబంధించి ఈ పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80(సి)లో పెట్టుబడి పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయింపులో భాగంగా గృహ రుణాలపై వడ్డీ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేర్చారు. వ్యక్తులు, సంస్థలు, కార్పొరేట్ సంస్థలపై విధించే సర్చార్జీలో ఏ విధమైన మార్పులేదు. ఎడ్యుకేషన్ సెస్ 3 శాతంగా కొనసాగుతుంది. - ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించి అభిలషణీయమైన పన్ను విధానం ఉంటుంది. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా నియంత్రణకు లోబడి ట్రస్ట్ల ఏర్పాటును ప్రతిపాదించారు. - కొత్త ప్లాంటులు, యంత్రాలపై ఏ సంవత్సరంలోనైనా రూ. 25 కోట్ల పెట్టుబడి పెట్టిన తయారీ రంగ కంపెనీలకు పెట్టుబడి అలవెన్సు 15 శాతంగా ప్రకటించారు. ఈ ప్రోత్సాహకం మార్చి 2017 వరకు వర్తిస్తుంది. - మార్చి 2017 నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం, పంపిణీ, ట్రాన్సమిషన్లో నిమగ్నమైన కంపెనీలకు పదేళ్ల పన్ను విరామం ప్రకటించారు. - విదేశీ పోర్టఫోలియో పెట్టుబడిదారులకు సెక్యూరిటీల లావాదేవీల ద్వారా లభించిన ఆదాయాన్ని మూలధన రాబడులుగా పరిగణిస్తారు. - అన్ని విధాలైన బాండ్లపై పన్ను ప్రోత్సాహకం ఉంటుంది. - విదేశీ కరెన్సీలో పొందే రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులపై 5 శాతం Concession tax ఉంటుంది. ఇది 2015 జూన్ 30 నుంచి 2017 జూన్ 30 వరకు పొందే రుణాలకు వర్తిస్తుంది. - ఆదాయ, డివిడెండ్ల పంపిణీ పన్నును మొత్తం స్థూల విలువ (Gross Amount) పై విధిస్తారు. పరోక్ష పన్నులు - బాక్సైట్పై ఎక్సైజ్ డ్యూటీ 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. - దిగుమతైన స్టెయిన్లెస్ స్టీల్కు సంబంధించి Flat-roled ProductsO పె కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 7.5 శాతానికి చేర్చారు. - మెటలర్జికల్ కోక్పై కస్టమ్స్ డ్యూటీ 0 నుంచి 2.5 శాతానికి పెంచారు. - Coal tax Pitch కస్టమ్స్ డ్యూటీ 10 శా తం ఉండగా దీన్ని 5 శాతానికి మార్చారు. - డోలమైట్పై దిగుమతి సుంకం 5 నుంచి 2.5 శాతానికి తగ్గించారు. - రసాయనాలు, పెట్రో కెమికల్ రంగంలో నూతన పెట్టుబడులు, సామర్థ్యం పెంపునకు సంబంధించి కొన్ని అంశాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. - కలర్ పిక్చర్ ట్యూబ్లను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. - 19 ఇంచులకు తక్కువగా ఉన్న ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ ప్యానెల్స్పై కస్టమ్స్ డ్యూటీ 10 శాతం నుంచి 0 కు తగ్గించారు. - సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి యంత్రాలు, పరికరాల దిగుమతులపై 5 శాతం ఉన్న Concessional Customs Duty కొనసాగిస్తున్నారు. - సిగరెట్లపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ రేట్లను 11 నుంచి 72 శాతానికి పెంచారు. - పాన్ మసాలాపై ఎక్సైజ్ డ్యూటీ 12 నుంచి 16 శాతానికి పెంచారు. ఉత్పత్తి చేయని పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీ 50 నుంచి 55 శాతానికి పెంచారు. - ప్రయాణికుల సౌకర్యార్థం కల్పిస్తున్న Free Baggage Allowanceను రూ. 35,000 నుంచి రూ.40,000కు మార్చారు. - Renewable Energy అభివృద్ధికి అనేక ఐ్ట్ఛఝట పై ఎక్సైజ్ డ్యూటీని మినహాయించారు. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ నేను గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాను. ఎకానమీని ఏవిధంగా అధ్యయనం చేయాలో సూచించండి. -డి. కల్పనా రెడ్డి, నిజామాబాద్. గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎకానమీ అత్యంత కీలమైంది. ప్రతి పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్లో ఎకానమీకి సంబంధించి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు వర్తమాన అంశాల (Contemporary Issues)పై అవగాహన పెంచుకుంటూ అధ్యయనం చేయాలి. ముందుగా మౌలికాంశాల (Basic Concepts)పై పట్టు సాధించాలి. వివిధ పోటీ పరీక్షల్లో వీటిపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎకానమీని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. దీంట్లో భాగంగా వివిధ అకడమిక్, రిఫరెన్సు పుస్తకాలను పరిశీలిస్తూ కింది అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 1. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ 2. భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులు 3. ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి 4. ప్రణాళిక లక్ష్యాలు-వ్యూహాలు-వనరుల సమీకరణ-ఇటీవలి ప్రణాళికల్లో పరి వ్యయాలు- లోటు బడ్జెటింగ్ విధానం- గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు 5. సమ్మిళిత వృద్ధి 6. పేదరికం - నిరుద్యోగం - ద్రవ్యోల్బణం 7. బ్యాంకింగ్ రంగం 8. పన్నుల వ్యవస్థ- వస్తు, సేవలపై పన్ను 9. అంతర్జాతీయ వాణిజ్యం 10. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధి 11. అవస్థాపనా రంగం 12. IMF, ప్రపంచబ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ 13. జాతీయాదాయం 14. మానవాభివృద్ధి 15. భారత్లో బడ్జెటింగ్ విధానం 16. జనాభా 17. భూ సంస్కరణలు ఈ అంశాలపై ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి సొంతంగా నోట్స్ రూపొందించుకోవాలి. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఎకానమీలో భాగంగా కింద పేర్కొన్న విషయాలపై ఎక్కువగా ప్రశ్నలు ఇస్తున్నట్లు గమనించవచ్చు. - బ్యాంకింగ్ రంగం - పన్నుల వ్యవస్థ - బడ్జెటింగ్ విధానం - అంతర్జాతీయ వాణిజ్యం - ప్రణాళికలు-గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు - జాతీయాదాయం - మానవాభివృద్ధి - ద్రవ్యోల్బణం - పేదరికం - నిరుద్యోగం - 2011 జనాభా గణాంకాలు - IMF, ప్రపంచ వాణిజ్య సంస్థ కరెంట్ అఫైర్సలో భాగంగా.. వాణిజ్య సదుపాయ ఒప్పందం, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నాయక్ కమిటీ సిఫార్సులు, నల్లధనం, జన్ధన్ యోజన, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, రిజర్వబ్యాంక్ ఇటీవల ప్రకటించిన ద్రవ్యవిధానం, మోడీ అమెరికా పర్యటన ముఖ్యాంశాలు, భవిష్యత్తులో ప్రణాళికా సంఘం పాత్ర, వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తదితర అంశాలపై దృష్టి సారించాలి. మాదిరి ప్రశ్నలు 1. 2013-14 బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం ఎంత? - రూ. 13,99,540 కోట్లు 2. కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక రాబడినిచ్చే ప్రత్యక్ష పన్ను? - కార్పొరేషన్ పన్ను 3. 2014-15 బడ్జెట్లో పన్నేతర రాబడిలో అధిక రాబడి దేని ద్వారా లభిస్తుందని అంచనా? - డివిడెండ్లు, లాభాలు 4. మూలధన వ్యయాన్ని ఏ వ్యయంగా వ్యవహరిస్తారు? - పెట్టుబడి వ్యయం 5. 2013-14లో భారత్లో పన్ను-జీడీపీ నిష్పత్తి ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు? - 10 శాతం - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
ఉద్యోగం లేకున్నా రిటర్నులు దాఖలు చేయాలా?
ఏడాది క్రితం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే కొంత మొత్తాన్ని ఈ ఫండ్ నుంచి ఉపసంహరించుకున్నాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏడాది కాలానికి మించి ఇన్వెస్ట్ చేస్తే, వాటిపై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను ఉండదని మిత్రులు చెపుతున్నారు. అయితే బ్యాలెన్స్డ్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుందా? - శేఖర్, అనంతపురం బ్యాలెన్స్డ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకూ ఈక్విటీల్లో పెట్టుబడులు పెడతారు. ఈక్విటీ ఫండ్స్కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో బ్యాలెన్స్డ్ ఫండ్స్కు కూడా అలాంటి పన్ను నియమాలే వర్తిస్తాయి. మీ విషయానికొస్తే, ఒక ఏడాది తర్వాత మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏడాది కాలం కంటే ముందే మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మాత్రం 15 శాతం చొప్పున స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.., ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)కు సెక్షన్ 80 సీ ప్రకారం, పన్ను మినహాయింపు ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కాలానికి రూ.లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులను రూ.లక్షన్నరకు పెంచారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈఎల్ఎస్ఎస్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చా? అలా కుదరని పక్షంలో పన్ను మినహాయింపు పొందడానికి ఈఎల్ఎస్ఎస్లో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు. - సుజాత, హైదరాబాద్ పన్ను ఆదా చేసే మార్గాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సి కింద ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులను రూ. లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రభుత్వం పెంచింది. ఈ సెక్షన్ కింద పూర్తిగా రూ. లక్షన్నర పన్ను మినహాయింపు పొందాలంటే, రూ. లక్షన్నర మొత్తం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నాకు, నా భార్యకు ఎన్పీఎస్ టైర్-వన్ అకౌంట్లు ఉన్నాయి. ప్రతీఏటా ఈ అకౌంట్లలో కొంత మొత్తం జమ చేస్తూ ఉన్నాము. అయితే మేం పనిచేసే కంపెనీ ఈ అకౌంట్లలో ఎలాంటి మొత్తాన్ని జమ చేయడం లేదు. ఆదాయపు పన్ను చట్టం కింద మేం ఈ అకౌంట్ ద్వారా ఏమైనా పన్ను మినహాయింపులు, తగ్గింపులు గానీ పొందొచ్చా? - పరమేశ్, జగిత్యాల మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారై, మీ కంపెనీ తరపు నుంచి మీ అకౌంట్లలో ఏ మాత్రం సొమ్ములు జమ కాని పక్షంలో, సెక్షన్ 80 సీసీడీ(1) కింద మీరు పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. మీ వేతనం(బేసిక్, డీఏలతో కలుపుకొని)లో 10 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. దీనికి పరిమితి రూ. 1లక్ష వరకూ ఉంది. నా భార్యకు కొడుకు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసింది. అంతకు ముందు ఆమె తాను సంపాదించిన ఆదాయంతో సొంతంగా పొదుపు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేది. ఆదాయపు పన్ను రిటర్న్లు కూడా దాఖలు చేసేది.ఇప్పుడు ఉద్యోగం లేనందున ఎలాంటి వేతనం ఆమె పొందడం లేదు. అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆమె కొంత మొత్తం (చాలా తక్కువగా రూ.5,000 లోపు) ఆదాయం పొందుతోంది. ఆమె ఆదాయపు పన్ను రిట ర్న్లు దాఖలు చేయాలనుకుంటున్నాను. అయితే ఐటీఆర్-2 ద్వారా ఐటీ రిటర్న్లు దాఖలు చేయాలా? లేకుంటే ఆమె ఆదాయాన్ని నా ఆదాయంతో కలిపి నా ఐటీ రిటర్న్లో చూపిస్తే సరిపోతుందా? - సయ్యద్ రిజ్వి, హైదరాబాద్ తప్పనిసరి కాకపోయినప్పటికీ, మీ భార్య ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేయవచ్చు. ఐటీఆర్-2 ద్వారా ఆమె ఐటీ రిటర్న్లు దాఖలు చేయవచ్చు. ఆమె తన సొంత సంపాదన ద్వారా ఆర్జించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్న పక్షంలో సొంతంగా ట్యాక్స్ రిటర్న్లు దాఖలు చేయడమే ఉత్తమం. ఒకవేళ పన్ను భారాన్ని తగ్గించుకునే నిమిత్తం మీరు ఆమె పేరు మీద ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఈ విషయం ఆదాయపు పన్ను అధికారుల దృష్టికి వస్తే, మీకు సమస్యలు తప్పవు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.