-
ఇంట్లోకి దూసుకెళ్లిన బైక్.. మొబైల్ చూస్తూ కూర్చున్న మహిళ, అక్కడే ఉన్న కుక్క షాక్!
Motorcycle Crashed Into A Shop: ఇంతవరకు మనం చాలా రకాల ప్రమాదాలను చూసి ఉన్నాం. చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్లను కూడా చూశాం. అయితే కొద్దిమంది మాత్రమే ఎలాంటి గాయాలపాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అచ్చం అలాంటి ఘటనే వియాత్నంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...వియాత్నంలోని హో చి మిన్లో ఒక వ్యక్తి నడుపుతున్న మోటారు బైక్ అదుపు తప్పి ఓ ఇంట్లోని లివింగ్ రూమ్లోకి దూసుకెళ్లింది. దీంతో లివింగ్ రూమ్లో మొబైల్ చూస్తూ కూర్చున్న ఓ మహిళకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్కీగా ఆమె వెంటనే తేరుకుని ఒక్క ఉదుటున వెనక్కి జరగడంతో దూసుకొచ్చిన బైక్ ఆమెకు కొద్ది దూరంలో ఎగిరిపడింది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క సైతం ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే! ఇక బైక్తోపాటు దాని రైడర్ కూడా వెళ్లకిలా పడి చచ్చాన్రా దేవుడో అని నడుము పట్టుకున్నాడు. స్వల్ప గాయాలతో అతను బయటపడటం, ఆ మహిళకు, కుక్కకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆ బైక్ ఎందువల్ల అదుపుతప్పి ఇంట్లోకి దూసుకు వచ్చిందో తెలియలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
మరోదారి లేదు.. ఊరి చివరకు ‘కొట్టు’కెళ్లారు..
సాక్షి, అమరావతి: గతంలో జాతీయ, ఇతర ప్రధాన రహదారుల వెంబడి అక్కడక్కడా దాబాలు కనిపించేవి. ప్రయాణికులు నులక మంచాలపై కూర్చుని.. చెక్క బల్లలపై పెట్టిన ఆహారాన్ని ఆరగించే దృశ్యాలు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర.. రోడ్లపక్కన వెలిసిన దుకాణాలు కన్పిస్తున్నాయి. ఇది కోవిడ్ తెచ్చిన మార్పు. 2020 మార్చి తర్వాత కోవిడ్ మహమ్మారి కారణంగా చితికిపోయిన చిరు వ్యాపారులు కనుగొన్న ఉపాధి మార్గమిది. లాక్డౌన్తో మొదలై.. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో వైరస్ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూరగాయల షాపులు సైతం మూతపడ్డాయి. ఆ తరువాత లాక్డౌన్ సడలించినప్పటికీ వైరస్ భయంతో మార్కెట్కు వెళ్లేందుకు జనం కూడా భయపడే పరిస్థితి నెలకొంది. అలా అని ఇంటింటికీ వెళ్లి విక్రయాలు చేద్దామంటే.. వైరస్ మోసుకొస్తారనే భయం వెంటాడేది. ఇలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారులు బాగా చితికిపోయారు. గత్యంతరం లేని స్థితిలో వారు రోడ్డు బాట పట్టారు. జాతీయ రహదారులే కాకుండా.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరి చివర రోడ్ల పక్కన చిన్నపాటి షాపులు పెట్టుకుని అమ్మకాలు సాగించారు. అటుగా పోయే ప్రయాణికులు ఆగి అవసరమైన వాటిని అప్పటికప్పుడు కొనుగోలు చేసుకుని వెళ్లడంతో ఈ ట్రెండ్కు ఆదరణ లభించింది. ఫలితంగా జాతీయ రహదారుల పక్కన కూరగాయలు, పండ్లు, ఎండు చేపలు, పచ్చి చేపలు, రొయ్యలు, తినుబండారాలు, ఇతర నిత్యావసర సరుకుల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఏ రోజు వ్యాపారం ఆ రోజే కావడంతో అక్కడ తాజా పండ్లు, కూరగాయలు దొరుకుతున్నాయని, అవసరమైనప్పుడు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా కష్టకాలంలో చిరు వ్యాపారులు పాటిస్తున్న ఈ ఐడియా వారి కుటుంబాలను నిలబెడుతోంది. బతుకుదెరువు కోసమే ఈ ‘మార్గం’ నేను 16 ఏళ్లుగా కూరగాయలు అమ్ముతున్నాను. గతంలో భీమవరం మార్కెట్లో షాపు అద్దెకు తీసుకుని కూరగాయలు అమ్మేవాడిని. కరోనా ఫస్ట్వేవ్ నాటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. కరోనా ఉధృతి పెరగడంతో మార్కెట్కు వచ్చి కూరగాయలు కొనేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఇబ్బందులు పడ్డాం. చివరకు నిత్యం వాహనాలు తిరిగే రోడ్డు పక్కన కూరగాయల షాపు పెట్టాను. దారిన పోయేవారు వచ్చి కావాల్సిన కూరగాయలు కొనుక్కుని వెళ్తారు కాబట్టి అంతగా రద్దీ ఉండదు. ఊరి చివర ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి కార్లు, బైక్లు పార్కింగ్ చేసుకునేందుకు ఇబ్బంది లేదు. గతంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం రావడం లేదు. కానీ.. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. కరోనా దెబ్బకు కొత్త మార్గాన్ని ఎంచుకుని ఉపాధి చూసుకుంటున్నాం. – జవ్వాది దుర్గాప్రసాద్, కూరగాయల వ్యాపారి, విస్సాకోడేరు, పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు పైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తాం రెండేళ్లుగా కరోనా వైరస్ కలవరపెడుతూనే ఉంది. షాపులకు వెళ్లాలన్నా, మార్కెట్కు వెళ్లాలన్నా వైరస్ భయం వెంటాడుతోంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రోడ్డు పక్కన పెట్టిన కూరగాయలు, పండ్లు, ఇతర సరుకుల్ని అప్పటికప్పుడు కొనుక్కు తెచ్చుకుంటున్నాం. రోడ్డుపైనుంచే అందిపుచ్చుకుని వచ్చేస్తున్నాం. ఇబ్బందులకు తావు లేకుండా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటోంది. – శనివారపు శ్రీనివాస్, ఉండి అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా -
సెల్ఫోన్ చోరుల కొత్త పంథా..
సెల్ఫోన్ల దొంగలు రూట్ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్ పార్ట్స్గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పిక్పాకెటింగ్ గ్యాంగ్లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్ఫోన్ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగాయి. గల్లీ దుకాణాల కేంద్రంగానే.. అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్ఫోన్ పిక్పాకెటింగ్, స్నాచింగ్ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి ఫోన్లను స్పేర్పార్ట్స్గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. – నగర పోలీసు ఉన్నతాధికారి గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి... ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోన్కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్(ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. సదరు సెల్ఫోన్ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్ను వినియోగించి దానికి ఉన్న నెంబర్కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్పార్ట్స్గా మార్చేసి అమ్ముతున్నారు. ఐఎంఈఐ నెంబర్ అనేది ఫోన్ మదర్ బోర్డ్కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్ఫోన్ దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్ఫోన్ రిపేరింగ్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ► కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి. ► ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం. ► ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు. ► నగరంలో జగదీష్ మార్కెట్ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దేశంలో చోరీ మాల్కు కేరాఫ్ అడ్రస్ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్ మాల్ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం. -
నిజాయితీకి లభించిన బహుమానం
రామాపురం అనే గ్రామంలో కిరాణా వ్యాపారస్తుడైన సుబ్బయ్యకు నిజాయితీపరుడు అనే పేరుంది. వయసు మీదపడటంతో సుబ్బయ్య తప్పుకుని తన కొడుకు రాజేశ్కి వ్యాపారాన్ని అప్పగించాడు. సుబ్బయ్య కిరాణా వ్యాపారం చేసేటప్పటి నుండి ఆ దుకాణంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వీరయ్య.. రాజేశ్కి కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే రాజేశ్ హాయంలో కూడా కిరాణా వ్యాపారం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది. అయితే వీరయ్యకి కూడా వయసు మీద పడటంతో కొంతకాలానికి పని మానివేశాడు. దాంతో రాజేశ్కి తన కిరాణా దుకాణంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైన పనివాడి అవసరం పడింది. పనివాని ఎంపికలో రాజేశ్, తన తండ్రి సలహా కోరాడు. ఆ విషయాన్ని సుబ్బయ్య తన స్నేహితులకి చెప్పటంతో వాళ్ళు తమకు తెలిసిన పనివాళ్ళని సుబ్బయ్య దగ్గరకి పంపారు. అనేక రకాల వడపోతల తర్వాత తమ కిరాణా వ్యాపారంలోకి ఉపయోగపడతారు అనుకునే ఇద్దరిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు సుబ్బయ్య. వారిద్దరి పేర్లు వినయ్, సతీశ్. ‘ఆ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేసుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి అప్పగించిన పని వాళ్లు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నిశితంగా పరిశీలించ’మనీ రాజేశ్కి వివరించాడు సుబ్బయ్య. ముందుగా వినయ్ని పిలిచి ‘నెలకు ఎంత జీతం కావాలి?’ అని అడిగాడు సుబ్బయ్య. ‘తమరు ఎంత ఇస్తే అంతే చాలు బాబయ్యా!’ సమాధానమిచ్చాడు వినయ్. ‘సరే..ఓ రెండు రోజులు కిరాణా దుకాణంలో ఉండి చెప్పిన పనులు చేయి, దాన్ని బట్టే నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు. ‘అయితే రేపే వచ్చి పనిలో చేరతాను’ అని వినయ్ సెలవు తీసుకున్నాడు. ‘రేపు వినయ్ దుకాణానికి వచ్చాక ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో చూపించి అప్పుడప్పుడు గల్లా పెట్టెకి తాళం వేసి ఇంట్లోకి వెళ్లొస్తూ ఎవరైనా సరుకులకు వస్తే ఆ ప్యాకెట్స్ పై ఉన్న ధర తీసుకుని, ఆ డబ్బుని నీకు ఇమ్మని చెప్పు. అలాగే చిల్లర ఒక పదిరూపాయలు పైన ఉంచు’ అంటూ రాజేశ్కి సలహా ఇచ్చాడు సుబ్బయ్య. మరుసటి రోజు వినయ్ వచ్చాక తండ్రి చెప్పినట్లే చేశాడు రాజేశ్. మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్లొచ్చినప్పుడల్లా తను ఏఏ వస్తువులను అమ్మాడో, ఎంత డబ్బు వచ్చిందో రాజేశ్ చేతికిచ్చేవాడు వినయ్. ఆ విషయాన్నే రాత్రి తండ్రికి చెప్పాడు రాజేశ్. ‘రేపు వినయ్ వచ్చాక నా దగ్గరకు పంపించు’ అని చెప్పాడు సుబ్బయ్య. అతను చెప్పినట్టే మరుసటి రోజు వినయ్ రాగానే అతనిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజేశ్. వినయ్ని ఉద్దేశించి సుబ్బయ్య ‘ఈ రోజు మన ఎలక్ట్రానిక్ కాటాని ఉపయోగించి సరుకులు అరకేజీ, కేజీల చొప్పున ఆ కవర్లలో ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేసేటపుడు అరకేజీ ప్యాకెట్లలోంచి ఓ పది గ్రాముల చొప్పున, కేజీ ప్యాకెట్లలోంచి ఇరవై గ్రాముల చొప్పున ఆ సరుకులు తీసేసి ప్యాక్ చేయాలి. తెలిసిందా? ఈవాళ్టికి అరకేజీ ప్యాకెట్లు ఒక అయిదు, కేజీ ప్యాకెట్లు ఒక అయిదు ప్యాక్ చేసి తరువాత కొట్లో పనిచూసుకో’ అని పురమాయించాడు. ‘అలాగేనండి’ అంటూ సుబ్బయ్య చెప్పినట్లుగానే ప్యాక్ చేసి వాటిని సుబ్బయ్యకి అప్పజెప్పి కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయాడు వినయ్. ఈ వ్యవహారాన్నంతా రాజేశ్ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ రోజు పని పూర్తి అయిన తరువాత వినయ్ని పిలిచి ఆ రెండురోజులకు ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి, తరువాత రెండు రోజులు సతీశ్ పనితీరును కూడా పరిశీలించి , ఇద్దరి పనితీరును బేరీజు వేసుకుని కబురు చేస్తానని పంపించివేశాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సతీశ్కి కబురుపెట్టాడు. వినయ్ని అడిగినట్టే సతీశ్నీ అడిగాడు సుబ్బయ్య ‘ నెలకు ఎంత జీతం కావాలి?’ అని. ‘మూడువేలు ఇవ్వగలిగితే చేయగలను’ బదులిచ్చాడు సతీశ్. వినయ్కి చెప్పినట్లుగానే ‘సరే, ఒక రెండు రోజులు కిరాణా దుకాణంలో చెప్పిన పనులు చేశాక దానిని బట్టి నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు సుబ్బయ్య. ‘సరేనండి, రేపే వచ్చి పనిలో చేరతాను’ అంటూ సెలవు తీసుకున్నాడు సతీశ్. అప్పుడు రాజేశ్తో ‘వినయ్ విషయంలో మొదటి రోజు ఏం చెప్పి చేయమన్నానో,అలాగే సతీశ్కీ చెప్పి చేయించు’ అన్నాడు సుబ్బయ్య. మరుసటి రోజు సతీశ్ రాగానే సుబ్బయ్య చెప్పినట్టే చేసి.. జరిగినదంతా ఆ రోజు రాత్రి తండ్రికి వివరించాడు రాజేశ్. ‘రేపు సతీశ్ రాగానే నా దగ్గరకు తీసుకురా’ అని రాజేశ్కి పురమాయించాడు సుబ్బయ్య. తండ్రి అడిగినట్టుగానే తెల్లవారి సతీశ్ రాగానే అతణ్ణి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు రాజేశ్. తూకం, ప్యాకింగ్ విషయంలో వినయ్కి పురమాయించినట్టే సతీశ్కీ పురమాయించాడు సుబ్బయ్య. విన్నవెంటనే సతీశ్ ‘ఇటువంటి పనులు నేనెంత మాత్రం చేయను, చేయలేను. నిన్న పనిచేసినందుకు గానూ వందరూపాయలు ఇప్పించండి వెళ్ళిపోతాను’అన్నాడు. ‘సరే, ఈ పని చేయవద్దులే. నువ్వు అడిగినట్లే మూడువేల రూపాయలు ఇస్తాను. నిన్నటి నుంచి నువ్వు పనిలో చేరినట్లే. పో.. పోయి కొట్లో పనులు చూసుకో’ అన్నాడు సుబ్బయ్య. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజేశ్తో ‘రానవసరంలేదని వినయ్కి కబురు పెట్టు’ అని సుబ్బయ్య అనడంతో కొడుకు విస్తుపోయాడు. ‘అదేంటి జీతం ఎంతిస్తే అంతకు ఒప్పుకొని, చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసిన వినయ్ని వద్దని కరాఖండిగా ఇంత జీతం ఇవ్వమని అడగటమే కాకుండా, చెప్పిన పని చేయనని తృణీకరించిన సతీశ్ని పనిలో పెట్టుకున్నారేంటి ’ అని తండ్రిని అడిగాడు రాజేశ్. ‘వినయ్ పనిచేసిన రెండురోజుల్లో మొదటిరోజు కొట్లో నువ్వు లేనప్పుడు సరుకులు కొనమని నా స్నేహితున్ని పంపి ‘మా కొట్లో పనిచేసే వాడిని ముప్పై రూపాయల పంచదార ప్యాకెట్ ఇవ్వమని అడిగి నలభైరూపాయలు ఇచ్చి ‘ఇవిగో ముప్పై రూపాయలు..సరిగా చూసుకో’ అని చెప్పమన్నాను. ‘పొరపాటున పది రూపాయలు ఎక్కువిచ్చేశారు’ అని వెనక్కి ఇచ్చేసినా లేదూ చూసుకుని కూడా తిరిగి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా వచ్చి నాకు చెప్పమన్నాను. వినయ్ అతనితో ‘సరిపోయింది’ అని చెప్పి నీకు డబ్బు అప్పచెప్పేటప్పుడు ఆ పదిరూపాయలను తన దగ్గరే ఉంచేసుకున్నాడు. అలాగే రెండో రోజు నేను చెప్పినట్లుగా అది తప్పు పనైనా ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు వినయ్. జీతం ఎంతిస్తే అంతే చాలనుకునే దాని వెనుక.. ఇదుగో ఇటువంటి మోసాలు చేస్తూ సంపాదించుకోవచ్చన్న ధీమా అన్నమాట. అదే సతీశ్ విషయానికొచ్చేసరికి మొదటిరోజు నా స్నేహితుడు పదిరూపాయలు ఎక్కువ ఇస్తే పదిరూపాయలు ఎక్కువ ఇచ్చారని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, రెండో రోజు నేను చెప్పిన అవినీతి పనిని చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడక తన ఒక రోజు కష్టానికి మాత్రమే ప్రతిఫలం ఇమ్మని అడిగాడు. ఇక నిక్కచ్చిగా ఇంతే జీతం ఇవ్వమని అడగడానికి కారణం అతని నిజాయితీయే. అటువంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడే మనకు కావలసినవాడు. అందుకే అతనిని పనిలోకి తీసుకున్నది’ అని చెప్పిన తండ్రి వివరణకు అబ్బురపడ్డాడు రాజేశ్. -
బీరు బాటిల్లో సిరంజి
సాక్షి, కుషాయిగూడ(హైదరాబాద్): కాప్రాలోని ఓ బార్ కు వెళ్లి ఓ వ్యక్తి బీరు ఆర్డర్ చేశాడు. బేరర్ బీరు తీసుకొచ్చి ఓపెన్ చేసి ఆ వ్యక్తి ముందు పెట్టారు. బీరు తాగుతున్న వ్యక్తికి నోటిలో ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే తేరుకొని చూడగా బీరు బాటిల్లో సిరంజిని చూసి కంగు తిన్నా డు. ఇదేమిటని బార్ నిర్వాహకులను నిలదీసి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం రాత్రి మహాంకాళి బార్లో చోటు చేసుకున్న ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
మామూలు చాయ్వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్వాలి', ఎక్కడంటే?
మీరు జీవితంలో ఏదైనా విభిన్నమైన పనిని చేయాలని నిశ్చయించుకున్నట్లయితే, అప్పుడు సాధ్యం కానిది అంటూ ఏది లేదు. మీ కలను నిజం చేసుకోవాలంటే మీరు చేసే ప్రతి పనిని ఇష్టపడాలి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. కోల్కతాకు చెందిన తుక్తుకి దాస్ దీనిని రుజువు చేశారు. తుక్తుకి దాస్ తన మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడానికి చాలా ప్రయత్నించింది, అయితే, ఆమె ఉద్యోగం సాధించలేకపోయింది. అయితే, అక్కడితో జీవిత ప్రయాణాన్ని ఆపకుండా.. ఏదైనా తనకు తెలిసిన పని చేయలని నిశ్చయించుకుంది. హబ్రా రైల్వే స్టేషన్లో టీ దుకాణాన్ని ప్రారంభించాలని అనుకుంది. కొద్ది రోజులకే తుక్తుకి దాస్ టీ దుకాణం 'ఎమ్ఏ ఇంగ్లీష్ చాయ్ వాలాయ్' పేరుతో ఆ నగరం అంతటా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం. ఉద్యోగ వేట తుక్తుకి దాస్ ఒక పేద కుటుంబంలో జన్మించింది. తుక్తుకి తండ్రి వ్యాన్ డ్రైవర్, ఆమె తల్లికి ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది. తుక్తుకి తల్లిదండ్రులు ఆమె ఉపాధ్యాయురాలిగా మారాలని ఆశించారు. వాళ్ల తల్లి, తండ్రుల కోరిక మేరకు ఆమె కష్టపడి చదివి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అనుకుంది. తుక్తుకి దాస్ రవీంద్రభారతి ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఆ తర్వాత కోల్కతా నగరంలో హాస్టల్లో నివసిస్తూ ఉద్యోగ వేట ప్రారంభించింది. తుక్తుకి దాస్ ఎంఎ డిగ్రీ చేసినప్పటికీ ఉద్యోగం పొందలేకపోయింది. ఆమెకు అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ ఏ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె తన ప్రయాణాన్ని అక్కడితో అపలేదు. ఉద్యోగం పొందడంలో విఫలమైన తుక్తుకి దాస్ టీ స్టాల్ తెరవాలని నిశ్చయించుకుంది. యూట్యూబ్లో ప్రఫుల్ బిల్లోర్ అకా 'ఎంబిఎ చాయ్వాలా' వీడియో చూసి ప్రేరణ పొందింది. ఆ తర్వాత తుక్తుకి దాస్ హబ్రా స్టేషన్ సమీపంలో ఒక చిన్న దుకాణాన్ని అద్దెకు తీసుకొని నవంబర్ 1, 2021న 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్వాలి' బ్యానర్ కింద తన సొంత టీ స్టాల్ ప్రారంభించింది. ఆమె టీ దుకాణం ఓపెన్ చేసిన మొదటి రోజున సంతోషానికి చిహ్నంగా కస్టమర్లలో చాలా మందికి ఉచితంగా టీని పంపిణీ చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఎంఎ ఇంగ్లీష్ చాయ్వాలా టీ దుకాణాన్ని ప్రారంభించే ముందు అందరికీ ఎదురైనట్లే ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. ఆమె తల్లిదండ్రులు టీ దుకాణాన్ని ప్రారంభించేందుకు ఒప్పుకోలేదు. మన బందువులు, స్నేహితులు నిన్ను చూసి ఏమి అనుకుంటారు. నువ్వు చదివిన చదువు ఏంటి, చేయబోయే పని ఏంటి అని ఆమెను అడిగారు. మిగతా వారి విషయం నాకు తెలీదు మీరు ఒప్పుకుంటే చాలు అని తన తల్లిదండ్రులతో అంది. ఒక మీడియాతో తుక్తుకి దాస్ తండ్రి మాట్లాడుతూ.. "మొదట్లో ఆమె నిర్ణయంతో నేను సంతోషంగా లేను, ఎందుకంటే ఆమె టీచర్ కావాలనే ఆశతో మేము ఆమెను చదివించాము. కానీ, ఆమె టీ అమ్మాలని కోరుకుంది. నేను పునరాలోచించి తర్వాత ఒకే చెప్పినట్లు" పేర్కొన్నాడు. ఉన్నత విద్యావంతులు ఇలాంటి టీ అమ్మే వ్యాపారం చేయడం. ఇదే మొదటిసారి కాదు. మధ్యప్రదేశ్ రైతు ప్రఫుల్ బిల్లోర్ ఈ రోజు 'ఎంబిఎ చాయ్వాలా'గా ప్రసిద్ధి చెందారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతను సీఏటిలో మంచి స్కోరు చేయలేకపోయాడు. ఆ తర్వాత అతను టీ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు, అతనికి దేశవ్యాప్తంగా 22 అవుట్ లెట్లు ఉన్నాయి. త్వరలో అంతర్జాతీయ అవుట్ లెట్ కూడా ప్రారంభించనున్నాడు. ఇలా చాలా మంది కరోనా లాక్డౌన్ సమయంలో తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వారు తమకు తెలిసిన, వచ్చిన పనిలో భాగ పేరు పొందారు. అందుకే, పెద్దలు చెబుతుంటారు ఒక చోట దారి మూసుకొని పోతే.. మన కోసం మరో చోట దారి తెరిచి ఉంటుంది అని. అంతేగానీ, ర్యాంక్ రాలేదని, ఉద్యోగం రాలేదని నిరాశ చెందుకుండా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. -
టీ కొట్టు నడుపుతూ.. రోజూ రూ.300 దాచిపెట్టి.. ఏకంగా 25 దేశాలు..
కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు. యాత్ర ఇలా ప్రారంభమైంది కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
ఎస్కలేటర్లో చిక్కుకున్న బాలిక
విశాఖ పట్నం: విశాఖ పట్నంలోని ఒక షాపింగ్మాల్కు వెళ్లిన కుటుంబానికి అనుకోని సంఘటన ఎదురైంది. పై అంతస్థులో షాపింగ్ చేయడానికి.. ఎస్కలేటర్పై వెళ్తున్న ఒక పాప డ్రెస్సు ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న ఎస్కలేటర్లో ఇరుక్కుంది. దీంతో బాలిక ఎటు కదల్లేక అక్కడే ఉండిపోయింది. దీంతో వెంటనే ఆ బాలిక తండ్రి షాపింగ్మాల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది బాలిక డ్రెస్సును బైటకు తీసి ఎస్కలేటర్ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో.. బాలిక క్షేమంగా బయటపడటంతో షాపింగ్కు వచ్చిన కస్టమర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ -
తుపాకీలతో పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం
-
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
కూల్ డ్రింక్ తాగిన మైనర్ బాలిక.. కాసేపటికే నీలిరంగులోకి..
చెన్నై: కూల్డ్రింక్ తాగిన ఒక మైనర్ బాలిక.. కాసేపటికే కిందపడిపోయి అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. చెన్నైలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బసంత్నగర్ ప్రాంతంలో జరిగింది. కాగా, తరణి, అశ్విని ఇద్దరు అక్కచెల్లెలు. వీరిద్దరు తమ కుటుంబంతో కలిసి బసంత్నగర్లోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో, 13 ఏళ్ల తరణి గడిచిన మంగళవారం(ఆగస్టు3)న మధ్యాహ్నం తమ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్కు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకుంది. కాసేపటి తర్వాత.. తరణి కూల్ డ్రింక్ తాగింది. అప్పటి వరకు బాగానే ఉన్న తరణి ఒక్కసారిగా కిందపడిపోయింది. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను ఎంత కదిలించిన ఉలుకు.. పలుకులేదు. ఈ అనుకొని ఘటనతో అశ్విని షాక్కు గురయ్యింది. కాగా, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు, హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో.. తరణిని పరీక్షీంచిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. యువతి శరీరం కూడా.. నీలిరంగులోకి మారింది. తరణి మృత దేహన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా, యువతి ఊపిరితిత్తులలో కూల్ డ్రింక్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పానీయంలో.. ఏదైన ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా.. అనే కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణంపై దాడిచేసి.. షాపును సీజ్ చేశారు. అక్కడ ఉన్న 540 కూల్డ్రింక్ బాటిల్స్ను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం లాబ్కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దుకాణంలో 17 కూల్డ్రింక్ బాటిల్స్ను అమ్మినట్లు గుర్తించారు. ఆ షాపును అధికారులు సీజ్ చేశారు. కాగా, ధరణి గతంలో అస్తమాతో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మాస్క్ చాటున మోసం.. తాగేందుకు మంచి నీళ్లు అడిగి..
సాక్షి, సత్తుపల్లి (ఖమ్మం): ఈ కరోనా కాలంలో అందరూ మాస్క్లు ధరించడం సహజమవడంతో.. ఓ మోసగాడు దొంగ తెలివి ప్రదర్శించాడు. సిద్ధారం గ్రామానికి చెందిన గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన చికెన్ సెంటర్ వద్దకు మాస్క్ ధరించిన గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి తనకు రూ.7వేలకు రూ.100, రూ.50 నోట్ల చిల్లర కావాలని అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ వెనుకనే ఆయన ఇంటి గుమ్మం వద్దకు వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపి అనుమానం రాకుండా చేశాడు. చిల్లర తీసుకున్నాక.. తాగేందుకు మంచినీళ్లు కావాలని అడగటంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా ఈ మోసగాడు తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే పరారయ్యాడు. కాసేపటికే నీళ్ల గ్లాసుతో బయటికొచ్చిన లక్ష్మీనారాయణ మోసపోయినట్లు గ్రహించి స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాడు. అతను ద్విచక్రవాహనంపై వచ్చినట్లు పుటేజీ లభ్యమైంది. అయితే.. వేసుకొచ్చిన ఫ్యాషన్ప్రో బండికి ముందు, వెనుక నంబర్ ప్లేట్లు లేవు. దీంతో తనలా మరొకరు మోసపోకూడదని ఆ దృశ్యాలను, మోసపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడు గుళ్లపల్లి లక్ష్మీనారాయణ కుమారుడు వెంకట్రామయ్య మాస్క్ మాటున జరిగిన మోసాన్ని పోస్టు చేసిన వెంటనే మరి కొందరు బయట పడ్డారు. తమకు కూడా ఇదే తరహాలో మోసం చేశాడని బాధితులు వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. నిందితుడు సత్తుపల్లి, కాకర్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. మాస్క్ పెట్టుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. -
సైకిల్పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు..
కాలిఫోర్నియా: అరవై నాలుగు కళలలో ‘చోరకళ’ కూడా ఒకటి. అయితే, చోరీకి పాల్పడే క్రమంలో కొంత మంది ఎక్కడ దొరికి పోతామో అని టెన్షన్ పడితే.. మరికొంతమంది మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చిన పనిని తేలికగా ముగించుకుని కూల్గా వెళ్లిపోతుంటారు. ఇప్పటికే దొంగతనానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి షాపులో ప్రవేశించి కూల్గా దొంగతనం ముగించుకుని స్టైల్గా జారుకున్నాడు. నల్లని జాకెట్, ముఖానికి నలుపు రంగుబట్ట చుట్టుకుని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్గ్రీన్స్లోని ఒక షాపులో సైకిల్ మీద ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఒక నల్లని కవర్ను తీశాడు. వెంటనే అక్కడ ఉన్న వస్తువులన్నీ తన కవర్లో వేసుకున్నాడు. ఆ షాపులో ఉన్న కస్టమర్లు అతడిని అనుమానంగా చూశారు. కానీ ఎవరు కూడా అతగాడి దగ్గరకు వెళ్లి ఆపే సాహసం చేయలేదు. ఇక్కడ విడ్డూరమేంటంటే ఆ షాపు సెక్యూరిటీ కూడా దూరం నుంచి ఈ తతంగాన్ని వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఆ దొంగ పని ముగించుకొని సైకిల్పై వెళ్లిపోయే క్రమంలో.. సెక్యూరిటీ అతడిని ఆపటానికి ప్రయత్నించాడు. కానీ, దొంగ ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని దర్జాగా వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ పుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఈ దొంగతనం జరిగే సమయంలో లియాన్నే మెలెండెజ్ అనే జర్నలిస్టు అక్కడే ఉంది. 'నేను ఆ చోరీని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. మా నగరంలో ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఈ షాపులోనే కాదూ... ఇళ్లలోని వస్తువులను, కార్లను కూడా దొంగతనం చేస్తారు' అని ఆమె చెప్పుకొచ్చింది.. అయితే, శాన్ఫ్రాన్సిస్కోలో కొన్ని వివాదస్పద చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం, తక్కువ ధర ఉన్న వస్తువులను చోరీ చేస్తే విధించే శిక్షలను, జరిమానాలను తగ్గించారు. దీంతో కొంత మంది చిల్లర దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీ చోరకళ భలే ఉంది బాసు..’, ‘ఏమైనా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ఇంత జరుగుతున్న కొంత మంది కస్టమర్లున్నారే.. వారిని..’, ‘పాపం.. ఒక్కటే కష్టపడుతున్నాడు.. కాస్త సహాయం చేయొచ్చుగా..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. This just happened at the @Walgreens on Gough & Fell Streets in San Francisco. #NoConsequences @chesaboudin pic.twitter.com/uSbnTQQk4J — Lyanne Melendez (@LyanneMelendez) June 14, 2021 చదవండి: నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో.. -
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
-
భర్తను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న భార్య!
లక్నో: తన భర్త తనను కాదని వేరే మహిళతో షాపింగ్కి వచ్చాడు. ఇది చూసిన ఆ వ్యక్తి భార్య ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే అతడిని తిడుతూ, పిడిగుద్దులతో దాడిచేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకొంది. అయితే వీరి గొడవ పెద్దదిగా మారడంతో షాప్యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వీరిని పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే ,పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వీరిద్దరికి ఇది వరకు వివాహంజరిగిందని తెలిపారు. దీనిలో బాధితురాలు అయేషా, తన భర్త అద్నాన్కు 2020లోనే వివాహం జరిగిందని చెప్పింది. వివాహం అయిన కొద్దిరోజులకే తనను పుట్టింట్లో వదిలేశాడని వాపోయింది. కాగా, విడాకులు ఇమ్మని బలవంతం చేశాడని చెప్పింది. అయితే, నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని తెలిపింది. మాకు విడాకులు మంజురు కాలేదు.. కాబట్టి తన భర్త వేరే మహిళతో తిరగటాన్ని తప్పుబట్టింది. అయితే దీనిపై ఆమె భర్త.. అయేషా అంటే నాకు ఇష్టంలేదు. ఇప్పటికే విడాకులు ఇచ్చాను. నేను వేరే మహిళతో షాపింగ్చేస్తే అనవసరంగా రాధ్దాతం చేస్తొందని అన్నాడు. కాగా, దీనిపై కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యంత కలుషిత నగరాల్లో 22 భారత్లోనే! -
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త
హైదరాబాద్: మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అందిస్తున్న వాట్సాప్ తాజాగా బిజినెస్ అకౌంట్లకు షాపింగ్ బటన్ను జోడించింది. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్తో చూసేందుకు కస్టమర్లకు వీలవుతుంది. కొంత కాలంగా ప్రయోగాత్మకంగా వాట్సాప్ ఈ ఫీచర్ను పరీక్షిస్తోంది. మంగళవారం నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల మంది యూజర్లు బిజినెస్ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నారని వాట్సాప్ వెల్లడించింది. ఇందులో ప్రతి నెల 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ను వీక్షిస్తున్నారట. వీరిలో భారత్ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇటీవల భారత్లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది వెల్లడించారని వాట్సాప్ తెలిపింది. ఇటువంటి కస్టమర్లు సులువుగా కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్ బటన్ను జోడించినట్టు వివరించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్ బిజినెస్ అకౌంట్లకు క్యాటలాగ్ను జోడిస్తేనే సాధారణ కస్టమర్లు ఈ బటన్ను వీక్షించే వీలుంటుంది. (వాట్సాప్ సందేశాలు వారంలో మాయం!) -
ప్రియురాలి కుటుంబంపై కోపంతో..
ముంబై : ప్రియురాలి కుటుంబంపై కోపంతో ఆమె తండ్రి షాపునకు నిప్పంటించాడో యువకుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మానిక్పుర్కు చెందిన రాహుల్ పాశ్వాన్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబం రాహుల్ను హెచ్చరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు సెప్టెంబర్ 10వ తేదీన ప్రియురాలి తండ్రికి చెందిన షాపునకు నిప్పంటించాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ( హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..) అయితే షాపునకు నిప్పంటుకోవటానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని భావించారంతా. సెప్టెంబర్ 21వ తేదీన యువతి తండ్రి తన షాపునకు దగ్గరలోని ఓ షాపునకు సంబంధించిన సీసీ టీవీ కెమెరా ఫొటేజీలను పరిశీలించగా అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. రాహుల్ షాపులోకి నిప్పును పడేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రాహుల్ కోసం గాలిస్తున్నారు. -
హైదరాబాద్లో మళ్లీ తెరుచుకున్న ప్రధాన మార్కెట్లు
-
లాక్డౌన్తో పాములకు నివాసంగా దుకాణాలు
సాక్షి, చిత్తూరు: లాక్డౌన్ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇవ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్ యజమాని షాక్కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్డౌన్ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ) -
ఐసీయూ తరహాలో..
సాక్షి, సిటీ నెట్వర్క్: కోవిడ్ సరికొత్త పాఠాలు నేర్పించింది. అన్ని రంగాలు, సేవల్లోనూ కరోనా నిబంధనలకుఅనుగుణమైన మార్పులు వచ్చేశాయి.కోవిడ్కు ముందు, ఆ తర్వాత సేవలనిర్వచనాలు మారాయి. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లోనూ కోవిడ్ కట్టడి చర్యలు తప్పనిసరిగా మారాయి.మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిచోట్లా దర్శనమిస్తున్నాయి.పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లను తలపించే డ్రెస్సులతో సెలూన్లు సేవలందజేస్తున్నాయి. ఒకసారి వినియోగించి పారేసే సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్ కిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరోవైపు జనం సైతం ఎక్కడికెళ్లినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛందంగానే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ షోరూమ్లు, మొబైల్ ఫోన్ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలు భారీగా సడలించి అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో నగరంలో సందడి పెరిగింది. రహదారులపై వాహనాల రాకపోకలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల అవసరాల కోసం బయటకి వచ్చే నగరవాసులు కోవిడ్ నిబంధనలను పాటించేందుకే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వ్యాపార సంస్థలు సైతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ షోరూమ్లలో థర్మల్ స్క్రీనింగ్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే అనుమతిస్తున్నారు. షోరూమ్ బయటే కాలుతో నొక్కి వినియోగించేందుకు అనువైన శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చినప్పుడు భౌతిక దూరానికి విఘాతం కలగకుండా చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు పలు దుకాణాల్లో సిబ్బంది సంఖ్యను సైతం బాగా తగ్గించి సేవలు అందజేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘమైన లాక్డౌన్ కారణంగా షాపులు మూసి ఉంచడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా పలు వస్తువులు, సేవల ధరలు సైతం పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉన్న ధరలపై 20 నుంచి 26 శాతం వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఐసీయూ తరహాలో.. 'మై సర్వీస్ వెరీ సేఫ్’. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు కొత్త తరహా నినాదాన్ని అందుకున్నాయి. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సెలూన్లు వినియోగదారులకు సురక్షితమైన సేవలనందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను తలపిస్తున్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లలో పనిచేసే హెయిర్స్టైలిస్ట్లు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లతో పాటు మాస్కులు, గ్లౌస్లు విధిగా ధరిస్తున్నారు. చాలా చోట్ల సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్లనే వినియోగిస్తున్నారు. కత్తెర, దువ్వెన వంటివి వినియోగదారులు సొంతంగా తెచ్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. వేడి డెట్టాల్ నీటిలో శుభ్రం చేస్తున్నారు. కస్టమర్ల రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు కస్టమర్లకు మించి వెయిటింగ్లో ఉండనీయడం లేదు. అన్నిచోట్ల ఫోన్ బుకింగ్లు తప్పనిసరయ్యాయి. కేటాయించిన స్లాట్ ప్రకారం సేవలందజేస్తున్నారు. వరుసగా 4 సీట్లు ఉంటే ఒకటి విడిచి మరో సీటులో సేవలు అందిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు. హ్యాండ్వాష్ చేసుకున్న తర్వాతే వినియోగదారులను అనుమతిస్తున్నారు. రెస్టారెంట్లలో టేక్ అవే సర్వీసులు.. రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే సర్వీసులను అందజేస్తున్నాయి.రెండు రోజులుగా అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో పార్శిళ్లు తీసికెళ్లే వారి సంఖ్య తగ్గింది. మాస్క్, భౌతికదూరం పాటించాలని, వచ్చిన వారు శానిటర్తో చేతులు శుభ్రపరుచుకోవాలని వినియోగదార్లకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓన్లీ టేక్ అవే (పార్శిల్)కి మాత్రమే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్శిల్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిలో లోపలి లాంజ్లో నాలుగు అడుగుల దూరంలో చైర్స్ను అమర్చారు. వచ్చిన వారికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చి పార్శిల్ వచ్చే వరకు అక్కడ సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్లో ఉంచిన థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ రహిత క్యాబ్ సేవలు.. క్యాబ్లు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు కోవిడ్ వైరస్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నాయి. బుకింగ్ బుకింగ్కూ మధ్య కారును శానిటైజ్ చేయడం తప్పనిసరి చేశారు. క్యాబ్ డ్రైవర్లకు మాస్క్లు, గ్లౌజ్లతో పాటు శానిటైజేషన్ను ఆయా సంస్థలే అందించేలా చర్యలు చేపట్టాయి. గ్రేటర్లో సుమారు 2 లక్షల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాబ్స్కు గ్రీన్ సిగ్నల్ పడ్డా ఈ రెండు రోజుల్లో 10 శాతం మాత్రమే రోడ్డెక్కాయి. పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలతో కూడిన పరికరాలను సమకూర్చుకుని రోడ్డెక్కాలనే వ్యూహంలో ఉన్నారు. ఉబెర్లో ఇద్దరికే అనుమతి.. క్యాబ్ డ్రైవర్తో పాటు ప్రయాణికులకు మాస్క్లు, శానిటైజేషన్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. ప్రతి బుకింగ్ తర్వాత కారు లోపల భాగాన్ని శానిటైజ్ చేయాలని నిర్ణయించాం. అది ఏ మేర సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నాం. క్యాబ్లో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి ఉండగా.. ఊబెర్ క్యాబ్ మాత్రం డ్రైవర్తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. – ప్రవీణ్, ఉబెర్ క్యాబ్ చందానగర్ బ్రాంచ్ లీడ్ ఆస్పత్రి తరహా సేవలు.. ఆస్పత్రి తరహాలో సెలూన్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో కస్టమర్ బయటికి వెళ్లి మరో కస్టమర్ను లోపలికి పిలిచే ముందే షాపును పూర్తిగా శుభ్రపరుస్తున్నాం. పరికరాలు, టవల్స్, సీట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. – శ్రీనివాస్, సెలూన్ నిర్వాహకుడు ఈ పద్ధతులు ఎప్పటికీ పాటించాలి హెయిర్ కటింగ్ దుకాణాల్లో అమలు చేస్తున్న శానిటరీ పద్ధతులు బాగున్నాయి. కరోనా మాత్రమే కాదు ఎటువంటి అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ పద్ధతులు ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఇటువంటివి అమలు చేయడం అందరికీ మంచిది. – వెంకటేశ్, వినియోగదారుడు శానిటైజేషన్ తప్పనిసరి.. కోవిడ్– 19 నేపథ్యంలో అటు క్యాబ్ డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు సురక్షితమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. క్యాబ్లపై విశ్వాసం కలిగేలా కారు లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలనే ఆలోచనలోనే యాజమాన్యం కూడా భావిస్తోంది. ఆ దిశగా క్యాబ్ డ్రైవర్లను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది.– గోపీ, ఓలా క్యాబ్ ప్రతినిధి -
14 దుకాణాలు, సంస్థలకు సీల్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించిన జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం సోమవారం నుంచి బుధవారం వరకు 14 దుకాణాలు, సంస్థలకు సీల్ వేసిననట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించి తెరిచిన సంస్థలు, దుకాణాలకు సీల్ వేసినట్లు తెలిపారు. ఐకాన్ ఎయిర్కండిషన్ సర్వీసెస్(ఎస్పీ రోడ్), సిరి వాచ్ అండ్ మొబైల్ స్టోర్(అల్కాపురి), పద్మావతి బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్(అల్కాపురి), ది మార్బుల్ క్రాఫ్ట్(స్నేహపురి కాలనీ), న్యూ జయా స్టీల్ప్యాలెస్(అల్కాపురి), రవీందర్ స్టీల్ప్యాలెస్(దిల్సుఖ్నగర్), అలీ స్టడీ సెంటర్(సైదాబాద్), శ్రీయ ఫ్లెక్సీ ప్రింటర్(అమీర్పేట్), మొబైల్ ప్లానెట్(బంజారాహిల్స్), ఫ్యాషన్ ప్లానెట్(బంజారాహిల్స్), ప్రెస్టీజ్ ఎక్స్క్లూజివ్ స్టోర్(అల్కాపురి), పియోని కిడ్స్స్టోర్(బంజారాహిల్స్), జియో డిజిటల్స్(బంజారాహిల్స్), సువాస, రెడీమేడ్ వస్త్ర దుకాణం(బంజారాహిల్స్). -
ఆన్లైన్ షాపింగ్కే సై..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోన వ్యాప్తి, లాక్డౌన్ తదనంతరం కస్టమర్ల షాపింగ్ తీరు మారుతుందని ఐటీ కంపెనీ క్యాప్జెమిని నివేదిక చెబుతోంది. ఆన్లైన్కే మొగ్గు చూపనున్నట్టు సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో చేసిన ఈ సర్వే ప్రకారం.. రానున్న 9 నెలల్లో ఆన్లైన్లో షాపింగ్ చేయాలన్న వారి సంఖ్య 46 నుంచి 64 శాతానికి చేరనుంది. కరోనాకు ముందు దుకాణాల్లో కొనుగోలు చేసిన వారి సంఖ్య 59 శాతం ఉంటే.. లాక్డౌన్ తర్వాత ఈ సంఖ్య 46 శాతం ఉండనుంది. డెలివరీ హామీ ఇచ్చే రిటైలర్ల వద్ద నుంచి కొనుగోళ్లకు 72% మంది మొగ్గు చూపారు. స్వచ్ఛత, ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టు 89 శాతం మంది తెలిపారు. డిజిటల్ పేమెంట్స్కు 78% మంది ఆసక్తి కనబరిచారు -
ఇళ్లొద్దు.. షాపులే ముద్దు
చెన్నై, తిరువళ్లూరు: జనం సంచారం తక్కువగా వున్న సమయంలో షాపు తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించిన యువకుడికి దేహశుద్ధి చేసిన ప్రజలు పోలీసులకు అప్పగించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలోని పలు షాపుల్లో ఇటీవలే చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వ్యాపారుల్లో అభద్రతా భావం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు శ్రీపెరంబదూరు–తిరువళ్లూరు రోడ్డులోని పూజాసామగ్రి విక్రయించే షాపునకు వెళ్లిన ఇద్దరు యువకులు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చోరీకి యత్నించారు. ఈ సమయంలో అటువైపు వెళ్లిన కొందరు షాపులను తెరిచి వుండడంతో పాటు లోపల యువకులు వున్నట్టు గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న వారు పెద్ద ఎత్తున గుమికూడి లోపల వున్న యువకుడిని పట్టుకుని చితకబాదారు. మరో యువకుడు పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి పట్టుకున్న యువకుడిని అప్పగించారు. యువకుడి వద్ద పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు పులియంతోపు ప్రాంతానికి చెందిన మదన్కుమార్గా గుర్తించారు. పరారైన యువకుడు మనవాలనగర్ ఎస్టీ కాలనీకి చెందిన మురుగేషన్గా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అరెస్టయిన మదన్కుమార్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడిన మదన్కుమార్ పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో, సార్ నేను ఇళ్లలో ఎప్పుడూ చోరీలకు పాల్పడలేదు. ఇళ్లలో చోరీలు చేస్తే వారిలో కొంత మంది నిరుపేదలు కూడా వుండొచ్చు, వారి శాపం నాకు వద్దు. వాళ్లు ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును చోరీ చేయాలంటే మనస్సు ఒప్పుకోదు. బహుశా ఇప్పటి వరకు 70 చోరీలు చేసి వుంటా. అందులో ఒక్క ఇళ్లు కూడా లేదు. అన్నీ షాపుల దొంగతనాలే. షాపులు నిర్వహించే వారు ధనికులే వుంటారు. అందుకే చోరీలు చేయడానికి షాపులనే ఎంచుకున్నట్టు చెప్పడంతో పోలీసులే షాక్కు గురైయ్యారు. -
మెడికల్ షాప్ వైద్యం, చిన్నారి మృతి
సాక్షి, న్యూఢిల్లీ: సొంతవైద్యం, మెడికల్ షాపులో ఏవో తెలిసిన మందులు కొనుక్కొని వాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించిన ఘటన ఇది. మందుల దుకాణంలో ఇచ్చిన తప్పుడు మందుతో రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయిన వైనం ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం షాహదారాలోని జీటీబీ ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసించే బాలిక (2) జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి దగ్గరలోని ఉన్న షాపుకెళ్లి ఏవో మందులు తెచ్చి వాడింది. అయినా ఉపశమనం లభించకపోవడంతో మరోసారి అదే షాపునకు వెళ్లింది. వైద్యుడిని సంప్రదించమని చెప్పడానికి బదులు ఆ షాపు యజమాని పాపకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతే ఇంటికి వచ్చీ రావడంతోనే రక్తపు వాంతులు మొదలయ్యాయి. కంగారు పడినబంధువులు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు.అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. -
మందుల దుకాణాల్లో మాయాజాలం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లోని మందుల దుకాణాల యజమానులు మాయాజాలం చేస్తున్నారు. ఒకే లైసెన్సుపై రెండు మూడు షాపులునిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధికధరలకు మందులు విక్రయిస్తున్నారు.మరోవైపు అనర్హులను ఫార్మాసిస్టులుగా నియమిస్తుండడంతో... వారు వైద్యుడొకటి రాస్తే బాధితులకు మరొకటి అంటగడుతున్నారు. ఎంఫార్మసీ, బీఫార్మసీ అర్హతలు లేని వారికి స్వల్పకాలిక శిక్షణనిచ్చి మందులవిక్రయాలు చేపడుతున్నారు. అనుమతి లేకుండా ఒకే ఆస్పత్రి భవనంలో రెండు మూడు ఫార్మసీ కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో చాలా వరకు బ్రాండెడ్ కంపెనీ మందులకు బదులు జనరిక్ మెడిసిన్అమ్ముతున్నారు. ఇలా మారుమూల ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లోనే కాదు... నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, మందుల నాణ్యతను పరిశీలించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడుతూ పరోక్షంగా వారికే సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత ఇవ్వని వారిని వేధింపులకు గురిచేస్తుండడంతో భరించలేక కొంతమంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.తాజాగా బోయిన్పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్బ్యాంక్ నిర్వాహకురాలు ఏసీబీని ఆశ్రయించడానికి ఇదే కారణమని తెలిసింది. తనిఖీలు... మామూళ్లు గ్రేటర్లో 8,500లకు పైగా మందుల దుకాణాలు ఉండగా... 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు (డీఐ) ఉన్నారు. తనిఖీలు, శాంపిల్స్ సేకరణ, పరీక్షలు, కొత్త దుకాణాలకు లైసెన్సుల జారీ, పాత వాటికి రెన్యూవల్ తదితర పనుల కోసం ఒక్కో డీఐకి 400–500 దుకాణాలు కేటాయించారు. వీరు ఎప్పటికప్పుడు ఆయా దుకాణాలను తనిఖీ చేసి, మందుల నాణ్యతను పరిశీలించాల్సి ఉంది. అయితే తనిఖీల పేరుతో అనేక విధాలుగా వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం డీఐలకు పరిపాటిగా మారింది. గతంతో పోలిస్తే శివారు ప్రాంతాలు విస్తరించాయి. బోడుప్పల్, బీఎన్రెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, కర్మన్ఘాట్, నందనవనం, మీర్పేట్, చర్లపల్లి, నారపల్లి, జీడిమెట్ల, సూరారం, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ తదితర బస్తీల్లో ఇప్పటికీ ఆర్ఎంపీలు చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సేవలతో పోలిస్తే మందుల విక్రయాల్లోనే భారీగా లాభాలు వస్తుండటంతో.. ఎలాంటి అనుమతులు పొందకుండానే వారు ఆయా క్లినిక్స్లోనే మందులు విక్రయిస్తున్నారు. ప్రమాదకరమైన యాంటీబయోటిక్స్తో పాటు గర్భవిచ్ఛిత్తి మందులనూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల బేగంపేట సమీపంలోని ఓ యువతి గర్భ విచ్ఛిత్తి మందులు వాడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. స్వదేశీయే విదేశీ... గ్రేటర్ పరిధిలో 20 కార్పొరేట్ ఆస్పత్రులు, 85 పాలీక్లినిక్స్, 228 డయాగ్నోస్టిక్స్, 234 దంత ఆస్పత్రులు, 372 ఇరవై పడకల ఆస్పత్రులు ఉన్నాయి. 21–50 పడకల ఆస్పత్రులు 88 ఉండగా.. 101–200 పడకల ఆస్పత్రులు 94, 200కు పైగా పడకల ఆస్పత్రులు 13 ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లోకి ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రత, సీజీహెచ్ఎస్, ఇతర హెల్త్ ఇన్సూరెన్స్లున్న రోగులు వస్తే చాలు అందినకాడికి దోచుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఆయా పేషెంట్లకు తక్కువ ఖరీదుతో కూడిన జనరిక్ మందులిచ్చి ఎక్కువ ధరున్న బ్రాండెడ్ మందులు ఇచ్చినట్లు బిల్లులు సమర్పిస్తున్నాయి. ఇక సర్జికల్ వస్తువులు, హృద్రోగులకు అమర్చే స్టంట్లు, కృత్రిమ మోకాళ్లు, విరిగిన ఎముకలను జాయింట్ చేసే స్టీల్ రాడ్స్ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఇంపోర్టెడ్ డ్రగ్ కోటెడ్ స్టంట్ల పేరుతో స్వదేశీ కంపెనీలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన నాసిరకం స్టంట్లను అమర్చుతున్నాయి. గుండె రక్తనాళాలల లోపల వీటిని అమర్చుతుండడంతో రోగులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏ రోగికి ఏ కంపెనీ పరికరం అమర్చారు? దాని ఖరీదు ఎంత? రోగి ఎంత చెల్లించారు? తదితర వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయకుండా యథేచ్ఛగా ఐటీ ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఆస్పత్రుల అక్రమాలకు ఆయా ప్రాంతాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డీసీఏలో వసూల్ రాజాలు ఫార్మాష్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా, ఆ కంపెనీ తయారు చేసిన మందులను మార్కెట్లోకి విడుదల చేయాలన్నా, చివరకు స్వచ్ఛందంగా ఓ రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ఓ మెడికల్ షాపు పెట్టుకోవాలన్నా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) లైసెన్సు తప్పనిసరి. ఇదే అదనుగా డీసీఏలోని అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్లడ్బ్యాంక్ ఏర్పాటు చేయాలంటే రూ.2 లక్షలకు పైగా ముట్టజెప్పాల్సి వస్తోంది. మెడికల్ షాపునకు (హోల్సేల్, రిటైల్) రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ను ఇన్వార్డులో సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి టేబుల్కు చేరుకోవాలంటే వారికి ముందే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. తనిఖీకి వచ్చే ఇన్స్పెక్టర్కు అడిగినంత అందించాల్సిందే. లేదంటే వివిధ రకాల లోపాల పేరుతో సవాలక్ష కొర్రీలు పెట్టి లైసెన్స్ జారీ కాకుండా అడ్డుకుంటారు. పాతవాటిని పునరుద్ధరించరు. నేరుగా దరఖాస్తు చేయడం కంటే కన్సల్టెంట్ను సంప్రదించడం మంచిదనే అభిప్రాయమూ ఉంది. ఇందుకు డీసీఏ అధికారులే ఓ రక్తనిధి కేంద్రం నిర్వాహకుడితో ప్రత్యేకంగా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 8,500 గ్రేటర్లోని మందుల దుకాణాలు డీఐ టార్గెట్స్:దిల్సుఖ్నగర్, మలక్పేటకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ (డీఐ) మందుల దుకాణాలు, రక్తనిధి కేంద్రాలకుప్రత్యేకంగా టార్గెట్లు విధించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన పేరు చెబితేనే ఆయా ప్రాంతాల్లోనినిర్వాహకులంతా హడలిపోతున్నారు.