-
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతల స్వీకరణ
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి (ఈవో)గా జె.శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఈవో (ఎఫ్ఏసీ) ఎ.వి.ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం సతీమణితో కలిసి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆయనకు స్వామి విశిష్టతను తెలిపారు. దర్శనం అనంతరం ఈవోని వేద పండితులు ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. దీనికిముందు సంప్రదాయాన్ని అనుసరించి ఈవో తొలిగా వరాహస్వామిని దర్శించుకుని క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీవీఎస్వో నరసింహకిషోర్, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాంహైందవుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల అని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీస్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారన్నారు. ఈవోగా పనిచేసే భాగ్యం దక్కడం తన అదృష్టమని, స్వామి ఆశీస్సులతో ఈ మహాద్భాగ్యం దక్కిందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన సాగేలా చర్యలు చేపడతామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ టెంపుల్ తిరుమల అని గుర్తుచేశారు. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషంగా తిరుగుప్రయాణం అవ్వాలనే ప్రయత్నం చేస్తానన్నారు. ఆగమశాస్త్రం అనుసారం శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారి ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేకదృష్టి ఉందన్నారు. టీటీడీ నిధులు దుబారా కాకుండా సక్రమంగా వినియోగిస్తామని చెప్పారు. గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడతామన్నారు. అలాంటి చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన ఈవో తనిఖీలుటీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్యామలరావు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లో భక్తులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల వద్ద పారిశుధ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిరోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు. క్యూలైన్ల వద్ద భక్తులకు అందించే తాగునీటిని పరిశీలించి ల్యాబ్కు పంపించాలని అధికారులకు సూచించారు. హెల్త్ విభాగంలో ఇద్దరు అధికారులకు మెమో జారీచేసే యోచనలో ఉన్నారు. తనిఖీల అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ.. క్యూలైన్లలో ఆహారం, తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. నీటిలో కొంత మట్టిలాంటి పదార్థం ఉన్నట్లు గుర్తించామని, నీటిని ల్యాబ్ టెస్టింగ్కు పంపించామని తెలిపారు. క్యూలైన్లో పాలను సరిగ్గా ఇవ్వడం లేదని ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై విచారిస్తామన్నారు. కాలిబాటలో టికెట్లు ఇవ్వడం లేదని భక్తులు ఫిర్యాదు చేశారని, దీనిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. క్యూలైన్ల పైన కూడా సమీక్షించి భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. -
టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
సాక్షి,తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావు ఆదివారం(జూన్16) బాధత్యలు స్వీకరించారు. సంప్రదాయం ప్రకారం ఆయన ముందుగా వరాహస్వామిని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి శ్యామలరావుకు ఛార్జ్ ఇచ్చారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. జేఈవోలు తీర్థప్రసాదాలు అందించారు. -
టీటీడీ కొత్త ఈవోగా జె.శ్యామలరావు నియామకం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి బదిలీ అయ్యారు. -
అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం: శ్యామలరావు
సాక్షి, హైదరాబాద్: జలసౌధలో సోమవారం కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని అంశాల అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ ఇరిగేషన్ అధికారులు హాజరు కాగా.. తెలంగాణ అధికారులు మరోసారి గైర్హాజరయ్యారు. జలసౌధలో నిర్వహించిన సమావేశంలో ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు మాట్లాడుతూ.. ‘‘నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నాం. కేఆర్ఎమ్బీ, జీఆర్ఎమ్బీ బోర్డు సమావేశంలో అధికారుల నియామకం.. సదుపాయాల కల్పనపై చర్చించాం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గెజిట్లో మార్పులు కోరుతున్నాం. షెడ్యూల్ 1,2,3లో మార్పులు చేయాలని కోరుతున్నాం..అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలుకు సహకరిస్తాం’’ అన్నారు. -
తటస్థులతోనే తనిఖీ కమిటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించిన తరువాతే ప్రాజెక్టుల తనిఖీకి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 22న కేంద్ర జల్ శక్తి శాఖ రాసిన లేఖలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేశామని గుర్తు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల్లో ఛైర్మన్, సభ్యులు, సీఈలుగా ఇరు రాష్ట్రాలకు చెందని అధికారులను మాత్రమే నియమించాలని కేంద్ర జల్ శక్తి శాఖ గత నెల 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనటాన్ని గుర్తు చేసింది. కానీ రాయలసీమ ఎత్తిపోతల తనిఖీకి నియమించిన కమిటీలో తెలంగాణకు చెందిన దేవేందర్రావును సభ్యుడిగా నియమించారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్కు లేఖ రాశారు. బోర్డు నియమించిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను ఈనెల 5న పరిశీలిస్తుందని, అందుకు ఏర్పాట్లు చేయాలంటూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే సోమవారం శ్యామలరావుకు లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే కమిటీ ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల ప్రకారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాకే తనిఖీ కమిటీని నియమించాలని కృష్ణా బోర్డును మరోసారి కోరింది. తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, నెట్టెంపాడు సామర్థ్యం పెంపు, కల్వకుర్తి సామర్థ్యం పెంపు, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొంది. వీటి తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా మొదట చేపట్టిన ప్రాజెక్టులను తొలుత తనిఖీ చేసి ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించాలని సూచించింది. -
నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుంది: శ్యామలరావు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతుందన్నారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. అయితే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని శ్యామలరావు గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అన్నారు శ్యామలరావు. ప్రాజెక్ట్ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు శ్యామలరావు. దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు శ్యామలరావు. -
అదే పేరు.. అవే పోలికలు... అందుకే...
నిందితుడని అదుపులోకి తీసుకున్న హిమాచల్ ప్రదేశ్ పోలీసులు విచారణ అనంతరం వదిలేసిన వైనం బతుకు జీవుడా అంటూ గ్రామానికి చేరుకున్న బాధితుడు గంగావతి : ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదే పేరు.. అవే పోలికలతో ఫేస్బుక్లో ఫొటో కన్పించింది. ఇంకేముంది.. నిందితుడనుకుని అరెస్ట్చేశారు. విచారణ అనంతరం కాదని తెలుసుకుని వదిలివేశారు. దీంతో బాధితుడు బతుకుజీవుడా అంటూ స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో అక్లండ్ హోటల్ నిర్వహిస్తున్న సూద్ దంపతులను అదే హోటల్లో పనిచేసే శ్యామలరావు 2001లో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అక్కడి జిల్లా న్యాయస్థానం 2004 మే 17న శ్యామలరావుకు ఉరిశిక్ష విధించింది. అయితే..అతను సహన సెంట్రల్ జైలు నుంచి అదే ఏడాది ఆగస్టులో తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఫేస్బుక్లో అదే పేరు, పోలికలతో ఫొటో కన్పించింది. దాని ఆధారంగా ఈ నెల 6న కర్ణాటక రాష్ట్రం గంగావతి తాలుకా విద్యానగర్కు వచ్చారు. శ్యామలరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని హిమాచల్ ప్రదేశ్కు తీసుకెళ్లారు. అక్కడ సుదీర్ఘ విచారణ అనంతరం శ్యామలరావు వెంట్రుకలు, ఎత్తు, తండ్రి పేరు పరిశీలించి అపరాధి కాదని నిర్ధారించారు. గురువారం ఇంటికి తిరిగి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా..విద్యానగర్లో స్థిరపడిన చీకట్ల శ్యామలరావుది తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం. కొన్నేళ్ల క్రితమే ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు.