-
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్టీకి ఢిల్లీ, కోల్కతాల్లో క్యాంపస్లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
ఇంటర్ విద్యార్థులను తికమకపెడుతున్న త్రికోణమితి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా సిలబస్లో కోత పెట్టడం వల్ల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు తలనొప్పులు తప్పడం లేదు. మొదటి సంవత్సరంలో బేసిక్స్ (ప్రాథమికాంశాలు) వదిలేయడంతో రెండో ఏడాది కొన్ని పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనివల్ల పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. 70 శాతానికి కుదింపు కోవిడ్ వల్ల గతేడాది విద్యాసంస్థలు పనిచేయని విషయం తెలిసిందే. ఆన్లైన్ పాఠాలు కూడా చాలారోజులు జరగలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ఫస్టియర్ సిలబస్ను 70 శాతానికి కుదించారు. దీంతో విద్యార్థులు కొన్ని చాప్టర్ల జోలికి అసలుకే వెళ్లలేదు. వీటిల్లో పలు కీలక విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించే చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే తప్ప రెండో ఏడాదిలో పాఠాలు అర్థం కానివి కొన్ని ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు కాలేజీలు కుదించిన చాప్టర్లను కూడా విద్యార్థులకు బోధించినా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆన్లైన్ పాఠాలు అర్థం కాక, సిలబస్ కోతతో విద్యార్థుల పరిస్థితి, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఫస్టియర్లో చదవకపోతే కష్టమే.. ఫస్టియర్ గణితంలో త్రికోణమితి (ట్రిగొనమెట్రీ) చాప్టర్ను వదిలేశారు. రెండో ఏడాదిలో ఇది మరింత లోతుగా ఉంది. ప్రాథమిక అవగాహన ఉంటే తప్ప క్లిష్టమైన లెక్కలను చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. విశ్లేషణాత్మక గణిత సూత్రాలన్నీ ఫస్టియర్లో ఉన్నాయని, దాని కొనసాగింపు రెండో ఏడాది ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. మహబూబ్నగర్లోని ఓ ప్రభుత్వ కాలేజీలో త్రికోణమితిపై కాలేజీ అధ్యాపకులు పరిశీలన చేశారు. 60 మందిలో కనీసం 20 మంది కూడా ఓ మోస్తరు క్లిష్టమైన త్రికోణమితి లెక్కలు చేయలేని పరిస్థితి కన్పించింది. జంతుశాస్త్రంలో ప్రొటోజోవా గమనం, ప్రత్యుత్పత్తి చాప్టర్లను కూడా కోత మూలంగా విద్యార్థులు ముట్టుకోలేదు. కానీ రెండో సంవత్సరంలో ఈ చాప్టర్లు మరింత లోతుగా ఉన్నాయి. ప్రాథమిక అవగాహన మొత్తం మొదటి ఏడాదిలోనే ఉందని, అది లేకుండా రెండో ఏడాదిలో విద్యార్థులకు సబ్జెక్టు అర్థం కావడం లేదని జువాలజీ లెక్చరర్ ఒకరు తెలిపారు. బొద్దింక కోతకు సంబంధించి సబ్జెక్టు ఫస్టియర్లో ఉంది. దీన్ని తెలుసుకుంటేనే రెండో ఏడాది మానవుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన విషయాలు అర్థమవుతాయని లెక్చరర్లు చెబుతున్నారు. కుదింపు జాబితాలో ‘బొద్దింక’ ఎగిరిపోవడంతో రెండో ఏడాది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రసాయన శాస్త్రంలో మూల సూత్రాలన్నీ ఫస్టియర్లో ఉంటాయి. ఇవి తెలియకుండా రెండో ఏడాది కొనసాగింపుగా వచ్చే చాప్టర్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. హిస్టరీ, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పైగా ఈ ఏడాది రెండో సంవత్సరం వంద శాతం సిలబస్ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా పాఠాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలపైనా ప్రభావం భవిష్యత్తులో జేఈఈ, ఎంసెట్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల పాలిట కుదించిన చాప్టర్లు శాపంగా మారే అవకాశం కన్పిస్తోంది. తగ్గించిన 30 శాతం సిలబస్ నుంచి ప్రతి ఏటా గణితంలో 20 నుంచి 30 మార్కులు వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. అలాగని ఫస్టియర్ నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ అయిన విద్యార్థులు ఇప్పుడు కోత పెట్టిన పాఠాలపై దృష్టి పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. సాధారణంగా రెండో ఏడాది మధ్య నుంచే విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ఏడాది సిలబస్ పూర్తి చేయడమే కష్టంగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది 1,600 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని ఎలా అధిగమించాలో తెలియక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఆ చాప్టర్లపై అవగాహన కలిగించాలి ఫస్టియర్లో త్రికోణమితి బేసిక్స్ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో ఏడాదిలో ఈ పాఠం విద్యార్థులకు కష్టంగా ఉంది. బోధిస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. రెండో ఏడాదిలోనూ ఆ పాఠాలు తీసేస్తే బాగుండేది. ఫస్టియర్లో కోత పెట్టిన చాప్టర్లపై కొంత అవగాహన కల్గించాల్సిన అవసరం ఉంది. – రఘురాం, గణితం అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జడ్చర్ల -
యూజీసీ–నెట్ 2021: కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ).. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా యూజీసీ నెట్! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్! ఇందులో ప్రతిభ చూపి..మెరిట్ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్ జూన్–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ... పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్–2021 సెషన్కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రెండు సెషన్లకు సంయుక్తంగా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్–2020 సెషన్, జూన్–2021 సెషన్లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్–2020 సెషన్ వాయిదా పడింది. అలాగే జూన్–2021 సెషన్ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్–2020 సెషన్ అభ్యర్థులు కూడా జూన్–2021 సెషన్కు హాజరు కావొచ్చు. 81 సబ్జెక్ట్లలో పరీక్ష యూజీసీ నెట్ మొత్తం 81 సబ్జెక్ట్ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఇండియన్ కల్చర్ తదితర ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్ సబ్జెక్ట్లతోపాటు కంప్యూటర్ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ సబ్జెక్ట్లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. అర్హతలు ► అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది. ► పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: జేఆర్ఎఫ్ అభ్యర్థులకు అక్టోబర్ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్సీఎల్, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది. ► అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ యూజీసీ–నెట్ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ► యూజీసీ–నెట్ పరీక్ష ఆన్లైన్ విధానం (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ► మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1కు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. ► పేపర్–1లో టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ► పేపర్–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. ► పేపర్–2లో సంబంధిత సబ్జెక్ట్ పేపర్ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. ► పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు. కనీస అర్హత మార్కులు ► యూజీసీ నెట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి. ► కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్ జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్పై గట్టి పట్టుండాలి. పేపర్1: ఆసక్తి, అవగాహన ► పేపర్–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్–గవర్నెన్స్, పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2: సబ్జెక్ట్ ప్రశ్నలు పేపర్–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్ సిలబస్ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్కు సంబంధించి ఇంటర్మీడియెట్ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్ థింకింగ్, అప్లికేషన్ ఓరియెంటేషన్ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ అప్రోచ్ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. యూజీసీ నెట్ 2021–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్ 5,2021 ► ఆన్లైన్లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్ 6, 2021 ► ఆన్లైన్ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్ 7–సెప్టెంబర్ 12 ► పరీక్ష తేదీలు: అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 11 వరకు ► ప్రతి రోజు రెండు షిఫ్ట్ల్లో పరీక్ష (మొదటి షిప్ట్ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in -
ఏపీ జాబ్స్: ఇలా చేస్తే.. కొలువు ఖాయం
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే.. ఎండమావే! ఎదురుచూసి చూసి నిరుద్యోగుల కళ్లు కాయలు కాసేవి!! ఒకవేళ అరకొరగా ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినా.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేందుకు సంవత్సరాలు గడిచిపోయేవి!! అలాంటి పరిస్థితులకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయా జాబ్ నోటిఫికేషన్లు వెలువడే నెలను సైతం ప్రకటించడం.. ఉద్యోగార్థులకు అత్యంత శుభ పరిణామం! ఈ నేపథ్యంలో.. నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవడమెలాగో తెలుసుకుందాం... ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలతోపాటు నోటిఫికేషన్లు వెలువడే నెలను కూడా నిర్దిష్టంగా ప్రకటించారు. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు వేచి చూడకుండా.. తమ అర్హతలకు సరితూగే ఉద్యోగాలను గుర్తించి.. వాటిని సాధించేందుకు కృషి చేయాలని సలహా ఇస్తున్నారు. గ్రూప్స్, పోలీస్, మెడికల్.. ఇంకా ఎన్నో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జ్యాబ్ క్యాలెండర్ ప్రకారం–గ్రూప్–1,2 సర్వీసులు మొదలుకొని మరెన్నో శాఖల్లో పోస్టుల భర్తీ జరుగనుంది. గ్రూప్స్ తర్వాత ఎంతో క్రేజ్ ఉండే పోలీస్ రిక్రూట్మెంట్, భావి భారత పౌరులను తీర్చిదిద్దే అధ్యాపకులు, ప్రొఫెసర్లు; వైద్య రంగంలో ఎంతో కీలకమైన డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఇలా మొత్తంగా అన్ని శాఖల్లో కలిపి 10,143 పోస్ట్లకు ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదలైంది. వీటితోపాటు తాజా మరో 1180 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండటం నిరుద్యోగులకు మరో తీపికబురుగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశం ► జ్యాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు మెడికల్ ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభించనుంది. ఉదాహరణకు.. గ్రూప్–1,2 సర్వీసులకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. అదే విధంగా డిగ్రీతో ఎస్ఐ స్థాయి ఉద్యోగాలకు, ఇంటర్మీడియెట్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► పారా మెడికల్ సిబ్బంది విషయానికొస్తే.. ఆయా విభాగాల్లో పారా మెడికల్ కోర్సుల్లో డిప్లొమా తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అర్హత లభించనుంది. ► వైద్య శాఖలో పేర్కొన్న డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు.. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటి కోర్సులు పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులు వైద్య శాఖలో నర్స్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ► విద్యా శాఖలో లెక్చరర్ల పోస్టులకు ఆయా సబ్జెక్ట్ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం పీజీ ఉత్తీర్ణతతోపాటు నెట్ లేదా సెట్ స్కోర్ సాధించిన వారికి దరఖాస్తుకు అర్హత లభించనుంది. సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి గతంలో వివిధ పోస్టులకు మూడంచెలు, రెండంచెల విధానంలో.. నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అన్ని నియామకాల్లో స్క్రీనింగ్ టెస్ట్/ప్రిలిమినరీ టెస్ట్ విధానానికి స్వస్తి పలికింది. ఒకే ఒక రాత పరీక్ష నిర్వహించి.. అందులో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో.. గ్రూప్స్ మొదలు అన్ని రకాల నియామక ప్రక్రియల్లో ప్రిలిమ్స్ విధానం నుంచి విముక్తి లభించనుంది. దీనివల్ల ఉద్యోగార్థులకు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం లభిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో తమకు అర్హత ఉన్న పలు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్ను పరిశీలించి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకారం–ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. ముందుగా తమ అర్హతకు సరితూగే పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంశాలను పరిశీలించాలి. పరీక్ష విధానం, సిలబస్పై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ సిలబస్లో వెయిటేజీ ఆధారితంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. వాటికి సంబంధించి అకడమిక్ పుస్తకాలతోపాటు.. ప్రామాణిక స్టడీ మెటీరియల్ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ స్టడీస్ ఏ ఉద్యోగ పరీక్ష అయినా.. జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జనరల్ స్టడీస్ అంశాలుగా పేర్కొనే ఏపీ, ఇండియన్ హిస్టరీ; జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్ అంశాలతోపాటు..సమకాలీన పరిణామాలపైనా అవగాహన పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలను.. జనరల్ స్టడీస్లోని కోర్ టాపిక్స్తో అనుసంధానిస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్తో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయి అంశాలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. రాష్ట్ర స్థాయి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రధానంగా రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సహజ వనరులు, కళలు–సంస్కృతి, రాష్ట్ర చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలను అవపోసన పట్టాలి. సహజ వనరులు ఎక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలు, సదరు సహజ వనరులు అభివృద్ధికి దోహదపడుతున్న తీరును తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలు జనరల్ స్టడీస్తోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ముఖ్యంగా నవ రత్నాలు.. ఉద్దేశాలు, లక్షిత వర్గాలు, వాటికి బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారి సంఖ్య వంటి అంశాలపై గణాంక సహిత వివరాలతో సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల(ఉదా: ఐటీ పాలసీ, పారిశ్రామిక ప్రణాళిక, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న చర్యలు) గురించి తెలుసుకోవాలి. అకడమిక్స్ + సమకాలీన జాబ్ క్యాలెండర్లో పలు స్పెషలైజ్డ్ పోస్ట్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు: వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు వంటివి. వీటి నియామక ప్రక్రియలో జనరల్ స్టడీస్తోపాటు ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలను పరిశీలించే సబ్జెక్ట్ పేపర్లు కూడా ఉంటాయి. ఈ సబ్జెక్ట్ పేపర్లలో రాణించాలంటే.. అభ్యర్థులు అకడమిక్గా ఆయా సబ్జెక్ట్ నైపుణ్యాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వాటికి సంబంధించి తాజాగా పరిణామాల గురించి కూడా తెలుసుకోవాలి. డిస్క్రిప్టివ్ ప్రిపరేషన్ ఉద్యోగ నియామక పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే జరిగినా.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మాత్రం డిస్క్రిప్టివ్ పద్ధతిలో కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. డిస్క్రిప్టివ్ అప్రోచ్తో చదవడం ద్వారా విభిన్న కోణాల్లో నైపుణ్యం లభిస్తుంది. ఫలితంగా ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇవ్వగలిగే సంసిద్ధత లభిస్తుంది. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు వేగంగా పునశ్చరణకు ఉపయోగపడుతుంది. స్వీయ విశ్లేషణ అభ్యర్థులు.. ఎప్పటికప్పుడు తమ స్వీయ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా మోడల్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాయడం ద్వారా తమ ప్రిపరేషన్ స్థాయిపై ఒక అంచనాకు రావాలి. దీనివల్ల ఇంకా సామర్థ్యం పెంచుకోవాల్సిన అంశాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష సిలబస్, టాపిక్స్ను పరిగణనలోకి తీసుకుంటూ.. ప్రతి రోజు ఆయా అంశాలకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. టైమ్ టేబుల్ ప్రకారం చదవడం పూర్తిచేయాలి. ఒకే అర్హతతో పలు పరీక్షలు ఒకే అర్హతతో ఒకటి కంటే ఎక్కువ శాఖల్లోని పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే గ్రూప్స్, పోలీస్–ఎస్ఐ పోస్ట్లను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్ను బేరీజు వేసుకుంటూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ముందస్తు ప్రణాళికే ముఖ్యం ఏపీ జ్యాబ్ క్యాలెండర్లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్కు ఉపక్రమించి.. టాపిక్వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్లో ముందంజలో నిలిచేలా చేస్తాయి. – జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు -
టెన్త్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
IIT JAM 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్–2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్తో ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్ మొదలు.. బీటెక్ ఉత్తీర్ణులు రాసే గేట్ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్డ్, లేదా గేట్ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్!! జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్నే సంక్షిప్తంగా జామ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్–2022 షెడ్యూల్ను ప్రకటించింది. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లు జామ్లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్డీ స్థాయి ప్రోగ్రామ్స్లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్పూర్, కాన్పూర్, ఖరగ్పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్లతోపాటు ఐఐఎస్సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. కోర్సులు ► జామ్లో సాధించిన స్కోర్తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు); జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్డీ; ఎమ్మెస్సీ–పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్లో ప్రవేశం పొందొచ్చు. ► వీటితోపాటు ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అందుబాటులో ఉంది. జామ్ స్కోర్ ఆధారంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్సీ బెంగళూరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఏడు పేపర్లలో పరీక్ష జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్;మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. మూడు విభాగాలు ► జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. ► సెక్షన్ ఏ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ► సెక్షన్ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ► సెక్షన్ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్ పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపు జామ్లో స్కోర్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. సిలబస్.. ప్రిపరేషన్ ఐఐటీ–జామ్లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్టోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్,క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పేపర్కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్లను అధ్యయనం చేయాలి. జియాలజీ ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్కు 40 శాతం, స్టాటిస్టిక్స్కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్లో.. మ్యాథ్స్కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. ఫిజిక్స్ మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. ఐఐటీ–జామ్ 2022 ముఖ్య సమాచారం ► ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2021 ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: జనవరి 4, 2022 ► జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022 ► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jam.iitr.ac.in -
TS EDCET 2021: ఎడ్సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్సెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్సెట్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్సెట్లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్సెట్కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్పై పట్టు సాధిస్తే ఎంట్రన్లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్సెట్కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
గుడ్న్యూస్: పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్
సాక్షి, ఎడ్యుకేషన్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం...స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ మొదలైనవి www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sakshieducation.com/TCLASS/Index.html -
టెన్త్కు రెగ్యులర్ తరగతులు!
సాక్షి, అమరావతి: కోవిడ్19 కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు నవంబర్ 2 నుంచి తెరవనున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణ, ప్రత్యామ్నాయ పాఠ్య ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో విద్యా రంగ నిపుణులతో ఈ కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్పై ప్రతిపాదనలు అందించనున్నారు. రానున్న రోజుల్లో పని దినాలను అనుసరించి విద్యార్థుల్లో అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా పాఠ్యాంశాల నిర్ణయం, తరగతుల నిర్వహణ అంశాలపై దృష్టి సారించారు. పాఠశాల తరగతులను 18 వరకు ఒక విభాగంగా, 9, 10 తరగతులను మరో విభాగంగా రూపొందిస్తున్నారు. 18 తరగతుల వారికి తరగతుల నిర్వహణకు రెండు మూడు మార్గాలను ప్రతిపాదిస్తున్నా, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం రెగ్యులర్ తరగతులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను అనుసరించి తరగతులు కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరించి విద్యార్థులను అనుమతించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులు నిర్వహించనున్నారు. లేదంటే కొన్ని రోజులు కొన్ని తరగతులు, మరికొన్ని రోజులు మరికొన్ని తరగతులు పెట్టనున్నారు. తొలుత తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాలు పెట్టి పాఠశాలలకు పిల్లలను పంపడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించనున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో భౌతిక దూరం పాటించేలా టీచర్లకు బాధ్యతలు అప్పగిస్తారు. స్కూలులో చెబితేనే నేర్చుకోగలుగుతారనే అంశాలు పాఠ్యాంశాలుగా ఉంటాయి. ఇంటిదగ్గర నేర్చుకొనే వాటికి సంబంధించి వీడియో, ఆడియోల రూపంలో విద్యార్థులకు అందిస్తారు. అదనంగా నేర్చుకొనే అంశాల గురించి వివరిస్తారు. ఈ మేరకు పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నారు. 180 పనిదినాలు ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు కొనసాగించేలా పాఠ్య ప్రణాళిక రూపొందుతోంది. సంక్రాంతి సెలవులను కుదించడం ద్వారా 180 పని దినాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అభ్యసన ఫలితాల సాధనకు వీలుగా అన్ని అంశాలు బోధించేలా ప్రణాళిక ఉంటుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. ఈసారి పరీక్షలు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ ఉండేలా చూస్తున్నారు. పాఠ్యప్రణాళిక ప్రకారమే పరీక్షలు ప్రస్తుతం పరిస్థితిని అనుసరించి రూపొందిస్తున్న పాఠ్య ప్రణాళికనే టెన్త్ పరీక్షల నిర్వాహకులకు అందిస్తారు. దాని ఆధారంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుల మూల్యాంకన జరిగేలా చూస్తారు. టెన్త్ పరీక్షలు ఏటా మార్చి 24 లేదా 26వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 10 వరకు జరుగుతుంటాయి. ఈసారి తరగతులు ఆలస్యమైనందున ఏప్రిల్ 15 నుంచి ప్రారంభించి, ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తారు. -
ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్ ఇమేజ్’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల సిలబస్తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, హైదరాబాద్లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు. సిలబస్లో అనేక మార్పులు 1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్లో మార్పులు చేశారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్బుక్స్ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి. సెమిస్టర్ విధానంలో పాఠ్యపుస్తకాలు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. – డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి.. గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి. – డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి అన్ని మాండలికాలకు పెద్దపీట తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం. – డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి -
ఇంటర్ సిలబస్ తగ్గింపు; ఈ ఏడాదికే
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యా సంవత్సరానికి (2020-21) గాను 30 శాతం తగ్గించారు. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలిగించిన పాఠ్యాంశాల వివరాలను ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలిగించామని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు నెల క్రితమే 30 శాతం సిలబస్లో కోత విధిస్తూ సీబీఎస్ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ట్స్ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం సహా ఇతర సబ్జెక్టుల సిలబస్పై నిపుణుల కమిటీలతో చర్చించి వాటి సిఫారసు ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఇక సిలబస్ తగ్గింపు అంశం ఈ సంవత్సరానికే వర్తిస్తుందని తెలిపారు. -
‘కుదింపు’ రాజకీయం
విద్యార్థులపై ప్రభుత్వాలు కరుణ చూపే సందర్భాలు గతంలో చాలా తక్కువుండేవి. ఏవో కొన్ని రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రభుత్వాలుగానీ, కేంద్రంగానీ వారి గోడు పట్టించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దేశంలో విద్యను ప్రైవేటుకు విడిచిపెట్టి, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు దశాబ్దా లుగా భారీ ఫీజులతో పీల్చిపిప్పిచేస్తున్నా నామమాత్రం చర్యలతో పాలకులు పొద్దుపుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్ని, కళాశాలల్ని పరోక్షంగా తూట్లుపొడిచారు. ఈ విధానం ఇప్పట్లో మారుతుందో లేదోగానీ... కరోనా మహమ్మారి పుణ్యమా అని సిలబస్లో మాత్రం మూడో వంతు తగ్గిస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. 2020–21 విద్యా సంవత్సరానికి 9 నుంచి 12వ తరగతి వరకూ వున్న సిలబస్లో 30 శాతాన్ని తగ్గిస్తూ బుధవారం ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆ తరగతుల విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లోని స్పందనలు చెబుతున్నాయి. నీట్, జేఈఈ పరీక్షలకు ప్రశ్న పత్రాలు రూపొందించేటపుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నదే వారి ఏకైక డిమాండు. ఇతర తరగతులవారు సైతం మా సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ వయసు పిల్లల్లో అత్యధికులు సిలబస్ భారం తగ్గిందంటే వేరే విధంగా స్పందిస్తారని అనుకోనవసరం లేదు. కానీ విపక్షాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి. ఈ నిర్ణయంలో దురుద్దేశాలున్నాయని ఆరోపిస్తు న్నాయి. సిలబస్ తొలగింపులో కాదు... విపక్షాల పాక్షిక దృక్పథంలోనే దురుద్దేశం వుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వాదన. అందుకాయన కొన్ని కారణాలు చెబుతున్నారు. ఒక్క సామాజిక శాస్త్రాల్లో మాత్రమే కాక సైన్స్, గణితం, ఇంగ్లిష్, హిందీ, హోంసైన్స్, జామెట్రీ వంటి వేర్వేరు సబ్జెక్టుల్లో కూడా సిలబస్ తొలగించారని ఆయన వివరణ. సిలబస్ తగ్గింపుపై రాజకీయం వద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తలెత్తిన ప్రత్యేక పరిస్థితుల పర్యవసానంగా 190 సబ్జెక్టుల్లో సిలబస్ కుదించామని, ఇది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని అటు సీబీఎస్ఈ చెబుతోంది. ఈసారికి సిలబస్ తగ్గించాలన్న డిమాండు తొలిసారి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్ సిసోడియా నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు తొలగించిన అంశాలు చూశాక ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అన్నింటి మూలాలు రాజకీయాలతో ముడిపడిన వర్తమానంలో సిలబస్ కుదింపు అంశం వివాదం కావడంలో ఆశ్చర్యం లేదు. అన్నింటా సిలబస్ కుదించాం కదా అన్న కేంద్రమంత్రి పోఖ్రియాల్ వాదన సరైందే కావొచ్చు. కానీ ఇతర సబ్జెక్టులకూ, సామాజిక శాస్త్రాలకూ చాలా వ్యత్యాసం వుంది. పరస్పరం సంఘ ర్షిస్తున్న సిద్ధాంతాలు, భావనలు సమాజంలో అనేకం వుంటాయి. ఏకీభావం కుదిరే అంశాల్లో సైతం భిన్న దృక్పథాలుంటాయి. వాటిని గురించి చర్చించేవి, వివరించేవి, విద్యార్థికి అవగాహన కలిగించేవి సామాజిక శాస్త్రాలు. కనుక సహజంగానే ఆ శాస్త్రాల్లో తొలగించిన సిలబస్పై ప్రశ్నలు తలెత్తుతాయి. ఫలానా అంశం కాకుండా ఇదే ఎందుకు తొలగించవలసివచ్చిందన్న సంశయం వస్తుంది. ఆ తొల గింపు వెనకున్న ప్రయోజనాలేమిటన్న ఆరా ఉంటుంది. విపక్షాలను సంతృప్తిపర్చడానికో, మరెవ రికో తలెత్తే అనుమానాలు తీర్చడానికో కాదు... విద్యారంగ నిపుణులనుంచి ఎలాంటి అభ్యంతరం రాకుండా వుండాలంటే సీబీఎస్ఈ అయినా, మరెవరైనా సిలబస్ తొలగింపు విషయంలో పారదర్శ కంగా వుండాలి. అసలు ఫలానా అంశం లేకపోయినా ఫర్వాలేదనో... తొలగించి తీరాలనో ఏ ప్రాతి పదికన నిర్ణయానికొచ్చారో, అందుకు అనుసరించిన విధానంలోని హేతుబద్ధత ఏమిటో చెప్పాల్సిన బాధ్యత సీబీఎస్ఈకి వుంటుంది. సీబీఎస్ఈ తొలగించిన పాఠ్యాంశాలు చూస్తే ఆశ్చర్యం కలగడం సహజం. ఉదాహరణకు పద కొండో తరగతిలో ప్రజాస్వామిక హక్కులు, పౌరసత్వం, ఫెడరలిజం, జెండర్, మతం, జాతీయ వాదం, లౌకికవాదం వంటి అంశాలు సిలబస్ కుదించాక ఎగిరిపోయాయి. ఇవన్నీ ఏ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకైనా అత్యంత ప్రాథమికమైనవి. మరోవిధంగా చెప్పాలంటే అవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు. ఈ అంశాల్లో సమాజం వైఖరి ఎలావుందన్నదాన్ని బట్టే ఆ సమాజం ప్రజాస్వామికమైనదా, కాదా అన్నది తేలుతుంది. సామాజిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఆ అంశాల జోలికిపోకుండా ప్రజాస్వామ్యం గురించి ఏం అవగాహన చేసుకుంటారు? పన్నెండో తరగతి సిల బస్లో ‘ఇరుగు పొరుగుతో భారత్ సంబంధాలు’, సంస్కరణలతో ఆర్థికాభివృద్ధి, సామాజిక ఉద్య మాలు, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. మాయమైన ఈ అంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగేందుకు అనువుగా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యా విషయక క్యాలెండర్లో పొందుపరిచారు గనుక ఆందోళన పడొద్దని సీబీఎస్ఈ వివరిస్తోంది. కానీ ఈ అంశా లను లోతుగా అధ్యయనం చేయడం, చర్చించడం ఎలా సాధ్యం? ఈ కరోనా కాలం కొత్త అనుభవా లను కలిగిస్తోంది. ఎన్నడూ ఊహించడానికి శక్యంకానివి కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఒక ప్పుడు మోడరేషన్ కింద ఒకటి రెండు మార్కులు కలపాలంటే ఉద్యమాలు చేయాల్సివచ్చేది. కానీ ఇప్పుడు బడికి వెళ్లాల్సిన భారం లేకపోవడం, చదవకుండానే, పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం, ఇప్పటికే ఫెయిలై సప్లిమెంటరీ రాయవలసినవారు కూడా పైతరగతులకు అర్హులు కావడం వంటివన్నీ జరిగిపోతున్నాయి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గనుక, తొలగించిన అంశాలకు సంబంధించి బీజేపీకున్న దృక్పథమేమిటో తెలుసు గనుక సహజం గానే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిరుడు ఏప్రిల్లో కూడా సీబీఎస్ఈ కుల ఘర్షణలు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఎదురయ్యే సవాళ్లు, భిన్నత్వంవంటి అంశాలు తొలగించింది. విద్యార్థులకు సిల బస్ భారాన్ని తొలగించాలనుకోవడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆ పేరుతో అసలు ఆలోచించే భారాన్నే కుదించాలనుకోవడం మంచిది కాదు. ఈ కుదింపు తరచుగా వివాదాస్పదమవుతున్నది గనుక అందులో పారదర్శకతకు చోటీయడం ఉత్తమం. -
సిలబస్ నుంచి పౌరసత్వం, నోట్లరద్దు కట్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యా సంవత్సరం తగ్గించాల్సి రావడంతో సిలబస్ను కూడా సీబీఎస్ఈ తగ్గించింది. దీనికోసం తొలగించిన అంశాల్లో లౌకికవాదం, పౌరసత్వం, జాతీయ వాదం, నోట్ల రద్దు వంటి అంశాలు. 9 నుంచి 12 తరగతుల వారికి దాదాపు 30 శాతం సిలబస్ ను తగ్గిస్తూ తాజా సిలబస్ను బుధవారం వెల్లడించింది. ఇందులో పదో తరగతిలో తొలగించిన వాటిలో ప్రజాస్వామ్యం– వైవిధ్యత, లింగం, కులమతాలు, ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, సమస్యలు వంటి అంశాలు ఉన్నాయి. 11వ తరగతిలో సమాఖ్యవిధానం, పౌరసత్వం, జాతీయవాదం, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు లౌకిక వాదం అనే అంశాలను తొలగించారు. 12వ తరగతిలో భారత్తో పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల సంబంధాలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, భారత్ లో సామాజిక ఉద్యమాలు, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను తొలగించారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా సిలబస్ను రూపొందించినట్లు హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సిలబస్ నుంచి ఇంటర్నల్ పరీక్షల్లోగానీ, సంవత్సరాంతపు పరీక్షల్లోగానీ ప్రశ్నలు రావని సీబీఎస్ఈ తెలిపింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఒక్కసారి మాత్రమే.. 9 నుంచి 12 తరగతుల వరకూ తగ్గించిన సిలబస్ కేవలం ఒక్క విద్యా సంవత్సరానికి (2020–21) మాత్రమేనని సీబీఎస్ఈ సెక్రెటరీ అనురాగ్ తిపాఠి చెప్పారు. 190 సబ్జెక్టులకు సంబంధించి 30 శాతం సిలబస్ తగ్గించామని చెప్పారు. ఏఏ అంశాలను తొలగించారో స్పష్టంగా తెలిసేందుకు పాఠశాలలు ఎన్సీఈఆర్టీ రూపొందించిన క్యాలెండర్ను పాటించాలని సూచించారు. తొలగించిన అంశాలకు సంబంధించిన పాఠాలు సిలబస్లో ఎక్కడో ఒక చోట ఉండేలా చూసుకున్నామని చెప్పారు. -
సిలబస్ తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలోనూ జాతీయ స్థాయిలో 30 శాతం సిలబస్ తగ్గింపునకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ యోచిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభమై కొనసాగాల్సిన పాఠశాలలు కరోనా కారణంగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో వచ్చే నెలలోనూ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ పాఠశాల విద్యలో సిలబస్ను 30 శాతం వరకు తగ్గించే విషయమై విద్యాశాఖ ఆలోచిస్తోంది. దీనిపై ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే జాతీయ స్థాయిలో స్పష్టత వచ్చాక ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనా, సిలబస్ కుదింపు అమలు చేయాల్సి వస్తే ఏయే పాఠ్యాంశాలను తొలగించాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేయాలనే భావనకు వచ్చారు. ప్రతి సబ్జెక్టులో 30 శాతం కరోనా కారణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తమ పరిధిలోని స్కూళ్లలో 30 శాతం సిలబస్ కుదింపునకు ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ కుదింపునకు చర్యలు చేపట్టింది. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీఈఆర్టీ) కూడా పాఠశాలల్లో సిలబస్ కుదింపు, అకడమిక్ వ్యవహారాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ తరగతుల వారీగా ఏయే సబ్జెక్టులో ఎంత సిలబస్ను తగ్గించవచ్చనే అంశాలపై ప్రణాళికలు రూపొందిస్తోంది. తరగతుల వారీగా ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు సిలబస్ను తగ్గించే ప్రణాళికలపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అనుగుణంగా సిద్ధంగా ఉండేలా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెలవు రోజుల్లోనూ పాఠశాలలు కరోనా అదుపులోకి వస్తే సెప్టెంబరులో పాఠశాలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒకవేళ రాకుంటే అక్టోబరు కావచ్చు లేదా ఇంకా ఆలస్యం కావచ్చు. కాబట్టి సిలబస్ తగ్గించినా పని దినాలు సర్దుబాటయ్యే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. సెప్టెంబరు నాటికే దాదాపు 70 రోజులకు పైగా పనిదినాలు కోల్పోయినట్టవుతుంది. స్కూళ్ల ప్రారంభం ఇంకా ఆలస్యమైతే ఇంకా పని దినాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా సెలవు దినాల్లో బడులను కొనసాగించేలా ప్రణాళికలను సిద్ధం చేసేందుకు విద్యాశాఖ నడుంబిగించింది. రెండో శనివారాలు, వీలైతే ఆదివారాలు, ఇతర పనిదినాల్లోనూ స్కూళ్లను కొనసాగించేలా ప్రణాళికలను రూపొందించడంపై దృష్టి సారించింది. -
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నమోదైన కొన్ని రోజులకే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తరువాత దేశంలో కరోనా విజృంభించడంతో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ స్కూళ్లు మాత్రం తెరవలేదు. ఈ క్రమంలోనే అన్ని తరగతుల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది పాఠశాలలు తెరవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీబీఎస్ఈ కూడా 9 నుంచి 12 వ తరగతి వరకు 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. (ఫేస్బుక్తో జతకట్టిన సీబీఎస్ఈ) ఇది 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని కేంద్ర మానవనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించారు. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని ఆయన తెలిపారు. అయితే కుదించిన సిలబస్ను కూడా టీచర్లు విద్యార్థులు చెప్పాలని, అయితే వాటిని పరీక్షలు ఇవ్వబోమని తెలిపారు. సిలబస్ కుదింపు విషయంలో కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని ఆయన స్పష్టం చేశారు. సిలబస్ కుదింపునకు సంబంధించి మానవవనరుల శాఖకు ఇప్పటి వరకు 1500 పైగా నిపుణులు సలహాలు ఇచ్చారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విద్యార్ధుల సిలబస్ 30 శాతం తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. (సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు) -
సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సకాలం లో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్, పని దినాలను కుదించేందుకు ఎంహెచ్ఆర్డీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు, పని దినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్–2020’ పేర అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంహెచ్ఆర్డీ ట్విట్టర్ ఖాతాకు లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచిం చారు. మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కసరత్తు ప్రారంభించింది. -
ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సిలబస్ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సెప్టెంబర్లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
'సిలబస్ను ఆన్లైన్లో పూర్తి చేయండి'
సాక్షి, అమరావతి : కరోనాతో లాక్డౌన్ కారణంగా సిలబస్ పూర్తి కాకపోవటం, పరీక్షలు నిర్వహించలేకపోవటం తదితర అంశాలపై అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు పూర్తికాని సిలబస్ను ఆన్లైన్ ద్వారా భోదన చేపట్టి పూర్తి చేయాలని పేర్కొన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా ప్రస్తుతం విద్యార్థులకు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తికాని సెమిస్టర్లు ఆన్లైన్ ద్వారా పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు కూడా ఆన్లైన్లో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 2020-21 విద్యా సంవత్సరంలో పనిదినాలు కోసం పండుగలు ఇతర సెలవుదినాలు కూడా పరిశీలించి మొత్తం పనిదినాలు 220కు తగ్గకుండా చూసుకోవాలన్నారు.క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగిస్తున్న హాస్టల్, ఇతర విద్యాశాఖ భవనాలు తిరిగి వినియోగించుకునే ముందు సంబంధిత జిల్లా వైద్యశాఖ అధికారులతో యూటిలైజేషన్ సర్టిఫికెట్ పొందాలన్నారు. వాటిని పూర్తి స్థాయి లో శుభ్రపరిచిన తరువాతే భవనాలు వాడుకునేలా చూడాలన్నారు. అన్ని అసోసియేషన్, అనుబంధ కళాశాలల్లో నిబంధనలకు లోబడి ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నత విద్యా సంస్కరణలపై జీవో 63 అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. 2020-21 విద్యాసంవత్సరం లో ఇతర దేశాలకు వెళ్లలేని విద్యార్థులు ఇక్కడ కళాశాలల్లో చేరేందుకు అవకాశాలు కోసం చూస్తారన్నారు. దీని వల్ల కోర్సులు, సీట్ల కొరత రాకుండా చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ‘ఏఐ’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (ఏఐ) ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన సిలబస్ను రూపొందించడంతోపాటు ఏయే కాలేజీల్లో ప్రారంభించాలో నిర్ణయించేందుకు ఉన్న త స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సబ్జెక్టుగానే కాకుండా వీలైతే ప్రత్యేక కోర్సుగా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని కమిటీని కోరాలని భావిస్తోంది. ఏఐని సబ్జెక్టుగా ప్రారంభిస్తే అందుకు అవసరమయ్యే అధ్యాపకులు, ల్యాబ్లు, ఇతర సదుపాయాలు, సిలబస్ రూపకల్పన, ఎన్ని క్రెడిట్స్ కేటాయించాలన్న తదితర అంశాలను కమిటీ తేల్చుతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఏఐపై అవగాహన కలిగిన నిపుణులకు ఆ కమిటీలో స్థానం కల్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఏఐ సబ్జెక్టును వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిటీని ఏర్పాటు చేసి నివేదికను త్వరగా తెప్పించుకోవాలని నిర్ణయించింది. ఇంజనీరింగ్లో ఏఐని ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే జేఎన్టీయూ సెనేట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఏఐ పాలసీని రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రారంభమైన కసరత్తు.. జేఎన్టీయూ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఏఐని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేలా మండలి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని ఆయన సూచించినట్లు తెలిసింది. కోర్సుగా ప్రవేశపెడితే అన్ని ప్రైవేటు కాలేజీల్లో అమలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది కమిటీ తేల్చనుంది. కోర్సును కేవలం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ప్రవేశపెట్టడంతోపాటు ముందుకు వచ్చే ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేస్తోంది. అయితే నిపుణులతో కూడిన కమిటీ చేసే సిఫారసుల ఆధారంగానే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. -
పాఠ్యాంశంగా ట్రిపుల్ తలాక్
లక్నో: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది. తొలిసారిగా ఉత్తరప్రదేశ్లోని బరైలీలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్ ఖండ్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ఈ సిలబస్ను ప్రవేశపెట్టారు. వర్శిటీ లా డిపార్ట్మెంట్ అధిపతి అమిత్ సింగ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ చట్టానికి (2019) సంబంధించిన సిలబస్ను చేర్చినట్టు చెప్పారు. పాత సిలబస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టినట్లు వివరించారు. యూనివర్శిటీ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. చట్టంలోని నిబంధనలను తెలుసుకోవడంతో పాటు కేస్ స్టడీస్కు కూడా ఈ అంశం ఉపకరిస్తుందని, దీని ద్వారా విద్యార్థులు మంచి లాయర్లుగా మారి, ప్రజలకు మరింత న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నామని తెలిపారు. తమ విద్యార్థుల్లో ఒకరు ట్రిపుల్ తలాక్పై డాక్టరేట్ చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త సిలబస్ పట్ల తామెంతో ఆసక్తిగా ఉన్నట్టు పలువురు విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. -
ఆ పాఠాలు ఉండవిక...
విద్యావిధానంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి లేని విద్య అందించే ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. బడి అంటే అదేదో బందిఖానాలా కాకుండా... ఆటపాటల నిలయంగా మార్చే యత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఆనందలహరి... నో బ్యాగ్డే...అంటూ సంస్కరణలు తీసుకొచ్చిన సర్కారు తాజాగా పలు తరగతుల సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ రూపొందించిన ఈ ప్రణాళికను తాజాగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు, సరళీకృతమైన సమగ్ర విద్యాబోధనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పాఠశాలల్లో వివిధ తరగతులకు నిర్దేశించిన విద్యాప్రమాణాలను సాధించ డం ఉపాధ్యాయులకు తలకుమించిన భారమవుతోంది. సిలబస్ పూర్తి చేయడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరం లేని పాఠాలను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాలు విద్యార్థి భవిష్యత్తుకు అవసరమయినవా కావా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బోధనలో ఉపయోగిస్తున్న కొన్ని పాఠ్యాం శాలను తొలగించాలని నిర్ణయించింది. వయోపరిమితిని అనుసరించి విద్యార్థుల సామర్థ్యాలు, వారి మానసిక స్థితిని బేరీజు వేసుకున్న విద్యా శాఖలోని ఎస్సీఈఆర్టీ(రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ) విభాగం మూడో తరగతి నుంచి 8 వ తరగతి వరకూ గల పాఠాల్లో పలు పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. ఆయా పాఠ్యాంశాల వివరాలను విద్యా శాఖకు పంపింది. ఆ పాఠాలను ఇప్పుడు విద్యార్థులు చదవనవసరం లేదనీ, వీటిని పుస్తకాల్లోంచి తొలగించాలని ఏపీ ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. గుర్తించిన పాఠ్యాంశాలపై పరీక్షలుండవని కూడా స్పష్టం చేసింది. తొలగించనున్న పాఠ్యాంశాలివే... మూడో తరగతి తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం, లడ్డూ బాధ, పిల్లల మర్రి, చెట్టు కోరిక వంటి వాటితో పాటు ఇంగ్లిష్లో మూడు, లెక్కలులో రెండు, ఈవీఎస్లో నాలుగు, నాలుగో తరగతిలో తెలుగు నాలుగు పాఠాలు ఇంగ్లిష్ రెండు పాఠాలు లెక్కలులో మూడు ఇలా వరుసగా ఒక్కో తరగతిలోనూ రెండు నుంచి ఆరు వరకూ పాఠాలను అవసరం లేనివిగా గుర్తించారు. ఆరో తరగతిలో ఉర్దూ సబ్జెక్టులో ఆరు పాఠాలు అవసరం లేనట్టు గుర్తించారు. ఇలా ఎనిమిదో తరగతి వరకూ పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. ఈ ఏడాది నుంచే అమలు మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వర కూ అన్ని సబ్జెక్టులలోనూ అవసరం లేని పాఠ్యాంశాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు చెప్పింది. 2019–20 నుంచి ఈ పాఠ్యాంశాలు అవసరం లేనివని వీటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. సామర్థ్యాలు పెరుగుతాయి దీని ప్రకారం వేలాది మంది విద్యార్థులు అవసరమయిన పాఠాలను ఆకళింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యాంశాలను వదిలి వేయడం వల్ల మిగతా ముఖ్యమైన పాఠాలపై దృష్టి పెట్టడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు పె రుగుతాయి. ఉపాధ్యాయులు కూడా కాస్త ఎక్కు వ సమయాన్ని మిగిలిన పాఠ్యాంశాలపై దృష్టి సా రించి బోధించేందుకు అవకాశం కలుగుతుంది. బోధన సరళీకృతమవుతుంది అవసరం లేని పాఠాలను తొలగించడం వల్ల బోధన సరళీకృతమవుతంది. దీని వల్ల విద్యార్థులు ము ఖ్యమైన పాఠాలపై ఏకాగ్రత పెంచుకుని చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. మరింత తొందరగా సిలబస్ను పూర్తి చేసి రివిజన్ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. – జె.సి.రాజు, హెచ్ఎం, నారాయణప్పవలస -
‘అకాడమిక్’ అయోమయం..!
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: ఓ సెమిస్టర్ చివరి దశకు వస్తున్నా.. నేటికీ పలు కోర్సులకు సంబంధించిన సబ్జెక్టుల సిలబస్ పూర్తి కాలేదంటే నమ్మాల్సిందే..!! నెల రోజుల్లో ప్రస్తుత సెమిస్టర్ కావాల్సి ఉంది. కానీ.. పలు కళాశాలల్లో ఆ పరిస్థితి లేదు. దీంతో అంతా అయోమయం నెలకొంది. అకాడమిక్ అల్మానాక్ అమలులో శాతవాహన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులకు తలనొప్పిగా మారింది. జూన్లో సెమిస్టర్ ప్రారంభమైనా సెప్టెంబర్ నెల వరకు సిలబస్ పూర్తిస్థాయిలో నిర్ణయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమిస్టర్ ప్రారంభానికి ముందే ప్రకటించాల్సి ఉన్నా.. వర్సిటీ తీరులో మార్పు రావడం లేదు. అకాడమిక్ అల్మానాక్ ప్రకారం షెడ్యూల్ జరగాల్సి ఉంది. దాని అమలుపై వర్సిటీ పట్టింపు లేకుండా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఊహాజనితంగా పలానా అంశాలు సిలబస్లో ఉంటాయని భావించి బోధన చేపట్టారు. తీరా చూస్తే సిలబస్ పరిశీలించాక బోధించిన అంశాలు కాకుం డా ఇంతరత్రా ఉండడంతో ఖంగుతిన్నారు. తిరిగి కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. అకాడమిక్ అల్మానాక్ అమలుపై దృష్టి సారించి దాని ప్రకారం తరగతులు, పరీక్షలు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సిలబస్ నిర్ణయించడంపై నిర్లక్ష్యం.. శాతవాహన యూనివర్సిటీ సిలబస్ విషయంలో కొన్నేళ్లుగా నిర్లక్ష్య వైఖరే కనిపిస్తోంది. గతంలో రెండో సెమిస్టర్లోని జెండర్ సెన్సిటైజేషన్ అనే కామన్ సబ్జెక్టు పేపర్ సిలబస్ కూడా సెమిస్టర్ ముగిసే 20 రోజుల ముందే ఇచ్చారు. దీంతో విద్యార్థులకు ఆయా అంశాలు 20 రోజుల్లో బోధించడానికి నానా అవస్థలు పడ్డారు. చివరకు ఫలితాలపై ప్రభావం పడింది. వివిధ సబ్జెక్టుల విషయంలోనూ ప్రారంభంలో ఇవ్వకుండా జాప్యం చేయడంతో కష్టాలు తప్పడంలేదు. ఇప్పుడు కూడా సెమిస్టర్ ప్రారంభమైన నెల రోజులు దాకా కూడా స్పష్టమైన సిలబస్ అంశాలు ప్రకటించలేదు. ఒకటి రెండు సబ్జెక్టులకు సంబందించిన సబ్జెక్టుల విషయంలో వర్సిటీ అధికారులు సిలబస్ ప్రకటించినా కళాశాలల్లో నేటికీ స్పష్టత లేదు. సెమిస్టర్ పూర్తి కావస్తున్నా ఇంకా అధ్యాపకులు వాటిని ఎప్పుడు బోధిస్తారు.. విద్యార్థులు వాటిని ఎప్పుడు చదువుతారు.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల్లో గందరగోళం.. యూనివర్సిటీ అధికారులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ ప్రకటించిన తీరుపై అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. డిగ్రీ 5వ సెమిస్టర్ వారికి ‘పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్’ అనేది బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ అన్ని కోర్సుల వారికి సిలబస్ ప్రకటించారు. ‘వెర్బల్ రీజనింగ్ ఫర్ అప్టిట్యూడ్’ అనే సెలబస్ బీఏ, బీకాం, బీఎస్సీ వారికి అందరికీ ఉండాలని సెప్టెంబర్లో ఇచ్చారు. దీంతో బీఎస్సీ వారితోపాటు బీకాం, బీఏ విద్యార్థులకు దీనికి సంబంధించిన సిలబస్ బోధించడం ప్రారంభించారు. దాదాపు 15 రోజుల తర్వాత బీకాం విద్యార్థులకు మళ్లీ కొత్తగా ‘ప్రాక్టీస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్’ అనే సబ్జెక్టును ప్రవేశపెట్టడంతో అధ్యాపకులు తలలు పట్టుకున్నారు. ఇదే కాకుండా బీకాం వారికి మార్చినప్పుడు బీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్లకూ ఇది చదవడం కఠినంగానే ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా ఏటా సిలబస్లో అస్పష్టత, సరైన సమయంలో నిర్ణయించకపోవడంతోపాటు పలు కారణాలతో అకాడమిక్ అల్మానాక్ అమలుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పరీక్షల తేదీని పొడగిస్తాం.. డిగ్రీ కోర్సుల్లో సిలబస్ను నిర్ణయించడంలో కొంత ఆలస్యమైంది. నేను ఇటీవలే శాతవాహన రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం నవంబర్లో పరీక్షలు ఉండాల్సింది. కానీ.. ఎన్నికల దృష్ట్యా వాటిని ఇంకా పొడగించే అవకాశం ఉంది. పరీక్షల సమయం పొడగించడంతో సిలబస్ పూర్తి చేసుకోవడానికి సమయం కూడా ఉంటుంది. వచ్చే సెమిస్టర్ నుండి సిలబస్, అకాడమిక్ అల్మానాక్ అమలు విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.– యూ.ఉమేష్కుమార్, శాతవాహనయూనివర్సిటీ రిజిస్ట్రార్ -
గ్రూప్–1 సిలబస్తో గుండె గుభేల్!
సాక్షి, అమరావతి: గ్రూప్–1 సిలబస్ను మార్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చినవీ సకాలంలో పూర్తి చేయకుండా ఇప్పటికే తమ తలరాతలు మార్చేస్తున్న ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్పుతో మరింత గందరగోళానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. కొత్త సిలబస్ ప్రకటనతో రూ.లక్షలు ధారపోసి తాము పొందిన అంతా శిక్షణ అంతా వృథా కానుందని వాపోతున్నారు. మెయిన్స్లో ఏడు పేపర్లు.. గ్రూప్–1 సిలబస్లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్లో గతంలో జనరల్ ఇంగ్లిష్తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్తోపాటు తెలుగు పేపర్ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్లో రెండు పేపర్లు.. ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. మార్పులతో కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. సిలబస్ రెట్టింపు.. –గతంలో మెయిన్స్లో ఇంగ్లీషుతో కలిపి ఆరు పేపర్లుండగా కొత్తగా తెలుగు చేర్చారు. ఇంగ్లిషు, తెలుగు రెండూ క్వాలిఫయింగ్ పేపర్లే. ఇంగ్లీషు సిలబస్ను కఠినం చేశారు. గతంలో మెయిన్స్లో ఒక్కో పేపర్కు 3 గంటల సమయం కేటాయించగా ఇప్పడు 2.30 గంటలకు తగ్గించారు. –మెయిన్స్ పేపర్–2 లో కొత్తగా ఇండియన్, ఏపీ జాగ్రఫీని 50 మార్కులకు చేర్చారు. పేపర్–3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బేసిస్ నాలెడ్జి ఆఫ్ లా’ అంశాలను అదనంగా 120 మార్కులకు చేర్చారు. సివిల్స్లో ప్రధాన పేపర్గా ఉన్న ఎథిక్స్లోని అంశాలను ఇక్కడ కేవలం ఒక సెక్షన్లో పెట్టారు. హిస్టరీ, ఎకనామిక్స్లు పాత సబ్జెక్టులే అయినా వాటి అంశాలను మరింత ఎక్కువ చేశారు. దాదాపు రెట్టింపు అయిన సిలబస్కు సన్నద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికే పాత సిలబస్లో గ్రూప్–1 కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఏడాదిన్నరగా తీసుకున్న కోచింగ్ అంతా వృథా అని వాపోతున్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద చెల్లించిందంతా వృథా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇదంతా పాత సిలబస్లోనే కొనసాగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రవేశపెట్టడంతో ఈ శిక్షణ అంతా వృథా కానుంది. సిలబస్ పెరగడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు మూడు రెట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్ను ప్రస్తుతం ఇవ్వనున్న నోటిఫికేషన్లకు కాకుండా తరువాత వెలువడే వాటికి వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల సివిల్స్ అభ్యర్ధులకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. మెయిన్స్లో ఏడు పేపర్లు గ్రూప్–1 సిలబస్లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్లో గతంలో జనరల్ ఇంగ్లిష్తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్తోపాటు తెలుగు పేపర్ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. -
ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘టాపర్’ పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క పోటీ పరీక్షకు 5 లక్షల ప్రశ్నలతో సిలబస్ను తయారు చేసి అందిస్తుంది. దీంతో విద్యార్థి టాపర్గా నిలవడం పక్కా అంటున్నారు టాపర్.కామ్ కో–ఫౌండర్ హేమంత్ గోటే టీ. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఐఐటీ సీట్ కోసం తాను పడ్డ ఇబ్బందే టాపర్కు దారి చూపించిందంటున్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... మాది పశ్చిమ గోదావరి జిల్లా. హైదరాబాద్లో స్కూల్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక.. ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశా. ఆ తర్వాత చౌపాటీ బజార్ అనే ఫోన్కామర్స్ స్టార్టప్లో ప్రిన్సిపల్ ఇంజనీర్గా పనిచేశా. దీన్ని 2011లో ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత సొంతంగా ఏదైనా స్టార్టప్ పెట్టాలని నిర్ణయించుకొని.. చౌపాటీ బజార్లో సహోద్యోగీ జీశాన్ హయత్తో కలిసి 2013 ఏప్రిల్లో కోటి రూపాయల ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్స్తో ముంబై కేంద్రంగా టాపర్ను ప్రారంభించాం. 50కి పైగా పరీక్షలు; ఒక్క దానికి 5 లక్షల ప్రశ్నలు.. 5–12 తరగతి వరకు బోర్డ్ ఎగ్జామ్స్, స్కాలర్షిప్స్, పోటీ పరీక్షల సిలబస్లు, మెటీరియల్స్ ఉంటాయి. జేఈఈ, యూపీఎస్ఈఈ, బిట్శాట్, ఎంసెట్, నీట్, ఎయిమ్స్ వంటి దేశంలోని అన్ని 50కి పైగా పోటీ పరీక్షల ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, బిజినెస్ స్టడీస్ వంటి అన్ని సబ్జెక్టులూ ఉంటాయి. మెటీరియల్స్తో పాటూ ఆన్లైన్లోనే ప్రాక్టీస్, మాక్ ఎగ్జామ్స్, లైవ్ చాట్లో సందేహాల నివృత్తితో పాటూ వాయిస్, వీడియో లెక్చర్స్, కంటెంట్ లభిస్తుంది. ఒక్క పరీక్షకు 5 లక్షలకు పైగా ప్రశ్నలను పొందవచ్చు. గతేడాది రూ.50 కోట్ల వ్యాపారం.. ప్రిపరేషన్ మెటీరియల్స్ ఏడాది, ఐదేళ్ల సబ్స్క్రిప్షన్స్ విధానంలో ఉంటాయి. ధరలు రూ.8 వేల నుంచి రూ.2.5 లక్షల వరకుంటాయి. ప్రస్తుతం టాపర్కు 30 లక్షల మంది యూజర్లున్నారు. ఇందులో 1.50 లక్షల మంది పెయిడ్ యూజర్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 లక్షల మంది విద్యార్థులుంటారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల యూజర్ల వాటా 60 శాతం పైనే ఉంటుంది. రూ.40 వేల సబ్స్క్రిప్షన్స్ యూజర్లే ఎక్కువగా ఉంటారు. గతేడాది రూ.50 కోట్ల ఆదాయాన్ని చేరుకున్నాం. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం. ఏడాదిలో యూజర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని.. నాలుగేళ్లలో 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్.. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, నాగ్పూర్, అహ్మదాబాద్ వంటి నగరాల్లో 20 ఆఫీసులున్నాయి. నెల రోజుల్లో హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నాం. జోద్పూర్కు చెందిన ఈసీప్రిప్ను, ముంబైకి చెందిన మంచ్.. రెండు ఎడ్యుకేషన్ స్టార్టప్స్ను కొనుగోలు చేశాం. నిధుల సమీకరణ తర్వాత మరొక స్టార్టప్ను దక్కించుకుంటాం. వచ్చే ఏడాది 5వ తరగతి లోపు పోటీ పరీక్షల సిలబస్లను ప్రవేశపెడతాం. ఆ తర్వాత విదేశాలకు చెందిన ఉపకారవేతనాలు, పోటీ పరీక్షల సిలబస్లకూ విస్తరిస్తాం. రూ.325 కోట్ల సమీకరణపై దృష్టి..: టాపర్లో మొత్తం 1,500 మంది ఉద్యోగులుంటే.. ఇందులో కంటెంట్ ప్రిపరేషన్ కోసం 500 మంది ఉన్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్లలో కలిపి రూ.130 కోట్ల నిధులను సమీకరించాం. మరో రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మరో నలుగురు వెంచర్ క్యాపటలిస్ట్లు ఆసక్తి చూపిస్తున్నారు.