-
‘పుష్ప’ మళ్లీ షురూ
మళ్లీ యాక్షన్ షురూ చేశాడు పుష్పరాజ్. తనకు ఎదురొచ్చిన శత్రువుల బెండు తీస్తున్నాడు. అది ఏ రేంజ్లో అనేది ఆగస్టు 15న థియేటర్స్లో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’కి మలి భాగంగా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించారు. కాగా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. పదిహేను రోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగుతుందట. అల్లు అర్జున్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
పాపం లక్ష్య.. పతకం సాధించినా దక్కని ఒలింపిక్స్ బెర్త్
ఆసియా ఒలింపిక్ షాట్గన్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ లక్ష్య షెరోన్ కాంస్య పతకం సాధించాడు. కువైట్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో లక్ష్య మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో లక్ష్య పతకం సాధించినప్పటికీ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సంపాదించలేకపోయాడు. ఒలింపిక్స్ బెర్త్ను లక్ష్య తృటిలో కోల్పోయాడు. ఆరుగురు షూటర్లు ఎలిమినేషన్ పద్ధతిలో పోటీపడ్డ ఫైనల్లో 25 ఏళ్ల లక్ష్య 33 పాయింట్లు స్కోరు చేశాడు. ఇరాన్కు చెందిన 15 ఏళ్ల కుర్రాడు మొహమ్మద్ బెరాన్వంద్ స్వర్ణం, 32 ఏళ్ల చైనా షూటర్ గువో యుహావో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. -
Asia Olympic Qualifiers: భారత షూటర్ల పసిడి వేట
జకార్తాలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్లు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత షూటర్ల ఖాతాలోకి రెండు స్వర్ణ పతకాలు చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ యోగేశ్ సింగ్ (572 పాయింట్లు) పసిడి పతకం నెగ్గాడు. యోగేశ్, అమిత్, ఓం ప్రకాశ్లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1690 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. -
భారత్కు మరో ఒలింపిక్ బెర్త్ ఖరారు.. షూటర్ నంబర్ 17
జకార్తా: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ ఈ కోటాను ఖాయం చేశాడు. దీంతో భారత్ నుంచి పాల్గొనే షూటర్ల సంఖ్య 17కు పెరిగింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో విజయ్వీర్ శనివారం రజత పతకం గెలుచుకున్నాడు. అయితే పతకం గెలుచుకోవడానికి ముందే అతనికి ఒలింపిక్ బెర్త్ ఖాయమైంది. క్వాలిఫయింగ్ దశలో 577 పాయింట్లు సాధించిన విజయ్వీర్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫైనల్కు చేరిన ఆరుగురిలో నలుగురికి ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉండగా అతనికి ఈ చాన్స్ లభించింది. చండీగఢ్కు చెందిన 21 ఏళ్ల వీర్ గత ఏడాది హాంగ్జూ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. మరో వైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ వ్యక్తిగత విభాగంలో భారత్కు 2 పతకాలు లభించాయి. ఈ ఈవెంట్లో సిఫ్ట్కౌర్ రజతం గెలుచుకోగా, ఆషి చౌక్సీకి కాంస్యం దక్కింది. -
అఖిల్ పసిడి గురి
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం భారత షూటర్లు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో అఖిల్ షెరోన్ పసిడి పతకం నెగ్గగా... ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ కుసాలేలతో కూడిన భారత జట్టు టీమ్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో అఖిల్ 460.2 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఐశ్వర్య ప్రతాప్ 459 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందగా... తోంగ్ఫాఫుమ్ (థాయ్లాండ్; 448.8 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలిచాడు. అఖిల్, ఐశ్వర్య ప్రతాప్, స్వప్నిల్ బృందం టీమ్ విభాగంలో 1758 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచింది. ప్రస్తుతం భారత్ 11 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
ఒలింపిక్ బెర్త్ నంబర్ 16
జకార్తా: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి షూటింగ్ క్రీడాంశంలో అత్యధిక మంది పోటీపడనున్నారు. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్కు భారత్ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు అర్హత పొందగా... ఈసారి ఆ సంఖ్య 16కు చేరుకుంది. ఇంకా షూటింగ్లో మరో మూడు క్వాలిఫయింగ్ టోర్నీలు మిగిలి ఉండటం, మరో ఎనిమిది బెర్త్లు ఖాళీగా ఉండటంతో భారత్ నుంచి మరింత మంది షూటర్లు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో గురువారం భారత్కు 16వ బెర్త్ ఖరారైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో రిథమ్ సాంగ్వాన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో హరియాణాకు చెందిన 20 ఏళ్ల రిథమ్ 28 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి భారత్కు ఒలింపిక్ బెర్త్ను అందించింది. రిథమ్, తెలంగాణ షూటర్ ఇషా సింగ్, సిమ్రన్ప్రీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 1743 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. -
మెహులీ–రుద్రాంక్ష్ జోడీకి స్వర్ణం
జకార్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో మంగళవారం భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో మెహులీ ఘోష్–రుద్రాంక్ష్ పాటిల్ జోడీ బంగారు పతకం... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో రిథమ్ సాంగ్వాన్–అర్జున్ జంట రజత పతకం గెలిచింది. ఫైనల్స్లో మెహులీ–రుద్రాంక్ష్ 16–10తో షెన్ యుఫాన్–జు మింగ్షుయ్ (చైనా)లపై నెగ్గగా... రిథమ్–అర్జున్ 11–17తో ట్రిన్–క్వాంగ్ (వియత్నాం)ల చేతిలో ఓడింది. -
సీనియర్ నటుడి కుమారుడు హీరోగా కొత్త చిత్రం!
ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా.. దేవరాజ్ కెమరా స్విఛ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. 'సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజు ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం' అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. 'ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి' అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
యాక్షన్ ఎంటర్టైనర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బీఎస్ఎస్ 10’(వర్కింగ్ టైటిల్). ‘భీమ్లా నాయక్’ మూవీ తర్వాత సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్ పూర్తయింది. ‘‘యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘బీఎస్ఎస్ 10’. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ని గతంలో ఎన్నడూ చూడని పవర్ ఫుల్ పాత్రలో సరికొత్తగా చూపించనున్నారు సాగర్ కె.చంద్ర. ఈ సినిమాలోని కీలకమైన షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేశాం. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 3న శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: హరీష్ కట్టా, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ముఖేష్ జ్ఞానేష్. -
నాన్న ఎక్కుపెట్టిన గన్!
(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే.. నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను. జూనియర్ వరల్డ్కప్లో గోల్డ్ మెడల్.. ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్కప్లో గోల్డ్మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్షిప్, ఏసియన్ చాంపియన్íÙప్లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే. ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం. ‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం. -
90 రోజుల తర్వాత స్వదేశానికి 'కన్నప్ప'.. 600 మందితో సాహసం
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్బాబు, బ్రహ్మానందం, మోహన్లాల్, శివరాజ్కుమార్, శరత్కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ 3 నెలల క్రితం న్యూజిల్యాండ్లో మొదలైంది. ‘‘న్యూజిల్యాండ్లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో 90 రోజుల మొదటి షెడ్యూల్ చేశాం. అక్కడి అద్భుతమైన లొకేషన్స్లో దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసి, భారతదేశానికి తిరిగి వస్తున్నాం. ఈ సినిమాకు థాయ్ల్యాండ్, న్యూజిల్యాండ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు మోహన్బాబు. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
సెట్స్లో నా సామిరంగ
నా సామిరంగ... డ్యాన్స్ అంటూ సెట్స్లో రెచ్చిపోతున్నారు నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఓ సెట్లో నాగార్జున, ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్లతో పాటు 300మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా, టైటిల్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. -
మరో సినిమాతో వస్తోన్న గుడ్ నైట్ హీరో!
జై భీమ్ చిత్రంతో ఫేమస్ అయిన హీరో మణికంఠన్. ఇటీవలే గుడ్ నైట్ సినిమాతో హిట్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆయన కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. నటి శాన్వి మేఘన నాయకిగా నటిస్తున్న ఇందులో గురు సోమసుందరరాజన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం కోయంబత్తూర్లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్ కలిసామి మాట్లాడుతూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొనే సవాళ్లను.. ఎదుర్కోవడానికి చేసే సాహసాలను చూపే కథంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. కోయంబత్తూర్లో ఫ్లెక్స్ అనే ముద్రణ కార్యాలయంలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిరు ఉద్యోగి ఇతి వృత్తంతో సాగే కథ కావడంతో ఈ చిత్రంలో చక్కని వినోదంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇది కుటుంబ సమేతంగా ఆదరించే కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను ప్రసన్న బాలచంద్రన్, రాజేశ్వర్ కాలిసామిలు, కథనం, సంభాషణలను ప్రసన్న బాలచంద్రన్ అందించారు. ఈ సినిమాకు సుజిత్ సుబ్రహ్మణ్యం ఛాయా గ్రహణం, వైసాగ్ సంగీతమందిస్తున్నారు. -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రాంలోని సాల్వటియెర్రా నగరంలో జరిగింది. నగరంలో కిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో హాజరైన వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తులను వేడుకకు ఆహ్వానించలేదని, అయినప్పటికీ పార్టీకి వచ్చిన వారిని ప్రశ్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాజధాని అట్లాంటాలో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పీచ్ట్రీ రోడ్డు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్లో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మృతుల వయసు 20 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పులకు మాదకద్రవ్యాల వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. డ్రగ్స్ లావాదేవీల కోసం బాధితులు వారిని ఆహ్వానించిన వ్యవహారంలో ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని తెలిపారు. బాధితులకు సంబంధించిన సమాచారం ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. నిందితుల సమాచారం కూడా ఇంకా దొరకలేదని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు -
పుష్ప-2తో పోటీ పడనున్న మూవీ.. షూటింగ్లో స్టార్ హీరోకు గాయాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ నటిస్తోన్న తాజా చిత్రం సింగం-3. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా అజయ్ దేవగణ్ గాయపడినట్లు తెలుస్తోంది. పొరపాటున అజయ్ కంటికి గాయమైనట్లు సమాచారం. అయినప్పటికీ అజయ్ దేవగణ్ వెంటనే షూటింగ్ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఇటీవలే సింగం-3 చిత్రంలో అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో కరీనా, దీపికా పదుకొణె, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజు టాలీవుడ్ హీరో మూవీ పుష్ప-2 కూడా రిలీజ్ కానుంది. దీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. కాగా.. గతంలో రిలీజైన సింగం, సింగం రిటర్న్స్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. మరోవైవు అజయ్ దేవగన్ బోనీ కపూర్ నిర్మిస్తోన్న మైదాన్లో కనిపించనున్నారు. -
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్పూర్లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
ఆస్పత్రి లాబీలో కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూహాంప్షైర్: అమెరికాలోని న్యూహాంప్షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి. -
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
జీబ్రాకి బైబై
సత్యదేవ్, డాలీ ధనుంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’. ‘లక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనేది ట్యాగ్లైన్. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి, యూనిట్ సభ్యులు బై బై చెప్పుకున్నారు. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, సహ–నిర్మాత: శ్రీ లక్ష్మి. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ హాంప్షైర్లోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పలువురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. నగరంలో మానసిక రోగులకు చికిత్సనందించే ఆస్పత్రి అది. శుక్రవారం ఆస్పత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఆస్పత్రి లాబీలో మొదట కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆస్పత్రికి సమీపంలోనే ఉన్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓ అనుమానిత వ్యక్తిని హతమార్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది బాధితులున్నారో స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆస్పత్రి పోలీసుల పర్యవేక్షలో ఉంది. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇదీ చదవండి: Israel-Hamas war: అల్–షిఫాలో మృత్యుఘోష -
Niharika Konidela New Movie Launch: నిహారిక మూవీ ప్రారంభం...సందడి చేసిన వరుణ్- లావణ్య (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలిసారి జంటగా సందడి చేసిన వరుణ్- లావణ్య!
ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తొలిసారి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. హైదరాబాద్లో జరిగిన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా.. హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. నిహారిక మాట్లాడుతూ.. 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.' అని అన్నారు. అయితే వరుణ్- లావణ్య తమ పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈనెల 1న ఇటలీలోని టుస్కానీలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఇండియాకు తిరగొచ్చాక హైదరాబాద్లోనూ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.