-
టాటాతో రిలయన్స్ డీల్! అంబానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత 'ముఖేష్ అంబానీ' సబ్స్క్రిప్షన్ బేస్డ్ శాటిలైట్ టీవీ అండ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అయిన టాటా ప్లేలో 29.8% వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్లు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశ టెలివిజన్ పంపిణీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్, జియోసినిమా పరిధిని విస్తరించడానికి ముఖేష్ అంబానీ ఈ వ్యహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్కు చెందిన హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు టాటా ప్లేలో 50.2 శాతం వాటా ఉంది. దేశీయ దిగ్గజానికి మాత్రమే కాకుండా సింగపూర్ ఫండ్ టెమాసెక్కు టాటా ప్లేలో 20 శాతం వాటా ఉంది. ఇప్పటికే టాటా ప్లేలో తన వాటాను టాటా గ్రూప్కు విక్రయించడానికి టెమాసెక్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల సారాంశం ఇంకా బయటపడలేదు. అయితే ఇప్పుడు రిలయన్స్, టాటాల మధ్య ఒప్పందం కుదిరితే.. టాటా గ్రూప్, రిలయన్స్ మధ్య కుదిరిన మొదటి ఒప్పందం ఇదే అవుతుంది. ఒప్పందం కుదిరితే.. రిలయన్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియోసినిమా పరిధిని టాటా ప్లే కస్టమర్లకు అందించనుంది. ఇదీ చదవండి: అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - దినదినగండంగా టెకీల పరిస్థితి! -
విశాఖలో వోల్టాస్ 3వ స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ స్టోర్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రదీప్ బక్షి ప్రారంభించారు. వినియోగదారులకు వినూత్న ఉత్పత్తి శ్రేణిని అందించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా బక్షి పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను సంస్థ అందిస్తోందని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన 'టాటా' - ఏకంగా రూ.30 లక్షల కోట్లు..
18 సంస్థలతో కూడిన టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (TCS అండ్ టాటా మోటార్స్) భారీ ర్యాలీతో ఏకంగా రూ. 30 లక్షల కోట్లను దాటింది. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీగా టాటా ఓ సరికొత్త రికార్డ్ కైవసం చేసుకుంది. టాటా గ్రూప్ కంపెనీలైన టీసీఎస్, టాటా పవర్ మొదలైన కంపెనీ షేర్లు బాగా పెరగటం వల్ల సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. ఇందులో కూడా టీసీఎస్ షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ TCS మార్కెట్ క్యాప్ మొదటిసారి రూ. 15 లక్షల కోట్ల మార్కును తాకింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించి యూరప్ అసిస్టెన్స్ ఐటీ ఆపరేటింగ్ మోడల్ను మార్చడానికి ఏర్పడిన ఒప్పందం కూడా షేర్లు పెరగటానికి దోహదపడ్డాయి. మార్కెట్ క్యాప్ లీడర్బోర్డ్లో రిలయన్స్ గ్రూప్ రూ. 21.60 లక్షల కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. అదానీ గ్రూప్, వివిధ మౌలిక సదుపాయాల రంగాలు రూ. 15.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో మూడవ స్థానంలో ఉంది. మంగళవారం నాటికి టాటా మోటార్స్, టైటాన్ సంస్థల మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లని దాటాయి. ఇదీ చదవండి: లే ఆఫ్స్.. 32000 మంది టెకీలు ఇంటికి - అసలేం జరుగుతోంది? టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. వాహన డిమాండ్ పెరడటం, ముడి సరుకుల ధరలు కొంత తగ్గడం కారణంగా కంపెనీ ఫలితాలు కొంత వృద్ధి చెందాయి. కాగా.. ఇప్పుడు షేర్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో టాటా గ్రూప్ మరింత గొప్ప ఫలితాలను పొందనున్నట్లు పలువురు భావిస్తున్నారు. -
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్ను నెలకొల్పనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఏఎల్ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్బస్ హెలికాప్టర్స్తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్ఏఎల్ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ను భారత్తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ‘టాటా గ్రూప్’
ప్రపంచ వ్యాప్త క్రికెట్ అభిమానుల్ని చూరగొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ను భారత దిగ్గజ సంస్థ ‘టాటా’ గ్రూప్ పొడిగించుకుంది. ఐదేళ్ల కాలానికి రూ.2500 కోట్ల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్లీ టాటా ఐపీఎల్గా అలరించనుంది. టాటా సంస్థ గత రెండేళ్లుగా ఐపీఎల్తో కొనసాగుతోంది. 2022, 2023 సీజన్లలో టైటిల్ స్పాన్సర్గా ఉంది. తాజా ఒప్పందం విలువ ఐపీఎల్ టైటిల్ హక్కుల చరిత్రలోనే అత్యధిక మొత్తమని బీసీసీఐ తెలిపింది. -
2023 మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్.. టాప్లో టాటా - మూడో స్థానంలో అదానీ
ముంబై: గత క్యాలండర్ ఏడాది(2023)లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలలో టాటా గ్రూప్ భారీగా లాభపడింది. గ్రూప్లోని షేర్లు లాభాల దౌడు తీయడంతో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 35 శాతం దూసుకెళ్లింది. ఉమ్మడిగా రూ. 28.68 లక్షల కోట్లను తాకింది. దీంతో మార్కెట్ క్యాప్రీత్యా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ముకేశ్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ దాదాపు 11 శాతం ఎగసింది. రూ. 19.42 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా అదానీ గ్రూప్ను అధిగమిస్తూ ద్వితీయ స్థానాన్ని అందుకుంది. అయితే 2022లో రిలయన్స్ గ్రూప్ను వెనక్కి నెట్టిన అదానీ గ్రూప్ వెనకడుగు వేసింది. మార్కెట్ విలువ దాదాపు 28 శాతం క్షీణించడంతో రూ. 14.2 లక్షల కోట్లకు పరిమితమైంది. వెరసి మూడో ర్యాంకులో నిలిచింది. 2022లో టాటా గ్రూప్ విలువ రూ. 21.2 ట్రిలియన్లుకాగా.. అదానీ గ్రూప్ రూ. 19.7 ట్రిలియన్లు, రిలయన్స్ రూ. 17.6 ట్రిలియన్లుగా నమోదయ్యాయి. రంగాలవారీగా తీరిలా దేశీ కార్పొరేట్ బిజినెస్ గ్రూప్లలో ప్రధానంగా ఆటోమోటివ్, ఇంజినీరింగ్, భారీయంత్ర పరికరాలు(క్యాపిటల్ గూడ్స్), విద్యుత్, మౌలిక సదుపాయాలు(ఇన్ఫ్రాస్ట్రక్చర్), రిటైల్ రంగాలు గతేడాది మెరుగైన పనితీరు చూపాయి. అయితే కమోడిటీలు, ఎనర్జీ, ఫైనాన్స్ విభాగాలు మందగించాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 53 శాతం జంప్చేసి రూ. 3.36 లక్షల కోట్లకు చేరింది. రిటైల్ ఫైనాన్స్, ఇంజినీరింగ్, పవర్ ఎక్విప్మెంట్, సుగర్, ఆగ్రోకెమికల్స్, అబ్రాసివ్స్ తయారీలో ఉన్న మురుగప్ప గ్రూప్ మార్కెట్ విలువ రీత్యా టాప్–10 జాబితాలో చోటు(9వ ర్యాంకు) సాధించింది. 2022లో గ్రూప్ విలువ రూ. 2.2 ట్రిలియన్లు మాత్రమే. ఈ బాటలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ. 2.39 ట్రిలియన్ల నుంచి రూ. 3.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా 10వ ర్యాంకును సాధించింది. ఇందుకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్టింగ్(రూ. 44,000 కోట్ల విలువ) జత కలిసింది. రాహుల్ బజాజ్ గ్రూప్ విలువ రూ. 8.21 ట్రిలియన్ల నుంచి 23 శాతంపైగా బలపడి రూ. 10.12 లక్షల కోట్లను తాకింది. వెరసి మరోసారి నాలుగో ర్యాంకులో నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్ 33 శాతం ఎగసి ఐదో ర్యాంకును అందుకుంది. విలువ రూ. 4.98 లక్షల కోట్ల నుంచి రూ. 6.6 ట్రిలియన్లకు చేరింది. గ్రూప్లు అటూఇటుగా టెలికం రంగ దిగ్గజం భారతీ(ఎయిర్టెల్) గ్రూప్ మార్కెట్ విలువ రూ. 5.17 ట్రిలియన్ల నుంచి 27 శాతంపైగా జంప్చేసి రూ. 6.59 లక్షల కోట్లను తాకినప్పటికీ ర్యాంకింగ్లో 5 నుంచి 6కు నీరసించింది. ఐటీ సేవల హెచ్సీఎల్ గ్రూప్ మార్కెట్ క్యాప్ 41 శాతం దూసుకెళ్లి రూ. 3.98 ట్రిలియన్లను తాకింది. రెండు స్థానాలు మెరుగుపడి 7కు చేరింది. ఆటో రంగ దిగ్గజం ఎంఅండ్ఎం రూ. 3.95 కోట్ల మార్కెట్ విలువతో ఒక స్థానం తగ్గి 8వ ర్యాంకుకు పరిమితమైంది. నిజానికి 2022లో ఎంఅండ్ఎం మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లు మాత్రమే. -
‘రతన్ టాటా గూండాగిరి’
ఉప్పు నుంచి ఉక్కు వరకు. టీ నుంచి ట్రక్ వరకు.. వాచెస్ నుంచి హోటెల్స్ వరకు.. కెమికల్స్ నుంచి కార్స్ వరకు.. ఇలా పదుల సంఖ్యలో కంపెనీల్ని ముందుండి నడిపించిన గొప్ప లీడర్. వందల ఏళ్ల చరిత్ర.. 150 కి పైగా దేశాల్లో కంపెనీలు.. 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు.. 28 కి పైగా లిస్టెడ్ కంపెనీలు.. రూ.27.61 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ (డిసెంబర్ 26,2023 నాటికి) భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ కంపెనీని నడిపిస్తూ ఇసుమంతైనా గర్వం లేని పద్మ విభూషణుడు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా. డిసెంబర్ 28న రతన్ టాటా 86వ జన్మదినం సందర్భంగా కోట్లాది మంది అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో రతన్ టాటా కోట్లాది మంది ప్రజల హృదయాల్ని గెలుచుకున్న సందర్భాల్ని గుర్తు చేసుకుంటున్నారు. అవేంటంటే ఈ కుక్క మీదేనా రతన్ టాటాకి మూగజీవాలంటే ప్రాణం. ఓ సారి ముంబై వీధుల్లో గాయాల పాలైన ఓ కుక్కను గమనించారు. వెంటనే దానికి చికిత్స చేయించారు. అనంతరం ఆ కుక్క గురించి వివరాలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ముంబైలోని నా ఆఫీస్ సమీపంలో గాయాలపైన ఓ కుక్కను గుర్తించాం. అత్యవసర చికిత్స కోసం సియాన్ ఆస్పత్రికి తరలించాం. మీరు ఆ కుక్క సంరక్షకులైతే కొన్ని ఆధారాలతో reportlostdog@gmail.comకు ఇమెయిల్ చేయండి” అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ కుక్క ప్రస్తుతం మా సంరక్షణలోనే ఉంది. చికిత్సను చేయిస్తున్నాం అని పోస్ట్లో పేర్కొన్నారు. ఒకే ఒక్కడు.. గ్యాంగస్టర్, అతని 200 గూండాలతో రతన్ టాటా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 1980వ సంవత్సరంలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టిన 15 రోజుల తర్వాత ఓ గ్యాంగ్స్టర్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. వాస్తవానికి అప్పట్లో టాటా మోటార్స్ కంపెనీలో లేబర్ ఎన్నికలు జరిగేవి. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న కొంత మంది కార్మికులను ఒక గ్యాంగ్స్టర్ ప్రేరేపించాడు. లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. గ్యాంగ్స్టర్ తన అనచరులైన 200 మంది గూండాలతో కలిసి ప్లాంట్లోని 4000 మంది ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. సిబ్బంది విధులు నిర్వహించకుండా సమ్మె చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో భయబ్రాంతులైన ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు బయపడి పోయారు. దీంతో ‘‘ నాన్న పందులు గుంపులుగా..గుంపులుగా వస్తే సింహం సింగిల్ వస్తుందంటూ’’ రతన్ టాటా నేరుగా రంగంలోకి దిగి గ్యాంగ్స్టర్ను ఎదుర్కొన్నారు. రతన్ టాటా తన ఇంటిని వదిలేసి స్వయంగా ప్లాంట్లోనే కొద్దిరోజులపాటు ఉన్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ వారితో పనిచేయించారు. అయితే కొద్ది రోజుల తర్వాత గ్యాంగ్స్టర్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇలా ఓ గ్యాంగ్స్టర్ను రతన్ టాటా చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. 16 ఏళ్ల యువకుడికి సాయం.. మహరాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అర్జున్ దేశ్ పాండే 16 ఏళ్ల వయస్సులో ఉండగా తనకు ఓ హృదయ విదారకరమైన సంఘటన ఎదురైంది. దేశ్ పాండే ఓ రోజు ఫివర్ ట్యాబ్లెట్ తెచ్చుకునేందుకు స్థానికంగా ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్లాడు. అయితే ఆ షాప్ వద్ద 70 ఏళ్ల వృద్దుడు క్యాన్సర్తో బాధపడుతూ తన భార్యకు కావాల్సిన మెడిసిన్ కోసం అదే షాపుకు వచ్చాడు. తన కావాల్సిన మెడిసిన్ ఈ షాప్లో ఉన్నా.. అత్యధిక ధర కావడంతో తాను ఆ మెడిసిన్ను కొనలేకపోతున్నానంటూ బాధపడటాన్ని గమనించాడు. కానీ ఏం చేయలేకపోయాడు. ఆ బాధలో నుంచి జనరిక్ ఆధార్ అనే స్టార్టప్ పుట్టింది. అర్జున్ దేశ్ పాండే దీనిని స్థాపించాడు. ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశ్యం దేశ వ్యాప్తంగా ఉన్న 80 - 90 శాతం తగ్గింపుతో జనరిక్ మెడిసిన్ అందిస్తుంది. ఓ రోజు తనకు ఎదురైన సంఘటన, స్టార్టప్ ప్రారంభం వంటి అంశాలను అర్జున్ టెడెక్స్లో మాట్లాడారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన రతన్ టాటా సైతం వెంటనే జనరిక్ ఆధార్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ అక్షరాల రూ.500 కోట్లు. ఒక్క ఫోన్ కాల్తో భారత్లో స్టార్టప్ జపం నడుస్తోంది. ఏదైనా బిజినెస్ చేయాలంటే జనాన్ని ఆకట్టుకోవాలి. అలాంటి బిజినెస్ ఐడియా ఉంటే చాలు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఆ బిజినెస్ ఐడియాను అప్లయ్ చేస్తే చాలు కోట్లు కొల్లగొట్టొచ్చు. ఇలాగే ‘రెపోస్ ఎనర్జీ’ ఫౌండర్లు, భార్య భర్తలైన చేతన్ వాలుంజ్, అతిధి బోస్లే వాలుంజ్లు అనుకున్నారు. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, నిత్యవసర వస్తువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. అదే వినియోగదారులకు కావాల్సిన పెట్రోల్ను మనం ఎందుకు డెలివరీ చేయకూడదు అని అనుకున్నారు. ఐడియా బాగుంది. చేతిలో తగినన్ని నిధులు లేవు. పైగా ప్రజల్లోకి కంపెనీ పేరును బలంగా తీసుకెళ్లాలని అనుకున్నారు. అందుకే సాయం కోసం రతన్ టాటా ఆఫీస్ డోర్ తట్టారు. ఓ లెటర్ను రతన్ టాటాకు పంపారు. ప్రయత్నం అయితే చేశారు కానీ మనసులో ఎక్కడో చిన్న అనుమానం. టాటాకు పంపిన లెటర్ అందుతుందా? ఆ లెటర్ చదివి టాటా తమకు సాయం చేస్తారా? ఇలా ఎన్నో రకాలుగా అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ అనుమానాన్ని పటాపంచలు చేశారు రతన్ టాటా. ‘మీ లెటర్ నేను చదివాను. ఒక్కసారి మనం కలుసుకోగలమా? అంటూ రతన్ టాటానే స్వయంగా చేతన్, అతిధిలకు ఫోన్ చేశారు. కట్ చేస్తే రెపోస్ ఎనర్జీ రూ.200 కోట్ల విలువైన కంపెనీ ప్రసిద్ధి కెక్కింది. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ రతన్ టాటా తన పెంపుడు కుక్కలు టాంగో, టిటో అంటే మహా ఇష్టం. ఆ ఇష్టం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఈ సంఘటనే అందుకు ఉదాహరణ. టాటాకు యూకే ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్తో సత్కరించేందుకు సిద్ధమైంది. అవార్డ్ ఇస్తున్నట్లు ప్రిన్స్ చార్లెస్ టాటాకు సమాచారం అందించారు. అ తర్వాత ముందుస్తు ప్లాన్ ప్రకారం.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హోమ్ ప్యాలెస్లో అవార్డ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డ్ల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? టాంగో, టిటోల వల్లే. తాను లండన్ బయలు దేరే ముందు టాంగో, టిటోలు అనారోగ్యానికి గురయ్యాయని, వేడుకకు తాను రాలేకపోతున్నాననే సమాచారాన్ని తనతో పాటు లండన్ వచ్చేందుకు సిద్ధమైన వ్యాపార వేత్త సుహెల్ సేథ్కి ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇదే విషయం ప్రిన్స్ చార్లెస్కు చెప్పగా.. మనసున్న మారాజు.. అతడే రతన్ టాటా అంటూ ప్రశంసలు కురిపించారంటూ నాటి సంఘటనను గుర్తు చేశారు. అందుకే రతన్ టాటా కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. -
రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, టాటా గ్రూప్ మాజీ చైర్పర్సన్ 'రతన్ టాటా' (Ratan Tata) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన ఈయన నేటితో 85 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. రతన్ టాటా జన్మదినం సందర్భంగా ఈ కథనంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రతన్ టాటా గురించిన 5 ఆసక్తికరమైన విషయాలు 👉రతన్ టాటా క్యాంపియన్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్కు వెళ్లారు. ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా. 👉రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు. 👉86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. గతంలో ఈయన నాలుగు సార్లు పెళ్లికి దగ్గరగా వచ్చినట్లు సమాచారం, కానీ ప్రతి సారీ ఏదో ఒక భయం, లేదా ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గారు. 👉పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధర వద్ద లభించే కారు కావడంనా గమనార్హం. చిన్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఈ కారుని లాంచ్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. భారతదేశంలోని అనేక మంచి కార్యక్రమాల కోసం రతన్ టాటా లెక్కకు మించిన డబ్బును విరాళంగా ఇచ్చిన సంఘటనలు కోకొల్లలు. -
టాటా రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది!
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలో నష్టాలబాటలో పయనించిన 'నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (NINL), టాటాల చేతికి చిక్కడంతో అభివృద్ధి బాటలో పరుగులు తీస్తూ.. నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 2500 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన కంపెనీ ఒకప్పుడు పాములు, తేళ్లకు నిలయంగా మారి యంత్రాలన్నీ తుప్పు పట్టిన దశలో ఉన్న కంపెనీని.. రూ.12100 కోట్ల చెల్లింపుతో 2022 జులై 04న టాటా స్టీల్ ఒడిశాకు చెందిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) కొనుగోలు చేసింది. 'ఎన్ఐఎన్ఎల్' టాటా చేతిలో పడ్డ కేవలం 90 రోజుల్లోనే తిరిగి ప్రారంభమైందని.. కంపెనీ ఎండీ అండ్ సీఈఓ 'సుధీర్ కుమార్ మెహతా' వెల్లడించారు. అంతే కాకుండా.. అప్పులతో సతమవుతున్న కంపెనీ లాభాల బాట పట్టి ఇప్పుడు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ గత ఏడాది నుంచి ఇప్పటికే రూ.4600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. ఆగస్ట్లో టేక్ ఓవర్ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులందరికీ మొత్తం జీతం చెల్లించినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: స్టార్టప్లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 120 కి.మీ దూరంలో ఉన్న కళింగనగర్లోని NINL సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పెద్ద కంపెనీ. నిధుల కొరతతో సహా వివిధ కారణాలతో ఈ ప్లాంట్ సుమారు మూడేళ్లపాటు మూతపడింది. ఆ తరువాత టాటా గ్రూపు చేజిక్కించుకుని 2024 అక్టోబర్ 24న మొదటి బిల్లెట్ను విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఆశించిన స్థాయికంటే కూడా బాగా లాభాలను ఆర్జిస్తోందని తెలుస్తోంది. -
ఎయిరిండియా సిబ్బందికి కొత్త యూనిఫాం.. ఎలా ఉందో చూశారా?
డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ ఆధీనంలో ఉన్న ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిరిండియాని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థ తీర్చిదిద్దేలా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఆ సంస్థ లోగోని మార్చిన యాజమాన్యం.. తాజాగా అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధరించేందుకు కొత్త యూనిఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో యూనిఫాంను డిజైన్ చేయించింది. మహిళా క్యాబిన్ సిబ్బందికి మోడ్రన్ లుక్లో ఓంబ్రే చీరలు, పురుషులకు బ్యాండ్గ్లస్, కాక్పిట్లో విధులు నిర్వహించే ఉద్యోగులు క్లాసిక్ బ్లాక్ సూట్స్ ఉన్నాయి. ఈ కొత్త యూనిఫామ్ను దశల వారీగా పూర్తిస్థాయిలో పరిచయం చేసేలా ఎయిరిండియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో ఎయిరిండియా తొలి ఎయిర్ బస్ ఏ350 సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఆ సమయంలో ఈ కొత్త యూనిఫామ్ను ధరించి సిబ్బంది విధులకు హాజరవుతారని సమాచారం. మహిళా సిబ్బంది యూనిఫాం ఎలా ఉండబోతుందంటే? మహిళా సిబ్బందికి ఈజీగా, స్టైలిష్గా, యూనిక్ లుక్లో సంప్రదాయాన్ని మేళవించేలా ఈ కొత్త యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. సీనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది కోసం ఓంబ్రే చీరలు, వంకాయ బ్లేజర్లతో కలిపి ఎరుపు-గోధుమ రంగులో ఉంటాయి. జూనియర్ మహిళా క్యాబిన్ సిబ్బంది ఎరుపు రంగు బ్లేజర్లతో కలిపి ఎరుపు - ఊదా రంగు చీరలను ధరిస్తారు. కాక్పిట్ సిబ్బంది యూనిఫారం క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్ట్డ్ సూట్ను అందంగా డిజైన్ చేశారు మల్హోత్రా. ఈ సందర్భంగా మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ “ఎయిరిండియా కోసం యూనిఫాం డిజైన్ చేసే అవకాశం నాకు లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ జెండాను మోసే (రతన్ టాటాను ఉద్దేశిస్తూ) వ్యక్తికి ఫ్యాషన్ విభాగం నుంచి దోహదపడటం ఆనందంగా ఉంది. నా లక్ష్యం దేశ విభిన్న సంస్కృతి, సంప్రదాయాల సారాంశం ఉట్టిపడేలా యూనిఫారాలను రూపొందించడం, ఆధునిక అధునాతన డిజైన్లను అందించడమేనని అన్నారు. -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ల్లో ఈ వాహనాల బుకింగ్లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా! అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. -
Air India: టాటా గ్రూప్ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..
ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాగ్రూప్ నిర్వహిస్తోన్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మే-సెప్టెంబర్లో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చిన్, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది. ఇదీ చదవండి: రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు ఫలితంగా సంస్థ నిబంధనలు పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన వివరణను సమీక్షించిన తర్వాత.. సీఏఆర్ నిబంధనలు పాటించడంలో టాటా గ్రూప్ సంస్థ విఫలమైందని నిర్ధారించారు. ఆలస్యమైన విమానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, కొందరు సర్వీస్లేని సీట్లలో ప్రయాణించవలసి రావడం వంటి అంశాలను పరిగణలోని తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించడంలో సంస్థ విఫలం అయిందని గుర్తించారు. దాంతో సంస్థకు రూ.10 లక్షలు జరిమానా విధించారు. -
Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు
ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. టాటా మోటార్స్కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది. -
ఐదేళ్లలో 3,000 ఉద్యోగాలు
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర ఆధునిక విభాగాలలో ప్రత్యేకతలున్న నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లు టైటన్ తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా విభిన్న విభాగాలలో ప్రత్యేకత కలిగిన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకునే వ్యూహాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ సొంత సిబ్బందిసహా.. వివిధ విభాగాలలో యువ వృత్తి నిపుణులను జత కలుపుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వృద్ధి, ఆవిష్కరణలతోపాటు పరిశ్రమలో కంపెనీ స్థానాన్ని పటిష్టపరచుకోనున్నట్లు టైటన్ హెచ్ఆర్(కార్పొరేట్, రిటైల్) హెడ్ ప్రియా ఎం.పిళ్లై పేర్కొన్నారు. 60:40 ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60 శాతం మెట్రో నగరాలలో సేవలందిస్తుండగా.. మరో 40 శాతం మంది ద్వితీయస్థాయి నగరాల(టైర్–2, 3)లో పనిచేస్తున్నట్లు టైటన్ వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాల పటిష్టతను కొనసాగిస్తూనే స్థానిక నిపుణులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
రతన్ టాటా తర్వాత గ్రూప్ సారథులు వీరే..?
దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది. అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్టాటా కుమార్తెలు లేహ్, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. లేహ్ టాటా నోయెల్ టాటా పెద్ద కుమార్తె. మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్లో తన ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాయా టాటా లేహ్ టాటా సోదరి మాయా టాటా. మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో తన కెరియర్కు మొదలుపెట్టారు. ఆమె పోర్ట్ఫోలియో మేనేజర్గా, ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్గా పని చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. టాటా క్యాపిటల్, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు. టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు. నెవిల్లీ టాటా నోయెల్ టాటా చిన్న కుమారుడు. నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. ట్రెంట్ హైపర్మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్ బ్రాండ్లైన వెస్ట్సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థగా ఉంది. ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్! టాటా గ్రూప్ సంస్థల స్వరూపం టాటా గ్రూప్ సంస్థలను 1868లో జెమ్షేడ్జీ టాటా స్థాపించారు. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేస్తోంది. టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది. టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,71,467 కోట్లుగా ఉంది. -
ఇండియన్ హోటల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్చేసి రూ. 167 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 122 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,258 కోట్ల నుంచి రూ. 1,481 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,101 కోట్ల నుంచి రూ. 1,249 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో కొత్తగా 8 హోటళ్లను తెరవడంతోపాటు.. మరో 17 ప్రారంభించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చాట్వల్ పేర్కొన్నారు. అనుబంధ సంస్థ పియమ్ హోటల్స్లో న్యూ వెర్నాన్ ప్రయివేట్ నుంచి 6.8 శాతం వాటాకు సమానమైన 2.59 లక్షల ఈక్విటీ షేర్లను షేర్ల స్వాప్, నగదు ద్వారా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ హోటల్స్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
రూ.1000 కోట్ల డీల్ - భారత్లో టాటా ఐఫోన్స్ తయారీ..
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు. టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports. Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 -
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
వ్యక్తిగా వినమ్రుడు... వ్యవస్థగా త్రివిక్రముడు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎనభై ఆరేళ్ల రతన్ నావల్ టాటాను పరి చయడం చేయడమంటే సూర్యుణ్ణి దివిటీతో చూపే ప్రయత్నం చేయటం. టాటా గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం ఎందుకంటే క్యాలెండర్ మారిన ప్రతిసారీ ఆయన కొత్తగా కనిపిస్తారు. పారిశ్రామిక రంగాన్ని సమస్యలు చుట్టిముట్టిన ప్పుడల్లా ఆయన సరికొత్తగా వెలుగులీనుతారు. తోటి పారి శ్రామికవేత్తలకు మాత్రమే కాదు, సమాజం మొత్తానికి భరోసాగా నిలుస్తారు. బడా పారిశ్రామికవేత్తగానే కాదు... వ్యక్తిగా కూడా రతన్ టాటా సమున్నతుడు. చదువయ్యాక అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒకమ్మాయిపై రతన్ మనసు పారేసుకున్నారు. ఆమె కూడా ఆయన్ను ప్రేమించింది. ఈలోగా 1962లో భారత–చైనా యుద్ధం వచ్చింది. అంతే! ఈ వివాహానికి తొలుత అంగీకరించిన ఆమె తల్లిదండ్రులు భయంతో మీమాంసలో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో నాయనమ్మ నవాజ్ బాయ్ టాటాకు ఒంట్లో బాగోలేదని కబురంది రతన్ భారత్ వెళ్లాల్సి వచ్చింది (రతన్కు పదేళ్ల వయసున్నప్పుడే తల్లితండ్రులు నావల్ టాటా, సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. అందుకే రతన్ నాయనమ్మ పెంపకంలో పెరిగారు). అంతా సవ్యంగా పూర్తయి అమెరికా వెళ్లేసరికి ప్రియురాలు తల్లితండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకుంది. పర్యవసానంగా రతన్ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఒకరోజు ఎల్ఈడీ టీవీ బిగించటానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లూ అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్, పైన ఒక బనీనుతో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదాసీదాగా, పాతకాలం నాటి ఫర్నిచర్తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ! ‘సరైన నిర్ణయాలు’ తీసుకోవడంలో నాకు నమ్మకం లేదు. నేనొక నిర్ణయం తీసుకుంటాను. అది సరైనది అయ్యేలా చేస్తాను. అంతే...’ అని అన్నాడాయన ఒకసారి. అందుకే కావొచ్చు, ఆయన హయాంలో టాటా గ్రూపు ఆదాయం 40 రెట్లు మించి పెరిగింది. ఇవాళ టాటా గ్రూపు బ్రాండ్ విలువ 2,600 కోట్ల డాలర్లు. మొన్న మార్చి నాటికి ఆ గ్రూపు మార్కెట్ వ్యాల్యూ 21.1 లక్షల కోట్లు. ఆయన నెట్వర్త్ అక్షరాలా రూ. 8,250 కోట్లు! ఇది ముఖేశ్ అంబానీ నెట్వర్త్ రూ. 9,610 కోట్లతో పోలిస్తే కాస్త తక్కువే కావొచ్చు. మరో పారిశ్రామికవేత్త అదానీ నెట్వర్త్ 5,510 కోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువే కావొచ్చు. కానీ రాజకీయ రణరంగంలో ఆ ఇద్దరి పేర్లూ తప్ప రతన్ టాటా గురించి మనం ఎప్పుడైనా విన్నామా? ఆయనపై అస్త్రాలు సంధిస్తూ పార్టీలు పరస్పరం ఎన్నడైనా ఆరోపణలు చేసుకోవటం చూశామా? లేదు. అదీ రతన్ టాటా ప్రత్యేకత. సంస్థ ఎదగడమే కాదు... అనేకమంది జీవితాల్లో వెలుగులు పంచాలన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఇద్దరు పిల్లలున్న మధ్యతరగతి కుటుంబం ఒక స్కూటర్పై ఇరుక్కుని కూర్చుని హోరు వానలో ప్రయాణిస్తుండగా చూసి తనకు ‘నానో’ కారు ఐడియా వచ్చిందని రతన్ చెబితే దేశం విశ్వసించింది. టాటా గ్రూపు సంస్థలకు సామాజిక సేవంటే చాటింపు వేసుకుని మీడియాకు పోజులిచ్చే సందర్భం కాదు. నెరవేర్చి తీరాల్సిన పవిత్ర కర్తవ్యం. అందుకే ‘టాటా సన్స్’ ఈక్విటీల్లో 66 శాతం టాటా ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. వాటిపై వచ్చే డివిడెండ్లు నేరుగా ట్రస్టులు నిర్వహించే సేవాకార్యక్రమాలకు తోడ్పడతాయి. ఇంకో సంగతి ప్రత్యేకించి చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఈ మధ్య ఒక అంటువ్యాధిలా మారిన లే–ఆఫ్లకు టాటా గ్రూపు అనుబంధ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పూర్తి వ్యతిరేకం. టాటా గ్రూప్లో సాల్ట్ నుంచి స్టీల్ వరకూ ఉన్న సంస్థల్లో సైతం ఎక్కడా సిబ్బందిని అన్యాయంగా తొలగించారన్న నింద ఏనాడూ రాలేదు. దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో చేసిన గణనీయమైన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి గౌరవించింది. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్లైన్స్కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్
DGCA finds lapses in Air India టాటా నేతృత్వంలోని ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిరిండియా విమానాల్లో అంతర్గత భద్రతా ఆడిట్లలో లోపాలను కనుగొంది.ఇద్దరు సభ్యుల తనిఖీ బృందం ఈ విషయాన్ని గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. జూలై 25- 26 తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్లోని ఎయిరిండియా కార్యాలయ తనిఖీల్లో DRFలో లోపాలను ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని డిజిసిఎ డైరెక్టర్ జనరల్ విక్రమ్ దేవ్ దత్ తెలిపారు.కొనసాగుతున్న విచారణ కారణంగా, తాము వివరాలను వెల్లడించలేమని పేర్కొన్నారు. DGCAకి సమర్పించిన తనిఖీ నివేదిక ప్రకారం, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎగ్జామినేషన్ (పైలట్లు ఆల్కహాల్ తీసుకున్నారా?లేదా?అనే పరీక్ష)కు సంబంధించి స్పాట్ చెక్ను నిర్వహించి నప్పటికీ, అంతర్గత ఆడిటర్ మాండేటరీ చెక్లిస్ట్ ప్రకారం వ్యవహరింలేదని, కొన్ని తప్పుడునివేదికలను అందించిందని టీం ఆరోపించింది. అలాగే క్యాబిన్ నిఘా, కార్గో, ర్యాంప్ అండ్ లోడ్ వంటి పలు అంశాల్లో క్రమం తప్పకుండా సేఫ్టీ స్పాట్ చెక్లను నిర్వహించాల్సి ఉంది, అయితే 13 సేఫ్టీ పాయింట్ల తనిఖీల్లో మొత్తం 13 కేసుల్లో ఎయిర్లైన్ తప్పుడు నివేదికలు సిద్ధం చేసిందని రిపోర్ట్ చేసింది. (లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్) అయితే సాధారణ భద్రతా నిబంధనలకు లోబడే తమ విధానాలున్నాయని ఎయిరిండియా ప్రతినిధి స్పందించారు. ఈ విషయాన్ని నిరంతరం అంచనా వేయడానికి, మరింత బలోపేతం చేసుందుకు తాము ఇలా ఆడిట్లలో చురుకుగా పాల్గొంటామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సంబంధిత అధికారి లేవనెత్తిన ఏవైనా విషయాలను ఎయిర్లైన్ నేరుగా పరిశీలిస్తుందన్నారు. -
లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా?
టాటా గ్రూప్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు 'రతన్ టాటా' (Ratan Tata). భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఈయన పేరు సుపరిచయమే. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ పారిశ్రామిక దిగ్గజం కంపెనీ బాధ్యతలను త్వరలోనే తమ తరువాతి తరం టాటాలకు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా గ్రూప్ సంస్థ బాధ్యతలను 'మాయా టాటా' (Maya Tata)కు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ. 20,71,467 కోట్ల విలువైన కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా.. అని ఇప్పటికే చాలామందిలో తెలుసుకోవలసిన ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు సమాధానంగా మాయా టాటా పేరు వినిపిస్తోంది. నిజానికి ఇటీవల కాలంలోనే 'మాయా టాటా' మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈమె మాత్రమే కాకుండా ఆమె సోదరుడు నెవిల్లే, సోదరి లేహ్ కూడా కంపెనీలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ కూడా రతన్ టాటా ఆధ్వర్యంలో వ్యాపార పాఠాలు నేర్చుకున్న వారే. ఇదీ చదవండి: గుడ్న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు - వారికి మాత్రమే! రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా & అలూ మిస్త్రీ దంపతుల కుమార్తె ఈ 'మాయా టాటా'. ఈమె యూకేలోని బేయెస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో చదువుకున్నట్లు సమాచారం. ఆ తరువాత కాలంలో టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టింది. ఆ తరువాత టాటా డిజిటల్ కంపెనీలో పనిచేసింది. ప్రస్తుతం టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డు మెంబరుగా ఉన్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ బాధ్యతలను మాయా టాటా స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే 34 సంవత్సరాలకే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించనున్న మహిళగా రికార్డ్ సృష్టించనుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఇంకా దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు టాటా గ్రూప్ సామ్రాజ్యాధినేత ఎవరనేది తెలిసిపోతుంది. -
రతన్ టాటాను చంపాలనుకుంది ఎవరు?
మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం.. ఈ నాలుగు లక్షణాలు రతన్ టాటాలో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తుంటాం. అలాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ గ్యాంగ్ స్టర్ చంపేందుకు ప్రయత్నించాడు. ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్ ఎవరు? ఎందుకు చంపాలని అనుకున్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో టాటా గ్రూప్ ఛైర్మన్గా రతన్ టాటా తన తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. కెరియర్ ప్రారంభంలో తనని ఓ ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్ బెదిరించాడని, ఒప్పందంలో భాగంగా తనని చంపేందుకు కుట్రకు పాల్పడ్డారని అన్నారు. అప్పట్లో టెల్కోగా పిలవబడే టాటా మోటార్స్లో లేబర్ ఎన్నికలు జరిగాయి. అందులో టాటా గ్రూప్కు వ్యతిరేకంగా, ఓ యూనియన్ను నియంత్రించేందుకు సదరు గ్యాంగ్ స్టర్ ప్రయత్నించాడు. శాంతి మంత్రమే అల్లరిమూకలతో టాటా మోట్సార్లో దాడులకు తెగపడ్డాడు.రతన్ టాటా అందుకు భిన్నంగా సదరు గ్యాంగ్ స్టర్ను బుజ్జగించి శాంతి యుతంగా చర్చలకు పిలవాలని కార్మికులను, తోటి సహచరులను కోరారు. కానీ గ్యాంగ్ స్టర్ మరోలా ఆలోచించాడు. టాటా మోటార్స్ ప్లాంట్లోని కార్మికుల్ని బెదిరించిన గ్యాంగ్స్టర్ ముఠా.. కత్తులతో దాడికి దిగింది. హెచ్చరికలు జారీ చేసేందుకు ప్లాంట్లోని అధికారులను కత్తులతో పొడిచి భయాందోళనకు గురి చేసింది. ఎక్కడా తలవంచలేదు ఇలా, లేబర్ ఎన్నికలు సజావుగా జరగకుండా ఉండేందుకు గ్యాంగ్స్టర్ నిరంతరం బెదిరింపులు పాల్పడ్డాడు. ఆ బెదిరింపులకు రతన్ టాటా ఎక్కడా తలవంచలేదు. గ్యాంగ్స్టర్ సమ్మెకు పిలుపునివ్వడంతో.. దాడులకు బయపడి కార్మికులు పనిచేయడమే మానేశారు. దీంతో, కార్మికులను ఆదుకునేందుకు రతన్ టాటా రోజుల తరబడి ప్లాంట్లోనే మకాం వేసి రోజూవారి పనులు పూర్తి చేశారు. అలా చివరికి రతన్ టాటా పట్టుదల ముందు గ్యాంగ్ స్టర్ ఓడిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. టాటాను చంపేందుకు కుట్ర జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్ రతన్ టాటాను చంపేందుకు తన కాంపిటీటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అంతేకాదు, తాను చెప్పినట్లుగా చేయాల్సిందేనంటూ టాటా గ్రూప్ కార్మికులకు ఆదేశాలు జారీ చేశాడు. టాటా మాత్రం గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు తలవంచకుండా ముందుకు సాగారు. నేడు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. టాటా మోటార్స్ లేబర్ ఎన్నికలు సజావుగా జరిగేలా గ్యాంగ్స్టర్తో వ్యవహరించేటప్పుడు రతన్ టాటా కఠినమైన సమయాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నా..శాంతి యుతంగా తాను ఆ సమస్య నుంచి బయటపడిన విధానం, తీసుకున్న నిర్ణయాల పట్ల తానెప్పుడు చింతించలేదని రతన్ టాటా ఆ వీడియోలో మాట్లాడారు. చదవండి👉 మహీంద్రాతో పాక్ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి? -
ఎయిరిండియా ఆఫర్: రూ. 1471లకే విమానం ఎక్కేయొచ్చు!
AirIndia Sale: గతవారం ఎయిర్క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్గా అందిస్తున్న ఈసేల్లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేసుకోవచ్చు. కాగా ఎయిరిండియా తొలి ఎయిర్బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.