-
స్నేహితులను ఆహ్వానించను
ఇకపై తన సినిమా వేడుకలకు స్నేహితులను ఆహ్వానించనంటున్నారు నటుడు, నిర్మాత విశాల్. తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తాజాగా నిర్మించి, నటించిన చిత్రం ఆంబళ. సంక్రాంతికి తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రజాదరణ పొందడంతో సోమవారం వడపళనిలోని హోటల్లో సక్సెస్మీట్ను ఏర్పాటు చేశారు. విశాల్ మాట్లాడుతూ ఆంబళ చిత్రం విజయవంతమవడం ఒక ఎత్తు అయితే తన కోరికను నెరవేర్చిన చిత్రంగా చాలా సంతోషం కలిగించిందన్నారు. ఈ విజయాన్ని ఇంతకుముందే జరుపుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. 2012లో సుందర్సి దర్శకత్వంలో తాను నటించిన మదగజరాజ (ఎంజిఆర్) చిత్రాన్ని అప్పట్లో సంక్రాంతికి విడుదల చేయాలని కోరుకున్నామన్నారు. ఆ చిత్ర విడుదల అనివార్య కారణాల వలన వాయిదా పడటంతో ఆ బాధ ఇప్పటి వరకు తనను వెంటాడుతూ వచ్చిందన్నారు. ఈ సంక్రాంతికి విడుదలై తన కోరికను తీర్చిన చిత్రం ఆంబళ అని అన్నారు. మరో విషయం ఏమిటంటే సంక్రాంతికి ఇతర చిత్రాలు ఏమేమి విడుదల కానున్నాయన్న విషయం నిజంగా తనకు తెలియదన్నారు. అలాంటిది ఎవరినైనా నరుక్కుంటూ పోతాను అని తాను అన్నట్టు ఆర్య ప్రచారం చేశారన్నారు. తానలా అనలేదన్నారు. ఇంతకుముందు నటి లక్ష్మీమీనన్తో కలుపుతూ నటుడు విష్ణు విశాల్ నాన్ శిగప్పు మనిదన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై చెప్పి వదంతులకు ఆస్కారం కలిగించారన్నారు. అందుకే ఇకపై తన సినిమా వేడుకలకు తన స్నేహితులను ఆహ్వానించనని అన్నారు. తదుపరి చిత్రాల వివరాలను తెలుపుతూ ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్నానని ఆ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో సండకోళి-2 చిత్రం చేయనున్నట్లు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ ఈ ఏడాది చివరిలో విశాల్తో ఉలగం చుట్రు వాలిబర్ చిత్రం తరహాలో బ్రహ్మాండమైన చిత్రం చేయనున్నట్లు తెలిపారు. -
సూపర్స్టార్ తదుపరి దర్శకుడెవరు?
సూపర్స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యార న్నది పరిశ్రమ వర్గాల సమచారం. అయితే దర్శకుడెవరన్న విషయంపైనే రకరకాల ప్రచారం జరుగుతోంది. కోచ్చడయాన్ 3డి యానిమేషన్ చిత్రం నిరాశపరచడంతో త్వరితగతిన మరో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న రజనీ ఆలోచనకు తెరరూపమే లింగా చిత్రం. తన ఆలోచనలకు తగ్గట్టుగా చిత్రం రూపొందించగల దిట్ట కె ఎస్ రవికుమార్ అని భావించి లింగా చిత్ర బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ చిత్రం నిర్మాతకు 200 కోట్లు వ్యాపారం చేసిందని సమాచారం. అయితే డిస్ట్రిబ్యూటర్లే భారీ నష్టాలకు గురయ్యామంటూ దీక్షలు, ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఈ విషయంలో నష్టపరిహారానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ తదుపరిచిత్రానికి దర్శకుడెవరన్న అంశంపై నలుగురైదుగురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో పి.వాసు, శంకర్, సురేష్కృష్ణ, సుందర్ సి, కెఎస్ రవికుమార్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పి.వాసు ఇప్పటికే రజనీతో చంద్రముఖి, కుచేలన్ చిత్రాలు తెరకెక్కించగా వాటిలో చంద్రముఖి అమోఘ విజయం సాధించగా కుచేలన్ ఆశించిన విజయం సాధించలేదు. ఆ తరువాత రజనీతో చంద్రముఖి-2 రూపొందించాలని పి.వాసు ఆశించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. శంకర్ రజనీకాంత్ కలయికలో శివాజీ, ఎందిరన్ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజాగా ఎందిరన్-2 ప్రయత్నం తెరపైకి కొచ్చింది. అయితే ఈ విషయమై శంకర్ నుంచి గానీ, రజనీ నుంచి గానీ సరైన క్లారిటీ రాలేదు. అదే విధంగా కెఎస్ రవికుమార్ రజనీతో ముత్తు, పడయప్పా వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు తెరకెక్కించారు. లింగా చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ సుదీప్ హీరోగా నటించే చిత్రంలో బిజీగా ఉన్నారు. అదే విధంగా భాషా, అన్నామలై వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సురేష్కృష్ణ రజనీతో భాషా-2 చేయాలని ఆశిస్తున్నారు. దీనికి స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు. రజనీ ఎప్పుడు రెడీ అంటే అప్పుడే షూటింగ్ అనేలా ఉన్నట్లు సమాచారం. ఇక సూపర్స్టార్ అరుణాచలం వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన సుందర్సి కూడా ఆయనతో మరో చిత్రం చేయడానికి రెడీగా ఉన్నట్లు కోడంబాక్కం టాక్. మరి వీరిలో ఎవరిపై రజనీ దృష్టి పడుతుందో వేచి చూడాల్సిందే. -
యాక్షన్ స్టార్ విశాల్
నటుడు విశాల్కు యాక్షన్ స్టార్ పట్టం కట్టారు. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ, ఒకప్పుడు విజయకాంత్ చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలుండేవన్నారు. ఆయనతో నటించినప్పుడు తాను చాలా దెబ్బలకు గురయ్యానని అన్నారు. అలా ప్రస్తుతం నటుడు విశాల్ యాక్షన్ కథా చిత్రాల్లో బాగా నటిస్తున్నారని అన్నారు. అందుకే ఆయన్ను యాక్షన్ స్టార్గా పేర్కొనట్లు అన్నారు. విశాల్ హీరోగా నటిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న తాజా చిత్రం ఆంబళ. హన్సిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు వైభవ్, రమ్యకృష్ణ, కిరణ్రాథోడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ప్రసంగించారు. అనంతరం నిర్మాత టి.శివ మాట్లాడుతూ ఆంబ ళ (మగాడు) చిత్రం టైటిల్ విశాల్కు కరెక్ట్గా నప్పుతుందన్నారు. ఆయన పైరసీని అరికట్టడానికి ఒంటరిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అలాగే ధైర్యంగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలు సాధిస్తున్నారని అన్నారు. సుందర్ సి మొదట్లో పలు భారీ హిట్స్ చిత్రాలను అందించారని మధ్యలో కొంత వెనుకబడ్డా మళ్లీ వరుస విజ యాలతో పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారన్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఆంబళ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మ కం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి కుష్బు, హన్సిక, జి.కె.రెడ్డి, ఆర్కె సెల్వమణి, ఎస్ఎ చంద్రశేఖర్, తిరు, హిప్ హాప్ తమిళ్, ఆర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా పాల్గొన్నారు. -
ఖుషీఖుషీగా హన్సిక
హన్సిక యమ ఖుషీగా ఉన్నారు. అందుకు కారణం ఆమెకు వరిస్తున్న విజయాలే. ఈ లక్కీ హీరోయిన్ నటించిన అరణ్మణై ఇటీవల విడుదలై విజయాన్ని సాధించింది. హన్సిక ఆ సంతోషాన్ని అనుభవిస్తుండగానే ఆమె నటించిన తాజా చిత్రం మెగామాన్ ఈ శుక్రవారం తెరపైకి వచ్చి విశేష ప్రజాదరణను చూరగొంటోంది. దీంతో హన్సిక ఆనందం రెట్టింపు అయ్యింది. క్రిస్మస్కు మెగామాన్ విడుదలై ప్రజాదరణ పొందగా సంక్రాంతికి విశాల్తో జత కట్టిన ఆంబళ చిత్రం తెరపైకి రానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై హన్సిక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందరిని టాలీవుడ్ కూడా ఆనందంలో ముంచెత్తుతోంది. హన్సిక తెలుగులో ఆ మధ్య రవితేజతో నటించిన పవర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సక్సెస్ అయిన అరణ్మణై చిత్రం తెలుగులో చంద్రకళ పేరుతో అనువాదమై వసూళ్లు కురిపిస్తోందట. ఈ చిత్రం తొలి వారంలోనే కోటి 25 లక్షలు వసూలు చేసిందని హన్సిక సన్నిహితులు పేర్కొన్నారు. విశాల్ సరసన నటిస్తున్న ఆంబళ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న వాలు, ఉయిరే ఉయిరే, వేట్టైమన్నన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే జయంరవితో రోమియో జూలియట్, విజయ్ సరసన గరుడ చిత్రాలలో నటిస్తూ హన్సిక బిజీగా ఉన్నారు. -
హారర్ నేపథ్యంలో కుటుంబ కథ
హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణి’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా గురించి సమర్పకుడు సి.కల్యాణ్ చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమిది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. తమిళంలో 30 కోట్లు వసూలు చేసి సంచలన విజయంగా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది. లక్ష్మీ రాయ్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్ కుమార్, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్రాజా, భరద్వాజ్, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి. -
తేనెటీగ కుట్టినా షూటింగ్ ఆపలేదు
చిన్న చీమ కుడితేనే చిమచిమలాడుతుంది. అలాంటి తేనెటీగ కుడితే అమ్మో అది యమబాధనే. అలాంటి తేనెటీగ అందమైన హీరోయిన్ను కుడితే ఇంకేమైనా ఉందా? ప్రథమ చికిత్స, విశ్రాంతి, షూటింగ్కు అంతరాయం అంటూ పెద్ద ఇష్యూ అయిపోదు. అలాంటి తేనెటీగ, ముట్టుకుంటే కందిపోయే అందాలభామ హన్సికను కుట్టింది. అయినా పైన చె ప్పినవేవీ జరగలేదు. అయితే బాధను మాత్రం భరించింది ఈ ముద్దుగుమ్మ. షూటింగ్కు మాత్రం అంతరాయం కలగనీయలేదు. బహుభాషా నటి హన్సిక ఒక్క తమిళంలో చేతినిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విశాల్ సరసన ఆంబళ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఆ అడవి ప్రాంతంలో హన్సిక చేతిపై తేనెటీగ కుట్టిందట. వెంటనే ప్రథమ చికిత్స అందించినా నొప్పి మాత్రం తగ్గలేదు. ఆ నొప్పిని భరిస్తూనే షూటింగ్లో పాల్గొన్నారు. చిత్ర యూనిట్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా అదే తగ్గిపోతుందిలే అంటూ షూటింగ్కు అంతరాయం కలగకుండా నటించినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెప్పాయి. వృత్తిపై హన్సికకు ఎంత అంకితభావం అంటూ సహచరులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. దటీజ్ హన్సిక. మరో విషయం ఏమిటంటే ఈ బ్యూటీ ఆదివారం హైదరాబాద్ వెళ్లి, అక్కడ విశాఖ ప్రాంత వరద బాధితుల కోసం నిధిని సేకరించే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిసింది. అటు నుంచి హన్సిక ముంబయి వెళ్లి తన దత్తపుత్రిక, పుత్రులతో దీపావళి పండుగ జరుపుకుని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపి ఆ తరువాత చెన్నైకు చేరుకుని రోమియో జూలియట్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. -
విశాల్ చిత్రంలో రమ్యకృష్ణ
చెన్నై: తన దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమిక పోషించనున్నారని ఆ చిత్ర దర్శకుడు సుందర్. సి బుధవారం చెన్నైలో వెల్లడించారు. ఆ చిత్రం త్వరలో హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఆ షూటింగ్లో రమ్య పాల్గొంటారని తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. 1990లో తమిళంలో తెరకెక్కిన కుట్టి పిశాసు చిత్రం ఆమె నటించిన అఖరి చిత్రమని సుందర్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బహుబలిలో నటిస్తు రమ్యకృష్ణ మహా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
అతీంద్రియ శక్తులతో...
మాయలెరిగిన నాయిక అనగానే, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో శ్రీదేవే గుర్తొస్తారు. ఆ సినిమాలో ఆమె ఇంద్రజ. తనకున్న అతీంద్రియ శక్తులతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేశారు శ్రీదేవి. అలాంటి పాత్రనే ఇప్పుడు హన్సిక పోషిస్తున్నారు. అయితే... శ్రీదేవిలా దివి నుంచి భువికి దిగే పాత్ర కాదు హన్సికది. భువిపైనే పుట్టిన దేవకుమార్తె అన్నమాట. తనకున్న దైవశక్తులతో రోగాలను నయం చేసేస్తుంటుంది. భవిష్యత్తులో జరగబోయేది కూడా చెప్పేస్తుంటుంది. ఇంతకీ ఏ సినిమాలో హన్సిక ఇలా కనిపించేది? అనేగా మీ ప్రశ్న. అది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా. సుందర్.సి నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు ‘అరణ్మణై’. తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ పాత్ర ఇదని చెబుతున్నారు హన్సిక. ఇటీవల ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ -‘‘సుందర్సార్ కథ చెప్పినప్పుడు భిన్నంగా అనిపించింది. నా కెరీర్లో ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇది భిన్నమైన పాత్ర. అడుగడుగునా మలుపులతో నా పాత్రను డిజైన్ చేశారు. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు హన్సిక.