-
నిద్రకు అష్టకష్టాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అనుకుంటారు చాలామంది అల్పసంతోషులు.డబ్బు పెడితే తిండి దొరకొచ్చేమో గాని, ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రశాంతమైన నిద్ర ఎక్కడా దొరకదు. గాఢంగా ప్రశాంతమైన నిద్రపట్టాలంటే డబ్బుతో పనిలేదు. శరీరానికి తగినంత శ్రమ, కడుపు నిండా తిండి, మానసిక ఒత్తిడి లేని జీవితం ఉంటే చాలు, పక్క మీద వాలిన నిమిషాల్లోనే నిద్ర ముంచుకొస్తుంది. దురదృష్టవశాత్తు మానసిక ఒత్తిడి ప్రస్తుతం నిత్యకృత్యంగా మారింది. జనాభాలో సగానికి సగం పైగా మనుషులు ఏదో ఒకరకంగా మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు, లేనిపోని ఆందోళనలకు లోనవుతున్నారు. వారందరూ ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఆధునిక జీవనశైలిలో పెరిగిన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు,టీవీల వాడకం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి కూడా చాలామందికి నిద్రను దూరం చేస్తున్నాయి. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్ర ప్రాధాన్యాన్ని శతాబ్దాల కిందటే మన పూర్వీకులు గుర్తించారు. నిద్రకూ ఆరోగ్యానికీ గల సంబంధాన్ని కూడా వారు గుర్తించారు. నిజానికి అప్పటి మనుషులు బాగానే నిద్రపోయేవారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారంతా ప్రశాంతంగా ఆదమరచి నిద్రపోయేవారే. నిద్రకు సంబంధించిన ప్రస్తావనలు మన పురాణాల్లోనూ, ఇతర దేశాల గాథల్లోనూ కనిపిస్తాయి. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళ నిద్ర గురించి తెలిసిందే. గ్రీకు, రోమన్ పురాణాల్లోనైతే నిద్రకు అధిదేవతలు కూడా ఉన్నారు. గ్రీకు పురాణాల్లో నిద్రకు అధిదేవత హిప్నోస్. రోమన్ పురాణాల్లో నిద్రకు అధిదేవత సోమ్నస్. గ్రీకు, రోమన్ పురాణాల్లో నిద్రకు, కలలకు సంబంధం ఉన్న మరో అధిదేవత మార్ఫియస్. సోమ్నస్కు గల వేలాది మంది కొడుకుల్లో మార్ఫియస్ ఒకడు. ప్రశాంతమైన నిద్ర కోసం, చక్కని కలల కోసం రోమన్, గ్రీకు నాగరికతలకు చెందిన ప్రజలు ఈ దేవతలను ఆరాధించేవారు. నిద్రలేమితో బాధపడేవారికి అప్పట్లో పూజారులే రకరకాల చికిత్సలు చేసేవారు. మద్యం, నల్లమందు మొదలుకొని మూలికా కషాయాల వరకు ఔషధాలుగా ఇచ్చేవారు. అయితే, మనుషులకు ఎంత నిద్ర అవసరం, మంచి నిద్ర కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనేదానిపై వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. సూచనల ద్వారా మనుషులను నిద్రలోకి పంపే హిప్నోటిజమ్, నిద్రకు సంబంధించిన ఇన్సోమ్నియా (నిద్రలేమి), సోమ్నాంబులిజం (నిద్రలో నడక) వంటి రుగ్మతల పేర్లకు గ్రీకు, రోమన్ నిద్రాధిదేవత పేర్లే మూలం. నిద్ర కోసం ప్రాచీన ఔషధాలు ప్రాచీనులు సైతం నిద్రలేమిని రుగ్మతలాగానే గుర్తించారు. ఇతర రుగ్మతలను నయం చేయడానికి ఔషధాలు ఉన్నట్లే నిద్రలేమి పోగొట్టేందుకు కూడా ఔషధాలు ప్రకృతిలోనే ఉంటాయని భావించి, నానా ప్రయోగాలు చేసేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు ‘లెట్యూస్’ అనే మొక్క కాండం నుంచి కారే పాలవంటి ద్రవాన్ని నిద్రలేమికి ఔషధంగా వాడేవారు. రోమన్లు మంచు ప్రాంతాల్లో తిరిగే ఎలుకల కొవ్వును నిద్రలేమికి ఔషధంగా ఉపయోగించేవారు. మంచు ప్రాంతాల్లో తిరిగే ‘డార్మైస్’ అనే ఎలుకలు శీతాకాలంలో సుదీర్ఘకాలం శీతలనిద్రలోకి జారుకుంటాయి. నిద్రలోకి జారుకునే ముందు ఇవి విపరీతంగా ఆహారం తిని కొవ్వు పెంచుకుంటాయి. అందువల్ల వీటి కొవ్వులో నిద్ర కలిగించే లక్షణం ఉంటుందని ప్రాచీన రోమన్లు నమ్మేవారు. అయస్కాంతం వాడుకలోకి వచ్చిన తర్వాత మేగ్రెటిజం చికిత్స ద్వారా నిద్రలేమిని నయం చేసేందుకు అప్పటి వైద్యులు నానా ప్రయత్నాలు చేసేవారు. నిద్రపై శాస్త్రీయమైన దృష్టి నిద్రపై శాస్త్రీయంగా దృష్టి సారించడం పన్నెండో శతాబ్ది నుంచి మొదలైంది. తొలిసారిగా స్పానిష్ వైద్యుడు, తత్వవేత్త మైమోనిడెస్ మోసెస్ రోజులో మూడోవంతు కాలం నిద్ర మనుషులకు అవసరమని క్రీస్తుశకం 1180 సంవత్సరంలో ప్రకటించాడు. మోసెస్ అంచనా ఆధునిక వైద్యుల అంచనాలకు దగ్గరగా ఉంది. ఏయే వ్యక్తులకు ఎంతెంత నిద్ర అవసరమనే దానిపై మోసెస్ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆధునిక వైద్య పరిశోధకులు ఆ పనిని పూర్తి చేశారు. మనుషుల్లోనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ అంతర్గత గడియారం ఒకటి పనిచేస్తూ ఉంటుందని, దానికి అనుగుణంగానే జీవుల నిద్రవేళలు ఉంటాయని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ డి ఓర్టస్ డి మైరాన్ 1729 సంవత్సరంలో తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. మరో ఫ్రెంచ్ శాస్త్రవేత్త హెన్రీ పీరాన్ నిద్రలో ఎదురయ్యే సమస్యలకు గల శారీరక కారణాలపై తొలిసారిగా దృష్టి సారించి, పరిశోధనలు సాగించాడు. తన పరిశోధనలను వివరిస్తూ 1913లో ‘లె ప్రాబ్లమె ఫిజియాలజిక్’ అనే గ్రంథం రాశాడు. అంతకు ముందు ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, ఆధునిక మానసిక వైద్యశాస్త్రానికి ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ కలలపై పరిశోధన సాగించాడు. నిద్రలో వచ్చే కలలకు అంతశ్చేతనలోని ఆలోచనలే కారణమని వివరిస్తూ ‘ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ గ్రంథాన్ని రాశాడు. మనుషులు మెలకువలో ఉన్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు వారి మెదడు పనితీరులో మార్పులను ఈఈజీ (ఎలక్ట్రో ఎన్సెఫెలోగ్రామ్) ద్వారా జర్మన్ మానసిక వైద్యుడు హాన్స్ బెర్గర్ 1924లో తొలిసారిగా గుర్తించాడు. పారిశ్రామిక విప్లవం తర్వాత మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగసాగింది. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీయడం కూడా పెరిగింది. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలపై ఇరవయ్యో శతాబ్దిలో మాత్రమే వైద్య పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశోధనలు మొదలుపెట్టారు. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంథోనీ కాలెస్, అలాన్ రెషాఫెన్ తమ పరిశోధనల్లో నిద్రలోని దశలను గుర్తించారు. మనుషులు నిద్రపోయేటప్పుడు ‘ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ ఒక దశ, ‘నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ నాలుగు దశలు ఉంటాయని 1968లో వారు ప్రకటించారు. ఇరవయ్యో శతాబ్దిలో జరిగిన పరిశోధనలు నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను నయం చేసే ఔషధాలను కనుగొనడంలోను, చికిత్స పద్ధతులను మెరుగుపరచడంలోను ఇతోధికంగా దోహదపడ్డాయి. నిద్రలేమి, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి పలు పరిశోధనల్లో బయటపడిన నేపథ్యంలో నిద్రకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధినేతలు గుర్తించారు. ఫలితంగా 1987లో ‘వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ అండ్ స్లీప్ మెడిసిన్ సొసైటీస్’ ఏర్పడింది. ఈ సంస్థ ‘జర్నల్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్’, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్’ అనే రెండు పత్రికలను ప్రచురిస్తోంది. నిద్ర అంటే... మనం నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ సమయంలో మన జ్ఞానేంద్రియాలు మన చుట్టూ జరుగుతున్న మార్పులకు స్పందించడం తగ్గిపోతుంది. నిద్ర పూర్తి కాగానే మనం మామూలు స్థితిలోకి రాగలుగుతాము. అయితే నిద్ర అన్నది పూర్తిగా ఒక అచేతనావస్థ మాత్రమే కాదు. మనం నిద్రపోయే సమయంలోనూ మెదడు మన చుట్టూ జరిగే అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నిద్రిస్తున్న తల్లి తన పక్కన పడుకున్న చిన్నారి కదలికలకు వెంటనే స్పందించి లేస్తుంది. నిద్రించే సమయంలో మనం రెండు రకాల స్థితుల్లో ఉంటాం. ఒక స్థితిలో కనుగుడ్లు వేగంగా కదలకుండా ఉంటాయి. ఈ స్థితిని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎం) అంటారు. రెండో స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. ఈ స్థితిని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం) అంటారు. రాత్రి మనం నిద్రకు ఉపక్రమించిన దగ్గరి నుంచి ఉదయం మేల్కొనే వరకు ఈ రెండు స్థితులు ఒకదాని తర్వాత మరొకటి కలుగుతాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అనే ఈ రెండు స్థితులూ వరుసగా మొదటిది 80 నిమిషాల పాటు, మరొకిటి 10 నిమిషాల పాటు ఉంటాయి. ఈ రెండు స్థితులు కలసిన ఒక మొత్తాన్ని ఒక సైకిల్గా చెబితే మొత్తం నిద్రలో ఈ సైకిల్స్ 4–5 సార్లు కలుగుతాయి. నిద్ర ముగింపునకు వచ్చే సరికి రెండో స్థితి సమయం ఎక్కువగా ఉంటుంది. మెలకువ నుంచి నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎన్ఆర్ఈఎమ్ (మొదటి స్థితి)కి వెళ్తాం. ఈ ఎన్ఆర్ఈఎమ్లో మొత్తం నాలుగు భాగాలు ఉంటాయి. ఇందులో మూడు, నాలుగు భాగాలను గాఢనిద్రగా వ్యవహరిస్తారు. నిద్రించే సమయంలో మెదడులో జరిగే ఎలక్ట్రికల్ చర్యలను ఈఈజీ అనే ప్రక్రియ ద్వారా నమోదు చేయవచ్చు. (గుండె స్పందనలను ఈసీజీ ద్వారా నమోదు చేసినట్లుగా). దీర్ఘనిద్ర సమయంలో ఈఈజీ యాక్టివిటీ అతి తక్కువగా ఉంటుంది. నిద్రించాక తొలి భాగంలో దీర్ఘనిద్ర అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గుండెవేగం, బీపీ, శ్వాసవేగం మొదలైనవి తక్కువగా ఉంటాయి. నిద్రలో ఈ భాగం చాలా ముఖ్యమైనది. మొదటి స్థితి (ఎన్ఆర్ఈఎం)లోని చివరి భాగమైన దీర్ఘనిద్ర నుంచి మళ్లీ రెండో స్థితి అయిన ఆర్ఈఎం స్థితిలోకి వెళ్తాం. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. ఈ స్థితిలో బీపీ, శ్వాస, గుండెవేగం పెరుగుతాయి. అయితే మన కండరాలు (కనుగుడ్లు, డయాఫ్రమ్ తప్ప మిగతావి) కదలికను కోల్పోతాయి. ఈ స్థితిలో మనం 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంటాం. కలలు ఎక్కువగా ఈ స్థితిలోనే వస్తాయి. కండరాల్లో కదలిక ఉండదు కనుక మనం కలల్లోని కదలికలను అనుగుణంగా ప్రవర్తించలేం. తెల్లవారు జామున రెండోస్థితి అయిన ఆర్ఈఎం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోనే కలలు ఎక్కువగా వస్తాయి. నిద్ర నుంచి మెలకువ వచ్చాక మనకు ఎంతో ఉల్లాసంగా అనిపించాలి. నూతన ఉత్తేజం, శక్తి ఫీలవ్వాలి. అలా కలిగినప్పుడు చక్కటి నిద్ర పట్టినట్లు భావించాలి. (ఆర్ఈఎం దశ నుంచి నిద్రలేస్తే మనకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.) నిద్రలేమితో వచ్చే సమస్యలు నిద్రలేమి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఏర్పడతాయి. నిద్రలేమి అధిక రక్తపోటుకు, డయాబెటిస్కు దారితీస్తుంది. స్థూలకాయానికి, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల నానా మానసిక సమస్యలు ఏర్పడటం, రోగనిరోధక శక్తి క్షీణించడం, చివరకు ఆయుః ప్రమాణం కూడా తగ్గిపోవడం జరుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాటిల్లే తక్షణ నష్టాలు ∙ఏకాగ్రత లోపం ∙అలసట / నిస్సత్తువ ∙గుండె లయలో మార్పులు ∙పనితీరులో మందకొడితనం ∙దిగులు ∙మానసిక కుంగుబాటు ∙చిరాకు, కోపం ∙ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు నిద్రలేమి వల్ల శారీరక ఇబ్బందులతో పాటు మానసిక సమస్యలూ పెరుగుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పడం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, యాంగై్జటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడే పిల్లల్లో అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ), మెదడు ఎదుగుదలలో లోపం, జ్ఞాపక శక్తి లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెద్దల్లోనైతే యాంగై్జటీ న్యూరోసిస్, డిప్రెషన్, సైకోసిస్, మాదక ద్రవ్యాలపై ఆధారపడే పరిస్థితి తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచంలో సగం మంది నిద్రకు దూరం మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరగడం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి మొదలైంది. ఇక ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో సగం మందికి పైగా తగినంత నిద్రలేక అలమటిస్తున్న వారే. ‘ప్రిన్సెస్ క్రూయిసెస్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన తొమ్మిదో రిలాక్సేషన్ రిపోర్ట్–2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 51 శాతం మంది తగినంత నిద్రలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 18 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రకు సరైన వేళలు పాటిస్తూ తగినంత సేపు నిద్రపోతున్న వారు కేవలం 35 శాతం మాత్రమే. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మెలకువగా ఉంటూ ఆలస్యంగా నిద్రపోతున్నవారు 26 శాతం మంది అయితే, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా వేకువనే మేల్కొంటున్న వారు 21 శాతం మంది వరకు ఉన్నట్లు రిలాక్సేషన్ రిపోర్ట్–2018 వెల్లడించింది. రాత్రివేళ టీవీ చూసే అలవాటు కారణంగానే ఇటీవలి కాలంలో చాలామంది నిద్రలేమికి లోనవుతున్నారని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. ఇందులో వెల్లడైన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... మంచి నిద్ర కోసం... ►ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రించడం / నిద్రలేవడం ► రోజూ వ్యాయామం చేయడం ►నిద్రపోయే ముందర సమస్యలను చర్చించకూడదు ►గోరువెచ్చటి నీళ్లతో స్నానం, శ్రావ్యమైన సంగీతం వినడం, పుస్తకపఠనం నిద్రకు మంచి మార్గాలు ►రాత్రిపూట పడుకునే ముందు కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. అలాగే శీతల పానీయాలు, మద్యం కూడా మంచిది కాదు. ►టీవీ చూడటం, కంప్యూటర్ పై పనిచేయడం వంటివి రాత్రిపూట వద్దు. ►పకడగదిలో మరీ ఎక్కువ కాంతి లేకుండా, చప్పుళ్లకు దూరంగా ఉండాలి. ►పడకగదిలో మరీ ఎక్కువ చల్లగా లేకుండా, వేడిగా లేకుండా చూసుకోవాలి. కొన్ని ‘నిద్రా’ణ వాస్తవాలు మనిషి ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. తగినంత పోషకాహారం, వ్యాయామం ఉన్నవారికి సర్వసాధారణంగా చక్కని నిద్రపడుతుంది. ఏవైనా మానసిక ఇబ్బందులు ఉంటేనే నిద్ర కరువయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎక్కువరోజులు తగినంత నిద్ర లేకుండా గడిపితే ఇతరేతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయి. నిద్రకు సంబంధించి కొన్ని అరుదైన వాస్తవాలను అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వాటిలో కొన్ని... ►స్తన్యజీవుల్లో కేవలం మనుషులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా నిద్రను ఆపుకోగలరు. సృష్టిలోని పశుపక్ష్యాదులేవీ ఇలా ఉద్దేశపూర్వకంగా నిద్రను మానుకొని జాగారాలు చేయలేవు. ►ఎల్తైన ప్రదేశాల్లో నిద్ర పట్టడం కష్టమవుతుంది. సముద్ర మట్టానికి 13,200 అడుగుల ఎత్తుకు మించిన ప్రదేశాలకు చేరుకుంటే, అలాంటి ప్రదేశాల్లో తగిన ఆక్సిజన్ లేకపోవడంతో ఆరోగ్యవంతులకు సైతం నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ►దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్న వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారే ఎక్కువ. ►విధి నిర్వహణలో భాగంగా రకరకాల షిఫ్టుల్లో పనిచేసే వారు కూడా దీర్ఘకాలిక నిద్రలేమి, తద్వారా వచ్చే గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యల బారిన పడుతున్నారు. ►నిద్రలేమితో బాధపడేవారిలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నిద్రకు దూరమైన వారిలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్’హార్మోన్ పరిమాణం పడిపోవడమే దీనికి కారణం. అందుకే దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా తయారవుతారు. జాగారంలో రికార్డు మహాశివరాత్రి రోజున జాగారం ఉండటం చాలామందికి తెలిసిందే. ఒక్కరోజు జాగారం ఉంటేనే మర్నాటికి మగత మగతగా ఉంటుంది. ఎంత త్వరగా నిద్రపోదామా అనిపిస్తుంది. అలాంటిది చైనాలో ఒక సాకర్ పిచ్చోడు కేవలం సాకర్ మ్యాచ్లను నిరాటంకంగా చూడాలనే ఉబలాటంతో ఏకంగా పదకొండు రోజులు నిద్రను వాయిదా వేసుకున్నాడు. నిద్రలేమిని తట్టుకోలేక చివరకు మరణించాడు. ఈ సంఘటన 2012లో జరిగింది. అంతకు దశాబ్దాల ముందే.. 1964లో రాండీ గార్డెనర్ అనే యువకుడు ఏకధాటిగా పదకొండు రోజులు.. కచ్చితంగా చెప్పాలంటే 264.4 గంటల సేపు నిద్ర లేకుండా గడిపి గిన్నిస్ రికార్డుకెక్కాడు. – పన్యాల జగన్నాథదాసు నిద్ర సంబంధమైన సమస్యలు కొంతమందికి నిద్రలో నడవడం, కలవరించడం, పళ్లు కొరకడం, తరచు మెలకువ రావడం, భయంకరమైన కలలు రావడం వంటివి జరుగుతాయి. మరికొందరు నిద్రలో కాళ్లూ, చేతులు కదిలిస్తుంటారు. దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. కొందరు నిద్రలో మల–మూత్ర విసర్జనలు చేస్తుంటారు. దీన్ని నాక్చర్నల్ ఎన్యురెసిస్ లేదా ఎంకోప్రెసిస్ అంటారు. కొందరికి పగటినిద్రను నిలువరించుకోవడం కష్టమవుతుంది. తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంటారు. నిద్రలో ఊపిరి సక్రమంగా లేక తరచు మెలకువ రావడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. -
తగిన యుక్తి
ఇశ్రాయేలీయులను పరిపాలించిన కనాను రాజు సేనాధిపతి సీసెర చాలా క్రూరుడు. ఇశ్రాయేలీయులను బహుగా హింసించేవాడు. ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఈ సీసెర ఇనుప రథాలతో ఇశ్రాయేలీయులను, వారి పక్షంగా యుద్ధం చేసే బారాకుని చంపాలని బయలుదేరాడు. అయితే ఎంతటి సేనాధిపతి అయినా అవతలి వ్యక్తి బలాన్ని తక్కువ అంచనా వేస్తే ఓడిపోక తప్పదు కదా. సీసెర విషయంలో కూడా ఇదే జరిగింది. తన సైన్యాన్నంతా కోల్పోయి తన రథాలను విడిచి బారాకు తరుముతున్నప్పుడు కాలినడకన అక్కడినుండి పారిపోవడం మొదలు పెట్టాడు. అలా వెళ్లిన సీసేరాకు ఒక స్త్రీ కనిపించింది. స్త్రీనే కదా, తనకు ఇక ప్రాణహాని ఉండదు.. నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని దాహం ఇమ్మని ఆ స్త్రీని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ స్త్రీ నీళ్లకు బదులుగా పాలిచ్చి అతడిని నమ్మించింది. ఇక ఈ స్త్రీ వల్ల తనకు హాని లేదని అనుకుని ఆ స్త్రీని గుడారానికి కాపలాగా ఉంచి ‘‘ద్వారంలో నిలిచి ఎవరైనా వచ్చి అడిగితే ఎవరూ లేరని చెప్పు’’ అని ఆదేశించి, తాను లోపల పడుకున్నాడు. ఇశ్రాయేలీయులను హింసిస్తున్న సీసెర మీద కోపంతో ఉన్న ఈ స్త్రీ ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. పాలు తాగి గాఢ నిద్రలో ఉన్న సీసెరాని గుడారపు మేకుతో సుత్తి చేత పట్టుకుని పొడిచి చంపేసింది. సీసెరా పీడ నుండి ఇశ్రాయేలీయులను విడిపించింది. ఎంతో గర్వంగా ప్రవర్తించిన ఒక రాజ్య సేనాధిపతి దారుణంగా చనిపోయాడు. ఇక్కడ ఈ స్త్రీ గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవాలి. అవకాశం దొరకగానే చాలా తెలివిగా ప్రవర్తించి నీళ్లడిగితే పాలిచ్చి అతడిని గాఢ నిద్రలోనికి జారుకునేటట్లు చేసింది. అతడి బలాన్ని చూసి భయపడకుండా అతడు పడుకోగానే ఎవరికైనా చెబుదామని వెళ్లలేదు. తాను వెళితే అతడు లేస్తే మళ్లీ బలం తెచ్చుకుంటాడేమోనని ఆలోచించింది. తన ప్రాణానికి తెగించి అతడిని మట్టు్టబెట్టింది, చాలా యుక్తిగా, తెలివిగా ప్రవర్తించి తన జాతిని ఆ క్రూరుడి నుండి రక్షించింది. ఇలాంటి స్త్రీలు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. – రవికాంత్ బెల్లంకొండ -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
నిద్రపోతే ప్రాణానికే ముప్పు!
న్యూఢిల్లీ: ఆరోగ్యం బాగుండాలంటే సరిపడ నిద్ర ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అదే నిద్ర ఓ బాలుడి పాలిట శాపంగా మారింది. నిద్ర శాపంగా మారడం ఏంటని అనుకుంటున్నారా! అయితే ఇది చదవండి... న్యూఢిల్లీకి చెందిన యదార్థ్ (6 నెలలు) అనే బాలుడు అరుదైన ‘సెంట్రల్ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ వ్యాధితో బాధపడుతున్నాడు. జన్యులోపాల కారణంగా పుట్టుకతోనే ఈ వ్యాధి వస్తుంది. దీని వల్ల శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతున్నా నరాలు దాన్ని మెదడుకు చేరవేయడంలో విఫలమవుతాయి. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు గాఢ నిద్రలోకి వెళ్తే ఆక్సిజన్ తగ్గి, ప్రాణాపాయ స్థితి తలెత్తవచ్చు. అందుకే యదార్థ్ తల్లి తన బిడ్డను నిద్రపోనివ్వకుండా కాపాడుకుంటోంది. మరి ఈ వ్యాధికి చికిత్స లేదా అంటే.. కచ్చితంగా ఉంది కానీ చాలా ఖర్చుతో కూడుకుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి ఇది తలకి మించిన భారంగా మారింది. ‘చికిత్సకు అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తే మా బాబు బతుకుతాడ’ని యదార్థ్ తండ్రి ప్రవీణ్ వేడుకుంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి. -
మేల్కొని ఉండండి
గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది! కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు. ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు. మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు. కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి. అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి. – డి.వి.ఆర్. -
కాంటాక్ట్లెన్స్తో నిద్రపోవడం ప్రమాదకరం
వాషింగ్టన్: నిద్ర పోయేటప్పుడు కాంటాక్ట్లెన్స్ తీయకుండా అలాగే ఉంచడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్లెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కార్నియాకు ఇన్ఫెక్షన్స్ సోకుతుందంటున్నారు అమెరికాలోని న్యూమెక్సికో యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాన్ ఫెమ్లింగ్. ‘కాంటాక్ట్లెన్స్తో నిద్రపోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి.. శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్, కళ్ల సంబంధ సమస్యలు రాకూడదంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన పరిష్కారం’అని ఆయన పేర్కొన్నారు. -
ఎక్కువైనా.. తక్కువైనా ముప్పే
టోక్యో: అతి నిద్ర, నిద్రలేమి రెండూ హృదయ సంబంధ వ్యాధులకు కారణాలవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. రోజులో సాధారణంగా కావలసిన నిద్రకన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో ముందస్తు మరణాలు, మెదడులో రక్తనాళ సమస్యలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజ నిద్ర సమయంకన్నా ఎక్కువగా అంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 5 శాతం ఉండగా, 9 నుంచి పది గంటలు నిద్రపోయేవారిలో 17 శాతంగా ఉందని చెబుతున్నారు. రోజుకు ఆరు లేదా అంతకన్నా తక్కువ నిద్రపోయే వారిలోనూ ఈ ప్రమాద శాతం 9 శాతంగా ఉంది. రాత్రి సమయంలో ఆరు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రభావానికి గురయ్యే అవకాశం 9.4 శాతంగా ఉందని చెబుతున్నారు. అయితే హృదయ సంబంధ వ్యాధులన్నింటికీ నిద్రే ప్రధాన కారణమని చెప్పలేం అని యురోపియన్ హార్ట్ జర్నల్ చెబుతోంది. అయితే అతి నిద్ర, నిద్రలేమి కచ్చితంగా గుండెకారక వ్యాధులపై ప్రభావం చూపేవేనని ఆ జర్నల్లో ఓ కథనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి 35 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 1,16,000 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా దేశాలనుంచి ఉన్నారు. ఎనిమిదేళ్ల కాలానికి పరిశోధనను తీసుకుంటే సుమారుగా 4,381 మంది మరణించగా, 4,365 మంది తీవ్ర హృదయ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వారు చెప్పారు. -
స్క్రీన్టైమ్తో నిద్ర ఎందుకు చెడుతుందంటే?
నిద్రకు ఉపక్రమించేంత వరకూ స్మార్ట్ఫోన్, టీవీ, ల్యాప్టాప్లతో కుస్తీపడుతున్నారా? అయితే మీకు జాగరణ తప్పదు. ఈ విషయం తెలియనిది ఎవరికి అంటున్నారా? నిజమేగానీ.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన ప్రకారం స్క్రీన్ ముందు ఉన్నప్పుడు మన కళ్లల్లోని కొన్ని కణాలు ఈ కాంతికి స్పందించి మన జీవగడియారాన్ని రీసెట్ చేస్తాయి! రాత్రిపూట స్క్రీన్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి మన జీవగడియారాన్ని కొంత గందరగోళానికి గురి చేస్తుందని ఈ మధ్యలో ఈ ప్రత్యేక కణాలు గడియారాన్ని రీసెట్ చేయడం వల్ల నిద్ర దెబ్బతినడం మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సచిన్ పాండా తెలిపారు. కృత్రిమ కాంతి ముందు ఉన్నప్పుడు రెటినా లోపలిభాగాల్లో ఉండే కణాలు మెలనోస్పిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుందని.. ఇది కాస్తా మెలకువగా ఉండాలన్న సంకేతాలను మెదడుకు పంపుతాయని పాండా చెప్పారు. పదినిమిషాల కంటే ఎక్కువ సమయం ప్రకాశవంతమైన కాంతిలో ఉన్నప్పుడు మెలనోస్పిన్ విడుదలై నిద్రకు కారణమైన రసాయనం వె -
యూటూ...
కోళ్ళు కూయక ముందే నిద్దర లేచింది రాజమ్మ. లేస్తానే బిందెలు, చేంతాడు తీసుకోని బయల్దేరింది. ఒళ్ళు తెలియకుండా నిద్ర పోతున్న కూతురు సుజాతని తట్టి లేపి ‘అమ్మాయ్, లే, లేచి తలుపు గడేస్కో, నేను బాయికి పోతన్నా’ అని చెప్పి బయట పడింది.తిరిగొచ్చే సరికి తెల్లగా తెల్లారిపొయ్యింది. ఎప్పుడూ ఎండాకాల మొచ్చిందంటే ఇదే తంతు.చెర్లో ఉన్న కమ్మోళ్ళ బాయిలో చుక్క నీళ్లు ఉండవు. ఊరు మొత్తానికీ మాలోళ్ళ బాయే గతి. దాంట్లోనైనా ఇబ్బడిముబ్బడిగా ఏవీ నీళ్ళుండవు. కొంచెం కొంచెంగా జల ఊరతా ఉంటది. జనాలు రేత్తిరి తెల్లార్లూ డబ్బాలకు గాలాలేసుకోని వంతులవారీగా చేదుకుంటా ఉంటారు.ఎప్పుడు వంతొచ్చేనో ఏమో అని వరసలో నుంచోని నుంచోని ఇసుగు పుట్టి పక్కకి పొయ్యామా, అప్పుడే వంతొచ్చుద్ది, ఎనకోళ్ళు ముందుకొచ్చేత్తారు, ఇంక చివర్నే మళ్ళీ వంతొచ్చేది. ఎందుకొచ్చిన గోలనుకోని కొంతమందిఅక్కడే ఆ చెరువు కట్ట మీదే ఒక నిద్ర బోతారు తమ వంతొచ్చేదాకా. ఈ బాధలన్నీ పడలేక కొంతమంది ఆసాములు సైకిళ్ళున్నోళ్ళు పొలం బాయికో, పక్కూరి బాయికో పోయి నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా వీలు కానోళ్ళు రాజమ్మలాగే తంటాలు పడతారు. అయితే ఊళ్లోని ముసలీ ముతకా బాయికాడకొస్తే కాపోళ్ళు గదా అని పల్లె జనాలు కాస్త బరవాసాగానే పోతారు. వంతుల్తో పని లేకుండా ‘‘వరసలో రాండమ్మో’’ అనకుండా నీళ్ళు చేదిపోస్తారు. కానీ రోజు అట్టా కుదరొద్దూ?ఎవురికోళ్ళకే తొందర పనులాయె! వస్తా వస్తానే కూతుర్ని కేకలు పెట్టి పక్కలు తియ్యమని చెప్పి చీపురుతో గబగబా చిమ్మి కల్లాపు చల్తుంది రాజమ్మ. అందరికంటే ముందు పాచికసువు తీయలేకపొయ్యాననే ఇసురులో ఉంది. ‘ఇయ్యాలేందొదినా పొద్దెక్కిందాకా ఉన్నావు. మెలుకువ రాలేదా ఏంది ?’ అప్పటికే ఇంటిముంగల ముగ్గెయ్యడం పూర్తిచేస్తున్న పొరుగామె ఆరా తీసింది. ‘ఆ... ఎంత ముందు లేచినా నీళ్ళ బాయి దగ్గరే పున్నెకాలం పూర్తవుతుంది. ఒకరోజు అయితే బతిమాలీ బామాలీ వరసతో పన్లేకండా దోర్చుకుంటాం. రోజూ అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? మాకు పనులు లేవా అని ఎదురు అడుగుతున్నారు.’‘అవునొదినా. మరీ పెద్దంతరం చిన్నంతరం లేకండా పోతంది. నిన్న మాయిటేల నీళ్ళ బాయి దగ్గర నడిం బజారోల్ల మీద అడ్డం దిరిగారు పల్లెలో కుర్రాళ్ళు. ఆ గంగి కొడుకు ఏసోబు గాడయితే మరీ పెచ్చుమీరి పోతన్నాడు. వాళ్ళనట్టా అలవాటు కానిస్తే ఎట్టా?అందుకే మీ బావకొడుకు శీనూ ఇంకా నలుగురయిదుగురొచ్చి బాయి దగ్గర దుమ్ముదులపబోయారు. పిల్లల్ని వదిలితే గోల పెద్దదయిద్దనీ ఎసోబుగాడ్ని పంచాయితీకి పిలిపిచ్చి మాట్టాడారు పేద్దోళ్ళు. వాడు పొగురుగా మాట్లాడతా మిర్రిమిర్రి చూస్తా శీనయ్య మీద కొచ్చ్సాడు. వాళ్లమ్మొచ్చి కొడుక్కి నాలుగుబెట్టి లాక్కెళ్ళింది సర్దుకు పోవాలగానీ ఏందీ తగాదాలంటా’. ‘ఏమోలే వదినా. నాల్రోజులు తాలితే అదే చల్లబడుద్దిలే. ఇయ్యాల సత్తాయి చేలో నయ్యెరువు జల్లాల. అందరూ పనులు మొదలు పెడితే పల్లెలో మంగి ముఠా కట్టిద్ది. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. మనుషుల్ని పిల్చకరమ్మని పొద్దుననంగా పంపా పల్లె మీదికి. వొచ్చాడేమో చూడు మీ అన్న!’’ అంటా రాజమ్మ లోపలికొచ్చింది. సుజాతకి జడలేస్తా వాళ్ళ నాన్నింకా బజారునుండి పెత్తనాలోదిలి రాలేదని సాగాదీస్తుండగానే తాగే బీడీని బైట గోడమీద బెట్టి లోపలికొచ్చాడాయన.‘మిడిమేలపు చావొచ్చిందాకా ఇట్టానే తాగు. రోగమొస్తే రోప్పోస్తే ఎట్టనా అనేదే లేదు. అవతల మీ అన్న కాడెద్దుల ఎగసాయం జేస్తా, ఎకరాలు సంపాయిస్తా ఉంటే నువ్వు మాత్రం మీ అయ్యిచ్చిన ఆ ఎకరం ముక్కలోనే పొర్లాడతా ఉండు..సిగ్గన్నా పెట్టలా మడిసి జన్మకి ..ఇంతకీ మణుసుల్ని పిల్చావా లేదా?’ఈ గొంతుకి అలవాటైపోయిన ఆయన తాపీగా చెప్పాడు.‘ఇయ్యాలెవరూ పన్లోకి రారు. మంగి కూతురు కుమారుళ్ళా.. దాని మొగుడు ఐదరాబాద్లో యాక్సిడెంటయి చచ్చిపోయాడంట. రాత్రి మేదరమెట్ట ఫోనోచ్చిందంట. శవాన్నిక్కడికి తెచ్చేసరికి రేపటేలయ్యిద్దంట..‘ ‘ఎట్టా జరిగిందంటా?’ అడిగింది రాజమ్మ‘ఏమోనే. వస్తేగానీ తెలీదు. పాపం ఊరొదిలి ఎల్లడం వాడికి బాదగా ఉన్నా, ఇద్దరాడపిల్లల్నీ బాగా చదివిచ్చుకోవాలనీ, ఈడుంటే మంగి కుమార్ని చేనూ చేనూ తిప్పిద్దనీ, ఐదారాబాద్లో వాళ్ళ బావ ఇళ్ళకిరంగులేసే పని జేస్తంటే ఆడనే ఎదో ఒక పని చూసుకుంటానని ఎల్లాడు. ఇప్పూడిట్టా జరిగా. ఇద్దరూ ఎంతఒద్దిగ్గా ఉంటారు పాపం’ అన్నాడు రామయ్య.పదింటికి వచ్చిన శవాన్ని చూసినోళ్ళందర్రూ ఇళ్ళకు సాంతం వెళ్ళకుండానే– ‘చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆ పిల్లల్నేట్టా నెట్టాల కుమారి. యాక్సిడెంట్ డబ్బులొస్తే పెళ్ళిజేసి అది కూలో నాలో జేసుకు బతకడమే’నని తేల్చారు. రాజమ్మమాత్రం మొగుడులేనిల్లు ఊరందరికీ అలుసైద్దనీ కాయలున్న చెట్టుకే రాళ్ళదెబ్బలనీ అంది. కొన్నాళ్ళు పిల్లలిద్దర్నీ బడికి పంపింది కుమారి. పెద్దదయిందగ్గర నుండి బరువు పెరిగిద్దనీ పెళ్ళి జేయ్యమని అందరూ తొందర పెట్టడంతో సుజాతోళ్ళ పెద్దయ్య దగ్గర డబ్బు తెచ్చి పెద్దకూతురి పెళ్లి చేసింది.చిన్న కూతురు దేవిని సుజాతతో పాటు హైస్కూల్కి పంపింది. దేవి ఎనిమిదో తరగతి సుజాత పది. మనిషి నలుపైనా దేవి ఎంత అందంగా ఉండేదో.నవ్వే కళ్ళతో మెరిసిపోతా ఉండేది. గలగలా మాట్లాడ్డం మొదలు పెట్టిందంటే చుట్టూ ఉన్నోళ్ళు అట్టా నోర్లు తెరుచుకోని ఇంటానే ఉండేవాళ్ళు. అంత అయిస్కాంతం ఆ పిల్ల. తొమ్మిది అయిపోగానే పెద్ద పిల్ల పురుళ్లనీ, అయ్యనీ, ఇయ్యనీ డబ్బుల్లేక దేవిని చదువు మాన్పించేసింది కుమారి. పొలంపనులకి తీస్కెళ్ళడం మొదలుపెట్టింది.పత్తి చేలల్లోఊళ్ళో వాళ్ళందరూ ఒక వరసగా, తరువాత పల్లెలో వాళ్ళందరూ ఒక వరుసగా సాళ్ళు పట్టుకుని పనిజేసేవాళ్ళు. సాళ్ల మధ్యలో ఎవరికిష్టమైన యవ్వారాలు వాళ్ళు పెట్టుకునే వారు. కుమారి సాల్లో ఉండి పనిజేస్తే, దేవి మనిషెత్తు సాళ్ళు దాటి అందరి ఒళ్ళల్లో పత్తి తీసుకుని గోతాలకేసుకుని, గట్టు మీదున్న శీనయ్యకి అందిచ్చేది. ఎప్పుడూ గలగలా మాట్లాడతానే ఉండే పిల్లకి పాపం నోరు తెరిచే తీరికుండేది గాదు. బడి మానేసినాక ఈ రెండేళ్ళలో దేవి యవ్వనోత్సాహంతో మరింత అందంగా తయారయింది. పొలంలో దిగిం దగ్గర్నించీ ఆ పిల్లని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. వొడినిండిందనో, మంచి నీళ్ళనో పిలుస్తానే ఉండేవాళ్ళు. వీటికి తోడు గట్టు మీదనుంచి శీనయ్య గోతాలెత్తాలనో, కుట్టాలనో చీటికి మాటికి పిలుస్తా ఉండేవాడు. ఒకరోజు శీనన్న అట్ట పిలిచినప్పుడు దేవి సుజాతని తోడు రమ్మంది. ఇది గమనించిన శీను ‘‘సుజాత వల్ల కాదులే, నువు రా’’ అని గట్టిగా పిలిచాడు. దేవి అయిష్టంగా కదిలి వెళ్ళింది.ఏదో తేడాగా అనిపించింది సుజాతకి. ఆ మాటే అంది వాళ్ళమ్మతో సాయంత్రం. ‘అసలా గోతాలు వాడేత్తుకోలేకనా. ఆ సోంబేరోడు దేనికీ కాకుండా పోతున్నాడు.గాలెవ్వారాలెక్కువౌతున్నాయి. ఈడు మొగపిల్లోడనీ, వంశాన్ని నిలబెడతాడనీ ఉన్న పొలమంతా మీ తాత పెదయ్యకి బెట్టె. మీ అయ్యకేమో గొర్రెలూ బర్రెలూ ఇచ్చి బయటకి పంపే. నోరున్నోడి మాటే చెల్లిద్ది. ఈడెమో సదువూ సంధ్య లేకుండా ఊరు మీద దిరుగుతున్నాడు. ఈడికి కాదుగానీ దానికి జెబుతాలే’ అంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ మాటతో సుజాతకి ఊరట కలిగింది. అమ్మ ఎప్పుడూ అంటుంది. మగపిల్లల జోలికి వెళ్ళకూడదు. వాళ్లోస్తే ఊరుకోకూడదు. గట్టిగా బుద్ది జెప్పాలనేది.ఒకరోజు పొద్దున్న ‘అమ్మాయి సుజాతా ... నాకు చేలో ఉమ్మరంగా పనుంది గానీ, తొందరగా పన్జేసుకొని కొట్టం కాడికెళ్ళమ్మా బర్రీనేటట్టుంది’ అని చెప్పి రాజమ్మ బయటికెళ్ళింది. అమ్మ వెళ్ళిం తర్వాత మిగిలిపోయిన పనులు చేయటానికి సిద్దం అయింది సుజాత. ఇంతలో గోడవతలనుండి శీనన్న పిలవడంతో బయటకొచ్చింది. ఎందన్నాయ్ ‘ అంటా దగ్గరకెళ్ళింది. ‘అమ్మోల్లు పొలం ఎల్లారా? ...నువ్వు కొట్టం దగ్గరకి వెళ్లొద్దులే. బర్రె పని నేను జూస్తాలే’ అన్నాడు. ఎప్పుడూ పనందుకొని శీనన్న ఇలా అనటంతో సుజాతకి ఆశ్చర్యం వేసింది. వద్దులే అందామనుకొని ఏదో విషయం ఉందని అర్ధమయ్యి ‘ఎందుకన్నాయి?’ అంది.‘ఏం లేదులే ...మొన్న నేను దేవితో ఉన్నప్పుడు వాళ్ళ మామ ఏసోబు గాడు చూశాడు’ అన్నాడు నంగినంగిగా. ‘వాడు దాన్ని కొట్టాడు. అది నామీద చెప్పింది వాడికి. వాడు నామీద కోపంగా ఉన్నాడు. నన్నేమనలేక నిన్నేమన్న అంటాడేమోనన్లే ...జాగర్తగా ఉండు.’ అనెళ్ళాడు. అన్నమాటలకి సుజాత బిత్తరకపోయింది. ఎంత తేలిగ్గా చెప్పెల్తన్నాడు!. ఏసోబు, వాళ్ళమ్మ దేవినేమన్నారో. ఆ పిల్ల ఎంతేడుస్తుందో. ఏసోబుకి నిజంగానే కోపం వచ్చుంటుంది. మొన్న అంజమ్మత్త చెప్పిన బాయికాడ సంగతి గుర్తొస్తే భయమేసింది. వీడు జేసిన పనికి నిజంగా నన్నేమన్నా అంటాడేమో. ఇంట్లో ఉన్నా భయం పుట్టేట్టు జేశాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు జాగ్రత్త చెబుతున్నాడు. మా పెద్దయ్యోల్లకు తెల్సో లేదో. ఎవరికన్నా జెప్తే శీనన్నాయ్ ఏమంటాడో ...శీనన్న బర్రెదగ్గరకి వెళ్ళాడో లేదో. చెప్పింది చేస్తాడని లేదుబర్రీనుంటే? ఏంకాదులె అనుకోని కొట్టంకాడికి బయల్దేరింది. ఇల్లు మూలదాటి గొందిలోకి ఎళ్ళగానే హటాత్తుగా ఎదురయ్యాడు ఏసోబు. వేగంగా అడుగులేస్కుంటా వస్తున్నాడు.. తనకోసమే వస్తున్నాడా? భయమేసింది. గబుక్కున వెనక్కు తిరిగింది. ఏసోబు పిలుస్తున్నా వెనక్కి తిరగలేదు. పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చిపడింది.అమ్మకోసం ఎదురు చూస్తా కూర్చుంది సుజాత. తప్పుజేస్తే అమ్మ ఎవర్నైనా ఊరుకోదు. ఇవ్వాళ శీనన్నకి బాగా గడ్డిబెట్టిద్ది. పెద్దయ్యోళ్లతో తగాదయినా సరే. ‘ఏందే బర్రె దగ్గరకెళ్ళ లేదు? బర్రీనిందని ఏసోబు చెబుతున్నా వినిపించోకుండా వచ్చావంట.’ అంది రాజమ్మ లోపలికొస్తానే. జరిగిందంతా చెప్పింది సుజాత. ‘ఆ సన్నాసోడికేం పొయ్యేకాలమొచ్చింది. దాన్నలరిపాలు చెయ్యడానికి. ఈడిలాగే అందరూ ఎదవ పనులు జేస్తారంటనా. వాళ్లట్టాటోళ్ళుకాదు. ఏసోబు మాట కటువైనా మనిషి మంచోడు. అయినా ఊళ్ళో వాళ్ళ జోలికి రావడం అంత తేలికా’ అంది రాజమ్మ.ఆ రాత్రి కుమారి రాజమ్మ దగ్గరకొచ్చింది. ‘అక్కాయ్ గ్రేడు పనులు మొదలు పెడితే చెప్పు మేం కూడా వస్తాం.’ దిగులు గొంతుతో అంది కుమారి. సరేలే కుమారీ అట్టనే వద్దువు... విషయం తెలిసిందిలే. అయినా దానికైనా జాగర్త ఉండొద్దా. ఎవురేందో తెలియోద్దా.. నువ్వయినా చేప్పొద్దా.’ అంది.అమ్మ మాటలో, గొంతులో ఏదో తేడా అనిపించింది సుజాతకి. ‘నాకేం తెలుసక్కాయి ఇట్ట జేస్తాడనీ.... ఈడ పెరిగిన పిల్ల కాదాయె. దానికేందెలుసు..... అయినా ఆ మనిషే ఉంటే.... ఎన్ని అనుకున్నాడు..’ దుఃఖంతో కుమారి గొంతు పూడుకుపోయింది.‘ఇప్పుడు ఏడిచి ఏం లాభం కుమారీ... ముం దుండాలి. ‘అంది రాజమ్మ.కాసేపు మాట్లాడి కుమారి వెళ్ళిపోయింది.అమ్మ మాట్లాడాల్సినవేవో మాట్లాడలేదనిపించింది సుజాతకి ‘‘పాపం దేవిమా ...’ అంది సుజాత వాళ్ళమ్మ మొహంలోకి చూస్తూ.‘ఏమయ్యిద్ది .. దానికి తెలియోద్దంటే జాగర్త? ఎదురెళ్ళి తెచ్చుకుంటారనుకుందా? ఆ ఏసోబు గాడికిచ్చి ముడి పెట్టేస్తార్లే ’’ అంది తేలిగ్గా .సుజాతకు అమ్మ కొత్తగా కనిపించింది. అమ్మ ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతుంది. శీనన్న మీద అమ్మకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. చిన్న విషయాల దగ్గర కూడా తిడుతుంది. కానీ ఇప్పుడు శీనన్న మీద రావల్సినంత కోపం రాలేదెందుకనీ. పైగా దేవినే తప్పుబడుతూ మాట్లాడింది. పొలంలో దేవి గురించి అమ్మ జాగ్రత్త దేవి గురించేనా?అమ్మ గురించి చెడ్డగా అనుకోలేకపోయింది.ఏసోబు మంచితనం మీద అమ్మ నమ్మకానికి, మనజోలికి రాలేడనే ధీమాకి మధ్య ఎదో సంబంధం ఉన్నట్లనిపించింది సుజాతకి .కానీ అదేమిటో తెలీలేదు.ఆ రాత్రి నిద్ర పోలేదు సుజాత. -ఝాన్సీరాణి -
పాప ఎక్కువగా నిద్ర పోతోంది?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. ఉజ్వల, కొత్తగూడెం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. బాబుకు ఉన్న కళ్ల సమస్య ఏమిటి? మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – డి. సూర్యారావు, టెక్కలి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ విషయానికి వస్తే... కళ్లు నాన్ రిథమిక్గా, అనేక డైరెక్షన్స్లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు మాటిమాటికీ జ్వరం... ఎందుకిలా? మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – వి. రంగారావు, ఒంగోలు పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
స్లీప్టెస్ట్తో నా సమస్య తెలుస్తుందా?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాను. గత ఆర్నెల్లుగా నాకు సరిగా నిద్రపట్టడం లేదు. నిద్రలో ఉన్నప్పుడు తరచూ లేచికూర్చుంటున్నాను. అయితే నాకు ఆ విషయం తెలియడం లేదు. నా రూమ్మేట్స్ చెబుతున్నారు. పగటివేళ మగతగా ఉంటోంది. ఒక్కోసారి క్లాసులో పాఠం వింటూ నిద్రపోతున్నాను. వారం కిందట డాక్టర్కు చూపించుకుంటే స్లీప్ టెస్ట్ చేయించుకొమ్మన్నారు. ఆ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది? – ఎన్ వైష్ణవి, వైజాగ్ స్లీప్ టెస్ట్ను వైద్యపరిభాషలో పాలీసోమ్నోగ్రఫీ అంటారు. ఇది ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత సమస్యలను) గుర్తించి, నిర్ధారణ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు అతడి బ్రెయిన్వేవ్స్, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు, గుండె స్పందనల రేటు, శ్వాస స్థాయి, కనుగుడ్లు – కాళ్ల కదలికలను రికార్డు చేస్తారు. ఆసుపత్రి లేదా స్లీప్ సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం సాయంత్రం పొద్దుపోయాక రావాల్సిందిగా పేషెంట్కు సూచిస్తారు. రాత్రి ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు స్లీప్ పాటర్న్ లను నమోదు చేయడానికి వీలుకలుగుతుంది. ఒక వ్యక్తిలో స్లీప్ డిజార్డర్ను గుర్తించడమే కాకుండా ఇప్పటికే నిద్రసంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. సాధారణంగా వయోజనులకు 7 – 8 గంటల నిద్ర అవసరం. అయితే ఈ నిద్రసమయంలో అందరిలోనూ ఒకేలా ఉండదు. ఇందులోనూ ఎన్నో దశలు ఉంటాయి. ఉదాహరణకు నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్ఆర్ఈఎమ్) దశ ప్రారంభమైన తర్వాత ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే దశకు మారుతుంది. నిద్రపోతున్న సమయంలో ఈ రెండు దశలు ఒక క్రమబద్ధమైన రీతిలో కొనసాగుతుండటం కనిపిస్తుంటుంది. ఎన్ఆర్ఈఎమ్ దశలో నిద్రలో ఉన్న వ్యక్తి కనుపాపల్లో కదలికలు ఉండవు. కానీ గంట తర్వాత ఆర్ఈఎమ్ దశలోకి ప్రవేశించగానే కనుపాపలు వేగంగా కదులుతాయి. వ్యక్తిలో కలలు వచ్చేది ఈ ఆర్ఈఎమ్ సమయంలోనే. ఎన్ఆర్ఈఎమ్ దశ, ఆర్ఈఎమ్ దశల మధ్య 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రి నిద్రపోయే సమయంలో ఆరుసార్లు ఈ ఎన్ఆర్ఈఎమ్, ఆర్ఈఎమ్ల సైకిల్స్ (చక్రభ్రమణాలు) సాగుతాయి. నిద్ర సమయం గడుస్తున్న కొద్దీ ఆర్ఈఎమ్ వ్యవధి పెరుగుతుంది. స్లీప్ డిజార్డర్స్ ఈ సైకిల్స్ను దెబ్బతీస్తాయి. పాలీసోమ్నోగ్రఫీ పరీక్షలో వ్యక్తి తాలూకు నిద్రలోని దశలను గమనించి, ఏ స్లీప్ పాటర్న్ దెబ్బతింటున్నది అన్న అంశాన్ని నిపుణులు గుర్తిస్తారు. పేషెంట్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనించినప్పుడు ఈ స్లీప్టెస్ట్ చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. స్లీప్ ఆప్నియా కారణంగానో లేదా మరో ఇతర సమస్య వల్లనో వ్యక్తి తాలూకు శ్వాస తరచూ నిలిచిపోవడం; వ్యక్తి తన ప్రమేయం లేకుండా నిద్రలో తరచూ కాళ్లు కదుపుతుండటం, రోజంతా మగతగా ఉంటూ హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఉండే నార్కోలెప్సీ వంటి పరిస్థితులు; నిద్రలో ఉండగా నడవడం లేదా లేచి తిరగడం వంటి అసాధారణ ప్రవర్తనలు; అకారణంగా కొనసాగుతున్న తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ స్లీప్ టెస్ట్ను చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సూచిస్తారు. ఈ పరీక్షతో సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేసి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుకలుగుతుంది. రాత్రంతా నిద్రపట్టడంలేదు... ఎందుకిలా? నా వయసు 47 ఏళ్లు. ఒక చిట్ఫండ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. ఏడాదికాలంగా నాకు రాత్రిళ్లు నిద్రపట్టడం చాలా కష్టమవుతోంది. ఒకరోజు తెలతెలవారేదాకా నిద్రపట్టక, పొద్దున్నే కాసేపు మాత్రం పడుకోగలుగుతున్నాను. రోజంతా నిస్సత్తువ, చికాకుగా ఉంటోంది. పనిమీద ఏకాగ్రత కుదరడం లేదు. మధ్యాహ్నం నిద్ర ముంచుకువస్తోంది. దాంతో ఈమధ్య రాత్రిళ్లు నిద్రమాత్రలు వేసుకోవడం మొదలుపెట్టాను. అయితే మా ఖాతాదారుగా ఉన్న ఓ వైద్యుడితో ఈ సమస్యను ప్రస్తావిస్తే వెంటనే నిద్రమాత్రలు మానేయమని అన్నారు. ఇది స్లీప్ డిజార్డర్లా అనిపిస్తోంది. హైదరాబాద్కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించుకొమ్మని సలహా ఇచ్చారు. నా సమస్య ఏమిటి, ఎందువల్ల వస్తుంది. దయచేసి తెలియజేయండి. – సీహెచ్ మృత్యుంజయం, సిద్ధిపేట క్రమం తప్పకుండా తగినంత నిద్రపోలేకపోవటానికి సంబంధించిన చాలా లక్షణాలను కలుపుకొని స్లీప్ డిజార్డర్స్ (నిద్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు)గా చెబుతుంటారు. ఈ సమస్యలకు ఏ అనారోగ్యమైనా కారణం కావచ్చు. లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీరికలేని పనుల ఒత్తిడి, మరికొన్ని ఇతర కారణాలూ కావచ్చు. మొత్తం మీద ప్రతివ్యక్తీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఇది నెలల తరబడి కొనసాగుతున్నట్లయితే దాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్లీప్ డిజార్డర్స్ వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో పట్టణప్రాంతాల్లో వయోజనులు, ప్రత్యేకించి నలభౖయెదేళ్లకు పైబడిన వారిలో దాదాపు సగం మంది నిద్రలేమి, నిద్రసంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా. ఇది వ్యక్తుల సాధారణ జీవితానికి ఆటంకం అవుతుంది. మీరు చెప్పిన లక్షణాలైన నిస్సత్తువ మాత్రమే గాక మానసికంగా అస్తవ్యస్తంగా అనిపిస్తుంటుంది. దేనిపైనా ఏకాగ్రత కుదరదు. ఊరికే చికాకు పడుతుంటారు. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కొంతమందిలో శారీరక, మానసిక రుగ్మతల కారణంగా స్లీప్ డిజార్డర్స్ ఏర్పడతాయి. ఒకసారి ఆ రుగ్మతలకు చికిత్స చేయడం వల్ల వాటితోపాటే నిద్రలేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది. అందు వల్ల ముందుగా మీరు మొదట ఫిజీషియన్ను కలిసి, ఆయన సూచించిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఎలాంటి వ్యాధులు లేవని నిర్ధారణ అయితే మీది స్లీప్ డిజార్డర్గా భావించవచ్చు. ఇలా ఆరోగ్యకారణాలు ఏవీ లేకుండా స్లీప్ డిజార్డర్స్ కనిపించినప్పుడు దానికి వైద్యపరమైన చికిత్సతో పాటు జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా అవసరం. ఇతరత్రా ఎలాంటి అనారో గ్యాలు లేకుండా నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు స్లీప్స్పెషలిస్ట్ను సంప్రదించండి. డాక్టర్ వై. గోపీకృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పడగ్గదిలో ‘సోషల్’ ట్రెండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండే పడక గదులను సైతం సైబర్ ‘చాట్ రూం’లుగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు నట్టింట్లోకి మాత్రమే పరిమితమైన ల్యాప్టాప్.. ట్యాబ్.. స్మార్ట్ఫోన్.. ఐపాడ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు పడక సమయంలోనూ బెడ్మీదకు చేరుతున్నాయి. దీంతో సిటీజన్లు నిద్రలేమికి గురవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. ‘సెంచురీ మాట్రిసెస్’ దేశవ్యాప్తంగా పది నగరాల్లోని ప్రజల ‘స్లీపింగ్ ట్రెండ్స్’(నిద్ర అలవాట్లు)పై చేసిన సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఈ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ దేశంలో అగ్రభాగాన నిలవడం గమనార్హం. ఈ నగరంలో సుమారు 70 శాతం మంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు తాజా సమచారాన్ని తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల్లో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచిన విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. మూడోస్థానంలో నిలిచిన బెంగళూరులో 65 శాతం మంది, నాలుగో స్థానంలో నిలిచిన ఇండోర్లో 58 శాతం మంది, ఐదోస్థానంలో ఉన్న పూణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు తేలడం గమనార్హం. పలు నగరాల్లో నిద్ర అలవాట్లు ఇలా.. సెంచురీ మాట్రిసెస్ దేశవ్యాప్తంగా పది నగరాల్లో ప్రజల స్లీపింగ్ ట్రెండ్స్పై సర్వే చేసింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ‘ఆన్లైన్’లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్డేట్ అవుతోన్న ఫీడ్ను తిలకిస్తూ మెజార్టీ సిటీజన్లు కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11–12 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5–6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు తేలింది. అధికంగా వీక్షిస్తే ప్రమాదమే.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్తో కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీంతో మెడ, మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. కనీసం పడక సమయంలోనైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంటే మేలు. – డాక్టర్ రవీంద్రగౌడ్, సూపరింటెండెంట్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి -
కేన్సర్ కణాలను నిద్రపుచ్చారు!
కేన్సర్పై పోరులో మెల్బోర్న్ శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కేన్సర్ కణాలను శాశ్వత నిద్రలోకి పంపే ఓ మందును సిద్ధం చేశారు. నేచర్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందు... కణితి పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా సాధారణ కణాల డీఎన్ఏను ఏ మాత్రం మార్పు చేయకుండా పని చేస్తుంది. రక్త, కాలేయ కేన్సర్ల విషయంలో తాము ఇప్పటికే జంతువులపై ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు పొందామని, ఈ మందుతో కేన్సర్ మళ్లీ తిరగబెట్టడమన్నది కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని టిమ్ థామస్ అనే శాస్త్రవేత్త తన పరిశోధన వ్యాసంలో పేర్కొన్నారు. కేఈటీ 6ఏ, కేఏటీ 6బీ అనే రెండు ప్రొటీన్ల ఉత్పత్తిని నిలిపివేస్తే కేన్సర్కు సమర్థమైన చికిత్స కల్పించవచ్చా? అన్న ప్రశ్న ఆధారంగా తాము పరిశోధనలు మొదలుపెట్టామని ఆయన చెప్పారు. ప్రత్యేకమైన మందు సాయంతో కేఏటీ 6ఏ ఉత్పత్తిని నిలిపివేయగానే రక్తపు కేన్సర్లు ఉన్న ఎలుకల ఆయుష్షు నాలుగింతలైందని చెప్పారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు వాడే కీమోథెరపీ, రేడియేషన్ల వల్ల సాధారణ కణాల డీఎన్ఏ లో సరిచేయలేని మార్పులు చోటు చేసుకుంటాయని, దీని ఫలితంగా అనేక సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తాయని మనకు తెలుసు. తాము సిద్ధం చేసిన మందు మాత్రం కేన్సర్ కణాలు విభజితం కాకుండా అడ్డుకుంటాయని.. ఇంకోలా చెప్పాలంటే కణాలు మరణించవుగానీ.. పునరుత్పత్తి చేయలేని స్థితికి చేరుకుంటాయని వివరించారు. -
మూడో నిపుణుడు
రాజుగారు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచారు. లేవగానే తన నోట్లో దంతాలున్నాయో లేవోనని చూసుకోసాగారు. అంతా సరిగానే ఉందని భావించి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారి రాజదర్బారు కొలువయ్యాక తన మంత్రి వర్గంతో ‘‘రాత్రి కలలో నా దంతాలన్నీ విరిగిపోయాయనే కల వచ్చింది. దీని నిగూడార్థం చెప్పే నిపుణుడిని హాజరుపరచండి’’ అని హుకుం జారీ చేశారు. రాజుగారు చెప్పినట్లుగానే హుటాహుటిన స్వప్న ఫలితాలను వివరించే ఒక నిపుణుడిని హాజరుపర్చారు. ‘నా పళ్లన్నీ ఊడిపోయినట్లుగా నేను కలగన్నాను’ అని చెప్పి కలను వివరించారు. రాజుగారు. దానికి ఆ నిపుణుడు ‘‘అపచారం అపచారం.. రాజుగారూ మీకు వచ్చిన కల ఏమి చెబుతోందంటే... మీ కళ్లముందే మీ ఇంటిలోని వారంతా చనిపోతారు’’ అని అర్థం చెప్పాడు. రాజుగారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే అతన్ని కారాగారంలో వేసి నిర్బంధించవలసిందిగా భటులను ఆదేశించి, మరో నిపుణుడిని పిలవాలని ఆజ్ఞాపించారు. మరో నిపుణుడు వచ్చాడు. రాజుగారు చెప్పిన కలను విన్న అతనూ మొదటి నిపుణుడు చెప్పినట్లుగానే చెప్పడంతో అతన్నీ చెరసాలలో వేసి, మూడో నిపుణుడిని పిలవాలని మళ్లీ రాజుగారు హుకుం జారీచేశారు. మూడో నిపుణుడు హాజరయ్యాడు. రాజుగారు తనకొచ్చిన కలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇది విన్న ఆ నిపుణుడు రాజుగారూ ‘మీకు నిజంగానే ఈ కల వచ్చిందా?’ అని మళ్లీ రెట్టించాడు. రాజుగారు ఎంతో ఆతృతతో అవునని తలూపారు. దానికా నిపుణుడు ‘‘రాజుగారూ మీకు శుభాకాంక్షలు’’ చెప్పగానే.. రాజుగారు ‘‘దేనికి శుభాకాంక్షలు:’’ అని ఎంతో ఆతృతతో అడిగారు. దానికా నిపుణుడు ‘‘మీ ఆయుష్షు సుదీర్ఘమైనది. మీ కుటుంబంలో అందరికంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు’’ అని కల అర్థాన్ని వివరించాడు. రాజుగారు అతను చెప్పిన జోస్యానికి ఎంతో మెచ్చుకున్నారు. ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. నిజానికి మిగతా ఇద్దరు జ్యోతిష్యులు చెప్పింది కూడా ఇదే అయినప్పటికీ చెప్పే తీరులో వ్యత్యాసముంది. కొందరి మాటలతో మనస్సుకు గాయాలవుతాయి. మరికొందరి మాటలు ప్రేమను పంచి హృదయాలను గెలుచుకుంటాయి. – ముజాహిద్ -
నిద్ర ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడమా?
కంటి నిండా నిద్ర పట్టకపోతే.. ఎంత చికాకో మనకు తెలియంది కాదు. పైగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి హేతువు అవుతుంది. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈగలపై జరిగిన ఈ ప్రయోగం ద్వారా నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం కావచ్చునని స్పష్టం చేసింది. తినే ఆహారం, పీల్చేగాలి... పరిసరాల్లోని వాతావరణం వంటి అనేక కారణాల వ్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువవుతాయని.. ఇవి కాస్తా వాపు/మంటకు దారితీసి చివరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ సమయం మాత్రమే నిద్రపోయే ఈగలను ఎన్నుకున్నారు. వీటన్నింటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వీరు.. మిగిలిన వాటితో పోల్చి చూడటం ద్వారా నిద్ర ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుందన్న అంచనాకు వచ్చారు. నిద్రలేమి కారణంగా అల్జైమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్స్ వంటి వ్యాధులు వస్తాయని, నిద్రతక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుందని తమ అధ్యయనం స్పష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ఎల్జీ ఆఫీసులో కేజ్రీవాల్ నిద్ర
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వినూత్న రీతిలో ఆందోళనకు దిగి సంచలనం సృష్టించారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కార్యాలయం వద్ద మంత్రివర్గ సహచరులతో కలసి రాత్రి నిద్ర చేశారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విరమణ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రులు గోపాల్ రాయ్, జైన్.. ఎల్జీ అనిల్ బైజాల్ను కలిశారు. ఆయన వారి డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాత్రి ఎల్జీ కార్యాలయంలోనే నిద్రించి నిరసన తెలిపిన కేజ్రీవాల్.. వాటికి ఆమోదం తెలిపేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదన్నారు. ఇదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీ ప్రజల కోసమే ఆందోళన: కేజ్రీవాల్ ఈ సందర్భంగా కేజ్రీవాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ’నా కోసం ఆందోళన చేయడం లేదు, ఢిల్లీ ప్రజల కోసమే చేస్తున్నా’ అని అన్నారు. ఎల్జీ ఆదేశాల మేరకే అధికారులు పనిచేయడం మానుకున్నారని, దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యంగా రేషన్, గుడిసెవాసులకు ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజోపయోగ పనులు నిలిచిపోయాయని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము సమ్మె చేయడం లేదని, రోజువారీ పనులు చేస్తూనే ఉన్నామని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కారణం లేకుండానే చేస్తున్న ఆందోళన ఇదని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కేజ్రీవాల్ అకారణంగా ఆందోళన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ విమర్శించారు. మరోవైపు, కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరుల అనూహ్య ధర్నతో ఎల్జీ ఆఫీసు వెలుపల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాజ్ నివాస్కు చేరుకునే రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఐఏఎస్ల వివాదమిదీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం కేజ్రీవాల్ సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఐఏఎస్లు నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఇదే సమయంలో వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయినా ఆందోళన బాట మాత్రం వీడలేదు. గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేసిన కేజ్రీవాల్.. పెరుగుతున్న విద్యుత్ బిల్లులపై షీలాదీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2012లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలియజేశారు. -
నిద్ర కరవైతే కోట్లు ఖర్చవుతాయి..
జనాలు సరిగ్గా నిద్ర పోకపోతే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది! ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి అనే సమస్య ఎక్కువవుతోందని.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందికి తగినంత నిద్ర లభించకపోగా.. మిగిలిన వారు వృత్తిపరమైన ఒత్తిడితో, సామాజిక, కుటుంబ కార్యకలాపాల కోసం నష్టపోతున్నారని.. ఇంకొందరు తెలిసో తెలియకో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు దాని ప్రభావం ఉత్పాదకతపై పడటంతోపాటు ఆరోగ్యసమస్యలకూ కారణమవుతోందని వీరు అంటున్నారు. తగినంత నిద్ర లేకపోతే త్వరగా కోపం రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ప్రతిస్పందించే సమయం తగ్గిపోవడం, సానుభూతి కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ రకమైన సమస్యలన్నింటి పర్యవసానాలు ఆర్థికంగా ఎలా ఉంటాయని ఆక్స్ఫర్డ్ సైంటిస్ట్లు లెక్కకట్టారు. ఆరోగ్య ఖర్చులు, ప్రమాదాల వంటి వాటి వల్ల వచ్చే ఖర్చులు వంటివన్నీ లెక్కకడితే ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 1788 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు వీరు తేల్చారు. ఈ నష్టం ఒక్క ఆస్ట్రేలియాలోనే దేశ జీడీపీలో 1.55 శాతం వరకు ఉందని అంచనా. -
నానో రోబోలతో రక్తశుద్ది...
నానో స్థాయి రోబోలతో రక్తంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో) శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అల్ట్రాసౌండ్ ధ్వనులతో నియంత్రించగల ఈ నానోరోబోలు అతిసూక్ష్మమైన బంగారు తీగలతో చేస్తారు. రక్తంలోని ప్లేట్లెట్లు, రక్తకణాల త్వచాలకు వీటిని జోడించినప్పుడు అవి విషపదార్థాలను నిర్వీర్యం చేసేస్తాయి. అంతేకాకుండా ఈ నానోరోబోలతో ఎంఆర్ఎస్ఏ వంటి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేయవచ్చునని.. కేవలం అల్ట్రాసౌండ్స్తో నియంత్రించే అవకాశం ఉండటం అదనపు ప్రయోజనమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు జోసెఫ్ వాంగ్, లియాంగ్ఫాంగ్ ఝాంగ్లు తెలిపారు. ఒకే రకమైన నానోబోట్లతో రకరకాల పనులు చేయించే లక్ష్యంతో తాము ఈ ప్రాజెక్టు చేపట్టామని, ప్లేట్లెట్లు బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుంటే.. ఎర్ర రక్త కణాలు విషపదార్థాలను నాశనం చేస్తాయని వారు వివరించారు. మనిషి వెంట్రుక కంటే దాదాపు 25 రెట్లు తక్కువ వెడల్పు ఉండే ఈ నానో రోబోట్లు రక్తంలో సెకనుకు 35 మైక్రో మీటర్ల దూరం ప్రయాణించగలవని, కేవలం అయిదు నిమిషాల్లో రక్త నమూనాల్లోని బ్యాక్టీరియా మూడు రెట్లు తక్కువైనట్లు తాము ప్రయోగాల ద్వారా గుర్తించామని వివరించారు. ప్రస్తుతం తమ ప్రయోగాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని... జంతువుల్లో నేరుగా పరీక్షించిన తరువాత రక్తశుద్ధి కోసం నానోబోట్లను మనుషుల్లోనూ వాడే అవకాశం ఉంటుందని చెప్పారు. నిద్ర తక్కువైతే... తిండి యావ పెరుగుతుంది! ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిళ్లు సకాలంలో నిద్రపోకపోకపోయినా.. సరైన నిద్ర లేకపోయినా అది కాస్తా తిండియావ పెంచేస్తుందని అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రిళ్లు చిరుతిళ్లు, జంక్ ఫుడ్కు అలవాటు పడటం వల్ల కొంత కాలం తరువాత ఊబయకాం, మధుమేహం వంటి వ్యాధులొచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని తాము అధ్యయన పూర్వకంగా తెలసుకున్నట్లు మైకేల్ ఎ.గ్రాండ్నర్ తెలిపారు. అమెరికా మొత్తమ్మీద కొంతమందిని ఎంపిక చేసుకుని తాము ఫోన్ ద్వారా కొన్ని వివరాలు సేకరించామని చెప్పారు. ఎంత కాలం నిద్రపోతున్నారు? సుఖ నిద్ర పడుతోందా? వేళకాని వేళలో ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి తిండి తింటున్నారు? వంటి వివరాలను పరిశీలించినప్పుడు 60 శాతం మంది రాత్రి తిండికి అలవాటు పడ్డామని చెబితే... మూడింట రెండు వంతుల మంది రాత్రిళ్లు సక్రమంగా నిద్ర పట్టడం లేదని చెప్పారని వివరించారు. నిద్ర తక్కువ కావడం జీవక్రియలపై ప్రభావం చూపుతుందని.. ఫలితంగా జంక్ఫుడ్ కావాలన్న కోరిక పెరిగేందుకు అవకాశముందని చెప్పారు. ఆరోగ్యానికి పౌష్టికాహారంతోపాటు సుఖమైన నిద్ర కూడా అవసరమని గుర్తిస్తున్న ఈ తరుణంలో ఈ అధ్యయనం ఎంతైనా అవసరమని.. రాత్రిపూట పనిచేసేవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేందుకూ దోహదపడుతుందని వివరించారు. త్రిఫల చూర్ణంతో ఆయుష్ణు పెరుగుతుందా? ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రముఖ స్థానముంది. జీర్ణసంబంధిత సమస్యలను తీర్చడంతోపాటు శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ఆయుర్వేద మందుకు కొన్ని రకాల బ్యాక్టీరియాను జోడిస్తే ఆయుష్షు కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు మెక్గిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మనిషితో ఎన్నో సారూప్యాలున్న జీవజాతి ఈగలపై తాము ప్రయోగాలు చేశామని, త్రిఫలతోపాటు ల్యాక్టోబాసిల్లస్ ప్లాంటారమ్, లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటమ్, బైఫైడోబ్యాక్టీరియా లాంగమ్ అనే మూడు బ్యాక్టీరియాను చేర్చి ఈగలకు అందించినప్పుడు వాటి జీవితకాలం దాదాపు 60 శాతం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంటున్నారు. ఈగలు సాధారణంగా 40 రోజుల పాటు బతికి ఉంటాయని, బ్యాక్టీరియాతో కూడిన తిఫల ఇచ్చినప్పుడు మాత్రం ఇవి 26 రోజులు ఎక్కువగా జీవించాయని సూసన్ వెస్ట్ఫాల్ అనే శాస్త్రవేత్త వివరించారు. వయసు మళ్లిన మనుషుల పేవుల్లో ఈ మూడు బ్యాక్టీరియా సంతతి తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారని వివరించారు. త్రిఫలతోపాటు పేవుల్లోకి చేరే బ్యాక్టీరియా అక్కడ మనకు మేలు చేసే సూక్ష్మజీవుల సంతతిని పెరిగేందుకు దోహదపడుతూండవచ్చునని వివరించారు. -
ఊబకాయంతో నష్టమా? లాభమా?
బరువు పెరిగినకొద్దీ మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి చుట్టుముడతాయని తరచూ వింటూ ఉంటాం. అందుకే బరువు తగ్గించుకునేందుకు నానా తంటాలూ పడుతూ ఉంటాం. అయితే కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో అవసరం కంటే ఎక్కువ బరువు ఉండటం లాభదాయకమే అని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాదాపు 15 ఏళ్ల క్రితం కిడ్నీ సమస్యలతో డయాలసిస్ చేయించుకుంటున్న వారి వివరాలు సేకరించినప్పుడు విచిత్రమైన అంశం ఒకటి బయటపడింది. ఆరోగ్యకరమైన బరువు ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటే.. ఊబకాయుల్లో అది తక్కువగా ఉంది. ఈ ఊబకాయ వైచిత్రిని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు పదేళ్లకుపైగా సమయం పట్టింది. ఒక్క కిడ్నీ సమస్యలకు మాత్రమే కాకుండా కొన్ని ఇతర వ్యాధుల విషయంలోనూ ఊబకాయం పాజిటివ్ ఫలితాలిస్తున్నట్లు తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నెదర్లాండ్స్లో సాధారణ సాంక్రమిక వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన దాదాపు 18 వేల మందిని పరిశీలించినప్పుడు ఇతరులతో పోలిస్తే ఊబకాయులు ఎక్కువకాలం జీవించినట్లు తెలిసింది. నుమోనియా, సెప్పిస్ వంటి విషయాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వెలువడటం గమనార్హం. వీటన్నింటిని బట్టి శాస్త్రవేత్తలు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. శరీరం తీవ్రంగా వ్యాధిగ్రస్తమైనప్పుడు అది అదనపు ఇంధనం కోసం ప్రయత్నిస్తుందని.. ఈ క్రమంలో తగినంత బరువు మాత్రమే ఉండేవారి కండరాలు బలహీనపడిపోతే.. ఊబకాయుల్లో మాత్రం ఇది చాలా తక్కువగా జరుగుతూంటుందని ఫలితంగా వారు బతికేందుకు ఎక్కువ అవకాశం ఏర్పడుతూండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫోన్లు, ట్యాబ్లెట్లతో నిద్రకు చేటే... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను పొద్దుపోయేంత వరకూ తెగ వాడేస్తున్నారా? అయితే మీకు నిద్రకు చేటు వచ్చినట్లే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని వినే ఉంటాంగానీ.. తాజాగా హార్వర్డ్లోని బోస్టన్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు కూడా దీన్ని ఇంకో అధ్యయనం ద్వారా స్పష్టం చేస్తున్నారు. ట్యాబ్లెట్లను ఇష్టమొచ్చినట్లు వాడుకొమ్మని చెప్పి కొంతమంది యువకుల నిద్రతీరును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త అంశాలు తెలిశాయి. ఈ గాడ్జెట్ల నుంచి వెలువడే శక్తిమంతమైన తెల్లటి వెలుగు మెలటోనిన్ రసాయన ఉత్పత్తిని తగ్గించిందని ఈ అధ్యయనానికి నేతత్వం వహించిన శాస్త్రవేత్త జీనీ డుఫీ తెలిపారు. స్క్రీన్స్ను దగ్గరగా ఉంచుకోవడం వల్ల తెల్లటి వెలుగు మన జీవ గడియారంపై దుష్ప్రభావం చూపుతుందని ఫలితంగా తగినంత నిద్ర పట్టదని జీనీ అంటున్నారు. ట్యాబ్లెట్లను విచ్చలవిడిగా వాడుకునే అవకాశం ఇచ్చిన తరువాత కొన్ని రోజులకు తాము వారిని మరోసారి పరీక్షించామని.. ఈసారి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఏవీ ఇవ్వకుండా కేవలం వార్తాపత్రికలు చదివేందుకు మాత్రమే అవకాశమిచ్చామని.. అప్పుడు వారు సుఖంగా నిద్రపోయినట్లు తెలిసిందని చెప్పారు. పడుకునే ముందు ట్యాబ్లెట్లు వాడే వారిలో మెలటోనిన్ ఉత్పత్తి కనీసం అరగంట తరువాత మాత్రమే జరుగుతున్నట్లు తెలిసిందని, పైగా నిద్రలోంచి మేల్కొన్న తరువాత గంట సేపటి వరకూ వారు చురుకుగా ఉండలేకపోయారని జీనీ వివరించారు. -
ఆఫీస్ టైంలో హాయిగా నిద్రపోవడం ఎలా?
న్యూయార్క్, అమెరికా : తీరిక లేని ఉద్యోగ జీవితంలో కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. ఇంట్లో ఆఫీస్ దిగులు. ఆఫీస్కు పోతే ఇంటి దిగులు ఇక నిద్రపోవడానికి టైమేది. ఇలా ఆలోచించే వాళ్ల కోసం అమెరికాలో ఓ చక్కటి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ‘నాప్ యార్క్ ’, ‘నాప్ క్లబ్స్’ల పేరిట ఉద్యోగుల్ని హాయిగా నిద్రపుచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి అక్కడి వ్యాపార సంస్ధలు. ఆఫీస్ టైంలో బ్రేక్ దొరకగానే రిలాక్స్ అవ్వడానికి చాలా మంది ‘టీ’, ‘కాఫీ’ తీసుకుంటారు. కానీ న్యూయార్క్ ఉద్యోగులు మాత్రం హాయిగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. ‘నాప్ యార్క్ ’, ‘నాప్క్లబ్స్’లు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి కాబట్టి పగలు, రాత్రి తేడా లేకుండా ఆఫీస్ టైంలో బ్రేక్ దొరికినపుడు కొంత డబ్బు చెల్లించి ఓ చెక్క గదిలో హాయిగా నిద్రపోవచ్చు. అసలే న్యూయార్క్ సిటీలో ప్రశాంతత భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు అందుకే ఉద్యోగులు నాప్ క్లబ్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 30 నిమిషాల పాటు సాగే ఈ నిద్ర కోసం 15 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సంపన్న వ్యక్తులకు, వేల డాలర్ల జీతాలు తీసుకునే వారికి 15 డాలర్లు పెద్ద ఖర్చు కాకపోయిన చిరుద్యోగులకు మాత్రం కొంత కష్టమే. రానున్న రోజుల్లో ఈ సదుపాయం అన్ని దేశాలలో అందుబాటులోకి వస్తుందేమో చూడాలి మరి. -
సభలో యెడ్డీ ప్రసంగిస్తున్న వేళ...
సాక్షి, బెంగళూరు: విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం కర్ణాటక సీఎం యెడ్యూరప్ప.. అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ సీరియస్గా కునుకు తీశారు. మరోవైపు ప్రమాణ స్వీకారం ముగిశాక భోజన విరామ సమయంలో సీఎల్పీ నేత సిద్ధరామయ్య కూడా ఆదమరిచి నిద్రపోయారు. ఓవైపు బలనిరూపణ గురించి కాంగ్రెస్-జేడీఎస్ నేతలంతా హడావుడి పడుతుంటే.. వాళ్లు కూల్గా కునుకు తీయటం విశేషం. ఇంకోవైపు సోషల్మీడియాలో వాళ్ల ఫోటోలపై జోకులు పేలుతున్నాయి. ఏదైతేనేం తమ వద్ద తగినంత బలం లేదని ఒప్పుకున్న యడ్యూరప్ప చివరకు ఓటమిని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కునుకు తీస్తూ.. కెమెరాకి చిక్కిన సీఎం
గుల్బర్గా : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిరంగ సమావేశాలంటే.. జోలపాటలా అనిపిస్తాయేమో..! ఇప్పటికే చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో కునికిపాట్లు తీస్తూ కన్పించారు. తాజాగా సోమవారం గుల్బర్గాలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సైతం సిద్ధరామయ్య కునికిపాట్లు పడుతూ మీడియా కంటికి చిక్కారు. ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న ఈ సమయంలో సిద్దరామయ్య మాత్రం ఇలా సభల్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటున్నారు. ఈ సారి జరగబోయే ఎన్నికలు ఇటు కాంగ్రెస్కు, అటు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. పార్టీల మధ్య ప్రచారాల పోరు కూడా తారాస్థాయిలోనే ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉన్న సిద్ధరామయ్య మాత్రం ఈ సారి ఎన్నికలను సీరియస్గా తీసుకోకుండా ప్రచార సభల్లోనే నిద్రపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య నిద్ర పోవడాన్ని గమనించిన పక్కనే ఉన్న ఓ నాయకుడు చెవి దగ్గర ఏదో చెప్పడంతో నిద్రలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రచార సభలోను సిద్ధరామయ్య కునికిపాట్లు
-
పాప ఇంతగా నిద్రపోతోంది... ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య చాలా ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి లేపినా కూడా లేవడం లేదు. డాక్టర్ను సంప్రదించాం. మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. పాప ఇలా అతిగా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? తగిన సలహా ఇవ్వండి. – వనజ, పాడేరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి పాప నిద్రపోవాల్సిన సమయం కంటే చాలా ఎక్కువ సేపు పడుకుంటోందని చెప్పవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. రంగులరంగుల ఆహారం తీసుకోవచ్చా? మా పాప బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా? – కె. దీక్ష, హైదరాబాద్ ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్లో సన్సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. - డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
పగటి నిద్ర ఒంటికి చేటు కాదు!
మీరు ఒళ్లు తెలియకుండా నిద్ర పోయి ఎంతకాలమైంది? పడుకోగానే నిద్రలోకి జారిపోతాను అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టవంతులే. లేదంటే మాత్రం మూడొంతుల ప్రపంచ జనాభాలో మీరూ ఒకరు. నిద్రలేమి ఉందంటే.. ఉదయాన్నే చిటపటలాడే ముఖంతో లేవాలి.. రోజంతా చిర్రుబుర్రులాడుతూ ఉండాలి. పనులపై శ్రద్ధ తగ్గిపోతుంది..! అబ్బో ఇలాంటి సమస్యలు బోలెడున్నాయి లెండి. మరి.. తరుణోపాయం ఏమిటంటారా? ఎంచక్కా రోజుకు రెండుసార్లు కునుకేస్తే సరి అంటున్నారు నిపుణులు! సాధ్యాసాధ్యాలను కాసేపు పక్కన పెట్టేసి.. ఈ ఆలోచన వెనుక ఉన్న తర్కం ఏమిటో చూసేయండి! రాత్రిపూట ఏకంగా 8 గంటలకు బదులుగా నాలుగు గంటల చొప్పున రెండుసార్లు నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మిగిలిన సమయమంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండేందుకు.. సృజనాత్మకత పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. దీనివల్ల మన శరీర గడియారానికి మేలు జరుగుతుంది. ఇంకో విషయం.. ఇదేదో కొత్త విషయమేమీ కాదు. మనిషి విద్యుత్తును ఉత్పత్తి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రమే రాత్రిపూట నిద్రకు అలవాటు పడ్డాడని అంటున్నారు సోమ్నాలజిస్టులు! అదేనండి.. నిద్రపై పరిశోధనలు చేసే వైద్యులు, శాస్త్రవేత్తలు! నడుం వాల్చడం అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో మధ్యాహ్నం కాసేపు పడుకున్నాడని తెలిస్తే.. అతడిని బద్ధకిస్టుగా ముద్ర వేయడం ఖాయం. ఈ కాలపు ఉద్యోగాలతో రోజుకు రెండుసార్లు నిద్రపోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అయితే ఎలాగోలా వీలు చేసుకుని మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చగలిగారనుకోండి.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల రోజంతా క్రియాశీలత, నైపుణ్యం, చురుకుదనం పెరుగుతుంది. నిద్రలేమిని అధిగమించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. రోజువారీ జీవనంలో భాగంగా మధ్య మధ్యలో నిద్ర పోవడం వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే తత్వం పెరగడంతో పాటు, రోజంతా మంచి మూడ్లో ఉంటారని 1990ల్లోనే థామస్ వెహర్ అనే మానసిక వైద్యుడు అధ్యయనాల ద్వారా స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా ఒకే పర్యాయం దీర్ఘకాలం పాటు మేల్కొనడం/నిద్ర వంటివి ఉంటే రోజు గడిచే కొద్దీ ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆలోచించుకోండి మరి.. –సాక్షి హైదరాబాద్ ఐరోపాలో పుట్టింది.. రాత్రిపూట ఏకబిగిన ఎనిమిది గంటల పాటు నిద్రపోవడమన్న అలవాటు 1700 సంవత్సరం ప్రాంతంలో ఐరోపా దేశాల్లో మొదలైందని అంచనా. విద్యుదుత్పత్తి మొదలైన తర్వాత కృత్రిమ వెలుగులు అందుబాటులోకి రావడంతో ఉత్తర ఐరోపాలోని ఉన్నత వర్గాలు ఈ అలవాటు చేసుకున్నాయని ఆ తర్వాత ఇది పాశ్చాత్య దేశాలకు విస్తరించిందని చరిత్రకారుడు ఎ.రోజర్ ఇకిర్చ్ అంటున్నారు. అంతకంటే ముందు.. దినచర్యలన్నీ సూర్యుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండేవి. శారీరక వ్యవస్థ కూడా అందుకు తగ్గట్టుగా పనిచేసేది. అప్పట్లో రాత్రి 7–8 గంటల కల్లా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున రెండు, మూడు గంటలకే లేచి రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నడుం వాల్చడమన్నది రివాజుగా ఉండేదని మనకూ తెలుసు. అయితే పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక నిద్రపోయే సమయం తగ్గిపోయింది. నిద్రను నియంత్రించుకోవడమూ మొదలైంది. పనివేళలు పెరిగిపోవడం.. ఇల్లు.. కార్యాలయాల మధ్య ప్రయాణానికే ఎక్కువ సమయం ఖర్చయిపోతుండటం వల్ల నిద్రలేమి ఎక్కువవుతోంది. జీవనశైలి మార్పులు, రాత్రి, పగలు తేడా తెలియనంత స్థాయిలో కృత్రిమ కాంతులు పెరిగిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చాయి.